దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్- 95) కింద ఇచ్చే కనీస పెన్షన్ రూ.1000లు మాత్రమే ఇస్తున్నారు. కనీస పెన్షన్ రూ. 7,500కు పెంచాలన్నది పెన్షన్ దారుల డిమాండ్. ఇందు కోసం మార్చి 9, 10, 11 తేదీలలో మూడు రోజులపాటు దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా, ‘చలో ఢిల్లీ’ నినాదంతో భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఫలితాలు ఏమీ కనిపించలేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలవారీ పెన్షన్ పెంచడంతోపాటు అదనంగా కరువు భత్యం, పెన్షనర్లు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టులు, సామాజిక సర్వేల ప్రకారం పెన్షన్ మొత్తం సరిపోకపోవడం, ఉచిత ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 200 నుండి 250 మంది పెన్షనర్లు అకాల మరణానికి గురవుతున్నారు. 30 ఏళ్లు పనిచేసిన వారి నెలవారీ సగటు పెన్షన్ రూ.1,171 మాత్రమే ఉన్నట్లు ఈపీఎస్-95 జాతీయ పోరాట కమిటీ తెలిపింది. పలు రాజకీయ పార్టీల ఎంపీలు కూడా వీరి పోరాటానికి మద్దతు ప్రకటించారు. కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదని, ఇది లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి, జీవించే హక్కుకు సంబంధించిన అంశంగా వారు పేర్కొన్నారు.ప్రైవేటు సంస్థలలో పదేళ్లకు పైగా పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రమే ఈ పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ పథకం పరిధిలోకి ప్రైవేటు సంస్థలలో పనిచేసి రిటైర్ అయిన ఉపాధ్యాయులు, జర్నలిస్టులతోపాటు పెద్ద పెద్ద మిల్లులు, ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో పనిచేసిన ఇతర ఉద్యోగులు, కార్మికులు.... వంటివారందరూ వస్తారు. కనీసం పది సంవత్సరాలు సర్వీసు ఉండి, 58 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది. అది కూడా వారు పనిచేసినంత కాలం 30-35 ఏళ్లు పెన్షన్ నిధికి చెల్లించిన సొమ్ము నుంచి మాత్రమే ఈ పెన్షన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12 శాతం యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33 శాతం ఈపీఎస్కు జమ అవుతుంది. మిగిలిన 3.67 శాతం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)లో జమ అవుతుంది. దీని ఆధారంగా, ప్రస్తుతం రూ.1,000 కనీస పెన్షన్గా చెల్లిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వాటా 1.16 శాతం మాత్రమే ఉంటుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్- 95) కింద పార్లమెంట్ చట్టం ప్రకారం 2014 నుంచి కనీస పెన్షన్ నెలకు రూ.1000 అందజేస్తున్నారు. అంటే, 11 ఏళ్ల క్రితం నిర్ణయించిన ప్రకారమే ఇస్తున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు ఎంతగా పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో నెలకు రూ. 1,000తో జీవించడం అసాధ్యం. వీరిలో ఎక్కువ మంది పరిమిత ఆర్థిక వనరులు కలిగిన పేదలే ఉన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షనర్ల ఆర్థిక భద్రత కోసం కనీస పెన్షన్ పెంచవలసిన అవసరం ఉంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారి దీనస్థితిని కేంద్ర ప్రభుత్వం అర్థంచేసుకోవలసి ఉంది. పెన్షన్పై మాత్రమే ఆధారపడే పెన్షనర్లకు, ప్రతిపాదిత పెంపు ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పదవీ విరమణ తర్వాత వారు మరింత సౌకర్యవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి సహాయపడుతుంది.
దేశంలోని వివిధ ప్రభుత్వాలు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ ఇంతకు మూడు రెట్లు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు రూ.4000, తెలంగాణ ప్రభుత్వం రూ.2,016 సామాజిక పెన్షన్ కింద అందజేస్తున్నాయి. అందులో వారి వాటా ఏమీ ఉండదు. కేవలం వయసు ఆధారంగా పేదలకు ఇస్తారు. ఈపీఎస్ పెన్షన్లో మాత్రం ఉద్యోగులు, యాజమాన్యం చెల్లించిన వాటాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సామాజిక పెన్షన్ స్థాయిలో కూడా తమ పెన్షన్ లేదని, రూ.1000 పెన్షన్ మందులకు కూడా సరిపోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం అక్టోబరులో బెంగళూరులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో కనీస పెన్షన్ రూ.1,000 నుండి రూ.7,500 కు పెంచాలని ప్రతిపాదించారు. అయితే, ఆ ప్రతిపాదనను ఆమోదించలేదు. అంత కాకపోయినా, కనీస పెన్షన్ రూ.3000లకు పెంచుతారని భావించారు. అదీలేదు. ఆ సమావేశం పెంచే ఆలోచనే చేయలేదు. ఎంతో కాలంగా పెన్షన్ పెంచుతారని ఎదురు చూస్తోన్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది. ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి నాటికి 82,11,182 మంది ఈపీఎస్ పెన్షన్ దారులు ఉన్నారు. వారిలో 36.6 లక్షల మందికి రూ.1000లు మాత్రమే కనీస పెన్షన్ అందుతోంది.
అయితే, ఒకేసారి 7.5 రెట్లు కనీస పెన్షన్ పెంచడం సాధ్యమయ్యేపనికాదు. ఈపీఎస్ నిధి అనేది ఉద్యోగులు, యజమానుల వాటాతో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తంలో పెన్షన్ చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై లక్షల కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న నిధుల లోటు కారణంగా ఈ పెంపు కష్టతరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతమంది పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంచాలంటే, ప్రభుత్వం అదనపు నిధులను కేటాయించాలి. ఈ ప్రతిపాదన వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పెన్షన్ వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి సరైన ప్రణాళిక అవసరమన్న భావన అధికారుల్లో ఉంది. కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదన ముందుకు సాగితే, దేశంలోని పదవీ విరమణ చేసిన కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించవచ్చు. పెన్షన్ పెంపు ఆర్థికంగా సవాల్తో కూడుకున్నదే అయినప్పటికీ, కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గౌరవప్రదమైన మొత్తాన్ని పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కనీస పెన్షన్ ను రూ.3000లకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షనర్ల సంఘాలు, అధికారుల నిరంతర చర్చల ద్వారా కనీస పెన్షన్ పెంచే విధంగా కేంద్రం విధానపరమైన ప్రణాళిక రూపొందిస్తుందని ఆశిద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



.jpeg)



















