Apr 15, 2026

గుత్తికొండ ధనుంజయకు దక్కిన పార్టీ అధిష్ఠానం పదవి

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన చంద్రబాబు 



గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పద్మశాలీ ప్రముఖులు, చేనేత కార్మిక నేత, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్  గుత్తికొండ ధనుంజయ రావును ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు.  టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ధనుంజయకు దక్కిన గౌరవంగా చేనేత వర్గం వారు భావిస్తున్నారు.  పార్టీ అధిష్ఠానవర్గం 26 మందిలో ధనుంజయకు స్థానం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి తను చేసిన సేవలను గుర్తించి తనని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, మంగళగిరి శాసనసభ్యులు, మంత్రి నారా లోకేష్ కు ధనుంజయ కృతజ్ఞతలు తెలిపారు. 

చేనేత రంగంలో కార్మికవర్గ నేతగా గుత్తికొండ ధనుంజయ రావు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధనుంజయ టీడీపీని వదలలేదు. అదే ఆయన ప్రత్యేక. ఎన్టీఆర్ పై అపార అభిమానం అతనిని పార్టీ వైపు మళ్లించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంటే  ఆపార గౌరవం. ఆయన విధానాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు ధనుంజయ ఆకర్షితులయ్యారు. చంద్రబాబు పరిపాలనాదక్షతకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తూ , బీసీలలో, చేనేత వర్గాల్లో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందుతున్నారు.  పదవుల కోసం ప్రాకులాడే మనిషి కాదు. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నా,  ప్రతిపక్షంలో ఉన్నా చేనేత సమస్యలపై పోరాడటం ఆయన నైజం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పథకాలు రావడానికి కృషి చేశారు. 


14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు అయినప్పటికీ సభ్యత్వం రెండు రూపాయలు కట్టి తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్రకి,  2014లో గంజి చిరంజీవికి,  2019లొ నారా లోకేష్ కి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. 2024 లో నారా లోకేష్ గెలుపు కోసం అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమిస్తున్నారు.  2006లో అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా,  రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు.  2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీవైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. 

2006లో మాదాల రాజేంద్ర  మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత ఆరోగ్య బీమా కార్డులు చేనేత కార్మికులకు ఇప్పించటంలో ధనుంజయ కృషి ఎంతో ఉంది.  బీమా కోసం కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని ఆనాడు రాజేంద్ర  చెల్లించారు.  దాదాపు 3,000 మంది చేనేత కుటుంబాలకు కార్డులు వరుసగా మూడు సంవత్సరాలు అందజేసి, వారికి అండగా నిలిచారు.  ఆ విధంగా  తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం తరఫున గుత్తికొండ ధనంజయరావు విశేష కృషి చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేకూర్చింది. ఇప్పటికీ చేనేత కుటుంబాల్లో మళ్లీ ఆరోగ్య భీమా కార్డులు కావాలని అడుగుతూ ఉంటారు.


అంతేకాకుండా, ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పద్మశాలి సంఘాల్లో పనిచేస్తూ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు.  చేనేత ఉద్యమాల్లో ముఖ్యంగా మంగళగిరి చేనేత కార్మికుల వేతనాలు పెంచే విషయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో కలిసి పోరాటం చేయటంలో ముందుంటారు.  2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన నిమ్మల కృష్ణప్ప నేతృత్వం లోని  రాష్ట్ర చేనేత విభాగం కమిటీలు ముఖ్య పాత్ర పోషించాయి.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి చేనేత సమస్యలపై చంద్రబాబుకు ఒక నివేది అందించారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలు అక్కడున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు, నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలో కూడా గుత్తికొండ ధనుంజయరావు ఉన్నారు.  రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ నివేదిక ఆధారంగానే 2014లో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వాటిలో కొన్ని సంక్షేమ పథకాలను, రాయితీలను చేనేత కార్మికులకు  అందించింది.


 చేనేత కులాల్లో, ముఖ్యంగా పద్మశాలీ కులంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తిరుపతి తిరుచానూరు అఖిలభారత పద్మశాలి అన్న సత్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా, మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా,  మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.


పార్టీ, చేనేత రంగంలోనే కాకుండా కళారంగంతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ నేతగానే కాకుండా  సామాజిక కార్యకర్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. మంగళగిరిలో టీడీపీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ధనుంజయే.  ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో సాహితీ కళా రంగాలకు ప్రాధాన్యత కొరబడింది. కళాభిమానులు, సాహితీ అభిమానులు, పెద్దలు మళ్లీ కళాసాహితీ రంగాలకు ప్రాణం పోయాలని తీర్మానం చేసి, గుత్తికొండ ధనుంజయరావుని  మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా ఎన్నుకున్నారు. అయిదేళ్ల క్రితం మంగళగిరి సాహితీ కళా వేదిక ఆవిర్భవించింది. దానికి కన్వీనర్ గా గుత్తికొండ ధనంజయరావు  కొనసాగుతున్నారు. ఈ కాలంలో సాహితీ కళా రంగాల వైభవాన్ని తీసుకురావటంలో ముందున్నారు.


1987 నుంచి 1991 వరకు మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన "అనియత విద్య" ద్వారా ధనుంజయరావు ఎంతోమంది పిల్లలకు విద్యను అందించారు. తరువాత శ్రామిక నగర్ లో ఒక అరుణోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందలాది మంది పిల్లలకు విద్యాబోధన చేశారు. 2000 సంవత్సరంలో స్థాపించిన అభయ సేవా సమితి ఉపాధ్యక్షులుగా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుకు కృషి చేశారు.  


గుత్తికొండ సీతారామయ్య, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ధనుంజయ రావు 1968 జూన్ 1వ తేదీన జన్మించారు. ధనుంజయ తోబుట్టువులు మొత్తం ఏడుగురు. ఆయన  ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు మంగళగిరి మూర్తి స్కూల్ లో చదివారు. ఆ తర్వాత చింతక్రిది కనకయ్య హైస్కూల్ లో 6వ తరగతి చదివారు.  వివిధ కారణాల వల్ల చదువు మానివేశారు. ఆ తర్వాత 1989లో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ మెట్రిక్ పరీక్ష రాసి పాసయ్యారు.  1990 మే 5న గుంటూరుకు చెందిన  కాకుమాను పాపయ్య, తేరోజమ్మల కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. వారికి  ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకీ వివాహలయ్యాయి.  పెద్ద కుమార్తె జయశ్రీ- పెద్దల్లుడు అలుగూరి శివ నాగరాజు, రెండవ కుమార్తె మౌనిక, -రెండవ అల్లుడు మునగపాటి భార్గవ్ సాయి, మూడో కుమార్తె సాయి లక్ష్మి – మూడోవ అల్లుడు అవ్వారు నవీన్. ప్రస్తుతం వివిధ హోదాలలో  గుత్తికొండ ధనుంజయరావు అటు పార్టీకి, ఇటు చేనేత,  కుల,  కళా, సాహితీ రంగాలలో  తనదైన ప్రతిభతో ప్రజా సేవ కొనసాగిస్తున్నారు.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Apr 2, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం


రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్‌మెంట్) బిల్-2026ని రాజ్యసభ గురువారం  ఆమోదించింది.  
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇది చారిత్రాత్మక దినం అని ఎన్డీఏ నేతలు అభివర్ణించారు. ఈ బిల్లుకు లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది.  రాజ్యసభ ఆమోదించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు.  పార్లమెంటులోని ఉభయసభలు ఆమోదించడంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి ఖరారైంది.  రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ విడుదలవడంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన మొత్తం 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. మిగిలిన 10 పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి.



అమరావతి... కీలక ఘట్టాలు




2014 జూన్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారింది.

2014 సెప్టెంబరు 1: గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేశారు.

2014 సెప్టెంబరు 3: గ్రీన్‌ ఫీల్డ్‌ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది.

2014 డిసెంబరు 8: రాజధానిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి సింగపూర్‌ సంస్థలతో ఒప్పందం.

2014 డిసెంబరు 30: సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

2015 జనవరి: రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభమైంది.

2015 మార్చి: 29 గ్రామాల్లో సుమారు 33 వేల ఎకరాల సమీకరణకు రైతుల అంగీకారం లభించింది.

2015 ఏప్రిల్‌ 23: రాజధాని నగరానికి అధికారికంగా అమరావతి పేరు పెట్టారు.

2015 జూలై 20: రాజధాని మాస్టర్‌ ప్లాన్లను సింగపూర్‌ బృందం ప్రభుత్వానికి అందజేసింది.

2015 అక్టోబరు 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చారు.

2016 ఫిబ్రవరి: మాస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ నోటిఫై చేశారు.

2016 జూన్‌: ఏపీ సచివాలయం, ప్రభుత్వ విభాగాలు అమరావతి ప్రాంతం నుంచి పనిచేయడం ప్రారంభం.

2018 డిసెంబరు: సచివాలయ టవర్స్‌కు శంకుస్థాపన.

2019 ఫిబ్రవరి: హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

2019 మే: వైసీపీ ప్రభుత్వంలో అమరావతిపై కుట్రలు ప్రారంభం.

2019 డిసెంబరు 17: వైసీపీ మూడు రాజధానుల ప్రకటన

2020 జూలై 31: సీఆర్‌డీఏ చట్టం రద్దు చేశారు. మూడు రాజధానుల బిల్లు పెట్టారు. శాసనమండలిలో టీడీపీ వ్యతిరేకించింది. అప్పటి మండలి చైర్మన్‌ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు.

2021 డిసెంబరు 13: న్యాయ వివాదాలతో మూడు రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం పునరుద్ధరణ.

2022 మార్చి 5: అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు.

2024 జూన్‌ 2: పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. హైదరాబాద్‌ తెలంగాణకు పరిమితమైంది.

2025 మే 2: ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభించారు.

2026 మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

2026 ఏప్రిల్‌ 1: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌విభజన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

2026 ఏప్రిల్‌ 2: సదరు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Apr 1, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం


అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఈరోజు(01.04.2026) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్: లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో మాట్లాడారు. అమరావతి రైతులకు, మహిళలకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. 

ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి:  అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతి కోసం రాజధాని రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారు.

ఎంపీ అప్పలనాయుడు:   రైతుల త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.  తండ్రికి బిడ్డతో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో, రైతుకు భూమితో కూడా అలాంటి బంధం ఉంటుంది.  సుమారు 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతుల త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.

వైసీపీ సభ్యులు వాక్‌అవుట్: అమరావతి అంశంపై లోక్ సభలో చర్చ జరుగే సమయంలో వైసీపీ సభ్యులు వాక్‌అవుట్ చేశారు. 

Mar 28, 2026

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్


మనసా వాచా కర్మణా మద్దతు 

గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది

భూములు ఇచ్చిన రైతులను హింసించింది

రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం 

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు 

మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది 

సరైన ప్రణాళిక లేకుండా విభజించారు 

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు 

అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది 

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ 


‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి. 

తెలుగు నేల అనే భావనే ఉండేది 

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.

భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు

2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది?  ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు

చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.

మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి..

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.

విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.

ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను”  అన్నారు.

అమరావతి అజేయం… అజరామరం


ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఆత్మ

ఎవరూ టచ్ చేయలేరు... ఇంచ్ కూడా కదల్చలేరు

దేశం గర్వించేలా భవిష్యత్‌ నగరంగా రాజధాని నిర్మాణం

రాష్ట్ర కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం

రాజధానిపై రోజుకో మాటతో జగన్‌ది ఊసరవెల్లి రాజకీయం

అమరావతికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసన సభ

అమరావతి, మార్చి 28 :-*  అమరావతే ఆంధ్రప్రదేశ్ ఆత్మ  అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి అజేయం.. అద్భుతం.. అజరామరం అని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట భద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ తీర్మానానికి మద్దతు పలికిన శాసన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియచేశారు. రాజధానిని ఎవరూ టచ్ చేయలేరని, ఇంచ్ కూడా కదిలించలేరని అన్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని అని, అది అమరావతి మాత్రమేని పునరుద్ఘాటించారు. 

*అవే కుట్రలు..కుతంత్రాలు*

రాజధానిపై వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని, గతంలో చేసిన కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ...‘రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటారు. వీళ్లకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీళ్లు అనుసరిస్తారు. దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశాం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నాడు. వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చు. కానీ రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించాను. ఈ ప్రాంతాంలోని రైతులను సంప్రదించడంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. రాష్ట్రం కోసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వ్యక్తులు తోటలకు నిప్పు పెట్టారు. రుణాలను అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు ఈ మెయిళ్లు పంపించారు.  కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుంది. అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని కూడా భరోసా ఇచ్చారు. రైతులు ఇచ్చింది కేవలం భూములు మాత్రమే కాదు రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు. సెల్ఫ్ సస్టైయినబుల్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితం అవుతుందని చెప్పాం.. అదే జరిగి తీరుతుంది’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 


*బ్లూ, గ్రీన్ నగరంగా నిర్మితం*

‘రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని వచ్చిన సమయంలో ఓమారు, ఆ తర్వాత మరోమారు, రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్, అమరావతి రెండు నగరాలు అభివృద్ధికి చిరునామాలుగా మారాలి. భవిష్యత్ నగరంగా అమరావతి బ్లూ, గ్రీన్ సిటీగా నిర్మితం అవుతుంది. దేశం గర్వించేలా అమరావతిని నిర్మించి తీరుతాం. రాజధాని ఒకటే..కానీ  అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాం. మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లు విస్తృతంగా అభివృద్ధి అవుతాయి’ అని సీఎం అన్నారు. 

*రాజధానులు కోల్పోతూ వచ్చాం*

‘కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహన రాజులు పరిపాలించారు. బ్రిటిష్ మ్యూజియంలోనూ అమరావతి గ్యాలరీ ఆనాటి చరిత్రను స్పష్టంగా చెప్తోంది.  అంతటి ప్రాచీన, ఘన చరిత్ర మన తెలుగు జాతిది. సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేల ఇది. బ్రిటిష్ వారు వచ్చాక పరిస్థితులు మారాయి. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాభవం కోల్పోయాం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులుగా మనకు వచ్చింది. పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించింది. మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు రాజధాని మారింది. ఇప్పుడు అమరావతికి మార్చుకున్నాం. రాజధానులు కోల్పోవటంతో పాటు విమర్శలు, వివక్ష, అవమానాలు భరిస్తూనే వచ్చాం. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయి. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళం నెలకొంది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును స్మతీ దినంగా జరుపుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 


*మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతి*

‘1991లో వచ్చిన ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. ఐటీ రివల్యూషన్‌ను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌గా అందిపుచ్చుకున్నాం. అప్పుడు చేసిన విజన్ కారణంగా రూ.1.05 లక్షల కోట్లు రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోంది. సైబరాబాద్‌ను ఇటుకా ఇటుకా పేర్చి నిర్మాణం చేశాం. ఫలితాలు వచ్చాయి. అందుకే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పుడు అమరావతిని కూడా మోస్ట్ లివబుల్ సిటీగా నిర్మాణం చేస్తున్నాం.  2014 విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరాను. ఇప్పుటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో కెమెరాలు నుంచి తప్పించుకు తిరిగాడు. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ ఏపీకి సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చాం. 9 నెలల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నాం. సింగపూర్ సహకారంతో ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు ఇవ్వాలని కోరాం. ముందు దేశం బాగుండాలి, అలా ఉండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే నా సంకల్పం’ అని సీఎం చంద్రబుబ స్పష్టం చేశారు

*ఐదేళ్లు కీచకపర్వం సాగించారు*

‘రాజధాని వల్ల ఏం జరుగుతుందనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఏడాదికి 1.05 లక్ష కోట్ల మేర వస్తున్న ఆదాయం చూడాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 2019లో ఒక్కఛాన్స్‌తో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలు పెట్టారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు నెట్టారు. రైతులపై ఉక్కు పాదం మోపారు. కేసులు పెట్టి, బూట్లతో తన్నారు, లాఠీలతో కొట్టారు. అడ్డగోలుగా కేసులు పెట్టి కీచకపర్వం సాగించారు. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీతో బిల్లు పాస్ చేయాలని చూశారు. అయినా హైకోర్టు న్యాయస్థానం కాపాడింది. ఈ తరహా పాలన తుగ్లక్ నిర్ణయం అని, పెట్టుబడులు రావని మీడియా పెద్ద ఎత్తున రాసింది. గత పాలనలో నేను, పవన్ కల్యాణ్ సహా అంతా బాధితులమే. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు తక్షణ సాయం అందించింది. అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. 2028కి పనులు అన్నీ పూర్తి చేసి అమరావతికి ఒక రూపు తీసుకువస్తాం. 2027 నాటికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు పూర్తి అవుతాయి. రూ.56 వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని సీఎం వివరించారు. 

*ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం*

అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. శాసన సభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు పంపించారు. అలాగే కేంద్ర హోంమంత్రికి ఆమోదం పొందిన తీర్మానం ప్రతిని స్పీకర్ పంపారు. తీర్మానం కాపీలను అటు కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్‌కు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపించారు. 

గుత్తికొండ ధనుంజయకు దక్కిన పార్టీ అధిష్ఠానం పదవి

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన చంద్రబాబు  గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పద్మశాలీ ప్రముఖులు, చేనేత కార్మిక నేత, మంగళగిరి సాహితీ ...