పద్మశాలీయుల విజయపతాక
మంగళగిరి చేనేతకు విస్తృత స్థాయి ప్రచారం కల్పించిన యింజమూరి శ్రీనివాసరావు
చేనేతలు గర్వించతగ్గ స్థాయికి ఎదిగిన యింజమూరి శ్రీనివాసరావు
మంగళగిరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేనేత, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. ఇప్పుడు నారా లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గంగా కూడా పేరుపొందింది. ఏదిఏమైనా చేనేత పరంగానే మంగళగిరికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. మంగళగిరి చేనేతకు ఇంతటి గుర్తింపు తీసుకురావడానికి కృషిచేసిన ముఖ్యులలో యింజమూరి శ్రీనివాసరావు ఒకరు. మంగళగిరిలోని వారికి కూడా తెలియకుండా అనేక రకాల వస్త్రాలు నేయించి, దేశం అంతటా వ్యాపారం చేశారు. ఎగుమతిదారులకు సరఫరా చేశారు. చీరలకు, ఇతర రకాల చేనేత వస్త్రాల తయారీకి మంగళగిరి ఓ బ్రాండ్ గా గుర్తింపు పొందడానికి యింజమూరి శ్రీనివాసరావు కృషి ఎంతో ఉంది. శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి అయిన తర్వాత, మంగళగిరిలో చేనేత(పద్మశాలి) వర్గానికి చెందిన తమ్మిశెట్టి రామకృష్ణ, జంజనం రెడ్డయ్య కలిసి 1986లో కొత్తగా సన్ ఫ్లవర్ పేరుతో ప్రారంభించిన హోల్ సేల్ చేనేత వస్త్రవ్యాపార సంస్థలో రూ.600ల జీతం, లాభాలలో 10 శాతం వాటాతో గుమస్తాగా చేరారు. మంగళగిరి చేనేతకు పేరు రావడానికి కీలక వ్యక్తులు వీరు ఇద్దరే అయినప్పటికీ, ఫీల్డ్ లో వర్క్ చేసిన ముఖ్య వ్యక్తి యింజమూరి శ్రీనివాసరావు. తమ్మిశెట్టి రామకృష్ణ మంగళగిరిలో అప్పటి జనసంఘ్ పార్టీ ప్రముఖ నేత. పేదలకు ఆర్థిక సహాయం చేసేవారు. ఆయనకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఆయన కోడలే. రామకృష్ణ పొగాకు వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో చేనేత వస్త్ర వ్యాపారం వైవు మళ్లారు. జంజనం కుటుంబ రెడ్డయ్య కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉండేవారు. చేనేతలో శిక్షణ, కొత్త డిజైన్ల తయారీ, రంగుల అద్దకం, ఆధునిక సాంకేతిక పద్ధతులు, చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ సహకారం అందిస్తూ, చేనేత కార్మికుల ఉత్పాదకత, ఆదాయం పెంచడానికి వీవర్స్ సర్వీస్ సెంటర్ ప్రయత్నించేది. ఆ విధంగా రెడ్డయ్యకు చేనేత ఉత్పత్తులు, మార్కెటింగ్ పై మంచి పట్టు ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినందువల్ల, ఆయన బయట ఉండి సహాయ సహకారాలు అందించగలరు గానీ, వ్యాపారంలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేని పరిస్థితి. ఇక తమ్మిశెట్టి రామకృష్ణ విషయానికి వస్తే, ఆయన పెట్టుబడి పెట్టగలరు గానీ, చేనేత వ్యాపారంపై పట్టులేదు. ఈ పరిస్థితుల్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టేటట్లు, రెడ్డయ్య డిజైన్, మార్కెటింగ్ లో పూర్తి సహకారం అందించేట్లు, లాభాలు చెరిసగం పంచుకునే విధంగా ఒప్పందం కుదిరింది. వీరు ఇద్దరూ 1986 మార్చిలో ‘సన్ ఫ్లవర్’ పేరుతో వ్యాపార సంస్థను స్థాపించారు. అయితే, చేనేత వస్త్రాలు నేయించడం, వాటిని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి యువకులు కావలసి వచ్చింది. అప్పుడు, ఆ హోల్ సేల్ వ్యాపారం చూసుకోవడానికి రామకృష్ణ తన సోదరుడి కుమారుడు తమ్మిశెట్టి లక్ష్మణరావుని, రెడ్డయ్య తన మేనల్లుడు యింజమూరి శ్రీనివాసరావులను నియమించుకున్నారు. 1986 ఆగస్టులో యింజమూరి శ్రీనివాసరావు ఈ వ్యాపార సంస్థలో అడుగుపెట్టారు. మంగళగిరిలో చీరలతోపాటు ఇతర చేనేత వస్త్రాలు నేయించడం, వాటిని జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడం శ్రీనివాసరావు, లక్ష్మణరావులు చూసేవారు. శ్రీనివాసరావు సౌమ్యుడు, మాటకారి, మర్యాదస్తుడు, కలుపుగోలుతనంతోపాటు నీతి, నిజాయితీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి కావడంతోపాటు రంగులు, డిజైన్ల తయారీలో చురుకుగా ఉండటంతో వ్యాపారంలో దూసుకుపోయారు.
మంగళగిరి చేనేత వస్త్రాల ప్రత్యేకత
అప్పట్లో మంగళగిరిలో 40, 60 నెంబర్ దారంతో సాదా, పేటు చీరలు మాత్రమే ఎక్కువగా నేసేవారు. ఇవి పట్టుబడి చీరలుగా ప్రసిద్ధి చెందాయి. రంగులకు, చేనేత వస్త్రాల మన్నికకు అప్పుడు, ఇప్పుడూ మంగళగిరికి మంచి పేరుంది. నూలుకు వివిధ రకాల రంగుల అద్దకం(డైయింగ్)లో మంగళగిరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీటితోపాటు రంగులు అద్దకం చేసే మేస్త్రీలు, కార్మికుల ప్రత్యేక నైపుణ్యం వల్ల రంగులు చాలా ఆకర్షణీయంగా, మన్నికగా, ఎలవకుండా ఉండేవి. కొన్ని రంగులకు మంగళగిరి ప్రత్యేకంగా నిలిచేది. ముఖ్యంగా పచ్చి మామిడికాయ, మెజంత, చంద్రకాంత రంగుల చీరలను రైతు వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు. నూలును చేనేతకు అనుకూలంగా పడుగుగా తయారు చేయడంలో కూడా నైపుణ్యత గల కార్మికులు ఇక్కడ ఉన్నారు. చీరలు, ఇతర చేనేత వస్త్రాలను దట్టంగా, నైపుణ్యతతో నేయడం మంగళగిరి చేనేత కళాకారుల ప్రత్యేకత.ఈ చేనేత వస్త్రాలు చెమటను ఎక్కువగా పీల్చడం వల్ల కూడా మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు.
మంగళగిరి చేనేత వస్త్రాల తయారీలో కొత్త పోకడలు
రామకృష్ణ, రెడ్డయ్యల సారధ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి డిజైనర్ల సహకారంతో శ్రీనివాసరావు కొత్త కొత్త రంగులు, డిజైన్ల విషయంలో నూతన ఒరవడిని సృష్టించారు. రంగులు వందలు కాదు వేల రకాలు సృష్టించారు. మంగళగిరిలో చింతక్రింది రాధాకృష్ణ అనే చేనేత కార్మికుడితో ఒక మగ్గంపై నేత నేయించడం మొదలుపెట్టి, మంగళగిరి, దాని చుట్టుపక్కల గ్రామాలలో వందల మగ్గాలపై చీరలతోపాటు డ్రెస్ మెటీరియల్, దేశవిదేశాలలో ధరించే అనేక ఇతర చేనేత వస్త్రాలు నేయించారు. ముఖ్యంగా నిజామ్ బోర్డర్ పేరిట తయారైన చీరలు, జాకెట్లు మంగళగిరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మంగళగిరిలో నిజామ్ బోర్డర్ ని మొదలుపెట్టింది వీరే. తొలుత ఢిల్లీలోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐసీ)వారి షోరూమ్ లో 20 చీరలు అమ్మకానికి పెడితే, ఓ గంటలో అమ్ముడుపోయాయి. దాంతో, అప్పటి ఆ సంస్థ ఎండీ మాళవిక ఖన్నా100 చీరలకు ఆర్డర్ ఇచ్చారు. ఆ వంద చీరలు ఆ షోరూమ్ లో అమ్మకానికి పెడితే, ఒక్క రోజులో అమ్ముడుపోయాయి. ఇక వారు వెనక్కి తిరిగి చూడలేదు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, పూనే, బెంగళూరు, హైదరాబాద్ ... వంటి నగరాలలో జరిగే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ నిర్వహించి భారీ స్థాయిలో వ్యాపారం చేశారు. రోజురోజుకు వ్యాపారం పెరుగుతూ వస్తోంది. ఎగ్జిబిషన్స్ లో స్టాల్స్ పెట్టడంతోపాటు హోల్ సేల్ వ్యాపారులకు, సీసీఐసీ, లేపాక్షి... వంటి సంస్థలకు, ఎగుమతిదారులకు వీరు చేనేత వస్త్రాలు సరఫరా చేసేవారు. ఆమ్రస్,.... వంటి అనేకమైన అద్భుతమైన రంగులతో, అత్యాధునిక డిజైన్లతో అన్ని వర్గాల, ముఖ్యంగా సంపన్న వర్గాల మహిళలను ఆకట్టుకునే విధంగా చేనేత చీరలు నేయించి, మార్కెటింగ్ చేశారు. నూతన డిజైన్లు రూపొందించడంలో అబ్రహమ్ ఠాకూర్, మార్తాండ్ సింగ్, రాఖేష్ ఠాకూర్, రీతూకుమార్, బందేజ్ అర్చనా షా, తరుణ్ తహ్లియాన్... వంటి అంతర్జాతీయ డిజైనర్లు వీరికి సహకరించారు. సాధారణంగా చీరలకు పడుగు, పేకలకు ఒకే నెంబర్ దారం వాడతారు. వీరు డ్రెస్ మెటీరియల్ కు పడుగు, పేకల దారం నెంబర్లు మార్చడంతోపాటు కలనేత, మల్టీ కలర్, మిస్సింగ్ చెక్ వంటివి తయారు చేయించారు. కుర్తాకు 80/80 నెంబరు నూలు వాడితే, పైజమాకు 60/40 నెంబర్ల నూలు వాడేవారు. మిస్సింగ్ చెక్ వస్త్రం మొట్టమొదట మంగళగిరిలోనే తయారైంది. దానిని వీరే నేయించారు.
మంగళగిరిలో రహస్యంగా చేనేత ఉత్పత్తులు
1990 దశకంలో అనేక రకాల నూతన వస్త్రాలను వీరు మంగళగిరిలో రహస్యంగా నేయించారు. జపాన్, యూరప్ దేశాలలో మంచి డిమాండ్ ఉన్న స్టోల్స్(24X72) తయారు చేయించారు. ఆయా దేశాలకు ఎగుమతి చేసే ఎగుమతిదారులకు వాటిని సరఫరా చేసేవారు. ఈ వస్త్రాల విషయం ఇతరులకు తెలిస్తే, తమ వ్యాపారానికి పోటీదారులు తయారవుతారని, వీటిని చాలా రహస్యంగా నేయించారు. ఇటువంటి వస్త్రాలు ఇక్కడ తయారయ్యాయని, మంగళగిరిలోని వారికి చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు. క్లోజ్డ్ మగ్గాల షెడ్ల లోపల వీటిని నేసేవారు. తయారైన వస్త్రం వారికి తెలియకుండా బయటకు వెళ్లేదికాదు. ఈ విషయం రహస్యంగా ఉంచమని చేనేత కళాకారులకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పేవారు. అందువల్ల ఎవరికీ తెలియదు. 1987లో అబ్రహమ్, ఠాకూర్ ల ఆర్డర్లపై దుప్పటాస్(36X84) నేయించి, సరఫరా చేశారు. అప్పట్లో నార్నె విజయలక్ష్మీ ప్రభాకర్ అనే కౌన్సిల్ సభ్యురాలు వీరికి సహాయ సహకారాలు అందించారు. మంగళగిరిలో చింతక్రింది రాధాకృష్ణ, అందె రామస్వామి, చింతక్రింది చిన వీరరాఘవులు, అందె కనకలింగేశ్వరరావు, తిరువీధుల సాంబశివరావు, అందె శివశంకరరావు, బిట్రా ఆదినారాయణ, పొట్లాబత్తుని లక్ష్మణరావు, జంజనం మల్లేశ్వరరావు, మునగాల గోపాలకృష్ణ... వంటి వారు వీరికి చీరలు, ఇతర చేనేత వస్త్రాలు నేయించి ఇచ్చేవారు.
విడిపోయిన రామకృష్ణ - రెడ్డయ్య
చేనేత వస్త్ర వ్యాపారం అద్వితీయంగా జరుగుతూ, లక్షల్లో లాభాలు వచ్చే సమయంలో వ్యాపార భాగస్వాములైన రామకృష్ణ-రెడ్డయ్యల మధ్య విభేదాలు వచ్చి 1991లో విడిపోయారు. ఇద్దరూ వేరు వేరుగా వ్యాపారాలు నిర్వహించారు. వారు విడిపోయిన సమయంలో శ్రీనివాసరావు, లక్ష్మణరావులకు వారు చెరో రూ.30వేలు ఇచ్చారు. ఆ తర్వాత శ్రీనివాసరావు, లక్ష్మణరావులు రెడ్డయ్య కొత్తగా ప్రారంభించిన ‘సోలార్ సిస్టమ్’ అనే వ్యాపార సంస్థలో చేరారు. జీతంతోపాటు వారిద్దరికీ లాభాల్లో ఒక్కొక్కరికి 25 శాతం వాటా ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. రెడ్డయ్య వద్ద ఒక ఏడాది బాగా వ్యాపారం చేశారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం రెడ్డయ్య వాటా ఇవ్వకపోవడంతో వారిద్దరూ ఆయన వద్ద మానేశారు. వీరి విషయంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన గజం గోవర్థన్, మంగళగిరికి చెందిన ఇంజమూరి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ లు మధ్యవర్తిత్వం చేసినా ఫలితంలేదు.
శ్రీనివాసరావు- లక్ష్మణరావుల వ్యాపారం
1992 అక్టోబరు 25న రెడ్డయ్య సంస్థ నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసరావు, లక్ష్మణరావులు నవంబరు 5న సొంతంగా ‘శ్రీబాలాజీ శారీస్’ అనే పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. గతంలో రామకృష్ణ-రెడ్డయ్యలు వీరిద్దరికీ ఇచ్చిన రూ.60 వేల పెట్టుబడితో 100 చీరలతో వ్యాపారం ప్రారంభించారు. మంగళగిరిలో చీరలు నేయించే మాస్టర్ వీవర్స్, ఢిల్లీలో కొనుగోలు చేసే హోల్ సేల్ వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల వారు వీరికి పూర్తి సహకారం అందించారు. వాస్తవానికి చీరలు, ఇతర చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేవారికి, ఎగుమతిదారులకు వీరిద్దరు మాత్రమే తెలుసు. అసలు యజమానులు రామకృష్ణ-రెడ్డయ్యలు తెలియదు. వారు ఎప్పుడూ వీరికి కనిపించలేదు. వ్యాపారం మొత్తం వీరిద్దరే చూసేవారు. అందువల్ల, వ్యాపారం వీరిదే అని వారు అనుకున్నారు. ఈ ఇద్దరూ వంద చీరలతో మొదలుపెట్టిన వ్యాపారం ఆరు నెలల్లో నెలకు 500 చీరలకు పెరిగింది. హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో వీరి కార్యాలయం ఉండేది. వ్యాపారం మంచి ఊపందుకుంది. ఫ్యాబ్ ఇండియా, వెస్ట్ సైడ్... వంటి వ్యాపార సంస్థలకు వీరు డ్రెస్ మెటీరియల్, దుప్పటాస్ సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మంగళగిరిలో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడానికి శ్రీనివాసరావు ఎంతగానో దోహదపడ్డారు. 1992 నుంచి 2010 వరకు దాదాపు 18 సంవత్సరాలు వీరిద్దరూ కలిసి భారీ స్థాయిలో వ్యాపారం చేశారు. మంచి లాభాలు గడించారు.
మంగళగిరి చీరలు ప్రముఖుల కొనుగోలు
శ్రీనివాసరావు హయాంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నాగపూర్, కోల్ కతా, హైదరాబాద్ లలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ లో మంగళగిరి చీరలను జాతీయ స్థాయిలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇప్పటికీ వారు కొనుగోలు చేస్తున్నారు. ఒక చీర నచ్చి సోనియా గాంధీ కొనుగోలు చేస్తే, మిస్ యూనివర్స్ సమయంలో ఐశ్వర్యారాయ్ ముచ్చటపడి రెండు డ్రెస్సులు తీసుకున్నారు. శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో బాలీవుడ్ నటీమణులు వైజయంతీమాల, జయాబచ్చన్, షబనా అజ్మీ .. వంటివారితోపాటు తెలుగు నటీమణులు శ్రీదేవి, సౌందర్య, సుమలత... వంటివారు చీరలు కొనుగోలు చేశారు. మంగళగిరి చీరలను రామోజీరావుకు చెందిన కళాoజలి షోరూంకు కూడా వీరు సప్లై చేశారు. ఏపీ గవర్నర్ షిండే వంటి వారు కూడా శ్రీనివాసరావుని అభినందించారు.
విడిపోయిన శ్రీనివాసరావు- లక్ష్మణరావు
వ్యాపారం బాగా సాగే సమయంలో 2010లో విభేదాల కారణంగా శ్రీనివాసరావు, లక్ష్మణరావులు విడిపోయారు. అయితే, తనకు పోటీగా చేనేత వ్యాపారం పెట్టవద్దని లక్ష్మణరావు శ్రీనివాసరావుని కోరారు. చేనేత వ్యాపారం చేయనని శ్రీనివాసరావు ఆయనకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు బాగా తెలిసిన చేనేత వస్త్ర వ్యాపారాన్ని శ్రీనివాసరావు కొనసాగించలేదు. నీతి, నిజాయితీలకు, మాటకు కట్టుబడి ఉండే శ్రీనివాసరావు ఆ తర్వాత నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఆ రంగంలో కూడా ‘మయూరి టెక్ పార్క్’ ద్వారా మంగళగిరికి మంచి గుర్తింపు తెచ్చారు.
చేనేతపై తగ్గని మక్కువ
శ్రీనివాసరావు చేనేత వ్యాపారాన్ని వదిలినా, చేనేతపై మక్కువతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి చెందినవారితో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017లో చేనేతపై ఓ పాట రాయించి, ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణకు చెందిన ఎర్రమాద వెంకన్ననేత జాతీయ చేనేత దినోత్సవం కోసం చాలా కాలం పోరాడారు. చివరికి ఆయన పోరాటం ఫలించి, భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అలాగే, అంతర్జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం కోసం వెంకన్న నేత, మరికొందరు మిత్రులతో కలిసి యింజమూరి శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించాలంటే, యునెస్కో (UNESCO - United Nations Educational, Scientific and Cultural Organization)లోని 194 సభ్య దేశాలలో మెజార్టీ సభ్యదేశాలు అంగీకరించవలసి ఉంది. ఇందుకోసం, అంతర్జాతీయంగా వివిధ దేశాలలో చేనేత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు తమ మిత్ర బృందంతో కలిసి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా దేశాలలో ప్రదర్శనలు నిర్వహించారు. చేనేతపై మక్కువతోనే ఆయన ఇప్పటికీ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో, వరల్డ్ వీవర్స్ ఫోరమ్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు.
నిర్మాణ రంగంలో కూడా రాణించిన శ్రీనివాసరావు
శ్రీనివాసరావు ఏ రంగంలో అడుగుపెట్టినా, ఆ రంగంలో మెళకువలు తెలుసుకుని దూసుకుపోతారు. వస్త్ర వ్యాపారం చేసే రోజులలో వచ్చిన లాభాలతో ప్రతి ఏడాది మంగళగిరి, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు. ఆ భూముల ధరలు ఏడాదికేడాది పెరుగుతూ వచ్చాయి. నిర్మాణ రంగంలో దిగడానికి ఆ భూములు బాగా ఉపయోగపడ్డాయి. అప్పట్లో కొన్న భూములు ఇప్పటికీ కొన్ని అలానే ఉన్నాయి. నిర్మాణ రంగంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అవే అడ్డుపడుతున్నాయి. అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తన మేనమామ తోడల్లుడు శీలం ఏడుకొండలు భాగస్వామ్యంతో 2010లో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వారి భాగస్వామ్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వారి పిల్లలు కూడా ఆ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. తొలుత బెంగళూరులో నిర్మాణాలు మొదలుపెట్టారు. 24 ఫ్లాట్ల ప్రాజెక్ట్ తో ప్రారంభమైన వారి వ్యాపారం, 66 ఫ్లాట్లు, 92 ఫ్లాట్ల అపార్ట్ మెంట్లు, కమర్షియల్ నిర్మాణాలు చేపట్టి, విజయవంతంగా కొనసాగించారు. 2015 వరకు అయిదు ప్రాజెక్టులు పూర్తి చేశారు. రాష్ట్ర విభజనతో శ్రీనివాసరావు కన్ను మళ్లీ సొంత ఊరు మంగళగిరిపై పడింది. అప్పట్లో ఆయన చేనేత వ్యాపారం కూడా ఇక్కడే ప్రారంభించి విజయం సాధించారు. ఇప్పుడు మంగళగిరి రాజధాని అమరావతిలో భాగమైంది. టెక్నాలజీ పార్క్ ఆలోచనతో ఉన్న ఏపీ ప్రభుత్వంతో 2017లో రెంటల్ గ్యారంటీ ప్రోత్సాహక ఒప్పందం చేసుకున్నారు. మంగళగిరిలోని జాతీయ రహదారి పక్కన రెండెకరాల స్థలంలో ఎనిమిది అంతస్తుల ‘మయూరి టెక్ పార్క్’ నిర్మాణం చేపట్టారు. అయితే, 2019లో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఉన్నవారందరికీ కష్టాలు మొదలైనట్లే, వీరికి కూడా కష్టాలు మొదలయ్యాయి. రెంటల్ గ్యారంటీ ప్రోత్సాహక ఒప్పందం రద్దయింది. బెదిరింపులు మొదలయ్యాయి. పెట్టుబడి మొత్తం అలా నిలిచిపోయింది. అయినా, భాగస్వాములు ఇద్దరూ ధైర్యంగా నిలబడ్డారు. ఇబ్బందులను ఎదుర్కొంటూ, అలాగే నిర్మాణాన్ని మందకొడిగా కొనసాగించారు. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో వీరి దశ తిరిగింది. మయూరి టెక్ పార్క్ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ 350 కార్లు పార్కు చేసుకోవచ్చు. స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(RTIH) కోసం మయూరి టెక్ పార్క్ లో ఒక ఫ్లోర్ రెంట్ కు తీసుకున్నారు. దాంతో, ఈ పార్క్ రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించింది. 2025 ఆగస్టు 25న ఈ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.
చంద్రశేఖరన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ హబ్ను ప్రారంభించారు. శ్రీనివాసరావు కష్టం ఫలించింది. ఆ పక్కనే ఉన్న మరో రెండెకరాల స్థలంలో రెండవ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు కుమారుడు హేమంత్, భాగస్వామి ఏడుకొండలు కుమారులు సాయి శ్రీనివాస్, రాంబాబులు రంగంలోకి దిగారు. వారు నిర్మాణాలను చూస్తుంటే, పెద్దలు ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు.
శ్రీనివాసరావు బాల్యం
చేనేత వస్త్రాల అమ్మకం, నిర్మాణ రంగంలో మంగళగిరిని ఒక స్థాయిలో నిలిపిన శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యింజమూరి భాస్కరరావు, పిచ్చమ్మ దంపతులకు 1966 ఆగస్టు 10న అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జన్మించారు. శ్రీనివాసరావుకు అన్న ఫణి కుమార్, తమ్ముడు వెంకటేశ్వరరావు ఉన్నారు. ఉద్యోగరీత్యా తండ్రి ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ అయినందున ఆయన విద్యాభ్యాసం పలు చోట్ల జరిగింది. అక్షరాభ్యాసం నాగార్జున సాగర్ లో జరిగితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ లో 2వ తరగతి వరకు చదివారు. ఖమ్మంలో 4వ తరగతి వరకు, నర్సరావుపేటలో 6వ తరగతి, మచిలీపట్నంలో 7వ తరగతి చదివారు. 8వ తరగతి నుంచి డిగ్రీ బీకాం వరకు అప్పటి కృష్ణా జిల్లా, ఇప్పటి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చదివారు. 1987లో వాళ్ల నాన్న రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి, అక్కడ స్టెనో జాబ్ ఇప్పించారు. ఆ జాబ్ ఒక్క రోజు మాత్రమే చేసి, నచ్చక రాజీనామా చేశారు. దాంతో, వాళ్ల నాన్న ఆగ్రహానికి గురైతే, వాళ్ల అమ్మే అడ్డుకుని ఆదుకున్నారు.
శ్రీనివాసరావు - సీతామహాలక్ష్మిల వివాహం
గుంటూరుకు చెందిన శీరపు సూర్యనారాయణ, సర్వలక్ష్మిల కుమార్తె సీతామహాలక్ష్మిని 1993 ఏప్రిల్ 24న శ్రీనివాసరావు వివాహం చేసుకున్నారు. అన్యోన్య దంపతులుగా వారు జీవితం కొనసాగిస్తున్నారు. తన భార్య తనకు అన్ని విధాల ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు చెబుతారు. సీతాదేవి వంటి భార్య దొరకడం తన అదృష్టంగా ఆయన భావిస్తారు. ఆయన ఎదుగుదలలో, వారి కుటుంబ వ్యవస్థ బలీయంగా ఉండటంలో ఆమె పాత్ర కీలకం. శ్రీనివాసరావుకు కుమారుడు హేమంత్, కుమార్తె హారిక ఉన్నారు. హేమంత్ బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి, అమెరికాలోని మియామి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ నిర్మాణరంగంలో స్థిరపడ్డారు. హారిక డిగ్రీ పూర్తి చేశారు. కుమార్తెను హిందూపురంలోని వస్త్ర వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు.
సేవా కార్యక్రమాలు
యింజమూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ సిబ్బంది పిల్లలకు, పేద పిల్లలకు చదువులకు సహాయం చేస్తుంటారు. తిరుపతి, శ్రీశైలం అన్నదాన సత్రాలలో ఒక్కో రూమ్ కట్టించారు. అమరావతి దేవాలయంలో వారి తల్లిదండ్రుల పేర్లపై ఒక రూమ్ నిర్మించారు. అలాగే, హైదరాబాద్ లోని పద్మశాలి వృద్ధాశ్రమంలో ఒక రూమ్ కట్టించారు. మంగళగిరిలోని మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుంటారు. శ్రీనివాసరావు తన అన్నదమ్ములు, ఇతర బంధువుల ఆడపిల్లలు 11 మందిని తమ వద్దనే ఉంచుకుని చదివించారు. వారు అన్ని విధాల ఎదగడానికి, వారి వివాహాల విషయంలో సహాయసహకారాలు అందించారు. ఈ విషయంలో ఆయన భార్య సీతామహాలక్ష్మి గొప్పతనాన్ని అభినందించాలి. శ్రీనివాసరావు వద్ద పనిచేసిన ఉద్యోగులు, వాచ్ మెన్, తోట కాపలాదారుల పిల్లలు అందరినీ ఉన్నత చదువులు చదివించారు. వారిలో సీఏ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తన వద్ద అకౌంటెంట్ గా పని చేసిన ఉద్యోగికి ఒక ఫ్లాట్ కూడా ఉచితంగా రాసి ఇచ్చారు. ఆయన ఉదార స్వభావానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
మా నాన్నంటే నాకు చాలా ఇష్టం
రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో తహశీల్దార్ వద్ద తన తండ్రి డ్రైవర్ గా ఉద్యోగం చేసినప్పటికీ ఒక్క పైసా కూడా ఏనాడూ లంచం తీసుకోలేదు. నిజాయితీగా ఉండేవారు. అందుకే, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అని శ్రీనివాసరావు చెప్పారు. ఆయన జీవిత కాలంలో ఒక్క రూపాయి దాచిపెట్టలేదు. ఒక్క ఇంటి స్థలం కొనలేదు. సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు. అంత నిజాయితీగా ఉద్యోగం చేసి, మా ముగ్గురు అన్నదమ్ములను పెంచి, పెద్ద చేశారు.
నాన్న తోడబుట్టినవారిని విమానం ఎక్కించి, శ్రీవారి దర్శనం
శ్రీనివాసరావు తన తండ్రి భాస్కరరావు తోడబుట్టిన శివసత్యనారాయణ, బాపనయ్య, మాధవరావు, గోపాలకృష్ణ అయిదుగురు అన్నదమ్ములను తొలిసారిగా విమానం ఎక్కించి హైదరాబాద్ నుంచి తిరుపతి తీసుకువెళ్లారు. శ్రీవారి ఆలయంలో ఉదయం అన్ని సేవలు అయ్యేంతవరకు శ్రీవెంకటేశ్వరుడికి పది అడుగుల దూరంలో కూర్చొని దాదాపు గంటసేపు తనివితీరా చూసి తరించారు. అద్వితీయమైన ఆనందం పొందారు. ‘‘అది ఓ మిరాకిల్’’ అని శ్రీనివాసరావు బాబాయి మాధవరావు అన్నారు. ఆ అయిదుగురులో ఈయన ఒక్కరే జీవించి ఉన్నారు.
-----------------------------------------------------------------------------------------
మూస విధానం నుంచి ఆధునిక హంగులు
మంగళగిరి చీరలు 1986 వరకు ఒక మూస విధానంలో తయారు అవుతూ పట్టుబడి చీరలుగా ప్రసిద్ధి చెందాయి. అవి కొన్నిప్రాంతాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ సమయంలో వీవర్స్ సర్వీసు సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జంజనం రెడ్డయ్య, పద్మశాలి ప్రముఖులు తమ్మిశెట్టి రామకృష్ణ కలిసి వ్యాపార సంస్థను స్థాపించి, మొట్టమొదటి సారిగా ఒకప్పటి నిజాం కాలంనాటి ‘నిజాంబోర్డర్’ చీరలు తయారు చేసి వాటిని మార్కెట్ కి పరిచయం చేశారు. ఆ మహానుభావుల దగ్గర పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మొట్టమొదటి చేనేత ప్రదర్శన క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దానిని ఆరంభించి, మా చీరలు, దుప్పట్టాలు భాగ్యనగర ప్రజలకు పరిచయం చేశారు. క్రాఫ్ట్ కౌన్సిల్ మొట్టమొదటి చైర్ పర్సన్ కమలమ్మ, ఆ తరువాత ఢిల్లీ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మాళవిక ఖన్నా మా చీరలు మెచ్చి వారి స్టోర్స్ కోసం కొనుగోలు చేశారు. మా నిజాం బోర్డర్ చీరలు ప్రపంచానికి పరిచయం చేశారు. డ్రెస్ మెటీరియల్ ఆవిర్భావానికి ఆద్యులు విజయలక్ష్మీ ప్రభాకర్. ఆమె ప్రోద్భలంతోనే మొట్టమొదటిసారిగా బ్లౌజ్ మెటీరియల్ తయారుచేసి మార్కెట్ కి పరిచయం చేశాం. లేపాక్షి ఎండీ గాయత్రీ రామచంద్రన్, జగదా రాజప్ప, క్రాఫ్ట్ కౌన్సిల్ సభ్యులు లలితా ప్రసాద్, ఉషమ్మ, మీనాక్షి, నివేదిత, కృష్ణారావు, సునీలాగజపతి, అంజు, పోద్దార్, అంజనా సోమాని, ఆషారెడ్డి, ప్రముఖ డిజైనర్లు రాకేశ్, ఠాకూర్, మాపు(మార్తాండ్, సింగ్ ) తదితరులు సహకారం అందించారు. వారిని ఎన్నటికీ మరువలేము. వాస్తవంగా మంగళగిరి ఎదిగిన విధానం ఇలా ఉంటే, కొంతమంది స్వార్ధపరులు గతం మరిచి తామే నిజాంబోర్డర్ ని పుట్టించినట్లు ఈ సమాజానికి తప్పుడు మెసేజ్ ఇవ్వడం బాధాకరం. నిజాం బోర్డర్ ని తయారు చేసి మంగళగిరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన మా గురువులకు శతకోటి వందనాలు. మంగళగిరి చీరల ఆవిర్భావం గురించి చరిత్ర మొత్తం తెలిసిన వ్యక్తులు పద్మశ్రీ గజం గోవర్ధన్, పద్మశ్రీ గజం అంజయ్య, ఉప్పాడ సత్యనారాయణ, గద్వాల్ సత్యనారాయణ, మంగళగిరి చీరలు మార్కెట్ కి పరిచయం చేసి ఊరు ఉన్నతికి కారకులైన మా గురువులు జంజనం రెడ్డయ్య, తమ్మిశెట్టి రామకృష్ణలకు హృదయపూర్వక వందనాలు.
మీ
యింజమూరి శ్రీనివాసరావు
మంగళగిరి గర్వించతగ్గ స్థాయికి ఎదిగిన యింజమూరి శ్రీనివాసరావు
బీసీ వర్గం చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టిన యింజమూరి శ్రీనివాసరావు అటు మంగళగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు ఇటు ఆధునిక అమరావతిలో నిర్మాణ రంగంలో కూడా మంగళగిరి గర్వించతగ్గ స్థాయికి ఎదిగారు. ఆనాడు యుక్త వయసులో చేనేత రంగానికి, నేడు నిర్మాణ రంగంలో మయూరి టెక్ పార్క్ ద్వారా మంగళగిరికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. ఈ మయూరి టెక్ పార్క్ భవనంలోని రెండు ఫ్లోర్లు( 4, 6) 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' (RTIH) ను ఏర్పాటు చేశారు. మరో ఫ్లోర్ లో మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండవ ఫ్లోర్ లో మైనింగ్ శాఖ కార్యాలయం, 5వ ఫ్లోర్ లో ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్, 7వ ఫ్లోర్ లో గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగాల వారి కార్యాలయాలు ఉన్నాయి. యింజమూరి శ్రీనివాసరావు సాధారణ కుటుంబంలో జన్మించి, ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914













.jpeg)








.jpeg)
