Jul 25, 2026

అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య


 

జూలై 26 ఆ మహానేత 110వ జయంతి

రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్చలపల్లి సుందరయ్య... వంటి నేతల వరుసలో ఆయన ఉంటారు. తుది శ్వాసవరకు చేనేత రంగం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తపించిన మహానేత. ఆ రంగం అభివృద్ధి కోసం పనిచేసి ‘చేనేత కోటయ్య’గా పేరుపొందారు.  అత్యంత నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి, నిజాయితీకి, రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చేనేత రంగాన్ని బతికించడం కోసమే కోటయ్య కృషి చేశారు. చేనేత రంగం సమస్యలు పరిష్కారం కావాలంటే, ఆ రంగానికి చెందినవారు రాజకీయంగా ఎదగవలసిన అవసరాన్ని ఆయన ఆనాడే గుర్తించారు. రాజకీయంగా ఎదుగుదలలేకపోతే అటు రాజకీయాల్లో, ఇటు సమాజంలో కూడా తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక బలం లేకపోయినా చేనేతలు తమ బలం చూపించగలిగితేనే, రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గాన్ని గుర్తిస్తాయి. దానిని, కోటయ్య నిరూపించారు.   చట్ట సభకు వెళ్లగలిగితేనే చేనేత సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన గట్టిగా నమ్మారు. అదే నిజం కూడా. 1946లోఆ తర్వాత 1952లో చీరాల  కాంగ్రెస్ టికెట్ కోసం కోటయ్య తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్థిక బలం లేని కారణంగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించలేదు. చీరాల నియోజకవర్గంలో పోటీ చేసే ధనవంతులతో ఆర్థికంగా బలహీనుడైన కోటయ్య గెలవలేరన్నది కాంగ్రెస్ అభిప్రాయం. కారంచేడులో కమ్మ రైతులుచీరాలలో వైశ్య వ్యాపారులతో పోటీపడలేరని వారి ఆర్థిక శక్తి ముందు తట్టుకోలేరని కాంగ్రెస్ రెండు సార్లూ కోటయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో,  1952లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రకాశం పంతులు స్థాపించిన కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా కోటయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన నిజాయితీ, ప్రజాబలం ముందు ఆర్థిక బలం నిలవలేకపోయింది. ఊహించని విధంగా  చీరాలలో ఆయన ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులను మట్టికరిపించారు. వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. కోటయ్యకు ఉన్న ప్రజాబలం ముందు  అగ్రవర్ణాల వారుధనవంతులు తట్టుకోలేకపోయారు. అయితేఅప్పటి అగ్రవర్ణాల వారు కూడా కోటయ్య ప్రవర్తన, వ్యవహార శైలి చూసి, ఆయన అంటే అభిమానంగా ఉండేవారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఓడిపోతున్నవారు కూడా కోటయ్యకు కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టారు. కోటయ్యని అందరూ అంతగా అభిమానించేవారు. శాసనసభలో  కోటయ్య వాక్ చాతుర్యాన్ని చూసి సభలో సభ్యులు ఆశ్చర్యపోయేవారు. సభ ప్రారంభంలోనే ఒక రోజు దాదాపు  గంటసేపు చేనేత సమస్యలపై  ప్రసంగించారు. ఆయన వాగ్ధాటిని చూసి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించారు. అప్పటి మంత్రి మజ్జి తులసీదాసు ద్వారా రాయబారం పంపారు.   నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చే కోటయ్య  ఆ మాట విని భయపడ్డారు.  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించిమంత్రి పదవి కోసం పార్టీ మారడం భావ్యం కాదని  భావించారు. మంత్రి పదవి కోసం ఆయన పార్టీ మారలేదు.  ఆయన నిజాయితీకి చలించిపోయిన రాజగోపాలాచారి... ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనతో చెప్పి నీకు మంత్రి పదవి వచ్చేలా చేస్తాను’’ అని చెప్పారు. ఆయనంటే అగ్రనేతలందరికీ అంత గౌరవం.  1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే,  చీరలుదోవతులు.... వంటివి చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ముంబైబీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు. .  పద్మశాలిదేవాంగ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్న భావనతోఆ కులాలను బీసీల జాబితా నుంచి తొలగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడుకోటయ్య తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దాంతో, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకుంది.

 కోటయ్య 1952 నుండి 1972 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంఆంధ్ర రాష్ట్రంఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు.  1952-1962లో రెండు సార్లు1967- 1972 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.   1967లో  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రగడ కోటయ్య స్వతంత్ర అభ్యర్థి కొణిజేటి రోశయ్యను ఓడించారు. ఆంధ్రప్రదేశ్  రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోశయ్యకు  రైస్ మిల్లర్లుకారంచేడులోని కమ్మ వారు మద్దతు పలికారు.  డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేశారు. అయినా,  కోటయ్య విజయాన్ని ఆపలేకపోయారు.  కారంచేడులో రోశయ్యకు పదివేల ఓట్లు మెజార్టీ వస్తేఈపురుపాలెంచీరాలపేరాలలో  కోటయ్యకు మెజార్టీ రావడంతో విజయం సాధించారు. కోటయ్య అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూవారి మధ్యే ఉండేవారు. జాలర్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు.  అదే ఆయన బలం. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో  1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వివిధ శాసనసభ ఉపసంఘాలలో సభ్యుడిగా ఉన్నారు. ఏపీ రాష్ట్ర డ్రైనేజ్ బోర్డుజిల్లా నీటిపారుదల కమిటీలో సభ్యునిగా ఉన్నారు. మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగాఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యునిగా ప్రగడ కోటయ్య తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.  

 
1989లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రోశయ్య పోటీ చేశారు. అంతకు ముందు రోశయ్య టిక్కెట్ కోసం  ప్రయత్నిస్తుంటేకోటయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.  ‘‘ చీరాలలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. ఇది వీవర్స్ నియోజకవర్గం. ఇక్కడే వారికి పోటీచేసే అవకాశం ఉంది. వారికి ఇక్కడ అవకాశం ఇవ్వకపోతేచట్ట సభలలో వారి సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? ’’ అని గట్టిగా ప్రశ్నించారు. రోశయ్యకు మద్దతు పలకనని తెగేసి చెప్పారు. అయితే,  అప్పటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి కోటయ్యని హైదరాబాద్ పిలిపించిరాజ్యసభ ఎంపీ పోస్టు ఇప్పిస్తాననిఆ విధంగా చేనేత వర్గాలకు జాతీయ స్థాయిలో ఉపయోగపడవచ్చని కోటయ్యకి నచ్చజెప్పారు. చివరకు కోటయ్య మద్దతుతో రోశయ్య గెలిచారు. చెన్నారెడ్డి చెప్పిన ప్రకారం కోటయ్యను రాజ్యసభకు పంపారు.  1990 నుంచి 1995లో మరణించేంత వరకు కోటయ్య రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  చేనేత రంగం అభివృద్ధికి కోటయ్య రాజ్యసభలో వెల్లడించిన అభిప్రాయాలుసూచనలుసలహాలను విన్న ఆనాటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతోపాటు తోటి పార్లమెంట్ సభ్యులు  సైతం అబ్బురపడేవారు. సమస్యలు వివరించే తీరు,  కోటయ్య ప్రసంగ ధాటి అందరినీ ఆకట్టుకునేవిధంగా ఉండేది. కోటయ్య చనిపోయిన తర్వాత కూడా రాజ్యసభలో ఆయన గురించి సభ్యులు అందరూ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.  1996లో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కొందరు ప్రసంగిస్తూ,  ప్రగడ కోటయ్య బతికి ఉంటే,  చేనేత రంగానికి ప్రాధాన్యత ఇవ్వని ఈ బడ్జెట్ ని   చీల్చిచెండాడేవారని తలుచుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సభలోని అధికారప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు పలికారు.

 ప్రగడ కోటయ్య రొంపేరు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి, చీరాలపరిసర ప్రాంతాలలోని రొంపేరు డ్రెయిన్ పరిధిలో ఉన్న సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూములను  1954లో  నిరుపేద రైతులకు పంపిణీ చేయింశారు. కోటయ్య కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పంపిణీ అప్పుడే మొదలైంది.  చీరాలలోని రొంపేరు భూములలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి,  తోటవారిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంలో కోటయ్య కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  ‘‘చేనేత కోటయ్య రైతు కోటయ్యగా మారిపోయారు’’ అని  ఛలోక్తి విసిరారు.  చీరాల తాలూకాలోని కుందేరు కాలువకు తూర్పున ఉన్న అనేక గ్రామాలలో వేలాది మంది పేద రైతుల ఆర్థిక ఉన్నతికి కోటయ్య తోడ్పడ్డారు. 1964లో కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి భూములకు మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలని ఆయన పోరాడారు. ఆ సమయంలో చీరాలబాపట్ల ప్రాంతాల్లోని సాగునీటి భూములు వరదల్లో మునిగిపోయాయి. దాని ఫలితంగా మిత్ర కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టారు. మళ్ళీ 1969 మేలో చీరాల ప్రాంతంలో పెద్దఎత్తున వరదలు సంభవించిపొలాల్లో పనిచేస్తున్న 2,000 మందికి పైగా ప్రజలు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు చీరాలను సందర్శించినప్పుడుకోటయ్య మిత్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండామురుగునీటి పారుదల సౌకర్యాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రూ. 3 కోట్ల రుణాన్ని అక్కడికక్కడే ప్రకటించేలా చేశారు. అప్పుడేఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి సెస్ చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. కృష్ణాగోదావరి  డెల్టాలలో మురుగు నీటి సౌకర్యాల మెరుగుదల కోసం పథకాలను చేపట్టారు. చీరాల మండలం తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ కోసం ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. 1962 నుంచి  తోటవారిపాలెం పరిసర ప్రాంతాల్లోని కావూరివారిపాలెంతులసీనగర్పాలిబోయినవారిపాలెం గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములకు ఇది సాగునీరు అందిస్తోంది.  చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు ప్రభుత్వం దానికి 99 ఎకరాలు కేటాయించేందుకు  కృషి చేసిదానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య వ్యవహరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను కోటయ్య,  నెహ్రూకు వివరించారు. దాంతోచేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. చీరాల నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.

 
ప్రగడ కోటయ్య తన స్నేహితులతో కలిసి ఆంధ్రకేసరి ప్రకాశం ఎడ్యుకేషనల్ సొసైటి ప్రారంభించిదాని ఆధ్వర్యంలో దివంగత ఉమ్మితి శివయ్య కుటుంబ సభ్యులువారి బంధువుల ఆర్థిక సహాయంతో చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత దాని పేరుని  ఆంధ్రకేసరి ప్రకాశంప్రగడ కోటయ్య జూనియర్ కాలేజీగా మార్చారు.  చీరాల  వి.ఆర్.ఎస్.(ప్రస్తుతం వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్) కళాశాల పాలక మండలి సభ్యుడుగాదాని కోసం 60 ఎకరాలకు పైగా భూమిని సమకూర్చడంలో  కోటయ్య సహాయపడ్డారు.  బండ్ల వెంకటేశ్వర రావు  నిర్వహణలో వేటపాలెంలో జూనియర్ కళాశాలను ప్రారంభించేందుకు దోహదపడ్డారు. వేటపాలెంలో యూఎస్ఐ (United Schools Organisation of India)స్థాపించారు. బంజరు భూముల పంపిణీ ,  చీరాల సముద్ర తీర ప్రాంతంలో సేద్యపునీటి సౌకర్యం కల్పించడం,  చీరాలగుంతకల్లునెల్లూరురాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.

 

ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు  అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితేఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకే ఇచ్చారు. కోటయ్యకు  ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడికక్కడే సార్థకం చేసి చూపించారు. వాస్తవానికి ప్రగడ కోటయ్య ఆర్థికంగా స్థితిమంతులు ఏమీకాదు. అయినాఆయనలోని నిజాయితీనిస్వార్థంనిబద్ధతనాయకత్వ పటిమని గుర్తించి చేనేత రంగంలోని స్థితిమంతులువ్యాపారులుమాస్టర్ వీవర్లుచేనేత కార్మికులు అందరూ ఆయనకు మద్దతు పలికారు.  కోటయ్య కుటుంబం చాలా కాలం ఒక పూరి గుడిసెలోనే ఉండేవారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 1960 వరకు ఆ పూరి గుడిసెలోనే ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన నాయకులకు ఆ గుడిసె బొంగులు గుచ్చుకునేవి. అప్పుడు ఆ నాయకులు ‘‘ఏంటి కోటయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ పూరి గుడిసెలోనే ఉంటున్నావు’’ అని అడిగేవారు. అంతటి నిజాయితీని, నిరాడంబరతను ఇప్పుడు మనం ఊహించగలమా?   కోటయ్య 1960లో నిడుబ్రోలు వీవర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో వారి అబ్బాయి ఉంటున్నారు. కోటయ్య చనిపోయేనాటికి వారి ఇంట్లో  ఫ్రిజ్ కూడా లేదు. అంత నిరాడంబరంగా ఆయన బ్రతికారు. అందుకే అభిమానులు ఆయనను  ప్రజా బంధు ప్రగడ కోటయ్యచేనేత కోటయ్యచేనేత పితబహుజన నేత... అని కొనియాడుతుంటారు.

 

శాసనసభలో తనకు మద్దతు పలికేవారు పది మంది కూడా లేరనిఆర్థికంగా కూడా తాను స్థితిమంతుడిని కాదనిఅంగబలంఅర్థబలం లేనందునే తనకు మంత్రి పదవి దక్కలేదని ప్రగడ కోటయ్య తన ఆత్మకథలో రాసుకున్నట్లు, ఆయన సోదరుడి కుమారుడు ప్రగడ రాధాకృష్ణ చెప్పారు. అయితేఅది ముద్రణకు నోచుకోలేదు. తన పెదనాన్న స్వయంగా రాసుకున్న పేపర్లను తాను చూసినట్లు ఆయన తెలిపారు. ‘‘రాజగోపాలాచారి సిఫారసు చేసినా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి పోటీ చేశారు.  అప్పట్లో ఆ నియోజకవర్గ పరిధిలో వెంకటగిరి ఉండేది. వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నందునతనను అక్కడికి వెళ్లిప్రచారం చేసి గెలిపించమని సంజీవరెడ్డి నన్ను కోరారు. ఆయన కోరిన ప్రకారం నేను వెంకటగిరి వెళ్లి15 రోజులు అక్కడే ఉండి ఆయన తరఫున ప్రచారం చేశాను. ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినాసంజీవరెడ్డి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంగబలంఅర్థబలం లేనందునే నేను మంత్రిని కాలేకపోయాను’’ అని ప్రగడ కోటయ్య స్వదస్తూరితో రాసుకున్నట్లు రాధాకృష్ణ వివరించారు. రాజకీయ నేతలు నిజాయితీగా వ్యవహరించే రోజులలో కూడా కుల బలం, అర్థబలానికి ప్రాధాన్యత ఉండేదని అర్థమవుతోంది.

 

ప్రగడ కోటయ్య మరణానంతరం  ప్రభుత్వం  అప్పటి చిత్తూరు జిల్లా  వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు  శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ అని పేరు పెట్టింది.  భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  న్యూఢిల్లీలోని చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించే దేశంలోని ఎనిమిది సంస్థలలో ఇది ఒకటి. మంగళగిరిలోని వీవర్స్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ కు దామర్ల రమాకాంతరావుప్రగడ కోటయ్య మున్సిపల్ హైస్కూల్ అని పేరు పెట్టారు. ఇలా రాష్ట్రంలోని  పలు విద్యా సంస్థలకుకమ్యూనిటీ హాళ్లకు,  ఇతర సంస్థలకు ప్రగడ కోటయ్య జ్ఞాపకార్థం ఆయన పేరును పెట్టారు. ఆయన గౌరవార్థం మంగళగిరిచీరాలపొన్నూరు ...తదితర అనేక ప్రాంతాల్లో ప్రగడ కోటయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.  చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతి( జూన్ 26)ని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  మానవ వనరుల అభివృద్ధివిద్యఐటీఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీనికి సంబంధించిన జీఓ కూడా జారీ అయింది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించిదానికి  ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంగళగిరి శాసనసభ్యులు కూడా అయిన లోకేష్ చెప్పారు.

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడుకోటమ్మ దంపతులకు కోటయ్య 1915జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులుఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ ) పూర్తి చేశారు. మొదట వయసు తక్కువగా ఉన్నందున కోటయ్యను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష రాయడానికి అనుమతించలేదు.  దాంతోఓ ఏడాదిపాటు నేత నేసే తన తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే  చేనేత గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు.  చిన్నతనంలో నిడుబ్రోలులో ధనవంతుల కుటుంబాలకు కోటయ్య బావి నుంచి కావిడితో మంచినీళ్లు మోసుకువెళ్లి పోసేవారు. వారు కొద్దోగొప్పో డబ్బు ఇచ్చేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసైన తర్వాతబాపట్ల తాలూకా బోర్డులో ఆయన కొంతకాలంపాటు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేశారు. 1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం అయింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలుఒక కుమారుడు.

కొడుకు వెంకట శేష శయన  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసిఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవివంగర శకుంతలాదేవిఊట్ల అనసూయగుర్రం విజయలక్ష్మిదొంతంశెట్టి శ్యామలాదేవిఉడతా పద్మావతి ఆ దంపతుల కుమార్తెలు.  పెళ్లైన కొత్తలో ఆయన చీరాలలోని ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ)లో కొంత కాలం గుమస్తాగా పని చేశారు.  ఆ సమయంలో వీరి కుటుంబం చీరాలకు సమీపంలోని ఈపురుపాలెంలో నివాసం ఉంది. ఆ కొద్దికాలం తప్ప ఆయన జీవితాంతం నిడుబ్రోలులోనే ఉన్నారు. చేనేత వర్గానికి ఆరాధ్యుడైన  ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  చేనేత పరిశ్రమకార్మికులు పెద్ద దిక్కును కోల్పోయారు.  చేనేత రంగానికి సంబంధించి, చేనేత కార్మికులను ఐక్యంగా నిలిపే అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.

 

ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు

 

1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు

1949  అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు

1950  చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.

1952–1962  శాసనసభ సభ్యుడు

1955–1956  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

1959  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన,  చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్.

1962–1965  ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్

1967–1972  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు

1973–1975  న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.

1974–1980  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు

1974–1978  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

1975  రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు,  కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు

1976–1978  ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు

1990–1995  రాజ్యసభ  సభ్యుడు

 

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


Jul 16, 2026

సహకార సంఘాల ప్రయోజనాలు నమ్మిన ప్రగడ కోటయ్య

26న  ప్రగడ కోటయ్య 110వ జయంతి

చేనేత కార్మికులకు, చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని గట్టిగా నమ్మిన స్వాతంత్ర సమరయోధుడు, బీసీ రాజకీయ నేత ప్రగడ కోటయ్య.  గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు.  జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్న కోటయ్య చేనేత కార్మికుల సంక్షేమం కోసం, సహకార రంగం పటిష్టత కోసం ఎంతో శ్రమించారు.  జాతీయ స్థాయిలో ప్రముఖ బీసీ నేత, బహుజన బంధు,  అత్యంత నిజాయితీపరుడైన కోటయ్య ప్రగడ కోటయ్య మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  రైతులు, పేదలు, బీసీలు, ముఖ్యంగా చేనేత అభివృద్ధి,  చేనేత కార్మికుల సంక్షేమం, సహకార రంగం కోసం ఆయన తుది శ్వాస వరకు కృషి చేశారు.  దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్ల మందికి ఆరాధ్యుడైన  ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.

ప్రగడ కోటయ్య ఓ వైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే, మరో వైపు చేనేత కార్మికుల కోసం చాలా చురుకుగా పనిచేశారు. చేనేతరంగంతో పాటు రైతులు, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, కాంపోజిట్‌ మిల్లులపై ఆమూలాగ్రం ఆయన అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య  మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌ లో తన ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత,  అదే మద్రాస్  టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  సూపర్‌వైజర్‌గా  పనిచేశారు. ఈ అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జి ఉద్యోగంలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి, మరిన్ని సహకార సంఘాలను స్థాపించాలని వారిని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశారు.

1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.  1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లుగా చేనేత నాయకులు ఎన్నికయ్యేవిధంగా పథక రచన చేసి విజయం సాధించారు. 1941లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు థామస్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీని కోటయ్య గుంటూరు జిల్లాకు ఆహ్వానించారు. చేనేత రంగ సమస్యలపై వంద పేజీల మెమొరాండాన్ని ఆ కమిటీకి అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరికి దామర్ల రమాకాంతరావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. నూలు కొరతను అధిగమించేందుకు నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు. 1947లో పొన్నూరు నుంచి ఆయన ‘చేనేత’ వారపత్రికను కూడా తీసుకువచ్చారు. 

అసంఘటితంగా ఉన్న చేనేత రంగం అభివృద్ధికి, మిల్లు వస్త్రాల పోటీని చేనేత వస్త్రాలు తట్టుకోలేని పరిస్థితుల్లో, చేనేత ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడానికి ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. ఇందుకు సహకార రంగమే ఉత్తమమైనదిగా ఆయన భావించారు. ప్రగడ కోటయ్య హయాంలో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200పైగా నూతన చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. 1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే,  చీరలు, దోవతులు చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, బీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు. 

చీరాల శాసనసభ్యునిగా ప్రగడ కోటయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించారు. చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు, దానికి ప్రభుత్వం 99 ఎకరాలు కేటాయించేందుకు  కృషి చేశారు. ఆ మిల్లుకు దానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను ప్రధానికి తెలియజేశారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.  ఆ నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.  చీరాల, గుంతకల్లు, నెల్లూరు, రాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.

ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ‘ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు  అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితే, ఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకి ఇచ్చివేశారు. ‘ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడిక్కడే సార్థకం చేసి చూపించారు. అందుకనే అభిమానులు ఆయనను  ప్రజాబంధు ప్రగడ కోటయ్య, చేనేత కోటయ్య, చేనేత పిత, బహుజన నేత... అని కొనియాడుతుంటారు.  చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించి, దానికి  ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని నెలకొల్పనుంది.  


ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు


1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు

1949 అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు

1950 చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.

1952–1962 శాసనసభ సభ్యుడు

1955–1956 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

1959 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన,  చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్. 

1962–1965 ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్

1967–1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు

1973–1975 న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.

1974–1980 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు

1974–1978 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

1975 రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు,  కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు

1976–1978 ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు

1990–1995 రాజ్యసభ  సభ్యుడు


                                                      - శిరందాసు నాగార్జున రావు,  సీనియర్ జర్నలిస్ట్- 9440222914.

Jul 15, 2026

పుట్టా శ్రీనివాస్ కు ఘన నివాళి


మంగళగిరి:  మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన పుట్టా శ్రీనివాస్ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కేవలం పాత్రికేయునిగా మాత్రమే కాక నిబద్దత గల సామాజిక కార్యకర్తగా పుట్టా శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. అనారోగ్యం బారిన పడి చిన్న వయసులోనే మరణించడం శ్రీను  కుటుంబ సభ్యులకు మాత్రమే కాక మంగళగిరికి తీరని లోటని పేర్కొన్నారు.

ప్రత్యేకించి శ్రీ వేంకటేశ్వర యోగా సేవ కేంద్రంలో బోధనాచార్యునిగానూ, రేకా చంద్రశేఖర్  అధ్యక్షులుగా వ్యవహరించిన " వేమన సాహిత్య వేదిక " కార్యదర్శిగా పుట్టా శ్రీనివాస్  అందించిన సేవలను స్మరించారు. ఈ సందర్బంగా పుట్టా శ్రీనివాస్ స్మృతి చిహ్నంగా...త్వరలో "  పుట్టా శ్రీనివాసరావు స్మరణలో " పుస్తకాన్ని రేకా చంద్రశేఖర్  వెలువరిస్తున్నట్లు మానవతా వేదిక  కన్వీనర్  గోలి మధు తెలిపారు.


ఈ సభలో మంగళగిరి బుద్దవిహార వ్యవస్థాపకులు రేకా కృష్ణార్జున రావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణ రావు, బుద్దభూమి వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య, ధ్యానరత్న ఆకురాతి శంకరరావు, స్నేహ మహిళామండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి, వేంకటేశ్వర యోగసేవా కేంద్ర ఆచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్, ఎస్ ఎల్ ఎం చైతన్య బాధ్యులు శిందే బాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు శిరందాసు నాగార్జున, ప్రముఖ కళాకారులు అల్లక తాతరావు, సందుపట్ల భూపతి, బంధుమిత్రులు పాల్గొని ఘననివాళులు అర్పించడంతో సంస్మరణ సభ విజయవంతం అయింది.


Jul 13, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -7



మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి

మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే పరిచయం. అక్కడే మేం మంచి స్నేహితులమయ్యాం. మోహన్ రావు ఆంధ్రజ్యోతి-హైదరాబాద్ నుంచి విశాఖకు ట్రాన్స్ ఫర్. ఆంధ్రజ్యోతి-హైదరాబాద్ లో నా క్లాస్ మేట్ తిప్పావఝ్జుల కుమార్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తొలుత కుమార్ రిఫరెన్స్ తో మోహన్ రావు నాకు పరిచయం. ఆ పరిచయం స్నేహంగా మారి, ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీనివాసరెడ్డి మాత్రం నాకు విశాఖలోనే పరిచయం. మేమిద్దరం విశాఖలోనే ఆంధ్రయూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ పూర్తి చేసిన విషయం మీకు తెలుసు.

విశాఖ-ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారిలో ఎక్కువ మంది జీతాలపై బతికేవాళ్లమే. నాకు మాత్రం రూ.2 వేలు జీతం. శ్రీనివాసరెడ్డి కూడా స్పాట్ న్యూస్ అపాయింట్ మెంట్. అందువల్ల అతనికీ దాదాపు నా అంతే వచ్చేది. మోహన్ రావు ఏపీఎల్ అపాయింట్ మెంట్ అందువల్ల నాకంటే ఎక్కువగా ఉండేది. అందరికీ మనీ మేనేజ్ మెంట్ తెలుసు. చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకునేవాళ్లం. అదీగాక, విశాఖ కొత్త, అక్కడ ఆఫీసులో వాళ్లు తప్ప బయట వాళ్లు ఎవరూ పెద్దగా తెలియదు. ఆ రూ.2వేలు జీతంతో మేమిద్దరం, మాకు ఇద్దరు పిల్లలు నలుగురం చాలా సంతోషంగా బతికేవాళ్లం. శుక్రవారం ఆఫ్. ప్రతి శుక్రవారం అందరం రామకృష్ణ బీచ్ కు వెళ్లేవాళం. అప్పుడు కైలాసపురం నుంచి బీచ్ కి ఆర్టీసీ బస్ చార్జి రూ.2లు ఉండేది. ఒకటే టిక్కెట్. నాకు ఫ్రీ పాస్ ఉండేది. పిల్లలకు టికెట్ లేదు. జీవితం సాఫీగానే సాగేది. ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే ఎవరికైనా సమస్య.  ఎవరికైనా ఇబ్బంది వస్తే, మిషన్ సెక్షన్ లో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన వద్ద వడ్డీకి తీసుకునేవారు.  అతని పేరు గుర్తు లేదు. లావుగా ఉండేవారు. జీతాలు ఇచ్చే రోజున అక్కడే ఉండి, వడ్డీ లేదా అసలు వసూలు చేసుకునేవారు.  చాలా మంది అతని వద్ద వడ్డీకి అప్పు తీసుకునేవారు. వడ్డీ రూ.3లు. నేను కూడా రెండు మూడుసార్లు తీసుకున్నట్లు గుర్తు. వెయ్యి, రెండు వేలు మాత్రమే తీసుకునేవాడిని. ఎందుకంటే మళ్లీ తిరిగి చెల్లించడం కష్టం గదా. అదీగాక అప్పు తీర్చేదాక నాకు నిద్రపట్టదు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించడం నాకు అలవాటు. అందువల్ల నా మిత్రులకు నేనే అప్పు ఇచ్చేవాడిని గానీ, నేను ఎవరి వద్ద అప్పు తీసుకునేవాడిని కాదు.    నాకు ఎప్పుడైనా అత్యవసరం అయితే, నేను రూ.2ల వడ్డీకి ప్రయత్నించేవాడిని. ఒకసారి ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆపరేషన్. మిషన్ సెక్షన్ అతని అడిగాను, ఆ సమయంలో అతని వద్ద కూడా లేవు. చాలా మంది వద్ద ప్రయత్నించాను. ఆఫీసులో ఎక్కువ మంది, నాకు సన్నిహితంగా ఉండేవారందరూ ఆ జీతాలతో బతికేవారే. అందువల్ల వారిని అడగలేదు.  వాస్తవానికి నేను అడిగితే ఇచ్చేవారు ఇద్దరు ఉన్నారు. మా మామగారిని అడిగితే ఇచ్చేవారే. వాళ్ల వద్ద తీసుకోవడం నాకు ఇష్టంలేదు. నా పెళ్లి జరిగిన తర్వాత వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పెళ్లి రోజుకు బట్టలు కుట్టిస్తామన్నా, వద్దని నేనే కుట్టించుకున్నాను. నా పెళ్లికి వాళ్లు బట్టలు కుట్టించడం ఏమిటి? అని అనుకునేవాడిని. అది నా స్వభావం. మా బావ, మేనత్త కొడుకు, మా అమ్మ చిన్నమ్మ కొడుకు, మా పెదనాన్న అల్లుడు బిట్రా ముకుందరావుని అడిగితే ఇస్తారు. అయితే, ఆయనతో ఓ సమస్య. నేను అవసరంలో ఉన్నానని తెలిస్తే చాలు అడక్కుండానే ఇస్తారు. తిరిగి ఇస్తే తీసుకోరు. ‘‘నాకు నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వడం ఏమిటిరా?’’ అని అరుస్తారు. నా భార్యకు ఆపరేషన్ జరిగే రోజు తర్వాతి రోజే అన్నవరంలో ఆయన కూతురు పెళ్లి. ఆ సమయంలో ఆయనను అడగటం బాగోదని నేను అడగలేదు. అలాగే, ఆమె ఆపరేషన్ కు సిద్దమయ్యాం. ఈఎస్ఐ ఆస్పత్రి- ఆపరేషన్ ఫ్రీ. అయినా, కొంత డబ్బు చేతిలో ఉంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే, ఆపరేషన్ కు సిద్ధమయ్యాం. ఉదయం ఆస్పత్రికి ఆఫీస్ స్టాఫ్ చాలా మంది వచ్చి పలకరించి వెళ్లారు. చివరికి మోహన్ రావు - శ్రీనివాసరెడ్డి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరూ డ్యూటీకి వెళ్లాలి.  చివరకు మోహనరావు నా జేబులో రూ.2 వేలు పెట్టి ‘‘అవసరం అవుతాయోమో ఉంచుకో’’ అని చెప్పి వెళ్లిపోయాడు.   మోహనరావు వెళ్లిపోయిన తర్వాత శ్రీనివాసరెడ్డి ‘‘నాగార్జునా నాది ఓ పోజిటివ్ బ్లడ్. ఎవరికైనా డొనేట్ చేయవచ్చు. నీ మిసెస్ కి ఆపరేషన్ గదా బ్లడ్ ఏమైనా అవసరమైనే నేను ఇస్తాను. నేను సెలవు పెట్టి వచ్చాను. సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాను’’ అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ఈఎస్ఐలో సూర్యాకాంతం అనే డాక్టర్ ఉండేవారు. ఆమె విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ పేరు సూర్యాకాంతం, అందుకనే ఆమె పేరు ఇప్పటికీ గుర్తు ఉంది.

ఆపరేషన్ జరిగిన తెల్లారి, వాళ్ల అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత మా బావ ఆస్పతికి వచ్చి, పలకరించి, నేను అడగకుండానే ‘‘అవసరం అవుతాయి ఉంచుకో’’ అని నాకు రూ.3 వేలు ఇచ్చి వెళ్లారు.  ఆ తర్వాత కొంత కాలానికి మోహన్ రావుకు వడ్డీ లేకుండా అసలు రూ.2 వేలు ఇచ్చేశాను. మా బావకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే, ఇచ్చినా ఆయన తీసుకోడు. పైగా ‘‘నాకు నువ్వు తిరిగి డబ్బులు ఇవ్వడం ఏమిటిరా?’’ అని అరుస్తాడు. ఆపరేషన్ జరిగిన రోజు సంఘటనలు నేను చాలా మందికి చాలా సార్లు చెప్పాను.

(అయిపోయింది)

ఆంధ్రజ్యోతి పరివారం -6

                                                                    ఆంధ్రజ్యోతి మేనేజ్ మెంట్

నేను జర్నలిస్టుగా దాదాపు 11 సంస్థలలో పనిచేశాను. వాటన్నిటిలో అప్పటికి, ఇప్పటికీ ఆంధ్రజ్యోతి నెంబర్-1, ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్. ఆంధ్రజ్యోతి అంటే, ఇక్కడ స్పాట్ న్యూస్. నాది స్పాట్ న్యూస్ అపాయింట్ మెంట్. నేను ఆంధ్రజ్యోతి-విశాఖ లాంచింగ్ ఎడిషన్ లో రూ.2వేల జీతానికి చేరి, రూ.3 వేలు పెరిగే వరకు పని చేశాను. నేను రాజీనామా చేసిన తర్వాత, అప్పటి వరకు నాకు  మిగిలిపోయిన సెలవులు నెలా 15 రోజులకు రూ.4,500 ఇచ్చారు. దాదాపు నా 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎక్కడా మిగిలిపోయిన సెలవుల జీతం ఇంత ఇవ్వలేదు. మిగిలిన సెలవుల జీతం ఇచ్చినట్లే గుర్తు లేదు. 

ఇక్కడ స్పాట్ న్యూస్ క్లర్క్ మేరి కుమారి గారి గురించి చెప్పాలి. నాకు ఇప్పటికీ  సీఎల్స్, సిక్ లీవ్స్, ఈఎల్స్ పెట్టే విధానం తెలియదు. ఈ సెలవులు పెట్టే విషయంలో ఒక్కో సంస్థలో హెచ్ఆర్ విధానం ఒక్కోలా ఉంటుంది. ఒక రకమైన సెలవు తర్వాత, ఇంకో రకమైన సెలవు పెట్టకూడదని, ఎక్కువ రోజులు పెట్టాలంటే ఒక రకమైన సెలవు, తక్కువ రోజులైతే ఒక రకమైన సెలవు అని ఉంటాయి.  సెలవులు ఎలా పెట్టాలో తెలియక, సెలవులు పెట్టే సమయంలో   మేరి కుమారి గారిని విసిగిస్తుండేవాడిని. నా పరిస్థితి కొద్ది రోజులు చూసి, చివరికి ఆమె ఇలా చెప్పారు. ‘‘మీకు ఎప్పటి నుంచి ఎప్పటి ఎప్పటి వరకు ఎన్ని రోజులు  సెలవు కావాలో రాసి, కింద సంతకం చేసి నాకు ఇవ్వండి. అక్కడ ఏ సెలవు రాయాలో నేను చూసుకుంటాను. సెలవుల విషయంలో మీకు నష్టం జరగకుండా నేను చూసుకుంటాను’’ అని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి లీవ్ లెటర్ లో నేను ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నానో, అదే రాసేవాడిని. ఏ సెలవో రాసేవాడిని కాదు. చివరకు నేను ఆంధ్రజ్యోతిలో రాజీనామా చేసి, విశాఖలోనే వార్తలో చేరారు. 15 రోజులు తర్వాత, ఆంధ్రజ్యోతి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘‘ఆంధ్రజ్యోతిలో మిగిలిపోయిన మీ సెలవులకు డబ్బు ఇవ్వమని హెడ్ ఆఫీసు(విజయవాడ) నుంచి మెసేజ్ వచ్చింది. వచ్చి తీసుకు వెళ్లండి’’ అని చెప్పారు. మిగిలిపోయిన సెలవులు అంటే వెయ్యి రూపాయలో, 15 వందల రూపాయలో వస్తాయని అనుకుంటూ ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లాను. నెలా 15 రోజులు సెలవులు మిగిలిపోయాయని రూ.4.500లు ఇచ్చారు. నాకు అన్ని సెలవులు మిగలడానికి ప్రధాన కారకురాలు మేరి కుమారి గారు.  ఆంధ్రజ్యోతిలో నేను మానివేసే సమయంలో తీసుకున్న జీతం రూ.3 వేలు. ఆ సమయంలో ఊహించని విధంగా నెలా 15 రోజుల జీతం, అంత డబ్బు అందుకొని నేను ఎంత ఆనందించానో మాటలలో చెప్పడం చాలా కష్టం. మీరే ఊహించుకోండి. దటీజ్ ఆంధ్రజ్యోతి.

ఆంధ్రజ్యోతిలో ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్(ఏపీఎల్), దాని అనుబంధ సంస్థ స్పాట్ న్యూస్‌పై ఎడిటోరియల్ స్టాఫ్ ని, రిపోర్టర్స్ ని అపాయింట్ చేసుకునేవారు. ఏపీఎల్ వారికి, స్టాట్ న్యూస్ వారికి జీతంలో, నైట్ డ్యూటీ అలవెన్సులలో చాలా వ్యత్యాసం ఉండేది. అప్పట్లో నైట్ డ్యూటీ అలవెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడా లేదనుకుంటా. నా అపాయింట్ మెంట్ స్పాట్ న్యూస్. జీతం కూడా ఏపీఎల్ వారికి 1వ తేదీనే ఇచ్చేవారు. మాకు ఆలస్యంగా ఇచ్చేవారు. 

నాకు తెలిసినంతలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎడిటోరియల్ స్టాఫ్ ని, రిపోర్టర్స్ ని చాలా గౌరవంగా, మర్యాదగా చూసుకునేది. ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోయినా, ఇబ్బందికరంగా అనిపించినా ఉద్యోగం నుంచి తొలగించేదికాదు.  కలకత్తాకో, మద్రాస్ కో ట్రాన్స్ ఫర్ చేసేవారు.  అప్పటి ఎండీ కానూరి జగదీష్ ప్రసాద్ గారు విశాఖ వచ్చినప్పుడుల్లా ఎడిటోరియల్ స్టాఫ్ తో మీటింగ్ పెట్టేవారు. అందరికీ అప్సరా హోటల్ నుంచి బిర్యానీ వచ్చేది. ప్రతి మీటింగ్ లో నేను ఏదో ఒకటి ఆయనను అడిగేవాడిని. ఆయన చాలా సింపుల్ గా సమాధానాలు చెప్పేవారు. ఒకసారి, ‘‘సార్, ఏపీఎల్ వారికి, స్పాట్ న్యూస్ వారికి జీతంలో చాలా వ్యత్యాసం ఉంది.’’ అని అడిగాను. ‘‘అందుకోసమే గదా స్పాట్ న్యూస్ పెట్టింది’’ అని ఆయన సింపుల్ గా సమాధానం చెప్పారు. ‘‘ఆ వ్యత్యాసాన్ని తక్కువగా ఉండేట్లు చూడండి’’ అని అడిగాను. ‘‘చూస్తాం’’ అని మాత్రమే సమాధానం చెప్పారు. మరోసారి, ‘‘ఏపీఎల్ వారికి 1వ తేదీనే జీతం ఇచ్చారు. 5వ తేదీ వచ్చినా మాకు జీతం ఇవ్వలేదు సార్’’ అని చెప్పారు.  అప్పుడు మా స్టాఫ్ లో కొందరు ‘‘నాగార్జున ఏంటి ఇలా అడిగారు’’ అనుకున్నారు. అయితే, ఎండీ గారు మాత్రం  వెంటనే ఆ రోజే జీతం ఇప్పించే ఏర్పాటు చేశారు. ఇంకోసారి, ఎండి గారు వచ్చినప్పుడు, ఆ సమయంలో ఎడిటోరియల్ స్టాఫ్ ని తీసుకునే ఉద్దేశం ఉంది. విజయనగరం జిల్లాలో ఓ గ్రామీణ విలేకరి. పేరు గుర్తులేదు. అతను వార్తలు చాలా చక్కగా రాసేవారు. డెస్క్ లో పెన్ను పెట్టే అవకాశంలేకుండా ఏ వార్త ఎంత రాయాలో అంతే రాసేవారు. అటువంటి వ్యక్తిని డెస్క్ లోని తీసుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం. అదే విషయం నేను ఎండీ గారికి చెప్పాను. నేను చెప్పినదంతా విని, ఆయన అక్కటే మాట అన్నారు. ‘‘తీసుకోండి, పడేది మీరేకదా’’అని అన్నారు. అంటే, అతను బాగా రాయలేకపోతే, ఇబ్బందిపడేది మేమేకదా అన్నది ఆయన  ఉద్దేశం. ఆ తర్వాత ఆ విలేకరిని డెస్క్ లోకి తీసుకున్నాం. కొంత కాలం తర్వాత అతను ఆర్టీసీ కండక్టర్ గా సెలక్ట్ అయి వెళ్లిపోయారని చెప్పారు. 

ఇప్పటి ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా చాలా వరకు ఆ పద్దతులనే అనుసరిస్తోంది. కరోనా సమయంలో దాదాపు రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీసు హైదరాబాద్  సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను. ఎడిటోరియల్ స్టాఫ్ కి అదే మర్యాద, జీతం 5 నుంచి 8వ తేదీ మధ్యలో అందరికీ ఇచ్చేవారు. చాలా హాయిగా పని చేసుకున్నాను. నేను ఉన్న సమయంలో ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ స్టాఫ్ తో  ఒకసారి సమావేశమయ్యారు.  వాస్తవానికి అక్కడే రిటైర్ అవుదామని అనుకున్నాను. కుటుంబ అవసరాల రీత్యా నేను మంగళగిరిలో ఉండవలసి ఉన్నందున, నాకు ఇష్టంలేకుండానే, బాధపడుతూ రాజీనామా చేసి వచ్చాను. 

ఆ తర్వాత నేను పనిచేసిన వాటిలో న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు యాజమాన్యం నాకు బాగా నచ్చింది. చెన్నైలో  ఆ గ్రూపునకు సంబంధించిన ఏపీవీక్లీ.కామ్ కు చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా పనిచేశాను. అక్కడ  నాకు ఒకసారి జీతం పెరిగింది. నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, జీతం అందుకునే సమయంలో మాత్రమే ఎవరికైనా  జీతం ఎంత పెరిగిందో తెలిసేది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో అలా కాదు, నెల ముందే తెలుస్తుంది. ఒకసారి నేను డెస్క్ లో పని చేసుకుంటున్న సమయంలో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ సక్సేనా గారు నా వద్దకు వచ్చి, ‘‘Please come to my cabin’’ అన్నారు. వాస్తవానికి ఆఫీస్ బాయ్ చేత కబురు చేయవచ్చు. కానీ, ఆయనే నా వద్దకు వచ్చారు. ఆయనతోపాటు కేబిన్ కు వెళ్లిన తర్వాత, ఎదురుగా కుర్చీ చూపించి, కూర్చోమన్నారు. నేను కూర్చున్న తర్వాత, సొరుగులో నుంచి ఒక లెటర్ తీసి, ‘‘వచ్చే నెల నుంచి మీకు జీతం  పెరుగుతుంది’’ అని చెప్పి, ఆ లెటర్ నా చేతికి ఇచ్చి, అభినందించారు. వచ్చే నెల నుంచి నా జీతం ఎంత పెరుగుతుందో ఆ లెటర్ లో రాసి ఉంది. సునీల్ సక్సేనా అంతటి వ్యక్తి నా పట్ల అంత మర్యాదగా ప్రవర్తించడం, వచ్చే నెల నుంచి పెరిగే జీతం నాకు ముందుగానే తెలియజేయడం, అభినందనలు తెలపడం... నాకు చాలా ఆనందం కలిగించాయి. జీతం పెరిగిన సమయంలో ఎక్కడా నేను అంతటి గౌరవం పొందలేదు. సాక్షిలో నాకు న్యూస్ ఎడిటర్ గా ప్రమోషన్ ఇచ్చి, ఒక్కసారిగా జీతం రూ.5 వేలు పెంచారు. అక్కడ కూడా జీతం అందుకున్న సమయంలోనే ప్రమోషన్ వచ్చినట్లు, జీతం పెరిగినట్లు తెలిసింది. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయంలోనే మరో సంఘటన, ఓ రోజు  నేను డెస్క్ లో పని చేసుకుంటున్న సమయంలో హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ నుంచి ఓ క్లర్క్ నా వద్దకు వచ్చి, హ్యాపీ బర్త్ డే అని చెప్పి, నాకు ఓ గ్రీటింగ్ కార్డు అందించి, నా చేతిలో ఓ కిలో స్వీట్ ప్యాకెట్ పెట్టారు. ఆ సమయంలో నేను ఎంత ఆనందించానో, అంత ఆశ్చర్యపోయాను.  ఆ సంస్థలో ప్రతి ఒక్కరి పుట్టిన రోజున చెన్నైలో పేరు పొందిన ఓ పెద్ద స్వీట్ షాపు నుంచి ఓ కిలో స్వీట్స్ తెప్పించి, గ్రీటింగ్ కార్డుతో కలిపి ఇస్తారు. వాస్తవానికి ఆ రోజు నా పుట్టిన రోజు కాదు. నేను మెట్రిక్ పరీక్షలు రాసే సమయంలో మా రామూ మాస్టార్ రాసిన తేది అది. అదే నా బయోడేటాలో ఉంటుంది. ఆ ప్రకారం,  ఆ రోజు  నాకు గ్రీటింగ్స్ తెలిపారు. పుట్టిన రోజు పేరుతో అంతటి ఆత్మీయ అభినందనలు మరే సంస్థలోనూ అందుకోలేదు. అయితే, ఆధాన్, పొలిటికోస్ సంస్థలలో మాత్రం మెయిల్ కు గ్రీటింగ్స్ పంపారు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  కూడా నాకు ఉద్యోగం మానడం, సురేష్‌ని వదిలిపెట్టి రావడం ఇష్టంలేదు. అప్పట్లో హైదరాబాద్ లో చదువుకుంటున్న  మా అబ్బాయి కోరికపై  అక్కడ రాజీనామా చేసి,  సాక్షి లాంచింగ్ కంటే ముందే హైదరాబాద్ లో సాక్షి.కామ్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేరాను. 

నేను పనిచేసిన సంస్థలలో ఆంధ్రజ్యోతి, సాక్షి, ఐ అండ్ పీఆర్ (అవుట్ సోర్సింగ్ సంస్థ), ఆధాన్ మాత్రమే పీఎఫ్ చెల్లించాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సమయంలో చెల్లించిన పీఎఫ్ వల్ల నాకు జీవితంలో ఎంతో మేలు జరిగింది. ఆ పీఎఫ్ పెట్టుబడిగా పెట్టడం వల్ల ఆ ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాను.

Jul 11, 2026

ఆంధ్రజ్యోతి పరివారం - 5



సీరియస్ విషయాలయలతోపాటు కొన్ని సరదా విషయాలు... నేను సిటీ డెస్క్ ఇన్ చార్జిగా ఎక్కువ కాలం పనిచేసినందున, సిటీలో పనిచేసేవారందరూ ఎక్కువగా పరిచయం. ప్రతిరోజూ కలిసేవారం. రఘు, సాగర్, కళ్యాణరామ్, సుబ్బు(చాగంటి సుబ్రహ్మణ్యం-ఫొటోగ్రాఫర్), విజయ్, సాంబ,  నగర విలేకరులు అందరూ ప్రతి రోజూ కలిసేవారు. కొందరు ఫోన్లు చేసేవారు. అందువల్ల వారితో సాన్నిహిత్యం ఎక్కువ.

 విశాఖలో నన్ను అతి ఎక్కువగా నవ్వించింది సుబ్రహ్మణ్యమే. సీరియస్ గా మీటింగ్ జరిగే సమయంలో కూడా చెవులో ఏదో చెప్పి నవ్వించేవారు. శ్రీధర్ ఓ రెండు జోకులు స్పాట్ న్యూస్-స్టాక్ న్యూస్, న్యూస్ ఎడిటర్ – న్యూసెన్స్ ఎడిటర్ కూడా గుర్తు చేశారు. సుబ్బు మా ఇంటికి వచ్చి మా పిల్లలను ప్రత్యేకంగా తీసిన ఫొటోలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి.  రఘు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాముఖ్యత కలిగిన, సంచలనం కలిగించే న్యూస్ రాయాలన్న ఆతృతతో ఉండేవారు. అలాగే, మంచి మంచి వార్తలు రాసేవారు. అయితే, తను రాసే కొన్ని ముఖ్యమైన వార్తలకు లీడ్ రాయమని సురేష్ ని అడిగేవారు. సురేష్ పనిలో ఉంటే బతిమిలాడేవారు. సురేష్ జోక్ లు వేస్తూ, ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేసేవాడు. ఒక్కోసారి సిగరెట్ ఇస్తే రాస్తాననేవాడు. తన దగ్గర ఉంటే, ఇచ్చేవారు. లేకపోతే తెచ్చిఆస్తాను రాయమని అడిగేవారు. తెచ్చిఇస్తేనే రాస్తాననేవాడు సురేష్. చివరికి సిగరెట్ తెచ్చి ఇచ్చి, రాయించుకుని వెళ్లేవారు రఘు. ఆ తర్వాత సుబ్బు వచ్చి రెండు జోకులు పేల్చి వేళ్లేవారు. నాకు గుర్తు ఉన్నంత వరకు గోపరాజు నారాయణ రావు గారు, సురేష్, శ్రీధర్ గారు హెడ్డింగ్స్ బాగా పెట్టేవారు. అయితే, నేను ఎక్కువగా హెడ్డింగ్స్ గోపరాజు నారాయణ రావు గారు, సురేష్ చేత పెట్టించేవాడిని. నారాయణరావు గారు జనరల్ లో ఉండేవారు. ఆయనకు ఐటం ఇస్తే, కొద్దిసేపటి తర్వాత హెడ్డింగ్ పెట్టి ఇస్తానని చెప్పి, అలాగే పెట్టి ఇచ్చేవారు. ఫొటో రైటప్స్ అబ్దుల్లా బాగా పెట్టేవారు. సిటీ పేజీలు అయినందు, కేవలం రైటప్ ఫొటోలు ఎక్కువగా వాడేవారం. అబ్దుల్లా నా డెస్క్ లో ఉన్నా, వేరే డెస్క్ లో ఉన్నా,  నేను అతనిచేతే ఎక్కువగా రైటప్స్ రాయించేవాడిని. నేను ఎక్కువగా ఇజ్రాయిల్, సుధీర్ చేత పేజీలు పెట్టించేవాడిని. సుధీర్ ఎంత స్పీడ్ గా పెట్టేవాడో, ఇజ్రాయిల్ అంత జాప్యం చేసేవాడు. పేజీ మేకప్ లో రోజుకో కొత్తదనం చూపించాలని సుధీర్ తాపత్రయపడేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అప్పట్లో పేజీలో రంగుల కోసం, పేజీలపైన హెడ్డింగ్ పక్కన, మాకు కావలసిన రంగు రావడం కోసం రంగుల శాతం రాసేవారం. మిషన్ సెక్షన్ లోకి వెళ్లి ఆ రంగుల శాతం తెలుసుకునేవాళ్లం. ఈ విషయంలో సురేష్ చాలా చురుకుగా ఉండేవాడు.  అప్పట్లో ఎవరున్నా సరే, మేం డెస్క్ లోనే సిగరెట్ తాగేవాళ్లం. ఎడిటోరియల్ డెస్క్ లో ఆ సౌలభ్యం ఉండేది. వార్త రావడంతో సెంట్రలైజ్డ్ ఏసీలు వచ్చాయి. దాంతో, డెస్క్ లో సిగరెట్ తాగే అవకాశం ఉండేదికాదు.  నేను కూడా అప్పట్లో సిగరెట్ తాగేవాడిని.  అయితే, నేను 15 ఏళ్ల క్రితం సిగరెట్ ని పూర్తిగా మానేశాను. మళ్లీ ముట్టుకోలేదు. ట్రైనీ సబ్ ఎడిటర్ దగ్గర నుంచి న్యూస్ ఎడిటర్ వరకు హోదాలతో సంబంధంలేకుండా డెస్క్ లో అంతా కలిసి పనిచేసేవాళ్లం.  భాషతోపాటు అన్ని విషయాలు కూడా అలాగే చర్చించేవాళ్లం. అలా సరదా సరదాగా టైం తెలియకుండా  డ్యూటీ చేసేవారం.

ఆనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసినవారు ఇప్పుడు, ప్రభుత్వంలో, ప్రైవేటు రంగంలో, పత్రికా రంగంలో ఉన్నత హోదాలకు ఎదిగిపోయారు. అయితే, మొన్న జరిగిన సమావేశంలో అవేమీ తెలియకుండా, మేం అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో అలాగే గడిపేశాం. నేను మన కార్యక్రమానికి వచ్చి ఎంత ఆనందించానో, సుబ్బు పరిస్థితిని చూసి అంత బాధపడ్డాను. ఒక్క జోక్ కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అయితే, సుబ్బు మనల్ని నవ్వించలేకపోయినా, అతను మాత్రం నవ్వుతూనే ఉన్నారు. ఇంత కాలానికి మనందరం కలిసిన ఆనందం అతని నవ్వులో చూశాను. నేను ఒంగోలులో వార్తకు ఎడిషన్ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఒకసారి  సుబ్బు అక్కడికి వచ్చారు. అప్పుడు సుబ్బు హిందులో చేసేవారు. నాలుగు జోకులు వేసి నన్ను నవ్వించి వెళ్లారు. ఆ తర్వాత ఇదే చూడటం.

విశాఖ ఆంధ్రజ్యోతిలో ఇద్దరు మూర్తులతో నాకు సాన్నిహిత్యం ఉండేది. వారిలో అకౌంటెంట్ మూర్తి మేం పెట్టే హెడ్డింగ్స్ ని సరదాగ తెగ విమర్శిస్తుండేవారు. అందులో సద్విమర్శలు కూడా ఉండేవి.  ఆయన మాట తీరుని బట్టి ఆయనకు తెలుగు భాషా ప్రావీణ్యం ఉన్నట్లు అర్థమైంది.  ఒక రోజు ఆయనను ‘‘అకౌంట్‌గా పనిచేసే మీకు ఇంతటి తెలుగు ఎలా అబ్బంది’’ అని అడిగాను. తాను చిన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లో ఉండి చదువుకున్నట్లు చెప్పారు.

 

Jul 10, 2026

నిర్మాణ రంగంలో పురివిప్పిన ‘మయూరి’ టెక్ పార్క్











పద్మశాలీయుల విజయపతాక

మంగళగిరి చేనేతకు విస్తృత స్థాయి ప్రచారం కల్పించిన యింజమూరి శ్రీనివాసరావు

చేనేతలు గర్వించతగ్గ స్థాయికి ఎదిగిన యింజమూరి శ్రీనివాసరావు

మంగళగిరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేనేత, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. ఇప్పుడు నారా లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గంగా కూడా పేరుపొందింది. ఏదిఏమైనా చేనేత పరంగానే మంగళగిరికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. మంగళగిరి చేనేతకు ఇంతటి గుర్తింపు తీసుకురావడానికి కృషిచేసిన ముఖ్యులలో యింజమూరి శ్రీనివాసరావు ఒకరు. మంగళగిరిలోని వారికి కూడా తెలియకుండా అనేక రకాల వస్త్రాలు నేయించి, దేశం అంతటా వ్యాపారం చేశారు. ఎగుమతిదారులకు సరఫరా చేశారు. చీరలకు, ఇతర రకాల చేనేత వస్త్రాల తయారీకి మంగళగిరి ఓ బ్రాండ్ గా గుర్తింపు పొందడానికి యింజమూరి శ్రీనివాసరావు కృషి ఎంతో ఉంది. శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి అయిన తర్వాత, మంగళగిరిలో చేనేత(పద్మశాలి) వర్గానికి చెందిన తమ్మిశెట్టి రామకృష్ణ, జంజనం రెడ్డయ్య కలిసి 1986లో కొత్తగా సన్ ఫ్లవర్ పేరుతో  ప్రారంభించిన హోల్ సేల్ చేనేత వస్త్రవ్యాపార సంస్థలో రూ.600ల జీతం, లాభాలలో  10 శాతం వాటాతో గుమస్తాగా చేరారు. మంగళగిరి చేనేతకు పేరు రావడానికి కీలక వ్యక్తులు వీరు ఇద్దరే అయినప్పటికీ, ఫీల్డ్ లో వర్క్ చేసిన ముఖ్య వ్యక్తి యింజమూరి శ్రీనివాసరావు. తమ్మిశెట్టి రామకృష్ణ మంగళగిరిలో అప్పటి జనసంఘ్ పార్టీ ప్రముఖ నేత. పేదలకు ఆర్థిక సహాయం చేసేవారు.   ఆయనకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది.  ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఆయన కోడలే. రామకృష్ణ  పొగాకు వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో చేనేత వస్త్ర వ్యాపారం వైవు మళ్లారు. జంజనం కుటుంబ రెడ్డయ్య కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉండేవారు. చేనేతలో శిక్షణ, కొత్త డిజైన్ల తయారీ, రంగుల అద్దకం,  ఆధునిక సాంకేతిక పద్ధతులు, చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ సహకారం అందిస్తూ, చేనేత కార్మికుల ఉత్పాదకత, ఆదాయం పెంచడానికి వీవర్స్ సర్వీస్ సెంటర్ ప్రయత్నించేది. ఆ విధంగా రెడ్డయ్యకు చేనేత ఉత్పత్తులు, మార్కెటింగ్ పై మంచి పట్టు ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినందువల్ల, ఆయన బయట ఉండి సహాయ సహకారాలు అందించగలరు గానీ, వ్యాపారంలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేని పరిస్థితి. ఇక తమ్మిశెట్టి రామకృష్ణ విషయానికి వస్తే, ఆయన పెట్టుబడి పెట్టగలరు గానీ, చేనేత వ్యాపారంపై పట్టులేదు. ఈ పరిస్థితుల్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టేటట్లు, రెడ్డయ్య డిజైన్, మార్కెటింగ్ లో పూర్తి సహకారం అందించేట్లు, లాభాలు చెరిసగం పంచుకునే విధంగా ఒప్పందం కుదిరింది.  వీరు ఇద్దరూ 1986 మార్చిలో ‘సన్ ఫ్లవర్’ పేరుతో  వ్యాపార సంస్థను స్థాపించారు. అయితే, చేనేత వస్త్రాలు నేయించడం, వాటిని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి యువకులు కావలసి వచ్చింది. అప్పుడు, ఆ హోల్ సేల్ వ్యాపారం చూసుకోవడానికి రామకృష్ణ తన సోదరుడి కుమారుడు తమ్మిశెట్టి లక్ష్మణరావుని, రెడ్డయ్య తన మేనల్లుడు యింజమూరి శ్రీనివాసరావులను నియమించుకున్నారు.   1986 ఆగస్టులో యింజమూరి శ్రీనివాసరావు ఈ వ్యాపార సంస్థలో అడుగుపెట్టారు.  మంగళగిరిలో చీరలతోపాటు ఇతర చేనేత వస్త్రాలు నేయించడం, వాటిని జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడం శ్రీనివాసరావు, లక్ష్మణరావులు చూసేవారు.  శ్రీనివాసరావు సౌమ్యుడు, మాటకారి, మర్యాదస్తుడు, కలుపుగోలుతనంతోపాటు నీతి, నిజాయితీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి కావడంతోపాటు రంగులు, డిజైన్ల తయారీలో చురుకుగా ఉండటంతో వ్యాపారంలో దూసుకుపోయారు.  

మంగళగిరి చేనేత వస్త్రాల ప్రత్యేకత

అప్పట్లో మంగళగిరిలో 40, 60 నెంబర్ దారంతో సాదా, పేటు చీరలు మాత్రమే ఎక్కువగా నేసేవారు. ఇవి పట్టుబడి చీరలుగా ప్రసిద్ధి చెందాయి. రంగులకు, చేనేత వస్త్రాల మన్నికకు అప్పుడు, ఇప్పుడూ మంగళగిరికి మంచి పేరుంది. నూలుకు వివిధ రకాల రంగుల అద్దకం(డైయింగ్)లో మంగళగిరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీటితోపాటు రంగులు అద్దకం చేసే మేస్త్రీలు, కార్మికుల ప్రత్యేక నైపుణ్యం వల్ల రంగులు చాలా ఆకర్షణీయంగా, మన్నికగా, ఎలవకుండా ఉండేవి. కొన్ని రంగులకు మంగళగిరి ప్రత్యేకంగా నిలిచేది. ముఖ్యంగా పచ్చి మామిడికాయ, మెజంత, చంద్రకాంత రంగుల చీరలను రైతు వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు. నూలును చేనేతకు అనుకూలంగా పడుగుగా తయారు చేయడంలో కూడా నైపుణ్యత గల కార్మికులు ఇక్కడ ఉన్నారు.   చీరలు, ఇతర చేనేత వస్త్రాలను దట్టంగా, నైపుణ్యతతో నేయడం మంగళగిరి చేనేత కళాకారుల ప్రత్యేకత.ఈ చేనేత వస్త్రాలు చెమటను ఎక్కువగా పీల్చడం వల్ల కూడా మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు. 

మంగళగిరి చేనేత వస్త్రాల తయారీలో కొత్త పోకడలు 

రామకృష్ణ, రెడ్డయ్యల సారధ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి డిజైనర్ల సహకారంతో శ్రీనివాసరావు  కొత్త కొత్త రంగులు, డిజైన్ల విషయంలో నూతన ఒరవడిని సృష్టించారు. రంగులు వందలు కాదు వేల రకాలు సృష్టించారు. మంగళగిరిలో చింతక్రింది రాధాకృష్ణ అనే చేనేత కార్మికుడితో ఒక మగ్గంపై నేత నేయించడం మొదలుపెట్టి, మంగళగిరి, దాని చుట్టుపక్కల గ్రామాలలో వందల మగ్గాలపై చీరలతోపాటు డ్రెస్ మెటీరియల్, దేశవిదేశాలలో ధరించే అనేక ఇతర చేనేత వస్త్రాలు నేయించారు. ముఖ్యంగా నిజామ్ బోర్డర్ పేరిట తయారైన చీరలు, జాకెట్లు మంగళగిరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మంగళగిరిలో నిజామ్ బోర్డర్ ని మొదలుపెట్టింది వీరే. తొలుత ఢిల్లీలోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐసీ)వారి షోరూమ్ లో 20 చీరలు అమ్మకానికి పెడితే, ఓ గంటలో అమ్ముడుపోయాయి. దాంతో, అప్పటి ఆ సంస్థ ఎండీ మాళవిక ఖన్నా100 చీరలకు ఆర్డర్ ఇచ్చారు. ఆ వంద చీరలు ఆ షోరూమ్ లో  అమ్మకానికి పెడితే, ఒక్క రోజులో అమ్ముడుపోయాయి. ఇక వారు వెనక్కి తిరిగి చూడలేదు. దేశంలోని న్యూఢిల్లీ,  ముంబై, పూనే, బెంగళూరు, హైదరాబాద్ ... వంటి నగరాలలో జరిగే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ నిర్వహించి భారీ స్థాయిలో వ్యాపారం చేశారు.  రోజురోజుకు వ్యాపారం పెరుగుతూ వస్తోంది. ఎగ్జిబిషన్స్ లో స్టాల్స్ పెట్టడంతోపాటు హోల్ సేల్ వ్యాపారులకు, సీసీఐసీ, లేపాక్షి... వంటి సంస్థలకు, ఎగుమతిదారులకు వీరు చేనేత వస్త్రాలు సరఫరా చేసేవారు.  ఆమ్రస్,.... వంటి అనేకమైన అద్భుతమైన రంగులతో, అత్యాధునిక డిజైన్లతో అన్ని వర్గాల, ముఖ్యంగా సంపన్న వర్గాల మహిళలను ఆకట్టుకునే విధంగా  చేనేత చీరలు నేయించి, మార్కెటింగ్ చేశారు. నూతన డిజైన్లు రూపొందించడంలో అబ్రహమ్ ఠాకూర్, మార్తాండ్ సింగ్, రాఖేష్ ఠాకూర్, రీతూకుమార్, బందేజ్ అర్చనా షా, తరుణ్ తహ్లియాన్... వంటి అంతర్జాతీయ డిజైనర్లు వీరికి సహకరించారు. సాధారణంగా చీరలకు పడుగు, పేకలకు ఒకే నెంబర్ దారం వాడతారు. వీరు డ్రెస్ మెటీరియల్ కు పడుగు, పేకల దారం నెంబర్లు మార్చడంతోపాటు  కలనేత, మల్టీ కలర్, మిస్సింగ్ చెక్ వంటివి తయారు చేయించారు. కుర్తాకు 80/80 నెంబరు నూలు వాడితే, పైజమాకు 60/40 నెంబర్ల నూలు వాడేవారు. మిస్సింగ్ చెక్ వస్త్రం మొట్టమొదట మంగళగిరిలోనే తయారైంది. దానిని వీరే నేయించారు. 

మంగళగిరిలో రహస్యంగా చేనేత ఉత్పత్తులు

1990 దశకంలో  అనేక రకాల నూతన వస్త్రాలను వీరు మంగళగిరిలో రహస్యంగా నేయించారు. జపాన్, యూరప్ దేశాలలో మంచి డిమాండ్ ఉన్న స్టోల్స్(24X72) తయారు చేయించారు. ఆయా దేశాలకు ఎగుమతి చేసే ఎగుమతిదారులకు వాటిని సరఫరా చేసేవారు.  ఈ వస్త్రాల విషయం ఇతరులకు తెలిస్తే, తమ వ్యాపారానికి పోటీదారులు తయారవుతారని, వీటిని చాలా రహస్యంగా నేయించారు. ఇటువంటి వస్త్రాలు ఇక్కడ తయారయ్యాయని, మంగళగిరిలోని వారికి చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు. క్లోజ్డ్ మగ్గాల షెడ్ల లోపల వీటిని నేసేవారు. తయారైన వస్త్రం వారికి తెలియకుండా బయటకు వెళ్లేదికాదు. ఈ విషయం రహస్యంగా ఉంచమని చేనేత కళాకారులకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పేవారు. అందువల్ల ఎవరికీ తెలియదు. 1987లో అబ్రహమ్, ఠాకూర్ ల ఆర్డర్లపై దుప్పటాస్(36X84) నేయించి, సరఫరా చేశారు. అప్పట్లో నార్నె విజయలక్ష్మీ ప్రభాకర్ అనే కౌన్సిల్ సభ్యురాలు వీరికి సహాయ సహకారాలు అందించారు. మంగళగిరిలో చింతక్రింది రాధాకృష్ణ, అందె రామస్వామి, చింతక్రింది చిన వీరరాఘవులు, అందె కనకలింగేశ్వరరావు, తిరువీధుల సాంబశివరావు, అందె శివశంకరరావు, బిట్రా ఆదినారాయణ, పొట్లాబత్తుని లక్ష్మణరావు, జంజనం మల్లేశ్వరరావు, మునగాల గోపాలకృష్ణ... వంటి వారు వీరికి చీరలు, ఇతర చేనేత వస్త్రాలు నేయించి ఇచ్చేవారు. 

విడిపోయిన రామకృష్ణ - రెడ్డయ్య 

చేనేత వస్త్ర వ్యాపారం అద్వితీయంగా జరుగుతూ, లక్షల్లో లాభాలు వచ్చే సమయంలో వ్యాపార భాగస్వాములైన  రామకృష్ణ-రెడ్డయ్యల మధ్య విభేదాలు వచ్చి 1991లో  విడిపోయారు. ఇద్దరూ వేరు వేరుగా వ్యాపారాలు నిర్వహించారు. వారు విడిపోయిన సమయంలో శ్రీనివాసరావు, లక్ష్మణరావులకు వారు చెరో రూ.30వేలు ఇచ్చారు. ఆ తర్వాత శ్రీనివాసరావు, లక్ష్మణరావులు రెడ్డయ్య  కొత్తగా ప్రారంభించిన ‘సోలార్ సిస్టమ్’ అనే వ్యాపార సంస్థలో చేరారు. జీతంతోపాటు వారిద్దరికీ లాభాల్లో ఒక్కొక్కరికి  25 శాతం వాటా ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.  రెడ్డయ్య వద్ద ఒక ఏడాది బాగా వ్యాపారం  చేశారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం రెడ్డయ్య వాటా ఇవ్వకపోవడంతో వారిద్దరూ ఆయన వద్ద మానేశారు. వీరి విషయంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన  గజం గోవర్థన్, మంగళగిరికి చెందిన ఇంజమూరి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ లు మధ్యవర్తిత్వం చేసినా ఫలితంలేదు. 

శ్రీనివాసరావు- లక్ష్మణరావుల వ్యాపారం

1992 అక్టోబరు 25న రెడ్డయ్య సంస్థ నుంచి బయటకు వచ్చిన  శ్రీనివాసరావు, లక్ష్మణరావులు నవంబరు 5న  సొంతంగా ‘శ్రీబాలాజీ శారీస్’ అనే పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. గతంలో రామకృష్ణ-రెడ్డయ్యలు వీరిద్దరికీ ఇచ్చిన  రూ.60 వేల పెట్టుబడితో 100 చీరలతో వ్యాపారం ప్రారంభించారు. మంగళగిరిలో చీరలు నేయించే మాస్టర్ వీవర్స్, ఢిల్లీలో కొనుగోలు చేసే హోల్ సేల్ వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల వారు వీరికి పూర్తి సహకారం అందించారు. వాస్తవానికి చీరలు, ఇతర చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేవారికి, ఎగుమతిదారులకు వీరిద్దరు మాత్రమే తెలుసు. అసలు యజమానులు  రామకృష్ణ-రెడ్డయ్యలు తెలియదు. వారు ఎప్పుడూ వీరికి కనిపించలేదు. వ్యాపారం మొత్తం వీరిద్దరే చూసేవారు. అందువల్ల, వ్యాపారం వీరిదే అని వారు అనుకున్నారు.  ఈ ఇద్దరూ వంద చీరలతో మొదలుపెట్టిన వ్యాపారం ఆరు నెలల్లో నెలకు 500 చీరలకు పెరిగింది. హైదరాబాద్ దిల్‌షుక్ నగర్ లో వీరి కార్యాలయం ఉండేది.  వ్యాపారం మంచి ఊపందుకుంది. ఫ్యాబ్ ఇండియా, వెస్ట్ సైడ్... వంటి వ్యాపార సంస్థలకు వీరు డ్రెస్ మెటీరియల్, దుప్పటాస్ సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మంగళగిరిలో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడానికి శ్రీనివాసరావు ఎంతగానో దోహదపడ్డారు. 1992 నుంచి 2010 వరకు దాదాపు 18 సంవత్సరాలు వీరిద్దరూ కలిసి భారీ స్థాయిలో వ్యాపారం చేశారు. మంచి లాభాలు గడించారు. 

మంగళగిరి చీరలు ప్రముఖుల కొనుగోలు

శ్రీనివాసరావు హయాంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నాగపూర్, కోల్ కతా, హైదరాబాద్ లలో   ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ లో మంగళగిరి చీరలను జాతీయ స్థాయిలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇప్పటికీ వారు కొనుగోలు చేస్తున్నారు. ఒక చీర నచ్చి సోనియా గాంధీ కొనుగోలు చేస్తే, మిస్ యూనివర్స్ సమయంలో ఐశ్వర్యారాయ్ ముచ్చటపడి రెండు డ్రెస్సులు తీసుకున్నారు. శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో బాలీవుడ్ నటీమణులు వైజయంతీమాల, జయాబచ్చన్, షబనా అజ్మీ .. వంటివారితోపాటు తెలుగు నటీమణులు శ్రీదేవి, సౌందర్య, సుమలత... వంటివారు చీరలు కొనుగోలు చేశారు.  మంగళగిరి చీరలను రామోజీరావుకు చెందిన కళాoజలి షోరూంకు కూడా వీరు సప్లై చేశారు.   ఏపీ గవర్నర్ షిండే వంటి వారు కూడా శ్రీనివాసరావుని  అభినందించారు. 

విడిపోయిన శ్రీనివాసరావు- లక్ష్మణరావు

వ్యాపారం బాగా సాగే సమయంలో 2010లో విభేదాల కారణంగా శ్రీనివాసరావు, లక్ష్మణరావులు విడిపోయారు. అయితే, తనకు పోటీగా చేనేత వ్యాపారం పెట్టవద్దని లక్ష్మణరావు శ్రీనివాసరావుని కోరారు. చేనేత వ్యాపారం చేయనని  శ్రీనివాసరావు ఆయనకు మాట ఇచ్చారు.  ఇచ్చిన మాట ప్రకారం తనకు బాగా తెలిసిన చేనేత వస్త్ర వ్యాపారాన్ని శ్రీనివాసరావు కొనసాగించలేదు. నీతి, నిజాయితీలకు, మాటకు కట్టుబడి ఉండే శ్రీనివాసరావు ఆ తర్వాత నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఆ రంగంలో కూడా ‘మయూరి టెక్ పార్క్’ ద్వారా మంగళగిరికి మంచి గుర్తింపు తెచ్చారు.  

చేనేతపై తగ్గని మక్కువ

శ్రీనివాసరావు చేనేత వ్యాపారాన్ని వదిలినా, చేనేతపై మక్కువతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి చెందినవారితో  సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017లో చేనేతపై ఓ పాట రాయించి, ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణకు చెందిన ఎర్రమాద వెంకన్ననేత జాతీయ చేనేత దినోత్సవం కోసం చాలా కాలం పోరాడారు. చివరికి ఆయన పోరాటం ఫలించి, భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.  అలాగే, అంతర్జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం కోసం  వెంకన్న నేత, మరికొందరు మిత్రులతో కలిసి యింజమూరి శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించాలంటే, యునెస్కో (UNESCO - United Nations Educational, Scientific and Cultural Organization)లోని  194 సభ్య దేశాలలో మెజార్టీ సభ్యదేశాలు అంగీకరించవలసి ఉంది. ఇందుకోసం, అంతర్జాతీయంగా వివిధ దేశాలలో చేనేత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు తమ మిత్ర బృందంతో కలిసి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా దేశాలలో ప్రదర్శనలు నిర్వహించారు. చేనేతపై మక్కువతోనే ఆయన ఇప్పటికీ  క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో, వరల్డ్ వీవర్స్ ఫోరమ్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు. 

నిర్మాణ రంగంలో కూడా రాణించిన శ్రీనివాసరావు 

శ్రీనివాసరావు ఏ రంగంలో అడుగుపెట్టినా, ఆ రంగంలో మెళకువలు తెలుసుకుని దూసుకుపోతారు. వస్త్ర వ్యాపారం చేసే రోజులలో వచ్చిన లాభాలతో ప్రతి ఏడాది మంగళగిరి, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు. ఆ భూముల ధరలు ఏడాదికేడాది పెరుగుతూ వచ్చాయి. నిర్మాణ రంగంలో దిగడానికి ఆ భూములు బాగా ఉపయోగపడ్డాయి. అప్పట్లో కొన్న భూములు ఇప్పటికీ కొన్ని అలానే ఉన్నాయి. నిర్మాణ రంగంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అవే అడ్డుపడుతున్నాయి.  అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తన మేనమామ తోడల్లుడు శీలం ఏడుకొండలు భాగస్వామ్యంతో  2010లో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వారి భాగస్వామ్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వారి పిల్లలు కూడా ఆ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు.  తొలుత బెంగళూరులో నిర్మాణాలు మొదలుపెట్టారు. 24 ఫ్లాట్ల ప్రాజెక్ట్ తో ప్రారంభమైన వారి వ్యాపారం, 66 ఫ్లాట్లు, 92 ఫ్లాట్ల అపార్ట్ మెంట్లు, కమర్షియల్ నిర్మాణాలు చేపట్టి, విజయవంతంగా కొనసాగించారు. 2015 వరకు అయిదు ప్రాజెక్టులు పూర్తి చేశారు. రాష్ట్ర విభజనతో శ్రీనివాసరావు కన్ను  మళ్లీ సొంత ఊరు మంగళగిరిపై పడింది. అప్పట్లో ఆయన చేనేత వ్యాపారం కూడా ఇక్కడే ప్రారంభించి విజయం  సాధించారు. ఇప్పుడు మంగళగిరి రాజధాని అమరావతిలో భాగమైంది. టెక్నాలజీ పార్క్ ఆలోచనతో ఉన్న ఏపీ ప్రభుత్వంతో 2017లో రెంటల్ గ్యారంటీ ప్రోత్సాహక ఒప్పందం చేసుకున్నారు. మంగళగిరిలోని జాతీయ రహదారి పక్కన రెండెకరాల స్థలంలో ఎనిమిది అంతస్తుల ‘మయూరి టెక్ పార్క్’ నిర్మాణం చేపట్టారు. అయితే, 2019లో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఉన్నవారందరికీ కష్టాలు మొదలైనట్లే, వీరికి కూడా కష్టాలు మొదలయ్యాయి. రెంటల్ గ్యారంటీ ప్రోత్సాహక ఒప్పందం రద్దయింది. బెదిరింపులు మొదలయ్యాయి. పెట్టుబడి మొత్తం అలా నిలిచిపోయింది. అయినా, భాగస్వాములు ఇద్దరూ ధైర్యంగా నిలబడ్డారు. ఇబ్బందులను ఎదుర్కొంటూ, అలాగే నిర్మాణాన్ని మందకొడిగా కొనసాగించారు. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో వీరి దశ తిరిగింది. మయూరి టెక్ పార్క్ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ 350 కార్లు పార్కు చేసుకోవచ్చు.   స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(RTIH) కోసం మయూరి టెక్ పార్క్ లో ఒక ఫ్లోర్ రెంట్ కు తీసుకున్నారు. దాంతో, ఈ పార్క్ రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించింది. 2025 ఆగస్టు 25న ఈ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది.   టాటా సన్స్ చైర్మన్ ఎన్.

చంద్రశేఖరన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ హబ్‌ను ప్రారంభించారు. శ్రీనివాసరావు కష్టం ఫలించింది. ఆ పక్కనే ఉన్న మరో రెండెకరాల స్థలంలో రెండవ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు కుమారుడు హేమంత్, భాగస్వామి ఏడుకొండలు కుమారులు సాయి శ్రీనివాస్, రాంబాబులు రంగంలోకి దిగారు. వారు నిర్మాణాలను చూస్తుంటే, పెద్దలు ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. 

శ్రీనివాసరావు బాల్యం

చేనేత వస్త్రాల అమ్మకం, నిర్మాణ రంగంలో మంగళగిరిని ఒక స్థాయిలో నిలిపిన శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యింజమూరి భాస్కరరావు, పిచ్చమ్మ దంపతులకు 1966 ఆగస్టు 10న అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జన్మించారు. శ్రీనివాసరావుకు అన్న ఫణి కుమార్, తమ్ముడు వెంకటేశ్వరరావు ఉన్నారు.  ఉద్యోగరీత్యా  తండ్రి  ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ అయినందున ఆయన విద్యాభ్యాసం పలు చోట్ల జరిగింది. అక్షరాభ్యాసం నాగార్జున సాగర్ లో జరిగితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా  కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ లో 2వ తరగతి వరకు చదివారు. ఖమ్మంలో 4వ తరగతి వరకు, నర్సరావుపేటలో 6వ తరగతి, మచిలీపట్నంలో 7వ తరగతి చదివారు. 8వ తరగతి నుంచి  డిగ్రీ బీకాం వరకు అప్పటి కృష్ణా జిల్లా, ఇప్పటి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చదివారు. 1987లో వాళ్ల నాన్న రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి, అక్కడ స్టెనో జాబ్ ఇప్పించారు. ఆ జాబ్ ఒక్క రోజు మాత్రమే చేసి, నచ్చక రాజీనామా చేశారు. దాంతో, వాళ్ల నాన్న ఆగ్రహానికి గురైతే, వాళ్ల అమ్మే అడ్డుకుని ఆదుకున్నారు. 

శ్రీనివాసరావు - సీతామహాలక్ష్మిల వివాహం

గుంటూరుకు చెందిన శీరపు సూర్యనారాయణ, సర్వలక్ష్మిల కుమార్తె సీతామహాలక్ష్మిని 1993 ఏప్రిల్ 24న శ్రీనివాసరావు వివాహం చేసుకున్నారు. అన్యోన్య దంపతులుగా వారు జీవితం కొనసాగిస్తున్నారు. తన భార్య  తనకు అన్ని విధాల ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు చెబుతారు.  సీతాదేవి వంటి భార్య దొరకడం తన అదృష్టంగా ఆయన భావిస్తారు. ఆయన ఎదుగుదలలో, వారి కుటుంబ వ్యవస్థ బలీయంగా ఉండటంలో ఆమె పాత్ర కీలకం. శ్రీనివాసరావుకు కుమారుడు హేమంత్, కుమార్తె హారిక ఉన్నారు. హేమంత్ బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి, అమెరికాలోని మియామి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ నిర్మాణరంగంలో స్థిరపడ్డారు.  హారిక డిగ్రీ పూర్తి చేశారు. కుమార్తెను హిందూపురంలోని వస్త్ర వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 

సేవా కార్యక్రమాలు

యింజమూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ సిబ్బంది పిల్లలకు, పేద పిల్లలకు చదువులకు సహాయం చేస్తుంటారు. తిరుపతి, శ్రీశైలం అన్నదాన సత్రాలలో ఒక్కో రూమ్ కట్టించారు. అమరావతి దేవాలయంలో వారి తల్లిదండ్రుల పేర్లపై ఒక రూమ్ నిర్మించారు. అలాగే, హైదరాబాద్ లోని పద్మశాలి వృద్ధాశ్రమంలో ఒక రూమ్ కట్టించారు. మంగళగిరిలోని మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుంటారు. శ్రీనివాసరావు తన అన్నదమ్ములు, ఇతర బంధువుల ఆడపిల్లలు 11 మందిని తమ వద్దనే ఉంచుకుని చదివించారు. వారు అన్ని విధాల ఎదగడానికి, వారి వివాహాల విషయంలో సహాయసహకారాలు అందించారు. ఈ విషయంలో ఆయన భార్య సీతామహాలక్ష్మి గొప్పతనాన్ని అభినందించాలి.  శ్రీనివాసరావు వద్ద పనిచేసిన ఉద్యోగులు, వాచ్ మెన్, తోట కాపలాదారుల పిల్లలు అందరినీ ఉన్నత చదువులు చదివించారు. వారిలో సీఏ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తన వద్ద అకౌంటెంట్ గా పని చేసిన ఉద్యోగికి ఒక ఫ్లాట్ కూడా ఉచితంగా రాసి ఇచ్చారు. ఆయన ఉదార స్వభావానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

మా నాన్నంటే నాకు చాలా ఇష్టం

రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో తహశీల్దార్ వద్ద తన తండ్రి డ్రైవర్ గా ఉద్యోగం చేసినప్పటికీ ఒక్క పైసా కూడా ఏనాడూ లంచం తీసుకోలేదు. నిజాయితీగా ఉండేవారు. అందుకే, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అని శ్రీనివాసరావు చెప్పారు.  ఆయన జీవిత కాలంలో ఒక్క రూపాయి దాచిపెట్టలేదు. ఒక్క ఇంటి స్థలం కొనలేదు. సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు. అంత నిజాయితీగా ఉద్యోగం చేసి, మా ముగ్గురు అన్నదమ్ములను పెంచి, పెద్ద చేశారు. 

నాన్న తోడబుట్టినవారిని విమానం ఎక్కించి, శ్రీవారి దర్శనం

శ్రీనివాసరావు తన తండ్రి భాస్కరరావు తోడబుట్టిన శివసత్యనారాయణ, బాపనయ్య, మాధవరావు, గోపాలకృష్ణ అయిదుగురు అన్నదమ్ములను తొలిసారిగా విమానం ఎక్కించి హైదరాబాద్ నుంచి తిరుపతి తీసుకువెళ్లారు. శ్రీవారి ఆలయంలో ఉదయం అన్ని సేవలు అయ్యేంతవరకు శ్రీవెంకటేశ్వరుడికి పది అడుగుల దూరంలో కూర్చొని దాదాపు గంటసేపు తనివితీరా చూసి తరించారు. అద్వితీయమైన ఆనందం పొందారు. ‘‘అది  ఓ మిరాకిల్’’ అని శ్రీనివాసరావు బాబాయి మాధవరావు అన్నారు. ఆ అయిదుగురులో ఈయన ఒక్కరే జీవించి ఉన్నారు.

-----------------------------------------------------------------------------------------

మూస విధానం నుంచి ఆధునిక హంగులు

మంగళగిరి చీరలు 1986 వరకు ఒక మూస విధానంలో తయారు అవుతూ పట్టుబడి చీరలుగా ప్రసిద్ధి చెందాయి. అవి కొన్నిప్రాంతాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ సమయంలో   వీవర్స్ సర్వీసు సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జంజనం రెడ్డయ్య, పద్మశాలి ప్రముఖులు తమ్మిశెట్టి రామకృష్ణ కలిసి వ్యాపార సంస్థను స్థాపించి,  మొట్టమొదటి సారిగా ఒకప్పటి నిజాం కాలంనాటి ‘నిజాంబోర్డర్’  చీరలు  తయారు చేసి వాటిని  మార్కెట్ కి పరిచయం చేశారు.  ఆ మహానుభావుల దగ్గర పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మొట్టమొదటి చేనేత ప్రదర్శన క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగింది.  అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దానిని ఆరంభించి, మా చీరలు, దుప్పట్టాలు భాగ్యనగర ప్రజలకు పరిచయం చేశారు. క్రాఫ్ట్ కౌన్సిల్ మొట్టమొదటి చైర్ పర్సన్ కమలమ్మ,  ఆ తరువాత ఢిల్లీ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్  చైర్ పర్సన్ మాళవిక ఖన్నా మా చీరలు మెచ్చి వారి స్టోర్స్ కోసం కొనుగోలు చేశారు.  మా నిజాం బోర్డర్ చీరలు ప్రపంచానికి పరిచయం చేశారు.  డ్రెస్ మెటీరియల్ ఆవిర్భావానికి ఆద్యులు విజయలక్ష్మీ ప్రభాకర్. ఆమె  ప్రోద్భలంతోనే మొట్టమొదటిసారిగా బ్లౌజ్ మెటీరియల్ తయారుచేసి మార్కెట్ కి పరిచయం చేశాం. లేపాక్షి ఎండీ గాయత్రీ రామచంద్రన్, జగదా రాజప్ప,  క్రాఫ్ట్ కౌన్సిల్ సభ్యులు లలితా ప్రసాద్, ఉషమ్మ, మీనాక్షి, నివేదిత, కృష్ణారావు, సునీలాగజపతి, అంజు, పోద్దార్, అంజనా సోమాని, ఆషారెడ్డి, ప్రముఖ డిజైనర్లు  రాకేశ్, ఠాకూర్, మాపు(మార్తాండ్, సింగ్ )  తదితరులు సహకారం అందించారు. వారిని ఎన్నటికీ మరువలేము.   వాస్తవంగా మంగళగిరి ఎదిగిన విధానం ఇలా ఉంటే, కొంతమంది స్వార్ధపరులు గతం మరిచి తామే నిజాంబోర్డర్ ని పుట్టించినట్లు ఈ సమాజానికి తప్పుడు మెసేజ్ ఇవ్వడం బాధాకరం.  నిజాం బోర్డర్ ని తయారు చేసి మంగళగిరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన మా గురువులకు శతకోటి వందనాలు. మంగళగిరి చీరల ఆవిర్భావం గురించి చరిత్ర మొత్తం తెలిసిన వ్యక్తులు పద్మశ్రీ గజం గోవర్ధన్, పద్మశ్రీ  గజం అంజయ్య, ఉప్పాడ సత్యనారాయణ, గద్వాల్ సత్యనారాయణ,  మంగళగిరి చీరలు మార్కెట్ కి పరిచయం చేసి ఊరు ఉన్నతికి కారకులైన మా గురువులు జంజనం రెడ్డయ్య, తమ్మిశెట్టి రామకృష్ణలకు  హృదయపూర్వక వందనాలు.

మీ
యింజమూరి శ్రీనివాసరావు


మంగళగిరి గర్వించతగ్గ స్థాయికి ఎదిగిన యింజమూరి శ్రీనివాసరావు


బీసీ వర్గం చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టిన యింజమూరి శ్రీనివాసరావు అటు మంగళగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు ఇటు ఆధునిక అమరావతిలో నిర్మాణ రంగంలో కూడా మంగళగిరి గర్వించతగ్గ స్థాయికి ఎదిగారు. ఆనాడు యుక్త వయసులో చేనేత రంగానికి, నేడు నిర్మాణ రంగంలో మయూరి టెక్ పార్క్ ద్వారా మంగళగిరికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు.  ఈ మయూరి టెక్ పార్క్ భవనంలోని రెండు ఫ్లోర్లు( 4, 6) 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' (RTIH) ను ఏర్పాటు చేశారు. మరో ఫ్లోర్ లో మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండవ ఫ్లోర్ లో మైనింగ్ శాఖ కార్యాలయం, 5వ ఫ్లోర్ లో ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్, 7వ ఫ్లోర్ లో గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగాల వారి కార్యాలయాలు ఉన్నాయి. యింజమూరి శ్రీనివాసరావు  సాధారణ కుటుంబంలో జన్మించి, ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.

 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914




అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య

  జూలై 26 ఆ మహానేత 110వ జయంతి రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు  ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్...