May 18, 2026

హైదరాబాద్‌లో నిలూఫర్ హాస్పిటల్

ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్‌లో జన్మించింది. ఆమె తల్లి ఆదిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ V మనవరాలు. ఆమె ప్యాలెస్‌లలో పెరిగింది, ఫ్రాన్స్‌లో చదువుకుంది, ఫ్రెంచ్, టర్కిష్ మరియు ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడేది. ఆమె ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి యువరాణులలో ఒకరు. 1931లో, 15 ఏళ్ల వయసులో, అప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన  హైదరాబాద్ నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మోజం జాహ్‌తో ఆమెకు వివాహం జరిగింది. భారతదేశం గురించి దాదాపు ఏమీ తెలియకుండానే ఆమె హైదరాబాద్ చేరుకుంది. ఆమె చీర కట్టడం నేర్చుకుంది. ఉర్దూ నేర్చుకుంది. పర్దా పాటించడానికి నిరాకరించింది. నిజాం కుటుంబంలోని ఇతర మహిళలు మూసి ఉన్న తలుపుల వెనుక ఉండిపోగా, నిలూఫర్ బహిరంగ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సామాజిక సమావేశాలకు హాజరయ్యేది.  అంతర్జాతీయ పత్రికలు ఆమెను ప్రపంచంలోని పది మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నాయి. కానీ ఆ గ్లామర్ వెనుక ఆమె వ్యక్తిగత జీవితం బాధాకరంగా ఉండేది. ఆమెకు పిల్లలు కలగలేదు. 1948లో ఆమె భర్త రెండో భార్యను చేసుకున్నాడు. 21 ఏళ్ల తర్వాత 1952లో అతను నిలూఫర్‌కు విడాకులు ఇచ్చాడు. విడాకులకు మూడు సంవత్సరాల ముందు, ఆమెకు ఎంతో ఇష్టమైన పని మనిషి రఫతున్నీసా ప్రసవ సమయంలో తగిన వైద్య వసతులు లేకపోవడం వల్ల మరణించింది. తీవ్రంగా బాధపడిన ఆమె “ఇకపై ఏ రఫత్ కూడా మరణించకూడదు.”అని డిసైడ్ అయింది. మహిళలు, పిల్లల కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించాల్సిందిగా ఆమె నిజాంను ఒప్పించింది.  హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రి 1953లో ప్రారంభమైంది.  నిజాం దీనికి నిలూఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టాడు. అది ప్రారంభం కావడం ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమె అప్పటికే ఫ్రాన్స్ వెళ్ళిపోయింది.  ఆమె తన శేషజీవితాన్ని పారిస్‌లో గడిపింది. జూన్ 12, 1989న ఆమె73 సంవత్సరాల వయసులో మరణించింది. హైదరాబాద్‌లోని నిలూఫర్ హాస్పిటల్ నేటికీ నిలిచి ఉంది. ఇది 500 పడకలను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది తల్లులు, పిల్లలకు చికిత్స అందిస్తుంది.  ఆమె ఎన్నడూ తల్లి కాలేదు. కానీ, వేలాది మంది తల్లులకు, పిల్లలకు ప్రాణాదారం అయింది.

ఏపీలో 50 శాతానికి పైగా బీసీ జనాభా

2024 కులగణన నివేదికలో వెల్లడి


 తాజా సమగ్ర కులగణన సర్వేల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ జనాభాలో బీసీలు 50.59% (2.68 కోట్లు) ఉన్నారు. అలాగే తెలంగాణలో బీసీల జనాభా 46.25% ఉండగా, ముస్లిం బీసీలను కలుపుకుంటే మొత్తం శాతం 56.33% కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే ఆధారంగా బీసీల గణాంకాలు: 

మొత్తం బీసీ జనాభా: 2.68 కోట్లు

బీసీల జనాభా శాతం: 50.59%

అత్యధిక బీసీ జనాభా ఉన్న జిల్లాలు: శ్రీకాకుళం, కర్నూలు, విశాఖపట్నం

సహాయక చర్యలు: బీసీ సంక్షేమానికి వివిధ ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

 రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్లు కాగా, వెనకబడిన తరగతుల వారు 2.68 కోట్లు. ఇది మొత్తం జనాభాలో 50.59 శాతం. ఫిబ్రవరి 2024లో అప్పటి YSRCP ప్రభుత్వం ఆధ్వర్యంలో  సచివాలయ సిబ్బంది  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కుల గణన ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

BC వర్గంలో 138 కులాలు : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను ఐదు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఈ విభాగాలు అన్నీ కలిపి మొత్తం 138 కులాలను కలిగి ఉన్నాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే BC-A విభాగం కింద 51 కులాలు, BC-B కింద 27, BC-C కింద ఒకటి, BC-D కింద 45, BC-E కింద 14 కులాలు జాబితా చేశారు.


శ్రీకాకుళం జిల్లా జనాభాలో 80.83% మంది BCలే : ప్రతి జిల్లాలోని మొత్తం జనాభాతో పోలిస్తే వెనుకబడిన తరగతుల శాతం పరంగా చూస్తే, శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా జనాభాలో వెనుకబడిన తరగతుల వాటా 80.83% (19.23 లక్షలు) గా ఉంది. 76.55% (15.14 లక్షలు)తో విజయనగరం జిల్లా రెండవ స్థానంలోనూ, 72.73% (12.74 లక్షలు)తో అనకాపల్లి జిల్లా మూడవ స్థానంలోనూ నిలిచాయి. తర్వాతి స్థానాల్లో కర్నూలు (69.18%), విశాఖపట్నం (67.07%),అనంతపురం (60.25%) జిల్లాలు నిలిచాయి. మొత్తంగా రాష్ట్రం మొత్తాన్ని పరిశీలించినప్పుడు, వెనుకబడిన తరగతుల (BC) జనాభా సాంద్రత అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నట్లు తేలింది.

మరోవైపు చూస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెనుకబడిన తరగతుల జనాభా చాలా తక్కువగా ఉంది. ఇది కేవలం 3.26 శాతంగా నమోదైంది. పోలవరం (15.16%), తూర్పు గోదావరి (29.43%), ప్రకాశం (33.91%), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ (38.73%) జిల్లాల్లో కూడా వెనుకబడిన తరగతుల జనాభా మిగిలిన వాటితో పోలిస్తే తక్కువగానే ఉంది.

సంఖ్యా పరంగానూ శ్రీకాకుళమే అగ్రస్థానంలో : సంఖ్యాపరంగా చూసినా కూడా, వెనుకబడిన తరగతుల జనాభా విషయంలో శ్రీకాకుళం జిల్లానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 19.29 లక్షలుగా నమోదైంది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కర్నూలు (18.85 లక్షలు), విశాఖపట్నం (15.48 లక్షలు), అనంతపురం (15.25 లక్షలు), విజయనగరం (15.14 లక్షలు), అనకాపల్లి (12.74 లక్షలు), శ్రీ సత్యసాయి (12.02 లక్షలు) జిల్లాలు ఉన్నాయి. కాకినాడ, నెల్లూరు , నంద్యాల జిల్లాల్లో వెనుకబడిన తరగతుల జనాభా ఒక్కో జిల్లాలో సుమారు 10 లక్షల చొప్పున ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా తక్కువగా 22,878 మంది వ్యక్తులు నమోదైనప్పటికీ, పోలవరం (60,038), బాపట్ల (5.08 లక్షలు), పార్వతీపురం మన్యం (5.14 లక్షలు), మార్కాపురం (5.16 లక్షలు) జిల్లాల్లో కూడా BC జనాభా సాపేక్షంగా తక్కువగానే ఉంది.

BC-A విభాగంలో 84.72 లక్షల మంది : వెనుకబడిన తరగతుల జనాభాలోని ఉప-విభాగాలను విశ్లేషించగా, BC-A సమూహం అత్యంత పెద్దదిగా వెల్లడైంది. ఇందులో 84.72 లక్షల మంది వ్యక్తులు ఉన్నారు. దీని తర్వాత స్థానాల్లో BC-D (82.88 లక్షలు), BC-B (67.42 లక్షలు), BC-E (32.12 లక్షలు), BC-C (1.70 లక్షలు) వర్గాలు ఉన్నాయి.

BC-A సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధానంగా శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కనిపిస్తారు.

BC-B జనాభా కర్నూలు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉంది.

BC-C వర్గానికి చెందిన సభ్యులు అధికంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నారు.

BC-D జనాభా విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా ఉంది.

BC-E వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధానంగా కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కనిపిస్తారు.

May 15, 2026

యువ న్యాయవాదులను భయపెట్టవద్దు


ఏపీ హైకోర్టు ఘటనపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మే 5న జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ), సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ)లతోపాటు దేశంలోని పలు బార్ అసోసియేషన్లు స్పందించాయి. యువ న్యాయవాదులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ సంఘటనతో అనేక కొత్త ప్రశ్నలు కూడా తలెత్తాయి. లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ), పాస్‌పోర్టు స్వాధీనం అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ ఆ రోజు హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదించిన ఓ యువ న్యాయవాదిపై హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా గతంలో ఇలాంటి కేసులో ఇచ్చిన కోర్టు తీర్పు కాపీ అవసరమని న్యాయమూర్తి భావించారు. దీంతో, కేసును వాయిదా వేయాలని జస్టిస్ రాజశేఖర్ రావు సూచించారు. అయితే, పిటిషనర్ తరఫు యువ న్యాయవాది వెంటనే విచారణ కొనసాగించాలని కోరారు. తన వాదన వినిపించడానికి, పదేపదే మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో, జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో,

"నేను మీ రిట్ పిటిషన్‌ను కొట్టివేశానా? ఆర్డర్ కాపీని తీసుకురమ్మని మాత్రమే కోరాను. మీరేదో గొప్ప సీనియర్ న్యాయవాది అనుకుంటున్నారా? కనీసం 10 ఏళ్ల అనుభవం కూడా లేకుండా ఈ కట్టను విసిరేస్తారా?’’ అని అన్నారు. న్యాయవాది నిర్లక్ష్యంగా ప్రవర్తించారని భావించిన జడ్జి, 24 గంటల పాటు అతనిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచమని పోలీసులను పిలిచారు. దీంతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాయర్లు అందరూ షాక్‌కు గురయ్యారు. పోలీసులు వచ్చిన తర్వాత ‘‘తీసుకెళ్లండి. లోపల వేయండి’’ అని జడ్జి అన్నారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్‌తో కలిసి ధర్నా చేయండి అని కూడా జడ్జి వ్యాఖ్యానించారు. మరో పక్క యువ న్యాయవాది చేతులు జోడించి క్షమించమని, దయ చూపమని వేడుకున్నారు. అయినా, న్యాయమూర్తి ఆయనను మందలించారు. ఇక్కడ ఉన్న ఇతర న్యాయవాదులు కూడా ఇది చూశారని, కోర్టులో ఉన్న లాయర్ల పేర్లు నమోదు చేసి సాక్షులుగా రికార్డు చేయాలని జడ్జి సూచించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెంటనే, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో, జడ్జి ఆగ్రహించడం, న్యాయవాది వేడుకోవడం స్పష్టంగా కనిపించాయి. దాంతో, దేశం అంతటా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. బీసీఐ, ఎస్‌సీబీఏ, దేశంలోని ఇతర బార్ అసోసియేషన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆందోళన వ్యక్తం చేశాయి. జడ్జి తీరుని ఖండించాయి. అయితే, వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ , హైకోర్టు బార్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదితో, న్యాయమూర్తితో విడివిడిగా మాట్లాడారు. 24 గంటల జ్యుడీషియల్ కస్టడీ ఆదేశాలు అమలు కాకుండా ఆపారు. సమస్య సామరస్యంగా సద్దుమణిగింది. అయినప్పటికీ, ఈ ఘటన న్యాయవ్యవస్థలో, న్యాయవాదుల్లో, ముఖ్యంగా యువ న్యాయవాదుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. యువ న్యాయవాదుల పట్ల న్యాయమూర్తులు సహనంతో వ్యవహరించాలని, వారిని ప్రోత్సాహించాలని బీసీఐ, ఎస్‌సీబీఏ, ఇతర బార్ అసోసియేషన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే సుప్రీం కోర్టు కూడా వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులలో భయం, అవమానం లేదా బెదిరింపులకు కారణమయ్యే ఏ చర్య అయినా బార్ స్వాతంత్ర్యాన్ని, న్యాయ వ్యవస్థ సమర్థవంతమైన పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని బీసీఐ, ఎస్‌సీబీఏ హెచ్చరించింది. ఇలాంటి సంఘటనలు యువ న్యాయవాదులపై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతోపాటు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సంస్థాగత సమతుల్యతను దెబ్బతీస్తాయని బీసీఐ పేర్కొంది. న్యాయవాది బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ, న్యాయమూర్తి ప్రవర్తించిన తీరుని బార్ అసోసియేషన్లు తప్పుపట్టాయి. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీరుపై పలువురు యువ న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. జూనియర్ లాయర్లను కోర్టులో బెదిరించడం, అవమానించడం అంగీకరించలేని అంశం అన్నది వారి వాదన. న్యాయమూర్తులు సీనియర్లు, జూనియర్ల మధ్య వివక్ష చూపడం భావ్యంకాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. కోర్టు కార్యకలాపాల్లో మర్యాద, క్రమశిక్షణ అత్యంత కీలకమని ఈ సంఘటన స్పష్టం చేస్తోందని మరికొందరన్నారు. ఈ ఘటనతో మరో కొత్త డిమాండ్ కూడా వినవస్తోంది. కొలీజియం వ్యవస్థ దేశంలో న్యాయవ్యవస్థను నాశనం చేస్తోందని, పరీక్షల ద్వారా వచ్చే ప్రొఫెషనల్ జడ్జీలు కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో జరిగిన ఘటనపై సీజేఐ జోక్యాన్ని కోరుతూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖ రాశారు. సదరు న్యాయవాది తన శారీరక ఇబ్బందులను వివరిస్తూ, పదేపదే క్షమించమని వేడుకున్నా న్యాయమూర్తి కనికరించలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించడానికి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక అంతర్గత యంత్రాంగం ఉండాలని ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ నొక్కి చెప్పారు. కోర్టుల అధికారాన్ని గౌరవించాల్సిందేనని, అయితే, న్యాయాధికారాలను వినియోగించేటప్పుడు సంయమనం, నిష్పాక్షికత, కరుణ కూడా ఉండాలని ఎస్‌సీబీఏ సూచించింది. న్యాయవాదులను భయపెట్టే బదులు, యువ న్యాయవాదులు ధైర్యంగా, నిర్భయంగా, స్వతంత్రంగా వాదించేలా ప్రోత్సహించేంత బలంగా న్యాయవ్యవస్థ ఉండాలని అడ్వకేట్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు(ఏఏబీ) పేర్కొంది.
కోర్టు కార్యకలాపాల్లో చిన్నపాటి లోపం దొర్లిందనే కారణంతో ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న జడ్జి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై బీసీఐ, ఎస్‌సీబీఏ చేసిన తీర్మానాల ఆధారంగా నమోదైన రెండు రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఈ నెల 15న విచారణ చేపట్టనుంది. యువ న్యాయవాదుల విషయంలో న్యాయమూర్తులు సహనం పాటించాలి, ప్రోత్సాహించేవిధంగా వ్యవహరించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ అసోసియేషన్ ప్రమేయంతో హైకోర్టు స్థాయిలోనే సామరస్య పూర్వకంగా పరిష్కరించినందున, తమ వైపు నుండి ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది . యువ న్యాయవాది కోపంతో ఫైళ్లను పోడియంపై కొట్టారని భావించి, అతడిని పోలీసు కస్టడీకి పంపిస్తానని జస్టిస్ రాజశేఖర్‌రావు హెచ్చరించారు. అయితే, ఆ న్యాయవాది చేతిలోంచి ఫైలు జారిపోయిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి కేవలం మౌఖికంగా వ్యాఖ్యానించారని, ఎటువంటి లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. సందర్భం గురించి వివరించకుండా కోర్టు విచారణకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని ప్రసారం చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం మీడియాను కోరింది. మీడియాకు కూడా బాధ్యత ఉందని, క్రియాశీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు ఆశిస్తోంది.
ఈ ఘటనతో న్యాయవాదులు, న్యాయమూర్తుల బృందాలకు మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి సుప్రీం కోర్టు చర్యలు చేపట్టింది. బార్, న్యాయవ్యవస్థ మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్‌ల సభ్యులతో కూడిన గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీలను (జీఆర్సీలు) హైకోర్టులు, దిగువ కోర్టులలో ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇటువంటి కమిటీలను జిల్లా/తాలూకా స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. న్యాయవాదులు, ధర్మాసనాలు ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి. ధర్మాసనం ఒక వైపు ఎత్తైన కుర్చీలలో కూర్చుంటే, న్యాయవాదులు న్యాయం కోసం నిలబడి వాదిస్తుంటారు! ఈ నేపథ్యంలో 15న జరిగే విచారణలో సుప్రీం కోర్టు ఈ ఘటనపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి. న్యాయ వ్యవస్థ పటిష్టవంతమయ్యే విధంగా, యువ న్యాయవాదులకు భరోసా ఇచ్చేవిధంగా అత్యున్నత న్యాయ స్థానం తీర్పు ఇస్తుందని ఆశిద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

https://www.sci.gov.in/case-status-case-no/# Writ Petition (Civil) Case Number :604 Case Year : 2026

Serial NumberDiary NumberCase NumberPetitioner NameRespondent NameStatusAction
128532/2026W.P.(C) No. 000604 / 2026 Registered on 08-05-2026
SUPREME COURT BAR ASSOCIATIONHIGH COURT OF ANDHRA PRADESHDISPOSEDView

Diary Number28532/2026 Filed on 08-05-2026 03:04 PM

15 ఏళ్లు నిండిన బైక్ రిజిస్ట్రేషన్‌ పొడిగింపు

 ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు నిండిన బైక్ రిజిస్ట్రేషన్‌ను (RC Renewal) పొడిగించుకోవడానికి లేదా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (FC) పొందడానికి మీరు సిద్ధం కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

1. బండి కండిషన్ (Mechanical Checkpoints)
RTO ఇన్‌స్పెక్టర్ బండిని ఫిజికల్‌గా తనిఖీ చేస్తారు. ఈ క్రిందివి పక్కాగా ఉండాలి:
Chassis Number: ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్లు స్పష్టంగా ఉండాలి (పెన్సిల్ ప్రింట్ తీయడానికి వీలుగా).
Lights & Indicators: హెడ్ లైట్ (High/Low beam), ఇండికేటర్లు, బ్రేక్ లైట్ మరియు నంబర్ ప్లేట్ లైట్ ఖచ్చితంగా పనిచేయాలి.
Brakes & Tyres: బ్రేకులు సరిగ్గా ఉండాలి. టైర్ల త్రెడ్ (Grip) అరిగిపోయి ఉండకూడదు.
Appearance: బండికి తుప్పు (Rust) ఉండకూడదు. బాడీ కలర్ RCలో ఉన్నట్లుగానే ఉండాలి. సైడ్ మిర్రర్లు తప్పనిసరి.
Engine Performance: ఇంజిన్ నుండి విపరీతమైన శబ్దం లేదా పొగ రాకూడదు.
Horn: హారన్ వర్కింగ్ కండిషన్‌లో ఉండాలి.
2. అవసరమైన పత్రాలు (Required Documents)
అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోండి:
Original RC: పాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
Insurance: ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్సూరెన్స్ కాపీ.
Pollution (PUC): వాలిడిటీ ఉన్న కాలుష్య నియంత్రణ పత్రం.
Address Proof: ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి.
Tax Receipt: రోడ్ టాక్స్ కట్టిన రసీదు.
3. ఫీజులు మరియు ఇతర ఛార్జీలు
Renewal Fee: బైక్ కోసం సుమారు ₹300 వరకు ఉంటుంది. (స్మార్ట్ కార్డ్ కోసం అదనంగా ₹200 ఉండవచ్చు).
Green Tax: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఏపీలో గ్రీన్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది సుమారు ₹2,000 (15 ఏళ్లకు) ఉండవచ్చు.
Late Fee: RC ఎక్స్‌పైర్ అయిన తర్వాత అప్లై చేస్తే నెలకు ₹300 చొప్పున పెనాల్టీ పడుతుంది. కాబట్టి 60 రోజుల ముందే అప్లై చేయడం మంచిది.
4. అప్లికేషన్ ప్రాసెస్ (Process)
Parivahan Portal: ఆన్‌లైన్‌లో 'Renewal of Registration' ఆప్షన్ ద్వారా అప్లై చేసి ఫీజు చెల్లించాలి.
Form 25: ఈ ఫారాన్ని నింపి, ఛాసిస్ నంబర్ పెన్సిల్ ప్రింట్‌ను దానిపై తీసుకోవాలి.
Slot Booking: మీకు వీలైన రోజున RTO ఆఫీస్‌లో బండిని చూపించడానికి స్లాట్ బుక్ చేసుకోవాలి.
Inspection: నిర్ణీత తేదీన బండిని RTO ఆఫీస్‌కు తీసుకెళ్లి ఇన్‌స్పెక్టర్ సంతకం చేయించుకోవాలి.

May 13, 2026

అత్యధిక అప్పు ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర అప్పుల భారంపై రాజకీయ దుమారం రేగుతోంది.

ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాలు ఏవి? ఏయే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత రాష్ట్రాలలో తమిళనాడు అత్యధిక రుణభారం గల రాష్ట్రం. అయితే, తమ ఆదాయానికి మించి అప్పులు చేసిన రాష్ట్రాలు కూడా జాబితలో ఉన్నాయి. ఒక రాష్ట్రం తన జీడీపీతో పోలిస్తే ఎంత అప్పు కలిగి ఉంది? అలాగే దాని నిష్పత్తి ఎంత అనే దాని ఆధారంగా రుణ తీవ్రతను లేదా ప్రమాదాన్ని లెక్కించవచ్చు.

అత్యధిక అప్పు ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా:

తాజా గణంకాల ప్రకారం, రాష్ట్రాల వారీగా ఉన్న అప్పుల (రూపాయిల విలువలో) వివరాలు ఇలా ఉన్నాయి:

తమిళనాడు: రూ. 9.6 లక్షల కోట్లు

ఉత్తరప్రదేశ్: రూ. 8.6 లక్షల కోట్లు

మహారాష్ట్ర: రూ. 8.1 లక్షల కోట్లు

కర్ణాటక: రూ. 7.3 లక్షల కోట్లు

పశ్చిమ బెంగాల్: రూ. 7.1 లక్షల కోట్లు

రాజస్థాన్: రూ. 6.4 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్: రూ. 5.6 లక్షల కోట్లు

మధ్యప్రదేశ్: రూ. 5.3 లక్షల కోట్లు

గుజరాత్: రూ. 4.9 లక్షల కోట్లు

కేరళ: రూ. 4.7 లక్షల కోట్లు

అప్పు Vs జీఎస్డీపీ (GSDP) నిష్పత్తి అంటే ఏమిటి?

కేవలం అప్పు మొత్తాన్ని చూసి ఒక రాష్ట్రం ఆర్థికంగా ప్రమాదంలో ఉందని చెప్పలేము. ఆ రాష్ట్ర ఆదాయం (GSDP – Gross State Domestic Product) ఎంత? ఆ ఆదాయానికి అప్పుకు ఉన్న నిష్పత్తి ఎంత? అనేదే అసలైన కొలమానం. ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసినా దానిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ నిష్పత్తి 30% కంటే తక్కువగా ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు భావిస్తారు.

ఆందోళనకరంగా ఉన్న రాష్ట్రాలు:

అప్పు-జీఎస్డీపీ నిష్పత్తి ప్రకారం చూస్తే కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అందులో..

పశ్చిమ బెంగాల్, కేరళ: ఈ రెండు రాష్ట్రాల్లో అప్పుల నిష్పత్తి 30% కంటే ఎక్కువగా ఉంది.

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్: ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా అప్పుల భారంతో ఒత్తిడికి లోనవుతోంది.

మెరుగైన స్థితిలో ఉన్నవి:

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు అప్పులు చేస్తున్నప్పటికీ, వాటి ఆదాయంతో పోలిస్తే అప్పుల నిష్పత్తి నియంత్రణలోనే ఉంది. కర్ణాటక కూడా ఈ విషయంలో స్థిరమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయడం సాధారణమే అయినా, అవి రాష్ట్ర ఆదాయానికి మించి ఉండకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న అప్పుల భారం భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం చూపవచ్చు.

May 12, 2026

బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తప్పనిసరికాదు

బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం తప్పనిసరి కాదు: తెలంగాణ హైకోర్టు

కేసు : విజయ్ గోపాల్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు ఇతరులు (Vijay Gopal v. Bar Council of India & Anr.)*

*రిట్ పిటిషన్ నంబర్: W.P. No. 11364 of 2024*

 న్యాయవాదిగా వృత్తిని కొనసాగించడానికి (ప్రాక్టీస్ చేయడానికి) ఏదైనా బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరడం తప్పనిసరి కాదని జస్టిస్ ఎన్. తుకారాంజీ స్పష్టం చేశారు.

 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) 2015లో రూపొందించిన 'రూల్ 6'ను సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే(ab) అడ్వకేట్ పిటిషన్ వేశారు. ఈ రూల్ వల్ల అసోసియేషన్లకు అడ్వకేట్లపై పరోక్ష నియంత్రణ లభిస్తోందని ఆయన వాదించారు.

 'అడ్వకేట్స్ యాక్ట్, 1961' ప్రకారం ఎన్‌రోల్ అయిన ప్రతి న్యాయవాదికి ప్రాక్టీస్ చేసే హక్కు ఉంటుంది. సర్టిఫికేషన్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియలు(ab) కేవలం గుర్తింపు మరియు సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఉండాలి తప్ప, న్యాయవాదుల హక్కులను అడ్డుకునేలా ఉండకూడదని హైకోర్టు పేర్కొంది.

సభ్యత్వం స్వచ్ఛందమే: న్యాయవాదులు ఏదైనా బార్ అసోసియేషన్‌లో చేరడం అనేది వారి వ్యక్తిగత అభీష్టం మాత్రమే. అది నిర్బంధం కాదని కోర్టు స్పష్టం చేసింది.

ఒక న్యాయవాది బార్ అసోసియేషన్‌లో సభ్యుడు కాకపోయినప్పటికీ, చట్టప్రకారం వారు కోర్టులలో(ab) వాదించడానికి (ప్రాక్టీస్ చేయడానికి) ఎటువంటి అడ్డంకి ఉండకూడదని నొక్కి చెప్పింది.

*బార్ కౌన్సిల్ vs బార్ అసోసియేషన్ - తేడాలు:* 

న్యాయవాద వృత్తిలో ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది:

*స్టేట్ బార్ కౌన్సిల్ (చట్టబద్ధమైనది):* మీరు లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే తప్పనిసరిగా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నమోదు (Enrollment) చేసుకోవాలి. ఇది చట్టబద్ధమైన అవసరం.

*బార్ అసోసియేషన్ (ప్రైవేట్ బాడీ):* ఇది ఒక కోర్టు పరిధిలోని న్యాయవాదులు ఏర్పాటు చేసుకున్న ఒక సంఘం. ఉదాహరణకు: హైకోర్టు బార్ అసోసియేషన్, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ వంటివి

*సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలు:*

సభ్యత్వం తప్పనిసరి కాకపోయినా, న్యాయవాదులు ఇందులో చేరడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి:

 లైబ్రరీలు, కామన్ రూమ్‌లు, ఇతర మౌలిక వసతుల వినియోగం లాంటి సౌకర్యాలు ఉంటాయి

May 8, 2026

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?


దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్- 95) కింద ఇచ్చే కనీస పెన్షన్ రూ.1000లు మాత్రమే ఇస్తున్నారు. కనీస పెన్షన్ రూ. 7,500కు పెంచాలన్నది పెన్షన్ దారుల డిమాండ్. ఇందు కోసం మార్చి 9, 10, 11 తేదీలలో మూడు రోజులపాటు దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా, ‘చలో ఢిల్లీ’ నినాదంతో భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఫలితాలు ఏమీ కనిపించలేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలవారీ పెన్షన్‌ పెంచడంతోపాటు అదనంగా కరువు భత్యం, పెన్షనర్లు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టులు, సామాజిక సర్వేల ప్రకారం పెన్షన్ మొత్తం సరిపోకపోవడం, ఉచిత ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 200 నుండి 250 మంది పెన్షనర్లు అకాల మరణానికి గురవుతున్నారు. 30 ఏళ్లు పనిచేసిన వారి నెలవారీ సగటు పెన్షన్ రూ.1,171 మాత్రమే ఉన్నట్లు ఈపీఎస్-95 జాతీయ పోరాట కమిటీ తెలిపింది. పలు రాజకీయ పార్టీల ఎంపీలు కూడా వీరి పోరాటానికి మద్దతు ప్రకటించారు. కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదని, ఇది లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి, జీవించే హక్కుకు సంబంధించిన అంశంగా వారు పేర్కొన్నారు.

ప్రైవేటు సంస్థలలో పదేళ్లకు పైగా పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రమే ఈ పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ పథకం పరిధిలోకి ప్రైవేటు సంస్థలలో పనిచేసి రిటైర్ అయిన ఉపాధ్యాయులు, జర్నలిస్టులతోపాటు పెద్ద పెద్ద మిల్లులు, ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో పనిచేసిన ఇతర ఉద్యోగులు, కార్మికులు.... వంటివారందరూ వస్తారు. కనీసం పది సంవత్సరాలు సర్వీసు ఉండి, 58 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది. అది కూడా వారు పనిచేసినంత కాలం 30-35 ఏళ్లు పెన్షన్ నిధికి చెల్లించిన సొమ్ము నుంచి మాత్రమే ఈ పెన్షన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12 శాతం యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33 శాతం ఈపీఎస్‌కు జమ అవుతుంది. మిగిలిన 3.67 శాతం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)లో జమ అవుతుంది. దీని ఆధారంగా, ప్రస్తుతం రూ.1,000 కనీస పెన్షన్‌గా చెల్లిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వాటా 1.16 శాతం మాత్రమే ఉంటుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్- 95) కింద పార్లమెంట్ చట్టం ప్రకారం 2014 నుంచి కనీస పెన్షన్ నెలకు రూ.1000 అందజేస్తున్నారు. అంటే, 11 ఏళ్ల క్రితం నిర్ణయించిన ప్రకారమే ఇస్తున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు ఎంతగా పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో నెలకు రూ. 1,000తో జీవించడం అసాధ్యం. వీరిలో ఎక్కువ మంది పరిమిత ఆర్థిక వనరులు కలిగిన పేదలే ఉన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షనర్ల ఆర్థిక భద్రత కోసం కనీస పెన్షన్ పెంచవలసిన అవసరం ఉంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారి దీనస్థితిని కేంద్ర ప్రభుత్వం అర్థంచేసుకోవలసి ఉంది. పెన్షన్‌పై మాత్రమే ఆధారపడే పెన్షనర్లకు, ప్రతిపాదిత పెంపు ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పదవీ విరమణ తర్వాత వారు మరింత సౌకర్యవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి సహాయపడుతుంది.

దేశంలోని వివిధ ప్రభుత్వాలు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ ఇంతకు మూడు రెట్లు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు రూ.4000, తెలంగాణ ప్రభుత్వం రూ.2,016 సామాజిక పెన్షన్ కింద అందజేస్తున్నాయి. అందులో వారి వాటా ఏమీ ఉండదు. కేవలం వయసు ఆధారంగా పేదలకు ఇస్తారు. ఈపీఎస్ పెన్షన్‌లో మాత్రం ఉద్యోగులు, యాజమాన్యం చెల్లించిన వాటాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సామాజిక పెన్షన్ స్థాయిలో కూడా తమ పెన్షన్ లేదని, రూ.1000 పెన్షన్ మందులకు కూడా సరిపోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం అక్టోబరులో బెంగళూరులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో కనీస పెన్షన్ రూ.1,000 నుండి రూ.7,500 కు పెంచాలని ప్రతిపాదించారు. అయితే, ఆ ప్రతిపాదనను ఆమోదించలేదు. అంత కాకపోయినా, కనీస పెన్షన్ రూ.3000లకు పెంచుతారని భావించారు. అదీలేదు. ఆ సమావేశం పెంచే ఆలోచనే చేయలేదు. ఎంతో కాలంగా పెన్షన్ పెంచుతారని ఎదురు చూస్తోన్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది. ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి నాటికి 82,11,182 మంది ఈపీఎస్ పెన్షన్ దారులు ఉన్నారు. వారిలో 36.6 లక్షల మందికి రూ.1000లు మాత్రమే కనీస పెన్షన్ అందుతోంది.

అయితే, ఒకేసారి 7.5 రెట్లు కనీస పెన్షన్ పెంచడం సాధ్యమయ్యేపనికాదు. ఈపీఎస్ నిధి అనేది ఉద్యోగులు, యజమానుల వాటాతో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తంలో పెన్షన్ చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై లక్షల కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న నిధుల లోటు కారణంగా ఈ పెంపు కష్టతరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతమంది పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంచాలంటే, ప్రభుత్వం అదనపు నిధులను కేటాయించాలి. ఈ ప్రతిపాదన వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పెన్షన్ వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి సరైన ప్రణాళిక అవసరమన్న భావన అధికారుల్లో ఉంది. కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదన ముందుకు సాగితే, దేశంలోని పదవీ విరమణ చేసిన కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించవచ్చు. పెన్షన్ పెంపు ఆర్థికంగా సవాల్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గౌరవప్రదమైన మొత్తాన్ని పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కనీస పెన్షన్ ను రూ.3000లకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షనర్ల సంఘాలు, అధికారుల నిరంతర చర్చల ద్వారా కనీస పెన్షన్ పెంచే విధంగా కేంద్రం విధానపరమైన ప్రణాళిక రూపొందిస్తుందని ఆశిద్దాం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

హైదరాబాద్‌లో నిలూఫర్ హాస్పిటల్

ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్‌లో జన్మించింది. ఆమె తల్లి ఆదిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ V మనవరాలు. ఆమె ప్యాలెస్‌లల...