Mar 3, 2026

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్


ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు పడకండి. ఇక్కడ ఇజం అంటే సాహితీ సేవనం, విమర్శ, ముఖ పుస్తక సాహితీ ప్రక్రియ. ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ కంటపడిన ఏ పుస్తకమైనా,  పురాతన భవనమైనా, మరేదైనా వాటికి సాహితీ తీగ అల్లుకుంటుంది. వాటి లోతులకు వెళ్లి, అంతగా పెనవేసుకుపోతారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలం నంది వెలుగు గ్రామంలోని వందేళ్లనాటి పచ్చి పులుసు వారి మేడ గురించి కూడా చాలా అద్భుతంగా  రాశారు.  ఫేస్ బుక్ వేదికగా ‘కాఫీ విత్’ శీర్షికన  ఇప్పటి వరకు 3123  విమర్శలు, విశ్లేషణలు రాసిన సాహితీ దిగ్గజం రజా హుస్సేన్.  తెలుగు సాహిత్యంలో ఇదో రికార్డ్.  పాత, కొత్త అనే భేదంలేకుండా తెలుగు సాహిత్యంలో కాకలుతీరిన పురాతన కవుల దగ్గర నుంచి వర్ధమాన కవుల‌ వరకు, వారి కవిత్వ సమగ్ర విశ్లేషణే ఈ శీర్షిక ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియాలో సాహితీ లోకం మొత్తాన్ని ఇప్పుడు అమితంగా ఆకర్షిస్తున్న శీర్షిక ఇది. ఈ శీర్షికే  కాకుండా, చిత్రకళా పరిమళం పేరుతో మరో 400 ఎపిసోడ్స్ రాశారు.  ఇంకా అనేక శీర్షికలతో  పుంఖానుపుంఖాలుగా పలు అంశాలపై విమర్శలు, విశ్లేషణలు చేశారు. రాస్తున్నారు. ఇలా నిరంతరం అంటే, రాత్రి, పగలు  సాహితీ సేద్యం చేయడమే ఆయనకు  అత్యంత ఇష్టమైన పని.  రచనా వ్యాసంగంలో స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న ఆయన చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, అందులోని  ఫేస్ బుక్ లో ఇబ్బడిముబ్బడిగా సాహిత్యం పండిస్తారు.  కవులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు.... ఇలా అనేక రంగాల వారి గురించి, వారి సాహిత్య, కళా నైపుణ్యాల గురించి విశ్లేషించారు.  ఇలా ఎన్నో వేల మంది గురించి రాసిన విమర్శకుడు రజా హుస్సేన్. తెలుగు సాహిత్యానికి ఇంత సేవచేస్తున్నవారు ప్రస్తుతానికి మరొకరులేరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి  కాదు. 

‘కాఫీ విత్’ శీర్షికన రాసిన కవుల గురించి ఒక్కో పుస్తకం తీసుకురావలన్న సంకల్పంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ ప్రగతిశీల కవి గోలి మధు కవిత్వ విశ్లేషణతో  ఈ సీరీస్ ను  మొదలు పెట్టారు.  రచయిత హుస్సేన్ స్వగ్రామానికి చెందినవాడు కావడం వల్ల మధుకు ఆ అదృష్టం పట్టింది. 20 ఏళ్ల క్రితమే సరదాగా కవిత్వం రాయడం మొదలుపెట్టిన గోలి మధు, మూడునాలుగేళ్ల నుంచి మాత్రమే సీరియస్ గా రాస్తున్నారు. తల్లి గోలి పార్వతి నుంచి వారసత్వంగా మధుకు కవిత్వం రాయడం అబ్బింది. కళ్ల  ముందు అన్యాయం జరిగితే సహించలేడు. కళ్లెర్రచేసి మరీ కవిత్వం రాయగల ఘటికుడు గోలి మధు అన్నది రజా హుస్సేన్ అభిప్రాయం.  

ఇప్పటి వరకు మధు రాసిన భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021),  గమనం(2021),  సంఘర్షణ (2023), ఎదురీత(2025) అనే ఆరు పుస్తకాలు వచ్చాయి. తొలినాళ్లలోనే అభ్యుదయ భావాలతో మధు కవిత్వంలోకి అడుగుపెట్టాడు.  చేనేత సామాజిక వర్గం నేపథ్యం కలిగిన కవి మధు చేనేతకారుల ఈతిబాధలు, వారి బతుకుల్లో కష్టాలు, నష్టాల చిక్కులు తీయాలనే ప్రయత్నం ‘నవశకం’ కవితా సంపుటిలో కనిపిస్తుంది. కవిగా మధు రెక్కలు తొడుగుతున్న దశలో సామాజిక స్పృహతో రాసిన కవితలు   ‘గమనం’ సంపుటిలో ఉన్నాయి.  ఎవరి పక్షాన నిలిచాడో చెప్పాడు.  అన్నదాత రైతు పక్షాన రాసిన ‘రైతు సమరభేరి’  ఇప్పటికే రెండు ముద్రణలు జరగడం విశేషం.  ఢిల్లీ ఉద్యమ నేపథ్యంలో రైతు సమస్యను కేంద్రంగా చేసుకుని రాసిన కవిత్వం  ‘సంఘర్షణ’ అని రజా హుస్సేన్ పేర్కొన్నారు. 

కడుపు తీపి, కాలచక్రం, ప్రేమఖైది, జ్ఞాన నేత్రం, కర్తవ్యం, నాలోనీవు, మౌనం ... వంటి పలు కవితలను రజా హుస్సేన్ తనదైన స్టైల్లో విశ్లేషించారు. రైతులు, చేనేత కార్మికుల వెతలు, మణిపూర్ లో నగ్నకవాతు, పత్రికల తీరు, బౌద్ధం మొదలు కొని ప్రేమ కవిత్వం వరకు మధు రాసిన అనేక కవితలపై చాలా లోతుగా రాసిన విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తంగా మధుని ఆవిష్కరించిన పుస్తకం ఇది. ఏది రాసినా ఆసక్తిగా చదివించే శక్తి రజా హుస్సేన్ కలానికి ఉంది. అదే ఆయన ప్రత్యేకత. రజా హుస్సేన్ రచనలను భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీలు, సాహితీ సంస్థలు భద్రపరచవలసిన అవసరం ఉంది. 


కాఫీ విత్ గోలి మధు పుస్తకం వెల : రూ.100

పుస్తకాల కోసం సెల్: 9063167117

పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 28, 2026

ఆయేషా మీరా హత్య కేసులో అన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే!

మృత దేహాం అవశేషాలకు అంత్యక్రియలతో పూర్తిగా ముగిసిపోయిన కేసు

ఆయేషా మీరా మృత దేహాం అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆమె హత్య కేసు పూర్తిగా ముగిసిపోయినట్లు భావించవచ్చు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో 2007, డిసెంబరు 27 అర్ధరాత్రి జరిగిన ఆయేషా మీరా హత్యకేసులో సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. తెనాలికి చెందిన ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతూ హత్యకు గురైన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో ట్విస్ట్ లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరికి దోషిని కనిపెడతారు. అయితే, ఈ కేసు విచారణ 18 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన తర్వాత కూడా దోషులను కనిపెట్టకుండానే ఈ కేసుని విజయవాడ సీబీఐ కోర్టు ఈ నెల 20న మూసివేసింది. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ సమర్పించిన తుది నివేదిక ఆధారంగా ఈ కేసు మూసివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. రెండోసారి పోస్టుమార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా మృతదేహానికి సంబంధించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీన ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్, ప్రభుత్వ భద్రతతో తెనాలిలోని ఖబరస్తాన్ లో అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం తెనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. దీంతో, ఈ కేసు ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఆయేషా తల్లి శంషాద్ బేగం, తండ్రి ఇగ్బాల్ బాషాల పోరాటం ఫలించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 18 ఏళ్లు పోరాటం చేసి అలిసిపోయామని, ఇక పోరాటం చేసే శక్తి గానీ, ప్రొటెస్ట్ పిటిషన్ వేసే ఆర్థిక స్థోమత గాని తమకు లేవని ఆయేషా తల్లి కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు. వేడుకోని నాయకులు లేరు.

ఆయేషా హత్య జరిగిన వెంటనే దోషులు, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. అందులో వారు విజయం సాధించారు. రాజకీయాలు, కులం, డబ్బు, అధికారం.... వంటి అంశాల ప్రభావంతో దోషులు ఎవరో తేలకుండానే ఈ కేసుని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు ఇలా నీరుకారిపోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని న్యాయనిపుణులు తేల్చారు.
ఆయేషా హత్య జరిగిన తర్వాత తెల్లారిపాటికే అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా దోషులు ముందు జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా, పోలీసులు కూడా దోషులకు పూర్తిగా సహకరించారన్న ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. పైగా కొత్త ఆధారాలు సృష్టించారు. పోలీసులు ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతీ మీద ‘చిరుత 143’ అని, పొట్ట మీద లవ్ సింబల్ రాసి ఉంది. అక్కడే లభించిన ఓ లెటర్‌లో, ‘‘నన్ను ప్రేమించమని బతిమిలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసి ఉంది.
ఈ కేసులో పోలీసులు మొదట హాస్టల్ వంటమనిషిని అనుమానించి, విచారించారు. అతను కాదని తేలింది. తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు, జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింఘ్, గుర్విందర్ సింఘ్ అలియాస్ లడ్డూలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేశారు. అయితే, వారి అందరి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో వారిని విడుదల చేశారు. ఒకానొక సందర్భంలో ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కూడా పోలీసులు అనుమానించారు. చివరకు ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, అనాసాగర గ్రామానికి చెందిన పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొని, 2008 ఆగస్టు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి పద్ధతిలో అతనే ఆయేషాని హత్య చేసినట్లు ఒప్పించారు. సత్యంబాబుని 2010లో విజయవాడ మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతను వాస్తవం చెప్పాడు. తాను హత్య చేయలేదని, పోలీసులే తనచేత అలా చెప్పించారని కోర్టుకు తెలిపాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారం సత్యంబాబుని నేరస్తునిగా పేర్కొంటూ, మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నేరస్థుడు కాదని, ఓ మాజీ మంత్రి మనవడే అసలు నేరస్థుడని ఆయేషా తల్లి శంషాద్ బేగం తొలి నుంచి మొత్తుకుంటోంది. హాస్టల్ లోని ముగ్గురు అమ్మాయిలు బయటి వ్యక్తులతో ఉండటం చూసినందుకే ఆయేషాని హత్యచేశారని తల్లిదండ్రుల ఆరోపణ. వారి మాటలు వినే పరిస్థితులు లేవు. సత్యంబాబు బంధువులు హైకోర్టుని ఆశ్రయించారు. బొజ్జా తారకం వంటి వారు కోర్టులో సత్యంబాబు తరఫున వాదించారు. 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబు నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారని చెప్పడానికి తగిన ఆధారాలను పోలీసులు చూపలేకపోయారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఆ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు2018 జనవరి 27న హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయమని 2018 నవంబరు 29న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికే దిగువ కోర్టులో ఆధారాలు ధ్వంసం చేశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో, 2014లోనే విజయవాడ కోర్టులో ఈ కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు ముందే అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్లే జరిగింది. సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసుని 2018 డిసెంబరు 16న సీబీఐకి అప్పగించారు. ఆయేషా మృతదేహాన్ని సీబీఐ రీపోస్ట్ మార్టం చేసి, కొత్త ఆధారాలు ఏమీ దొరకలేదని కోర్టుకు తెలపడంతో కోర్టు కేసుని మూసివేసింది.
ఈ నేపథ్యంలో శంషాద్ బేగం వంటి పేద కుటుంబాలకు న్యాయం లభించే అవకాశం లేదా? స్థితిముంతులైతే రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు అండతో తప్పించుకోగలుగుతారా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వారు ఎలా తప్పించుకోగలిగారు? న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయాయా? శంషాద్ బేగం కుటుంబానికి ఏ రకంగానూ న్యాయం దక్కదా? హత్య జరిగిన నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ బదిలీ తర్వాత కేసు మొత్తం ఎలా తారుమారైంది? హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే, అయిదు నిమిషాల్లో కేసులోని నిజానిజాలు వెల్లడవుతాయని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆనాడే చెప్పారు. ఆమె చేత పోలీసులు ఎందుకు నిజం చెప్పించలేకపోయారు? హాస్టల్లో కొందరి రాసలీలలు చూసిందనే తన కుమార్తెని హత్య చేశారని శంషాద్ బేగం చెప్పారు. ఆ రాసలీలలు ఎవరి మధ్య జరిగాయో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? తెల్లారేపాటికి సాక్ష్యాలను ఎవరు మాయం చేశారు? పోలీసులు తెలుసుకోలేకపోయారా? ఈ కేసుకు సంబంధించిన రికార్డులు కోర్టులోనే ఎవరు ధ్వంసం చేశారు? ఎందుకు చేశారు? అంతటి తీవ్రమైన నేరాన్ని చేసినవారిని ఇంకా కనుగొనలేదా? వారిని తెలుసుకుని శిక్షించరా? సత్యంబాబు చేయని నేరానికి 8 ఏళ్లు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదల అయ్యాడు. హైకోర్టు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇవ్వమని తీర్పు ఇచ్చింది. సత్యంబాబు అన్యాయంగా 8 ఏళ్లు శిక్ష అనుభవించడానికి బాధ్యులు ఎవరు? సత్యంబాబు చేయని నేరం అంగీకరించే విధంగా పోలీసులు ఎందుకు చేశారు? అలా చేసిన వారికి శిక్ష ఏమీ లేదా? 8 ఏళ్ల జైలు శిక్షకు నష్ట పరిహారం లక్ష రూపాయలు ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. ఇది న్యాయమేనా? అతను అన్యాయంగా శిక్ష అనుభవించినందుకు, జైల్లో అతను, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అనుభవించిన మనోవేదనకు, బాధలకు, అతని జీవితంలో 8 ఏళ్లు వృధా అయినందుకు, అతనికి నష్టపరిహారం ఇదా? అసలు హంతకులు ఎవరు? ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలన్నిటీకీ సమాధానాలు లేవు. హత్య మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. అసలు హంతకులను కనిపెట్టలేని దయనీయ స్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా?. లేదా ఆ దోషులు తమకు అనుకూలంగా వాడుకునే స్థితిలో వ్యవస్థలు ఉన్నాయా?. చివరిగా ‘‘ఈ నెల 27న తమ కుమార్తె శరీర భాగాలతో పాటు సత్యం, న్యాయం, ధర్మాన్ని కూడా పూడ్చిపెట్టబోతున్నాం’’ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎంతో బాధతో చెప్పారు. న్యాయం కోసం పోరాడి, వేసారిపోయిన తల్లిదండ్రులు ఆయేషా మీరా పేరుతో ఒక విద్యా సంస్థని నెలకొల్పమని, ఇటువంటి బాధితులకు సహాయపడే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్ధాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 22, 2026

మంగళగిరిలో చేనేత కులాల గర్జన

నేడు మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ


దేశంలో వ్యవసాయ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే చేనేత రంగం నేడు దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ హామీలు సరైన రీతిలో అమలు కాకపోవడంతో రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత సంఘాలన్నీ ఏకమై ‘చలో మంగళగిరి’ పిలుపును ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘చేనేత గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. సమస్త చేనేత కులాల వారు ఏకంకండి అని పిలుపునిచ్చాయి. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలన్న సంకల్పంతో చేనేత కార్మికులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రి సమీపంలోని వై జంక్షన్ వద్ద చేనేత సర్కిల్ వరకు మహా ప్రదర్శన నిర్వహించి, అక్కడే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ‘చేనేత గర్జన’ విజయవంతం చేసేందుకు వివిధ చేనేత సంఘాల నేతలు నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ చేనేత కులాలకు చెందిన చేనేత కార్మికులను ఏకం చేశారు. ఉద్యమబాట పట్టించారు. ప్రభుత్వాల మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడంలేదన్నది వారి బాధ. శాసనసభల్లో తమకు తగిన ప్రాధాన్యత లేదన్నది వారి ఆవేదన.
రాష్ట్రంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీరక్షత్రియ, స్వకులశాలి, కుర్హీనసెట్టి (కుర్ణి)(నెస్సి), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు,కరికాల భక్తులు, సాధనాసూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ మొత్తం 18 చేనేత కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవి అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇన్ని చేనేత కులాల నుంచి శాసనసభలో కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, శాసనమండలిలో విజయవాడ నుంచి పంచుమర్తి అనురాధ ఇద్దరు మాత్రమే ఉన్నారు.
రాజకీయ ప్రాధాన్యత అలా ఉంటే, వృత్తిపరంగా చేనేతకు సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాల వంటి అనేక సమస్యలు ఉన్నాయి. చేనేతకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదన్నది వారి ఆరోపణ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులు అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండ్. నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రం తెలియకపోవడం వల్ల కూడా వారి సమస్యలు పరిష్కారం కావడంలేదన్న భావన ఉంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించగల గల నేతలు ఎదిగి, శాసనసభలకు ఎన్నిక కావలసి ఉంది. చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు మాచాని సోమప్ప, ప్రగడ కోటయ్య, పుచ్చల సత్యనారాయణ, కుండా రామయ్య, అగిశం వీరప్ప, దామర్ల రమాకాంతరావు, గోలి వీరాంజనేయులు వంటివారు మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది.
చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది ఉన్నా ఒక్క మంత్రి పదవి కూడా లేదు. చేనేత మంత్రిత్వ శాఖ ఈ వృత్తి గురించి తెలియని, మరో కులం వారు నిర్వహించడం వల్ల వారికి చేనేత సమస్యలపై అవగాహన ఉండదు. నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది.
రాజకీయపరమైన, వృత్తి పరమైన అన్ని సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఈ చేనేత గర్జన నిర్వహించనున్నారు.
‘చేనేత గర్జన’ డిమాండ్లు
1. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ల కేటాయింపుల్లో చేనేతకు న్యాయం చేయాలి.
2.జౌళి పరిశ్రమకు అనుకూల, చేనేత వ్యతిరేక విధానాలలో మార్పు రావాలి.
3.ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ రక్షణకు, కార్మికుల జీవనానికీ, మనుగడకూ తోడ్పడే నిర్ణయాలు తీసుకోవాలి.
4.చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి.
5. కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి.
6. చేనేత కార్మికులతోపాటు చేనేత ఉప వృత్తులు చేసుకునే కార్మికులందరికీ ప్రతి సంవత్సరం రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలి.
7. అర్హులైన అందరికీ పెన్షన్ మంజూరు చేయాలి.
8. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
9. చేనేత సహకార సంగా రుణాలు రద్దు చేయాలి.
10.చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ రేట్లకు సప్లై చేయాలి.
11. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి.
12. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి.
13. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో నేత కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహకారం అందించాలి.
14.ఆత్మహత్యలు, ఆకలి చావులతో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
15. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందించే పథకాన్ని వెంటనే అమలుపరచాలి.
16. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి.
17. చేనేత సహకార సంఘాల పాలక వర్గాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
18. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్లు భూమి ఇచ్చి, అందులో వర్క్‌ షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 18, 2026

ప్రశ్నించే పాత్రికేయమే సత్యాన్వేషణ

బండారు రాధాకృష్ణ వ్యాసాలపై సమీక్ష


జర్నలిస్ట్ కు సామాజిక స్పృహ ఉండాలి. దానికి నూరు శాతం న్యాయం చేశారు ప్రముఖ నటుడు, విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ బండారు రాధాకృష్ణ. వృత్తి ధర్మానికి కట్టుబడిన వ్యక్తి. 86 ఏళ్ల వయసులో కూడా సామాజిక చైతన్యంతో విధంగా వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంతోపాటు విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి శుక్రవారం ‘వివేచన’ పేరుతో ఓ కాలం కూడా నిర్వహిస్తున్నారు. వయసు మీదపడుతున్నా, సడలని దృఢత్వంతో, సామాజిక బాధ్యతతో, ముఢనమ్మకాలకు వ్యతిరేకంగా, యువతని మేల్కొలిపే విధంగా ఎంతో చురుకుగా తన రచనలు కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు పుణికిపుచ్చుకున్న రాధాకృష్ణ మంచి నటుడు. 50కి పైగా నాటకాలలో నటించారు. లంబాడీ రాందాసు అనే నాటకాన్ని ఆటపాటి లక్ష్మి హీరోయిన్ గా 50 చోట్ల ప్రదర్శించారు. 26 ఏళ్లకుపైగా ఈనాడు విలేకరిగా పనిచేసిన రాధాకృష్ణ 65 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ చదివి, సింగరేణి కాలరీస్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే కమ్మూనిస్టు కార్మిక సంఘాలతో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే కమ్మూనిస్టు నేతలతో పరిచయాలు. కమ్యూనిస్టు భావజాలంతో ఎరుపెక్కిన ఆయన కలానికి ఇప్పటికీ పవర్ తగ్గలేదు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా రాసేవారో, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే స్పందన, అదే రాత. అదే ఆయన ప్రత్యేకత. 2020 నుంచి 2025 వరకు ఆయన రాసిన 50 వ్యాసాల సంపుటిని ఇటీవల విజయవాడలో ఆవిష్కరించారు. పాఠకులను ఆకట్టుకునే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో తన వ్యాసాలను బావా బావా అనుకునే రెండు పాత్రలతో మొదలు పెట్టి సమకాలీన సమాజంలో జరిగే, జరుగుతున్న అనేక అంశాల లోతులకు వెళతారు. మనిషికి తలెత్తే అనేక ప్రశ్నలు ‘సత్యాన్వేషణ’లో ఉన్నాయి. 172 పేజీల ఈ వ్యాస సంపుటిలో పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉన్నాయి.
గుడి-బడి అనే వ్యాసంలో ఈ సమాజంలోని మనుషులకు గుడులమీద ఉన్న శ్రద్ధ బడులపై లేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి, యువత ఆలోచనను వ్యవసాయంవైపు మళ్లించాలన్నది ఆయన ఆకాంక్ష. శివం శవం అనే వ్యాసంలో తాము సృష్టించిన దేవుడే అంతా చేస్తారన్న భావనను మనుషులందరిలోకి మత పెద్దలు చొప్పించారని, దాంతో, తాము నిమిత్తమాత్రులం, నిస్సహాయులం అన్న దోరణిలో మనుషులున్నారన్న బాధ వ్యక్తం చేశారు. తనకు తెలియనివాడు మరణించినా, ఆ మృతదేహం వద్దకు వెళ్లి చూస్తే చాలు, ఇంటికి వెళ్లి స్నానం చేసే స్థితిలో మనిషి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తారు. తత్వం లక్ష్యం సత్యాన్వేషణ అని, మతం లక్ష్యం అసత్యంపై విశ్వాసం కలిగి ఉండటం అని తెలిపారు. మనిషిని మతానికి బానిసగా మారుస్తున్న వ్యవస్థపై రచయితలు అక్షరాన్ని సంధించాలని పిలుపు ఇచ్చారు రాధాకృష్ణ.
ఒకప్పుడు ఆంగ్లేయులను తరిమికొట్టిన అక్షరం, నేడు రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోతుంది, కాదు ఉరితీయబడుతోందని ఆవేశంగా చెప్పారు. మరో వ్యాసంలో అక్షరం ఆయుధం కన్నా గొప్పదని, కోట్ల మందిని చైతన్యపరుస్తుందని, ప్రభుత్వాలను సైతం పడగొడుతుందన్నారు. కళలన్నిటిలోకి దృశ్య కావ్యం మనిషి మనసుని తాకి, మార్పుకు నాంది పలుకుతుందని ఇంకో వ్యాసంలో చెప్పారు. ఇందులో నాటక రంగ చరిత్రని సంక్షిప్తీకరించారు. ప్రశ్నించకపోతే నిజం బయటపడదు. కానీ, నేడు ప్రశ్నించిన మనిషి జైలులో ఉంటున్నాడని చెప్పారు. సామాజిక స్పృహతో సమాజం కోసం నినదించిన, 90శాతం వైకల్యం ఉన్న
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలులోనే మగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరహక్కులు హరించుకుపోతుంటే, నిద్రపోతున్న మానవాళిని మేల్కొలపవలసిన అగత్యం ఏర్పడిందన్న బాధ్య వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన మనుస్మృతిని అంబేద్కర్ బహిరంగంగా దహనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత ఆలోచించకుండా, గుడ్డిగా నాయకులను అనుసరించడమే దేశ అభివృద్ధి మందగమనానికి కారణం అని తేల్చిచెప్పారు. 80 శాతం మంది పార్లమెంట్ సభ్యులు కుబేరులుగా ఉన్న మన దేశం ప్రజాస్వామ్యం దేశం కాదని, ధనిక స్వామ్యదేశం అని పేర్కొన్నారు.
కమ్యూనిస్టు ఉద్ధండులైన పుచ్చలపల్లి సుందరయ్య, ఏకె గోపాలన్, నంబూద్రిపాద్, జ్యోతిబసు, ప్రమోద్ దాస్ గుప్త, రణదివే, పి.రామమూర్తిలతోపాటు రావిపూడి వెంకటాద్రి, కొంగర జగ్గయ్య, రామోజీరావు, ఎన్టీ రామారావు... వంటి వారి పరిచయం, విరసంతో అనుబంధం కలిగి ఉండటంతో ఆయన అనుభవాల సారాంశం ఈ వ్యాసాలలో కనిపిస్తాయి. అది ఇదనేమీలేదు, జీవితానికి, సమాజానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆయన వ్యాసాలు రాశారు. ప్రాథమికంగా మనిషి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్న తపన రాధాకృష్ణ వ్యాసాలలో కనిపిస్తుంది.
సత్యాన్వేషణ పుస్తకం వెల : రూ.160
పుస్తకాల కోసం సెల్: 9390686100
పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jan 25, 2026

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23


ఓటర్లకు సూచనలు

1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఇరవై మూడు మంది సభ్యులలో, కనీసం పన్నెండు మంది సభ్యులు రాష్ట్ర రోల్‌లో న్యాయవాదులుగా కనీసం 10 సంవత్సరాల ప్రాక్టీస్ చేసిన వారై ఉండాలి. బ్యాలెట్ పేపర్‌పై ఉన్న [*] గుర్తు, ఆ అభ్యర్థులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం రాష్ట్ర రోల్‌లో ఉన్నారని సూచిస్తుంది.


2. ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిన వెంటనే, అతను/ఆమె పోలింగ్ అధికారి వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో సంతకం చేసి, వెంటనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, ఎవరూ చూడకుండా రహస్యంగా తన ప్రాధాన్యతను నమోదు చేయాలి.


3. తెలంగాణ బార్ కౌన్సిల్ లేదా సంబంధిత బార్ అసోసియేషన్లు జారీ చేసిన అసలు గుర్తింపు కార్డును చూపించిన తర్వాతే ఓటరుకు బ్యాలెట్ పేపర్ ఇవ్వబడుతుంది.


4. ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి ఎలాంటి సెల్ ఫోన్లు లేదా కెమెరాలను తీసుకురాకూడదు మరియు ఏదైనా ఓటరు అటువంటి పరికరాలను తీసుకువస్తే, వారు వాటిని పోలింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేసి, ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకోవాలి.


5. ఓటరు ఎలాంటి దుష్ప్రవర్తన, నకిలీ వేషధారణ లేదా హింసకు పాల్పడకూడదు, పాల్పడితే చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది.


6. ఓటరు తన ఓటు వేసేటప్పుడు: -


(ఎ) ఒక ఓటరు తన మొదటి ప్రాధాన్యత అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటే; అతను/ఆమె బ్యాలెట్ పేపర్‌లోని అదే కాలమ్‌లో అభ్యర్థి పేరుకు ఎదురుగా పెన్‌తో "ఒకటి" అని అక్షరాలలో రాయాలి. అదేవిధంగా, రెండవ ప్రాధాన్యత అభ్యర్థి పేరుకు ఎదురుగా "రెండు" అని అక్షరాలలో రాయాలి. మూడవ ప్రాధాన్యత అభ్యర్థికి ఎదురుగా "మూడు" అని అక్షరాలలో రాయాలి.


నాల్గవ ప్రాధాన్యత అభ్యర్థికి ఎదురుగా "నాలుగు" అని అక్షరాలలో మరియు ఐదవ ప్రాధాన్యత అభ్యర్థికి ఎదురుగా పైన పేర్కొన్న విధంగా "ఐదు" అని అక్షరాలలో రాయాలి.

(సి) ప్రతి ఓటరు బ్యాలెట్ పత్రంలో తప్పనిసరిగా కనీసం (5) ప్రాధాన్యతలను ఉపయోగించాలి, అలా చేయని పక్షంలో ఓటు చెల్లనిదిగా పరిగణించబడుతుంది.


(డి) ఓటరు కేటాయించిన బూత్‌కు వెళ్లి, బ్యాలెట్ పత్రాన్ని తెరిచి, పోలింగ్ బూత్‌లోని టేబుల్‌పై ఉంచి, పోలింగ్ బూత్‌లో అందుబాటులో ఉన్న పెన్‌తో పదాలలో వ్రాస్తూ, కనీసం "1 నుండి 5" వరకు మరియు గరిష్టంగా 23 వరకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి.


(ఇ) బ్యాలెట్ పత్రంపై ప్రాధాన్యతలను నమోదు చేసిన తర్వాత, పోలింగ్ అధికారి చూపించిన విధంగా ఓటరు దానిని మడవాలి.


(ఎఫ్) బ్యాలెట్ పత్రాన్ని మడవడం పూర్తి చేసిన తర్వాత, ఓటరు బ్యాలెట్ పెట్టె వద్దకు వెళ్లి పోలింగ్ అధికారి లేదా అతని అధీకృత వ్యక్తి సమక్షంలో బ్యాలెట్ పత్రాన్ని పెట్టెలో వేయాలి.


(జి) బ్యాలెట్ పత్రంలో కనీసం 5 ప్రాధాన్యతల గుర్తులు లేకపోతే, అటువంటి బ్యాలెట్ పత్రం చెల్లనిదిగా పరిగణించబడుతుంది మరియు చెల్లుబాటు అయ్యే ఓట్ల లెక్కింపులో చేర్చబడదు.


7. పోలింగ్ కేంద్రంలో ఇద్దరి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లయితే, వారు క్యూలో నిలబడాలి.


8. ఓటరు "ఒకటి" "రెండు" "మూడు" "నాలుగు" "ఐదు" మొదలైన పదాలకు బదులుగా 1, 2, 3, 4, 5 వంటి సంఖ్యలను వ్రాస్తే బ్యాలెట్ పత్రం చెల్లనిదిగా పరిగణించబడుతుంది.


9. బ్యాలెట్ పత్రంపై సంతకం చేయకూడదు, ఎలాంటి గుర్తింపు గుర్తులు లేదా ఇతర గీతలు లేదా గుర్తులు, చెరిపివేతలు, తుడిచివేతలు లేదా మార్పులు చేయకూడదు, అలా చేస్తే బ్యాలెట్ పత్రం పాడైపోయినట్లుగా పరిగణించబడుతుంది మరియు దాని ద్వారా వేసినట్లుగా భావించే ఏ ఓటు కూడా ఎన్నికల ప్రయోజనం కోసం పరిగణనలోకి తీసుకోబడదు.


హైదరాబాద్. తేదీ: 12.01.2026.

సంతకం

(డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు)

రిటర్నింగ్ అధికారి

Dec 9, 2025

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష


ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత్వంలో స్పష్టత ఉంటుంది. ఆయన కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ. తెలుగు భాషలోని పదాలతో ఆడుకుంటారు. సరళమైన భాషలో చక్కటి అర్థం వచ్చే విధంగా కవిత్వం రాస్తారు.  మూడు దశాబ్దాలుగా ఆధునిక భావాలతో, సామాజిక స్పృహతో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజా చైతన్యం కోసం ఎదురీదుతున్నారు.  మధు గతంలో భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021), సంఘర్షణ (2023)అనే అయిదు కవితా సంకలనాలు అందించారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో 2020లో వచ్చిన ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణ కూడా జరిగింది. అంటే, ఆయన కవిత్వంలో ఎంత పట్టు, పవర్ ఉందో అర్థమవుతోంది. మధు  ఆరవ కవితా సంకలనం ‘ఎదురీత’ని    మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవలే మంగళగిరిలో ఈ సంకలనం ముద్రణ దాత ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు  నన్నపనేని నాగేశ్వరరావు  ఆవిష్కరించారు.

ఈ కవితా సంపుటిలోని 55 కవితలలో   విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. చదవడం మొదలుపెడితే, చివరి వరకు పుస్తకం మూయలేరు. పాఠకులను అంతగా కట్టిపడేశాలా ఈ కవితలు ఉన్నాయి. మధుకు జీవితం పట్ల, కవిత్వం పట్ల స్పష్టత ఉండటంతో ఆయన రాసే కవిత్వం పాఠకుల మనసుకు సూటిగా తగులుతుంది.  ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలిచిన కవి. మధు  ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ప్రభుత్వాలపైనే తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు, ధీశాలి. మధు కవిత్వం ఎంత మక్కువతో రాస్తారో, ఉద్యోగం కూడా అంతే నిజాయితీ,  నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. తన భావాలు చక్కటి భాషతో సూటిగా చెప్పగల సత్తా ఉన్న  కవి. ఈ సంకలనం మొదటి పేజీలో భారత రాజ్యాంగ ప్రవేశికకు స్థానం కల్పించారంటే,  భారతీయ పౌరుడుగా మధు ఎంత బాధ్యతగా ఉంటారో తెలుస్తోంది.  గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే - బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి... గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఈ కవిత  చదువుతుంటే  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి, నిర్మాత  మంచు లక్ష్మి గుర్తుకు వస్తారు.  ‘‘కట్టాల్సింది దేవాలయాలు, చర్చిలు, మసీదులు కాదు... విద్యాలయాలు, వైద్య శాలలు’’ అని  రామ్ గోపాల్ వర్మ అన్నారు.  మంచు లక్ష్మి  తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో పది, పది ప్రభుత్వ పాఠశాలలను  దత్తత తీసుకున్నారు.  అత్యధిక మంది దాతలు అలా ముందుకు వచ్చి బడులను బాగుచేయాలన్నదే మధు కోరిక. 

తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు  మధు రాసిన 8 పేజీల కవిత పాఠకుల కంట తడిపెట్టిస్తోంది.  పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, అల్లరి, అరుపులు,  చూపులు,  ప్రేమ, వాటి ప్రవర్తనా తీరు..., వాటిపై  ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ... చాలా అద్బుతంగా రాశారు. దానిని అందరూ చదివి తీరవలసిందే. ముఖ్యంగా జంతు ప్రేమికులకు, కుక్కలను పెంచుకునేవారి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది.  అలాగే, కల్తీ కల్తీ  కల్తీ - ఇందుగలదందులేదన్న కల్తీ... అని మనిషి జీవితంలో అడుగడుగునా జరిగే కల్తీల గురించి ‘సమాధి’ అనే కవిత అద్భుతంగా రాశారు. సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారం తెలుస్తోంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం అర్థమవుతోంది.  మరో కవితలో ప్రశ్నించడం మరిచామని ప్రశ్నార్థకమయ్యావా ప్రజాస్వామ్యమా!.. అని అంటారు.  గొంతు మెదపక ప్రశ్నించక, ప్రతిధ్వనించక కలహించక కూర్చుంటే - నువ్వు మాయం నేను మాయం!!... అని హెచ్చరిస్తారు. తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి-తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం... అని మరో హెచ్చరిక చేశారు. అంతేకాకుండా, తడిగుడ్డ తొలగించి-కళ్లు తెరిచి - కన్నెర్ర చేద్దాం రారండి!! అని పిలుపు ఇచ్చారు. అదే మధు ప్రత్యేకత. ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి   లేనేలేదు - పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు...,  మనిషి మనిషికీ మతం మత్తు-సందు సందుకీ కులం కిక్కు...,  పీడితుల నడుమ ఐక్యత సాధించనంతవరకూ పీడకునిదే గెలుపు.... ఇలా సాగుతుంది మధు కవిత్వం.            

‘ఎదురీత’ పుస్తకం వెల : రూ.150

కవి గోలి మధు సెల్: 9989186883

ప్రతులకు : 9848199098

                                      సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Dec 1, 2025

కలిమిశ్రీ సేవలు గుర్తించిన మంగళగిరి సాహితీ కళావేదిక


ప్రముఖ కార్టూనిస్టు, మల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు, మిత్రుడు కమిలిశ్రీ(కలిమికొండ సాంబశివరావు)కి ఈ నెల 28వ తేదీ రాత్రి మా ఊరు మంగళగిరిలో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. కలిమిశ్రీ సాహితీ సేవలను మంగళగిరి సాహితీ కళావేదిక  గుర్తించి పాతమంగళగిరిలోని కామ్రేడ్ పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో  సన్మానించడం సముచితం. నాకు చాలా సంతోషం కలిగించింది.   కలిమిశ్రీ ఇల్లు ఓ సాహిత్య కుటీర పరిశ్రమ. అతను, అతని భార్య, కుమారుడు... అందరూ తెలుగు సాహితీవేత్తల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. కవితలు, కథలకు సంబంధించి వందల పుస్తకాలకు, పలు మాస పత్రికలకు ఆయన అద్వితీయంగా రూపకల్పన చేశారు. అతని ఇల్లు ఓ కుటీర పరిశ్రమ అని ఎందుకన్నానంటే, ఓ కవి లేక రచయి కవితలు, కథలు రాసిన పేపర్లు ఆయనకు ఇస్తే చాలు. పుస్తకావిష్కరణలు జరిపించేస్తారు. డీటీపీ, ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి కవర్ పేజీ డిజైన్, పుస్తకం డిజైన్, ఫొటోల కూర్పు, ముందు మాటలు, ముద్రణ ... ఆ తర్వాత ఆ పుస్తకం ఆవిష్కరణల వరకు ఆయన, ఆయన కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఈ రకమైన సాహితీ సేవ మాసపత్రికల నిర్వాహకులకు, కవులు, రచయితలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.  తన కవితలు, కథల కాగితాలు ఇచ్చిన కవులు, రచయితలు, తర్వాత తమ పుస్తకాలను చూసి ఎంత మురిసిపోతారో, ఎంత ఆనందిస్తారో వారి మొఖాలను చూస్తే అర్థమవుతుంది. పుస్తకం ఎలా ఉండాలో ఆయనకు చెప్పవలసిన అవసరంలేదు. చెప్పినా, అంతకు మించి ఆకర్షణీయంగా ఆయన పుస్తకాన్ని తీర్చిదిద్దుతారు. కలిమిశ్రీకి సాహిత్యంతోపాటు సామాజిక అంశాలు, పుస్తక రూపకల్పనపై అవగాహన ఎక్కువ.  కలిమిశ్రీకి సాహిత్యంపై ఉన్న ప్రేమతోనే ఇదంతా సాధ్యమవుతోంది. చూసేవారికి ఇదంతా ఓ వ్యాపారంలా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది వ్యాపారమే. అయితే, కలిమిశ్రీ సాహితీ ప్రియుడుగా, శ్రామికుడిగా ఉన్నత శిఖరాలకు చేరారు.  తెలుగు సాహితీ ప్రపంచం గుర్తించుకోతగిన గొప్ప సాహితీ సేవకుడు కలిమిశ్రీ. వందల పుస్తకాలను అన్ని హంగులతో ముద్రించి, ఆవిష్కరణలు చేయించిన కలిమిశ్రీ  వ్యాపారవేత్తగా మాత్రం ఎదగలేకపోయాడు. చేసిన పనికే ఆయనకు డబ్బులు అడగడం తెలియదు. ఇక వ్యాపారవేత్తగా ఏమి ఎదుగుతారు?.   

‘కలిమి’ లేని కలిమిశ్రీ అని మంగళగిరి బుద్ధ విహారం అధ్యక్షుడు కృష్ణార్జున రావు గారు రాశారు. సాహితీ వేత్తగా, సాహితీ సేవకుడిగా, సాహితీ పారిశ్రామికవేత్తగా ఆయన  ఎంత ఉన్నతుడిగా ఎదిగినా, ఆర్థిక వ్యవహారాలలో కలిమిశ్రీ చాలా పూర్. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను. ‘‘కలిమిశ్రీకి చేసిన పనికి డబ్బు అడగడం తెలియదు’’ అని దివంగత రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ నాకు ఒకసారి చెప్పారు. విజయకుమార్ గారి ‘రేపటి కోసం’ మాసపత్రిక నిర్వహణా వ్యవహారాలన్నీ కలిమిశ్రీ చాలా కాలం చూశారు. విజయకుమార్ గారు చెప్పిన విషయం నాకు కూడా స్వానుభవం అయింది. నా ‘ప్రజారాజధాని అమరావతి’ పుస్తకం రూపకల్పన అంతా ఆయనే చేశారు. నేను మేటర్, ఫొటోలు మాత్రమే ఇచ్చాను. ఆయన పనితనం నాకు తెలుసు. అందువల్ల ఆయనకు నేను ఏమీ చెప్పలేదు.  కవర్ పేజీ నుంచి ఏ ఫొటో ఎక్కడ పెట్టాలో అంతా ఆయనే చూసుకుని, అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రింటింగ్ నేనే చేయించుకున్నాను.  నా పుస్తకం అచ్చయి వచ్చిన తర్వాత, దానిని చూసి అందరి రచయితలలానే నేనూ చాలా ఆనందించాను. అంతవరకు ఒక ఎత్తు. నా పుస్తకం ఆవిష్కరణ జరిగిన నెల తర్వాత కూడా ఆయన చేసిన పనికి నన్ను డబ్బులు అడగలేదు. అప్పటికీ, ‘‘ఎంత ఇవ్వమంటారు’’ అని నేనే అడిగాను. అతను అడిగిన అమౌంట్ విన్న తర్వాత, విజయకుమార్ గారు చెప్పినది నిజమేనని నిర్ధారణకు వచ్చాను. అతను అడిగినదానికంటే, నేను ఎక్కువ అమౌంట్ ఇచ్చాను. అలాంటి కలిమిశ్రీ వ్యాపారవేత్తగా ఏమి ఎదుగుతారు!  ఆయన తన వృత్తిలో ఎంత దిట్టో, జీవన శైలిలో అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన మాటతీరు, నవడి కూడా అంతే ఉంటుంది. తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు. ఆయన దృష్టిలో పని అంటే, అందరి సాహిత్యానికి మెరుగులు దిద్దడమే!.  తెలుగు సాహిత్యానికి వివిధ రూపాలలో ఇంతటి సేవచేసినవారు, చేస్తున్నవారు కలిమిశ్రీ ఒక్కరేనని నా అభిప్రాయం. విజయానికి శ్రమించడం ఒక్కటే మార్గం అన్నది కలిమిశ్రీకి అక్షరాల వర్తిస్తుంది. 

ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ తుమ్మలపల్లి  కళా క్షేత్రంలో విజయవంతంగా నిర్వహించి   "జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు" నిర్వహణా బాధ్యతలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా  కలిమిశ్రీకి అప్పగించడం చాలా గొప్ప విషయంగా కొందరు భావిస్తున్నారు. అయితే, ఆ ఉత్సవాల నిర్వహణకు అత్యంత సమర్థుడు, అర్హుడు కలిమిశ్రీ అన్నది నా భావన. ప్రపంచంలోని సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, ప్రభుత్వం కూడా కలిమిశ్రీ సాహితీ సేవలను గుర్తించవలసి ఉంది. కలిమిశ్రీ సాహిత్యం కోసం చేస్తున్న కృషిని మంగళగిరి సాహితీ కళావేదిక వారు గుర్తించి, ఆయనను సముచిత రీతిన గౌవించినందుకు వారికి నా అభినందనులు.

- శిరందాసు నాగార్జున

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్ ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు ...