భవిష్యత్తులో తలెత్తే సమస్యలను, అవసరాలను ముందుగానే ఊహించగల దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పారిశుద్ధ్యంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు, ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా రూపు దిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా కార్పోరేషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యమే ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం. చెత్త పన్నుని రద్దు చేయడంతోపాటు చెత్త నుంచి కూడా ఆదాయం సమకూర్చే మార్గాలను గృహిణులకు ఈ ప్రభుత్వం చూపుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలతో రాష్ట్రంలో 2015లో ఈ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి దీనిని ప్రారంభించారు. వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, వ్యర్థాలను శుద్ధి చేయడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం, వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి అనేక కార్యక్రమాలను చేపడుతోంది. స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను తడిచెత్త, పొడిచెత్త, బయోమెడికల్ వేస్ట్... వంటి వివిధ రకాలుగా వేరుచేసి సమర్థవంతంగా నిర్వహించడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. సంపద సృష్టించేవిధంగా రాష్ట్రంలో పలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది. మునిసిపల్, పంచాయతీ సిబ్బందికి, ఆషా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే, వివిధ వ్యాపార సంస్థల అసోసియేషన్ల వారు, కళాకారులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల వారిని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
సీఎం చంద్రబాబు ప్రతి నెలలో ఒక రోజు పారిశుద్ధ్యానికి కేటాయింపు
ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన రాష్ట్రాంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి నెలలో ఒక రోజు(మూడవ శనివారం) ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్రకు కేటాయిస్తున్నారు. ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొంటూ, తానే చీపురు పట్టుకుని వీధులను శుభ్రంచేయడంతోపాటు పరిసరాలన్నిటినీ పరిశీలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్నారు. వారి వృత్తిలో తలెత్తే సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తున్నారు. సీఎం, కార్పొరేషన్ చైర్మన్ పాల్గొనడంతో, ప్రతి జిల్లాలో కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు కూడా పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.
గ్రీన్ ఏపీ లక్ష్యంగా
గ్రీన్ ఏపీ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులు, హరిత హైడ్రోజన్, పచ్చదనాన్ని పెంచడం, కాలుష్య నిర్మూలనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం ప్రధాన పాత్ర పోషించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్బన్, టెర్రెస్ గార్డెనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో తయారు చేసే వివిధ రకాల కంపోస్టింగ్ కి సంబంధించి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పచ్చదనం విస్తరిస్తోంది. ఈ పచ్చదనం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వాతావరణంలో వేడి తగ్గుతోంది.
పట్టాభిరామ్, అధికారుల బృందం వివిధ రాష్ట్రాలలో అధ్యయనం
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లక్ష్యాలను ఓ యజ్ఞంలా స్వీకరించి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టాభిరామ్ దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై, నవీ ముంబై, పూణే మెట్రోపాలిటన్ ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రం పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, కర్ణాటకలోని మంగళూరు, ఉడిపి, పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా, ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, తెలంగాణలోని సిద్ధిపేట.... వంటి నగరాలు, పట్టణాలలో పర్యటించి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆయా కార్పోరేషన్లలో ఇంటింటా చెత్త సేకరణ విధానం, తడిచెత్త, పొడి చెత్త వేరుచేయడం, తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలు, చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ టైల్స్ తయారీ విధానం, పట్టణంలోని మౌలిక సదుపాయాల నిర్వహణ...మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టాభిరామ్ తన వ్యక్తిగత యూరప్ పర్యటనలో కూడా పలు నగరాలలో పర్యటించి అక్కడ అవలంబించే పద్ధతులను అధ్యయనం చేశారు. డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్, స్విడ్జర్లాండ్.. మొదలైన దేశాలలో పర్యటించి వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ రీసైక్లింగ్... వంటి అంశాలను పరిశీలించారు. వారి పర్యటనలలో గ్రహించిన అంశాలను, మన రాష్ట్రంలో అమలు చేయదగినవాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
స్వచ్ఛ అవార్డులు ప్రకటించిన తొలి రాష్ట్రం ఏపీ
‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారి సేవలను గుర్తించి, అటువంటి వారిని గౌరవించి, ప్రోత్సహించే విధంగా గత అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. దేశంలో ఇటువంటి అవార్డులను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. స్వచ్ఛ చాంపియన్ పేరుతో ఈ అవార్డులను వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చా రు. మొత్తం అన్ని వర్గాల వారిని స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్(స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్), స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ హాస్పటల్స్, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ హోటల్స్, స్వచ్ఛ పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), స్వచ్ఛ వారియర్స్(శానిటేషన్ వర్కర్లు), స్వచ్ఛ గ్రామ పంచాయితీలు, స్వచ్ఛ గ్రామ సంస్థలు, స్వచ్ఛ అంగన్ వాడీలు, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ రైతుబజార్లు, స్వచ్ఛ పరిశ్రమలు(అతిపెద్ద, పెద్ద), స్వచ్ఛ ఎన్జీవోస్(స్వచ్ఛంద సంస్థలు)/పౌర సంస్థలు, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ అని 12 కేటగిరీలుగా విభజించి ఈ అవార్డులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 రాష్ట్ర స్థాయి, 1,421 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చారు. పారిశుద్ధ్యం పర్యావరణ పట్ల ఆసక్తి ఉన్నవారిలో ఈ అవార్డులు ఉత్సాహం నింపాయి.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలు
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత మునిసిపల్ కార్యాలయాలుగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. తొలుత అమరావతిలోని ఏపీ సెక్రెటేరియేట్ నుంచి మొదలు పెట్టారు. గత ఆగస్టు 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించారు. వాటి స్థానంలో స్టీల్, గాజు బాటిళ్లను వాడుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఉద్యోగికి ఉచితంగా స్టీల్ బాటిళ్లు అందజేశారు. సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ కూడా లభించింది. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా మార్చేశారు. తొలుత అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లోని 20 జిల్లాల్లో 62 మునిసిపల్ కార్యాలయాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కూడా రోజుకు 15 నుంచి 18 గంటలు పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటించడంతోపాటు అధికారులు, ఏజన్సీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, అందరూ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యే విధంగా ఉత్సాహపరుస్తున్నారు.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914








