May 12, 2026

బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తప్పనిసరికాదు

బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తప్పనిసరి కాదు: తెలంగాణ హైకోర్టు

కేసు : విజయ్ గోపాల్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు ఇతరులు (Vijay Gopal v. Bar Council of India & Anr.)*

*రిట్ పిటిషన్ నంబర్: W.P. No. 11364 of 2024*

 న్యాయవాదిగా వృత్తిని కొనసాగించడానికి (ప్రాక్టీస్ చేయడానికి) ఏదైనా బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరడం తప్పనిసరి కాదని జస్టిస్ ఎన్. తుకారాంజీ స్పష్టం చేశారు.

 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) 2015లో రూపొందించిన 'రూల్ 6'ను సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే(ab) అడ్వకేట్ పిటిషన్ వేశారు. ఈ రూల్ వల్ల అసోసియేషన్లకు అడ్వకేట్లపై పరోక్ష నియంత్రణ లభిస్తోందని ఆయన వాదించారు.

 'అడ్వకేట్స్ యాక్ట్, 1961' ప్రకారం ఎన్‌రోల్ అయిన ప్రతి న్యాయవాదికి ప్రాక్టీస్ చేసే హక్కు ఉంటుంది. సర్టిఫికేషన్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియలు(ab) కేవలం గుర్తింపు మరియు సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఉండాలి తప్ప, న్యాయవాదుల హక్కులను అడ్డుకునేలా ఉండకూడదని హైకోర్టు పేర్కొంది.

సభ్యత్వం స్వచ్ఛందమే: న్యాయవాదులు ఏదైనా బార్ అసోసియేషన్‌లో చేరడం అనేది వారి వ్యక్తిగత అభీష్టం మాత్రమే. అది నిర్బంధం కాదని కోర్టు స్పష్టం చేసింది.

ఒక న్యాయవాది బార్ అసోసియేషన్‌లో సభ్యుడు కాకపోయినప్పటికీ, చట్టప్రకారం వారు కోర్టులలో(ab) వాదించడానికి (ప్రాక్టీస్ చేయడానికి) ఎటువంటి అడ్డంకి ఉండకూడదని నొక్కి చెప్పింది.

*బార్ కౌన్సిల్ vs బార్ అసోసియేషన్ - తేడాలు:* 

న్యాయవాద వృత్తిలో ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది:

*స్టేట్ బార్ కౌన్సిల్ (చట్టబద్ధమైనది):* మీరు లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే తప్పనిసరిగా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నమోదు (Enrollment) చేసుకోవాలి. ఇది చట్టబద్ధమైన అవసరం.

*బార్ అసోసియేషన్ (ప్రైవేట్ బాడీ):* ఇది ఒక కోర్టు పరిధిలోని న్యాయవాదులు ఏర్పాటు చేసుకున్న ఒక సంఘం. ఉదాహరణకు: హైకోర్టు బార్ అసోసియేషన్, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ వంటివి

*సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలు:*

సభ్యత్వం తప్పనిసరి కాకపోయినా, న్యాయవాదులు ఇందులో చేరడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి:

 లైబ్రరీలు, కామన్ రూమ్‌లు, ఇతర మౌలిక వసతుల వినియోగం లాంటి సౌకర్యాలు ఉంటాయి

May 8, 2026

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?


దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్- 95) కింద ఇచ్చే కనీస పెన్షన్ రూ.1000లు మాత్రమే ఇస్తున్నారు. కనీస పెన్షన్ రూ. 7,500కు పెంచాలన్నది పెన్షన్ దారుల డిమాండ్. ఇందు కోసం మార్చి 9, 10, 11 తేదీలలో మూడు రోజులపాటు దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా, ‘చలో ఢిల్లీ’ నినాదంతో భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఫలితాలు ఏమీ కనిపించలేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలవారీ పెన్షన్‌ పెంచడంతోపాటు అదనంగా కరువు భత్యం, పెన్షనర్లు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టులు, సామాజిక సర్వేల ప్రకారం పెన్షన్ మొత్తం సరిపోకపోవడం, ఉచిత ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 200 నుండి 250 మంది పెన్షనర్లు అకాల మరణానికి గురవుతున్నారు. 30 ఏళ్లు పనిచేసిన వారి నెలవారీ సగటు పెన్షన్ రూ.1,171 మాత్రమే ఉన్నట్లు ఈపీఎస్-95 జాతీయ పోరాట కమిటీ తెలిపింది. పలు రాజకీయ పార్టీల ఎంపీలు కూడా వీరి పోరాటానికి మద్దతు ప్రకటించారు. కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదని, ఇది లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి, జీవించే హక్కుకు సంబంధించిన అంశంగా వారు పేర్కొన్నారు.

ప్రైవేటు సంస్థలలో పదేళ్లకు పైగా పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రమే ఈ పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ పథకం పరిధిలోకి ప్రైవేటు సంస్థలలో పనిచేసి రిటైర్ అయిన ఉపాధ్యాయులు, జర్నలిస్టులతోపాటు పెద్ద పెద్ద మిల్లులు, ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో పనిచేసిన ఇతర ఉద్యోగులు, కార్మికులు.... వంటివారందరూ వస్తారు. కనీసం పది సంవత్సరాలు సర్వీసు ఉండి, 58 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది. అది కూడా వారు పనిచేసినంత కాలం 30-35 ఏళ్లు పెన్షన్ నిధికి చెల్లించిన సొమ్ము నుంచి మాత్రమే ఈ పెన్షన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12 శాతం యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33 శాతం ఈపీఎస్‌కు జమ అవుతుంది. మిగిలిన 3.67 శాతం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)లో జమ అవుతుంది. దీని ఆధారంగా, ప్రస్తుతం రూ.1,000 కనీస పెన్షన్‌గా చెల్లిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వాటా 1.16 శాతం మాత్రమే ఉంటుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్- 95) కింద పార్లమెంట్ చట్టం ప్రకారం 2014 నుంచి కనీస పెన్షన్ నెలకు రూ.1000 అందజేస్తున్నారు. అంటే, 11 ఏళ్ల క్రితం నిర్ణయించిన ప్రకారమే ఇస్తున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు ఎంతగా పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో నెలకు రూ. 1,000తో జీవించడం అసాధ్యం. వీరిలో ఎక్కువ మంది పరిమిత ఆర్థిక వనరులు కలిగిన పేదలే ఉన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షనర్ల ఆర్థిక భద్రత కోసం కనీస పెన్షన్ పెంచవలసిన అవసరం ఉంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారి దీనస్థితిని కేంద్ర ప్రభుత్వం అర్థంచేసుకోవలసి ఉంది. పెన్షన్‌పై మాత్రమే ఆధారపడే పెన్షనర్లకు, ప్రతిపాదిత పెంపు ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పదవీ విరమణ తర్వాత వారు మరింత సౌకర్యవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి సహాయపడుతుంది.

దేశంలోని వివిధ ప్రభుత్వాలు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ ఇంతకు మూడు రెట్లు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు రూ.4000, తెలంగాణ ప్రభుత్వం రూ.2,016 సామాజిక పెన్షన్ కింద అందజేస్తున్నాయి. అందులో వారి వాటా ఏమీ ఉండదు. కేవలం వయసు ఆధారంగా పేదలకు ఇస్తారు. ఈపీఎస్ పెన్షన్‌లో మాత్రం ఉద్యోగులు, యాజమాన్యం చెల్లించిన వాటాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సామాజిక పెన్షన్ స్థాయిలో కూడా తమ పెన్షన్ లేదని, రూ.1000 పెన్షన్ మందులకు కూడా సరిపోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం అక్టోబరులో బెంగళూరులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో కనీస పెన్షన్ రూ.1,000 నుండి రూ.7,500 కు పెంచాలని ప్రతిపాదించారు. అయితే, ఆ ప్రతిపాదనను ఆమోదించలేదు. అంత కాకపోయినా, కనీస పెన్షన్ రూ.3000లకు పెంచుతారని భావించారు. అదీలేదు. ఆ సమావేశం పెంచే ఆలోచనే చేయలేదు. ఎంతో కాలంగా పెన్షన్ పెంచుతారని ఎదురు చూస్తోన్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది. ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి నాటికి 82,11,182 మంది ఈపీఎస్ పెన్షన్ దారులు ఉన్నారు. వారిలో 36.6 లక్షల మందికి రూ.1000లు మాత్రమే కనీస పెన్షన్ అందుతోంది.

అయితే, ఒకేసారి 7.5 రెట్లు కనీస పెన్షన్ పెంచడం సాధ్యమయ్యేపనికాదు. ఈపీఎస్ నిధి అనేది ఉద్యోగులు, యజమానుల వాటాతో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తంలో పెన్షన్ చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై లక్షల కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న నిధుల లోటు కారణంగా ఈ పెంపు కష్టతరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతమంది పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంచాలంటే, ప్రభుత్వం అదనపు నిధులను కేటాయించాలి. ఈ ప్రతిపాదన వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పెన్షన్ వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి సరైన ప్రణాళిక అవసరమన్న భావన అధికారుల్లో ఉంది. కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదన ముందుకు సాగితే, దేశంలోని పదవీ విరమణ చేసిన కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించవచ్చు. పెన్షన్ పెంపు ఆర్థికంగా సవాల్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గౌరవప్రదమైన మొత్తాన్ని పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కనీస పెన్షన్ ను రూ.3000లకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షనర్ల సంఘాలు, అధికారుల నిరంతర చర్చల ద్వారా కనీస పెన్షన్ పెంచే విధంగా కేంద్రం విధానపరమైన ప్రణాళిక రూపొందిస్తుందని ఆశిద్దాం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

May 6, 2026

స్వేచ్ఛ బుద్ధ విహార ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఆవిష్కరణ



మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని మున్నంగి గోపిరెడ్డి వీధిలోని  నగర ప్రముఖులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు నివాసంలోని భాగంగా నిర్మించిన ‘స్వేచ్ఛ బుద్ధ విహార’ ప్రాంగణంలో 2570వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని  మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెరుమాళ్లు మాట్లాడుతూ, స్వేచ్చ బుద్ధ విహార ప్రాంగణాన్ని   బౌద్ద కార్యక్రమాలతో పాటు ఇతర  అన్ని  అభ్యుదయ, మానవీయ , సాహితీ, కళ, సంఘ సేవా కార్యక్రమాలకు  ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించారు. మంగళగిరి నగరంలో  200 గజాల స్థలంలో బుద్ధుని పేరుతో ఇటువంటి ప్రాంగణం నిర్మించి, ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించినందుకు పెరుమాళ్లుని సభకు హాజరైనవారందరూ అభినందించారు. కృష్ణార్జునరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత 25 ఏళ్లుగా బుద్ధపూర్ణిమ వేడుకలు వివిధ ప్రాంతాలలో నిర్వహించామని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రాంగణంలో  బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.   బుద్ధుడు బోధించిన పంచ శీల.. ఏ జీవికి హాని చేయకూడదు,  మత్తు పదార్ధాలకు బానిస కాకూడదు, అనైతిక లైంగిక ప్రవర్తన మంచిదికాదని, అసత్యాన్ని పలకకూడదని, దొంగతనం చేయకూడదన్న విషయాలు చెప్పారు.  ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహార పాతికేళ్ల ప్రయాణాన్ని తెలియజేస్తూ కృష్ణార్జున రావు రాసిన ‘ఆయన శ్వాస దమ్మపదం’ పుస్తకాన్ని ప్రముఖ వ్యక్తి వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆవిష్కరించారు. పెరుమాళ్లు- వెంకట లక్ష్మిల పెళ్లి రోజు కావడంతో నగర ప్రముఖులు ఆ దంపతులను శాలువలు, పూల మాలలతో సన్మానించారు. అలాగే, ముఖ్య అతిథిగా హాజరైన మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులైన సందర్భంగా అభినందిస్తూ, ఆయన అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ప్రముఖ అభ్యుద కవి, మంగళగిరి మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించిన సభలో తాటిపాముల వెంకటలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా, మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు, ప్రముఖ కవి డాక్టర్ రావి రంగారావు,  నగర ప్రముఖులు నన్నపనేని నాగేశ్వరరావు, పొట్లాబత్తుని లక్ష్మణరావు, మురుగుడు లక్ష్మీనారాయణ, గంజి రవి, జంగాల సాంబశివరావు, ప్రగడ రాజశేఖర్, మెడిటేషన్ శిక్షకులు ఆకురాతి శంకరరావు, ప్రముఖ న్యాయవాది ఎస్.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.  

Apr 30, 2026

వ్యర్థాల పునర్వినియోగంలో అగ్రస్థానాన నిలవాలన్నదే ఏపీ లక్ష్యం



 

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తుండటంతో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  సరైన నిర్వహణ లేకండా ఈ వ్యర్థాలను ఇలా వదిలివేస్తే, భవిష్యత్తులో వీటిని ధ్వంసం చేయడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది. అంతే కాకుండా, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా ప్రమాదకరం.  ఈ సమస్యని పరిష్కరించడానికి పారిశ్రామిక వ్యర్థాలను ఆర్థిక ఉత్పాదకంగా, పర్యావరణానికి హాని కలుగకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో  సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ‘వాడి, విసిరిపారేసే’ విధానం నుంచి ‘వాడిన తర్వాత  పునరుద్ధరణ, పునర్వినియోగం’ వ్యవస్థకు మారడం దీని ప్రధాన లక్ష్యంఅంటేవ్యర్థాల నుండి సంపద సృష్టించడం.  దీనినే ప్రపంచవ్యాప్తంగా సర్కిల్ ఎకానమీ(వృత్తాకార ఆర్థిక వ్యవస్థ-సీఈ) అంటారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు  ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఎకానమీ, వ్యర్థాల పునర్వినియోగం విధానం (4.0) (2025-30) అనే  కొత్త పాలసీ ప్రకటించింది. దీనికి సంబంధించి, గత సంవత్సరం ఆగస్టు 24న ఓ జీఓ జారీ చేసింది. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చడంరీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది.  వ్యర్థాల నిర్వహణలో వినూత్న విధానాలు అవలంబిస్తోంది. వ్యర్థాల నుండి ఆదాయం సృష్టించడంవ్యవసాయపారిశ్రామిక వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటురీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడంఉపాధి అవకాశాలు పెంచడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ పునరావృత ప్రక్రియ సాంకేతిక పురోగతులుమార్కెట్ మార్పులు, కార్యాచరణ అభిప్రాయాలకు అనుగుణంగా విధానాన్నిరూపొందిస్తారు. ఏపీఐఐసీఏపీపీసీబీస్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలతోపాటు సంస్థలన్నింటిని సమన్వయం చేసుకుంటూ,  పరిశ్రమల సంచాలకులు   అవసరమైన చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సూక్ష్మచిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్లు, ఎలక్ట్రానిక్, ఆహారం, దుస్తులు, ఔషధాల పరిశ్రమల కోసం ప్రత్యేక పార్కులు రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే, అధిక వనరులను వినియోగించే థర్మల్ పవర్, మెటలర్జీ, నిర్మాణం, వ్యవసాయ ప్రాసెసింగ్, ప్యాకేజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల ద్వారా ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.  ఈ రంగాల ద్వారా ఫ్లై యాష్, ఎర్ర మట్టి నుండి రాళ్ల దుమ్మ పేపర్ వేస్ట్ప్లా స్టిక్ స్క్రాప్, బయోమాస్ అవశేషాల వరకు భారీ స్థాయిలో పారిశ్రామిక వ్యర్థాలు పోగుపడుతుంటాయి. సర్క్యులర్ ఎకానమీ సూత్రాల ద్వారాఈ వ్యర్థ ప్రవాహాలను పారిశ్రామిక విలువ గొలుసులు(ఇండస్ట్రియల్ వాల్యూచైన్స్)గా తిరిగి విలీనం చేయడంతోపాటు ముడి వనరుల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, కొత్త గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్‌లను సృష్టించవచ్చన్నది ప్రభుత్వ భావన.

 

రాష్ట్రంలో పేరుకుపోతున్న వ్యర్థాల పర్యవేక్షణ తరలిస్తున్న వ్యర్థాల వివరాల ప్రదర్శనకు డేటా ఆధారంగా, పారదర్శకంగా  ప్రజా నివేదికల కోసం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్క్యులారిటీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంతోపాటు ఏకీకృత ఇ-మ్యానిఫెస్ట్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది.  ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీబీ), అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్‌బీ)లు, ఆర్టీజీఎస్(

రియల్ టైమ్ గవర్నమెంట్ సొసైటీ)లను సమగ్రపరిచే రియల్-టైమ్ సర్క్యులర్-ఎకానమీ డాష్‌ బోర్డ్ ఏర్పాటు చేస్తారు. కొత్త సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియో విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలను రూపొందించారు. పేరుకుపోయిన అన్ని రకాల వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకురవడంతో పర్యావరణ పునరుద్ధరణ జరుగుతుంది. 2047 నాటికి పూర్తి సర్క్యులర్ వ్వవస్థకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలకు అనుగుణంగా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.   పరిశ్రమలు, వాణిజ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నూతన  సర్కిల్ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0(2025-30)ను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  అయిదు సంవత్సరాల పాటు లేదా కొత్త విధానం ప్రకటించే వరకు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఈ విధానంలో రీసైక్లింగ్ కేంద్రాలను ప్రోత్సహిస్తారు.

రాష్ట్ర సర్క్యులారిటీ సెల్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ త్రైమాసికానికి ఒకసారి సమావేశమై డాష్‌బోర్డ్ఆడిట్ నివేదికలు, జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ల సమీక్షిస్తాయి. ఈ సమీక్ష ఆధారంగావిధానాలలో తాజాగా మార్పులు చేర్పులు చేస్తారు.   ప్రోత్సాహక పథకాలను, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను మెరుగుపరుస్తారు. వ్యర్థాల నిర్వహణవనరుల పునర్వినియోగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది. ఈ ప్రక్రియలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది.  పర్యావరణ అనుకూల విధానాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914




Apr 29, 2026

ఆరుగురు చేనేత ప్రముఖులకు టీడీపీ పదవులు


మంగళగిరి: తెలుగుదేశం పార్టీ పదవులు చేనేత వర్గానికి చెందిన ఆరుగురు ప్రముఖులను వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఉదయం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తోపాటు పార్టీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. పద్మశాలి సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయ రావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధ, కర్నూలుకు చెందిన డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్,  రాష్ట్ర కార్యదర్శిగా విశాఖపట్నంకు చెందిన వానపల్లి గాయత్రి ఫణి కుమారిలు ప్రమాణ స్వీకారం చేశారు. చేనేత వర్గానికే చెందిన దేవాంగ సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన దాసరి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన నిమ్మల అంబరీష్ లు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

గుత్తికొండ ధనుంజయ:  గుత్తికొండ సీతారామయ్య, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ధనుంజయ రావు 1968 జూన్ 1వ తేదీన జన్మించారు. ఆయన  ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు మంగళగిరి మూర్తి స్కూల్ లో చదివారు. ఆ తర్వాత చింతక్రిది కనకయ్య హైస్కూల్ లో 6వ తరగతి చదివారు.  వివిధ కారణాల వల్ల చదువు మానివేశారు. ఆ తర్వాత 1989లో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ మెట్రిక్ పరీక్ష రాసి పాసయ్యారు.  1990 మే 5న గుంటూరుకు చెందిన  కాకుమాను పాపయ్య, తేరోజమ్మల కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. 
14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్రకి,  2014లో గంజి చిరంజీవికి,  2019లొ నారా లోకేష్ కి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. 2024 లో నారా లోకేష్ విజయం కోసం అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమించారు.  2006లో  కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా,  రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు.  2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీ వైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. ఓ పక్క చేనేత కార్మికుల కోసం పోరాడుతూ, మరోపక్క బీసీలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ, మరో పక్క అయిదేళ్ల నుంచి మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గా కళాసేవ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తూ, సౌమ్యుడిగా పేరు పొందిన ధనుంజయరావుని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించింది.

పంచుమర్తి అనురాధ: పంచుమర్తి అనురాధ:   స్వర్గం పుల్లారావు, లక్ష్మి దంపతులకు పంచుమర్తి అనురాధ 1974లో జన్మించారు.   తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో చేశారు.  ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో, ఆ తర్వాత విజయవాడ అట్కిన్‌సన్‌ హైస్కూల్‌లో చదివారు. విజయవాడ స్టెల్లా కాలేజీల ఇంటర్ , గుంటూరు జేకేసీ కళాశాలలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు.  డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే, ఆమె పారిశ్రామికవేత్త పంచుమర్తి శ్రీధర్ తో వివాహం జరిగింది. అనూరాధ వివాహానంతరం 2010లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశారు. 
ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2000లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు.  మేయర్‌ టికెట్‌ కోసం ఆమె టీడీపీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 మంది పోటీ పడగా,  విద్యాధికురాలైన అనురాధకు చంద్రబాబు నాయుడు  టికెట్‌ ఖరారు చేశారు.  విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి  6,800 ఓట్ల మెజారిటీతో  మేయర్‌గా గెలిచారు. మేయర్‌గా ఎన్నికైన నాటికి ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. పంచుమర్తి అనురాధ ఆ తరువాత పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన రీతిలో సమాధానాలు చెబుతూ, ఫైర్ బ్రాండ్ గా పేరుపొందారు.   2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసే కోటాలో ఆమె గెలుపొందారు.   2024 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చీఫ్ విప్‌గా అనురాధ నియమితురాలయ్యారు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలయ్యారు.

డాక్టర్ సంజీవ్ కుమార్: వస్త్ర వ్యాపారరంగంలో ప్రముఖులైన  శ్రీ శింగరి శ్రీరంగం, రంగమ్మ పుణ్య దంపతులకు 1967 జనవరి 3న   కర్నూలు నగరంలో డాక్టర్ సంజీవ్ కుమార్  జన్మించారు. సంజీవ్ కుమార్ బాల్యం నుంచి  ఆట పాటలతోపాటు చదువులో  ప్రతిభ కనపరిచేవారు. శింగరి శ్రీరంగం  కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు మొత్తం ఆరుగురూ డాక్టర్లే.  వారంతా ప్రభుత్వ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లు  కూడా డాక్టర్లే. ఈ కుటుంబంలో  మొత్తం 21 మంది డాక్టర్లు ఉన్నారు. 1984-1990లో  కర్నూలు మెడికల్ కాలేజీలో  ఎంబీబీఎస్  డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. 1992-1995 మధ్య కాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చదివారు. సంజీవ్ కుమార్ 1992 మార్చి 4న డాక్టర్ వసుంధరనుపెళ్లి చేసుకున్నారు.
డాక్టర్ సంజీవ్ కుమార్ 2006 నుంచి 2022 వరకు‘ఆయుష్మాన్ ద ఫ్యామిలీ హాస్పిటల్’ద్వారా పేదలకు అందుబాటులో వైద్యం సేవలు చేశారు.  రాజకీయాలలో స్థిరపడి, ప్రజలకు ఇంకా చేరువై సేవచేయాలని 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షా 48వేల ఓట్ల మెజార్టీతో  సంజీవ్ కుమార్ విజయం సాధించారు.

కర్నూలు ఎంపీగా ప్రశ్నలు అడగడంలో, ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టడంలో, చర్చలలో పాల్గొనడంలో  ఆయన ఓ రికార్డును స్థాపించారు. డాక్టర్ సంజీవ్ కుమార్  6 ప్రైవేటు బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ 72 సంవత్సరాల చరిత్రలో కర్నూలు ఎంపీగా ఎన్నికైన ఎవరూ సభలో ఇన్ని ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టలేదు.  కర్నూలుకు సంబంధించి లోక్ సభ చరిత్రలో డాక్టర్ సంజీవ్ కుమార్ సృష్టించిన రికార్డు ఇది.   17వ లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ 225 ప్రశ్నలు లేవనెత్తారు. ఒక పద్మశాలి లోక్ సభ సభ్యుడు ఈ స్థాయిలో ప్రశ్నించడం, చర్చలలో పాల్గొనడం,  ప్రశ్నలు లేవనెత్తడం చేనేత వర్గాలు గర్వకారణంగా భావించాయి. ఉన్నత చదువులు చదివిన నిజాయితీపరులు లోక్ సభకు ఎన్నికైతే దేశానికి ఎంత ప్రయోజనకరమో డాక్టర్ సంజీవ్ కుమార్ చేసి చూపించారు. 2024 ఎన్నికల ముందే ఆయన టీడీపీలో చేరారు. డాక్టర్ సంజీవ్ కుమార్ విద్యార్హతలు, ప్రజాసేవా కార్యక్రమాలు, పార్లమెంటులో ఆయన చూపిన ప్రతిభ ఆదారంగా, ఆయనను పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎంపిక చేశారు. 

వానపల్లి గాయత్రి ఫణి కుమారి: విశాఖపట్నంకు చెందిన వానపల్లి గాయత్రి ఫణి కుమారి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.  చేనేత వర్గాల సంక్షేమం కోసం ఆమె కృషి చేస్తుంటారు. ఆమె సేవలను గుర్తించి పార్టీ ఆమెని రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 

దాసరి శ్రీనివాస్: విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన దాసరి శ్రీనివాస్ దేవాంగ సంఘంలో పలు పదవులు నిర్వహించారు. చేనేత వర్గం కోసం పోరాడుతూ, ఆ వర్గం నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 

నిమ్మల అంబరీష్: టీడీపీకి చెంది ప్రముఖ నేత నిమ్మల కిష్టప్ప కుమారుడే అంబరీష్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, చేనేత రంగం అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 

చేనేత వర్గం నుంచి నియమితులైన ఈ ఆరుగురికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు,  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు జీవీ నాగేశ్వరరావు సంఘం తరఫున అభినందనలు తెలిపారు. 
 
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914





టీడీపీ అధినేతలకు శుభాకాంక్షలు












తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో  ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నాను. ఈ సభ్యులు మనకు తెలియడంకంటే, వారికి మనం తెలియడం విశేషం. మన ముఖ్యమంత్రి, పార్టీ పొలిబ్యూరో సభ్యులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దగ్గర నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, గుత్తికొండ ధనుంజయ రావుతోపాటు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఇతర జాతీయ, రాష్ట్ర పదవులు స్వీకరించే గురజాల మాల్యాద్రి, బీటీ నాయుడు, డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్, పంచుమర్తి అనురాధ, తెనాలి  శ్రావణ్ కుమార్, పాతర్ల రమేష్, ఆకుల జయసత్య తదితర పలువురు ముఖ్యులను నేను అనేక సార్లు కలిశాను. మాట్లాడాను. కొందరు నాకు సహాయం చేసినవారు కూడా ఉన్నారు.  గుత్తికొండ ధనుంజయ రావు ఇల్లు మా ఇంటికీ సమీపంలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. మంచి మిత్రులు. పాతర్ల రమేష్ ది కూడా మా ఊరే. ముఖ్యంగా మా జర్నలిస్ట్. మేమిద్దరం దాదాపు ఒకేసారి జర్నలిజంలోకి వచ్చాం.  45 ఏళ్ల నుంచి తెలుసు. మంచి మిత్రుడు. ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారందరికీ  హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు.




  

బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తప్పనిసరికాదు

బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తప్పనిసరి కాదు: తెలంగాణ హైకోర్టు కేసు : విజయ్ గోపాల్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు ఇతరులు (Vijay Gopal ...