Oct 20, 2013
Feb 13, 2013
ప్రజా రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర సమాచారం, పౌర సంబంధాల శాఖ(ఐ అండ్ పీఆర్) పీఆర్ఓ(ఓఎస్) శిరందాసు నాగార్జున రావు రాసిన ‘ప్రజారాజధాని’ అమరావతి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం ఒకటవ బ్లాక్లో బుధవారం ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుండి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత సాధికార సంస్థ (సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల ఏర్పాటు, ల్యాండ్పూలింగ్ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటివరకు జరిగిన జరుగుతున్న ప్రభుత్వ, ప్రవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నింటిని ఫోటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్ కాంప్లెక్స్ భవనం, విట్ భవనాల వరకు అన్ని ఫొటోలను ఇందులో పొందుపరిచారు. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పీఎస్ శ్రీనివాసరావు, పీఆర్వో పారుపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Feb 5, 2013
హిందూ దేవుళ్లంటే ఎందుకు అంత అలుసు?
ప్రపంచ
వ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు హిందూ దేవతల బొమ్మలను వాడుకోవడం అలవాటైపోయింది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా దేవతల బొమ్మలు వినియోగిస్తున్నారు.
బికినీలపైన, లోదుస్తులపైన, చివరకు చెప్పులపైన కూడా హిందూ
దేవతల బొమ్మలను ముద్రిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక మతంవారి మనోభావాలను
దెబ్బతీయకూడదన్న కనీస ధర్మాన్ని వారు ఎందుకు పాటించరు? వాటిని రూపొందించేవారికి ఈ విషయం
తెలియదా? దీనికి సంబంధించి వారికి ఎవరూ
సలహాలు ఇవ్వరా? సలహాలు ఇచ్చినా వారు పాటించరా? ప్రపంచంలో ప్రధానమై క్రైస్తవ, ముస్లిం మతాలకు సంబంధించిన
గుర్తులను, బొమ్మలను ఎందుకు వాడరు? కేవలం హిందూ దేవతల బొమ్మలనే
ఎందుకు ఇలా కించపరుస్తున్నారు? కనీస
మర్యాద పాటించడం వారికి తెలియదనుకోవాలా? అంతర్జాతీయంగా ఏదైన కుట్ర దాగి ఉందా? తగిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం
కాకపోవడం వల్లే ఇలా జరుగుతుందనుకోవాలా? ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన అంశమే కాదు.
ఒక జాతికి, సంస్కృతికి ముఖ్యంగా మన దేశానికి
సంబంధించిన అంశం ఇది.
విదేశాలతోపాటు
మన దేశంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వివాదాలకు దారి
తీస్తున్నాయి. హిందూ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఆందోళనులు
చేస్తున్నాయి. అయిన్పటికీ దేవతల బొమ్మలను మళ్లీమళ్లీ కించపరిచే విధంగా
వినియోగిస్తూనే ఉన్నారు. ఇతర మతస్తులే కాకుండా, హిందువులు కూడా దేవతల బొమ్మలను అవమానకరమైన
రీతిలో ఉపయోగిస్తున్నారు. అపచారానికి పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని రోస్ మౌంట్లో
జరిగిన ఫ్యాషన్ వీక్లో లిసా బ్లూ అనే ఫ్యాషన్ డిజైనర్ హిందువుల ఆరాధ్య దేవత
లక్ష్మీదేవి బొమ్మతో బికినీని రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల
మనోభావాలను కించపరిచారని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విశాఖపట్నంలో
కింగ్‑ఫిషర్ ఫ్యాషన్‑షోలో కూడా ఇది పునరావృతమైంది. ఈ షో రెండు రకాలుగా వివాదాలకు
దారి తీసింది. స్త్రీని వ్యాపార వస్తువుగా చూపడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు
ఆందోళనకు దిగాయి. కింగ్‑ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆటలు విశాఖపట్నంలో సాగనివ్వమని
వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పోస్టర్‑లో మహిళలను కించ పరుస్తూ చూపారని
మండిపడ్డారు. ఇటువంటి షోలకు అనుమతి ఇవ్వవద్దని వారు డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు
ఒక పక్క ఆందోళన చేస్తున్నప్పటికీ విశాఖ సాగర తీరంలో ఫ్యాషన్‑షో ప్రారంభించారు.
హిందూ దేవతల చిత్రాలతో రూపొందించినదుస్తులను మోడల్స్ ధరించడంతో మరో వివాదం
రేగింది.
ఆధునిక
వాణిజ్యం సామ్రాజ్యంలో ఆడవారిని ఒక వస్తువుగా వాడుకోవడం ఎక్కువైపోయింది. దానిని
సమర్ధించేవారు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్‑షోల పేరిట ఆడవారి అందాలను, అంగాలను ప్రదర్శిస్తారు. దానికి
తోడు వెర్రివేషాలు కూడా వేస్తుంటారు. అర్ధనగ్నం, కాదు ముప్పాతిక నగ్నంగా, అవకాశం ఉంటే ఇంకా ఎక్కువగా
యువతులు తమ అంగాంగాలను ప్రదర్శిస్తారు. అంగ సౌష్టవాన్ని బట్టి కొందరు సెక్సీగా
కనిపించడం సహజం. కానీ మగవారు ఆ దృష్టితో చూడకూడదంటారు. మహిళలు తమ ఇష్టమొచ్చిన
రీతిలో దుస్తులు వేసుకుంటారని, మగవారు
చూసే దృష్టిలో, ఆలోచనలో మార్పు రావాలని వారు
వాదిస్తున్నారు. వారు ఇష్టపడి ఫ్యాషన్‑షోలలో తమ అందాలను ప్రదర్శిస్తుంటే మీరెవరు
అడగటానికి, అడ్డుకోవడానికి? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాషన్‑షోలనేవి
వ్యాపార అవకాశాలు కల్పించడానికి, కొత్త
ముఖాలను పరిచయం చేయడానికి ఉపయోగపడతాయని చెబుతారు. కానీ ఇక్కడ మహిళలే
బలైపోతున్నారని షోలను వ్యతిరేకించేవారి వాదన. ఆ విధంగా దుస్తులు వేసుకోవడం మన
సంప్రదాయం కాదని చెబుతారు. స్త్రీలు సెక్సీగా దుస్తులు వేసుకోవడం వల్ల అత్యాచారాలు
ఎక్కువ జరుగుతున్నాయని కొందరు మహిళా సంఘాల నేతలు వాదిస్తున్నారు. సెక్సీగా
కనిపించని చిన్న పిల్లలపైన,
వృద్దులపైన
కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ష్యాషన్ షోలకు మద్దతు పలికేవారి వాదన.
కురచదుస్తుల వల్ల జరిగే అనర్ధాలను వారు అంగీకరించరు. యువతులు తమ ఇష్టమొచ్చిన
వృత్తిని ఎన్నుకుంటారని,
తమ
ఇష్టమొచ్చిన విధంగా దుస్తులు ధరిస్తారని వాదిస్తారు. వారికి వచ్చే కొత్తకొత్త
అవకాశాలను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే
ఫ్యాషన్‑షోలను అడ్డుకోవడాన్ని మహిళల స్వేచ్ఛను హరించడంగా భావిస్తారు.
ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెడదాం. హిందూ దేవతల బొమ్మలతో రూపొందించిన
దుస్తులను ఫ్యాషన్‑షోలో యువతులు ధరించినందుకు ఈ విషయం ఇక్కడ ప్రస్తావించవలసి
వచ్చింది.
మహిళలు
మూడు రోజులు ఆందోళన చేసిన్నప్పటికీ లెక్కచేయకుండా కింగ్‑ఫిషర్‑ ఫ్యాషన్‑షోను
ప్రారంభించారు. రెండు రోజులు నిర్వహించారు. పలువురు సినీ నటీనటులు, దేశం నలుమూలల నుంచి దాదాపు 40 మంది మోడల్స్ పాల్గొన్నారు. ‑‑షోలో
శుక్రవారం వినాయకుడు బొమ్మ చిత్రించిన దుస్తులను మోడల్స్ ధరించి ర్యాంప్‑పై
నడిచారు. విఘ్నేశ్వరుడి బొమ్మ ఒక మోడల్ ఉదరంపైన, తొడలపైన కనిపించింది. మరో మోడల్ గుండెలపైన
కనిపించింది. దానికి తోడు వారు ఆ దుస్తులు వేసుకొని క్యాట్ వాక్ చేసే సమయంలో
విఘ్నేశ్వర స్తోత్రం వినిపించారు. దాంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, తాము నిత్యం ఆరాదించే దైవాన్ని
కించపరిచారని హిందూ సంఘాలు మండిపడ్దాయి. మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటున్నామని
ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) ఎదురుగా
ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం మహిళా, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో
సమావేశం నిర్వహించారు. మహిళలను అసభ్యంగా చూపించడం పైన, హిందూ దేవతలను కురచ దుస్తులపైన
ముద్రించడంపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లంటే అన్య మతస్తులకు చిన్న
చూపని, ఇవే దుస్తులపై వేరే మతస్తుల
చిత్రాలను వేసి ష్యాషన్ షోలో ప్రదర్శించగలరా? అని ఆర్ఎస్ఎస్ నేతలు ప్రశ్నించారు. హిందూ
దేశంలో దేవుళ్లకు అపచారం జరుగుతున్నా హిందువులు స్పందించకపోవడం దురదృష్టకరమని
విశ్వ హిందూ పరిషత్ నేతలు అన్నారు. ఫ్యాషన్ షో నిర్వాహకులకు ప్రభుత్వ మద్దతు
ఉన్నందువల్ల ఇటువంటి అపచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందువుల్లో స్పందన రావల్సిన అవసరం ఉందన్నారు. విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు
ఫిర్యాదు చేశారు.
ఒక పక్క
మహిళా హక్కుల సంఘాల వారు,
మరో పక్క
హిందూ సంఘాల వారు ఆందోళకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తలకు దారితీస్తుందని భావించి
పోలీసులు షోని రద్దు చేశారు. నిర్వాహకులపై 295(ఏ)సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
షోని వ్యతిరేకించినవారు విజయం సాధించారు. ఒక మతానికి సంబంధించిన దేవతలను కించపరిచే
సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. మరి
ముఖ్యంగా హిందూ దేవతల బొమ్మలను ఈ విధమైన కురచ దుస్తులపైన ముద్రించడాన్ని
నిరోధించవలసి ఉంది.
February 5, 2013 by Siramdasu Nagarjuna
Jan 26, 2013
తెలుగు పాలకులు సిగ్గుపడరా?
బహుముఖ
ప్రజ్ఙాశాలి బాపుకు తమిళనాడు కోటాలో పద్మశ్రీ లభించడం తెలుగువారికి ఎంత అవమానం? ఈ పరిస్థితి ఏర్పడినందుకు మన
పాలకులు సిగ్గుపడరా?
బాపు బొమ్మ, బాపు లిపి, బాపు సినిమా, బాపు కథ, బాపు కార్టూన్….అన్నింటిలోనూ తన ముద్ర స్పష్టంగా
కనిపిస్తుంది. బాపు గీత,
రాత తెలుగు
సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు అంటే తెలియని తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. 1945 నుంచే చిత్రాలు
గీస్తున్నారు. బాపు వేసిన కవర్‑ పేజీ
బొమ్మలతో ఎన్నో వందల పుస్తకాలు ముస్తామయ్యాయి. అవి బాపు చిత్రాలు.1967 నుంచే సినిమాలకు దర్శకత్వం
వహిస్తున్నారు. సినిమాలంటే సినిమాలా అవి బాపు సినిమాలు. సాక్షి, అందాల రాముడు, ముత్యాలముగ్గు… వంటి అచ్చ తెలుగు చిత్రాలతో తెలుగువారి మనసు దోచుకున్నారు. తన
దర్శకత్వ ప్రతిభతో ఎందరో నటీనటులను తీర్చిదిద్దారు.
తెలుగువారందరూ గర్వించదగిన ఇంటి బాపుకు ఇప్పటి
వరకు ఒక్క పద్మ పురస్కారం లభించకపోవడం
చిత్రంగాలేదూ! ఈ విషయంపై ఎన్ని విమర్శలు వచ్చినా మన పాలకులు దున్నపోతుమీద
వర్షంపడినట్లు ఉండిపోయారు. అది మన నైజం అనిపించుకున్నారు. ఇప్పటివరకు బాపుకు
పద్మశ్రీ ఎందుకు రాలేదు. ఎందుకు ఇవ్వలేదు. తెలుగువాడిగా పుట్టినందుకా? అందుకే అని చాలా స్పష్టంగా
అర్ధమవుతోంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, సుప్రసిద్ధ నేపథ్యగాయని పి.సుశీలల
విషయంలో కూడా ఇదే జరిగింది. తెలుగువారైనప్పటకీ వారికి మన పాలకులు పద్మ పురస్కారాలు
అందివ్వలేకపోయారు. తమిళనాట పాలకులు పెద్ద మనసుతో వారిని తమ వారిగా భావించి సిఫార్సు చేసి పద్మ పుస్కారాలు
సాధించుకున్నారు.
ఇప్పుటికైనా
బాపును పద్మశ్రీ వరించింది. కాదు పద్మశ్రీకే బాపు దొరికాడు. ”బాపుగారికి పద్మశ్రీ ఏమిటి
అసయ్యంగా. పద్మశ్రీకి బాపు అని బిరుదు ఇవ్వాలిగాని. ఇస్తే గిస్తే భారత రత్న కన్నా
మరేదైనా మన బాపు గారికి నప్పుతుందా? మీరే చెప్పండి?” అన్న ప్రముఖ సినీగీత రచయిత చైతన్య మాటలు అక్షర
సత్యం. బాపుకు పద్మశ్రీ పురస్కారం
లభించడంతో ఇప్పుడు పద్మశ్రీకే వన్నె పెరిగింది. అయితే ఇది తమిళనాడు కోటాలో రావడం
ఎంత బాధాకరం! ఇంతటి తెలుగువాడికి మనం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వలేకపోయాం.
బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రిక లేదంటే
అతిశయోక్తికాదు. ‘బాపు బొమ్మ, బాపు శైలి, బాపు అక్షరాలు… ప్రశిద్ధి పొందాయి.
పుంఖానుపుంఖాలుగా బొమ్మలు గీసి బాపు తెలుగువారిని అలరించారు. సంతకం అక్కరలేని
చిత్రకారుడు. బాపు బొమ్మలతో రూపొందించిన శుభాకాంక్షల
గ్రీటింగ్స్ ఇష్టపడనివారుండరు. బాపు వేసే ముఖచిత్రం కోసం రచయితలు ఎదురుచూస్తారు.
బాపు బొమ్మ వేసేవరకు నెలలునెలలు తమ పుస్తకాన్ని అచ్చువేయించకుండా ఉన్న రచయితలు, కవులు ఎంతోమంది ఉన్నారు. బాపు బొమ్మలపై ప్రసిద్ద కవి ఆరుద్ర కూనలమ్మ కవిత ఇలా
రాశారు.
కొంటెబొమ్మల
బాపు
కొన్ని
తరముల సేపు
గుండె
ఊయలలూపు
ఓ
కూనలమ్మా!
బాపు అసలు
పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. 1933 సంవత్సరం డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్లో ఆయన
జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి 1955లో లా డిగ్రీ పూర్తిచేశారు. బాపు
ఆంధ్రపత్రిక వార్తా పత్రికలో 1955లో
పొలిటికల్ కార్టూనిస్ట్గా పనిచేశారు. బాపు గీత వయ్యారం తెలుగువారందరికీ తెలుసు.
బాపు ఫాంట్ పేరుతో ఆయన రాత అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయన దర్శకత్వం సరేసరి.
అద్బుత దృశ్యకావ్యాలు మనకు అందించారు. తన చిత్రాల ద్వారా తెలుగు అందాలను, తెలుగు సంస్కృతిని
పండించారు. తన తొలి చిత్రం ‘సాక్షి’తో విజయకేతనం ఎగురవేశారు. గీతలో, దర్శకత్వంలో తనదైన ముద్రతో
ప్రత్యేక గుర్తింపు పొందిన ఘనుడు.
బాపు
దర్శకత్వం వహించిన కళాఖండాలు
తెలుగు
శ్రీరామరాజ్యం 2011 తెలుగు
తెలుగు
సుందరకాండ 2008 తెలుగు
రాధా
గోపాళం 2005 తెలుగు
రాంబంటు 1996
తెలుగు
పెళ్ళికొడుకు 1994
తెలుగు
పరమాత్మా 1994
హిందీ
శ్రీనాథ
కవిసార్వభౌమ 1993 తెలుగు
మిష్టర్
పెళ్ళాం 1993 తెలుగు
పెళ్ళి
పుస్తకం 1991 తెలుగు
ప్రేమ్
ప్రతిగ్యా 1989 హిందీ
దిల్
జలా 1987 హిందీ
ప్యార్ కా
సిందూర్ 1986 హిందీ
కళ్యాణ
తాంబూలం 1986 తెలుగు
మేరా
ధరమ్ 1986 హిందీ
ప్యారీ
బెహనా 1985 హిందీ
బుల్లెట్ 1985
తెలుగు
జాకీ 1985
తెలుగు
మోహబ్బత్ 1985
హిందీ
సీతమ్మ
సేత 1984 తెలుగు
మంత్రిగారి
వియ్యంకుడు 1983 తెలుగు
వోహ్ సాత్
దిన్ 1983 హిందీ
ఏది ధర్మం
ఏది న్యాయం 1982 తెలుగు
కృష్ణావతారం 1982
తెలుగు
నీతిదేవన్
మయగుగిరన్ 1982 తమిళం
పెళ్ళీడు
పిల్లలు 1982 తెలుగు
బేజుబాన్ 1981
హిందీ
రాధా
కళ్యాణం 1981 తెలుగు
త్యాగయ్య 1981
తెలుగు
హమ్
పాంచ్ 1980 హిందీ
వంశవృక్షం 1980
తెలుగు
కలియుగ
రావణాసురుడు 1980 తెలుగు
పండంటి జీవితం 1980
తెలుగు
రాజాధిరాజు 1980
తెలుగు
తూర్పు
వెళ్ళే రైలు 1979 తెలుగు
మనవూరి
పాండవులు 1978 తెలుగు
అనోఖా
శివభక్త్ 1978 హిందీ
గోరంత
దీపం 1978 తెలుగు
స్నేహం 1977
తెలుగు
భక్త
కన్నప్ప 1976 తెలుగు
సీతాస్వయంవర్ 1976
హిందీ
శ్రీ
రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ 1976 తెలుగు
సీతాకల్యాణం 1976
తెలుగు
ముత్యాల
ముగ్గు 1975
తెలుగు
శ్రీ
రామాంజనేయ యుద్ధం 1974 తెలుగు
అందాల
రాముడు 1973
తెలుగు
సంపూర్ణ
రామాయణం 1971 తెలుగు
బాలరాజు
కధ 1970
తెలుగు
ఇంటి
గౌరవం 1970 తెలుగు
బుద్ధిమంతుడు 1969
తెలుగు
బంగారు
పిచ్చుక 1968 తెలుగు
సాక్షి 1967 తెలుగు
January 26, 2013 by Siramdasu Nagarjuna
Subscribe to:
Posts (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...