Jul 5, 2026

36 ఏళ్ల తర్వాత… విశాఖ-ఆంధ్రజ్యోతి టీమ్ రీయూనియన్



ఒకప్పుడు వార్తల కోసం ఊళ్లు తిరిగిన మేము…

ఈరోజు జ్ఞాపకాల కోసం ఒకచోట చేరాం!

అప్పుడు “బ్రేకింగ్ న్యూస్” కోసం పరుగులు…

ఇప్పుడు “షుగర్ ఎంత?”, “బీపీ ఎంత?” అన్నదే బ్రేకింగ్ న్యూస్! 

రమణమూర్తి పెద్దరికం ఇంకా అలాగే…

నవతమ్మ ఉండతనం ఏమాత్రం తగ్గలేదు…

రఘు కంగారు ఇప్పటికీ అదే…

సాగర్ చిరునవ్వు మాత్రం ఎవర్‌గ్రీన్…

కళ్యాణ్ చిలిపి పనులు ఇంకా ఆగలేదు…

సుబ్బు సెటైర్లు ఇప్పటికీ ఫుల్ ఫామ్‌లోనే…

సాంబ చూపులు మాత్రం అందరినీ నవ్వించేశాయి…

నారాయణరావు నెమ్మది చూసి గడియారం కూడా ఆగిపోతుందేమో అనిపించింది! 

మాటల్లో ఆటలు…

నవ్వుల్లో జ్ఞాపకాలు…

ఒక్కరోజు పాటు మళ్లీ 36 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం.

చివరికి తీసుకున్న ఈ గ్రూప్ ఫోటో…

ఒక ఫోటో కాదు…

మా యవ్వనాన్ని మళ్లీ ఒకసారి ఫ్రేమ్‌లో బంధించిన మధుర జ్ఞాపకం!

ఆంధ్రజ్యోతి పాత టీమ్…

వయసు పెరిగింది… కానీ అల్లరి మాత్రం ఇంకా తగ్గలేదు! ❤


ఫొటోగ్రాఫర్ విజయ్

ఆంధ్రజ్యోతి పరివారం -1

ఆంధ్రజ్యోతితో నా అనుబంధం 42 ఏళ్ల నాటిది

 
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో నేను రాసిన మొట్టమొదటి ఎడిటోరియల్ పేజీ ఆర్టికల్ 1984లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అప్పట్లో దానికి పారితోషికంగా రూ.50లు ఎంఓ చేశారు. నేను రాసిన ఆర్టికల్ కి ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారే హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి విశాఖలో చేరడానికి ముందు చేసిన ఇంటర్వ్యూలో, నేను ఆ ఆర్టికల్ చూపించాను. ఆ హెడ్డింగ్ తానే పెట్టినట్లు చెప్పి, ఆరోజు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆప్పటి నుంచి తరచూ నా ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వస్తూనే ఉన్నాయి. 1991-95 కాలంలో దాదాపు 5 ఏళ్లు విశాఖ-ఆంధ్రజ్యోతిలో పని చేశాను. ఎక్కువ కాలం  సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేశాను. విశాఖలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ కరోనా సమయంలో రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను.

Jun 15, 2026

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

 

మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున రావులను ఆ టెక్ పార్క్ బిల్డర్లలో ఒకరైన యింజమూరి శ్రీనివాసరావు ఆదివారం రాత్రి సన్మానించారు. చేనేత నేత గుత్తికొండ ధనుంజయ రావు 14 ఏళ్ల వయసులోనే టీడీపీలో చేరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగి, ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.  ప్రముఖ అభ్యుదయ కవి  గోలి మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ, ఎదురీత వంటి కవితా సంపుటిలతో తెలుగు కవితా లోకంలో తనకంటూ ఒక పేజీని సొంతం చేసుకున్నారు. మంగళగిరిలో జర్నలిజంలో మొట్టమొదట మాస్టర్ డిగ్రీ చేసిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రిపోర్టర్-సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు ప్రముఖ దినపత్రికలలో పనిచేసి,  40 ఏళ్లకుపైగా అనుభవంతో ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం రాశారు. ఈ ముగ్గురుని యింజమూరి శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించి, గౌరవించారు.

















Jun 12, 2026

తొలి సన్మానం


నాకు తొలి సన్మనం జరిగిన ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది. సాదారణంగా నాకు సన్మానాలంటే ఇష్టం ఉండదు. అందువల్ల ఎవరైనా సన్మానం చేస్తానంటే వద్దని చెప్పేవాడిని. సంవత్సరం సరిగా గుర్తులేదు, 2002 లేదా 2003లో కడప జిల్లా  ప్రొద్దుటూరు సన్మానం చేయించుకోవలసి వచ్చింది. అక్కడి దేవాలయాలు చూడటానికి మా కుటుంబంతో వెళ్లాను.  అప్పుడు అక్కడి వార్త స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ దగ్గర ఉండి, దేవాలన్నీ చూపించారు. చివరికి ఒక దేవాలయంలోకి వెళ్లినప్పుడు, దర్శనం అయిన తర్వాత ‘‘ఆలయ కమిటీవారు మీకు సన్మానం చేస్తారట’’ సార్ అని ప్రసాద్ చెప్పారు. ‘‘నాకు సన్మాలంటే ఇష్టం ఉండదు, వద్దు’’అని చెప్పాను. అయితే, ప్రసాద్ పట్టుబట్టారు. ‘‘ఇక్కడ బహుభాషా కోవిదుడు, 'సరస్వతీపుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ అగస్తేశ్వర ఆలయంలోనే ఈ చెట్టు క్రింద కూర్చొని   ‘శివతాండవం’ కావ్యం రాశారు. అదే చెట్టు క్రింద మీకు సన్మానం చేస్తారు. వద్దనకండి సార్’’బతిమిలాడినట్లు అడిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే నాకు తొలిసారిగా సన్మానం చేశారు.  పుట్టపర్తి నారాయణాచార్యులు అత్తగారి ఊరు  ప్రొద్దుటూరు. ఆయన అక్కడ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే శివతాండవం కావ్యం రాశారు. 


https://www.youtube.com/watch?v=wSsDbPTmc_k



Jun 10, 2026

పౌరహక్కుల బాలగోపాల్


భారతదేశపు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, గొప్ప ఆలోచనాపరుడు, న్యాయవాది మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల ఉద్యమానికి ఆయన ఒక దిక్సూచిగా నిలిచారు. సమాజంలోని అణగారిన, దళిత, గిరిజన వర్గాల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కె. బాలగోపాల్ (కందళ్ల బాలగోపాల్) జయంతి జ్ఞాపకం

కె. బాలగోపాల్ గారు 1952 జూన్ 10న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించారు. అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం ఆయన స్వస్థలం. ఈయన తల్లిదండ్రులు నాగమణి, పార్థనాథశర్మ. ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఈయనకు మాతామహుడు (తాత). ప్రముఖ రచయిత్రి, టీవీ సమర్పుకురాలు మరియు మాజీ తెలుగు విశ్వవిద్యాలయ ప్రో. మృణాళిని గారు వారి చెల్లెలు. ప్రసిద్ధ పాత్రికేయురాలైన వసంత లక్ష్మి ఈయన భార్య.
......
బాలగోపాల్ అసాధారణమైన మేధావి. వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుత NIT) నుండి గణితంలో డాక్టరేట్ (Ph.D) పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్-డాక్టోరల్ పరిశోధన కూడా చేశారు.
......
1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధించారు. పోలీసుల నుండి ప్రాణహాని ఎదురవడంతో ఆయన తన అధ్యాపక పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పౌర హక్కుల కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. మొదట ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ (APCLC)కి 15 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత 1998లో తాను స్థాపించడంలో సహాయపడిన హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF) అనే సంస్థలో పనిచేశారు.
▪️పౌరహక్కుల ఉద్యమం
1) APCLC లో పాత్ర: 1983 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
2) మానవ హక్కుల వేదిక (HRF): నక్సలైట్లు/మాోయిస్టుల హింసను, అలాగే ప్రభుత్వ రాజ్యహింసను (బూటకపు ఎన్‌కౌంటర్లు) ఒకేలా వ్యతిరేకించాలనే సైద్ధాంతిక భేదాల వల్ల ఆయన APCLC నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత 1998లో మానవ హక్కుల వేదిక (Human Rights Forum - HRF) ను స్థాపించారు.
3) దేశవ్యాప్త పర్యటనలు: కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ అల్లర్ల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా అక్కడికి వెళ్లి నిజనిర్ధారణ నివేదికలు (Fact-finding reports) రూపొందించారు.
.....
దాదాపు మూడు దశాబ్దాల గణతంత్ర రాజ్యం సంక్షోభంలోకి జారిన 1975 నాటి భారత అత్యవసర పరిస్థితి వల్ల రాజకీయ చైతన్యం పొందిన తరానికి బాలగోపాల్ చెందినవారు. ఏకపక్ష అరెస్టులు, విచారణ లేని నిర్బంధాలు, మర్మమైన మరణాలు నిరంకుశ రాజ్యం రాకకు సంకేతాలుగా నిలిచాయి. సార్వభౌమ శ్రేయస్సు పేరిట అలా చేస్తున్నామని ప్రకటిస్తూనే, తమ దేశ-రాజ్యం ఏమి చేయగలదో, శిక్ష నుండి ఎలా తప్పించుకోగలదో భారత పౌరులు ముందుగానే రుచి చూశారు. యువకుడిగా, విమర్శనాత్మక దృక్పథంతో ఉండటం అంటే ఆనాటి పరిస్థితులతో మమేకమవ్వడమే. బాలగోపాల్ కూడా అలాగే చేశారు: మార్క్సిజంపై ఆసక్తితో మొదలుపెట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పోరాటపటిమ గల వామపక్ష రాజకీయాలను అనుసరించారు, వాటికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా, గ్రామీణ ఆంధ్రలోని ఆదివాసులు, దళితులతో కూడిన అతిపెద్ద అణగారిన వర్గాలను ఒక బలమైన రాజకీయ శక్తిగా సంఘటితం చేయడంలో ఆ వామపక్షాలు చేసిన కృషికి ఆయన అండగా నిలిచారు.
▪️ప్రజా న్యాయవాదిగా (Lawyer)
అణగారిన వర్గాల తరఫున కోర్టుల్లో పోరాడేందుకు ఆయన తన 40 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రం (Law) చదివి న్యాయవాదిగా మారారు.పోలీసు బూటకపు ఎన్‌కౌంటర్లు, లాకప్ డెత్‌లు, చుండూరు దళిత నరమేధం వంటి అనేక కేసుల్లో బాధితుల తరఫున పైసా ఖర్చు లేకుండా వాదించి ఉచిత న్యాయ సహాయం అందించారు.
.......
మన జనాభాలోని అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన భూమి, వనరులను పొందే హక్కులు, మరియు హక్కుల కోతకు సంబంధించిన కేసులను ఆయన చేపట్టారు. తన న్యాయవాద వృత్తిలో ఎంతో నిశితంగా ఉంటూ, రాజ్యాంగంలో పొందుపరచబడిన అటువంటి హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, భారత కుల సమాజం యొక్క 'చట్టవిరుద్ధ' స్వభావం గురించి ఆయనకు ఎలాంటి భ్రమలు లేవు. అంతేకాకుండా, దేశంలోని చాలా ప్రాంతాలలో ప్రాచీన శాసనకర్త అయిన మనువు యొక్క శాసనం ఇప్పటికీ అమలులో ఉందని ఆయన అనేక సందర్భాలలో ఎత్తి చూపారు. అందువల్ల, హక్కుల ఉద్యమాలు ప్రభుత్వ తప్పిదాల వల్ల కలిగే ఉల్లంఘనలతో పాటు, పౌర శిక్షా రాహిత్యం వల్ల కలిగే ఉల్లంఘనలతో కూడా నిరంతరం పోరాడవలసి వచ్చింది.
▪️రచయితగా మరియు ఆలోచనాపరుడిగా...
బాలగోపాల్ గారు పౌర హక్కుల కార్యకర్త కావడంతో పాటు, ఒక గొప్ప రచయిత కూడా. ఆయన గొప్ప ఒరిజినల్ థింకర్ (మౌలిక ఆలోచనాపరుడు). కులం, వర్గం, ప్రజాస్వామ్యం, ఆర్థిక విధానాలపై ఆయన రాసిన వ్యాసాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ప్రసిద్ధ వారపత్రిక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (EPW) లో మూడు దశాబ్దాల పాటు అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. ఆయన రాసిన వ్యాసాల సంకలనాలు 'Ear to the Ground' వంటి పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి.
......

ఆయన తెలుగు, ఆంగ్ల భాషలలో హక్కుల విషయాలపై రాశారు. ఆయన వ్యాసాలు దాదాపు ఎల్లప్పుడూ కేవలం జరిగిన సంఘటనల నివేదికల కన్నా ఎక్కువగా ఉండేవి. ఈ విషయంలో ఆయన ఒక కొత్త రాత ప్రక్రియకు మార్గదర్శకుడని చెప్పవచ్చు; అది వర్ణనాతీతమైనది: స్థానిక వివరాలు, చరిత్రలపై నిష్కళంకమైన శ్రద్ధ చూపుతూనే, వేగవంతమైన, హింసాత్మక పరివర్తనలో ఉన్న ఒక సమాజంలోని వర్గ, కుల స్వరూపాలను మనకు వివరిస్తూ, ఆయన విస్తృత చిత్రాన్ని ఆవిష్కరించగలిగారు. చివరికి, ఒక సంఘటనను దాని తక్షణ, చారిత్రక సందర్భాలలో, వర్గాలు, కులాల మధ్య మరియు భారత ప్రజలకు, భారత రాజ్యానికి మధ్య మారుతున్న సామాజిక, రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఎలా 'చదవాలో' మనం నేర్చుకున్నాం.
▪️హిందుత్వ ఆవిర్భావాన్ని రాజకీయ విశ్లేషణలో ప్రతిభావంతుడు....
అదేవిధంగా, హిందూ మితవాదంపై ఆయన రాసిన అనేక రచనలలో స్పష్టంగా కనిపించే, భారతదేశంలోని రాజకీయ జీవితంలోని నిరంకుశ అంశాలపై ఆయనకున్న అవగాహన, హిందుత్వ యొక్క వికారమైన స్వరూపాలను వివరిస్తూ, కొత్త దిశలను సూచిస్తున్నాయి: హిందుత్వ ఆవిర్భావాన్ని వీలైనంత కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం, మరియు ప్రజాస్వామ్య వైఫల్యం, అంతేకాక రాజకీయ అవకాశవాదం కలిసి మితవాదానికి ఏ విధంగా కొంత రాజకీయ గౌరవాన్ని సంపాదించిపెట్టాయో తెలుసుకోవాల్సిన అవసరం.
రాజకీయ విశ్లేషణలో ప్రతిభావంతుడు, సామాజిక తార్కికంలో నిశిత పరిశీలకుడు అయిన బాలగోపాల్, అన్నింటికంటే ముఖ్యంగా జీవన నైతికత గురించి, మనం ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దాని గురించి ఆందోళన చెందారు. అన్నింటికన్నా మించి, సమానత్వం మరియు న్యాయం కోసం మన సామూహిక హక్కులను ధృవీకరిస్తూ, గౌరవ స్ఫూర్తితో మనం ఒకరితో ఒకరు ఎలా జీవించగలమోనని ఆయన తీవ్రంగా మదనపడ్డారు.
......
బాలగోపాల్ అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. ఎప్పుడూ రైళ్లలో సాధారణ క్లాస్‌లోనే ప్రయాణిస్తూ, ప్రజల సమస్యల కోసం నిరంతరం శ్రమించేవారు. తెలుగు సమాజానికి ఒక 'కన్సైన్స్ కీపర్' (వివేక సాక్షి)గా నిలిచిన ఆయన, 2009 అక్టోబర్ 8న గుండెపోటుతో మరణించారు.

‘సహకార భూమి’కి సంపూర్ణంగా సహకరిస్తాం

సహకార వ్యవస్థకు ఓ దిక్సూచి ఈ పత్రిక

ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎండీ రామకృష్ణ భరోసా


సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి. రామకృష్ణ, నాబార్డ్ డిజిఎం ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి తదితరులు
 

విజయవాడ, జూన్ 9: సహకార రంగం విలువలు, విశిష్టత, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా కృషిచేస్తున్న ‘సహకారభూమి’ పక్షపత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) అండగా నిలుస్తుందని సంస్థ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ భరోసా ఇచ్చారు. సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను విజయవాడలోని సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని విశిష్ట అతిథిగా హాజరైన నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి, మలి ప్రతిని గౌరవ అతిథి ఆర్.వి. రామకృష్ణకు అందజేశారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని మాట్లాడుతూ.. సహకార రంగం బలోపేతానికి ఇటువంటి పత్రికలు అత్యంత అవసరమని చెప్పారు. సహకారభూమి వ్యవస్థాపకులైన సహకారవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, సంఘాలు ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా, సహకార ఉద్యమం సజీవంగా ఉండాలని, దాని విలువలు సమాజానికి తెలియజేయాలనే మహోన్నత లక్ష్యంతో ఈ పత్రికను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సహకార రంగానికి సంబంధించిన సమాచారం, చరిత్ర, విలువలు, స్ఫూర్తిదాయక గాథలను ప్రజలకు చేరవేస్తూ సహకారభూమి ఒక ఉద్యమంలా పనిచేస్తోందని గన్ని కితాబిచ్చారు. సహకారభూమి కార్యాలయంలో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించే నినాదాలు, సహకార ఉద్యమ ప్రముఖుల చిత్రాలు, వారి సేవలను ప్రదర్శించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సహకారోద్యమ సీనియర్ నాయకుడు దాసరి కేశవులును హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ‘సహకారం మన సంస్కృతి -  సహజీవనం మన సంప్రదాయం, సంఘశక్తే సహకార శక్తి’ వంటి సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతున్నా, సహకార రంగానికి సంబంధించిన అవగాహన కల్పించే పత్రికల అవసరం మరింత పెరిగిందన్నారు. సహకార రంగంలో జరుగుతున్న సేవలు, విజయాలు, సవాళ్లు ప్రజలకు తెలియాలంటే సహకారభూమి వంటి వేదికలు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని గన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో సహకారభూమి పత్రికకు సంస్థాగత మద్దతు అందించే అంశాన్ని ఆప్కాబ్ స్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్) స్థాయిలో పత్రిక విస్తరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆప్కాబ్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి, సహకారభూమికి సాధ్యమైనంత సహకారం అందించే దిశగా కృషి చేస్తామని గన్ని వివరించారు.

సహకార రంగానికి సేవలందిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు అందించగలిగే మద్దతు, సహాయంపై నాబార్డ్ అధికారులతోనూ చర్చిస్తామని తెలిపారు. సహకారభూమి సహకార విలువలను పరిరక్షిస్తూ, రైతులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, మేధావుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించే దిశగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాబోయే తరాల మనస్సుల్లో సహకార భావజాలం నిలిచిపోయేలా పత్రిక చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ ఎడిటర్ అక్బర్ పాషా, న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణ, పత్రిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పత్రిక డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రావాలని సూచిస్తూ, అందుకు వ్యయమయ్యే 50 వేల రూపాయలు, పత్రిక కార్యాలయం నిర్వహణకు మరో 10 వేల రూపాయలను వ్యక్తిగత విరాళంగా ప్రకటించి, అక్కడికక్కడే అందజేశారు. 

గౌరవ అతిథిగా హాజరైన ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ సందేశమిస్తూ.. పత్రిక అన్ని సంఘాలకు చేరాల్సిన అవసరముందని, ఇందుకు ఆప్కాబ్ చేయూతనిస్తుందని చెప్పారు. వెబ్సైట్ రూపకల్పన కోసం ఆయన కూడా సంస్థ తరపున 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఆప్కాబ్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. విశిష్ట అతిథిగా నాబార్డ్ ప్రతినిధి చంద్ర మూర్తి సందేశమిస్తూ.. సహకారభూమి పత్రిక అత్యవసరంగా డిజిటల్ రూపంలోకి రావాల్సిన అవసరముందన్నారు. పత్రికకు నాబార్డ్ అందించే సాయంపై కూడా ఆలోచన చేస్తామని, తమ సంస్థ నుంచి కూడా సాంకేతిక సహకారం పొందవచ్చని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి వెటరన్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మావతి అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయుల సంఘ నేత చావా రవి సభకు స్వాగతం పలికారు. సీనియర్ సహకరవాదులు, జర్నలిస్టులు దాసరి కేశవులు, ఇఫ్కో రవీంద్ర, జి.వి. రంగారెడ్డి, శిరందాసు నాగార్జున, ప్రసాదరెడ్డి, టి.వి. నరసింహారావు, దుర్గరాజు స్వాతి, డి. రామారావు, వై. శ్రీనివాసరావు, శివప్రసాద్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Jun 4, 2026

చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగానే పూర్తి పెన్షన్‌ లెక్కింపు

 

ఈపీఎఫ్ఓ (EPFO) అవలంబిస్తున్న 'ప్రొ-రేటా' (Pro-rata) పద్ధతిని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది. సర్వీస్ కాలాన్ని విభజించి పెన్షన్‌ను తగ్గించే పాత పద్ధతి చెల్లదని, పదవీ విరమణ సమయంలో చివరిగా తీసుకున్న 60 నెలల సగటు వేతనం ఆధారంగానే పూర్తి పెన్షన్‌ను లెక్కించాలని స్పష్టం చేసింది.

ఈపీఎఫ్ పెన్షన్ లెక్కింపుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల వివరాలు:

ప్రొ-రేటా పద్ధతి రద్దు: 2014 సవరణ తర్వాత ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ప్రొ-రేటా పద్ధతిని కోర్టు తప్పుబట్టింది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ భారీగా తగ్గిపోతుందని పేర్కొంది. 

సరైన లెక్కింపు సూత్రం: పదవీ విరమణకు ముందున్న చివరి 60 నెలల (5 సంవత్సరాలు) సగటు జీతం ఆధారంగానే పింఛనును లెక్కించాలని ఆదేశించింది.అర్హులైన వారందరికీ వర్తింపు: ఈ తీర్పు కేవలం పిటిషన్ వేసిన వారికి మాత్రమే కాకుండా, అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగికి/పెన్షనర్‌కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

వడ్డీతో బకాయిలు: ఈపీఎఫ్ఓ తప్పుడు విధానాల వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి, ఆ బకాయిలను 8 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.


పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు – అధిక PF పెన్షన్‌పై కీలక తీర్పు

ప్రో-రాటా విధానం రద్దు

▶▶ ఉద్యోగ సేవా కాలాన్ని విభజించకుండా పెన్షన్‌ను లెక్కించాలి : 12 వారాల్లో అమలు

కె. సునిల్‌కుమార్

పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేసిన ప్రో-రాటా (అనుపాత) విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం ద్వారా అధిక PF పెన్షన్ లెక్కింపులో వివాదాస్పద ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

హైకోర్టు న్యాయమూర్తి హర్‌ప్రీత్ సింగ్ బ్రార్ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, పెన్షన్‌ను లెక్కించేటప్పుడు 2014 సెప్టెంబర్ 1కు ముందు మరియు తర్వాత సేవా కాలాన్ని విడదీయకూడదు. బదులుగా, చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా మొత్తం పెన్షన్‌ను లెక్కించాలి.

పెన్షన్ పునఃలెక్కింపుతో వచ్చే బకాయిలపై 8% వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది.

ఈ తీర్పులో పెన్షనర్లు చాలా కాలంగా కోర్టుల్లో లేవనెత్తుతున్న పలు అంశాలపై అనుకూల ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా, డీఏ (Dearness Allowance) మరియు వేతన సవరణ బకాయిలను కూడా పెన్షన్ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవాలి అని పేర్కొంది.

ముఖ్యాంశాలు

2024 ఫిబ్రవరి 14న EPFO జారీ చేసిన ప్రో-రాటా విధానం అమలు సర్క్యులర్‌ను కోర్టు రద్దు చేసింది.

సురీందర్ కుమార్ సింగ్ సహా వంద మందికి పైగా ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ తీర్పు కేవలం పిటిషనర్లకే కాకుండా అందరికీ వర్తిస్తుంది అని కోర్టు స్పష్టం చేసింది.

ప్రయోజనాలు పొందేందుకు పెన్షనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపింది.

అలాగే, ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన వారి పెన్షన్ పునఃపరిశీలన, బకాయిల చెల్లింపు మరియు వడ్డీ చెల్లింపును 12 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

ఈ నెల 27న జారీ చేసిన సమాధానం ప్రకారం, ఇతర అర్హులైన పెన్షనర్లు కూడా 3 నెలలలోపు EPFO అధికారులకు దరఖాస్తు చేసి ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

36 ఏళ్ల తర్వాత… విశాఖ-ఆంధ్రజ్యోతి టీమ్ రీయూనియన్

ఒకప్పుడు వార్తల కోసం ఊళ్లు తిరిగిన మేము… ఈరోజు జ్ఞాపకాల కోసం ఒకచోట చేరాం! అప్పుడు “బ్రేకింగ్ న్యూస్” కోసం పరుగులు… ఇప్పుడు “షుగర్ ఎంత?”, “బీ...