Apr 30, 2026

వ్యర్థాల పునర్వినియోగంలో అగ్రస్థానాన నిలవాలన్నదే ఏపీ లక్ష్యం

 

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తుండటంతో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  సరైన నిర్వహణ లేకండా ఈ వ్యర్థాలను ఇలా వదిలివేస్తే, భవిష్యత్తులో వీటిని ధ్వంసం చేయడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. అంతే కాకుండా, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా ప్రమాదకరం.  ఈ సమస్యని పరిష్కరించడానికి పారిశ్రామిక వ్యర్థాలను ఆర్థిక ఉత్పాదకంగా, పర్యావరణానికి హాని కలుగకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో  సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ‘వాడి, విసిరిపారేసే’ విధానం నుంచి ‘వాడిన తర్వాత  పునరుద్ధరణ, పునర్వినియోగం’ వ్యవస్థకు మారడం దీని ప్రధాన లక్ష్యంఅంటేవ్యర్థాల నుండి సంపద సృష్టించడం.  దీనినే ప్రపంచవ్యాప్తంగా సర్కిల్ ఎకానమీ(వృత్తాకార ఆర్థిక వ్యవస్థ-సీఈ) అంటారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు  ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఎకానమీ, వ్యర్థాల పునర్వినియోగం విధానం (4.0) (2025-30) అనే  కొత్త పాలసీ ప్రకటించింది. దీనికి సంబంధించి, గత సంవత్సరం ఆగస్టు 24న ఓ జీఓ జారీ చేసింది. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చడంరీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది.  వ్యర్థాల నిర్వహణలో వినూత్న విధానాలు అవలంబిస్తోంది. వ్యర్థాల నుండి ఆదాయం సృష్టించడంవ్యవసాయపారిశ్రామిక వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటురీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడంఉపాధి అవకాశాలు పెంచడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ పునరావృత ప్రక్రియ సాంకేతిక పురోగతులుమార్కెట్ మార్పులు, కార్యాచరణ అభిప్రాయాలకు అనుగుణంగా విధానాన్నిరూపొందిస్తారు. ఏపీఐఐసీఏపీపీసీబీస్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలతోపాటు సంస్థలన్నింటిని సమన్వయం చేసుకుంటూ,  పరిశ్రమల సంచాలకులు   అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సూక్ష్మచిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్లు, ఎలక్ట్రానిక్, ఆహారం, దుస్తులు, ఔషధాల పరిశ్రమల కోసం ప్రత్యేక పార్కులు రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే, అధిక వనరులను వినియోగించే థర్మల్ పవర్, మెటలర్జీ, నిర్మాణం, వ్యవసాయ ప్రాసెసింగ్, ప్యాకేజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల ద్వారా ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.  ఈ రంగాల ద్వారా ఫ్లై యాష్, ఎర్ర మట్టి నుండి రాళ్ల దుమ్మ పేపర్ వేస్ట్ప్లా స్టిక్ స్క్రాప్, బయోమాస్ అవశేషాల వరకు భారీ స్థాయిలో పారిశ్రామిక వ్యర్థాలు పోగుపడుతుంటాయి. సర్క్యులర్ ఎకానమీ సూత్రాల ద్వారాఈ వ్యర్థ ప్రవాహాలను పారిశ్రామిక విలువ గొలుసులు(ఇండస్ట్రియల్ వాల్యూచైన్స్)గా తిరిగి విలీనం చేయడంతోపాటు ముడి వనరుల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, కొత్త గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్‌లను సృష్టించవచ్చన్నది ప్రభుత్వ భావన.

 

రాష్ట్రంలో పేరుకుపోతున్న వ్యర్థాల పర్యవేక్షణ తరలిస్తున్న వ్యర్థాల వివరాల ప్రదర్శనకు డేటా ఆధారంగా, పారదర్శకంగా  ప్రజా నివేదికల కోసం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్క్యులారిటీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంతోపాటు ఏకీకృత ఇ-మ్యానిఫెస్ట్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది.  ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీబీ), అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్‌బీ)లు, ఆర్టీజీఎస్(

రియల్ టైమ్ గవర్నమెంట్ సొసైటీ)లను సమగ్రపరిచే రియల్-టైమ్ సర్క్యులర్-ఎకానమీ డాష్‌ బోర్డ్ ఏర్పాటు చేస్తారు. కొత్త సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియో విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలను రూపొందించారు. పేరుకుపోయిన అన్ని రకాల వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకురవడంతో పర్యావరణ పునరుద్ధరణ జరుగుతుంది. 2047 నాటికి పూర్తి సర్క్యులర్ వ్వవస్థకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలకు అనుగుణంగా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.   పరిశ్రమలు, వాణిజ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నూతన  సర్కిల్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0(2025-30)ను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  అయిదు సంవత్సరాల పాటు లేదా కొత్త విధానం ప్రకటించే వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఈ విధానంలో రీసైక్లింగ్ కేంద్రాలను ప్రోత్సహిస్తారు.

రాష్ట్ర సర్క్యులారిటీ సెల్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ త్రైమాసికానికి ఒకసారి సమావేశమై డాష్‌బోర్డ్ఆడిట్ నివేదికలు, జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ల సమీక్షిస్తాయి. ఈ సమీక్ష ఆధారంగావిధానాలలో తాజాగా మార్పులు చేర్పులు చేస్తారు.   ప్రోత్సాహక పథకాలను, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను మెరుగుపరుస్తారు. వ్యర్థాల నిర్వహణవనరుల పునర్వినియోగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది. ఈ ప్రక్రియలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది.  పర్యావరణ అనుకూల విధానాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914




Apr 29, 2026

ఆరుగురు చేనేత ప్రముఖులకు టీడీపీ పదవులు


మంగళగిరి: తెలుగుదేశం పార్టీ పదవులు చేనేత వర్గానికి చెందిన ఆరుగురు ప్రముఖులను వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఉదయం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తోపాటు పార్టీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. పద్మశాలి సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయ రావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధ, కర్నూలుకు చెందిన డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్,  రాష్ట్ర కార్యదర్శిగా విశాఖపట్నంకు చెందిన వానపల్లి గాయత్రి ఫణి కుమారిలు ప్రమాణ స్వీకారం చేశారు. చేనేత వర్గానికే చెందిన దేవాంగ సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన దాసరి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన నిమ్మల అంబరీష్ లు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

గుత్తికొండ ధనుంజయ:  గుత్తికొండ సీతారామయ్య, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ధనుంజయ రావు 1968 జూన్ 1వ తేదీన జన్మించారు. ఆయన  ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు మంగళగిరి మూర్తి స్కూల్ లో చదివారు. ఆ తర్వాత చింతక్రిది కనకయ్య హైస్కూల్ లో 6వ తరగతి చదివారు.  వివిధ కారణాల వల్ల చదువు మానివేశారు. ఆ తర్వాత 1989లో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ మెట్రిక్ పరీక్ష రాసి పాసయ్యారు.  1990 మే 5న గుంటూరుకు చెందిన  కాకుమాను పాపయ్య, తేరోజమ్మల కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. 
14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్రకి,  2014లో గంజి చిరంజీవికి,  2019లొ నారా లోకేష్ కి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. 2024 లో నారా లోకేష్ విజయం కోసం అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమించారు.  2006లో  కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా,  రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు.  2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీ వైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. ఓ పక్క చేనేత కార్మికుల కోసం పోరాడుతూ, మరోపక్క బీసీలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ, మరో పక్క అయిదేళ్ల నుంచి మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గా కళాసేవ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తూ, సౌమ్యుడిగా పేరు పొందిన ధనుంజయరావుని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించింది.

పంచుమర్తి అనురాధ: పంచుమర్తి అనురాధ:   స్వర్గం పుల్లారావు, లక్ష్మి దంపతులకు పంచుమర్తి అనురాధ 1974లో జన్మించారు.   తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో చేశారు.  ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో, ఆ తర్వాత విజయవాడ అట్కిన్‌సన్‌ హైస్కూల్‌లో చదివారు. విజయవాడ స్టెల్లా కాలేజీల ఇంటర్ , గుంటూరు జేకేసీ కళాశాలలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు.  డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే, ఆమె పారిశ్రామికవేత్త పంచుమర్తి శ్రీధర్ తో వివాహం జరిగింది. అనూరాధ వివాహానంతరం 2010లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశారు. 
ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2000లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు.  మేయర్‌ టికెట్‌ కోసం ఆమె టీడీపీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 మంది పోటీ పడగా,  విద్యాధికురాలైన అనురాధకు చంద్రబాబు నాయుడు  టికెట్‌ ఖరారు చేశారు.  విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి  6,800 ఓట్ల మెజారిటీతో  మేయర్‌గా గెలిచారు. మేయర్‌గా ఎన్నికైన నాటికి ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. పంచుమర్తి అనురాధ ఆ తరువాత పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన రీతిలో సమాధానాలు చెబుతూ, ఫైర్ బ్రాండ్ గా పేరుపొందారు.   2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసే కోటాలో ఆమె గెలుపొందారు.   2024 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చీఫ్ విప్‌గా అనురాధ నియమితురాలయ్యారు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలయ్యారు.

డాక్టర్ సంజీవ్ కుమార్: వస్త్ర వ్యాపారరంగంలో ప్రముఖులైన  శ్రీ శింగరి శ్రీరంగం, రంగమ్మ పుణ్య దంపతులకు 1967 జనవరి 3న   కర్నూలు నగరంలో డాక్టర్ సంజీవ్ కుమార్  జన్మించారు. సంజీవ్ కుమార్ బాల్యం నుంచి  ఆట పాటలతోపాటు చదువులో  ప్రతిభ కనపరిచేవారు. శింగరి శ్రీరంగం  కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు మొత్తం ఆరుగురూ డాక్టర్లే.  వారంతా ప్రభుత్వ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లు  కూడా డాక్టర్లే. ఈ కుటుంబంలో  మొత్తం 21 మంది డాక్టర్లు ఉన్నారు. 1984-1990లో  కర్నూలు మెడికల్ కాలేజీలో  ఎంబీబీఎస్  డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. 1992-1995 మధ్య కాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చదివారు. సంజీవ్ కుమార్ 1992 మార్చి 4న డాక్టర్ వసుంధరనుపెళ్లి చేసుకున్నారు.
డాక్టర్ సంజీవ్ కుమార్ 2006 నుంచి 2022 వరకు‘ఆయుష్మాన్ ద ఫ్యామిలీ హాస్పిటల్’ద్వారా పేదలకు అందుబాటులో వైద్యం సేవలు చేశారు.  రాజకీయాలలో స్థిరపడి, ప్రజలకు ఇంకా చేరువై సేవచేయాలని 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షా 48వేల ఓట్ల మెజార్టీతో  సంజీవ్ కుమార్ విజయం సాధించారు.

కర్నూలు ఎంపీగా ప్రశ్నలు అడగడంలో, ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టడంలో, చర్చలలో పాల్గొనడంలో  ఆయన ఓ రికార్డును స్థాపించారు. డాక్టర్ సంజీవ్ కుమార్  6 ప్రైవేటు బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ 72 సంవత్సరాల చరిత్రలో కర్నూలు ఎంపీగా ఎన్నికైన ఎవరూ సభలో ఇన్ని ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టలేదు.  కర్నూలుకు సంబంధించి లోక్ సభ చరిత్రలో డాక్టర్ సంజీవ్ కుమార్ సృష్టించిన రికార్డు ఇది.   17వ లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ 225 ప్రశ్నలు లేవనెత్తారు. ఒక పద్మశాలి లోక్ సభ సభ్యుడు ఈ స్థాయిలో ప్రశ్నించడం, చర్చలలో పాల్గొనడం,  ప్రశ్నలు లేవనెత్తడం చేనేత వర్గాలు గర్వకారణంగా భావించాయి. ఉన్నత చదువులు చదివిన నిజాయితీపరులు లోక్ సభకు ఎన్నికైతే దేశానికి ఎంత ప్రయోజనకరమో డాక్టర్ సంజీవ్ కుమార్ చేసి చూపించారు. 2024 ఎన్నికల ముందే ఆయన టీడీపీలో చేరారు. డాక్టర్ సంజీవ్ కుమార్ విద్యార్హతలు, ప్రజాసేవా కార్యక్రమాలు, పార్లమెంటులో ఆయన చూపిన ప్రతిభ ఆదారంగా, ఆయనను పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎంపిక చేశారు. 

వానపల్లి గాయత్రి ఫణి కుమారి: విశాఖపట్నంకు చెందిన వానపల్లి గాయత్రి ఫణి కుమారి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.  చేనేత వర్గాల సంక్షేమం కోసం ఆమె కృషి చేస్తుంటారు. ఆమె సేవలను గుర్తించి పార్టీ ఆమెని రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 

దాసరి శ్రీనివాస్: విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన దాసరి శ్రీనివాస్ దేవాంగ సంఘంలో పలు పదవులు నిర్వహించారు. చేనేత వర్గం కోసం పోరాడుతూ, ఆ వర్గం నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 

నిమ్మల అంబరీష్: టీడీపీకి చెంది ప్రముఖ నేత నిమ్మల కిష్టప్ప కుమారుడే అంబరీష్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, చేనేత రంగం అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 

చేనేత వర్గం నుంచి నియమితులైన ఈ ఆరుగురికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు,  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు జీవీ నాగేశ్వరరావు సంఘం తరఫున అభినందనలు తెలిపారు. 
 
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914





టీడీపీ అధినేతలకు శుభాకాంక్షలు












తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో  ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నాను. ఈ సభ్యులు మనకు తెలియడంకంటే, వారికి మనం తెలియడం విశేషం. మన ముఖ్యమంత్రి, పార్టీ పొలిబ్యూరో సభ్యులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దగ్గర నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, గుత్తికొండ ధనుంజయ రావుతోపాటు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఇతర జాతీయ, రాష్ట్ర పదవులు స్వీకరించే గురజాల మాల్యాద్రి, బీటీ నాయుడు, డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్, పంచుమర్తి అనురాధ, తెనాలి  శ్రావణ్ కుమార్, పాతర్ల రమేష్, ఆకుల జయసత్య తదితర పలువురు ముఖ్యులను నేను అనేక సార్లు కలిశాను. మాట్లాడాను. కొందరు నాకు సహాయం చేసినవారు కూడా ఉన్నారు.  గుత్తికొండ ధనుంజయ రావు ఇల్లు మా ఇంటికీ సమీపంలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. మంచి మిత్రులు. పాతర్ల రమేష్ ది కూడా మా ఊరే. ముఖ్యంగా మా జర్నలిస్ట్. మేమిద్దరం దాదాపు ఒకేసారి జర్నలిజంలోకి వచ్చాం.  45 ఏళ్ల నుంచి తెలుసు. మంచి మిత్రుడు. ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారందరికీ  హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు.




  

Apr 23, 2026

ఏపీలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం


రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. చంద్రబాబు నాయకత్వంలో మానవ వనరులు అభివృద్ధి,  విద్య,  ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో   స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది.   మనుషులకు, జంతువులకు అత్యంత ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టింగ్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది.  మైక్రో, నానో రూపాల్లో ప్లాస్టిక్ మన శరీరంలోకి, పశువుల కడుపులోకి చొచ్చుకుపోతుంది.   చివరికి పసికందుల రక్తంలోకి కూడా చేరుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  ఇంతటి ప్రమాదకరమైన  ప్లాస్టిక్‌కు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో  ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార, కాటన్ సంచుల వినియోగాన్ని  ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు,  నేలను అందించాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యం. ఇదే అసలైన గేమ్ ఛేంజర్. ఇందుకోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలలో,  ఉద్యోగులలో, విద్యార్థులలో  విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తోంది.  ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.  రాష్ట్రంలోని ఉపాధ్యాయులు,  విద్యార్థులు,  వ్యాపార, వివిధ అసోసియేషన్ల, రిటైర్డ్ ఉద్యోగుల, స్వయం సహాయక సంఘాల,  మహిళా సంఘాల సహకారంతో ఈ గేమ్ ఛేంజర్ ని తీసుకురానుంది.  క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లు, పేపర్ ప్యాకేజింగ్ తయారీకి మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తోంది. ‘క్లీన్ ఏపీ – గ్రీన్ ఏపీ’ అన్న నినాదంతో  స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  ముందుకు వెళుతోంది.




పట్టాభిరామ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రపతి చేతులమీదుగా కార్పొరేషన్ 5 జాతీయ అవార్డులు అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25  అవార్డులలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి.  విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. స్పెషల్‌ కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డు విశాఖ నగరానికి, రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్‌ అవార్డు రాజమహేంద్రవరం నగరానికి, స్వచ్ఛ సూపర్‌లీగ్‌ సిటీస్‌ అవార్డులు విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలకు దక్కాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ పురపాలక శాఖ ఈ అవార్డులను అందుకుంది. 

రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో చెత్తను శుభ్రపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో చెత్త పేరుకుపోకుండా ఉండేదుకు 75 వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు, 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 2025 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ (గ్గాసులు, కవర్లు, బాటిళ్లు, స్ట్రాలు...)ను పూర్తిగా నిషేధించే చర్యలకు పూనుకుంది. వచ్చే జూన్ నాటికి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. అమరావతిలోని సచివాలయం నుంచి మొదలు పెట్టి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  కార్యాలయం,   రాష్ట్రంలోని  26 జిల్లాల్లోని 20 జిల్లాల్లో ఇప్పటికే  62 మునిసిపల్ కార్యాలయాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. వాటిని  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మార్చారు. ఈ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బదులు త్రాగునీటి కోసం గాజు, స్టీల్ బాటిళ్లు ... వంటి ప్రత్యామ్నాయాలను వినియోగిస్తున్నారు.  రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా త్వరలోనే ఈ నిషేధం విధిస్తారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు కార్పోరేషన్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలో మార్చి నెలలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ డి.దశరధరామిరెడ్డి ఈ అవార్డుని అందుకున్నారు. ఆ అవార్డును కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఈడీ అర్జునరావులు  స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు అందజేశారు. త్వరలో లక్ష్యాన్ని చేరుకునే విధంగా, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం కలిగించే విధంగా ప్రభుత్వం అనేక రూపాలలో ప్రచారం నిర్వహిస్తోంది.  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నుని కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అంతే, కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన స్టైల్లో  చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియలను కూడా ప్రారంభించారు.  సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ గ్లాసులు, సీసాలు, కవర్లు, సంచులు.... వంటి వాటిని ఇస్తే ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా  కొన్ని పట్టణాలలో,  గ్రామాలలో అమలు చేస్తున్నారు.  కొన్ని పట్టణాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రానికి వెళ్లి ఇస్తే, అక్కడ నిత్యావసర వస్తువులు వంటి వాటిని బహుమతులుగా ఇస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో  ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.  ఇందు కోసం తెనాలి మున్సిపల్‌ కార్యాలయం, శివాజీ చౌక్‌లలో ప్లాస్టిక్‌ ప్రత్యేక  సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  విద్యార్థులు పాత పుస్తకాలు, కార్డు బోర్టులు... వంటివాటిని ఇస్తే వారికి ప్రశంసా పత్రాలతోపాటు కొత్త పుస్తకాలు బహుమతిగా అందజేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి,  వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘స్వచ్ఛ రథం’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని  ప్రారంభించింది. ఇందులో చెత్తను (ప్లాస్టిక్, బాటిళ్లు వంటివి) ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా నిత్యావసర సరుకులను పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసి, గ్రామాల పరిశుభ్రతను పెంచుతూ,  ప్రజలకు ప్రయోజనం, పర్యావరణానికి రక్షణ చేకూరుస్తున్నారు.  ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి.  వాటి ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నారు. స్వచ్ఛ రథాల సంఖ్య త్వరలో వందకు పెంచుతారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్. ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటించి, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరిట పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు తప్పనిసరిగా పాల్గొంటున్నారు. 12 వేలకు పైగా ట్రైసైకిల్స్, ఇతర వాహనాల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 3.91 లక్షల ఇళ్లల్లో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో పది లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.  త్వరలోనే ఆ లక్ష్యానికి చేరుకుంటారు.

సర్క్యులర్ ఎకానమీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను, పార్కులను ప్రభుత్వం  ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి  ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, వేరు చేసి, శుభ్రపరుస్తారు.  యంత్రాల ద్వారా చిన్న ముక్కలుగా చేసి, కరిగించి, గుళికలు లేదా రేకులు  తయారు చేస్తారు. ఈ గుళికలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. వాటిని మళ్లీ కొత్త ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ రకంగా చేయడం ద్వారా తక్కువ ముడిపదార్థాలతో  కొత్త ప్లాస్టిక్‌ వస్తువులు  ఉత్పత్తి అవుతాయి. భూమిలో ప్లాస్టిక్ పేరుకుపోవడం తగ్గుతుంది. ఆ విధంగా మనం త్వరలోనే స్వచ్ఛ అంధ్రని, స్వర్ణ అంధ్రని చూడబోతున్నాం.

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Apr 17, 2026

భార్యకు భర్త ఇచ్చే భరణం... సుప్రీంకోర్టు వ్యాఖ్యానం

 భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబ ద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ ల ధర్మాసనం  తెలిపింది. 

 కేస్ నంబర్: SLP (Crl) No. 13247/2024
 కిరణ్ జ్యోతి వర్సెస్ అమిత్ కుమార్ (ఉత్తరాఖండ్)

  ధర్మాసనం:జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్.

న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు:

 1. భర్త ఆర్థిక స్తోమత:  భర్త ఆదాయం, ఆస్తులను బట్టి భరణం నిర్ణయించాలి. ఈ కేసులో భర్త ఆదాయం సుమారు నెలకు రూ. 50,000 నుండి 60,000 వరకు ఉందని ప్రాథమికంగా గుర్తించిన కోర్టు, గతంలో ఉన్న రూ. 15,000 భరణాన్ని తక్కువగా భావించి దానిని రూ. 25,000 కు పెంచింది.

 2. మహిళల హక్కులు:  భరణం అనేది భర్త ఇచ్చే భిక్ష కాదని, అది భార్య యొక్క చట్టబద్ధమైన హక్కు అని ధర్మాసనం గుర్తుచేసింది. మహిళ తన పుట్టింటిపై ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించేలా భర్త భరోసా కల్పించాలని పేర్కొంది.

 3. తక్కువ మొత్తాలపై అభ్యంతరం:  కేవలం రూ. 8,000 లేదా రూ. 10,000 వంటి మొత్తాలు నేటి కాలంలో ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించడానికి, కనీస అవసరాలు (ఆహారం, వసతి, వైద్యం) తీర్చుకోవడానికి సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.

 4. సామాజిక హోదా:  వివాహం తర్వాత దంపతులు కలిసి ఉన్నప్పుడు అనుభవించిన జీవన ప్రమాణాలను (Standard of Living), విడిపోయిన తర్వాత కూడా భార్యకు కల్పించాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది.

 ఫ్యామిలీ కోర్టు తీర్పు:  చంపావత్ ఫ్యామిలీ కోర్టు మొదట రూ. 8,000 నిర్ణయించింది.

 హైకోర్టు సవరణ: ఉత్తరాఖండ్ హైకోర్టు దీనిని రూ. 15,000 కు పెంచింది.

 సుప్రీంకోర్టు అంతిమ తీర్పు: బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమె అవసరాలను మరియు భర్త ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని రూ. 25,000 కు ఖరారు చేసింది.


ఈ తీర్పు దేశవ్యాప్తంగా భరణం కేసులలో ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.  గౌరవప్రదమైన జీవనం, సహేతుకమైన భరణం అనే అంశాలకు పెద్దపీట వేసింది.

తెలంగాణలో ఏ సామాజిక వర్గం ఎంత ఉందంటే?


https://des.telangana.gov.in/


రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీ జనాభా 10.08 శాతం

ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం

ఓసీ జనాభా 13.21 శాతం, ముస్లిం ఓసీ జనాభా 2.48 శాతం


తెలంగాణ రాష్ట్రంలో ఏయే సామాజిక వర్గాలు ఎంత శాతం ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వెల్లడైంది. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న బీసీ ఉప సంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి సర్వే నివేదికను అందజేశారు.

సర్వేలో 96.9 శాతం మంది లేదా 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. 3.1 శాతం మంది లేదా 16 లక్షల మంది సర్వేకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నారు.

ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా ఉంది. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నారు.

సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం, తెలంగాణలో మొత్తం 1,15,79,457 కుటుంబాలు ఉన్నాయి. ఈ సర్వేలో 1,12,15,134 (96.4 శాతం) కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వేకు దూరంగా 3,64,323 (3.1 శాతం) కుటుంబాలు ఉన్నాయి. సర్వేలో 3,54,77,554 కోట్ల జనాభా పాల్గొంది. సర్వేకు దూరంగా 16,00,000 మంది ఉన్నారు.

జనాభాలో పురుషులు 1,79,21,183 (50.51 శాతం) మంది, మహిళలు 1,75,42,597 (49.45 శాతం) మంది ఉండగా, థర్డ్ జెండర్ 13,774 (0.04 శాతం) మంది ఉన్నారు.

సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ జనాభా 1,64,09,179 (46.25 శాతం), ఎస్సీ 61,84,319 (17.43 శాతం), ఎస్టీ 37,05,929 (10.45 శాతం), ఓసీ 47,21,115 (13.21 శాతం), ముస్లిం బీసీ 35,76,588 (10.08 శాతం), ముస్లిం ఓసీ జనాభా 8,80,424 (2.48 శాతం) ఉన్నారు.

తెలంగాణలో 7 కులాల చేతుల్లోనే సగానికి పైగా భూమి

రాష్ట్ర కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో 32 శాతంగా ఉన్న రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాలు మొత్తం భూముల్లో 51.4 శాతాన్ని కలిగి ఉన్నాయి. 4.8 శాతం జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 13.5 శాతం భూమితో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎస్సీ మాదిగ వంటి సామాజిక వర్గాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లు సర్వే తేల్చింది.


తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం ఏడు కులాల యాజమాన్యంలోనే ఉందని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం సాగు భూమి 1.37 కోట్ల ఎకరాలు కాగా.. సగానికి పైగా రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర జనాభాలో వీరు 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది. అంటే జనాభా నిష్పత్తి కన్నా భూ యాజమాన్యం వీరి వద్దే అధికంగా ఉంది.

ఓసీ విభాగంలోని రెడ్డి కులం భూ యాజమాన్యంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో ఈ కులం వాటా కేవలం 4.8 శాతం కాగా.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 13.5 శాతం భూమి వీరి యాజమాన్యంలోనే ఉంది. వీరితో పాటు మరో 25 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండగా.. మిగిలిన అనేక కులాలు జనాభా కంటే తక్కువ భూమితో సరిపెట్టుకుంటున్నాయి. రెడ్డి కులం తర్వాత 5.7 శాతం ఉన్న యాదవ కులం వారి వద్ద 8.7 శాతం భూమి ఉంది. ఎస్టీ లంబాడా జనాభా 6.8 కాగా.. భూమి 8.6 ఉంది. ముదిరాజ్ జనాభా 7.4 శాతం కాగా.. భూమి 7.8 శాతం కలిగి ఉంది. మున్నూరు కాపు 3.9 శాతం జనాభా ఉండగా.. భూమి 6.4 శాతం కలిగి ఉన్నారు. కురమ 2.2 శాతం జనాభా ఉండగా.. భూమి 3.6 శాతం ఉంది. కోయ 1.2 శాతం ఉండగా.. భూమి 2.8 శాతం కలిగి ఉన్నారు. ఇలా ఈ ఏడు కులాల మెుత్తం జనాభా 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది.

బీసీ-బి కేటగిరీకి చెందిన కురుబ, కురుమ కులాల్లో భూమి ఉన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ కులాల్లో దాదాపు 62 శాతం కుటుంబాలకు సొంత భూమి ఉంది. వీరి తర్వాత ఆరేవాళ్లు, ఎస్టీ విభాగంలో కోయ, లంబాడీలు, ఎస్సీ విభాగంలో మాదాసి కులాల్లో దాదాపు 60 శాతం కుటుంబాలు భూ యాజమాన్యం కలిగి ఉన్నాయి. అయితే, ఓసీ విభాగంలోని రాజులు, బ్రాహ్మణులు, ముస్లింలు, జైన్లలో భూమి ఉన్న కుటుంబాల శాతం 10 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ మాదిగ 10.3 శాతం ఉండగా.. భూమి 6.5 శాతంగా ఉంది. ముస్లిం 7.9 శాతం జనాభా కాగా.. భూమి 2.0 శాతం ఉంది. ఓసీ వెలమ 0.4 శాతం జనాబా ఉండగా.. భూమి 1 శాతం ఉంది.

పెద్ద కమతాలు (5-20 ఎకరాలు): ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపులు, ఎస్టీ గోండు, కోయ కులాల్లో భూమి ఉన్న వారిలో 30 శాతం కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది.

చిన్న కమతాలు (5 ఎకరాల లోపు): ఎస్సీ బేడ, మాదిగ కులాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది.

భారీ కమతాలు (20 ఎకరాల పైబడి): 20 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు అత్యధికంగా జైన్లలో (8.2 శాతం), రాజుల్లో (7.5 శాతం), బ్రాహ్మణుల్లో (6.8 శాతం), బీసీ గంగిరెడ్లవారిలో (6 శాతం) ఉన్నాయి.

----------------------

పద్మశాలీలను బలిచేశారు

కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన కులగణనలో పద్మశాలీలకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 2015లో 18 లక్షల జనాభాను చూపించారు. సర్కార్‌ తాజాగా ప్రకటించిన కులగణన సర్వేలో పద్మశాలీలను కేవలం 11,79,031గా చూపించింది. 11 ఏండ్లలో జనాభా పెరగాలి కానీ తగ్గుతుందా? ఇది పూర్తిగా బీసీల్లో పద్మశాలీలను అణగదొక్కే ప్రయత్నంగానే భావిస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే జనాభాను తక్కువగా చూపిస్తున్నారు. వాస్తవానికి 30 లక్షల నుంచి 35 లక్షల జనాభా ఉన్నది. 18 లక్షల ఉన్న జనాభా 11 లక్షలకు ఏట్లా వస్తది? అందులో 19 ఉపకులాలు ఉండగా ఉపకులాలు ఊసేలేదు. వారికి నచ్చినట్టు మార్పులు చేసుకొని డిక్లేర్‌ చేసుకున్నారు. ఎక్కువ జనాభా చూపిస్తే ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ల అధికారం కోసం, సీట్ల కోసం పద్మశాలీలను బలిపెట్టారు.

– వల్లకాటి రాజ్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు

వ్యర్థాల పునర్వినియోగంలో అగ్రస్థానాన నిలవాలన్నదే ఏపీ లక్ష్యం

  రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తుండటంతో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  సరైన నిర్వహణ లేకండా ఈ వ్యర్థాలను ఇలా వదిలివేస్తే,...