Aug 22, 2026

తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ




నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి


తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఆయన, ఆ తర్వాత కుమార్తె తేజస్విని, ఆమె పిల్లలతో ఆనందంగా గడిపేందుకు  అమెరికా వెళ్లి, అక్కడ కూడా ప్రొఫెసర్‌ గా కొనసాగారు. పరిశోధనల్లోనే ఆయన ఆనందించేవారు.  75 ఏళ్ల వయసులో అమెరికన్ పౌరసత్వం పొంది, 102 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతితో సమానమైన అత్యున్నత ‘అంతర్జాతీయ గణాంక బహుమతి-2023’పొందారు. ఆ విధంగా మన తెలుగువాడైన   రాధాకృష్ణా రావు  20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,  హూవిన హడగలి పట్టణంలో   1920 సెప్టెంబర్ 10న  రాధాకృష్ణా రావు ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.  సీడీ నాయుడు, ఎ.లక్ష్మీకాంతమ్మ దంపతులకు ఆరుగురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు, మొత్తం  పది మంది సంతానం. వారిలో ఎనిమిదవ వారిగా ఆయన జన్మించారు.   ఎనిమిదవ సంతానం అయినందున శ్రీకృష్ణుని పేరు పెట్టే సంప్రదాయం ప్రకారం రాధాకృష్ణ అని పేరు పెట్టారు. వారి తండ్రి నాయుడు ఉద్యోగరీత్యా పోలీస్ ఇనెస్పెక్టర్ అయినందున, తరచూ బదిలీలపై  ఊర్లు మారుతుండేవారు. ఆ విధంగా ఆయన విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలోని పాఠశాలల్లో  కొనసాగింది. చురుకుగా ఉండే ఆయన ఎప్పుడూ చదువులో మొదటి స్థానంలో ఉండేవారు. తనను తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహించినట్లు ఆయనే స్వయంగా రాసుకున్నారు. "నాలో జ్ఞానాన్వేషణ పెంపొందించినందుకు, నేను మా అమ్మ లక్ష్మీకాంతమ్మకు రుణపడి ఉన్నాను. నా చిన్నతనంలో, ఆమె ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు నన్ను నిద్రలేపి, మనసు తాజాగా ఉండే ఉదయపు ప్రశాంత వేళల్లో నేను చదువుకోవడానికి నూనె దీపాన్ని వెలిగించేవారు," అని ‘స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్' అనే తన పుస్తకంలో రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో  బి.ఏ (ఆనర్స్) డిగ్రీని  ఫస్ట్ ర్యాంకుతో పూర్తి చేశారు. రెండు మాస్టర్ డిగ్రీలు చేసి ఆయన భార్య భార్గవి కూడా కోల్ కత్తాలోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు.  1940లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం రామకృష్ణారావు  జీవిత గమనాన్ని మార్చివేసింది. బ్రిటీష్-ఇండియా సైన్యంలో చేరడానికి  విశాఖ నుంచి కలకత్తా వెళ్లారు. వయసు తక్కువ అవడం వల్ల అతనిని సైన్యంలోకి తీసుకోలేదు. దాంతో అతని చూపు కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)పై పడింది. అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ కృష్ణ సిఫారసు లేఖతో  1941లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో ఏడాది  శిక్షణకు చేరారు. అదే సంవత్సరం జూలైలో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పట్లో ఈ డిగ్రీ దేశంలో అక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు.  1943లో ఈ డిగ్రీ కూడా మెుదటి ర్యాంకుతో పూర్తి చేశారు.  వెంటనే, ఐఎస్ఐలో ఉద్యోగిగా చేరారు.  అదే సమయంలోనే, 1943 డిసెంబర్‌లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రంలో పార్ట్-టైమ్ లెక్చరర్‌గా కూడా చేరారు. 1946లో  యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా చేరారు.  ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఫిషర్  ఆధ్వర్యంలో   రాధాకృష్ణా రావు డాక్టరేట్ కోసం పరిశోధన చేశారు. ‘జీవ వర్గీకరణ యొక్క గణాంక సమస్యలు’ అనే సిద్ధాంత వ్యాసానికి 1948లో  ఆయన పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత,  గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1965లో రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్(డీఎస్‌సీ) పట్టాను ప్రదానం చేసింది. కేంబ్రిడ్జ్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చిన  రావు  ఐఎస్ఐలోనే ప్రొఫెసర్ గా చేరారు. అక్కడే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్(ఆర్‌టీఎస్) విభాగాధిపతిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్‌గా, ఆయన పరిశోధన,  శిక్షణా కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేశారు.  ప్రపంచంలోని ప్రముఖ గణాంక కేంద్రాలలో ఒకటిగా ఐఎస్ఐ ఖ్యాతి పొందడంలో ఆయన కృషి అద్వితీయం. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం ఆయన 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు జీవితంలో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. డాక్టర్ సి.ఆర్.రావు, సి.భార్గవి రావు దంపతుల కుమార్తె తేజస్విని రావు (తేజా రావు). ఇక్కడ పదవీ విరమణ చేసిన తర్వాత, వాస్తవానికి ఆయన తన కుమార్తె తేజా రావు, ఆమె పిల్లలతో గడపడానికి అమెరికా వెళ్లారు.  అక్కడ,  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 1979 నుంచి 1988 వరకు ప్రొఫెసర్‌గా చేశారు.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎబెర్లీ ఫ్యామిలీ చైర్ ఇన్ స్టాటిస్టిక్స్‌గా  1988 నుంచి 2000 వరకు కొనసాగారు. 1996లో ఆయన అమెరికన్ పౌరసత్వం పొందారు.  2010లో ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావు అమెరికాలోని  సెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా, మల్టీవేరియేట్ స్టాటిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందించారు. పెన్సిల్వినేనియా స్టేట్ యూనివర్సిటీలో పోషకాహార శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన కుమార్తె తేజస్విని బఫెలోలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్(ఎస్‌యూఎన్‌వై) కాలేజీలో డైటెటిక్స్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భరతనాట్యం, కూచిపూడి శాస్త్రీయ నృత్య శైలులలో నిష్ణాతురాలైన నర్తకి. నాట్య అనే నృత్య పాఠశాలకు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.

గణాంక శాస్త్రంలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయమైన పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ సిద్ధాంతాలు రూపొందించారు. 15 పుస్తకాల వరకు రాశారు.   భారతదేశంలో శాస్త్రవేత్తకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని 1963లో ఆయన అందుకున్నారు.  భారత ప్రభుత్వం 1968లో ఆయనను పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.  2002లో 82 ఏళ్ల వయసులో  అమెరికాలో వైట్ హౌస్ నుండి ఆయన 'నేషనల్ మెడల్ ఫర్ సైన్స్' పొందారు.  102 ఏళ్ల  వయసులో, అద్భుతమైన ఆరోగ్యంతో  నోబెల్ బహుమతితో సమానమైన  ‘సంఖ్యా శాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారం’ఆయన  అందుకోవడం విశేషం. ఓ విశిష్టమైన ఉదాహరణ. “ప్రొఫెసర్ సి.ఆర్.రావు 75 ఏళ్లకు పైగా చేసిన కృషి, ఇప్పటికీ విజ్ఞానశాస్త్రంపై ప్రగాఢమైన ప్రభావాన్ని  చూపుతూనే ఉందని,  జీవించి ఉన్న అటువంటి దిగ్గజ  శాస్త్రవేత్తకు 2023 అంతర్జాతీయ గణాంక శాస్త్ర పురస్కారం ప్రదానం చేశాం.” అని  పురస్కార ప్రశంసా పత్రంలో వివరించారు.  గణాంక శాస్త్రంలో  ఈ పురస్కారాన్ని 2016లో స్థాపించారు. "విజ్ఞాన, సాంకేతిక,  మానవ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి గణాంకాలను ఉపయోగించి, సాధించిన ప్రధాన విజయాలకు"  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక వ్యక్తికి  లేదా బృందానికి దీనిని ప్రదానం చేస్తారు. ‘‘ప్రొఫెసర్ రావు చేసిన కృషి  ఒక్క గణాంక శాస్త్రాన్నే కాకుండా అర్థశాస్త్రం, జన్యుశాస్త్రం, మానవశాస్త్రం, భూగర్భశాస్త్రం, జాతీయ ప్రణాళిక, జనాభా శాస్త్రం, బయోమెట్రీ, వైద్యశాస్త్రాలను కూడా  ప్రభావితం చేసింది.’’ అని అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ పేర్కొంది.  సరస్వతీ పుత్రుడైన ప్రొఫెసర్ రావు వెలువరించిన క్రామర్-రావు అసమానత, రావు-బ్లాక్ వెల్ సిద్ధాంతాలు, ఆయన రాసిన అంచనా సిద్ధాంతం, బహుళ చరరాశి విశ్లేషణ, మాత్రిక బీజగణితం.. పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గణాంక శాస్త్ర దిగ్గజంగా పేరు పొందిన ప్రొఫెసర్ రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెడికల్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్ సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తొలి పరిశోధనా పత్రాలు 'సమాచారం, సాంఖ్యక పారామితుల అంచనాలో సాధించగల కచ్చితత్వం' (1945), 'అంచనా సమస్యలకు అనువర్తనాలతో, అనేక పారామితులకు సంబంధించిన సాంఖ్యక పరికల్పనల యొక్క పెద్ద నమూనా పరీక్షలు'  (1948) రెండూ కూడా చాలా ప్రధానమైనవి. మరో రెండు పరిశోధనా పత్రాలు క్రామెర్-రావు అసమానత, రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం రెండూ బాగా ప్రసిద్ధి చెందాయి. మంచి ఫలితాలను ఇచ్చాయి.30 ఏళ్లు నిండకముందే, ప్రొఫెసర్ రావు ప్రయోగాత్మక రూపకల్పన, సాంఖ్యక అనుమానం, బహుళచర విశ్లేషణ, బయోస్టాటిస్టిక్స్ వంటి అంశాలపై 45కు పైగా  పరిశోధనా పత్రాలను ప్రచురించారు.  గణాంక శాస్త్రంలోని వివిధ శాఖలలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తూ, ఆయన విస్తృతంగా పరిశోధనలు కొనసాగించారు. సంభావ్యతా పంపిణీల లక్షణీకరణ వంటి రంగాలపై ఆయన మరింతగా ఆసక్తిని పెంచుకున్నారు.  


ప్రపంచంలో ఒక్క శాతానికి మించి  కంప్యూటర్ అనే పదమే తెలియని రోజుల్లో 1969లో 'కంప్యూటర్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ' అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ రావు రాశారు. అంతేకాదు, ఈనాడు  దాని ద్వారా మనం పొందే లాభ నష్టాలను కూడా  ఆయన అప్పుడే రాశారు. గణాంక శాస్త్రానికి సంబంధించి సరళమైన రీతిలో అనేక పరిశోధనా పత్రాలు ఆయన ప్రచురించారు. ఆయన దాదాపు 473 పరిశోధనా పత్రాలను, 15 పుస్తకాలను ప్రచురించారు. ఎల్సెవియర్ ప్రచురించిన 'హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్'  సిరీస్‌లో భాగంగా వచ్చిన వాటితో సహా అనేక ఇతర పుస్తకాలకు సంయుక్తంగా ఆయన సంపాదకత్వం వహించారు. ఆయన రాసిన 'అడ్వాన్స్‌డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ బయోమెట్రిక్ రీసెర్చ్',  'లీనియర్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్' అనే పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందిన ప్రామాణిక గ్రంథాలుగా నిలిచాయి. ఆయన 1989లో రాసిన  'స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్'(రామానుజన్ మెమోరియల్ లెక్చర్) అనేది గణాంకాలలోని తాత్విక సమస్యలను చర్చించడం జరిగింది. ప్రొఫెసర్ రావుకు కళాత్మక ద‌ష్టి ఎక్కువ.  1970లో ఆయన ఢిల్లీలోని ఐఎస్ఐలో ప్రొఫెసర్ గా చేరిన సమయంలో  అక్కడ కూచిపూడిని బోధించడానికి నృత్య పాఠశాల ఏదీ లేదని తెలిసి ఆశ్చర్యపోయారు. భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఆయనకున్న ఆసక్తి కారణంగా, ఆయన ఢిల్లీలో ఒక కూచిపూడి నృత్య అకాడమీని ప్రారంభించారు.  1979లో అమెరికా వెళ్లే వరకు ఆయన దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులో తమ కుమార్తె తేజస్వినిని న‌‌ృత్యం నేర్చుకునేందుకు ఒక నృత్య పాఠశాలలో చేర్పించారు. ఆయన పరిశోధనల పరంగా ఎంత బిజీగా ఉన్నా, తమ కుమార్తె  బహిరంగ నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు,  తరచుగా ప్రదర్శనలు, సంగీతం, పరిచయాలు,  లైటింగ్‌ వంటివాటిన ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు. అప్పట్లోనే, ఆమె నృత్య సంగీతానికి ఆంగ్ల అనువాదాలు అందించే ఏర్పాటు చేసేవారు.  అకడమిక్ పరంగా  ఆయన 50 మంది పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనకు మార్గనిర్దేశకుడుగా ఉన్నారు. దాదాపు 350 మంది విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మన దేశంలో, అమెరికాలో ఆయన వద్ద  విద్యార్థులుగా  శిక్షణ పొందిన వారు  చాలామంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా ఎదిగారు.  ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలు రామస్వామి రంగారావు, కె.ఆర్. పార్థసారథి, వీరవల్లి ఎస్. వరదరాజన్, ఎస్.ఆర్. శ్రీనివాస వరదన్ నలుగురూ ఐఎస్ఐలో ప్రొఫెసర్ రావు శిష్యులే.  సి.ఆర్. రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (AIMSCS). ఆయన భారతదేశంలోని ఈ ప్రాంతానికి చెందినవారు కాబట్టి, ఇది రావు గారికి తగిన నివాళి. భారతీయ గణాంక విద్యా వ్యవస్థ పితామహుడైన ప్రొఫెసర్ రావు తన 102వ ఏట 2023, ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. పదవీ విరమణ అంటే నిష్క్రియగా మారడం కాదని, చివరి శ్వాస వరకు పూర్తి ఉత్సాహంతో జీవించవచ్చని ప్రొఫెసర్ రాధాకృష్ణా రావు నిరూపించారు. ఆయన  జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914





20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తిగా నిలిచిన మన తెలుగువాడు

నేడు భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త  రాధాకృష్ణా రావు వర్ధంతి


మన దేశంలో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఓ శాస్త్రవేత్త, ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ కూడా ప్రొఫెసర్‌ గా కొనసాగి, 75 ఏళ్ల వయసులో అమెరికన్ పౌరసత్వం పొంది, 102 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతితో సమానమైన అత్యున్నత ‘అంతర్జాతీయ గణాంక బహుమతి’పొందారు. ఆ విధంగా మన తెలుగువాడైన  ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు  20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తిగా నిలిచారు. ‘‘ప్రొఫెసర్ రావు చేసిన కృషి  ఒక్క గణాంక శాస్త్రాన్నే కాకుండా అర్థశాస్త్రం, జన్యుశాస్త్రం, మానవశాస్త్రం, భూగర్భశాస్త్రం, జాతీయ ప్రణాళిక, జనాభా శాస్త్రం, బయోమెట్రీ, వైద్యశాస్త్ర్రాలను కూడా  ప్రభావితం చేసింది.’’ అని అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ పేర్కొంది. “ప్రొఫెసర్ సి.ఆర్. రావు 75 ఏళ్లకు పైగా చేసిన కృషి, ఇప్పటికీ విజ్ఞానశాస్త్రంపై ప్రగాఢమైన ప్రభావాన్ని  చూపుతూనే ఉందని,  జీవించి ఉన్న అటువంటి దిగ్గజ  శాస్త్రవేత్తకు 2023 అంతర్జాతీయ గణాంక శాస్త్ర్ర పురస్కారం ప్రదానం చేశాం.” అని  పురస్కార ప్రశంసాపత్రంలో వివరించారు.  సరస్వతీ పుత్రుడైన ప్రొఫెసర్ రావు వెలువరించిన క్రామర్-రావు అసమానత, రావు-బ్లాక్ వెల్ సిద్ధాంతాలు, ఆయన రాసిన అంచనా సిద్ధాంతం, బహుళ చరరాశి విశ్లేషణ, మాత్రిక బీజగణితం.. పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గణాంక శాస్త్ర దిగ్గజంగా పేరు పొందిన ప్రొఫెసర్ రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెడికల్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్ సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు.


ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,  హూవిన హడగలి పట్టణంలో  ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబర్ 10న  రాధాకృష్ణా రావు జన్మించారు.  సీడీ నాయుడు, ఎ.లక్ష్మీకాంతమ్మ దంపతుల  పది మంది సంతానంలో ఎనిమిదవ వారిగా ఆయన జన్మించారు. తండ్రి నాయుడు ఉద్యోగరీత్యా పోలీస్ ఇనెస్పెక్టర్ అయినందున, తరచూ బదిలీలపై ఊర్లు మారుతుండేవారు. ఆ విధంగా  ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలోని పాఠశాలల్లో ఆయన చదువుకున్నారు. ఆయన ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండేవారు. తనను తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహించినట్లు ఆయనే స్వయంగా రాసుకున్నారు. "నాలో జ్ఞానాన్వేషణ పెంపొందించినందుకు, నేను మా అమ్మ లక్ష్మీకాంతమ్మకు రుణపడి ఉన్నాను. నా చిన్నతనంలో, ఆమె ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు నన్ను నిద్రలేపి, మనసు తాజాగా ఉండే ఉదయపు ప్రశాంత వేళల్లో నేను చదువుకోవడానికి నూనె దీపాన్ని వెలిగించేవారు," అని ‘స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్' అనే తన పుస్తకంలో రాశారు.   ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ప్రథమ ర్యాంకుతో బి.ఏ (ఆనర్స్) డిగ్రీని పూర్తి చేశారు.   1941లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో  శిక్షణ పొందారు.  అదే సంవత్సరం జూలైలో కలకత్తా విశ్వవిద్యాలయంలోని గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పట్లో ఈ డిగ్రీ దేశంలో కొత్తగా ప్రవేశపెట్టారు.  1943లో ఈ డిగ్రీ కూడా మెుదటి ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు.  వెంటనే, ఐఎస్ఐలో ఉద్యోగిగా చేరారు.  1943 డిసెంబర్‌లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంకశాస్త్రంలో పార్ట్-టైమ్ లెక్చరర్‌గా చేరారు. 1946లో  యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా చేరారు.  ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఫిషర్  ఆధ్వర్యంలో   రాధాకృష్ణా రావు డాక్టరేట్ కోసం పరిశోధన చేశారు. ‘జీవ వర్గీకరణ యొక్క గణాంక సమస్యలు’ అనే సిద్ధాంత వ్యాసానికి 1948లో  ఆయన పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత,  గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1965లో రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్(డీఎస్‌సీ) పట్టాను ప్రదానం చేసింది. కేంబ్రిడ్జ్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చిన  రావు  ఐఎస్ఐలో ప్రొఫెసర్ గా చేరారు. అక్కడే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్(ఆర్‌టీఎస్) విభాగాధిపతిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్‌గా, ఆయన పరిశోధన,  శిక్షణా కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేశారు.  ప్రపంచంలోని ప్రముఖ గణాంక కేంద్రాలలో ఒకటిగా ఐఎస్ఐ ఖ్యాతి పొందడంలో ఆయన కృషి అద్వితీయం. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం ఆయన 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు జీవితంలో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అమెరికా వెళ్లి అక్కడ,  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 1979 నుంచి 1988 వరకు ప్రొఫెసర్‌గా చేశారు.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎబెర్లీ ఫ్యామిలీ చైర్ ఇన్ స్టాటిస్టిక్స్‌గా  1988 నుంచి 2000 వరకు కొనసాగారు. 2010లో ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావు అమెరికాలోని  సెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా, మల్టీవేరియేట్ స్టాటిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందించారు.

 అకడమిక్ పరంగా  ఆయన అనేక మంది పీహెచ్‌డీ విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మన దేశంలో, అమెరికాలో ఆయన వద్ద  విద్యార్థులుగా  శిక్షణ పొందిన వారు  చాలామంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా ఎదిగారు.  గణాంక శాస్త్రంలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయమైన పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ సిద్ధాంతాలు రూపొందించారు. 15 పుస్తకాల వరకు రాశారు. భారత ప్రభుత్వం 1968లో ఆయనను పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2002లో 82 ఏళ్ల వయసులో  అమెరికాలో వైట్ హౌస్ నుండి ఆయన 'నేషనల్ మెడల్ ఫర్ సైన్స్' పొందారు.  102 ఏళ్ల  వయసులో, అద్భుతమైన ఆరోగ్యంతో  నోబెల్ బహుమతితో సమానమైన  ‘సంఖ్యా శాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారం’ఆయన  అందుకోవడం విశేషం. ఓ విశిష్టమైన ఉదాహరణ.  భారతీయ గణాంక విద్యా వ్యవస్థ పితామహుడైన ప్రొఫెసర్ రావు తన 102వ ఏట 2023, ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. పదవీ విరమణ అంటే నిష్క్రియగా మారడం కాదని, చివరి శ్వాస వరకు పూర్తి ఉత్సాహంతో జీవించవచ్చని ప్రొఫెసర్ రాధాకృష్ణా రావు నిరూపించారు. ఆయన  జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Aug 19, 2026

దేశంలోని కోర్టులలో 5.74 కోట్లు దాటిన పెండింగ్ కేసులు

దేశంలోని న్యాయస్థానాలలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  2022 జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో దాదాపు 4.83 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.     ప్రస్తుతం దేశం మొత్తంలో కోర్టులలో పెండింగ్ కేసులు 5.74 కోట్లు దాటిపోయాయి. ఒక్క సుప్రీం కోర్టులోనే పెండింగ్ కేసుల సంఖ్య 95 వేలు దాటింది.  సాక్షుల గైర్హాజరు కావడం, సరైన సమయానికి ఆధారాలు అందకపోవడంతో  కేసుల విచారణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. లోక్ అదాలత్‌ల నిర్వహణ  ద్వారా రాజీ పడదగిన కేసులను త్వరగా పరిష్కరించడం, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ విధానంలో స్పీడ్ పెంచడం ... వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా,  కేసుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. జడ్జిల పోస్టులు ఖాళీగా ఉండటం కూడా ఒక కారణం. నేషనల్ జ్యుడిషియల్ డేటా ప్రకారం  ఈ ఏడాది ఆగస్ట్ 17వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా  సుప్రీం కోర్టు, హైకోర్టులు, రాష్ట్రాలలోని ఇతర కోర్టులలో  సివిల్ కేసులు  1,58,54,896  ఉండగా,   క్రిమినల్ కేసులు 4,15,76,022 ఉన్నాయి. మొత్తం 5,74,30,918  పెండింగ్ కేసులు ఉన్నాయి.  ఇందులో 30 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టులో  సివిల్ కేసులు  73,915,  క్రిమినల్ కేసులు 21,653,  మొత్తం 95, 568 పెండింగ్ కేసులు ఉన్నాయి.

రిజర్వ్ చేసిన తీర్పుల వెల్లడిలో కూడా హైకోర్టులలో తీవ్ర జాప్యం జరగడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  హైకోర్టుల్లో విచారణలు, తీర్పుల వెల్లడిలో జాప్యం నివారించేందుకు  సుప్రీం కోర్టు చర్యలు చేపట్టింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కల్పించిన విశేష అధికారాలను  ఉపయోగించి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా, జాప్యం తగ్గించేలా పలు అంశాలపై అన్ని హైకోర్టులకు  సుప్రీం కోర్టు కొన్ని సూచనలు  చేసింది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌ మాల్య బగ్చిలతో కూడిన ధర్మాసనం మే 29న కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఝార్ఖండ్ కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ సూచనలు చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్ఠంగా 3 నెలల్లోపు వెలువరించాలి. తీర్పు ధృవీకరించిన కాపీలో తీర్పును రిజర్వ్ చేసిన తేదీ, తీర్పును ప్రకటించిన తేదీ, తీర్పును అప్‌లోడ్ చేసిన తేదీని పేర్కొనాలి. సవివరమైన తీర్పును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు, పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులకు ఇమెయిల్/ ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు అదే రోజు ప్రకటించి, అప్‌లోడ్ చేయాలి. బెయిల్ ఉత్తర్వులు రిజర్వ్ చేస్తే మరుసటి రోజే ప్రకటించాలి. బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే అధికారులకు తెలపాలి.  ఖైదీల విడుదల సాధ్యమైనంత వరకు అదే రోజు, లేకపోతే మరుసటిరోజు జరగాలి. బెయిల్ ఉత్తర్వుల అమలుపై ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి.  కస్టడీలో ఉన్న అప్పిలెంట్ల కేసుల్లో 7 రోజుల్లోపే అదనపు వివరణలు కోరవచ్చు. ఇక అత్యవసర కేసు (కూల్చివేతలు, బహిష్కరణలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, బెయిల్‌ తదితరాలు)ల్లో కేవలం ప్రధాన నిర్ణయం (ఆపరేటివ్‌ ఆర్డర్‌) ముందుగా ఓపెన్‌ కోర్టులో ప్రకటించినా, దానికి గల పూర్తి కారణాలతో తీర్పును సాధారణంగా 7 రోజుల్లోపు, అసాధారణ పరిస్థితుల్లో 15 రోజుల్లోపు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలి.  ప్రకటించిన తీర్పు 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.  పెండింగ్ రిజర్వ్ తీర్పులపై ప్రతి నెల ఆటోమేటెడ్ ఇ-మెయిల్ పంపాలి.  2 నెలలు దాటిన పెండింగ్ తీర్పులను జడ్జిల దృష్టికి తీసుకెళ్లాలని లాయర్లకు సూచన చేశారు.  3 నెలల్లో తీర్పు రాకపోతే కేసు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లాలి.  మరో 2 వారాలు ఆలస్యమైతే కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.  3 నెలలైనా తీర్పు రాకపోతే పక్షాలు దరఖాస్తు చేసుకోవచ్చు.  4 నెలలు గడిచినా తీర్పు రాకపోతే బెంచ్ మార్పు కోరే హక్కు పక్షాలకు ఉంటుంది.  రిజర్వు చేసిన  తీర్పులు వెలువరించడంలో జరిగే జాప్యాన్ని తగ్గించి న్యాయ ప్రక్రియలో వేగం పెంచాలన్నది  సుప్రీంకోర్టు భావన.  హైకోర్టు, దిగువ కోర్టులలో ఈ సూచనలు పాటిస్తే, తీర్పుల వెల్లడిలో జాప్యం జరగదు.  కోర్టులలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం  ప్రోత్సహించడం, తరచూ లోక్ అదాలత్‌లను నిర్వహించడం, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, ఆధునిక సాంకేతికతను వాడడం, అనవసర వాయిదాలను తగ్గించడం, మౌలిక వసతులు పెంచడం.... వంటి  కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇంకా పెరుగుతూ వస్తోంది. కోట్లలో పేరుకుపోయిన పెండింగ్ కేసులు తగ్గించడానికి, వాయిదాలు తగ్గించడంతోపాటు విచారణ ప్రక్రియ వేగంగా జరిగే విధంగా  నూతన ఆలోచనలతో, కొత్త మార్గదర్శకాలను సుప్రీం కోర్టు రూపొందించవలసిన అవసరం ఉంది.

-      శిరందాసు నాగార్జున – 9440222914

Jul 26, 2026

చేనేత హక్కుల కోసం కడ వరకు ‘ప్రగడ’ పోరాటం


 

తుది శ్వాస వరకు చేనేత కోసం తపించిన ప్రగడ కోటయ్య


చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ప్రగడ కోటయ్య. చేనేత అంటే కోటయ్య, కోటయ్య అంటే చేనేత. ఆయన ఆలోచనలు చేనేత, శ్వాస చేనేత. జీవిత చరమాంకంలో ఆస్పత్రిలో అంపశయ్యపై ఉండి, 1995 నవంబర్‌ 26న  చనిపోవడానికి ఓ గంట ముందు కూడా చేనేత కార్మికుల సంక్షేమం గురించే కోటయ్య మాట్లాడారు.  ఆయన ఆరోగ్యం విషయమై తెలుసుకోవడానికి, అప్పటి జిల్లా కలెక్టర్ సి.ఉమామహేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. చివరి దశకు వచ్చేసినట్లు, తుది శ్వాస వదలడానికి ఎక్కువ సమయంలేదని కోటయ్యకు అర్థమైపోయింది. అప్పుడు కూడా ఆయన ఆలోచనలు చేనేత గురించే.  తన ఎంపీ కోటా నిధులను చేనేత కాలనీలలో సౌకర్యాల కోసం వినియోగించమని జిల్లా కలెక్టర్ కు చెప్పారు. అందువల్లే  చేనేత చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది.  జాతీయోద్యమంలో పాల్గొనడంతోపాటు చేనేత పరిశ్రమ, ఆ రంగంలోని కార్మికుల రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు కోటయ్య. ఆయన నిరుపేద అయినప్పటికీ   ప్రజా బాహుళ్యంలో  తనకు ఉన్న అభిమానంతో మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి,  ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ప్రగడ కోటయ్య దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యారు.  

ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధులు ఆచార్య ఎన్.జి.రంగా సలహా మేరకు కోటయ్య మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పిన్నింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్‌ సూపర్‌వైజర్ కోర్సు,  ఆ తర్వాత కాటన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, సిటీ & గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన కెమిస్ట్రీ సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన చదివిన  టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే  సూపర్‌వైజర్‌గా  పనిచేశారు. ఉద్యోగ రీత్యా రాష్ట్రమంతటా పర్యటించి చేనేత కార్మికుల కష్టాలను, వారి దయనీయ స్థితిని కళ్లారా దగ్గరగా చూశారు. ఆనాటి వారి ఆకలి చావులకు చలించిపోయారు. 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి,  అన్ని జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు. జీవచ్ఛవాలుగా బతుకులీడిస్తున్న చేనేత కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని కోటయ్య ఉద్యోగం మానేసి, చేనేత ఉద్యమంలోకి ఉరికారు. చేనేత రంగంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు.  ఎన్జీ రంగా ఒకసారి కోటయ్యను సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి, మహాత్మా గాంధీని పరిచయం చేశారు. చేనేత, ఖాదీ గురించి ఆయన గాంధీకి పూర్తిగా వివరించారు. 1941లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన థామస్‌ కమిటీకి చేనేత రంగ సమస్యలపై కోటయ్య వంద పేజీల మెమొరాండాన్ని అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘానికి దామర్ల రమాకాంత రావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. చేనేత కార్మికులను రాజకీయంగా చైతన్య పరచడం కోసం 1945లో గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. 1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1947-52 ప్రాంతంలో దాదాపు నాలుగేళ్లు నిడుబ్రోలు నుంచి ఆయన చేనేతవారపత్రికను కూడా నడిపారు.  
 
చేనేత పరిశ్రమకు చాలినంత నూలు సరఫరా చేయాలని,  ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలన్న డిమాండ్‌తో 1950లో  కోటయ్య చేనేత కాంగ్రెస్‌ తరఫున సమర శంఖం పూరించారు. మద్రాసులో 75 రోజులపాటు  సత్యాగ్రహ  ఉద్యమం నడిపారు. దాదాపు పది వేల మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు. చివరకు కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ మద్రాసు వచ్చి చేనేత కాంగ్రెస్‌ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత వర్గాల కోసం కోటయ్య రేపల్లెలో సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసి, రైలులో బళ్లారి జైలుకు తరలిస్తుండగా,  ప్రతి రైల్వేస్టేషన్‌లో  భారీ సంఖ్యలో చేనేత కార్మికులు అడ్డుపడ్డారు.  ప్రతి రైల్వేస్టేషన్‌లో రైలుని నిలిపివేయడంతో, అది బళ్లారి చేరే పరిస్థితి కనిపించలేదు. అధికారుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న  ప్రకాశం, కోటయ్యని అప్పటి రాజధాని కర్నూలుకు తీసుకురమ్మని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి  ప్రకాశం పంతులు ‘‘ఏందిరా కోటయ్య, నీ సమస్య ఏమిటి?’’ అని అడిగారు.  చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన చేనేత ఉత్పత్తుల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోటయ్య డిమాండ్ చేశారు. దాంతో, అప్పటికప్పుడే చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ప్రకాశం పంతులు రూ.50 లక్షలు విడుదల చేశారు. దటీజ్ ప్రగడ కోటయ్య.

చేనేత సమస్యలపై నిజాయితీగా పోరాడే నేతగా  ఆ నాటి కాంగ్రెస్ అగ్రనేతలందరి వద్ద ప్రగడ కోటయ్య గుర్తింపు పొందారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిగా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వరకు అందరితోనూ కోటయ్య మాట్లాడి చేనేత సమస్యలు పరిష్కరించారు.  1975లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకంలో చేనేత కార్మికులకు ఉపయోగపడే అంశాలను కూడా ఒక పాయింట్ లో చేర్చేందుకు ఇందిరా గాంధీని కోటయ్య ఒప్పించారు. చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు విశేష  కృషి చేసి, దానికి వ్యవస్థాపక చైర్మన్‌గా కోటయ్య ఉన్నారు. ఈ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను  ప్రధానికి కోటయ్య వివరించారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.  ఢిల్లీలో జరిగిన అఖిల భారత చేనేత మహాసభలో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మాట్లాడుతూ, ‘‘చేనేత సమస్యలు నాకు చెప్పి ప్రయోజనంలేదు.  ప్రగడ కోటయ్యకు చెబితే, ఆయనకు తెలుస్తాయి. ఆయన నిద్రపోతున్నా లేపి, సమస్యలు చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన ఏది చెబితే అది మేం చేస్తాం’’ అని చెప్పారు. ప్రధాని అంతటి వ్యక్తి అలా చెప్పారంటే కోటయ్యకు, చేనేతకు  ఉన్న అనుబంధం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా అన్ని పార్టీలలో కూడా చేనేత అంటే కోటయ్య పేరే గుర్తుకు వస్తుంది. భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా ఆయన శ్రీలంక, బ్రిటన్,  చైనా, హాంకాంగ్ తదితర దేశాలలో పర్యటించి, అక్కడ చేనేత రంగాన్ని అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య చివరి వరకు చేనేత రంగం సంక్షేమం కోసమే తపించారు.    

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) పూర్తి చేశారు. చదువుకునే సమయంలోనే తండ్రి వద్ద ఆయన చేనేత గురించి పూర్తిగా తెలుసుకున్నారు.  1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు వెంకట శేష శయన  బీటెక్ పూర్తి చేసి, ఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవి, వంగర శకుంతలాదేవి, ఊట్ల అనసూయ, గుర్రం విజయలక్ష్మి, దొంతంశెట్టి శ్యామలాదేవి, ఉడతా పద్మావతి వారి కుమార్తెలు. చేనేతను బతికించడం కోసం చివరి వరకు తపించిన ప్రగడ కోటయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.  చేనేత నేత కోటయ్య జయంతిని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం.

- శిరందాసు నాగార్జున రావు,  సీనియర్ జర్నలిస్ట్- 9440222914.

 

Jul 25, 2026

అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య


 

జూలై 26 ఆ మహానేత 110వ జయంతి

రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్చలపల్లి సుందరయ్య... వంటి నేతల వరుసలో ఆయన ఉంటారు. తుది శ్వాసవరకు చేనేత రంగం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తపించిన మహానేత. ఆ రంగం అభివృద్ధి కోసం పనిచేసి ‘చేనేత కోటయ్య’గా పేరుపొందారు.  అత్యంత నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి, నిజాయితీకి, రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చేనేత రంగాన్ని బతికించడం కోసమే కోటయ్య కృషి చేశారు. చేనేత రంగం సమస్యలు పరిష్కారం కావాలంటే, ఆ రంగానికి చెందినవారు రాజకీయంగా ఎదగవలసిన అవసరాన్ని ఆయన ఆనాడే గుర్తించారు. రాజకీయంగా ఎదుగుదలలేకపోతే అటు రాజకీయాల్లో, ఇటు సమాజంలో కూడా తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక బలం లేకపోయినా చేనేతలు తమ బలం చూపించగలిగితేనే, రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గాన్ని గుర్తిస్తాయి. దానిని, కోటయ్య నిరూపించారు.   చట్ట సభకు వెళ్లగలిగితేనే చేనేత సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన గట్టిగా నమ్మారు. అదే నిజం కూడా. 1946లోఆ తర్వాత 1952లో చీరాల  కాంగ్రెస్ టికెట్ కోసం కోటయ్య తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్థిక బలం లేని కారణంగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించలేదు. చీరాల నియోజకవర్గంలో పోటీ చేసే ధనవంతులతో ఆర్థికంగా బలహీనుడైన కోటయ్య గెలవలేరన్నది కాంగ్రెస్ అభిప్రాయం. కారంచేడులో కమ్మ రైతులుచీరాలలో వైశ్య వ్యాపారులతో పోటీపడలేరని వారి ఆర్థిక శక్తి ముందు తట్టుకోలేరని కాంగ్రెస్ రెండు సార్లూ కోటయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో,  1952లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రకాశం పంతులు స్థాపించిన కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా కోటయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన నిజాయితీ, ప్రజాబలం ముందు ఆర్థిక బలం నిలవలేకపోయింది. ఊహించని విధంగా  చీరాలలో ఆయన ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులను మట్టికరిపించారు. వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. కోటయ్యకు ఉన్న ప్రజాబలం ముందు  అగ్రవర్ణాల వారుధనవంతులు తట్టుకోలేకపోయారు. అయితేఅప్పటి అగ్రవర్ణాల వారు కూడా కోటయ్య ప్రవర్తన, వ్యవహార శైలి చూసి, ఆయన అంటే అభిమానంగా ఉండేవారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఓడిపోతున్నవారు కూడా కోటయ్యకు కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టారు. కోటయ్యని అందరూ అంతగా అభిమానించేవారు. శాసనసభలో  కోటయ్య వాక్ చాతుర్యాన్ని చూసి సభలో సభ్యులు ఆశ్చర్యపోయేవారు. సభ ప్రారంభంలోనే ఒక రోజు దాదాపు  గంటసేపు చేనేత సమస్యలపై  ప్రసంగించారు. ఆయన వాగ్ధాటిని చూసి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించారు. అప్పటి మంత్రి మజ్జి తులసీదాసు ద్వారా రాయబారం పంపారు.   నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చే కోటయ్య  ఆ మాట విని భయపడ్డారు.  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించిమంత్రి పదవి కోసం పార్టీ మారడం భావ్యం కాదని  భావించారు. మంత్రి పదవి కోసం ఆయన పార్టీ మారలేదు.  ఆయన నిజాయితీకి చలించిపోయిన రాజగోపాలాచారి... ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనతో చెప్పి నీకు మంత్రి పదవి వచ్చేలా చేస్తాను’’ అని చెప్పారు. ఆయనంటే అగ్రనేతలందరికీ అంత గౌరవం.  1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే,  చీరలుదోవతులు.... వంటివి చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ముంబైబీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు. .  పద్మశాలిదేవాంగ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్న భావనతోఆ కులాలను బీసీల జాబితా నుంచి తొలగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడుకోటయ్య తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దాంతో, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకుంది.

 కోటయ్య 1952 నుండి 1972 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంఆంధ్ర రాష్ట్రంఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు.  1952-1962లో రెండు సార్లు1967- 1972 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.   1967లో  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రగడ కోటయ్య స్వతంత్ర అభ్యర్థి కొణిజేటి రోశయ్యను ఓడించారు. ఆంధ్రప్రదేశ్  రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోశయ్యకు  రైస్ మిల్లర్లుకారంచేడులోని కమ్మ వారు మద్దతు పలికారు.  డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేశారు. అయినా,  కోటయ్య విజయాన్ని ఆపలేకపోయారు.  కారంచేడులో రోశయ్యకు పదివేల ఓట్లు మెజార్టీ వస్తేఈపురుపాలెంచీరాలపేరాలలో  కోటయ్యకు మెజార్టీ రావడంతో విజయం సాధించారు. కోటయ్య అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూవారి మధ్యే ఉండేవారు. జాలర్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు.  అదే ఆయన బలం. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో  1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వివిధ శాసనసభ ఉపసంఘాలలో సభ్యుడిగా ఉన్నారు. ఏపీ రాష్ట్ర డ్రైనేజ్ బోర్డుజిల్లా నీటిపారుదల కమిటీలో సభ్యునిగా ఉన్నారు. మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగాఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యునిగా ప్రగడ కోటయ్య తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.  

 
1989లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రోశయ్య పోటీ చేశారు. అంతకు ముందు రోశయ్య టిక్కెట్ కోసం  ప్రయత్నిస్తుంటేకోటయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.  ‘‘ చీరాలలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. ఇది వీవర్స్ నియోజకవర్గం. ఇక్కడే వారికి పోటీచేసే అవకాశం ఉంది. వారికి ఇక్కడ అవకాశం ఇవ్వకపోతేచట్ట సభలలో వారి సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? ’’ అని గట్టిగా ప్రశ్నించారు. రోశయ్యకు మద్దతు పలకనని తెగేసి చెప్పారు. అయితే,  అప్పటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి కోటయ్యని హైదరాబాద్ పిలిపించిరాజ్యసభ ఎంపీ పోస్టు ఇప్పిస్తాననిఆ విధంగా చేనేత వర్గాలకు జాతీయ స్థాయిలో ఉపయోగపడవచ్చని కోటయ్యకి నచ్చజెప్పారు. చివరకు కోటయ్య మద్దతుతో రోశయ్య గెలిచారు. చెన్నారెడ్డి చెప్పిన ప్రకారం కోటయ్యను రాజ్యసభకు పంపారు.  1990 నుంచి 1995లో మరణించేంత వరకు కోటయ్య రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  చేనేత రంగం అభివృద్ధికి కోటయ్య రాజ్యసభలో వెల్లడించిన అభిప్రాయాలుసూచనలుసలహాలను విన్న ఆనాటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతోపాటు తోటి పార్లమెంట్ సభ్యులు  సైతం అబ్బురపడేవారు. సమస్యలు వివరించే తీరు,  కోటయ్య ప్రసంగ ధాటి అందరినీ ఆకట్టుకునేవిధంగా ఉండేది. కోటయ్య చనిపోయిన తర్వాత కూడా రాజ్యసభలో ఆయన గురించి సభ్యులు అందరూ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.  1996లో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కొందరు ప్రసంగిస్తూ,  ప్రగడ కోటయ్య బతికి ఉంటే,  చేనేత రంగానికి ప్రాధాన్యత ఇవ్వని ఈ బడ్జెట్ ని   చీల్చిచెండాడేవారని తలుచుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సభలోని అధికారప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు పలికారు.

 ప్రగడ కోటయ్య రొంపేరు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి, చీరాలపరిసర ప్రాంతాలలోని రొంపేరు డ్రెయిన్ పరిధిలో ఉన్న సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూములను  1954లో  నిరుపేద రైతులకు పంపిణీ చేయింశారు. కోటయ్య కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పంపిణీ అప్పుడే మొదలైంది.  చీరాలలోని రొంపేరు భూములలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి,  తోటవారిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంలో కోటయ్య కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  ‘‘చేనేత కోటయ్య రైతు కోటయ్యగా మారిపోయారు’’ అని  ఛలోక్తి విసిరారు.  చీరాల తాలూకాలోని కుందేరు కాలువకు తూర్పున ఉన్న అనేక గ్రామాలలో వేలాది మంది పేద రైతుల ఆర్థిక ఉన్నతికి కోటయ్య తోడ్పడ్డారు. 1964లో కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి భూములకు మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలని ఆయన పోరాడారు. ఆ సమయంలో చీరాలబాపట్ల ప్రాంతాల్లోని సాగునీటి భూములు వరదల్లో మునిగిపోయాయి. దాని ఫలితంగా మిత్ర కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టారు. మళ్ళీ 1969 మేలో చీరాల ప్రాంతంలో పెద్దఎత్తున వరదలు సంభవించిపొలాల్లో పనిచేస్తున్న 2,000 మందికి పైగా ప్రజలు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు చీరాలను సందర్శించినప్పుడుకోటయ్య మిత్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండామురుగునీటి పారుదల సౌకర్యాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రూ. 3 కోట్ల రుణాన్ని అక్కడికక్కడే ప్రకటించేలా చేశారు. అప్పుడేఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి సెస్ చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. కృష్ణాగోదావరి  డెల్టాలలో మురుగు నీటి సౌకర్యాల మెరుగుదల కోసం పథకాలను చేపట్టారు. చీరాల మండలం తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ కోసం ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. 1962 నుంచి  తోటవారిపాలెం పరిసర ప్రాంతాల్లోని కావూరివారిపాలెంతులసీనగర్పాలిబోయినవారిపాలెం గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములకు ఇది సాగునీరు అందిస్తోంది.  చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు ప్రభుత్వం దానికి 99 ఎకరాలు కేటాయించేందుకు  కృషి చేసిదానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య వ్యవహరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను కోటయ్య,  నెహ్రూకు వివరించారు. దాంతోచేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. చీరాల నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.

 
ప్రగడ కోటయ్య తన స్నేహితులతో కలిసి ఆంధ్రకేసరి ప్రకాశం ఎడ్యుకేషనల్ సొసైటి ప్రారంభించిదాని ఆధ్వర్యంలో దివంగత ఉమ్మితి శివయ్య కుటుంబ సభ్యులువారి బంధువుల ఆర్థిక సహాయంతో చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత దాని పేరుని  ఆంధ్రకేసరి ప్రకాశంప్రగడ కోటయ్య జూనియర్ కాలేజీగా మార్చారు.  చీరాల  వి.ఆర్.ఎస్.(ప్రస్తుతం వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్) కళాశాల పాలక మండలి సభ్యుడుగాదాని కోసం 60 ఎకరాలకు పైగా భూమిని సమకూర్చడంలో  కోటయ్య సహాయపడ్డారు.  బండ్ల వెంకటేశ్వర రావు  నిర్వహణలో వేటపాలెంలో జూనియర్ కళాశాలను ప్రారంభించేందుకు దోహదపడ్డారు. వేటపాలెంలో యూఎస్ఐ (United Schools Organisation of India)స్థాపించారు. బంజరు భూముల పంపిణీ ,  చీరాల సముద్ర తీర ప్రాంతంలో సేద్యపునీటి సౌకర్యం కల్పించడం,  చీరాలగుంతకల్లునెల్లూరురాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.

 

ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు  అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితేఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకే ఇచ్చారు. కోటయ్యకు  ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడికక్కడే సార్థకం చేసి చూపించారు. వాస్తవానికి ప్రగడ కోటయ్య ఆర్థికంగా స్థితిమంతులు ఏమీకాదు. అయినాఆయనలోని నిజాయితీనిస్వార్థంనిబద్ధతనాయకత్వ పటిమని గుర్తించి చేనేత రంగంలోని స్థితిమంతులువ్యాపారులుమాస్టర్ వీవర్లుచేనేత కార్మికులు అందరూ ఆయనకు మద్దతు పలికారు.  కోటయ్య కుటుంబం చాలా కాలం ఒక పూరి గుడిసెలోనే ఉండేవారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 1960 వరకు ఆ పూరి గుడిసెలోనే ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన నాయకులకు ఆ గుడిసె బొంగులు గుచ్చుకునేవి. అప్పుడు ఆ నాయకులు ‘‘ఏంటి కోటయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ పూరి గుడిసెలోనే ఉంటున్నావు’’ అని అడిగేవారు. అంతటి నిజాయితీని, నిరాడంబరతను ఇప్పుడు మనం ఊహించగలమా?   కోటయ్య 1960లో నిడుబ్రోలు వీవర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో వారి అబ్బాయి ఉంటున్నారు. కోటయ్య చనిపోయేనాటికి వారి ఇంట్లో  ఫ్రిజ్ కూడా లేదు. అంత నిరాడంబరంగా ఆయన బ్రతికారు. అందుకే అభిమానులు ఆయనను  ప్రజా బంధు ప్రగడ కోటయ్యచేనేత కోటయ్యచేనేత పితబహుజన నేత... అని కొనియాడుతుంటారు.

 


శాసనసభలో తనకు మద్దతు పలికేవారు పది మంది కూడా లేరనిఆర్థికంగా కూడా తాను స్థితిమంతుడిని కాదనిఅంగబలంఅర్థబలం లేనందునే తనకు మంత్రి పదవి దక్కలేదని ప్రగడ కోటయ్య తన ఆత్మకథలో రాసుకున్నట్లు, ఆయన సోదరుడి కుమారుడు ప్రగడ రాధాకృష్ణ చెప్పారు. అయితేఅది ముద్రణకు నోచుకోలేదు. తన పెదనాన్న స్వయంగా రాసుకున్న పేపర్లను తాను చూసినట్లు ఆయన తెలిపారు. ‘‘రాజగోపాలాచారి సిఫారసు చేసినా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి పోటీ చేశారు.  అప్పట్లో ఆ నియోజకవర్గ పరిధిలో వెంకటగిరి ఉండేది. వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నందునతనను అక్కడికి వెళ్లిప్రచారం చేసి గెలిపించమని సంజీవరెడ్డి నన్ను కోరారు. ఆయన కోరిన ప్రకారం నేను వెంకటగిరి వెళ్లి15 రోజులు అక్కడే ఉండి ఆయన తరఫున ప్రచారం చేశాను. ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినాసంజీవరెడ్డి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంగబలంఅర్థబలం లేనందునే నేను మంత్రిని కాలేకపోయాను’’ అని ప్రగడ కోటయ్య స్వదస్తూరితో రాసుకున్నట్లు రాధాకృష్ణ వివరించారు. రాజకీయ నేతలు నిజాయితీగా వ్యవహరించే రోజులలో కూడా కుల బలం, అర్థబలానికి ప్రాధాన్యత ఉండేదని అర్థమవుతోంది.

 


ప్రగడ కోటయ్య మరణానంతరం  ప్రభుత్వం  అప్పటి చిత్తూరు జిల్లా  వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు  శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ అని పేరు పెట్టింది.  భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  న్యూఢిల్లీలోని చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించే దేశంలోని ఎనిమిది సంస్థలలో ఇది ఒకటి. మంగళగిరిలోని వీవర్స్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ కు దామర్ల రమాకాంతరావుప్రగడ కోటయ్య మున్సిపల్ హైస్కూల్ అని పేరు పెట్టారు. ఇలా రాష్ట్రంలోని  పలు విద్యా సంస్థలకుకమ్యూనిటీ హాళ్లకు,  ఇతర సంస్థలకు ప్రగడ కోటయ్య జ్ఞాపకార్థం ఆయన పేరును పెట్టారు. ఆయన గౌరవార్థం మంగళగిరిచీరాలపొన్నూరు ...తదితర అనేక ప్రాంతాల్లో ప్రగడ కోటయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.  చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతి( జూన్ 26)ని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  మానవ వనరుల అభివృద్ధి,  విద్యఐటీఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీనికి సంబంధించిన జీఓ కూడా జారీ అయింది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించిదానికి  ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంగళగిరి శాసనసభ్యులు కూడా అయిన లోకేష్ చెప్పారు.

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడుకోటమ్మ దంపతులకు కోటయ్య 1915జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులుఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ ) పూర్తి చేశారు. మొదట వయసు తక్కువగా ఉన్నందున కోటయ్యను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష రాయడానికి అనుమతించలేదు.  దాంతోఓ ఏడాదిపాటు నేత నేసే తన తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే  చేనేత గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు.  చిన్నతనంలో నిడుబ్రోలులో ధనవంతుల కుటుంబాలకు కోటయ్య బావి నుంచి కావిడితో మంచినీళ్లు మోసుకువెళ్లి పోసేవారు. వారు కొద్దోగొప్పో డబ్బు ఇచ్చేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసైన తర్వాతబాపట్ల తాలూకా బోర్డులో ఆయన కొంతకాలంపాటు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేశారు. 1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం అయింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలుఒక కుమారుడు.

కొడుకు వెంకట శేష శయన  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసిఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవివంగర శకుంతలాదేవిఊట్ల అనసూయగుర్రం విజయలక్ష్మిదొంతంశెట్టి శ్యామలాదేవిఉడతా పద్మావతి ఆ దంపతుల కుమార్తెలు.  పెళ్లైన కొత్తలో ఆయన చీరాలలోని ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ)లో కొంత కాలం గుమస్తాగా పని చేశారు.  ఆ సమయంలో వీరి కుటుంబం చీరాలకు సమీపంలోని ఈపురుపాలెంలో నివాసం ఉంది. ఆ కొద్దికాలం తప్ప ఆయన జీవితాంతం నిడుబ్రోలులోనే ఉన్నారు. చేనేత వర్గానికి ఆరాధ్యుడైన  ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  చేనేత పరిశ్రమకార్మికులు పెద్ద దిక్కును కోల్పోయారు.  చేనేత రంగానికి సంబంధించి, చేనేత కార్మికులను ఐక్యంగా నిలిపే అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.

 

ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు

 

1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు

1949  అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు

1950  చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.

1952–1962  శాసనసభ సభ్యుడు

1955–1956  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

1959  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన,  చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్.

1962–1965  ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్

1967–1972  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు

1973–1975  న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.

1974–1980  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు

1974–1978  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

1975  రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు,  కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు

1976–1978  ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు

1990–1995  రాజ్యసభ  సభ్యుడు

 

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ

నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల...