Mar 28, 2026

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్


మనసా వాచా కర్మణా మద్దతు 

గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది

భూములు ఇచ్చిన రైతులను హింసించింది

రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం 

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు 

మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది 

సరైన ప్రణాళిక లేకుండా విభజించారు 

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు 

అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది 

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ 


‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి. 

తెలుగు నేల అనే భావనే ఉండేది 

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.

భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు

2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది?  ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు

చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.

మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి..

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.

విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.

ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను”  అన్నారు.

Mar 24, 2026

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్ 


ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి  ఏకధాటిగా  3331 (మార్చి 21-దాకోజు శివప్రసాద్) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. మార్చి 21 రాసిన  ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది.   3195 ఎపిసోడ్ లో  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన  నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు. ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా,  చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ),  మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు  రాశారు. రాస్తున్నారు.  ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 

 

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో  మమేకమయ్యేది  కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి  మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు.  కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు.  ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు.  ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.

 

రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు,  కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై  పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్,  డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు  ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం,  శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి,  రావిరంగారావు,  గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా,  నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు,   పురాణాలు,  పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు.  అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు.  ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?,  హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?,  ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?,  నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు.  అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.    


అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా  రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ,  దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు,  వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే.  ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం.  వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు.  సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది.  ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం.  సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.  

రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్,  పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  సాహితీ ప్రపంచంలో  ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు.  అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.

నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన  రాస్తూ,  భవిష్యత్ లో అతనిపై  యూనివర్సీటీలలో  సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి  డిపార్ట్ మెంట్లలో  పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది.  అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914





Mar 22, 2026

సాహితీ వనంలో విరబూసిన రజా హుస్సేన్

ఫేస్ బుక్‌లో కాఫీ విత్... పేరుతో 3220 ఎపిసోడ్స్ రికార్డ్


ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి  ఏకధాటిగా  3220 (మార్చి 21-అన్నమయ్య / చలం) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది.   3195 ఎపిసోడ్ లో  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన  నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు.ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా,  చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ),  మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు  రాశారు. రాస్తున్నారు.  ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 

 మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో  మమేకమయ్యేది  కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి  మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు.  కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు.  ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు.  ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.

 రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు,  కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై  పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్,  డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు  ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం,  శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి,  రావిరంగారావు,  గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా,  నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు,   పురాణాలు,  పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు.  అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు.  ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?,  హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?,  ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?,  నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు.  అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.    

అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా  రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ,  దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు,  వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే.  ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం.  వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు.  సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది.  ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం.  సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.  

రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్,  పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  సాహితీ ప్రపంచంలో  ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు.  అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.

నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన  రాస్తూ,  భవిష్యత్ లో అతనిపై  యూనివర్సీటీలలో  సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి  డిపార్ట్ మెంట్లలో  పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది.  అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Mar 21, 2026

నలుగురు చేనేత బిడ్డలకు ఉగాది పురస్కారాలు


శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు చేనేత బిడ్డలకు ‘ఉగాది పురస్కారాలు-2026’  ప్రకటించింది. మొత్తం 164 మందికి (40 కళారత్న, 124 ఉగాది) పురస్కారాలు ప్రకటించినట్లు  పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం  జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిలో చేనేత కుటుంబాలకు చెందిన  జామ్దానీ నేత కళాకారుడు గౌరాబత్తిని రమణయ్య, సీనియర్  జర్నలిస్టులు డాక్టర్ గుత్తికొండ కొండలరావు, ఉడతా రామకృష్ణ, ఆర్టిస్ట్ కౌతరపు పార్వతి ఉన్నారు. 

 



గౌరాబత్తిని రమణయ్య: 
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు గౌరాబత్తిని రమణయ్యకు చేనేత రంగంలో జామ్‌దానీ నేత కళలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.  రమణయ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా చేనేత రంగంలో విశేష సేవలందిస్తున్నారు. చీరలపై అరుదైన డిజైన్లను నేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.  2003లో చీరపై నేసిన రామచిలుక డిజైన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 2005లో ఎద్దు డిజైన్‌కు రాష్ట్ర అవార్డు, 2006లో “ట్రీ ఆఫ్ లైఫ్” డిజైన్‌కు యునెస్కో అవార్డు, 2009లో కల్పవృక్షం డిజైన్‌కు సంత్ కబీర్ అవార్డు అందుకున్నారు. 2014లో “డబుల్ ట్రీ” డిజైన్‌కు వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అవార్డు చైనాలో అందుకున్నారు. 2021లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారు.  రమణయ్య తయారు చేసిన ప్రత్యేక వస్త్రాన్ని  బంగ్లాదేశ్ ప్రధాని హసీనా బేగంకు మన ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా అందజేశారు.  రమణయ్య   ప్రస్తుతం రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలకు ప్రత్యేక వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తూ ఆధునిక చేనేత కళను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

 


కౌతరపు పార్వతి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని, చిత్రకారిణి కౌతరపు పార్వతి(ఆమ్రపాలి)ని, ఆమె చిత్రకళా నైపుణ్యానికి గుర్తుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ (బీఎఫ్ఏ) డిగ్రీ చేసిన పార్వతి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు చిత్రకారిణిగా పనిచేశారు.  ప్రముఖ కవులు, రచయితల పుస్తకాలకు కవర్ పేజీలు రూపొందించారు. అమెరికాలోని తానా వారి మాసపత్రిక తెలుగునాడికి ముఖచిత్రాలతోపాటు అనేక లోపలి పేజీల చిత్రాలు గీశారు.  ఆమె చిత్రకళా నైపుణ్యాన్ని దేశవిదేశాల్లో అనేక మంది ప్రముఖులు మెచ్చుకున్నారు. ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఎంబసీ, ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో  చైనా, రష్యా, బ్యాంకాక్, ఈజిప్టు, వియత్నాం, మాల్దీవులతోపాటు జాతీయ స్థాయిలో న్యూఢిల్లీ, నాగపూర్, అస్సాం, ముంబై, హైదరాబాద్, విజయవాడ, అమరావతి, గుంటూరు తదితర నగరాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పార్వతి 2008లో ఉత్తమ ఉపాధ్యయపుస్కారం, 2021లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు, ఉమ్మిడిశెట్టి సత్యాదేవి ప్రతిభా పురస్కారం.... వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.  పార్వతి స్వీయరచన, దర్శకత్వంలో ‘బతుకు చిత్రం’ పేరుతో ఒక లఘుచిత్రాన్ని కూడా నిర్మించారు. 


జీకే:  పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా పదవీవిరమణ చేసిన  డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే)కు, జర్నలిజం రంగంలో తను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంజేఎంసీలో గోల్డ్ మెడల్ సాధించిన జీకే గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగంపై  పీహెచ్‌డీ చేశారు. జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం(డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.  12 వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పలు విశ్వవిద్యాలయాల్లో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు.  ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఆయన మొట్టమొదటి ఇంటర్వూ దివంగత మదర్ థెరిస్సాను చేశారు.  అంతర్జీతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కొండలరావు  జీకే అనే కలం పేరుతో వందల వ్యాసాలు రాశారు. 

 


ఉడతా రామకృష్ణ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామానికి  చెందిన సీనియర్ జర్నలిస్ట్, పుస్తక రచయిత ఉడతా రామకృష్ణను, జర్నలిజం రంగంలో తను చేసిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. చేనేత కార్మికుడిగా మొదలైన ఆయన జీవితం 1989లో జర్నలిజం వైపునకు మళ్లింది. 14 ఏళ్ళు దారాలను అల్లిన చేతులు అక్షరాలను అల్లడం మొదలుపెట్టాయి.  మూడున్నర దశాబ్ధాల ఆయన జర్నలిస్ట్  ప్రస్థానం అంతా ప్రజాశక్తి దినపత్రికతోనే ముడిపడింది. ఆ పత్రికలో ఆయన విలేకరిగా, స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, డెస్క్ ఇన్ చార్జిగా, ఎడిషన్ ఇన్ చార్జిగా, కోస్తా జిల్లాల న్యూస్ కోఆర్డినేటర్ గా, ఫీచర్ రైటర్ గా, ప్రజాశక్తి జర్నలిజం కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్, మొఫిషియల్ నెట్ వర్క్ ఇన్ చార్జిగా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా, కేంద్ర ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా, ప్రజాశక్తి ప్రచురణ సంస్థ అసిస్టెంట్ ఎడిటర్ గా.... ఇలా ఒక్క ఎడిటర్ పోస్టు తప్ప అన్నీ చేశారు. ఇప్పటికీ ప్రజాశక్తికి చెందిన ‘రైతువాణి’ మాసపత్రికకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రజాశక్తి దినపత్రికలో ఎన్నో శీర్షికలను నిర్వహించడంతోపాటు వేల వ్యాసాలు, వార్తా కథనాలు రాశారు. ఆ రంగం ఈ రంగం అని ఏమీలేదు రాజకీయ, సాహిత్య, కళలు.... ఇలా అన్ని రంగాలపై వ్యాసాలు రాశారు. అనే మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. నిత్య స్ఫూర్తి(డాక్టర్ డి.సాంబశివరావు), ప్రతిభామూర్తులు వంటి పది పుస్తకాల వరకు రాశారు.  దశాబ్దానికి పైగా మగ్గం నేసిన చేతులతో ఓ చేనేత కార్మికుడు  జర్నలిస్టుగా  వేయికి పైగా వ్యాసాలు రాసి ఈ స్థాయికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకోవడం అభినందనీయం. 

విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్చి 19న  జరిగే వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాలతో వారిని సత్కరిస్తారు.  ఉగాది పురస్కారం గ్రహీతలకు రూ. 10వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Mar 15, 2026

చీరాలలో చేనేత స్వరం



మనోడిని గెలిపించుకోలేమా?

చేనేత గర్జన చాట్రాసి రాజేష్ 

చేనేత వర్గాల్లో ఓ మెరుపు

కదులుతున్న చేనేత చక్రాలు 

చీరాల వీధుల్లో ఉదయం మొదలయ్యే శబ్దం కేవలం బజార్లది కాదు, చేనేత మగ్గాలది. ఆ మగ్గాల శబ్దంలోనే తరతరాల కథలు, బాధలు, ఆశలు దాగి ఉన్నాయి. దాదాపు ఎనభై వేల మంది చేనేత వర్గాలు ఉన్న ఈ నియోజకవర్గంలో సంవత్సరాలు గడిచినా, ఎన్నో ఎన్నికలు జరిగిపోయినా ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. “మన సమస్యలు చెప్పడానికి మనవాడే నాయకుడిగా ఎందుకు రాడు?” అదే ప్రశ్న ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. చీరాల చేనేతల్లో ఇప్పుడు ఒక పేరు బలంగా వినిపిస్తోంది. చాట్రాసి రాజేష్. సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓగా ఉన్న ఒక యువకుడు,  రాజకీయాల్లో అడుగు పెట్టి చేనేత సమాజం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు, చీరాల రాజకీయాల్లో కొత్త కథ మొదలైంది. అది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, చేనేతల ఆత్మగౌరవ కథ.


చేనేత ఐక్యత సమీకరణలు

చీరాల చేనేతల రాజకీయ ఆవేదన

నాయకత్వం కోసం ఎదురుచూపు

నేనున్నానంటున్న చేనేత చైతన్య స్ఫూర్తి

సాఫ్ట్‌వేర్ సీఈఓ నుంచి సామాజిక చైతన్యం

చీరాల రాజకీయాల్లో చాట్రాసి రాజేష్ అడుగులు

యువతలో పెరుగుతున్న రాజకీయ కాంక్షలు

నలభై ఏళ్ల తర్వాత మళ్లీ చిగురిస్తున్న చేనేత ఆశలు 

టికెట్ రాకపోతే తిరుగుబాటన్న భావన

చేనేతల గుండెల్లో పెరుగుతున్న ఆత్మగౌరవం

చీరాల నుంచి చేనేత నాయకత్వమే శ్రీరామరక్ష



చీరాల ఉదయం మెలుకువ తీసేది సూర్యుడు కాదు, మగ్గాల మోత.  ఆ శబ్దంలో వేలాది కుటుంబాల జీవితం ఉంది. తరతరాలుగా చీరలు అల్లిన చేతులు దేశానికి అందాలు అద్దాయి. కానీ, అదే చేతులకు రాజకీయాల్లో మాత్రం స్థానం దక్కలేదు. ఎన్నికల సమయంలో చేనేతల వద్దకు వచ్చే నాయకులు, గెలిచిన తర్వాత మాత్రం కనిపించరనే బాధ చీరాల చేనేతల్లో ఏళ్లుగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ బాధ ఆగ్రహంగా మారుతోంది. ఆ ఆగ్రహం మధ్య ఒక దారి కన్పిస్తోంది. ఆ దారి పేరు చాట్రాసి రాజేష్. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓగా ఎదిగిన ఒక యువకుడు,  చేనేత గళంగా ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తుండటంతో చీరాల రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. చేనేత సమస్యలు పరిష్కారం కావాలంటే చేనేత కుటుంబం నుంచే నాయకుడు రావాలి అనే బలమైన అభిప్రాయం ఇప్పుడు మరింత బలపడుతోంది.

చీరాల చేనేత కథ – పోరాటాల చరిత్ర


చీరాల అంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది చేనేత పరిశ్రమ. ఇక్కడి వీధుల్లో తిరిగితే ప్రతి ఇంట్లో ఒక మగ్గం కనిపిస్తుంది. ప్రతి కుటుంబం వెనుక ఒక చీర కథ ఉంటుంది. కానీ ఆ కథ అంతా విజయగాథ కాదు. అది కష్టాల గాథ కూడా. తరతరాలుగా మగ్గం మీదే జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబాలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. మార్కెట్ మారింది, యంత్రాలు వచ్చాయి. కానీ, చేనేత మాత్రం మారలేదు. చీరలు అల్లే చేతులు దేశానికి అందమైన వస్త్రాలు అందించాయి. కానీ, అదే చేతులకు రాజకీయాల్లో మాత్రం స్థానం దక్కలేదు. ఇది చీరాల చేనేతల్లో ఎప్పటి నుంచో ఉన్న బాధ.

ఎనభై వేల ఓట్లు… కానీ నాయకత్వం లేదు

చీరాల నియోజకవర్గంలో చేనేత వర్గాల సంఖ్య భారీగా ఉంది. స్థానిక నాయకుల అంచనాల ప్రకారం 70 నుంచి 80 వేల వరకు చేనేత ఓటర్లు ఉన్నారు. ఇంత పెద్ద ఓటు శక్తి ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వారికి సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. ఎన్నికల సమయంలో పార్టీలు ఓట్లు అడుగుతాయి. ప్రచారంలో చేనేతలతో ఫొటోలు దిగుతాయి. హామీలు ఇస్తారు. కానీ టికెట్ల కేటాయింపులో మాత్రం చేనేతల పేరు కనిపించదు. ఇది క్రమంగా చేనేతల్లో ఆవేదనగా, తరువాత ఆగ్రహంగా మారింది.


చీరాల రాజకీయాల్లో రాజేష్ చర్చ

చీరాల నియోజకవర్గంలో చేనేత వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. “మనవాడిని మనమే గెలిపించుకోవాలి?” అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకువస్తోంది. ఈ చర్చ మధ్య యువ నేత చాట్రాసి రాజేష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చేనేత వర్గాల్లో రాజేష్ పేరు ప్రస్తావనకు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. యువ నాయకత్వం, విద్యావంతుడిగా గుర్తింపు, వ్యాపార రంగంలో అనుభవం, రాజకీయాల్లో చురుకైన పాత్ర వంటి అంశాలు ఆయనను చేనేతల్లో చర్చనీయాంశంగా మార్చాయి. అదేవిధంగా, యువతలో మంచి గుర్తింపు ఉండటం కూడా ఆయనకు బలంగా మారిందని చెబుతున్నారు. చీరాలలో చేనేత వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమనే భావన పెరుగుతున్న నేపథ్యంలో రాజేష్ పేరు మరింతగా వినిపిస్తోంది.

ఇక్కడే మొదలైంది రాజేష్ కథ




ఇలాంటి సమయంలో చీరాలలో ఒక పేరు వినిపించడం మొదలైంది.     అదే, రామకృష్ణాపురానికి చెందిన చాట్రాసి బాల వెంకటేశ్వర్లు, కృష్ణ కుమారి దంపతుల కుమారుడైన చాట్రాసి రాజేష్ పేరు.  సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాజేష్  కాకినాడలోని జేఎన్‌టీయూలో ఎంటెక్ చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించిన రాజేష్ సొంత కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాస రావు కుమార్తె స్వాతిని వివాహం చేసుకున్నారు. వారికి మోనిషా రాజ్ అనే ముద్దుల కుమార్తె జన్మించారు. వ్యాపారవేత్తగా తనదైన గుర్తింపు సంపాదించారు.   డేటా ఓషన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించి దానికి సీఈఓగా రాజేష్ వ్యవహరిస్తున్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారంలో విజయం సాధించిన తర్వాత కూడా  తన ఊరు, తన సామాజిక వర్గం గురించి ఆలోచించడం ఆయన ప్రత్యేకత. ఆ తర్వాత చేనేత వర్గం, తను పుట్టిన ప్రాంతం అభివృద్ధిపై దృష్టి సారించి, పేదలకు సాయం చేయడం మొదలు పెట్టి,  రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. రాజకీయ నేతగా ఎదగడం ప్రారంభించారు. 

2014 నుంచే రాజకీయాల్లో రాజేష్ అడుగులు


చీరాలకు చెందిన యువ నాయకుడు చాట్రాసి రాజేష్ రాజకీయ ప్రయాణం ఒక్క రోజులో ప్రారంభమైనది కాదు. దాదాపు దశాబ్దం క్రితమే రాజకీయాల్లో అడుగుపెట్టి క్రమంగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు. 2014 ప్రాంతంలోనే రాజేష్ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ప్రారంభంలో పార్టీ కార్యక్రమాలకు సహకరిస్తూ పనిచేశారు. అనంతరం యువతతో సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ విధంగా దశలవారీగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ స్థానికంగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా చీరాల ప్రాంతంలో యువతతో రాజేష్‌కు మంచి అనుబంధం ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజేష్‌పై లోకేష్ ప్రభావం


చీరాలకు చెందిన యువ నాయకుడు చాట్రాసి రాజేష్ రాజకీయ ఆలోచనలపై మంత్రి నారా లోకేష్ ప్రభావం బాగా ఉంది. యువత రాజకీయాల్లో ముందుకు రావాలనే సందేశం తనకు ప్రేరణగా మారిందని రాజేష్ పేర్కొన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఆయన చేసి కృషి తనను ప్రభావితం చేసిందని రాజేష్ తెలిపారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని సమాజ సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలనే ఆలోచన తనకు లోకేష్ ద్వారా వచ్చిందని చెప్పారు. ఇటీవల లోకేష్‌ను కలిసి అభినందించిన సందర్భంగా కూడా యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు రావాలని రాజేష్ ఆకాంక్షించారు. యువ నాయకత్వం పెరిగితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

పేద వర్గాలకు సహాయపడుతున్న రాజేష్

సమాజ సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న రాజేష్ పేదవర్గాలకు సహాయపడుతున్నారు. పేద వర్గాలు నివసించే ప్రాంతాలలో పర్యటిస్తూ, కులం, మతంలో సంబంధంలేకుండా అన్ని వర్గాల వారికి నిత్యావసర సరుకులు అందించడంతోపాటు, వారు చిరు వ్యాపారాలు చేసుకుని బతికే విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందుకోసం  ‘చాట్రాసీ ఫౌండేషన్’ను స్థాపించారు.  ఆనారోగ్యంతో బాధపడేవారికి వైద్యం చేయిస్తున్నారు. దాంతో, పేద వర్గాల్లో రాజేష్ మంచి పేరు సాధించారు. అతను చేసే సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు పొందారు. పార్టీ వర్గాల్లో,  ముఖ్యంగా చేనేత వర్గాలలో యువ నేతగా దూసుకుపోతున్నారు. 

ఆయన చేపట్టే కార్యక్రమాలకు భారీ స్థాయిలో యువత ఆకర్షితులవుతున్నారు. దాంతో, రాజేష్ అన్న అని పిలుచుకునే రాజేష్ యువసేన తయారవుతోంది. ‘మన మంగళగిరి- మన లోకేష్’ మాదిరిగా ‘మన చీరాల- మన రాజేష్’అని యువత మద్దతు పలుకుతున్నారు. 

చీరాల రాజకీయాల్లో ట్విస్ట్

చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చేనేత వర్గాలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ స్థానికంగా బలంగా వినిపిస్తోంది. చీరాల రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చేనేత వర్గాలకు టికెట్ ఇవ్వాలని స్థానికంగా బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఈ డిమాండ్ ఒక్కసారిగా ప్రధాన రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించింది. అయితే పార్టీలు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా చేనేత వర్గాల్లో మాత్రం చర్చలు ప్రారంభమయ్యాయి. చేనేతలకు ఈసారి అవకాశం తప్పక వస్తుందన్న భావన  చీరాల రాజకీయాల్లో నెలకొంది. 

యువతలో పెరుగుతున్న చైతన్యం

చీరాల నియోజకవర్గంలో చేనేత వర్గాల ఉద్యమంలో యువత పాత్ర రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు రాజకీయాల్లో పెద్దగా కనిపించని చేనేత యువత ఇప్పుడు చర్చల్లో చురుకుగా పాల్గొంటున్నారు. చేనేతలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమనే అంశంపై యువతలో చైతన్యం పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికల నుంచి గ్రామ సభల వరకు ఈ విషయం చర్చకు వస్తోంది. చేనేత సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో చేనేతలకు అవకాశాలు రావాలంటే యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చీరాలలో చేనేత యువతలో రాజకీయ చైతన్యం పెరుగుతుండటం గమనార్హం.

చీరాల నుంచి కొత్త రాజకీయ కథ? 

చీరాల రాజకీయ చరిత్రలో ఎన్నో నాయకులు వచ్చారు. కానీ ఇప్పుడు చేనేతల్లో ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. ఆ ఆశ పేరు రాజేష్. ఆయన నిజంగా చీరాల నుంచి నాయకత్వం సాధిస్తారా? లేక ఇది మరో రాజకీయ కథగా మిగిలిపోతుందా? అది కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చీరాల చేనేతల్లో ఇప్పుడు నిద్రలేని చైతన్యం మొదలైంది. మగ్గాల శబ్దం మధ్య పెరిగిన ఆవేదన. ఇప్పుడు రాజకీయ స్వరంగా మారుతోంది. ఆ స్వరానికి నాయకత్వం రాజేష్ ఇవ్వాలని చేనేతలు భావిస్తున్నారు. చీరాల రాజకీయాలు చేనేతల చుట్టూ తిరిగాలని ఆ వర్గీయులు భావిస్తున్నారు.

Mar 3, 2026

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్


ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు పడకండి. ఇక్కడ ఇజం అంటే సాహితీ సేవనం, విమర్శ, ముఖ పుస్తక సాహితీ ప్రక్రియ. ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ కంటపడిన ఏ పుస్తకమైనా,  పురాతన భవనమైనా, మరేదైనా వాటికి సాహితీ తీగ అల్లుకుంటుంది. వాటి లోతులకు వెళ్లి, అంతగా పెనవేసుకుపోతారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలం నంది వెలుగు గ్రామంలోని వందేళ్లనాటి పచ్చి పులుసు వారి మేడ గురించి కూడా చాలా అద్భుతంగా  రాశారు.  ఫేస్ బుక్ వేదికగా ‘కాఫీ విత్’ శీర్షికన  ఇప్పటి వరకు 3123  విమర్శలు, విశ్లేషణలు రాసిన సాహితీ దిగ్గజం రజా హుస్సేన్.  తెలుగు సాహిత్యంలో ఇదో రికార్డ్.  పాత, కొత్త అనే భేదంలేకుండా తెలుగు సాహిత్యంలో కాకలుతీరిన పురాతన కవుల దగ్గర నుంచి వర్ధమాన కవుల‌ వరకు, వారి కవిత్వ సమగ్ర విశ్లేషణే ఈ శీర్షిక ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియాలో సాహితీ లోకం మొత్తాన్ని ఇప్పుడు అమితంగా ఆకర్షిస్తున్న శీర్షిక ఇది. ఈ శీర్షికే  కాకుండా, చిత్రకళా పరిమళం పేరుతో మరో 400 ఎపిసోడ్స్ రాశారు.  ఇంకా అనేక శీర్షికలతో  పుంఖానుపుంఖాలుగా పలు అంశాలపై విమర్శలు, విశ్లేషణలు చేశారు. రాస్తున్నారు. ఇలా నిరంతరం అంటే, రాత్రి, పగలు  సాహితీ సేద్యం చేయడమే ఆయనకు  అత్యంత ఇష్టమైన పని.  రచనా వ్యాసంగంలో స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న ఆయన చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, అందులోని  ఫేస్ బుక్ లో ఇబ్బడిముబ్బడిగా సాహిత్యం పండిస్తారు.  కవులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు.... ఇలా అనేక రంగాల వారి గురించి, వారి సాహిత్య, కళా నైపుణ్యాల గురించి విశ్లేషించారు.  ఇలా ఎన్నో వేల మంది గురించి రాసిన విమర్శకుడు రజా హుస్సేన్. తెలుగు సాహిత్యానికి ఇంత సేవచేస్తున్నవారు ప్రస్తుతానికి మరొకరులేరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి  కాదు. 

‘కాఫీ విత్’ శీర్షికన రాసిన కవుల గురించి ఒక్కో పుస్తకం తీసుకురావలన్న సంకల్పంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ ప్రగతిశీల కవి గోలి మధు కవిత్వ విశ్లేషణతో  ఈ సీరీస్ ను  మొదలు పెట్టారు.  రచయిత హుస్సేన్ స్వగ్రామానికి చెందినవాడు కావడం వల్ల మధుకు ఆ అదృష్టం పట్టింది. 20 ఏళ్ల క్రితమే సరదాగా కవిత్వం రాయడం మొదలుపెట్టిన గోలి మధు, మూడునాలుగేళ్ల నుంచి మాత్రమే సీరియస్ గా రాస్తున్నారు. తల్లి గోలి పార్వతి నుంచి వారసత్వంగా మధుకు కవిత్వం రాయడం అబ్బింది. కళ్ల  ముందు అన్యాయం జరిగితే సహించలేడు. కళ్లెర్రచేసి మరీ కవిత్వం రాయగల ఘటికుడు గోలి మధు అన్నది రజా హుస్సేన్ అభిప్రాయం.  

ఇప్పటి వరకు మధు రాసిన భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021),  గమనం(2021),  సంఘర్షణ (2023), ఎదురీత(2025) అనే ఆరు పుస్తకాలు వచ్చాయి. తొలినాళ్లలోనే అభ్యుదయ భావాలతో మధు కవిత్వంలోకి అడుగుపెట్టాడు.  చేనేత సామాజిక వర్గం నేపథ్యం కలిగిన కవి మధు చేనేతకారుల ఈతిబాధలు, వారి బతుకుల్లో కష్టాలు, నష్టాల చిక్కులు తీయాలనే ప్రయత్నం ‘నవశకం’ కవితా సంపుటిలో కనిపిస్తుంది. కవిగా మధు రెక్కలు తొడుగుతున్న దశలో సామాజిక స్పృహతో రాసిన కవితలు   ‘గమనం’ సంపుటిలో ఉన్నాయి.  ఎవరి పక్షాన నిలిచాడో చెప్పాడు.  అన్నదాత రైతు పక్షాన రాసిన ‘రైతు సమరభేరి’  ఇప్పటికే రెండు ముద్రణలు జరగడం విశేషం.  ఢిల్లీ ఉద్యమ నేపథ్యంలో రైతు సమస్యను కేంద్రంగా చేసుకుని రాసిన కవిత్వం  ‘సంఘర్షణ’ అని రజా హుస్సేన్ పేర్కొన్నారు. 

కడుపు తీపి, కాలచక్రం, ప్రేమఖైది, జ్ఞాన నేత్రం, కర్తవ్యం, నాలోనీవు, మౌనం ... వంటి పలు కవితలను రజా హుస్సేన్ తనదైన స్టైల్లో విశ్లేషించారు. రైతులు, చేనేత కార్మికుల వెతలు, మణిపూర్ లో నగ్నకవాతు, పత్రికల తీరు, బౌద్ధం మొదలు కొని ప్రేమ కవిత్వం వరకు మధు రాసిన అనేక కవితలపై చాలా లోతుగా రాసిన విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తంగా మధుని ఆవిష్కరించిన పుస్తకం ఇది. ఏది రాసినా ఆసక్తిగా చదివించే శక్తి రజా హుస్సేన్ కలానికి ఉంది. అదే ఆయన ప్రత్యేకత. రజా హుస్సేన్ రచనలను భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీలు, సాహితీ సంస్థలు భద్రపరచవలసిన అవసరం ఉంది. 


కాఫీ విత్ గోలి మధు పుస్తకం వెల : రూ.100

పుస్తకాల కోసం సెల్: 9063167117

పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 28, 2026

ఆయేషా మీరా హత్య కేసులో అన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే!

మృత దేహాం అవశేషాలకు అంత్యక్రియలతో పూర్తిగా ముగిసిపోయిన కేసు

ఆయేషా మీరా మృత దేహాం అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆమె హత్య కేసు పూర్తిగా ముగిసిపోయినట్లు భావించవచ్చు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో 2007, డిసెంబరు 27 అర్ధరాత్రి జరిగిన ఆయేషా మీరా హత్యకేసులో సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. తెనాలికి చెందిన ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతూ హత్యకు గురైన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో ట్విస్ట్ లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరికి దోషిని కనిపెడతారు. అయితే, ఈ కేసు విచారణ 18 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన తర్వాత కూడా దోషులను కనిపెట్టకుండానే ఈ కేసుని విజయవాడ సీబీఐ కోర్టు ఈ నెల 20న మూసివేసింది. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ సమర్పించిన తుది నివేదిక ఆధారంగా ఈ కేసు మూసివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. రెండోసారి పోస్టుమార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా మృతదేహానికి సంబంధించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీన ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్, ప్రభుత్వ భద్రతతో తెనాలిలోని ఖబరస్తాన్ లో అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం తెనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. దీంతో, ఈ కేసు ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఆయేషా తల్లి శంషాద్ బేగం, తండ్రి ఇగ్బాల్ బాషాల పోరాటం ఫలించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 18 ఏళ్లు పోరాటం చేసి అలిసిపోయామని, ఇక పోరాటం చేసే శక్తి గానీ, ప్రొటెస్ట్ పిటిషన్ వేసే ఆర్థిక స్థోమత గాని తమకు లేవని ఆయేషా తల్లి కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు. వేడుకోని నాయకులు లేరు.

ఆయేషా హత్య జరిగిన వెంటనే దోషులు, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. అందులో వారు విజయం సాధించారు. రాజకీయాలు, కులం, డబ్బు, అధికారం.... వంటి అంశాల ప్రభావంతో దోషులు ఎవరో తేలకుండానే ఈ కేసుని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు ఇలా నీరుకారిపోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని న్యాయనిపుణులు తేల్చారు.
ఆయేషా హత్య జరిగిన తర్వాత తెల్లారిపాటికే అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా దోషులు ముందు జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా, పోలీసులు కూడా దోషులకు పూర్తిగా సహకరించారన్న ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. పైగా కొత్త ఆధారాలు సృష్టించారు. పోలీసులు ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతీ మీద ‘చిరుత 143’ అని, పొట్ట మీద లవ్ సింబల్ రాసి ఉంది. అక్కడే లభించిన ఓ లెటర్‌లో, ‘‘నన్ను ప్రేమించమని బతిమిలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసి ఉంది.
ఈ కేసులో పోలీసులు మొదట హాస్టల్ వంటమనిషిని అనుమానించి, విచారించారు. అతను కాదని తేలింది. తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు, జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింఘ్, గుర్విందర్ సింఘ్ అలియాస్ లడ్డూలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేశారు. అయితే, వారి అందరి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో వారిని విడుదల చేశారు. ఒకానొక సందర్భంలో ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కూడా పోలీసులు అనుమానించారు. చివరకు ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, అనాసాగర గ్రామానికి చెందిన పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొని, 2008 ఆగస్టు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి పద్ధతిలో అతనే ఆయేషాని హత్య చేసినట్లు ఒప్పించారు. సత్యంబాబుని 2010లో విజయవాడ మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతను వాస్తవం చెప్పాడు. తాను హత్య చేయలేదని, పోలీసులే తనచేత అలా చెప్పించారని కోర్టుకు తెలిపాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారం సత్యంబాబుని నేరస్తునిగా పేర్కొంటూ, మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నేరస్థుడు కాదని, ఓ మాజీ మంత్రి మనవడే అసలు నేరస్థుడని ఆయేషా తల్లి శంషాద్ బేగం తొలి నుంచి మొత్తుకుంటోంది. హాస్టల్ లోని ముగ్గురు అమ్మాయిలు బయటి వ్యక్తులతో ఉండటం చూసినందుకే ఆయేషాని హత్యచేశారని తల్లిదండ్రుల ఆరోపణ. వారి మాటలు వినే పరిస్థితులు లేవు. సత్యంబాబు బంధువులు హైకోర్టుని ఆశ్రయించారు. బొజ్జా తారకం వంటి వారు కోర్టులో సత్యంబాబు తరఫున వాదించారు. 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబు నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారని చెప్పడానికి తగిన ఆధారాలను పోలీసులు చూపలేకపోయారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఆ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు2018 జనవరి 27న హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయమని 2018 నవంబరు 29న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికే దిగువ కోర్టులో ఆధారాలు ధ్వంసం చేశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో, 2014లోనే విజయవాడ కోర్టులో ఈ కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు ముందే అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్లే జరిగింది. సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసుని 2018 డిసెంబరు 16న సీబీఐకి అప్పగించారు. ఆయేషా మృతదేహాన్ని సీబీఐ రీపోస్ట్ మార్టం చేసి, కొత్త ఆధారాలు ఏమీ దొరకలేదని కోర్టుకు తెలపడంతో కోర్టు కేసుని మూసివేసింది.
ఈ నేపథ్యంలో శంషాద్ బేగం వంటి పేద కుటుంబాలకు న్యాయం లభించే అవకాశం లేదా? స్థితిముంతులైతే రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు అండతో తప్పించుకోగలుగుతారా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వారు ఎలా తప్పించుకోగలిగారు? న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయాయా? శంషాద్ బేగం కుటుంబానికి ఏ రకంగానూ న్యాయం దక్కదా? హత్య జరిగిన నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ బదిలీ తర్వాత కేసు మొత్తం ఎలా తారుమారైంది? హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే, అయిదు నిమిషాల్లో కేసులోని నిజానిజాలు వెల్లడవుతాయని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆనాడే చెప్పారు. ఆమె చేత పోలీసులు ఎందుకు నిజం చెప్పించలేకపోయారు? హాస్టల్లో కొందరి రాసలీలలు చూసిందనే తన కుమార్తెని హత్య చేశారని శంషాద్ బేగం చెప్పారు. ఆ రాసలీలలు ఎవరి మధ్య జరిగాయో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? తెల్లారేపాటికి సాక్ష్యాలను ఎవరు మాయం చేశారు? పోలీసులు తెలుసుకోలేకపోయారా? ఈ కేసుకు సంబంధించిన రికార్డులు కోర్టులోనే ఎవరు ధ్వంసం చేశారు? ఎందుకు చేశారు? అంతటి తీవ్రమైన నేరాన్ని చేసినవారిని ఇంకా కనుగొనలేదా? వారిని తెలుసుకుని శిక్షించరా? సత్యంబాబు చేయని నేరానికి 8 ఏళ్లు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదల అయ్యాడు. హైకోర్టు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇవ్వమని తీర్పు ఇచ్చింది. సత్యంబాబు అన్యాయంగా 8 ఏళ్లు శిక్ష అనుభవించడానికి బాధ్యులు ఎవరు? సత్యంబాబు చేయని నేరం అంగీకరించే విధంగా పోలీసులు ఎందుకు చేశారు? అలా చేసిన వారికి శిక్ష ఏమీ లేదా? 8 ఏళ్ల జైలు శిక్షకు నష్ట పరిహారం లక్ష రూపాయలు ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. ఇది న్యాయమేనా? అతను అన్యాయంగా శిక్ష అనుభవించినందుకు, జైల్లో అతను, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అనుభవించిన మనోవేదనకు, బాధలకు, అతని జీవితంలో 8 ఏళ్లు వృధా అయినందుకు, అతనికి నష్టపరిహారం ఇదా? అసలు హంతకులు ఎవరు? ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలన్నిటీకీ సమాధానాలు లేవు. హత్య మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. అసలు హంతకులను కనిపెట్టలేని దయనీయ స్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా?. లేదా ఆ దోషులు తమకు అనుకూలంగా వాడుకునే స్థితిలో వ్యవస్థలు ఉన్నాయా?. చివరిగా ‘‘ఈ నెల 27న తమ కుమార్తె శరీర భాగాలతో పాటు సత్యం, న్యాయం, ధర్మాన్ని కూడా పూడ్చిపెట్టబోతున్నాం’’ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎంతో బాధతో చెప్పారు. న్యాయం కోసం పోరాడి, వేసారిపోయిన తల్లిదండ్రులు ఆయేషా మీరా పేరుతో ఒక విద్యా సంస్థని నెలకొల్పమని, ఇటువంటి బాధితులకు సహాయపడే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్ధాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్

• మనసా వాచా కర్మణా మద్దతు  • గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది • భూములు ఇచ్చిన రైతులను హింసించింది • రాజధానిగా అమరా...