Jul 13, 2023

చేనేత కార్మికుల సంఖ్య తెలియని ప్రభుత్వాలు

ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే నేతన్నలు

తూతూ మంత్రంగా పథకాలు
చాలీ చాలని నిధుల కేటాయింపుతో మమ అనిపించేస్తారు


దేశంలో చేనేత రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగి, అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత అనేది ఎంతో కళాత్మకమైనది, మనదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ప్రభుత్వాలు మాత్రం ఈ రంగం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ, దేశంలో, రాష్ట్రంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయో, ఎంతమంది చేనేత కళాకారులు లేక కార్మికులు ఉన్నారో లెక్కలు తేల్చలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలకు చేనేత వర్గాలు గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తాయి. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హామీలపై హామీలు ఇస్తారు.   అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించవు. తూతూ మంత్రంగా ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటాయి.


ఆంధ్రప్రదేశ్ లో చేనేత మగ్గం నేసే కార్మికులు దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నారు. దేశంలో అత్యధిక మంది చేనేత రంగంపై జీవిస్తున్నవారు ఏపీలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘ సభ్యులు 2,00,310 మంది ఉన్నారు. సహకార సంఘాలలోలేని కార్మికులు 1,58,902 మంది ఉన్నారు. అంటే మొత్తం దాదాపు 3.60 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఓ లక్ష మంది చిలపలు ఎలిచేవాళ్లు, కండెలు చుట్టేవాళ్లు, అచ్చులు అతికేవాళ్లు ఉన్నా,  2.60 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటారు.  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద  81,700 మంది మాత్రమే  లబ్ధి పొందుతున్నారు. అంటే ఇంకా 1,78,300 కార్మికులకు ఈ పథకం అందడంలేదు.  ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం పట్టేంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో నేత నేసే నిజమైన చేనేత కార్మికులకు మాత్రం ఈ పథకం వర్తించడంలేదు.వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టిలో వారు చేనేత కార్మికులు కారు. చేనేత కార్మికులను శాస్త్రీయంగా గుర్తించే విధానాన్ని ఏ ప్రభుత్వం(అది ఏ పార్టీ అయినా) అనుసరించలేదు. ఆ ఆలోచన కూడా ఏ ప్రభుత్వం చేయలేదు.  ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు చేనేత కార్మికులు, చేనేత కులాలు గుర్తుకు వస్తాయి.గెలిచిన తర్వాత పేరుకి మాత్రమే ఏదో ఒక పథకం ప్రవేశపెట్టి మమ అనిపిస్తారు.ఇన్ని కోట్లు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం అని లెక్కలు చెప్పేస్తారు. నిజంగా నేత నేసే కార్మికులకు ఆ పథకం అందినా అందకపోయినా పట్టించుకోరు. రాజకీయ పార్టీలకు గాని, ప్రభుత్వాలకు గాని చిత్తశుద్ధి ఉంటే ఒక్క నెల రోజుల స్పెషల్ డ్రైవ్ ద్వారా చేనేత కార్మికులను శాస్త్రీయంగా లెక్కించవచ్చు. చేనేత, సహకార వంటి సంబంధిత శాఖల అధికారులు మండలాల వారీగా ప్రతి చేనేత కార్మికుని ఇంటికి, ప్రతి సొసైటీకి, ప్రతి చేనేత షెడ్డు వద్దకు వెళ్లి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ మగ్గాలను నేసే స్త్రీ, పురుష కార్మికులను గుర్తించాలి. అలాగే, పడుగుల సాగుల వద్దకు, ఆసుల వద్దకు వెళ్లి అక్కడ పని చేసే కార్మికులను గుర్తించాలి. చేనేత కార్మికులుగా వారికి అధికారికంగా ప్రభుత్వం  గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కల్పించాలి. ఈ విధంగా లెక్క తేల్చి, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చిన నాడే వారికి న్యాయం చేసినవారవుతారు. ఏ ప్రభుత్వం అయినా ఈ పద్దతిని పక్కాగా అనుసరించవలసిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కార్వే సంస్థ ద్వారా సర్వే చేయించి కొంతమందికి కార్డులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాండ్ లూమ్ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చింది. కానీ, ఇప్పుడు వారికి పథకాలు వర్తించడంలేదు. అంటే, ప్రభుత్వం కార్డులు ఇచ్చినా ప్రయోజనంలేకుండాపోయింది. ఇక పథకాల విషయానికి వస్తే ప్రభుత్వం మారినప్పడల్లా వారి పేర్లతో పథకాలు ప్రవేశపెడతారు. పాత పథకాలు రద్దు చేస్తారు. వారికి ఏ పథకాలు ఉపయోగపడతాయో ఆలోచన చేయరు. పాఠశాలల పిల్లలకు చేనేత వస్త్రాలతో తయారు చేసిన యూనిఫాం ఇవ్వవలసిన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలేదు.

కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్,హోం ఫర్ వర్క్ షెడ్, మార్కెటింగ్ ఇన్సెంటివ్, చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన మహాత్మాగాంధీ బంకర్ బీమా  వంటి  పథకాలను రద్దు చేసింది. దేశంలో  నూలు ఉత్పత్తి చేసే స్పిన్నింగ్ మిల్లులు 40 శాతం చిలపనూలును  గతంలో చేనేత అవసరాల కోసం సరఫరాచేసేవారు. ఇప్పుడు దాన్ని 15 శాతానికి తగ్గించారు. దీంతో నూలు ధరలు పెరిగాయి. ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో చేనేత వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది. లక్షాలాది మంది జీవిస్తున్న చేతి వృత్తి ద్వారా తయారయ్యే చేనేత వస్త్రాలపై   కేంద్రం 5 శాతం  జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, రద్దు చేసిన చేనేతకు సంబంధించిన పథకాలను పునరుద్దరించాలని, చేనేత వృత్తి చేస్తూ 80 సంవత్సరాలుపైబడి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు కేంద్రం మత్స్యకారులకు ఇచ్చే విధంగానే ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.చేనేతను జౌళి రంగం నుంచి విడగొట్టాలని, చేనేతకు బడ్జెట్ లో ఏటా కేంద్రం రూ.5వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించాలని, స్పిన్నింగ్ మిల్లులు చేనేతకు ఉపయోగించే నూలుని 50 శాతం ఉత్పత్తి చేయాలని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని వారు కోరుతున్నారు.  చేనేత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారం కోసం సెప్టెంబర్ నెలలో చీరాలలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...