Apr 16, 2026

కార్పోరేట్ ఎంఎన్‌సీ కంపెనీల కథ



నోటితో చెప్పలేక కళ్ళతో మొత్తుకుంటున్నా వినకుండా ఆ నరకాల్లో పడేసి  మన కన్నతల్లిదండ్రుల్ని మనమే అనాధల్ని చేసి ప్రేమ పేరుతో కర్కశంగా చంపాలా ?! అలా చస్తే నిజంగా ఎవరికి లాభం?!?!

కార్పొరేట్ హాస్పటల్స్ కుట్రలు - ఒక సంపూర్ణ విశ్లేషణ

- డాక్టర్ గౌతమ్ కశ్యప్


"ఇది అందరికీ ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం - దీనిని అమెరికన్ పరిశోధకులే కనుగొని విస్తుపోయిన రహస్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందా? లేక కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందా? అని తేల్చే పచ్చి నిజం ఇది."


అది 1961వ సంవత్సరం..

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో 'రోసెటో' (Roseto) అనే ఒక చిన్న గ్రామం ఉంది. దాని చుట్టుపక్కల అత్యాధునిక సౌకర్యాలతో ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీల నిధులతో నడిచే ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. కానీ అక్కడ వారికి ఒక వింతైన, నమ్మశక్యం కాని పరిస్థితి ఎదురైంది. రోసెటో ఊరి నుంచి ఒక్క పేషెంట్ కూడా ఆసుపత్రులకు రావడం లేదు!

ఏ వ్యాపార సంస్థకైనా కస్టమర్స్ రాకపోతే అది ఆ వ్యాపార మనుగడకే ప్రమాదం. ఇక్కడ కూడా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ల్యాబ్‌లు ఉన్నాయి, ఫార్మా కంపెనీల మందులు సిద్ధంగా ఉన్నాయి. ఆసుపత్రులకు రోగులు రాకపోతే అది వారి వ్యాపారానికి అతిపెద్ద నష్టం. అందుకే, అక్కడ ప్రజలు పరీక్షలు చేయించుకోవడం లేదేమో అని చుట్టుపక్కల హాస్పిటల్స్ యాజమాన్యాలు పోటీపడి మెడికల్ క్యాంపులు పెట్టాయి. జనం రాలేదు. ఇది వారికి ఆశ్చర్యం వేసి, టెస్టుల ఖర్చులకు భయపడి రాలేదేమో అని చివరికి 'ఉచిత పరీక్షల' పేరుతో ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయినా ఒక్క పేషంటూ రాలేదు. ఆ రోసెటో జనం మాత్రం "మాకు ఏ జబ్బు లేదు, మీ పరీక్షలు మాకు అక్కర్లేదు" అని ముఖం చాటేశారు.

ఉచిత పరీక్షలకు కూడా ఎందుకు రావడం లేదో అర్థంకాక ఎంక్వైరీ చేస్తే, అక్కడ అసలు జనానికి జబ్బులే రావడం లేదని తెలిసింది! అమెరికాతో సహా ప్రపంచమంతా కోట్ల మంది జబ్బులతో బాధపడుతుంటే, ఈ ఒక్క ఊరిలో ఎందుకు జబ్బులు లేవో తెలుసుకోవడానికి పరిశోధన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ వారి లక్ష్యం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రేమ కాదు—అక్కడ ఏదైనా 'రహస్యంగా రోగాలు రాకుండా చేసే కారణమేదైనా' తెలిస్తే.. దానిని కోట్ల కోట్ల డాలర్ల వ్యాపారంగా మార్చుకోవాలనే అత్యాశతో కూడిన అపరిమిత ఉత్సాహం!

ఈ మిస్టరీని ఛేదించడానికి డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ (Head of Oklahoma Medical Research Foundation) రంగంలోకి దిగారు. ఆయన ఏదో మామూలుగా వెళ్లలేదు.. దాదాపు 50 మంది నిపుణులతో కూడిన ఒక భారీ వైజ్ఞానిక సైన్యాన్ని వెంటబెట్టుకుని మందీ మార్బలంతో ఆ ఊరి మీద పడ్డారు. ఆ బృందంలో గుండె నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు ఉన్నారు. వీరు 1961 నుండి దాదాపు 30 ఏళ్ల పాటు ఆ ఊరిని ఒక ప్రయోగశాలగా మార్చి, 1895 నుండి ఉన్న ప్రతి మరణ ధృవీకరణ పత్రాన్ని జల్లెడ పట్టారు.

అక్కడ వారు గమనించిన ఒక పచ్చి నిజం ఏమిటంటే—నేడు మనం చూస్తున్న MNC కంపెనీల 'ఆహార-వైద్య' మాయాజాలం అక్కడ పని చేయడం లేదు. బయటి ప్రపంచంలో MNC కంపెనీలు ఒక వైపు హోటళ్ల ద్వారా అమ్ముతున్న వారి రుచికరమైన, ప్రాణాంతకమైన ఆహారాలను అమ్ముతూ రోగాలను సృష్టిస్తుంటే, మరో వైపు అవే కంపెనీల పెట్టుబడులు ఉన్న ఆసుపత్రులు మందులు, సర్జరీలను అమ్ముతూ కోట్లు గడిస్తున్నాయి. కానీ రోసెటోలో పరిస్థితి వేరు. వారి ఆరోగ్య రహస్యం ఏ ఫార్మా కంపెనీ మందుల్లోనూ లేదు, ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేసే సర్జరీలోనూ లేదు. అది వారి 'సామాజిక ఐక్యత' (Social Bonding) లో ఉంది!

అక్కడ ఎవరూ ఒంటరిగా భోజనం చేయరు, మనుషుల మధ్య అహంకారాలు లేవు. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు మనస్ఫూర్తిగా పాలుపంచుకుంటారు. ప్రతి రోజూ ఏదో ఒక పండగే వారికి! ఒకరు వండుకున్నది మరొకరికి పెట్టి తింటారు. "నాకు ఏదైనా అయితే నా వెనుక నా ఊరంతా ఉంది" అనే అచంచలమైన భరోసా ఆ ఊరు వారిలో నిండుగా ఉంది. అదే వారిని జబ్బుల బారి నుండి కాపాడుతోంది.

మన పూర్వీకులు కూడా జబ్బును శరీరంలో కాకుండా మనసు మూలాల్లో వెతికారు. మనం కుందేళ్లలా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాం అనే దానికంటే, ఎంతమందితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వాం అనేదే మన ఆయుష్షును పెంచుతుంది.


రోసెటోపై కార్పొరేట్ దాడి - ఒక ఆత్మీయ వ్యవస్థ విధ్వంసం

1961లో రోసెటో రహస్యం బయటపడటమే ఒక సంచలనం. కానీ "మనుషులు కలిసి ఉంటే జబ్బులు రావు" అనే సత్యం గనుక ప్రపంచానికి తెలిస్తే, తమ వేల కోట్ల డాలర్ల మందుల వ్యాపారం, జంక్ ఫుడ్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని MNC కంపెనీలు గ్రహించాయి. అందుకే, ఆ సత్యం బయటకు వచ్చిన మరుసటి క్షణం నుంచే ఒక వ్యూహాత్మక యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఆత్మీయ బంధాల పై దాడి చేయడానికి సినిమా స్టార్లు, ఫేక్ సైకాలజిస్టులతో ఒక రకమైన 'సాంస్కృతిక యుద్ధం' (Cultural War) మొదలుపెట్టాయి.

ఆ కాలక్రమం (Timeline) మరియు కుట్రల వివరాలు ఇక్కడ చూడండి:

1964 జూన్ 8 - JAMA సంచలనం: అత్యంత ప్రతిష్టాత్మకమైన Journal of the American Medical Association (JAMA) లో ఈ పరిశోధన వివరాలు అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, ఫార్మా మరియు ఫుడ్ MNC కంపెనీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి మీడియాను అస్త్రంగా చేసుకున్నాయి. అప్పటికే అమెరికాలో ప్రాచుర్యం పొందుతున్న టీవీ మాధ్యమాన్ని వాడుకుని, ప్రముఖ సినిమా స్టార్లతో ఇంటర్వ్యూలు ఇప్పించారు. ఆ ఇంటర్వ్యూలలో వారు "మాకు ప్రైవసీ (Privacy) ముఖ్యం, ఒంటరిగా గడపడం వల్లనే మేము ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నాం" అని అబద్ధాలు చెప్పించారు. రోసెటోలో ఉన్న ఉమ్మడి భోజనాలు, వీధి కబుర్లను 'పాత కాలపు పద్ధతులు'గా, 'అనాగరికత'గా చిత్రించారు.


FDA ద్వారా కుట్ర: రోసెటో పరిశోధన వెలువడిన కొద్ది నెలలకే (అక్టోబర్ 1964), FDA (Food and Drug Administration) ద్వారా వంట నూనెలపై కొత్త నిబంధనలు తెచ్చాయి. రోసెటో ప్రజలు వాడే సహజమైన కొవ్వులు (Lard) ప్రాణాంతకమని, వారు తయారు చేసే పారిశ్రామిక నూనెలే శ్రేష్ఠమని ప్రచారం చేయించాయి.

ఫేక్ సైకాలజిస్టుల విశ్లేషణలు & భయం: కార్పొరేట్ కంపెనీలు కొందరు పేరున్న సైకాలజిస్టులను కొనుగోలు చేసి, పత్రికల్లో వ్యాసాలు రాయించాయి. "మనుషులు అతిగా కలవడం వల్ల మానసిక స్వేచ్ఛ హరించుకుపోతుంది, అది ఒత్తిడికి దారితీస్తుంది" అని తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆత్మీయతను 'సామాజిక భారం'గా (Social Burden) మార్చడానికి ప్రయత్నించారు. పెయిడ్ డాక్టర్ల ద్వారా "ఒకరిని ఒకరు తాకడం, కలిసి భోజనం చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయి" అని ప్రజలను భయపెట్టారు. ఆత్మీయత అనే 'మందు'ను అంటువ్యాధులకు 'కారణం'గా మార్చేశారు.

వ్యక్తిత్వవాదం (Individualism) అనే విషం: 1970ల నాటికి రోసెటోలోకి విలాసవంతమైన వస్తువులను, టీవీలను ప్రవేశపెట్టాయి. "మీకంటూ ఒక ప్రత్యేక గది, ప్రత్యేక కారు ఉంటేనే గౌరవం" అని నూరిపోశాయి. దీనివల్ల ప్రజల మధ్య పోటీ పెరిగి, ఒకరి ఇళ్ల మధ్య ఒకరు భౌతికమైన మరియు మానసికమైన 'కంచెలు' (Fences) నిర్మించుకోవడం మొదలుపెట్టారు.

విధ్వంసం - తుది అంకం

ఈ నిరంతర ప్రచార దాడి వల్ల రోసెటోలోని యువత మెల్లగా తమ పెద్దల నుండి, సంప్రదాయాల నుండి దూరమవ్వడం మొదలైంది. ఆత్మీయ బంధాల కంటే 'వ్యక్తిగత విలాసాలే' జీవితాల్లో ఎంతో గొప్పవనే ఫిలాసఫీలో, ఆ భ్రమలో పూర్తిగా పడిపోయారు. సామాజిక దూరం పెరిగింది, MNC కంపెనీల జంక్ ఫుడ్ ఇంట్లోకి వచ్చింది, ఆత్మీయత ఆవిరైపోయింది.

ఫలితంగా.. మొట్టమొదటి సారిగా, 1971వ సంవత్సరంలో, రోసెటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 55 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఆయన తన ఇంట్లో, తన వారి మధ్య కన్నుమూయలేదు. పక్కనే ఉన్న కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి, ఐసియులోని యంత్రాల మధ్య, ఒంటరిగా 1971, జూన్ 15 తేదీన తుది శ్వాస విడిచాడు. 

అదీ కార్పొరేట్ కంపెనీలు సాధించిన విజయం. ఇలా కార్పోరేట్ హాస్పటల్స్ ఎందరినో యంత్రాల మధ్య ఈనాటికీ హత్య చేస్తున్నాయి. ఇంట్లో చస్తే ఆ హాస్పటల్స్ వాళ్ళకి డబ్బులు రావు. ఈ విషయం మనకు అస్సలు అర్థమే కావడం లేదు. పైగా పరువు మర్యాదల పేరుతో లక్షలు తగలేసి మన సొంత వాళ్ళని మనమే చిత్రహింసల పాలు చేసి ఒంటరిగా ఆ యంత్రాల మధ్య అనాధల్ని చేసి దారుణ మరణాలకు గురిచేస్తున్నాం. ప్రస్థుతం మనం ప్రేమ ఉన్నదని అందరికీ చూపించుకోవడానికి ఎవరేమనుకుంటారో అనే సామాజిక రుగ్మతలో చిక్కుకుని మనకు ప్రేమ పంచి ఇచ్చిన వాళ్ళకు చిరి క్షణాల్లో నరకం చూపిస్తున్నాం అదీ బతికుండగానే.... హు.. 

ఇది వరకు ఇళ్ళల్లో వయసు ఉడిగిపోయాక మనందర్నీ చూస్తూ మాట్లాడుతూ హాయిగా పండులా రాలి చాలా సహజంగా సంతోషంగా ప్రకృతిలోకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు????

 ఇవన్నీ నగ్న సత్యాలు. ఒంటరిగా ఏకాంతంగా ఏ డాక్టర్నైనా అడగండి. ఇవి నిజాలో కాదో...

ఒకప్పటి దాకా భారతదేశంలో కూడా మనకు ఇలాంటి వ్యవస్థే ఉండేది. అమ్మో అమ్మమ్మో ఒక పెద్ద స్టీల్ బేసిన్ లో అందరికీ కలిపి అన్నం ముద్దలు కలిపి పెట్టడం, మనం తినడం గుర్తుందా?! అట్లతద్ది నాడు పొద్దున్నే పెరుగన్నం పెట్టడం, మనం పోటీలు పడుతూ తినడం, ఆడుకోమ్మని చెపితే బయటికి వెళ్ళడం, కచ్చికతో పుల్ల పెట్టి పళ్ళు తోముకోవడం.. ఇప్పుడు ఏమైపోయాయ్?!! అలా ఇప్పుడు ఎక్కడన్నా కనబడితే మనమే మనల్ని తక్కువగా చూస్తూ వెక్కిరించుకుంటున్నాం.

మనమీద మనకున్న నమ్మకాన్ని కార్పొరేట్ కంపెనీలు ఎలా విచ్చిన్నం చేస్తాయో, ఎలా వారి క్రిందికి తెచ్చుకుంటాయో అర్థమైంది అనుకుంటాను. మేల్కొనండి! మన ఆరోగ్యం మన ఆత్మీయతలోనే ఉంది.


- Dr. Gautham Kashyap PhD.,


ఆధారాలు (Proofs):

Evidence 1:

"The Roseto Effect" is a well-documented medical phenomenon. Dr. Stewart Wolf led a massive team of over 50 professionals, including physicians and sociologists, starting in 1961. Their findings were published in the book "The Roseto Story" (University of Oklahoma Press, 1979) and "The Power of Clan" (1993). They analyzed medical records dating back to 1895 to confirm that social cohesion was the primary driver of their health.

Source: The Roseto Story: An Anatomy of Health by Stewart Wolf and John G. Bruhn. Page No: 15-40 (Chapter: The Mystery of Roseto).

తెలుగు అనువాదం:

రోసెటో ప్రభావం (The Roseto Effect): డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ మరియు సోషియాలజిస్ట్ జాన్ బ్రున్ 1961 నుండి దాదాపు 30 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ నిజాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. వారు రాసిన "The Roseto Story" (యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా ప్రెస్, 1979) మరియు "The Power of Clan" (1993) పుస్తకాల్లో రోసెటో ప్రజల గుండె ఆరోగ్యం వారి ఆహారం వల్ల కాక, వారి మధ్య ఉన్న 'కుટુંంబ ఆత్మీయత' (Clan Power) వల్ల కలిగిందని నిరూపించారు.

ఆధారం: The Roseto Story: An Anatomy of Health - రచయితలు: స్టీవర్ట్ వోల్ఫ్ మరియు జాన్ జి. బ్రున్. పేజీ నంబర్: 15-40.

Evidence 2:

"Corporate interests in the late 1960s utilized 'Expert Bias' by hiring psychologists to promote individualism as a sign of progress. Television advertisements featuring celebrities equated health with consumer products and private lifestyles. This 'Social Engineering' was designed to break the communal bonds that the Roseto study had identified as life-saving. By labeling traditional closeness as 'unhygienic' and 'regressive', they successfully dismantled the social fabric by 1970."

Source: The Power of Clan: The Influence of Neighborliness on Health and Longevity by Stewart Wolf and John G. Bruhn. Page No: 140-155.

తెలుగు అనువాదం:

కృత్రిమ సామాజిక మార్పు: 1960 ల చివరలో కార్పొరేట్ శక్తులు 'నిపుణుల' ద్వారా వ్యక్తిత్వవాదాన్ని (Individualism) ప్రగతికి చిహ్నంగా ప్రచారం చేశాయి. టీవీ ప్రకటనలు మరియు సినిమా స్టార్లు విలాసవంతమైన వస్తువులనే ఆరోగ్యానికి మూలంగా చిత్రించాయి. రోసెటోలోని ఆత్మీయ బంధాలను 'అనాగరికత'గా, 'అపరిశుభ్రత'గా ముద్ర వేయడం ద్వారా, ఆ సామాజిక వ్యవస్థను 1970 నాటికి విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు. దీని ఫలితంగానే, 1960ల మధ్య వరకు అక్కడ వారికి బిపిలూ, షుగర్ లూ, పెరాలిసిస్ లూ, గుండెపోటు మరణాలు శూన్యంగా ఉన్న అదే రోసెటోలో.. సరికొత్త అమెరికన్ వినియోగదారీ సంస్కృతి వల్ల సామాజిక బంధాలు తెగిపోవడంతో, 1971లో మొదటిసారి ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా యంత్రాల మధ్య గుండెపోటుతో మరణించాడు.

ఆధారం: The Power of Clan - రచయితలు: స్టీవర్ట్ వోల్ఫ్,  జాన్ జి. బ్రున్. పేజీ నంబర్: 140-155.

Apr 15, 2026

గుత్తికొండ ధనుంజయకు దక్కిన పార్టీ అధిష్ఠానం పదవి

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన చంద్రబాబు 



గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పద్మశాలీ ప్రముఖులు, చేనేత కార్మిక నేత, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్  గుత్తికొండ ధనుంజయ రావును ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు.  టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ధనుంజయకు దక్కిన గౌరవంగా చేనేత వర్గం వారు భావిస్తున్నారు.  పార్టీ అధిష్ఠానవర్గం 26 మందిలో ధనుంజయకు స్థానం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి తను చేసిన సేవలను గుర్తించి తనని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, మంగళగిరి శాసనసభ్యులు, మంత్రి నారా లోకేష్ కు ధనుంజయ కృతజ్ఞతలు తెలిపారు. 

చేనేత రంగంలో కార్మికవర్గ నేతగా గుత్తికొండ ధనుంజయ రావు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధనుంజయ టీడీపీని వదలలేదు. అదే ఆయన ప్రత్యేక. ఎన్టీఆర్ పై అపార అభిమానం అతనిని పార్టీ వైపు మళ్లించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంటే  ఆపార గౌరవం. ఆయన విధానాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు ధనుంజయ ఆకర్షితులయ్యారు. చంద్రబాబు పరిపాలనాదక్షతకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తూ , బీసీలలో, చేనేత వర్గాల్లో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందుతున్నారు.  పదవుల కోసం ప్రాకులాడే మనిషి కాదు. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నా,  ప్రతిపక్షంలో ఉన్నా చేనేత సమస్యలపై పోరాడటం ఆయన నైజం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పథకాలు రావడానికి కృషి చేశారు. 


14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు అయినప్పటికీ సభ్యత్వం రెండు రూపాయలు కట్టి తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్రకి,  2014లో గంజి చిరంజీవికి,  2019లొ నారా లోకేష్ కి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. 2024 లో నారా లోకేష్ గెలుపు కోసం అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమిస్తున్నారు.  2006లో అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా,  రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు.  2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీవైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. 

2006లో మాదాల రాజేంద్ర  మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత ఆరోగ్య బీమా కార్డులు చేనేత కార్మికులకు ఇప్పించటంలో ధనుంజయ కృషి ఎంతో ఉంది.  బీమా కోసం కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని ఆనాడు రాజేంద్ర  చెల్లించారు.  దాదాపు 3,000 మంది చేనేత కుటుంబాలకు కార్డులు వరుసగా మూడు సంవత్సరాలు అందజేసి, వారికి అండగా నిలిచారు.  ఆ విధంగా  తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం తరఫున గుత్తికొండ ధనంజయరావు విశేష కృషి చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేకూర్చింది. ఇప్పటికీ చేనేత కుటుంబాల్లో మళ్లీ ఆరోగ్య భీమా కార్డులు కావాలని అడుగుతూ ఉంటారు.


అంతేకాకుండా, ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పద్మశాలి సంఘాల్లో పనిచేస్తూ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు.  చేనేత ఉద్యమాల్లో ముఖ్యంగా మంగళగిరి చేనేత కార్మికుల వేతనాలు పెంచే విషయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో కలిసి పోరాటం చేయటంలో ముందుంటారు.  2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన నిమ్మల కృష్ణప్ప నేతృత్వం లోని  రాష్ట్ర చేనేత విభాగం కమిటీలు ముఖ్య పాత్ర పోషించాయి.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి చేనేత సమస్యలపై చంద్రబాబుకు ఒక నివేది అందించారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలు అక్కడున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు, నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలో కూడా గుత్తికొండ ధనుంజయరావు ఉన్నారు.  రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ నివేదిక ఆధారంగానే 2014లో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వాటిలో కొన్ని సంక్షేమ పథకాలను, రాయితీలను చేనేత కార్మికులకు  అందించింది.


 చేనేత కులాల్లో, ముఖ్యంగా పద్మశాలీ కులంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తిరుపతి తిరుచానూరు అఖిలభారత పద్మశాలి అన్న సత్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా, మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా,  మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.


పార్టీ, చేనేత రంగంలోనే కాకుండా కళారంగంతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ నేతగానే కాకుండా  సామాజిక కార్యకర్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. మంగళగిరిలో టీడీపీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ధనుంజయే.  ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో సాహితీ కళా రంగాలకు ప్రాధాన్యత కొరబడింది. కళాభిమానులు, సాహితీ అభిమానులు, పెద్దలు మళ్లీ కళాసాహితీ రంగాలకు ప్రాణం పోయాలని తీర్మానం చేసి, గుత్తికొండ ధనుంజయరావుని  మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా ఎన్నుకున్నారు. అయిదేళ్ల క్రితం మంగళగిరి సాహితీ కళా వేదిక ఆవిర్భవించింది. దానికి కన్వీనర్ గా గుత్తికొండ ధనంజయరావు  కొనసాగుతున్నారు. ఈ కాలంలో సాహితీ కళా రంగాల వైభవాన్ని తీసుకురావటంలో ముందున్నారు.


1987 నుంచి 1991 వరకు మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన "అనియత విద్య" ద్వారా ధనుంజయరావు ఎంతోమంది పిల్లలకు విద్యను అందించారు. తరువాత శ్రామిక నగర్ లో ఒక అరుణోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందలాది మంది పిల్లలకు విద్యాబోధన చేశారు. 2000 సంవత్సరంలో స్థాపించిన అభయ సేవా సమితి ఉపాధ్యక్షులుగా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుకు కృషి చేశారు.  


గుత్తికొండ సీతారామయ్య, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ధనుంజయ రావు 1968 జూన్ 1వ తేదీన జన్మించారు. ధనుంజయ తోబుట్టువులు మొత్తం ఏడుగురు. ఆయన  ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు మంగళగిరి మూర్తి స్కూల్ లో చదివారు. ఆ తర్వాత చింతక్రిది కనకయ్య హైస్కూల్ లో 6వ తరగతి చదివారు.  వివిధ కారణాల వల్ల చదువు మానివేశారు. ఆ తర్వాత 1989లో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ మెట్రిక్ పరీక్ష రాసి పాసయ్యారు.  1990 మే 5న గుంటూరుకు చెందిన  కాకుమాను పాపయ్య, తేరోజమ్మల కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. వారికి  ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకీ వివాహలయ్యాయి.  పెద్ద కుమార్తె జయశ్రీ- పెద్దల్లుడు అలుగూరి శివ నాగరాజు, రెండవ కుమార్తె మౌనిక, -రెండవ అల్లుడు మునగపాటి భార్గవ్ సాయి, మూడో కుమార్తె సాయి లక్ష్మి – మూడోవ అల్లుడు అవ్వారు నవీన్. ప్రస్తుతం వివిధ హోదాలలో  గుత్తికొండ ధనుంజయరావు అటు పార్టీకి, ఇటు చేనేత,  కుల,  కళా, సాహితీ రంగాలలో  తనదైన ప్రతిభతో ప్రజా సేవ కొనసాగిస్తున్నారు.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Apr 2, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం


రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్‌మెంట్) బిల్-2026ని రాజ్యసభ గురువారం  ఆమోదించింది.  
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇది చారిత్రాత్మక దినం అని ఎన్డీఏ నేతలు అభివర్ణించారు. ఈ బిల్లుకు లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది.  రాజ్యసభ ఆమోదించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు.  పార్లమెంటులోని ఉభయసభలు ఆమోదించడంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి ఖరారైంది.  రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ విడుదలవడంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన మొత్తం 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. మిగిలిన 10 పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి.



అమరావతి... కీలక ఘట్టాలు




2014 జూన్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారింది.

2014 సెప్టెంబరు 1: గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేశారు.

2014 సెప్టెంబరు 3: గ్రీన్‌ ఫీల్డ్‌ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది.

2014 డిసెంబరు 8: రాజధానిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి సింగపూర్‌ సంస్థలతో ఒప్పందం.

2014 డిసెంబరు 30: సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

2015 జనవరి: రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభమైంది.

2015 మార్చి: 29 గ్రామాల్లో సుమారు 33 వేల ఎకరాల సమీకరణకు రైతుల అంగీకారం లభించింది.

2015 ఏప్రిల్‌ 23: రాజధాని నగరానికి అధికారికంగా అమరావతి పేరు పెట్టారు.

2015 జూలై 20: రాజధాని మాస్టర్‌ ప్లాన్లను సింగపూర్‌ బృందం ప్రభుత్వానికి అందజేసింది.

2015 అక్టోబరు 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చారు.

2016 ఫిబ్రవరి: మాస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ నోటిఫై చేశారు.

2016 జూన్‌: ఏపీ సచివాలయం, ప్రభుత్వ విభాగాలు అమరావతి ప్రాంతం నుంచి పనిచేయడం ప్రారంభం.

2018 డిసెంబరు: సచివాలయ టవర్స్‌కు శంకుస్థాపన.

2019 ఫిబ్రవరి: హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

2019 మే: వైసీపీ ప్రభుత్వంలో అమరావతిపై కుట్రలు ప్రారంభం.

2019 డిసెంబరు 17: వైసీపీ మూడు రాజధానుల ప్రకటన

2020 జూలై 31: సీఆర్‌డీఏ చట్టం రద్దు చేశారు. మూడు రాజధానుల బిల్లు పెట్టారు. శాసనమండలిలో టీడీపీ వ్యతిరేకించింది. అప్పటి మండలి చైర్మన్‌ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు.

2021 డిసెంబరు 13: న్యాయ వివాదాలతో మూడు రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం పునరుద్ధరణ.

2022 మార్చి 5: అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు.

2024 జూన్‌ 2: పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. హైదరాబాద్‌ తెలంగాణకు పరిమితమైంది.

2025 మే 2: ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభించారు.

2026 మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

2026 ఏప్రిల్‌ 1: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌విభజన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

2026 ఏప్రిల్‌ 2: సదరు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Apr 1, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం


అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఈరోజు(01.04.2026) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్: లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో మాట్లాడారు. అమరావతి రైతులకు, మహిళలకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. 

ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి:  అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతి కోసం రాజధాని రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారు.

ఎంపీ అప్పలనాయుడు:   రైతుల త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.  తండ్రికి బిడ్డతో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో, రైతుకు భూమితో కూడా అలాంటి బంధం ఉంటుంది.  సుమారు 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతుల త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.

వైసీపీ సభ్యులు వాక్‌అవుట్: అమరావతి అంశంపై లోక్ సభలో చర్చ జరుగే సమయంలో వైసీపీ సభ్యులు వాక్‌అవుట్ చేశారు. 

Mar 28, 2026

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్


మనసా వాచా కర్మణా మద్దతు 

గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది

భూములు ఇచ్చిన రైతులను హింసించింది

రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం 

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు 

మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది 

సరైన ప్రణాళిక లేకుండా విభజించారు 

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు 

అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది 

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ 


‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి. 

తెలుగు నేల అనే భావనే ఉండేది 

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.

భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు

2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది?  ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు

చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.

మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి..

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.

విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.

ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను”  అన్నారు.

కార్పోరేట్ ఎంఎన్‌సీ కంపెనీల కథ

నోటితో చెప్పలేక కళ్ళతో మొత్తుకుంటున్నా వినకుండా ఆ నరకాల్లో పడేసి  మన కన్నతల్లిదండ్రుల్ని మనమే అనాధల్ని చేసి ప్రేమ పేరుతో కర్కశంగా చంపాలా ?! ...