మోడీ గారు ఈరోజైనా
సత్యం పలకండి
మంత్రి కాలవ
శ్రీనివాసులు
సచివాలయం,
ఆగస్ట్ 14: ఉపన్యాసాలతో ఓ ఊపు ఊపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర్య
దినోత్సవం రోజునైనా సత్యం పలకాలని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ
శ్రీనివాసులు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంగళవారం
మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్ధాల కాలంలో దేశాన్ని ఎన్నో పార్టీలు,
కూటములు పాలించాయని, అయితే హామీలు అమలు చేయడంలో అత్యంత వైఫల్యం చెందడంలో మోడీ
ఫస్ట్ అని అన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు విని మెరుగైన పాలన అందిస్తరన్న
బలమైన విశ్వాసంతో బీజేపీకి తిరుగులేని మెజార్టీ ఇచ్చారని చెప్పారు. అయితే ఆయన దేశ
ప్రజలను అడుగడుగున వంచిస్తూ, వారిని కష్టాలు, కన్నీళ్లపాలు చేశారన్నారు. నాలుగేళ్ల
పాలనలో బాధ్యతారహితంగా వ్యవహరించి అత్యంత అసమర్ధుడిగా దేశ ప్రజల ఆశలు వమ్ముచేశారని
విమర్శించారు. దేశ ప్రతిష్టని దిగజార్చే విధంగా వ్యవహరించి, దేశాన్ని 20 ఏళ్లు
వెనక్కు తీసుకువెళ్లారన్నారు. మోడీ పాలనలో వేల కోట్లు సొమ్ము దోపిడీ చేసి,
బ్యాంకులను లూటీ చేసిన వారు విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని
తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి పౌరుడిని దారుణంగా వెన్నుపోటు పొడిచి, నయవంచనకు
గురిచేసి, నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. బీజేపీ ఎన్నికల హామీలలో 30 శాతం
కూడా అమలు చేయలేదన్నారు. 246 హామీలలో 34 మాత్రమే అమలు చేశారన్నారు. ముందు
చూపులేకుండా నిరంకుశమైన విధానాలు అనుసరించడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు.
మోడీ నాయకత్వం దేశానికి శాపంగా పేర్కొన్నారు. మీడియా హౌస్ పేరుతో జర్నలిస్టులు
విడుదల చేసిన పుస్తకం ద్వారా మోడీ పాలనలోని ప్రగతి తిరోగమనంలో ఉన్నట్లు
స్పష్టమైందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, దేశంలో
నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. జీడీపీ ఎక్కడ పెరిగిందని ప్రశ్నించారు. 2014 నుంచి
గ్యాస్ రూ.500 నుంచి 850కి, డీజిల్ రూ.48 నుంచి రూ.74కు, పెట్రోల్ రూ.50 నుంచి
84కు పెరిగాయని వివరించారు. ప్రధాని దృష్టిలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్,
పెట్రోల్ ధరలు పెరగటమేమోనని అన్నారు. వాస్తవంగా జీడీపీ తగ్గిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్
లో మాత్రం వృద్ధి రేటు రెండంకెలుగా కొనసాగుతోందన్నారు. మోడీ ఆర్థిక విధానాలు
ప్రధానంగా నోట్ల రద్దు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దేశంలో
ప్రకంపనలు సృష్టించిన ఈ రద్దు వల్ల సామాన్యుడు వీధులపాలయ్యాడని చెప్పారు. ఎక్కడకు
వెళ్లినా నగదులేని పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. ఏటీఎంల ముందు ప్రజలు
బారులుతీరారని చెప్పారు. ప్రైవేటు లావాదేవీలు అన్ని బంద్ అయ్యాయని తెలిపారు.
ఇలాంటి విచిత్ర పరిస్థితులు గతంలో ఎన్నడూ ఏర్పడలేదన్నారు. అసమర్ధ ప్రధాని బ్యాంకింగ్ వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేశారని
విమర్శించారు. నీరబ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా వంటివారు వేల కోట్లు దోపిడీ
చేసి బ్యాంకులను ముంచివేసి ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో విహరిస్తున్నారని
పేర్కొన్నారు. అనేక కుంభకోణాలు చేసినవారికి బీజేపీ ప్రభుత్వం రక్షణగా ఉందన్నారు.
రాజకీయాల్లో ఆర్థిక నేరగాళ్లను రక్షిస్తుందని విమర్శించారు. విజయసాయి రెడ్డి వంటి
వారికి ప్రధాన మంత్రి కార్యాలయంలో చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్నారన్నారు. తప్పు
చేసిన వారికి పీఎంఓ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతోందని విమర్శించారు. ఇచ్చిన
హామీలను అమలు చేయకుండా దేశాన్ని ఎక్కడకు తీసుకువెళుతున్నామని ఆయన మోడీని
ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం దెబ్బతిన్నాయన్నారు. బ్లాక్
మనీని బయటకు తీసి ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పారని,
ఎవరి ఖాతాలో వేశారని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు ఖాతాలో వేసి ఉంటారని ఎద్దేవా
చేశారు. నమ్మిన ప్రజలను మోడీ వంచించారన్నారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.8 లక్షల
కోట్లకు పెరిగాయని, 5 ఏడాది పూర్తికి 9 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. నిత్యావసర
వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పారని, కానీ ధరలు పెరిగిపోయాయన్నారు. రైతులకు
మాత్రం గిట్టుబాటు ధరలు రావడంలేదని చెప్పారు.
2013-14లో దేశం అప్పులు రూ.56.69 లక్షల కోట్ల ఉండగా,
రూ.79.62 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రభుత్వం
అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రచారానికి ప్రభుత్వం రూ.4,343 కోట్లు ఖర్చు
చేసినట్లు తెలిపారు. పని తక్కువ ప్రచారం ఎక్కవ అని విమర్శించారు. ప్రజాభిమానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని 72వ
స్వాతంత్ర్యదినోత్సవం రోజున సత్యం పలకాలని మంత్రి కాలవ అన్నారు.
రాజకీయంగా ఆలోచిస్తే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా
బీజేపీ, మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటకలలో ప్రాంతీయ
పార్టీలను దెబ్బతీస్తున్నారన్నారు. ఏపీలో కూడా కొంతమందికి పదవులు ఇచ్చి రాజకీయాలను
కలుషితం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రాంతీయ నాయకత్వాలపై దాడులు
చేయిస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని, నిందలు మోపి అవమానాలపాలు
చేస్తున్నారన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణలు
చెప్పాలని మంత్రి కాలవ డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment