మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని మున్నంగి గోపిరెడ్డి వీధిలోని నగర ప్రముఖులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు నివాసంలోని భాగంగా నిర్మించిన ‘స్వేచ్ఛ బుద్ధ విహార’ ప్రాంగణంలో 2570వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెరుమాళ్లు మాట్లాడుతూ, స్వేచ్చ బుద్ధ విహార ప్రాంగణాన్ని బౌద్ద కార్యక్రమాలతో పాటు ఇతర అన్ని అభ్యుదయ, మానవీయ , సాహితీ, కళ, సంఘ సేవా కార్యక్రమాలకు ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించారు. మంగళగిరి నగరంలో 200 గజాల స్థలంలో బుద్ధుని పేరుతో ఇటువంటి ప్రాంగణం నిర్మించి, ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించినందుకు పెరుమాళ్లుని సభకు హాజరైనవారందరూ అభినందించారు. కృష్ణార్జునరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత 25 ఏళ్లుగా బుద్ధపూర్ణిమ వేడుకలు వివిధ ప్రాంతాలలో నిర్వహించామని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. బుద్ధుడు బోధించిన పంచ శీల.. ఏ జీవికి హాని చేయకూడదు, మత్తు పదార్ధాలకు బానిస కాకూడదు, అనైతిక లైంగిక ప్రవర్తన మంచిదికాదని, అసత్యాన్ని పలకకూడదని, దొంగతనం చేయకూడదన్న విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహార పాతికేళ్ల ప్రయాణాన్ని తెలియజేస్తూ కృష్ణార్జున రావు రాసిన ‘ఆయన శ్వాస దమ్మపదం’ పుస్తకాన్ని ప్రముఖ వ్యక్తి వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆవిష్కరించారు.
పెరుమాళ్లు- వెంకట లక్ష్మిల పెళ్లి రోజు కావడంతో నగర ప్రముఖులు ఆ దంపతులను శాలువలు, పూల మాలలతో సన్మానించారు. అలాగే, ముఖ్య అతిథిగా హాజరైన మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులైన సందర్భంగా అభినందిస్తూ, ఆయన అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ప్రముఖ అభ్యుద కవి, మంగళగిరి మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించిన సభలో తాటిపాముల వెంకటలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా, మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు, ప్రముఖ కవి డాక్టర్ రావి రంగారావు, నగర ప్రముఖులు నన్నపనేని నాగేశ్వరరావు, పొట్లాబత్తుని లక్ష్మణరావు, మురుగుడు లక్ష్మీనారాయణ, గంజి రవి, జంగాల సాంబశివరావు, ప్రగడ రాజశేఖర్, మెడిటేషన్ శిక్షకులు ఆకురాతి శంకరరావు, ప్రముఖ న్యాయవాది ఎస్.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక కథనాలు
May 6, 2026
స్వేచ్ఛ బుద్ధ విహార ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఆవిష్కరణ
Apr 30, 2026
వ్యర్థాల పునర్వినియోగంలో అగ్రస్థానాన నిలవాలన్నదే ఏపీ లక్ష్యం
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తుండటంతో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. సరైన నిర్వహణ లేకండా ఈ వ్యర్థాలను ఇలా వదిలివేస్తే, భవిష్యత్తులో వీటిని ధ్వంసం చేయడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. అంతే కాకుండా, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా ప్రమాదకరం. ఈ సమస్యని పరిష్కరించడానికి పారిశ్రామిక వ్యర్థాలను ఆర్థిక ఉత్పాదకంగా, పర్యావరణానికి హాని కలుగకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ‘వాడి, విసిరిపారేసే’ విధానం నుంచి ‘వాడిన తర్వాత పునరుద్ధరణ, పునర్వినియోగం’ వ్యవస్థకు మారడం దీని ప్రధాన లక్ష్యం. అంటే, వ్యర్థాల నుండి సంపద సృష్టించడం. దీనినే ప్రపంచవ్యాప్తంగా సర్కిల్ ఎకానమీ(వృత్తాకార ఆర్థిక వ్యవస్థ-సీఈ) అంటారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఎకానమీ, వ్యర్థాల పునర్వినియోగం విధానం (4.0) (2025-30) అనే కొత్త పాలసీ ప్రకటించింది. దీనికి సంబంధించి, గత సంవత్సరం ఆగస్టు 24న ఓ జీఓ జారీ చేసింది. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చడం, రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. వ్యర్థాల నిర్వహణలో వినూత్న విధానాలు అవలంబిస్తోంది. వ్యర్థాల నుండి ఆదాయం సృష్టించడం, వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు, రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలు పెంచడం దీని ప్రధాన లక్ష్యం.
ఈ పునరావృత ప్రక్రియ సాంకేతిక పురోగతులు, మార్కెట్ మార్పులు, కార్యాచరణ అభిప్రాయాలకు అనుగుణంగా విధానాన్నిరూపొందిస్తారు. ఏపీఐఐసీ, ఏపీపీసీబీ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలతోపాటు సంస్థలన్నింటిని సమన్వయం చేసుకుంటూ, పరిశ్రమల సంచాలకులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్లు, ఎలక్ట్రానిక్, ఆహారం, దుస్తులు, ఔషధాల పరిశ్రమల కోసం ప్రత్యేక పార్కులు రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే, అధిక వనరులను వినియోగించే థర్మల్ పవర్, మెటలర్జీ, నిర్మాణం, వ్యవసాయ ప్రాసెసింగ్, ప్యాకేజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల ద్వారా ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రంగాల ద్వారా ఫ్లై యాష్, ఎర్ర మట్టి నుండి రాళ్ల దుమ్మ, పేపర్ వేస్ట్, ప్లా స్టిక్ స్క్రాప్, బయోమాస్ అవశేషాల వరకు భారీ స్థాయిలో పారిశ్రామిక వ్యర్థాలు పోగుపడుతుంటాయి. సర్క్యులర్ ఎకానమీ సూత్రాల ద్వారా, ఈ వ్యర్థ ప్రవాహాలను పారిశ్రామిక విలువ గొలుసులు(ఇండస్ట్రియల్ వాల్యూచైన్స్)గా తిరిగి విలీనం చేయడంతోపాటు ముడి వనరుల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, కొత్త గ్రీన్ ఎంటర్ప్రైజెస్లను సృష్టించవచ్చన్నది ప్రభుత్వ భావన.
రాష్ట్రంలో పేరుకుపోతున్న వ్యర్థాల పర్యవేక్షణ, తరలిస్తున్న వ్యర్థాల వివరాల ప్రదర్శనకు, డేటా ఆధారంగా, పారదర్శకంగా ప్రజా నివేదికల కోసం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్క్యులారిటీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంతోపాటు ఏకీకృత ఇ-మ్యానిఫెస్ట్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీబీ), అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)లు, ఆర్టీజీఎస్(
రియల్ టైమ్ గవర్నమెంట్ సొసైటీ)లను సమగ్రపరిచే రియల్-టైమ్ సర్క్యులర్-ఎకానమీ డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తారు. కొత్త సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియో విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలను రూపొందించారు. పేరుకుపోయిన అన్ని రకాల వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకురవడంతో పర్యావరణ పునరుద్ధరణ జరుగుతుంది. 2047 నాటికి పూర్తి సర్క్యులర్ వ్వవస్థకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలకు అనుగుణంగా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు, వాణిజ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, నూతన సర్కిల్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0(2025-30)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయిదు సంవత్సరాల పాటు లేదా కొత్త విధానం ప్రకటించే వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఈ విధానంలో రీసైక్లింగ్ కేంద్రాలను ప్రోత్సహిస్తారు.
రాష్ట్ర సర్క్యులారిటీ సెల్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ త్రైమాసికానికి ఒకసారి సమావేశమై డాష్బోర్డ్, ఆడిట్ నివేదికలు, జిల్లా స్థాయి ర్యాంకింగ్ల సమీక్షిస్తాయి. ఈ సమీక్ష ఆధారంగా, విధానాలలో తాజాగా మార్పులు చేర్పులు చేస్తారు. ప్రోత్సాహక పథకాలను, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను మెరుగుపరుస్తారు. వ్యర్థాల నిర్వహణ, వనరుల పునర్వినియోగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది. ఈ ప్రక్రియలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. పర్యావరణ అనుకూల విధానాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
Apr 29, 2026
ఆరుగురు చేనేత ప్రముఖులకు టీడీపీ పదవులు
టీడీపీ అధినేతలకు శుభాకాంక్షలు




తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నాను. ఈ సభ్యులు మనకు తెలియడంకంటే, వారికి మనం తెలియడం విశేషం. మన ముఖ్యమంత్రి, పార్టీ పొలిబ్యూరో సభ్యులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దగ్గర నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, గుత్తికొండ ధనుంజయ రావుతోపాటు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఇతర జాతీయ, రాష్ట్ర పదవులు స్వీకరించే గురజాల మాల్యాద్రి, బీటీ నాయుడు, డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్, పంచుమర్తి అనురాధ, తెనాలి శ్రావణ్ కుమార్, పాతర్ల రమేష్, ఆకుల జయసత్య తదితర పలువురు ముఖ్యులను నేను అనేక సార్లు కలిశాను. మాట్లాడాను. కొందరు నాకు సహాయం చేసినవారు కూడా ఉన్నారు. గుత్తికొండ ధనుంజయ రావు ఇల్లు మా ఇంటికీ సమీపంలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. మంచి మిత్రులు. పాతర్ల రమేష్ ది కూడా మా ఊరే. ముఖ్యంగా మా జర్నలిస్ట్. మేమిద్దరం దాదాపు ఒకేసారి జర్నలిజంలోకి వచ్చాం. 45 ఏళ్ల నుంచి తెలుసు. మంచి మిత్రుడు. ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారందరికీ హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు.
Apr 23, 2026
ఏపీలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. చంద్రబాబు నాయకత్వంలో మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. మనుషులకు, జంతువులకు అత్యంత ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టింగ్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. మైక్రో, నానో రూపాల్లో ప్లాస్టిక్ మన శరీరంలోకి, పశువుల కడుపులోకి చొచ్చుకుపోతుంది. చివరికి పసికందుల రక్తంలోకి కూడా చేరుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతటి ప్రమాదకరమైన ప్లాస్టిక్కు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార, కాటన్ సంచుల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను అందించాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యం. ఇదే అసలైన గేమ్ ఛేంజర్. ఇందుకోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలలో, ఉద్యోగులలో, విద్యార్థులలో విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపార, వివిధ అసోసియేషన్ల, రిటైర్డ్ ఉద్యోగుల, స్వయం సహాయక సంఘాల, మహిళా సంఘాల సహకారంతో ఈ గేమ్ ఛేంజర్ ని తీసుకురానుంది. క్లాత్ బ్యాగ్లు, జూట్ బ్యాగ్లు, పేపర్ ప్యాకేజింగ్ తయారీకి మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తోంది. ‘క్లీన్ ఏపీ – గ్రీన్ ఏపీ’ అన్న నినాదంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ముందుకు వెళుతోంది.
పట్టాభిరామ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రపతి చేతులమీదుగా కార్పొరేషన్ 5 జాతీయ అవార్డులు అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులలో ఆంధ్రప్రదేశ్కు ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు విశాఖ నగరానికి, రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ అవార్డు రాజమహేంద్రవరం నగరానికి, స్వచ్ఛ సూపర్లీగ్ సిటీస్ అవార్డులు విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలకు దక్కాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ పురపాలక శాఖ ఈ అవార్డులను అందుకుంది.
రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో చెత్తను శుభ్రపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో చెత్త పేరుకుపోకుండా ఉండేదుకు 75 వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు, 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 2025 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (గ్గాసులు, కవర్లు, బాటిళ్లు, స్ట్రాలు...)ను పూర్తిగా నిషేధించే చర్యలకు పూనుకుంది. వచ్చే జూన్ నాటికి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. అమరావతిలోని సచివాలయం నుంచి మొదలు పెట్టి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయం, రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 20 జిల్లాల్లో ఇప్పటికే 62 మునిసిపల్ కార్యాలయాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మార్చారు. ఈ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బదులు త్రాగునీటి కోసం గాజు, స్టీల్ బాటిళ్లు ... వంటి ప్రత్యామ్నాయాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా త్వరలోనే ఈ నిషేధం విధిస్తారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు కార్పోరేషన్కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలో మార్చి నెలలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ డి.దశరధరామిరెడ్డి ఈ అవార్డుని అందుకున్నారు. ఆ అవార్డును కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఈడీ అర్జునరావులు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు అందజేశారు. త్వరలో లక్ష్యాన్ని చేరుకునే విధంగా, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం కలిగించే విధంగా ప్రభుత్వం అనేక రూపాలలో ప్రచారం నిర్వహిస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నుని కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అంతే, కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్టైల్లో చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియలను కూడా ప్రారంభించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, కవర్లు, సంచులు.... వంటి వాటిని ఇస్తే ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని పట్టణాలలో, గ్రామాలలో అమలు చేస్తున్నారు. కొన్ని పట్టణాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సేకరణ కేంద్రానికి వెళ్లి ఇస్తే, అక్కడ నిత్యావసర వస్తువులు వంటి వాటిని బహుమతులుగా ఇస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇందు కోసం తెనాలి మున్సిపల్ కార్యాలయం, శివాజీ చౌక్లలో ప్లాస్టిక్ ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పాత పుస్తకాలు, కార్డు బోర్టులు... వంటివాటిని ఇస్తే వారికి ప్రశంసా పత్రాలతోపాటు కొత్త పుస్తకాలు బహుమతిగా అందజేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘స్వచ్ఛ రథం’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో చెత్తను (ప్లాస్టిక్, బాటిళ్లు వంటివి) ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా నిత్యావసర సరుకులను పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసి, గ్రామాల పరిశుభ్రతను పెంచుతూ, ప్రజలకు ప్రయోజనం, పర్యావరణానికి రక్షణ చేకూరుస్తున్నారు. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి. వాటి ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నారు. స్వచ్ఛ రథాల సంఖ్య త్వరలో వందకు పెంచుతారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్. ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటించి, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరిట పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు తప్పనిసరిగా పాల్గొంటున్నారు. 12 వేలకు పైగా ట్రైసైకిల్స్, ఇతర వాహనాల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 3.91 లక్షల ఇళ్లల్లో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో పది లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. త్వరలోనే ఆ లక్ష్యానికి చేరుకుంటారు.
సర్క్యులర్ ఎకానమీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను, పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వేరు చేసి, శుభ్రపరుస్తారు. యంత్రాల ద్వారా చిన్న ముక్కలుగా చేసి, కరిగించి, గుళికలు లేదా రేకులు తయారు చేస్తారు. ఈ గుళికలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. వాటిని మళ్లీ కొత్త ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ రకంగా చేయడం ద్వారా తక్కువ ముడిపదార్థాలతో కొత్త ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతాయి. భూమిలో ప్లాస్టిక్ పేరుకుపోవడం తగ్గుతుంది. ఆ విధంగా మనం త్వరలోనే స్వచ్ఛ అంధ్రని, స్వర్ణ అంధ్రని చూడబోతున్నాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914
Apr 17, 2026
భార్యకు భర్త ఇచ్చే భరణం... సుప్రీంకోర్టు వ్యాఖ్యానం
భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబ ద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ ల ధర్మాసనం తెలిపింది.
కేస్ నంబర్: SLP (Crl) No. 13247/2024
కిరణ్ జ్యోతి వర్సెస్ అమిత్ కుమార్ (ఉత్తరాఖండ్)
ధర్మాసనం:జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్.
న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు:
1. భర్త ఆర్థిక స్తోమత: భర్త ఆదాయం, ఆస్తులను బట్టి భరణం నిర్ణయించాలి. ఈ కేసులో భర్త ఆదాయం సుమారు నెలకు రూ. 50,000 నుండి 60,000 వరకు ఉందని ప్రాథమికంగా గుర్తించిన కోర్టు, గతంలో ఉన్న రూ. 15,000 భరణాన్ని తక్కువగా భావించి దానిని రూ. 25,000 కు పెంచింది.
2. మహిళల హక్కులు: భరణం అనేది భర్త ఇచ్చే భిక్ష కాదని, అది భార్య యొక్క చట్టబద్ధమైన హక్కు అని ధర్మాసనం గుర్తుచేసింది. మహిళ తన పుట్టింటిపై ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించేలా భర్త భరోసా కల్పించాలని పేర్కొంది.
3. తక్కువ మొత్తాలపై అభ్యంతరం: కేవలం రూ. 8,000 లేదా రూ. 10,000 వంటి మొత్తాలు నేటి కాలంలో ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించడానికి, కనీస అవసరాలు (ఆహారం, వసతి, వైద్యం) తీర్చుకోవడానికి సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.
4. సామాజిక హోదా: వివాహం తర్వాత దంపతులు కలిసి ఉన్నప్పుడు అనుభవించిన జీవన ప్రమాణాలను (Standard of Living), విడిపోయిన తర్వాత కూడా భార్యకు కల్పించాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది.
ఫ్యామిలీ కోర్టు తీర్పు: చంపావత్ ఫ్యామిలీ కోర్టు మొదట రూ. 8,000 నిర్ణయించింది.
హైకోర్టు సవరణ: ఉత్తరాఖండ్ హైకోర్టు దీనిని రూ. 15,000 కు పెంచింది.
సుప్రీంకోర్టు అంతిమ తీర్పు: బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమె అవసరాలను మరియు భర్త ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని రూ. 25,000 కు ఖరారు చేసింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా భరణం కేసులలో ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. గౌరవప్రదమైన జీవనం, సహేతుకమైన భరణం అనే అంశాలకు పెద్దపీట వేసింది.
స్వేచ్ఛ బుద్ధ విహార ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఆవిష్కరణ
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని మున్నంగి గోపిరెడ్డి వీధిలోని నగర ప్రముఖులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు నివాసంలోని భాగంగా నిర్మించిన ...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
















