Aug 3, 2023

దేశ వారసత్వ సంపద చేనేత

ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీలో మంచి గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది చేనేత. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. అనేక రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడు ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు  అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన పద్మావతి దేవికి సమర్పించాడు. 250 గ్రాముల బరువైన ఈ చీరను  25 రోజుల్లో తయారు చేశాడు. దీని  తయారీలో కొంతమేర బంగారం, వెండి తీగలను ఉపయోగించాడు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు.   

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయ తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటా ఎక్కువ. సహకార రంగంలో కూడా చేనేత ఉత్పత్తులు అనేకం తయారవుతున్నాయి.ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.  చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది ఉన్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా  అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం.  చేనేత రంగం అనేక వడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది.  ముఖ్యమైన ప్రపంచ దేశాలలో మన చేనేత వస్త్రప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...