Sep 9, 2026

నేడు మంగళగిరి మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ గోలి గోపాలరావు 36వ వర్ధంతి


1969  అక్టోబర్ 1 వ తారీఖు మంగళగిరి "గ్రామ పంచాయితీ" స్థాయి నుండి "మున్సిపాలిటీ" హోదా పొందినది. 1971 లో మంగళగిరి మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరిగి...తొలి మున్సిపల్ చైర్మన్ గా  గోలి గోపాలరావు గారు ఎన్నికై 1976 వరకు కొనసాగారు. 1970 దశకంలో మంగళగిరి పట్టణంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. మంగళగిరిలోని బావుల్లో ఉండే నీటిని ఎంతో కష్టపడి చాంతాళ్ళతో తోడుకుని వాడుకునే వారు. ఆ రోజుల్లో మంగళగిరిలో పెళ్ళీడుకొచ్చిన యువకులకు వేరే ఊరివారు పిల్లనివ్వాలంటే ముందుకొచ్చేవారు కాదు. కారణం ఆడపిల్లలు బావుల్లో నీళ్ళు తోడడానికి కష్టపడాల్సి వస్తుందని. గోలి గోపాలరావు  మంగళగిరి  ప్రజలకున్న  ఈ నీటి సమస్యను పరిష్కరించడానికి 1972 లో  "పైలెట్ వాటర్ స్కీమ్" ను రూపొందించి పైపుల "కుళాయిలు" ద్వారా మంచినీటిని సరఫరాచేసే విధానం అమలులోకి తెచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించినందువలన గోలి గోపాలరావుని  "అపర భగీరథుడు" గా మంగళగిరి ప్రజలు  చెప్పుకుని ప్రశంసించేవారు. .ఇప్పుడున్న  పాతతరం వారు మంగళగిరి వాసులు అప్పటి ఈ విషయాన్ని తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న బైపాస్ రోడ్డు సమీపానగల కొప్పురావుకాలనీని ఏర్పాటు చేసినదీ గోలి గోపాలరావు చొరవవలనే. మంగళగిరిలోని VTJM డిగ్రీ కళాశాల, 1975 లో కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించినది కూడా  గోలి గోపాలరావు  కృషి వల్లనే.


 నేటికి 36 సంవత్సరాల క్రితం..1990 సెప్టెంబర్ 9 వ తారీఖు  గోలి గోపాలరావు  వృధాప్యం కారణంగా స్వర్గస్తులైనారు. గోలి గోపాలరావు  ఎంతో సౌమ్యులుగా, మంగళగిరి, పరిసర గ్రామాల ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న ధన్యజీవి. మా తాత "మేకల కోటయ్య" మంగళగిరి తహసిల్దార్ కార్యాలయంలో 1979 సంవత్సరానికి పూర్వం రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తున్న రోజుల్లో  గోలి గోపాలరావు, మా తాత మేకల కోటయ్య  అత్యంత సన్నిహితంగా ఉండేవారు.  గోలి గోపాలరావు  కుమారుడు డాక్టర్   గోలి రామ్మోహన రావు మంగళగిరిలో శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఎదురుగా కళ్యాణ్ నర్సింగ్ హోమ్ పేరుతో 1982లో ''హాస్పిటల్'' ని ప్రారంభించారు. గత 44 సంవత్సరాలుగా మంగళగిరి, పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.  మంగళగిరి ప్రజలకు విశేష సేవలు అందించి, మంగళగిరి నీటి కొరతను పరిష్కరించి "మంగళగిరి అపర భగీరధుడు" గా పేరు సంపాదించుకున్న  గోలి గోపాలరావు  36వ వర్ధంతి ఈరోజు జరుగుతున్న  సందర్భంగా.. శ్రీ గోలి గోపాలరావు గారిని స్మరించుకుంటూ.. నివాళులర్పిస్తున్నాను.

మేకల మోహనరావు,

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త. 

ఫౌండర్ చైర్మన్, ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎడ్యుకేషనల్ సోసైటీ మంగళగిరి


మోహన్ రావు గారు, 

గోలి గోపాల రావు గారి గురించి చాలా బాగా రాశారు. ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన సీకే జూనియర్  కాలేజీ కమిటీ అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే, నేను విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఆ సమయంలో నేను చాలాసార్లు ఆయనను కలిశాను. మంగళగిరిలో పైలెట్ వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఆయనకు భారీఎత్తున సన్మానం జరిగింది. అప్పట్లో దేవస్థానం సమీపంలో మున్సిపల్ కార్యాలయం ఉండేది. దేవస్థానం నుంచి పాత మంగళగిరి దేవాలయం వరకు విద్యుద్దీపాలలో అలకంరించారు. ఆయనను ఊరేగించారు. అప్పట్లో నీటిపారుదల శాఖా మంత్రిగా చల్లా సుబ్బారాయుడు ఉండేవారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  మళ్లీ మంగళగిరిలో అంతటి సన్మానం ఎవరికీ జరగలేదు.  గోపాలరావు గారు మంచి మనిషి.  గోలి రామమోహన్ రావు గారు, గోలి కళ్యాణ్ గారితో కూడా నాకు పరిచయం ఉంది.  గోలి గోపాలరావు వర్థంతి సందర్భంగా ఈ ఉదయం ఆయన కుమారులు సీకే హైస్కూల్ లో ఒక కార్యక్రమం నిర్వహించి, 30 మంది పేద విద్యార్థులకు, ఇతర పేదలకు ఆర్థిక సాయం చేశారు. 

-శిరందాసు నాగార్జున

Sep 7, 2026

టీడీపీ-వైసీపీలతో ప్రజలు విసిగిపోయారు..అందుకే కొత్త పార్టీ

వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్ః-*

*- మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు..నా కుటుంబ సభ్యులూ కాదు..*

*- ఇప్పటివరకూ అధికారానికి దూరమైన కులాల నుండే సీఎం అవుతారు*

*- నా పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే..*

*- ఆ 5 అంశాలపైనే మా నూతన పార్టీ మేనిఫెస్టో.. దసరా తర్వాత పార్టీ ఆవిర్భావం*

*- జెన్-జీకి 66 శాతం సీట్లు..*

*- రైతులకు,గృహావసరాలకు ఉచిత కరెంటు*

*- బలవంతపు మత మార్పిడులు ఇప్పుడూ ఉన్నాయి.. గతంలోనూ ఉన్నాయి..*

*- మత మార్పిడులకు పాల్పడితే.. మా ప్రభుత్వంలో యూపీ తరహా ట్రీట్ మెంటు.* 


*-ః శ్రీ విజయసాయిరెడ్డి*


విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ..


- నేను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా-అజెండా ప్రకటించేటటువంటి క్రమంలో భాగంగా, ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ (థర్డ్ వైబుల్ పొలిటికల్ అల్టర్ నేటివ్ పార్టీ)అవసరమైంది అనే విషయాలను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీముందు ఉంచదలచుకున్నాను.


- రాష్ట్రంలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటితోపాటు జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మరికొన్ని నూతనంగా ప్రారంభించిన పార్టీలు... ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికిగానీ, వాటి మీద పోరాడే పటిమనుగానీ చూపించటం లేదనే పరిస్థితుల్లో.. కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను.


- ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు పార్టీల చుట్టు మాత్రమే రాజకీయం తిరుగుతుంది. మొదటిది టీడీపీ-రెండోది వైఎస్ఆర్సీపీ. ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భావన వారిలో నెలకొంది. 


- ఈ రెండు రాజకీయ పార్టీలు.. ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాయి.  రెండు ఫ్యాక్షన్ రాజకీయ పార్టీలుగా అవతరించాయి. ఇందులో మొదటిది రెడ్ బుక్ పార్టీ టీడీపీ, రెండోది రప్పా.. రప్పా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది. 


- ఆ యుద్ధంలో పోలీసులు న్యాయం వైపు పనిచేయాలేగానీ, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పని చేయడం దురదృష్టకరం. దీనిని మనమంతా ఖండించాల్సిన అవసరం ఉంది. 


- ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతూ,మరోవైపు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, ఇంకోవైపు ప్రజలకు భద్రత లేకుండా పోవడంతో, కొత్తగా రాజకీయ పార్టీ ఆవిర్భవించవలసిన అవసరం ఉందన్నది నా భావన.


- ఈ రెండు పార్టీలు ఎందుకు కొట్టుకుంటున్నాయి..!? రాష్ట్రంలో ఉన్న కోటి 50 లక్షల కుటుంబాలు, అంటే, 6 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన రాష్ట్ర సంపదను ఎవరు దోచుకోవాలనే దానిపైనే ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం. 


- ఈ రెండు కుటుంబాలకు చెందిన ఈ పార్టీల రాజకీయ అజెండా ఒక్కటే.." ప్రజలకు గోరంత- మాకు కొండంత.." అనే ఒకే ఒక్క సిద్ధాంతంతో వీళ్ళు ముందుకు వెళుతున్నారు. వీరిద్దరి ధ్యేయం ఒక్కటే, పొలాల్లో మట్టి తీసుకున్నా, వాగుల్లో ఇసుక తీసుకున్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా, ఎన్ వోసీ కావాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా రౌడీ మామూళ్ళు కట్టాలి., రాజకీయ నాయకులకు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పాలనలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ రౌడీ మామూళ్ళు చెల్లించినదే  పనులు పూర్తి కావు.


- నిద్ర లేస్తే.. ఈ ఒక్క రాజకీయ పార్టీల నాయకులకు సెటిల్ మెంట్లు, దందాలు చేయడం రొటీన్ యాక్టివిటీగా మారింది. గత ఎన్నికల్లో రూ. 20 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెట్టాను.. వాటిని రికవరీ చేసుకోవాలి, రాబోయే ఎన్నికలకు మళ్ళీ కూడబెట్టుకోవాలనే లక్ష్యంతోనే ఈ పార్టీల నాయకులు పనిచేస్తున్నారు. 


- గతంలో తమిళనాడులో ఏ తరహా రాజకీయాలు ఉండేవో.. ఆ తరహా రాజాకీయాలను ఈ పార్టీల వారు, ఏపీకి తీసుకొచ్చారు. ఎవరు అధికారంలో ఉంటే.. ప్రత్యర్థులపై కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించడం అజెండాగా మారింది.


- ప్రజల శ్రేయస్సుకోసం ముందుకు వెళతాం, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..  అన్న దృక్పథాన్ని వదిలేసి.. రక్తాన్ని పారిస్తామన్న ధోరణిలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. 


- ఆడబిడ్డల్ని రోడ్ల మీద వివస్త్రను చేసి కొట్టినా, హత్యలు చేసినా, ఆత్మాభిమానంతో గోదావరి నదిలో దూకినా.. వీళ్ళు పట్టించుకోవడం లేదు. 


- రాష్ట్రంలో... ఎంతసేపటికి లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న ధ్యేయంతో ఈ రెండు పార్టీల రాజకీయ నాయకులు ముందుకు వెళుతున్నారు. 


- రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాల తరఫున మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీనే లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. 6 కోట్ల ప్రజానీకం కోసం ఈ రెండు పార్టీలు ఉన్నాయా...!? లేక, ఈ రెండు కుటుంబ రాజకీయ పార్టీల కోసం 6 కోట్ల ప్రజానీకం ఉన్నారా..!? అన్నది ప్రజలు గమనించాలి. 


- అందుకే ఈ కొత్త రాజకీయ పార్టీని నిర్మించాలన్న ఆశయంతో ప్రజల ముందుకు వస్తున్నాను. నాపైన చేసిన ఆరోపణలకు నిజానిజాలు ఏమిటనేవి మీరే తెలుసుకోండి. 


సీఎం అభ్యర్థి నేను కాదు..


- స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ఉండటం లేదు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా..!? రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పరిపాలించాలా..!? రాష్ట్రంలో రెడ్లు, కమ్మ వాళ్ళు మాత్రమే కాదు.. చాలా కులాలు, బీసీల్లో 140 కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు మొత్తం 6 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ప్రధానమైన కులాల్లో రెడ్డి, కమ్మ కాకుండా, కాపులు ఉన్నారు, వెలమలు ఉన్నారు.  కాపులు, వెలమలు, బీసీవర్గాలు, రజకులు, ఎస్సీలు సీఎం కాలేదే.. !?  ఎందుకు!? వాళ్ళల్లో సామర్థ్యం ఉన్న వాళ్ళు లేరా..!? ఉన్నారు.  వాళ్ళను అణగదొక్కుతూ, ఈ రెండు వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. పదవులను ఆక్రమించుకుంటున్నాయి. 


- నా కుటుంబ సభ్యులు కూడా సీఎం అభ్యర్థులు కాదు. ఎవరైతే సామర్థ్యం ఉంటుందో, అనుభవం ఉంటుందో, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించగలరో,  ఏకులానికి చెందిన వారైనా సీఎం అయ్యే అవకాశం కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఉంటుంది.. అని నేను నమ్మిన వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నాను. 


- నా రోల్ ఎలా ఉంటుందంటే.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బాల్ థాక్రే మాదిరిగా ఒక మెంటర్ గా ఉంటూ, ఎలా ప్రభుత్వాన్ని నడిపించారో, అలానే సలహాలు, సూచనలు మాత్రమే నేను ఇస్తాను. 


- సీఎం అభ్యర్థికి సామర్థ్యంతోపాటు ముఖ్యంగా దేశ భక్తి ఉండాలి అని నొక్కి నొక్కి చెబుతున్నాను. 


- రాజకీయ సన్యాసం అన్నారు.. ఎందుకు రెండేళ్లు మాట్లాడలేదని అడగవచ్చు. రెండేళ్లు నేను మౌనంగా ఉండలేదు.  మనం ఏ కులంలో పుట్టాలో మనం కోరుకోం. ఏడాది పాటు నేను ఒక పుస్తకం కోసం కృషి చేశాను. అది యాథృచ్ఛికమే. రెడ్డి సామాజికవర్గం ఎలా ఆవిర్భవించింది. కాపుల నుంచి రెడ్డి సామాజిక వర్గం గ్రామాల్లో గ్రామ పెద్దలుగా ఉండి, ఈ సామాజికవర్గం ఎలా ఉద్భవించింది. రెడ్డి రాజులు ఎలా పరిపాలించారు..? అనే దానిపై 350 పేజీల పుస్తకాన్ని రచించాను. చరిత్రకారుల నుంచి, బ్రిటీష్ కాలం నాటి రికార్డుల నుంచి, వాస్తవాలను మాత్రమే ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఈ పుస్తకాన్ని ఎడిటింగ్ కు ఇచ్చాను. తర్వాత అనువదిస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ద్వారా, సంవత్సరం రోజుల కృషిని నేను ప్రజల దృష్టికి తీసుకు వస్తాను.  ఇది క్యాస్ట్ ఫీలింగ్ తో చేసింది కాదు. నాకు ఇంట్రస్ట్ కొద్దీ ఈ పని చేశాను. 


ఆ 5 అంశాలే.. మా పార్టీ మేనిఫెస్టో..


- 5 అంశాలను మీ దృష్టికి తీసుకు వస్తాను. అవే పెట్టబోయే మా పార్టీకి మేనిఫెస్టోగా ఉంటాయి. నేను ప్రెస్ మీట్ లు పెట్టబోయే, అనంతపురం, విశాఖ, తిరుపతిలో మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి చర్చించడం జరుగుతుంది. మీరు కూడా సలహాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 


- ఖర్చు కన్నా ఆదాయం తక్కువగా ఉంది. 80 శాతం మంది ప్రజలకు ఈ పరిస్థితి ఉంది. ఖర్చులు ఎలా తగ్గించాలి, ఆదాయం ఎలా పెంచాలి. 80 శాతం మంది ప్రజలు ఏదో ఒక అప్పుల ఊబిలో ఇరుక్కుని ఉన్నారు. వీరంతా ఎలా అప్పుల ఊబిలో నుంచి బయట పడాలి, ఆదాయ వనరులను ఎలా పెంచాలి.


- నిత్యావసరాలు పెరుగుదలః ఉప్పు, పప్పు నుంచి కరెంటు బిల్లులు.. అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా తగ్గించాలని చర్చిస్తాం. 


- ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రూ. లక్షా 2 వేల కోట్ల అప్పు ఉంటే.. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పది-పన్నెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు ఉంది..? గ్యారెంటీలు ఎంత? కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు ఎంత? ఇవన్నీ తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 12 లక్షల కోట్ల అప్పు ఉంటే.. వీళ్ళు రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారు. ఇది ఎవరి జేబుల్లోకి ఎంత పోయిందని ప్రశ్నిస్తున్నాను. 


- అమరావతి క్యాపిటల్ ను నేను వ్యతిరేకించటం లేదు. శివరామకృష్ణన్ నివేదిక ప్రకారం రాజధాని లేదు అని గుర్తించి, దానిని అనుసరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. సుమారు రూ. 70 వేల కోట్లు రాజధాని మీద ఖర్చు పెట్టిన తర్వాత, అమరావతిని మార్చాలనుకోవడం అవివేకం. ఇష్టం ఉన్నా, లేకపోయినా అదే రాజధాని, వ్యతిరేకించకూడదు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయవద్దు. ప్రభుత్వంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురండి, ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయొద్దు అని చెబుతున్నాను.


జెన్-జీకి 66 శాతం సీట్లు..

1- ఈ ప్రభుత్వాలు జెన్-జీకి ఎందుకు భయపడుతున్నాయి..? యువత, రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ తిరగబడతా ఉంది. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు పనులను జెన్ - జీ ప్రశ్నిస్తున్నారు కాబట్టే, ప్రభుత్వాలు భయపడతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నారు కాబట్టే ప్రభుత్వాలు భయపడుతున్నాయి.  

- కొత్తగా పెట్టబోయే పార్టీలో, ఇవాల్టికి 22 ఏళ్ళు పూర్తి అయినవాళ్ళకి,  2029 నాటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, అది అసెంబ్లీగానీ,  పార్లమెంటుగానీ, స్థానిక ఎన్నికలుగానీ.. 25-40 ఏళ్ళ యువతకు అన్ని పదవుల్లో 66 శాతం సీట్లు కేటాయిస్తాను. అది ఏ కులం అయినా కావచ్చు. ఏ కులం అయినా,  సామర్థ్యం ఉన్న తెలివైన యువతను ప్రోత్సహిస్తూ.. 66 శాతం వారికి కేటాయిస్తాను. 


రైతులకు, గృహావసరాలకు ఉచిత కరెంటు..

2- విద్యుత్ః  వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు.వాస్తవానికి, రైతులకుగానీ, గృహావసరాలకు గానీ ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, కేంద్రం ఇచ్చే సబ్సిడీతో, రాష్ట్రం కూడా సబ్సిడీ ఇస్తే,వాటితో సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే, నామినల్ పెట్టుబడితో, ప్రజలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకు ఉచితంగా కరెంటు ఇస్తాం. మా పార్టీ ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. గత ప్రభుత్వాలు ఎందుకు ఇలా పనిచేయలేదు. ఎందుకంటే,   విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేస్తేనే.. రాజకీయ పార్టీలకు, అధికార పార్టీకిగానీ కమీషన్లు వస్తాయి. ఆ విధంగా రేట్లు పెంచేసి, తద్వారా కమీషన్లు గుంజుకుంటాయి. ఇవేవీ లేకుండా, ఏపీని సోలార్ రాష్ట్రంగా మారుస్తాం. ప్రజలే ప్రభుత్వానికి కరెంటు అమ్మే పరిస్థితిని తీసుకువస్తాను. పరిశ్రమలకు తప్ప మిగతా వారికి ఉచిత కరెంటు ఇస్తాం. 


పెట్రో ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించి, ధరలు తగ్గిస్తాం..

3- ధరలు తగ్గించాలిః ధరలు తగ్గించాలంటే.. పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరల ప్రభావం ఉంటుంది. వీటి ధరలు పెరిగినంతకాలం.. మనం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించలేం. మన రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా ఏపీ, తెలంగాణలో  జీఎస్టీ 31 శాతం విధిస్తున్నారు. అతి తక్కువ అరుణాచల్ ప్రదేశ్ లో 15 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 31 శాతం జీస్టీ కాకుండా, రూ. 4 అదనంగా వసూలు చేస్తున్నారు. అంటి, ఇంచుమించుగా 40 శాతం పన్నులు విధిస్తున్నారు.  35 నుంచి 15 శాతానికి పన్నులు తగ్గించగలిగితే..రాష్ట్ర ఆదాయం కోల్పోయినా ఫర్వాలేదు, ప్రజల ఆదాయం పెరగాలంటే, ఇది చేయాలి. పెట్రోలు ధర రూ. 100 కు మించకుండా చేసి, నిత్యావసరాల రవాణా ఖర్చులు తగ్గించి, నిత్యావసరాల ధరలు తగ్గించి,  ప్రజల ఆదాయాన్ని పెంచాలి. 


3000 టీఎంసీలకు నీటి నిల్వలు పెంచుతాం..

4- నీటి పారుదలః ఈ రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం 1000 టీఎంసీలు. వాస్తవానికి, మనకు అవసరం-1500 టీఎంసీలు ఉంది. 1200 టీఎంసీలు ఉన్నా.. తెలంగాణ భాగస్వామ్యం వల్ల మనకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారిని అడిగితే, ఎల్ నినో, వస్తుంది. సాగునీరు, తాగు నీరు ఇబ్బంది వస్తుంది అని చెబుతున్నారు. వరి పంట వేయొద్దు అని చెప్పటం తప్పు. మీరు నిజంగా విజినరీ అయితే, 1000 టీఎంసీల కెపాసిటీని.. మూడింతలు పెంచి ఉండేవాళ్లు. పెంచితే, రెండేళ్లు నిరంతరాయంగా  కరవు వచ్చినా మనకు సాగునీరు, తాగు నీరుకు ఇబ్బంది రాదు. దీనికి ట్రిబ్యునళ్ళు అంగీకరిస్తాయా అని అడగవచ్చు. మరి, ఎవర్ని అడిగి తెలంగాణ, కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టారు. !?


- సముద్రంలో కలిసే నీరు 4000 టీఎంసీలు ఉంది. వర్షాలు బాగా పడితే 5500 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిని రిజర్వాయర్లలోకి ఎలా మళ్లించాలి, ఎలా సాగు, తాగు నీటిగా మార్చుకోవాలి అన్నది ఆలోచించాలి. మా పార్టీ అధికారంలోకి వస్తే.. 1000 టీఎంసీల కెపాసిటీని, మూడింతలు పెంచి, అంటే 3000 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచి, రెండు, మూడేళ్లు కరవు వచ్చినా, రైతులకు సాగు, ప్రజలకు తాగు నీటికి ఇబ్బంది పడకుండా చేస్తాం. 


 - మరోవైపు రైతులకు సేవలు అందించాల్సిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు... ఎలా దోచుకుంటున్నాయో అన్ని ప్రభుత్వాల్లో చూస్తున్నాం. 


- ఈ రెండు రాజకీయ పార్టీలు మారవు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నంత వరకూ నీళ్ళు దొరకవు. ఎల్ నినోలు వస్తానే ఉంటాయి. వ్యవసాయం దెబ్బతింటుంది. రైతులు బతకరు. ఒక పార్టీని మరొకరు నిందించుకుంటూనే కాలం వెళ్ళబుచ్చుతారు. అందుకే ప్రత్యామ్నాయ పార్టీ అవసరం. 



ఏపీపీఎస్సీ-డీఎస్సీ స్కాంలపై సీబీఐ విచారణ జరగాలి..

5- విద్య.. యువతరానికి కావాల్సింది, విద్య, ఉద్యోగం. ఉద్యోగాలు వచ్చే విద్య వారికి కావాలి. ఉద్యోగాలు రానటువంటి కోర్సులను విస్మరించాలి. మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలి. టీచర్లపై ఓవర్ బర్డన్ కూడా తగ్గించాలి. చదువు చెప్పటం వరకే వారిని పరిమితం చేయాలి. మేం అధికారంలోకి వస్తే అదే చేస్తాం. 


- గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ స్కాంగానీ- ఈ ప్రభుత్వంలో జరిగిన డీఎస్సీ స్కాం గానీ.. రెండింటినీ నేను ఒప్పుకుంటాను. రెండింటిపై సీబీఐ విచారణ వేయాలని ప్రతిపక్షం అడుగుతుంది. ఈ  రెండింటినీ సీబీఐకి ఇచ్చి, నిష్పాక్షికంగా విచారణ చేసి, తప్పు చేసిన వారిని శిక్షించాలి. 


- ఏ రిక్రూట్ మెంటు అయినా పారదర్శకంగా జరగాలంటే, యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తరహాలో,  టీచర్ ఉద్యోగాలకు కూడా, ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి, వ్రాత పరీక్ష, ఇంటర్వూ పాస్ అయితేనే ఉద్యోగాలు కల్పిస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తాం. 


- 2014లోగానీ, 2019లోగానీ చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈరోజు దాని గురించి మాట్లాడరు. నిరుద్యోగులను గాలికి వదిలేశారు. 

- అధికారంలోకి వస్తే.. ఈ సమస్య పరిష్కారానికి, కేంద్రం ప్రతిపాదించినట్టుగా, గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్, అంటే నిర్ణీత కాలం, యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి, బయటకు వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగికి, నిర్ణిత కాలం నాలుగేళ్ళో, ఐదేళ్ళో అలవెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఉదాహరణకు,  పనికి ఆహార పథకం కూలీలకు ఉంది. నిరుద్యోగ యువతకు అటువంటి పథకాలేవీలేవు. వారికి ఉద్యోగాలు లేవు. యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియదు. వీరికోసం గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్ ఏర్పాటు చేస్తాం. 


- విద్యకు సంబంధించి టీడీపీకి ఒక లక్ష్యం ఉంది.. అదేంటంటే, ప్రభుత్వ బడులను బలహీనం చేసి, నారాయణ, చైతన్యలను బలోపేతం చేయాలన్నదే చంద్రబాబు గారి విధానం. 16 ఏళ్ళుగా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతూ ఉంది.  ఆయన హయాంలో ప్రభుత్వ బడులు మూసివేయడం జరిగింది. ప్రశ్నా పత్రాలు ఎలా లీక్ అవుతున్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలకే ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే ర్యాంకులు ఎందుకు రావు అనే భావన ఎందుకు ఉంది. దీనికి కారకులు ఎవరు?. మేం అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ బడులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి అభివృద్ధి చేస్తాం. 


- నీటి పారుదల, సోలార్ విద్యుత్, పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపు- నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, రైతుకు రెండు పంటలకు ఉచిత విద్యుత్, లోన్ యాప్ లకు చెక్ పెట్టి, వారిని చట్ట పరిధిలోకి తీసుకురావడం, ప్రజల ఆదాయాన్ని ఎలా పెంచడం, 66 శాతం సీట్లను 25-40 ఏళ్ళ మధ్య యువతకు కేటాయించడం..,మిగతా 34 శాతం సీనియర్లు, రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లకు అవకాశం కల్పించడమే మా పార్టీ అభిమతం . ఎందుకంటే, 40 ఏళ్ళ లోపు యువత దేశంలో 66 శాతం ఉన్నారు. అందులో 33 శాతం యువ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. 


- మీ వెనక ఏ నాయకుడు లేడే.. ఎలా సాధిస్తారని మీరు అడగవచ్చు.. ఒక్క 6 నెలలు ఆగండి. ఎంతమంది వస్తారో.. మీరే మీ కళ్ళతో చూస్తారు. యువతే మా పార్టీకి ప్రాణం. 


- తర్వాత అనంతపురంలో ప్రెస్ మీట్.. ఆ తర్వాత విశాఖ.. తిరుపతి.లో ప్రెస్ మీట్ పెడతాను. ఆ తర్వాత కాన్ క్లేవ్ పెట్టి పార్టీ పేరు, జెండా ప్రకటిస్తాను. విజయ దశమి తర్వాత, అది మరుసటిరోజు అయినా కావొచ్చు, పార్టీ స్థాపన జరుగుతుంది. ప్రాంతీయ పార్టీ మాది. ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం. 


మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..


- సంక్షేమాన్ని, అభివృద్ధి మధ్యలో సమతుల్యత పాటిస్తూ.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే మా కొత్త పార్టీ లక్ష్యం. 


- ఈ రాష్ట్రం దేశంలో ఒక భాగం. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశ భక్తి ఉండాలి. లేకపోతే, రాష్ట్రం ముక్కలు చెక్కలు అవుతుంది. 


- రెడ్డి కుటుంబంలో పుట్టినా కూడా, పెట్టబోయే పార్టీలో కూడా రెడ్డి, కమ్మలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం అని కాదు. మిగతా కులాల్లో ఎవరికైనా అధికారంలో అవకాశం ఉంటుంది. నాకు, నా కుటుంబానికి తప్ప. 


- ప్రజా ధనాన్ని దోచేసిన వ్యక్తి అని మాట్లాడిన వ్యక్తి.. ఈరోజు ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. నేను దోచుకుని ఉంటే.. నాపై చర్యలు తీసుకోండి. నాపైన కేసులు పెట్టండి. అరెస్టు చేయండి. ఉత్తుత్తి ఆరోపణలు ఎందుకు.. బహిరంగ సవాల్ విసురుతున్నాను. 


- పార్టీ కోసం తమిళనాడులో విజయ్ జోసెఫ్ ఎంత ఖర్చు పెట్టారు. నా ఇమేజ్ ఏంటో మీరే చూస్తారు. మరో మూడేళ్ళలో మా పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు. 


- టీడీపీ-వైసీపీ ఇద్దరూ నాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. నాకు శత్రువులు కాదు. వైసీపీలో కోటరీ కూడా ప్రత్యర్థులే. శత్రువులు కాదు. 


- కేఏ పాల్ పార్టీ అని మాట్లాడితే.. కేఏ పాల్ మంచోడు కాదనా.. అలా మాట్లాడిన వ్యక్తి ఉద్దేశమా..? అలా మాట్లాడిన వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడు. అతని చరిత్ర ఏంటి. ఆయన చేసిన ఘోరాలు ఏమిటి!? విజయమ్మ గారిని ఏ విధంగా తిట్టాడు. వైఎస్ఆర్ గారి గురించి ఏం మాట్లాడాడు..  వాస్తవాలను మీరే అర్థం చేసుకోవచ్చు. 


- నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లకు నేను వ్యతిరేకిని కాదు. దేశ భక్తి ఎవరిలో ఉంటుందో, ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో, ఎవరైతే హత్యలు చేయరో, ఎవరైతే మానభంగాలు చేయరూ వారందర్నీ నేను సమర్థిస్తాను. క్రిస్టియన్ వ్యతిరేకి, ముస్లిం వ్యతిరేకి అనటం కరెక్టు కాదు. ఆరోజు కాకినాడలో లవ్ జీహాద్ ఘటనలో ముస్లిం యువకుడు అవటం యాధృచ్ఛికమే అయినా, గుంటూరులో జరిగిన ఘటనలో, లవ్ జీహాద్   కాదని ఎస్పీ గారు చెప్పినా వీటిపై చర్చ జరగాలి. 


- ఇప్పటికి నేను ఎవరితో కలిసి పోటీ చేయాలనే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి. మా పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి, ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కావొచ్చు..


- 40 ఏళ్ళు వైఎస్ కుటుంబానికి పనిచేసిన మాట వాస్తవమే.. ఏ కారణాల వల్ల బయటకు వచ్చానో, ఏ కారణాల వల్ల నన్ను బయటకు గెంటారో.. నేను బహిరంగ లేఖలో చెప్పాను. ఆ విషయాలను ఛాలెంజ్ చేసి, కోటరీ చాలా మంచిది అని నా లేఖను ఖండిస్తే.. మరికొన్ని విషయాలను మరో బహిరంగ లేఖ ద్వారా వివరిస్తాను. నన్ను నమ్మక ద్రోహి అంటే.. ఎలా ఎదుర్కొంటానో మీడియా ద్వారా చెబుతాను. 


-నా పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. 


- బలవంతపు మత మార్పిడులపై.. మత మార్పిడులు కేవలం గత ఏడేళ్లలో మాత్రమే జరిగినవి కాదు. అంతకు ముందు కూడా జరిగాయి. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి యూపీ తరహా ట్రీట్ మెంట్ ఉంటుంది. ఈరోజు బలవంతపు మత మార్పిడులు జరగటం లేదని చంద్రబాబు గారిని చెప్పమనండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీని చెప్పమనండి. ఈ రాష్ట్రం విడిపోయిన-2014 నుంచి..  2019 వరకు, 2019 నుంచి 2024 వరకు, 2024 నుంచి 2026 వరకు ఎన్ని మత మార్పిడులుజరిగాయి.. ఎంత మంది పార్టీ టికెట్ ఆశావహులు మతాలు మారారు.. అన్నీ మీరే మీడియాలో చూస్తున్నారు.నేను చెప్పేది ఏమిటంటే, గతంలో మత మార్పిడులు ఉన్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 


- నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను. 140 బీసీ కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలు ఉన్నారు. సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సీఎం కావొచ్చు. 


- తప్పకుండా పాదయాత్ర చేస్తా. కేవలం రోడ్ల మీద నడవను. రాష్ట్రంలోని 660 మండలాలకు వెళ్ళి ప్రజల మధ్య నేను పాదయాత్ర చేస్తాను. గిన్నీస్ బుక్ రికార్డుల కోసం మాత్రమే నేను పాదయాత్ర చేయను... అని విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేశారు. 

-----

Aug 22, 2026

తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ




నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి


తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఆయన, ఆ తర్వాత కుమార్తె తేజస్విని, ఆమె పిల్లలతో ఆనందంగా గడిపేందుకు  అమెరికా వెళ్లి, అక్కడ కూడా ప్రొఫెసర్‌ గా కొనసాగారు. పరిశోధనల్లోనే ఆయన ఆనందించేవారు.  75 ఏళ్ల వయసులో అమెరికన్ పౌరసత్వం పొంది, 102 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతితో సమానమైన అత్యున్నత ‘అంతర్జాతీయ గణాంక బహుమతి-2023’పొందారు. ఆ విధంగా మన తెలుగువాడైన   రాధాకృష్ణా రావు  20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,  హూవిన హడగలి పట్టణంలో   1920 సెప్టెంబర్ 10న  రాధాకృష్ణా రావు ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.  సీడీ నాయుడు, ఎ.లక్ష్మీకాంతమ్మ దంపతులకు ఆరుగురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు, మొత్తం  పది మంది సంతానం. వారిలో ఎనిమిదవ వారిగా ఆయన జన్మించారు.   ఎనిమిదవ సంతానం అయినందున శ్రీకృష్ణుని పేరు పెట్టే సంప్రదాయం ప్రకారం రాధాకృష్ణ అని పేరు పెట్టారు. వారి తండ్రి నాయుడు ఉద్యోగరీత్యా పోలీస్ ఇనెస్పెక్టర్ అయినందున, తరచూ బదిలీలపై  ఊర్లు మారుతుండేవారు. ఆ విధంగా ఆయన విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలోని పాఠశాలల్లో  కొనసాగింది. చురుకుగా ఉండే ఆయన ఎప్పుడూ చదువులో మొదటి స్థానంలో ఉండేవారు. తనను తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహించినట్లు ఆయనే స్వయంగా రాసుకున్నారు. "నాలో జ్ఞానాన్వేషణ పెంపొందించినందుకు, నేను మా అమ్మ లక్ష్మీకాంతమ్మకు రుణపడి ఉన్నాను. నా చిన్నతనంలో, ఆమె ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు నన్ను నిద్రలేపి, మనసు తాజాగా ఉండే ఉదయపు ప్రశాంత వేళల్లో నేను చదువుకోవడానికి నూనె దీపాన్ని వెలిగించేవారు," అని ‘స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్' అనే తన పుస్తకంలో రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో  బి.ఏ (ఆనర్స్) డిగ్రీని  ఫస్ట్ ర్యాంకుతో పూర్తి చేశారు. రెండు మాస్టర్ డిగ్రీలు చేసి ఆయన భార్య భార్గవి కూడా కోల్ కత్తాలోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు.  1940లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం రామకృష్ణారావు  జీవిత గమనాన్ని మార్చివేసింది. బ్రిటీష్-ఇండియా సైన్యంలో చేరడానికి  విశాఖ నుంచి కలకత్తా వెళ్లారు. వయసు తక్కువ అవడం వల్ల అతనిని సైన్యంలోకి తీసుకోలేదు. దాంతో అతని చూపు కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)పై పడింది. అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ కృష్ణ సిఫారసు లేఖతో  1941లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో ఏడాది  శిక్షణకు చేరారు. అదే సంవత్సరం జూలైలో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పట్లో ఈ డిగ్రీ దేశంలో అక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు.  1943లో ఈ డిగ్రీ కూడా మెుదటి ర్యాంకుతో పూర్తి చేశారు.  వెంటనే, ఐఎస్ఐలో ఉద్యోగిగా చేరారు.  అదే సమయంలోనే, 1943 డిసెంబర్‌లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రంలో పార్ట్-టైమ్ లెక్చరర్‌గా కూడా చేరారు. 1946లో  యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా చేరారు.  ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఫిషర్  ఆధ్వర్యంలో   రాధాకృష్ణా రావు డాక్టరేట్ కోసం పరిశోధన చేశారు. ‘జీవ వర్గీకరణ యొక్క గణాంక సమస్యలు’ అనే సిద్ధాంత వ్యాసానికి 1948లో  ఆయన పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత,  గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1965లో రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్(డీఎస్‌సీ) పట్టాను ప్రదానం చేసింది. కేంబ్రిడ్జ్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చిన  రావు  ఐఎస్ఐలోనే ప్రొఫెసర్ గా చేరారు. అక్కడే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్(ఆర్‌టీఎస్) విభాగాధిపతిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్‌గా, ఆయన పరిశోధన,  శిక్షణా కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేశారు.  ప్రపంచంలోని ప్రముఖ గణాంక కేంద్రాలలో ఒకటిగా ఐఎస్ఐ ఖ్యాతి పొందడంలో ఆయన కృషి అద్వితీయం. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం ఆయన 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు జీవితంలో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. డాక్టర్ సి.ఆర్.రావు, సి.భార్గవి రావు దంపతుల కుమార్తె తేజస్విని రావు (తేజా రావు). ఇక్కడ పదవీ విరమణ చేసిన తర్వాత, వాస్తవానికి ఆయన తన కుమార్తె తేజా రావు, ఆమె పిల్లలతో గడపడానికి అమెరికా వెళ్లారు.  అక్కడ,  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 1979 నుంచి 1988 వరకు ప్రొఫెసర్‌గా చేశారు.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎబెర్లీ ఫ్యామిలీ చైర్ ఇన్ స్టాటిస్టిక్స్‌గా  1988 నుంచి 2000 వరకు కొనసాగారు. 1996లో ఆయన అమెరికన్ పౌరసత్వం పొందారు.  2010లో ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావు అమెరికాలోని  సెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా, మల్టీవేరియేట్ స్టాటిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందించారు. పెన్సిల్వినేనియా స్టేట్ యూనివర్సిటీలో పోషకాహార శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన కుమార్తె తేజస్విని బఫెలోలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్(ఎస్‌యూఎన్‌వై) కాలేజీలో డైటెటిక్స్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భరతనాట్యం, కూచిపూడి శాస్త్రీయ నృత్య శైలులలో నిష్ణాతురాలైన నర్తకి. నాట్య అనే నృత్య పాఠశాలకు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.

గణాంక శాస్త్రంలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయమైన పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ సిద్ధాంతాలు రూపొందించారు. 15 పుస్తకాల వరకు రాశారు.   భారతదేశంలో శాస్త్రవేత్తకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని 1963లో ఆయన అందుకున్నారు.  భారత ప్రభుత్వం 1968లో ఆయనను పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.  2002లో 82 ఏళ్ల వయసులో  అమెరికాలో వైట్ హౌస్ నుండి ఆయన 'నేషనల్ మెడల్ ఫర్ సైన్స్' పొందారు.  102 ఏళ్ల  వయసులో, అద్భుతమైన ఆరోగ్యంతో  నోబెల్ బహుమతితో సమానమైన  ‘సంఖ్యా శాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారం’ఆయన  అందుకోవడం విశేషం. ఓ విశిష్టమైన ఉదాహరణ. “ప్రొఫెసర్ సి.ఆర్.రావు 75 ఏళ్లకు పైగా చేసిన కృషి, ఇప్పటికీ విజ్ఞానశాస్త్రంపై ప్రగాఢమైన ప్రభావాన్ని  చూపుతూనే ఉందని,  జీవించి ఉన్న అటువంటి దిగ్గజ  శాస్త్రవేత్తకు 2023 అంతర్జాతీయ గణాంక శాస్త్ర పురస్కారం ప్రదానం చేశాం.” అని  పురస్కార ప్రశంసా పత్రంలో వివరించారు.  గణాంక శాస్త్రంలో  ఈ పురస్కారాన్ని 2016లో స్థాపించారు. "విజ్ఞాన, సాంకేతిక,  మానవ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి గణాంకాలను ఉపయోగించి, సాధించిన ప్రధాన విజయాలకు"  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక వ్యక్తికి  లేదా బృందానికి దీనిని ప్రదానం చేస్తారు. ‘‘ప్రొఫెసర్ రావు చేసిన కృషి  ఒక్క గణాంక శాస్త్రాన్నే కాకుండా అర్థశాస్త్రం, జన్యుశాస్త్రం, మానవశాస్త్రం, భూగర్భశాస్త్రం, జాతీయ ప్రణాళిక, జనాభా శాస్త్రం, బయోమెట్రీ, వైద్యశాస్త్రాలను కూడా  ప్రభావితం చేసింది.’’ అని అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ పేర్కొంది.  సరస్వతీ పుత్రుడైన ప్రొఫెసర్ రావు వెలువరించిన క్రామర్-రావు అసమానత, రావు-బ్లాక్ వెల్ సిద్ధాంతాలు, ఆయన రాసిన అంచనా సిద్ధాంతం, బహుళ చరరాశి విశ్లేషణ, మాత్రిక బీజగణితం.. పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గణాంక శాస్త్ర దిగ్గజంగా పేరు పొందిన ప్రొఫెసర్ రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెడికల్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్ సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తొలి పరిశోధనా పత్రాలు 'సమాచారం, సాంఖ్యక పారామితుల అంచనాలో సాధించగల కచ్చితత్వం' (1945), 'అంచనా సమస్యలకు అనువర్తనాలతో, అనేక పారామితులకు సంబంధించిన సాంఖ్యక పరికల్పనల యొక్క పెద్ద నమూనా పరీక్షలు'  (1948) రెండూ కూడా చాలా ప్రధానమైనవి. మరో రెండు పరిశోధనా పత్రాలు క్రామెర్-రావు అసమానత, రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం రెండూ బాగా ప్రసిద్ధి చెందాయి. మంచి ఫలితాలను ఇచ్చాయి.30 ఏళ్లు నిండకముందే, ప్రొఫెసర్ రావు ప్రయోగాత్మక రూపకల్పన, సాంఖ్యక అనుమానం, బహుళచర విశ్లేషణ, బయోస్టాటిస్టిక్స్ వంటి అంశాలపై 45కు పైగా  పరిశోధనా పత్రాలను ప్రచురించారు.  గణాంక శాస్త్రంలోని వివిధ శాఖలలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తూ, ఆయన విస్తృతంగా పరిశోధనలు కొనసాగించారు. సంభావ్యతా పంపిణీల లక్షణీకరణ వంటి రంగాలపై ఆయన మరింతగా ఆసక్తిని పెంచుకున్నారు.  


ప్రపంచంలో ఒక్క శాతానికి మించి  కంప్యూటర్ అనే పదమే తెలియని రోజుల్లో 1969లో 'కంప్యూటర్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ' అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ రావు రాశారు. అంతేకాదు, ఈనాడు  దాని ద్వారా మనం పొందే లాభ నష్టాలను కూడా  ఆయన అప్పుడే రాశారు. గణాంక శాస్త్రానికి సంబంధించి సరళమైన రీతిలో అనేక పరిశోధనా పత్రాలు ఆయన ప్రచురించారు. ఆయన దాదాపు 473 పరిశోధనా పత్రాలను, 15 పుస్తకాలను ప్రచురించారు. ఎల్సెవియర్ ప్రచురించిన 'హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్'  సిరీస్‌లో భాగంగా వచ్చిన వాటితో సహా అనేక ఇతర పుస్తకాలకు సంయుక్తంగా ఆయన సంపాదకత్వం వహించారు. ఆయన రాసిన 'అడ్వాన్స్‌డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ బయోమెట్రిక్ రీసెర్చ్',  'లీనియర్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్' అనే పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందిన ప్రామాణిక గ్రంథాలుగా నిలిచాయి. ఆయన 1989లో రాసిన  'స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్'(రామానుజన్ మెమోరియల్ లెక్చర్) అనేది గణాంకాలలోని తాత్విక సమస్యలను చర్చించడం జరిగింది. ప్రొఫెసర్ రావుకు కళాత్మక ద‌ష్టి ఎక్కువ.  1970లో ఆయన ఢిల్లీలోని ఐఎస్ఐలో ప్రొఫెసర్ గా చేరిన సమయంలో  అక్కడ కూచిపూడిని బోధించడానికి నృత్య పాఠశాల ఏదీ లేదని తెలిసి ఆశ్చర్యపోయారు. భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఆయనకున్న ఆసక్తి కారణంగా, ఆయన ఢిల్లీలో ఒక కూచిపూడి నృత్య అకాడమీని ప్రారంభించారు.  1979లో అమెరికా వెళ్లే వరకు ఆయన దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులో తమ కుమార్తె తేజస్వినిని న‌‌ృత్యం నేర్చుకునేందుకు ఒక నృత్య పాఠశాలలో చేర్పించారు. ఆయన పరిశోధనల పరంగా ఎంత బిజీగా ఉన్నా, తమ కుమార్తె  బహిరంగ నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు,  తరచుగా ప్రదర్శనలు, సంగీతం, పరిచయాలు,  లైటింగ్‌ వంటివాటిన ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు. అప్పట్లోనే, ఆమె నృత్య సంగీతానికి ఆంగ్ల అనువాదాలు అందించే ఏర్పాటు చేసేవారు.  అకడమిక్ పరంగా  ఆయన 50 మంది పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనకు మార్గనిర్దేశకుడుగా ఉన్నారు. దాదాపు 350 మంది విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మన దేశంలో, అమెరికాలో ఆయన వద్ద  విద్యార్థులుగా  శిక్షణ పొందిన వారు  చాలామంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా ఎదిగారు.  ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలు రామస్వామి రంగారావు, కె.ఆర్. పార్థసారథి, వీరవల్లి ఎస్. వరదరాజన్, ఎస్.ఆర్. శ్రీనివాస వరదన్ నలుగురూ ఐఎస్ఐలో ప్రొఫెసర్ రావు శిష్యులే.  సి.ఆర్. రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (AIMSCS). ఆయన భారతదేశంలోని ఈ ప్రాంతానికి చెందినవారు కాబట్టి, ఇది రావు గారికి తగిన నివాళి. భారతీయ గణాంక విద్యా వ్యవస్థ పితామహుడైన ప్రొఫెసర్ రావు తన 102వ ఏట 2023, ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. పదవీ విరమణ అంటే నిష్క్రియగా మారడం కాదని, చివరి శ్వాస వరకు పూర్తి ఉత్సాహంతో జీవించవచ్చని ప్రొఫెసర్ రాధాకృష్ణా రావు నిరూపించారు. ఆయన  జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914





20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తిగా నిలిచిన మన తెలుగువాడు

నేడు భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త  రాధాకృష్ణా రావు వర్ధంతి


మన దేశంలో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఓ శాస్త్రవేత్త, ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ కూడా ప్రొఫెసర్‌ గా కొనసాగి, 75 ఏళ్ల వయసులో అమెరికన్ పౌరసత్వం పొంది, 102 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతితో సమానమైన అత్యున్నత ‘అంతర్జాతీయ గణాంక బహుమతి’పొందారు. ఆ విధంగా మన తెలుగువాడైన  ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు  20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తిగా నిలిచారు. ‘‘ప్రొఫెసర్ రావు చేసిన కృషి  ఒక్క గణాంక శాస్త్రాన్నే కాకుండా అర్థశాస్త్రం, జన్యుశాస్త్రం, మానవశాస్త్రం, భూగర్భశాస్త్రం, జాతీయ ప్రణాళిక, జనాభా శాస్త్రం, బయోమెట్రీ, వైద్యశాస్త్ర్రాలను కూడా  ప్రభావితం చేసింది.’’ అని అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ పేర్కొంది. “ప్రొఫెసర్ సి.ఆర్. రావు 75 ఏళ్లకు పైగా చేసిన కృషి, ఇప్పటికీ విజ్ఞానశాస్త్రంపై ప్రగాఢమైన ప్రభావాన్ని  చూపుతూనే ఉందని,  జీవించి ఉన్న అటువంటి దిగ్గజ  శాస్త్రవేత్తకు 2023 అంతర్జాతీయ గణాంక శాస్త్ర్ర పురస్కారం ప్రదానం చేశాం.” అని  పురస్కార ప్రశంసాపత్రంలో వివరించారు.  సరస్వతీ పుత్రుడైన ప్రొఫెసర్ రావు వెలువరించిన క్రామర్-రావు అసమానత, రావు-బ్లాక్ వెల్ సిద్ధాంతాలు, ఆయన రాసిన అంచనా సిద్ధాంతం, బహుళ చరరాశి విశ్లేషణ, మాత్రిక బీజగణితం.. పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గణాంక శాస్త్ర దిగ్గజంగా పేరు పొందిన ప్రొఫెసర్ రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెడికల్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్ సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు.


ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,  హూవిన హడగలి పట్టణంలో  ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబర్ 10న  రాధాకృష్ణా రావు జన్మించారు.  సీడీ నాయుడు, ఎ.లక్ష్మీకాంతమ్మ దంపతుల  పది మంది సంతానంలో ఎనిమిదవ వారిగా ఆయన జన్మించారు. తండ్రి నాయుడు ఉద్యోగరీత్యా పోలీస్ ఇనెస్పెక్టర్ అయినందున, తరచూ బదిలీలపై ఊర్లు మారుతుండేవారు. ఆ విధంగా  ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలోని పాఠశాలల్లో ఆయన చదువుకున్నారు. ఆయన ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండేవారు. తనను తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహించినట్లు ఆయనే స్వయంగా రాసుకున్నారు. "నాలో జ్ఞానాన్వేషణ పెంపొందించినందుకు, నేను మా అమ్మ లక్ష్మీకాంతమ్మకు రుణపడి ఉన్నాను. నా చిన్నతనంలో, ఆమె ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు నన్ను నిద్రలేపి, మనసు తాజాగా ఉండే ఉదయపు ప్రశాంత వేళల్లో నేను చదువుకోవడానికి నూనె దీపాన్ని వెలిగించేవారు," అని ‘స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్' అనే తన పుస్తకంలో రాశారు.   ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ప్రథమ ర్యాంకుతో బి.ఏ (ఆనర్స్) డిగ్రీని పూర్తి చేశారు.   1941లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో  శిక్షణ పొందారు.  అదే సంవత్సరం జూలైలో కలకత్తా విశ్వవిద్యాలయంలోని గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పట్లో ఈ డిగ్రీ దేశంలో కొత్తగా ప్రవేశపెట్టారు.  1943లో ఈ డిగ్రీ కూడా మెుదటి ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు.  వెంటనే, ఐఎస్ఐలో ఉద్యోగిగా చేరారు.  1943 డిసెంబర్‌లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంకశాస్త్రంలో పార్ట్-టైమ్ లెక్చరర్‌గా చేరారు. 1946లో  యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా చేరారు.  ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఫిషర్  ఆధ్వర్యంలో   రాధాకృష్ణా రావు డాక్టరేట్ కోసం పరిశోధన చేశారు. ‘జీవ వర్గీకరణ యొక్క గణాంక సమస్యలు’ అనే సిద్ధాంత వ్యాసానికి 1948లో  ఆయన పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత,  గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1965లో రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్(డీఎస్‌సీ) పట్టాను ప్రదానం చేసింది. కేంబ్రిడ్జ్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చిన  రావు  ఐఎస్ఐలో ప్రొఫెసర్ గా చేరారు. అక్కడే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్(ఆర్‌టీఎస్) విభాగాధిపతిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్‌గా, ఆయన పరిశోధన,  శిక్షణా కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేశారు.  ప్రపంచంలోని ప్రముఖ గణాంక కేంద్రాలలో ఒకటిగా ఐఎస్ఐ ఖ్యాతి పొందడంలో ఆయన కృషి అద్వితీయం. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం ఆయన 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు జీవితంలో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అమెరికా వెళ్లి అక్కడ,  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 1979 నుంచి 1988 వరకు ప్రొఫెసర్‌గా చేశారు.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎబెర్లీ ఫ్యామిలీ చైర్ ఇన్ స్టాటిస్టిక్స్‌గా  1988 నుంచి 2000 వరకు కొనసాగారు. 2010లో ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావు అమెరికాలోని  సెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా, మల్టీవేరియేట్ స్టాటిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందించారు.

 అకడమిక్ పరంగా  ఆయన అనేక మంది పీహెచ్‌డీ విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మన దేశంలో, అమెరికాలో ఆయన వద్ద  విద్యార్థులుగా  శిక్షణ పొందిన వారు  చాలామంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా ఎదిగారు.  గణాంక శాస్త్రంలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయమైన పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ సిద్ధాంతాలు రూపొందించారు. 15 పుస్తకాల వరకు రాశారు. భారత ప్రభుత్వం 1968లో ఆయనను పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2002లో 82 ఏళ్ల వయసులో  అమెరికాలో వైట్ హౌస్ నుండి ఆయన 'నేషనల్ మెడల్ ఫర్ సైన్స్' పొందారు.  102 ఏళ్ల  వయసులో, అద్భుతమైన ఆరోగ్యంతో  నోబెల్ బహుమతితో సమానమైన  ‘సంఖ్యా శాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారం’ఆయన  అందుకోవడం విశేషం. ఓ విశిష్టమైన ఉదాహరణ.  భారతీయ గణాంక విద్యా వ్యవస్థ పితామహుడైన ప్రొఫెసర్ రావు తన 102వ ఏట 2023, ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. పదవీ విరమణ అంటే నిష్క్రియగా మారడం కాదని, చివరి శ్వాస వరకు పూర్తి ఉత్సాహంతో జీవించవచ్చని ప్రొఫెసర్ రాధాకృష్ణా రావు నిరూపించారు. ఆయన  జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Aug 19, 2026

దేశంలోని కోర్టులలో 5.74 కోట్లు దాటిన పెండింగ్ కేసులు

దేశంలోని న్యాయస్థానాలలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  2022 జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో దాదాపు 4.83 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.     ప్రస్తుతం దేశం మొత్తంలో కోర్టులలో పెండింగ్ కేసులు 5.74 కోట్లు దాటిపోయాయి. ఒక్క సుప్రీం కోర్టులోనే పెండింగ్ కేసుల సంఖ్య 95 వేలు దాటింది.  సాక్షుల గైర్హాజరు కావడం, సరైన సమయానికి ఆధారాలు అందకపోవడంతో  కేసుల విచారణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. లోక్ అదాలత్‌ల నిర్వహణ  ద్వారా రాజీ పడదగిన కేసులను త్వరగా పరిష్కరించడం, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ విధానంలో స్పీడ్ పెంచడం ... వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా,  కేసుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. జడ్జిల పోస్టులు ఖాళీగా ఉండటం కూడా ఒక కారణం. నేషనల్ జ్యుడిషియల్ డేటా ప్రకారం  ఈ ఏడాది ఆగస్ట్ 17వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా  సుప్రీం కోర్టు, హైకోర్టులు, రాష్ట్రాలలోని ఇతర కోర్టులలో  సివిల్ కేసులు  1,58,54,896  ఉండగా,   క్రిమినల్ కేసులు 4,15,76,022 ఉన్నాయి. మొత్తం 5,74,30,918  పెండింగ్ కేసులు ఉన్నాయి.  ఇందులో 30 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టులో  సివిల్ కేసులు  73,915,  క్రిమినల్ కేసులు 21,653,  మొత్తం 95, 568 పెండింగ్ కేసులు ఉన్నాయి.

రిజర్వ్ చేసిన తీర్పుల వెల్లడిలో కూడా హైకోర్టులలో తీవ్ర జాప్యం జరగడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  హైకోర్టుల్లో విచారణలు, తీర్పుల వెల్లడిలో జాప్యం నివారించేందుకు  సుప్రీం కోర్టు చర్యలు చేపట్టింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కల్పించిన విశేష అధికారాలను  ఉపయోగించి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా, జాప్యం తగ్గించేలా పలు అంశాలపై అన్ని హైకోర్టులకు  సుప్రీం కోర్టు కొన్ని సూచనలు  చేసింది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌ మాల్య బగ్చిలతో కూడిన ధర్మాసనం మే 29న కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఝార్ఖండ్ కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ సూచనలు చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్ఠంగా 3 నెలల్లోపు వెలువరించాలి. తీర్పు ధృవీకరించిన కాపీలో తీర్పును రిజర్వ్ చేసిన తేదీ, తీర్పును ప్రకటించిన తేదీ, తీర్పును అప్‌లోడ్ చేసిన తేదీని పేర్కొనాలి. సవివరమైన తీర్పును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు, పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులకు ఇమెయిల్/ ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు అదే రోజు ప్రకటించి, అప్‌లోడ్ చేయాలి. బెయిల్ ఉత్తర్వులు రిజర్వ్ చేస్తే మరుసటి రోజే ప్రకటించాలి. బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే అధికారులకు తెలపాలి.  ఖైదీల విడుదల సాధ్యమైనంత వరకు అదే రోజు, లేకపోతే మరుసటిరోజు జరగాలి. బెయిల్ ఉత్తర్వుల అమలుపై ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి.  కస్టడీలో ఉన్న అప్పిలెంట్ల కేసుల్లో 7 రోజుల్లోపే అదనపు వివరణలు కోరవచ్చు. ఇక అత్యవసర కేసు (కూల్చివేతలు, బహిష్కరణలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, బెయిల్‌ తదితరాలు)ల్లో కేవలం ప్రధాన నిర్ణయం (ఆపరేటివ్‌ ఆర్డర్‌) ముందుగా ఓపెన్‌ కోర్టులో ప్రకటించినా, దానికి గల పూర్తి కారణాలతో తీర్పును సాధారణంగా 7 రోజుల్లోపు, అసాధారణ పరిస్థితుల్లో 15 రోజుల్లోపు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలి.  ప్రకటించిన తీర్పు 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.  పెండింగ్ రిజర్వ్ తీర్పులపై ప్రతి నెల ఆటోమేటెడ్ ఇ-మెయిల్ పంపాలి.  2 నెలలు దాటిన పెండింగ్ తీర్పులను జడ్జిల దృష్టికి తీసుకెళ్లాలని లాయర్లకు సూచన చేశారు.  3 నెలల్లో తీర్పు రాకపోతే కేసు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లాలి.  మరో 2 వారాలు ఆలస్యమైతే కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.  3 నెలలైనా తీర్పు రాకపోతే పక్షాలు దరఖాస్తు చేసుకోవచ్చు.  4 నెలలు గడిచినా తీర్పు రాకపోతే బెంచ్ మార్పు కోరే హక్కు పక్షాలకు ఉంటుంది.  రిజర్వు చేసిన  తీర్పులు వెలువరించడంలో జరిగే జాప్యాన్ని తగ్గించి న్యాయ ప్రక్రియలో వేగం పెంచాలన్నది  సుప్రీంకోర్టు భావన.  హైకోర్టు, దిగువ కోర్టులలో ఈ సూచనలు పాటిస్తే, తీర్పుల వెల్లడిలో జాప్యం జరగదు.  కోర్టులలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం  ప్రోత్సహించడం, తరచూ లోక్ అదాలత్‌లను నిర్వహించడం, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, ఆధునిక సాంకేతికతను వాడడం, అనవసర వాయిదాలను తగ్గించడం, మౌలిక వసతులు పెంచడం.... వంటి  కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇంకా పెరుగుతూ వస్తోంది. కోట్లలో పేరుకుపోయిన పెండింగ్ కేసులు తగ్గించడానికి, వాయిదాలు తగ్గించడంతోపాటు విచారణ ప్రక్రియ వేగంగా జరిగే విధంగా  నూతన ఆలోచనలతో, కొత్త మార్గదర్శకాలను సుప్రీం కోర్టు రూపొందించవలసిన అవసరం ఉంది.

-      శిరందాసు నాగార్జున – 9440222914

Jul 26, 2026

చేనేత హక్కుల కోసం కడ వరకు ‘ప్రగడ’ పోరాటం


 

తుది శ్వాస వరకు చేనేత కోసం తపించిన ప్రగడ కోటయ్య


చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ప్రగడ కోటయ్య. చేనేత అంటే కోటయ్య, కోటయ్య అంటే చేనేత. ఆయన ఆలోచనలు చేనేత, శ్వాస చేనేత. జీవిత చరమాంకంలో ఆస్పత్రిలో అంపశయ్యపై ఉండి, 1995 నవంబర్‌ 26న  చనిపోవడానికి ఓ గంట ముందు కూడా చేనేత కార్మికుల సంక్షేమం గురించే కోటయ్య మాట్లాడారు.  ఆయన ఆరోగ్యం విషయమై తెలుసుకోవడానికి, అప్పటి జిల్లా కలెక్టర్ సి.ఉమామహేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. చివరి దశకు వచ్చేసినట్లు, తుది శ్వాస వదలడానికి ఎక్కువ సమయంలేదని కోటయ్యకు అర్థమైపోయింది. అప్పుడు కూడా ఆయన ఆలోచనలు చేనేత గురించే.  తన ఎంపీ కోటా నిధులను చేనేత కాలనీలలో సౌకర్యాల కోసం వినియోగించమని జిల్లా కలెక్టర్ కు చెప్పారు. అందువల్లే  చేనేత చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది.  జాతీయోద్యమంలో పాల్గొనడంతోపాటు చేనేత పరిశ్రమ, ఆ రంగంలోని కార్మికుల రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు కోటయ్య. ఆయన నిరుపేద అయినప్పటికీ   ప్రజా బాహుళ్యంలో  తనకు ఉన్న అభిమానంతో మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి,  ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ప్రగడ కోటయ్య దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యారు.  

ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధులు ఆచార్య ఎన్.జి.రంగా సలహా మేరకు కోటయ్య మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పిన్నింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్‌ సూపర్‌వైజర్ కోర్సు,  ఆ తర్వాత కాటన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, సిటీ & గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన కెమిస్ట్రీ సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన చదివిన  టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే  సూపర్‌వైజర్‌గా  పనిచేశారు. ఉద్యోగ రీత్యా రాష్ట్రమంతటా పర్యటించి చేనేత కార్మికుల కష్టాలను, వారి దయనీయ స్థితిని కళ్లారా దగ్గరగా చూశారు. ఆనాటి వారి ఆకలి చావులకు చలించిపోయారు. 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి,  అన్ని జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు. జీవచ్ఛవాలుగా బతుకులీడిస్తున్న చేనేత కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని కోటయ్య ఉద్యోగం మానేసి, చేనేత ఉద్యమంలోకి ఉరికారు. చేనేత రంగంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు.  ఎన్జీ రంగా ఒకసారి కోటయ్యను సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి, మహాత్మా గాంధీని పరిచయం చేశారు. చేనేత, ఖాదీ గురించి ఆయన గాంధీకి పూర్తిగా వివరించారు. 1941లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన థామస్‌ కమిటీకి చేనేత రంగ సమస్యలపై కోటయ్య వంద పేజీల మెమొరాండాన్ని అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘానికి దామర్ల రమాకాంత రావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. చేనేత కార్మికులను రాజకీయంగా చైతన్య పరచడం కోసం 1945లో గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. 1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1947-52 ప్రాంతంలో దాదాపు నాలుగేళ్లు నిడుబ్రోలు నుంచి ఆయన చేనేతవారపత్రికను కూడా నడిపారు.  
 
చేనేత పరిశ్రమకు చాలినంత నూలు సరఫరా చేయాలని,  ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలన్న డిమాండ్‌తో 1950లో  కోటయ్య చేనేత కాంగ్రెస్‌ తరఫున సమర శంఖం పూరించారు. మద్రాసులో 75 రోజులపాటు  సత్యాగ్రహ  ఉద్యమం నడిపారు. దాదాపు పది వేల మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు. చివరకు కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ మద్రాసు వచ్చి చేనేత కాంగ్రెస్‌ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత వర్గాల కోసం కోటయ్య రేపల్లెలో సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసి, రైలులో బళ్లారి జైలుకు తరలిస్తుండగా,  ప్రతి రైల్వేస్టేషన్‌లో  భారీ సంఖ్యలో చేనేత కార్మికులు అడ్డుపడ్డారు.  ప్రతి రైల్వేస్టేషన్‌లో రైలుని నిలిపివేయడంతో, అది బళ్లారి చేరే పరిస్థితి కనిపించలేదు. అధికారుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న  ప్రకాశం, కోటయ్యని అప్పటి రాజధాని కర్నూలుకు తీసుకురమ్మని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి  ప్రకాశం పంతులు ‘‘ఏందిరా కోటయ్య, నీ సమస్య ఏమిటి?’’ అని అడిగారు.  చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన చేనేత ఉత్పత్తుల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోటయ్య డిమాండ్ చేశారు. దాంతో, అప్పటికప్పుడే చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ప్రకాశం పంతులు రూ.50 లక్షలు విడుదల చేశారు. దటీజ్ ప్రగడ కోటయ్య.

చేనేత సమస్యలపై నిజాయితీగా పోరాడే నేతగా  ఆ నాటి కాంగ్రెస్ అగ్రనేతలందరి వద్ద ప్రగడ కోటయ్య గుర్తింపు పొందారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిగా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వరకు అందరితోనూ కోటయ్య మాట్లాడి చేనేత సమస్యలు పరిష్కరించారు.  1975లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకంలో చేనేత కార్మికులకు ఉపయోగపడే అంశాలను కూడా ఒక పాయింట్ లో చేర్చేందుకు ఇందిరా గాంధీని కోటయ్య ఒప్పించారు. చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు విశేష  కృషి చేసి, దానికి వ్యవస్థాపక చైర్మన్‌గా కోటయ్య ఉన్నారు. ఈ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను  ప్రధానికి కోటయ్య వివరించారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.  ఢిల్లీలో జరిగిన అఖిల భారత చేనేత మహాసభలో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మాట్లాడుతూ, ‘‘చేనేత సమస్యలు నాకు చెప్పి ప్రయోజనంలేదు.  ప్రగడ కోటయ్యకు చెబితే, ఆయనకు తెలుస్తాయి. ఆయన నిద్రపోతున్నా లేపి, సమస్యలు చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన ఏది చెబితే అది మేం చేస్తాం’’ అని చెప్పారు. ప్రధాని అంతటి వ్యక్తి అలా చెప్పారంటే కోటయ్యకు, చేనేతకు  ఉన్న అనుబంధం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా అన్ని పార్టీలలో కూడా చేనేత అంటే కోటయ్య పేరే గుర్తుకు వస్తుంది. భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా ఆయన శ్రీలంక, బ్రిటన్,  చైనా, హాంకాంగ్ తదితర దేశాలలో పర్యటించి, అక్కడ చేనేత రంగాన్ని అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య చివరి వరకు చేనేత రంగం సంక్షేమం కోసమే తపించారు.    

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) పూర్తి చేశారు. చదువుకునే సమయంలోనే తండ్రి వద్ద ఆయన చేనేత గురించి పూర్తిగా తెలుసుకున్నారు.  1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు వెంకట శేష శయన  బీటెక్ పూర్తి చేసి, ఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవి, వంగర శకుంతలాదేవి, ఊట్ల అనసూయ, గుర్రం విజయలక్ష్మి, దొంతంశెట్టి శ్యామలాదేవి, ఉడతా పద్మావతి వారి కుమార్తెలు. చేనేతను బతికించడం కోసం చివరి వరకు తపించిన ప్రగడ కోటయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.  చేనేత నేత కోటయ్య జయంతిని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం.

- శిరందాసు నాగార్జున రావు,  సీనియర్ జర్నలిస్ట్- 9440222914.

 

నేడు మంగళగిరి మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ గోలి గోపాలరావు 36వ వర్ధంతి

1969  అక్టోబర్ 1 వ తారీఖు మంగళగిరి "గ్రామ పంచాయితీ" స్థాయి నుండి "మున్సిపాలిటీ" హోదా పొందినది. 1971 లో మంగళగిరి మున్సిపా...