Jul 26, 2026

చేనేత హక్కుల కోసం కడ వరకు ‘ప్రగడ’ పోరాటం


 

తుది శ్వాస వరకు చేనేత కోసం తపించిన ప్రగడ కోటయ్య


చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ప్రగడ కోటయ్య. చేనేత అంటే కోటయ్య, కోటయ్య అంటే చేనేత. ఆయన ఆలోచనలు చేనేత, శ్వాస చేనేత. జీవిత చరమాంకంలో ఆస్పత్రిలో అంపశయ్యపై ఉండి, 1995 నవంబర్‌ 26న  చనిపోవడానికి ఓ గంట ముందు కూడా చేనేత కార్మికుల సంక్షేమం గురించే కోటయ్య మాట్లాడారు.  ఆయన ఆరోగ్యం విషయమై తెలుసుకోవడానికి, అప్పటి జిల్లా కలెక్టర్ సి.ఉమామహేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. చివరి దశకు వచ్చేసినట్లు, తుది శ్వాస వదలడానికి ఎక్కువ సమయంలేదని కోటయ్యకు అర్థమైపోయింది. అప్పుడు కూడా ఆయన ఆలోచనలు చేనేత గురించే.  తన ఎంపీ కోటా నిధులను చేనేత కాలనీలలో సౌకర్యాల కోసం వినియోగించమని జిల్లా కలెక్టర్ కు చెప్పారు. అందువల్లే  చేనేత చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది.  జాతీయోద్యమంలో పాల్గొనడంతోపాటు చేనేత పరిశ్రమ, ఆ రంగంలోని కార్మికుల రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు కోటయ్య. ఆయన నిరుపేద అయినప్పటికీ   ప్రజా బాహుళ్యంలో  తనకు ఉన్న అభిమానంతో మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి,  ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ప్రగడ కోటయ్య దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యారు.  

ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధులు ఆచార్య ఎన్.జి.రంగా సలహా మేరకు కోటయ్య మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పిన్నింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్‌ సూపర్‌వైజర్ కోర్సు,  ఆ తర్వాత కాటన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, సిటీ & గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన కెమిస్ట్రీ సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన చదివిన  టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే  సూపర్‌వైజర్‌గా  పనిచేశారు. ఉద్యోగ రీత్యా రాష్ట్రమంతటా పర్యటించి చేనేత కార్మికుల కష్టాలను, వారి దయనీయ స్థితిని కళ్లారా దగ్గరగా చూశారు. ఆనాటి వారి ఆకలి చావులకు చలించిపోయారు. 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి,  అన్ని జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు. జీవచ్ఛవాలుగా బతుకులీడిస్తున్న చేనేత కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని కోటయ్య ఉద్యోగం మానేసి, చేనేత ఉద్యమంలోకి ఉరికారు. చేనేత రంగంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు.  ఎన్జీ రంగా ఒకసారి కోటయ్యను సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి, మహాత్మా గాంధీని పరిచయం చేశారు. చేనేత, ఖాదీ గురించి ఆయన గాంధీకి పూర్తిగా వివరించారు. 1941లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన థామస్‌ కమిటీకి చేనేత రంగ సమస్యలపై కోటయ్య వంద పేజీల మెమొరాండాన్ని అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘానికి దామర్ల రమాకాంత రావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. చేనేత కార్మికులను రాజకీయంగా చైతన్య పరచడం కోసం 1945లో గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. 1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1947-52 ప్రాంతంలో దాదాపు నాలుగేళ్లు నిడుబ్రోలు నుంచి ఆయన చేనేతవారపత్రికను కూడా నడిపారు.  
 
చేనేత పరిశ్రమకు చాలినంత నూలు సరఫరా చేయాలని,  ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలన్న డిమాండ్‌తో 1950లో  కోటయ్య చేనేత కాంగ్రెస్‌ తరఫున సమర శంఖం పూరించారు. మద్రాసులో 75 రోజులపాటు  సత్యాగ్రహ  ఉద్యమం నడిపారు. దాదాపు పది వేల మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు. చివరకు కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ మద్రాసు వచ్చి చేనేత కాంగ్రెస్‌ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత వర్గాల కోసం కోటయ్య రేపల్లెలో సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసి, రైలులో బళ్లారి జైలుకు తరలిస్తుండగా,  ప్రతి రైల్వేస్టేషన్‌లో  భారీ సంఖ్యలో చేనేత కార్మికులు అడ్డుపడ్డారు.  ప్రతి రైల్వేస్టేషన్‌లో రైలుని నిలిపివేయడంతో, అది బళ్లారి చేరే పరిస్థితి కనిపించలేదు. అధికారుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న  ప్రకాశం, కోటయ్యని అప్పటి రాజధాని కర్నూలుకు తీసుకురమ్మని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి  ప్రకాశం పంతులు ‘‘ఏందిరా కోటయ్య, నీ సమస్య ఏమిటి?’’ అని అడిగారు.  చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన చేనేత ఉత్పత్తుల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోటయ్య డిమాండ్ చేశారు. దాంతో, అప్పటికప్పుడే చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ప్రకాశం పంతులు రూ.50 లక్షలు విడుదల చేశారు. దటీజ్ ప్రగడ కోటయ్య.

చేనేత సమస్యలపై నిజాయితీగా పోరాడే నేతగా  ఆ నాటి కాంగ్రెస్ అగ్రనేతలందరి వద్ద ప్రగడ కోటయ్య గుర్తింపు పొందారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిగా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వరకు అందరితోనూ కోటయ్య మాట్లాడి చేనేత సమస్యలు పరిష్కరించారు.  1975లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకంలో చేనేత కార్మికులకు ఉపయోగపడే అంశాలను కూడా ఒక పాయింట్ లో చేర్చేందుకు ఇందిరా గాంధీని కోటయ్య ఒప్పించారు. చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు విశేష  కృషి చేసి, దానికి వ్యవస్థాపక చైర్మన్‌గా కోటయ్య ఉన్నారు. ఈ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను  ప్రధానికి కోటయ్య వివరించారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.  ఢిల్లీలో జరిగిన అఖిల భారత చేనేత మహాసభలో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మాట్లాడుతూ, ‘‘చేనేత సమస్యలు నాకు చెప్పి ప్రయోజనంలేదు.  ప్రగడ కోటయ్యకు చెబితే, ఆయనకు తెలుస్తాయి. ఆయన నిద్రపోతున్నా లేపి, సమస్యలు చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన ఏది చెబితే అది మేం చేస్తాం’’ అని చెప్పారు. ప్రధాని అంతటి వ్యక్తి అలా చెప్పారంటే కోటయ్యకు, చేనేతకు  ఉన్న అనుబంధం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా అన్ని పార్టీలలో కూడా చేనేత అంటే కోటయ్య పేరే గుర్తుకు వస్తుంది. భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా ఆయన శ్రీలంక, బ్రిటన్,  చైనా, హాంకాంగ్ తదితర దేశాలలో పర్యటించి, అక్కడ చేనేత రంగాన్ని అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య చివరి వరకు చేనేత రంగం సంక్షేమం కోసమే తపించారు.    

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) పూర్తి చేశారు. చదువుకునే సమయంలోనే తండ్రి వద్ద ఆయన చేనేత గురించి పూర్తిగా తెలుసుకున్నారు.  1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు వెంకట శేష శయన  బీటెక్ పూర్తి చేసి, ఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవి, వంగర శకుంతలాదేవి, ఊట్ల అనసూయ, గుర్రం విజయలక్ష్మి, దొంతంశెట్టి శ్యామలాదేవి, ఉడతా పద్మావతి వారి కుమార్తెలు. చేనేతను బతికించడం కోసం చివరి వరకు తపించిన ప్రగడ కోటయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.  చేనేత నేత కోటయ్య జయంతిని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం.

- శిరందాసు నాగార్జున రావు,  సీనియర్ జర్నలిస్ట్- 9440222914.

 

Jul 25, 2026

అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య


 

జూలై 26 ఆ మహానేత 110వ జయంతి

రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్చలపల్లి సుందరయ్య... వంటి నేతల వరుసలో ఆయన ఉంటారు. తుది శ్వాసవరకు చేనేత రంగం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తపించిన మహానేత. ఆ రంగం అభివృద్ధి కోసం పనిచేసి ‘చేనేత కోటయ్య’గా పేరుపొందారు.  అత్యంత నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి, నిజాయితీకి, రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చేనేత రంగాన్ని బతికించడం కోసమే కోటయ్య కృషి చేశారు. చేనేత రంగం సమస్యలు పరిష్కారం కావాలంటే, ఆ రంగానికి చెందినవారు రాజకీయంగా ఎదగవలసిన అవసరాన్ని ఆయన ఆనాడే గుర్తించారు. రాజకీయంగా ఎదుగుదలలేకపోతే అటు రాజకీయాల్లో, ఇటు సమాజంలో కూడా తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక బలం లేకపోయినా చేనేతలు తమ బలం చూపించగలిగితేనే, రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గాన్ని గుర్తిస్తాయి. దానిని, కోటయ్య నిరూపించారు.   చట్ట సభకు వెళ్లగలిగితేనే చేనేత సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన గట్టిగా నమ్మారు. అదే నిజం కూడా. 1946లోఆ తర్వాత 1952లో చీరాల  కాంగ్రెస్ టికెట్ కోసం కోటయ్య తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్థిక బలం లేని కారణంగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించలేదు. చీరాల నియోజకవర్గంలో పోటీ చేసే ధనవంతులతో ఆర్థికంగా బలహీనుడైన కోటయ్య గెలవలేరన్నది కాంగ్రెస్ అభిప్రాయం. కారంచేడులో కమ్మ రైతులుచీరాలలో వైశ్య వ్యాపారులతో పోటీపడలేరని వారి ఆర్థిక శక్తి ముందు తట్టుకోలేరని కాంగ్రెస్ రెండు సార్లూ కోటయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో,  1952లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రకాశం పంతులు స్థాపించిన కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా కోటయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన నిజాయితీ, ప్రజాబలం ముందు ఆర్థిక బలం నిలవలేకపోయింది. ఊహించని విధంగా  చీరాలలో ఆయన ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులను మట్టికరిపించారు. వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. కోటయ్యకు ఉన్న ప్రజాబలం ముందు  అగ్రవర్ణాల వారుధనవంతులు తట్టుకోలేకపోయారు. అయితేఅప్పటి అగ్రవర్ణాల వారు కూడా కోటయ్య ప్రవర్తన, వ్యవహార శైలి చూసి, ఆయన అంటే అభిమానంగా ఉండేవారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఓడిపోతున్నవారు కూడా కోటయ్యకు కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టారు. కోటయ్యని అందరూ అంతగా అభిమానించేవారు. శాసనసభలో  కోటయ్య వాక్ చాతుర్యాన్ని చూసి సభలో సభ్యులు ఆశ్చర్యపోయేవారు. సభ ప్రారంభంలోనే ఒక రోజు దాదాపు  గంటసేపు చేనేత సమస్యలపై  ప్రసంగించారు. ఆయన వాగ్ధాటిని చూసి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించారు. అప్పటి మంత్రి మజ్జి తులసీదాసు ద్వారా రాయబారం పంపారు.   నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చే కోటయ్య  ఆ మాట విని భయపడ్డారు.  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించిమంత్రి పదవి కోసం పార్టీ మారడం భావ్యం కాదని  భావించారు. మంత్రి పదవి కోసం ఆయన పార్టీ మారలేదు.  ఆయన నిజాయితీకి చలించిపోయిన రాజగోపాలాచారి... ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనతో చెప్పి నీకు మంత్రి పదవి వచ్చేలా చేస్తాను’’ అని చెప్పారు. ఆయనంటే అగ్రనేతలందరికీ అంత గౌరవం.  1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే,  చీరలుదోవతులు.... వంటివి చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ముంబైబీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు. .  పద్మశాలిదేవాంగ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్న భావనతోఆ కులాలను బీసీల జాబితా నుంచి తొలగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడుకోటయ్య తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దాంతో, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకుంది.

 కోటయ్య 1952 నుండి 1972 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంఆంధ్ర రాష్ట్రంఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు.  1952-1962లో రెండు సార్లు1967- 1972 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.   1967లో  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రగడ కోటయ్య స్వతంత్ర అభ్యర్థి కొణిజేటి రోశయ్యను ఓడించారు. ఆంధ్రప్రదేశ్  రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోశయ్యకు  రైస్ మిల్లర్లుకారంచేడులోని కమ్మ వారు మద్దతు పలికారు.  డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేశారు. అయినా,  కోటయ్య విజయాన్ని ఆపలేకపోయారు.  కారంచేడులో రోశయ్యకు పదివేల ఓట్లు మెజార్టీ వస్తేఈపురుపాలెంచీరాలపేరాలలో  కోటయ్యకు మెజార్టీ రావడంతో విజయం సాధించారు. కోటయ్య అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూవారి మధ్యే ఉండేవారు. జాలర్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు.  అదే ఆయన బలం. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో  1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వివిధ శాసనసభ ఉపసంఘాలలో సభ్యుడిగా ఉన్నారు. ఏపీ రాష్ట్ర డ్రైనేజ్ బోర్డుజిల్లా నీటిపారుదల కమిటీలో సభ్యునిగా ఉన్నారు. మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగాఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యునిగా ప్రగడ కోటయ్య తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.  

 
1989లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రోశయ్య పోటీ చేశారు. అంతకు ముందు రోశయ్య టిక్కెట్ కోసం  ప్రయత్నిస్తుంటేకోటయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.  ‘‘ చీరాలలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. ఇది వీవర్స్ నియోజకవర్గం. ఇక్కడే వారికి పోటీచేసే అవకాశం ఉంది. వారికి ఇక్కడ అవకాశం ఇవ్వకపోతేచట్ట సభలలో వారి సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? ’’ అని గట్టిగా ప్రశ్నించారు. రోశయ్యకు మద్దతు పలకనని తెగేసి చెప్పారు. అయితే,  అప్పటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి కోటయ్యని హైదరాబాద్ పిలిపించిరాజ్యసభ ఎంపీ పోస్టు ఇప్పిస్తాననిఆ విధంగా చేనేత వర్గాలకు జాతీయ స్థాయిలో ఉపయోగపడవచ్చని కోటయ్యకి నచ్చజెప్పారు. చివరకు కోటయ్య మద్దతుతో రోశయ్య గెలిచారు. చెన్నారెడ్డి చెప్పిన ప్రకారం కోటయ్యను రాజ్యసభకు పంపారు.  1990 నుంచి 1995లో మరణించేంత వరకు కోటయ్య రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  చేనేత రంగం అభివృద్ధికి కోటయ్య రాజ్యసభలో వెల్లడించిన అభిప్రాయాలుసూచనలుసలహాలను విన్న ఆనాటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతోపాటు తోటి పార్లమెంట్ సభ్యులు  సైతం అబ్బురపడేవారు. సమస్యలు వివరించే తీరు,  కోటయ్య ప్రసంగ ధాటి అందరినీ ఆకట్టుకునేవిధంగా ఉండేది. కోటయ్య చనిపోయిన తర్వాత కూడా రాజ్యసభలో ఆయన గురించి సభ్యులు అందరూ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.  1996లో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కొందరు ప్రసంగిస్తూ,  ప్రగడ కోటయ్య బతికి ఉంటే,  చేనేత రంగానికి ప్రాధాన్యత ఇవ్వని ఈ బడ్జెట్ ని   చీల్చిచెండాడేవారని తలుచుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సభలోని అధికారప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు పలికారు.

 ప్రగడ కోటయ్య రొంపేరు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి, చీరాలపరిసర ప్రాంతాలలోని రొంపేరు డ్రెయిన్ పరిధిలో ఉన్న సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూములను  1954లో  నిరుపేద రైతులకు పంపిణీ చేయింశారు. కోటయ్య కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పంపిణీ అప్పుడే మొదలైంది.  చీరాలలోని రొంపేరు భూములలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి,  తోటవారిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంలో కోటయ్య కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  ‘‘చేనేత కోటయ్య రైతు కోటయ్యగా మారిపోయారు’’ అని  ఛలోక్తి విసిరారు.  చీరాల తాలూకాలోని కుందేరు కాలువకు తూర్పున ఉన్న అనేక గ్రామాలలో వేలాది మంది పేద రైతుల ఆర్థిక ఉన్నతికి కోటయ్య తోడ్పడ్డారు. 1964లో కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి భూములకు మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలని ఆయన పోరాడారు. ఆ సమయంలో చీరాలబాపట్ల ప్రాంతాల్లోని సాగునీటి భూములు వరదల్లో మునిగిపోయాయి. దాని ఫలితంగా మిత్ర కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టారు. మళ్ళీ 1969 మేలో చీరాల ప్రాంతంలో పెద్దఎత్తున వరదలు సంభవించిపొలాల్లో పనిచేస్తున్న 2,000 మందికి పైగా ప్రజలు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు చీరాలను సందర్శించినప్పుడుకోటయ్య మిత్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండామురుగునీటి పారుదల సౌకర్యాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రూ. 3 కోట్ల రుణాన్ని అక్కడికక్కడే ప్రకటించేలా చేశారు. అప్పుడేఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి సెస్ చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. కృష్ణాగోదావరి  డెల్టాలలో మురుగు నీటి సౌకర్యాల మెరుగుదల కోసం పథకాలను చేపట్టారు. చీరాల మండలం తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ కోసం ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. 1962 నుంచి  తోటవారిపాలెం పరిసర ప్రాంతాల్లోని కావూరివారిపాలెంతులసీనగర్పాలిబోయినవారిపాలెం గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములకు ఇది సాగునీరు అందిస్తోంది.  చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు ప్రభుత్వం దానికి 99 ఎకరాలు కేటాయించేందుకు  కృషి చేసిదానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య వ్యవహరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను కోటయ్య,  నెహ్రూకు వివరించారు. దాంతోచేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. చీరాల నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.

 
ప్రగడ కోటయ్య తన స్నేహితులతో కలిసి ఆంధ్రకేసరి ప్రకాశం ఎడ్యుకేషనల్ సొసైటి ప్రారంభించిదాని ఆధ్వర్యంలో దివంగత ఉమ్మితి శివయ్య కుటుంబ సభ్యులువారి బంధువుల ఆర్థిక సహాయంతో చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత దాని పేరుని  ఆంధ్రకేసరి ప్రకాశంప్రగడ కోటయ్య జూనియర్ కాలేజీగా మార్చారు.  చీరాల  వి.ఆర్.ఎస్.(ప్రస్తుతం వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్) కళాశాల పాలక మండలి సభ్యుడుగాదాని కోసం 60 ఎకరాలకు పైగా భూమిని సమకూర్చడంలో  కోటయ్య సహాయపడ్డారు.  బండ్ల వెంకటేశ్వర రావు  నిర్వహణలో వేటపాలెంలో జూనియర్ కళాశాలను ప్రారంభించేందుకు దోహదపడ్డారు. వేటపాలెంలో యూఎస్ఐ (United Schools Organisation of India)స్థాపించారు. బంజరు భూముల పంపిణీ ,  చీరాల సముద్ర తీర ప్రాంతంలో సేద్యపునీటి సౌకర్యం కల్పించడం,  చీరాలగుంతకల్లునెల్లూరురాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.

 

ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు  అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితేఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకే ఇచ్చారు. కోటయ్యకు  ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడికక్కడే సార్థకం చేసి చూపించారు. వాస్తవానికి ప్రగడ కోటయ్య ఆర్థికంగా స్థితిమంతులు ఏమీకాదు. అయినాఆయనలోని నిజాయితీనిస్వార్థంనిబద్ధతనాయకత్వ పటిమని గుర్తించి చేనేత రంగంలోని స్థితిమంతులువ్యాపారులుమాస్టర్ వీవర్లుచేనేత కార్మికులు అందరూ ఆయనకు మద్దతు పలికారు.  కోటయ్య కుటుంబం చాలా కాలం ఒక పూరి గుడిసెలోనే ఉండేవారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 1960 వరకు ఆ పూరి గుడిసెలోనే ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన నాయకులకు ఆ గుడిసె బొంగులు గుచ్చుకునేవి. అప్పుడు ఆ నాయకులు ‘‘ఏంటి కోటయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ పూరి గుడిసెలోనే ఉంటున్నావు’’ అని అడిగేవారు. అంతటి నిజాయితీని, నిరాడంబరతను ఇప్పుడు మనం ఊహించగలమా?   కోటయ్య 1960లో నిడుబ్రోలు వీవర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో వారి అబ్బాయి ఉంటున్నారు. కోటయ్య చనిపోయేనాటికి వారి ఇంట్లో  ఫ్రిజ్ కూడా లేదు. అంత నిరాడంబరంగా ఆయన బ్రతికారు. అందుకే అభిమానులు ఆయనను  ప్రజా బంధు ప్రగడ కోటయ్యచేనేత కోటయ్యచేనేత పితబహుజన నేత... అని కొనియాడుతుంటారు.

 

శాసనసభలో తనకు మద్దతు పలికేవారు పది మంది కూడా లేరనిఆర్థికంగా కూడా తాను స్థితిమంతుడిని కాదనిఅంగబలంఅర్థబలం లేనందునే తనకు మంత్రి పదవి దక్కలేదని ప్రగడ కోటయ్య తన ఆత్మకథలో రాసుకున్నట్లు, ఆయన సోదరుడి కుమారుడు ప్రగడ రాధాకృష్ణ చెప్పారు. అయితేఅది ముద్రణకు నోచుకోలేదు. తన పెదనాన్న స్వయంగా రాసుకున్న పేపర్లను తాను చూసినట్లు ఆయన తెలిపారు. ‘‘రాజగోపాలాచారి సిఫారసు చేసినా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి పోటీ చేశారు.  అప్పట్లో ఆ నియోజకవర్గ పరిధిలో వెంకటగిరి ఉండేది. వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నందునతనను అక్కడికి వెళ్లిప్రచారం చేసి గెలిపించమని సంజీవరెడ్డి నన్ను కోరారు. ఆయన కోరిన ప్రకారం నేను వెంకటగిరి వెళ్లి15 రోజులు అక్కడే ఉండి ఆయన తరఫున ప్రచారం చేశాను. ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినాసంజీవరెడ్డి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంగబలంఅర్థబలం లేనందునే నేను మంత్రిని కాలేకపోయాను’’ అని ప్రగడ కోటయ్య స్వదస్తూరితో రాసుకున్నట్లు రాధాకృష్ణ వివరించారు. రాజకీయ నేతలు నిజాయితీగా వ్యవహరించే రోజులలో కూడా కుల బలం, అర్థబలానికి ప్రాధాన్యత ఉండేదని అర్థమవుతోంది.

 

ప్రగడ కోటయ్య మరణానంతరం  ప్రభుత్వం  అప్పటి చిత్తూరు జిల్లా  వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు  శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ అని పేరు పెట్టింది.  భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  న్యూఢిల్లీలోని చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించే దేశంలోని ఎనిమిది సంస్థలలో ఇది ఒకటి. మంగళగిరిలోని వీవర్స్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ కు దామర్ల రమాకాంతరావుప్రగడ కోటయ్య మున్సిపల్ హైస్కూల్ అని పేరు పెట్టారు. ఇలా రాష్ట్రంలోని  పలు విద్యా సంస్థలకుకమ్యూనిటీ హాళ్లకు,  ఇతర సంస్థలకు ప్రగడ కోటయ్య జ్ఞాపకార్థం ఆయన పేరును పెట్టారు. ఆయన గౌరవార్థం మంగళగిరిచీరాలపొన్నూరు ...తదితర అనేక ప్రాంతాల్లో ప్రగడ కోటయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.  చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతి( జూన్ 26)ని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  మానవ వనరుల అభివృద్ధివిద్యఐటీఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీనికి సంబంధించిన జీఓ కూడా జారీ అయింది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించిదానికి  ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంగళగిరి శాసనసభ్యులు కూడా అయిన లోకేష్ చెప్పారు.

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడుకోటమ్మ దంపతులకు కోటయ్య 1915జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులుఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ ) పూర్తి చేశారు. మొదట వయసు తక్కువగా ఉన్నందున కోటయ్యను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష రాయడానికి అనుమతించలేదు.  దాంతోఓ ఏడాదిపాటు నేత నేసే తన తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే  చేనేత గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు.  చిన్నతనంలో నిడుబ్రోలులో ధనవంతుల కుటుంబాలకు కోటయ్య బావి నుంచి కావిడితో మంచినీళ్లు మోసుకువెళ్లి పోసేవారు. వారు కొద్దోగొప్పో డబ్బు ఇచ్చేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసైన తర్వాతబాపట్ల తాలూకా బోర్డులో ఆయన కొంతకాలంపాటు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేశారు. 1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం అయింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలుఒక కుమారుడు.

కొడుకు వెంకట శేష శయన  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసిఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవివంగర శకుంతలాదేవిఊట్ల అనసూయగుర్రం విజయలక్ష్మిదొంతంశెట్టి శ్యామలాదేవిఉడతా పద్మావతి ఆ దంపతుల కుమార్తెలు.  పెళ్లైన కొత్తలో ఆయన చీరాలలోని ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ)లో కొంత కాలం గుమస్తాగా పని చేశారు.  ఆ సమయంలో వీరి కుటుంబం చీరాలకు సమీపంలోని ఈపురుపాలెంలో నివాసం ఉంది. ఆ కొద్దికాలం తప్ప ఆయన జీవితాంతం నిడుబ్రోలులోనే ఉన్నారు. చేనేత వర్గానికి ఆరాధ్యుడైన  ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  చేనేత పరిశ్రమకార్మికులు పెద్ద దిక్కును కోల్పోయారు.  చేనేత రంగానికి సంబంధించి, చేనేత కార్మికులను ఐక్యంగా నిలిపే అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.

 

ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు

 

1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు

1949  అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు

1950  చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.

1952–1962  శాసనసభ సభ్యుడు

1955–1956  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

1959  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన,  చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్.

1962–1965  ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్

1967–1972  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు

1973–1975  న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.

1974–1980  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు

1974–1978  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

1975  రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు,  కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు

1976–1978  ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు

1990–1995  రాజ్యసభ  సభ్యుడు

 

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


Jul 16, 2026

సహకార సంఘాల ప్రయోజనాలు నమ్మిన ప్రగడ కోటయ్య

26న  ప్రగడ కోటయ్య 110వ జయంతి

చేనేత కార్మికులకు, చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని గట్టిగా నమ్మిన స్వాతంత్ర సమరయోధుడు, బీసీ రాజకీయ నేత ప్రగడ కోటయ్య.  గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు.  జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్న కోటయ్య చేనేత కార్మికుల సంక్షేమం కోసం, సహకార రంగం పటిష్టత కోసం ఎంతో శ్రమించారు.  జాతీయ స్థాయిలో ప్రముఖ బీసీ నేత, బహుజన బంధు,  అత్యంత నిజాయితీపరుడైన కోటయ్య ప్రగడ కోటయ్య మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  రైతులు, పేదలు, బీసీలు, ముఖ్యంగా చేనేత అభివృద్ధి,  చేనేత కార్మికుల సంక్షేమం, సహకార రంగం కోసం ఆయన తుది శ్వాస వరకు కృషి చేశారు.  దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్ల మందికి ఆరాధ్యుడైన  ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.

ప్రగడ కోటయ్య ఓ వైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే, మరో వైపు చేనేత కార్మికుల కోసం చాలా చురుకుగా పనిచేశారు. చేనేతరంగంతో పాటు రైతులు, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, కాంపోజిట్‌ మిల్లులపై ఆమూలాగ్రం ఆయన అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య  మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌ లో తన ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత,  అదే మద్రాస్  టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  సూపర్‌వైజర్‌గా  పనిచేశారు. ఈ అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జి ఉద్యోగంలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి, మరిన్ని సహకార సంఘాలను స్థాపించాలని వారిని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశారు.

1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.  1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లుగా చేనేత నాయకులు ఎన్నికయ్యేవిధంగా పథక రచన చేసి విజయం సాధించారు. 1941లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు థామస్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీని కోటయ్య గుంటూరు జిల్లాకు ఆహ్వానించారు. చేనేత రంగ సమస్యలపై వంద పేజీల మెమొరాండాన్ని ఆ కమిటీకి అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరికి దామర్ల రమాకాంతరావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. నూలు కొరతను అధిగమించేందుకు నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు. 1947లో పొన్నూరు నుంచి ఆయన ‘చేనేత’ వారపత్రికను కూడా తీసుకువచ్చారు. 

అసంఘటితంగా ఉన్న చేనేత రంగం అభివృద్ధికి, మిల్లు వస్త్రాల పోటీని చేనేత వస్త్రాలు తట్టుకోలేని పరిస్థితుల్లో, చేనేత ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడానికి ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. ఇందుకు సహకార రంగమే ఉత్తమమైనదిగా ఆయన భావించారు. ప్రగడ కోటయ్య హయాంలో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200పైగా నూతన చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. 1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే,  చీరలు, దోవతులు చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, బీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు. 

చీరాల శాసనసభ్యునిగా ప్రగడ కోటయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించారు. చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు, దానికి ప్రభుత్వం 99 ఎకరాలు కేటాయించేందుకు  కృషి చేశారు. ఆ మిల్లుకు దానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను ప్రధానికి తెలియజేశారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.  ఆ నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.  చీరాల, గుంతకల్లు, నెల్లూరు, రాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.

ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ‘ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు  అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితే, ఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకి ఇచ్చివేశారు. ‘ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడిక్కడే సార్థకం చేసి చూపించారు. అందుకనే అభిమానులు ఆయనను  ప్రజాబంధు ప్రగడ కోటయ్య, చేనేత కోటయ్య, చేనేత పిత, బహుజన నేత... అని కొనియాడుతుంటారు.  చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించి, దానికి  ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని నెలకొల్పనుంది.  


ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు


1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు

1949 అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు

1950 చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.

1952–1962 శాసనసభ సభ్యుడు

1955–1956 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

1959 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన,  చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్. 

1962–1965 ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్

1967–1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు

1973–1975 న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.

1974–1980 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు

1974–1978 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

1975 రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు,  కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు

1976–1978 ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు

1990–1995 రాజ్యసభ  సభ్యుడు


                                                      - శిరందాసు నాగార్జున రావు,  సీనియర్ జర్నలిస్ట్- 9440222914.

Jul 15, 2026

పుట్టా శ్రీనివాస్ కు ఘన నివాళి


మంగళగిరి:  మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన పుట్టా శ్రీనివాస్ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కేవలం పాత్రికేయునిగా మాత్రమే కాక నిబద్దత గల సామాజిక కార్యకర్తగా పుట్టా శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. అనారోగ్యం బారిన పడి చిన్న వయసులోనే మరణించడం శ్రీను  కుటుంబ సభ్యులకు మాత్రమే కాక మంగళగిరికి తీరని లోటని పేర్కొన్నారు.

ప్రత్యేకించి శ్రీ వేంకటేశ్వర యోగా సేవ కేంద్రంలో బోధనాచార్యునిగానూ, రేకా చంద్రశేఖర్  అధ్యక్షులుగా వ్యవహరించిన " వేమన సాహిత్య వేదిక " కార్యదర్శిగా పుట్టా శ్రీనివాస్  అందించిన సేవలను స్మరించారు. ఈ సందర్బంగా పుట్టా శ్రీనివాస్ స్మృతి చిహ్నంగా...త్వరలో "  పుట్టా శ్రీనివాసరావు స్మరణలో " పుస్తకాన్ని రేకా చంద్రశేఖర్  వెలువరిస్తున్నట్లు మానవతా వేదిక  కన్వీనర్  గోలి మధు తెలిపారు.


ఈ సభలో మంగళగిరి బుద్దవిహార వ్యవస్థాపకులు రేకా కృష్ణార్జున రావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణ రావు, బుద్దభూమి వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య, ధ్యానరత్న ఆకురాతి శంకరరావు, స్నేహ మహిళామండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి, వేంకటేశ్వర యోగసేవా కేంద్ర ఆచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్, ఎస్ ఎల్ ఎం చైతన్య బాధ్యులు శిందే బాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు శిరందాసు నాగార్జున, ప్రముఖ కళాకారులు అల్లక తాతరావు, సందుపట్ల భూపతి, బంధుమిత్రులు పాల్గొని ఘననివాళులు అర్పించడంతో సంస్మరణ సభ విజయవంతం అయింది.