మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో నగర ప్రముఖులు ముగ్గురు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున రావులను ఆ టెక్ పార్క్ బిల్డర్లలో ఒకరైన యింజమూరి శ్రీనివాసరావు ఆదివారం రాత్రి సన్మానించారు. చేనేత నేత గుత్తికొండ ధనుంజయ రావు 14 ఏళ్ల వయసులోనే టీడీపీలో చేరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగి, ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ, ఎదురీత వంటి కవితా సంపుటిలతో తెలుగు కవితా లోకంలో తనకంటూ ఒక పేజీని సొంతం చేసుకున్నారు. మంగళగిరిలో జర్నలిజంలో మొట్టమొదట మాస్టర్ డిగ్రీ చేసిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రిపోర్టర్-సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు ప్రముఖ దినపత్రికలలో పనిచేసి, 40 ఏళ్లకుపైగా అనుభవంతో ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం రాశారు. ఈ ముగ్గురుని యింజమూరి శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించి, గౌరవించారు.
ప్రత్యేక కథనాలు
Jun 15, 2026
Jun 12, 2026
తొలి సన్మానం
నాకు తొలి సన్మనం జరిగిన ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది. సాదారణంగా నాకు సన్మానాలంటే ఇష్టం ఉండదు. అందువల్ల ఎవరైనా సన్మానం చేస్తానంటే వద్దని చెప్పేవాడిని. సంవత్సరం సరిగా గుర్తులేదు, 2002 లేదా 2003లో కడప జిల్లా ప్రొద్దుటూరు సన్మానం చేయించుకోవలసి వచ్చింది. అక్కడి దేవాలయాలు చూడటానికి మా కుటుంబంతో వెళ్లాను. అప్పుడు అక్కడి వార్త స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ దగ్గర ఉండి, దేవాలన్నీ చూపించారు. చివరికి ఒక దేవాలయంలోకి వెళ్లినప్పుడు, దర్శనం అయిన తర్వాత ‘‘ఆలయ కమిటీవారు మీకు సన్మానం చేస్తారట’’ సార్ అని ప్రసాద్ చెప్పారు. ‘‘నాకు సన్మాలంటే ఇష్టం ఉండదు, వద్దు’’అని చెప్పాను. అయితే, ప్రసాద్ పట్టుబట్టారు. ‘‘ఇక్కడ బహుభాషా కోవిదుడు, 'సరస్వతీపుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ అగస్తేశ్వర ఆలయంలోనే ఈ చెట్టు క్రింద కూర్చొని ‘శివతాండవం’ కావ్యం రాశారు. అదే చెట్టు క్రింద మీకు సన్మానం చేస్తారు. వద్దనకండి సార్’’బతిమిలాడినట్లు అడిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే నాకు తొలిసారిగా సన్మానం చేశారు. పుట్టపర్తి నారాయణాచార్యులు అత్తగారి ఊరు ప్రొద్దుటూరు. ఆయన అక్కడ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే శివతాండవం కావ్యం రాశారు.
https://www.youtube.com/watch?v=wSsDbPTmc_k
Jun 10, 2026
పౌరహక్కుల బాలగోపాల్
దాదాపు మూడు దశాబ్దాల గణతంత్ర రాజ్యం సంక్షోభంలోకి జారిన 1975 నాటి భారత అత్యవసర పరిస్థితి వల్ల రాజకీయ చైతన్యం పొందిన తరానికి బాలగోపాల్ చెందినవారు. ఏకపక్ష అరెస్టులు, విచారణ లేని నిర్బంధాలు, మర్మమైన మరణాలు నిరంకుశ రాజ్యం రాకకు సంకేతాలుగా నిలిచాయి. సార్వభౌమ శ్రేయస్సు పేరిట అలా చేస్తున్నామని ప్రకటిస్తూనే, తమ దేశ-రాజ్యం ఏమి చేయగలదో, శిక్ష నుండి ఎలా తప్పించుకోగలదో భారత పౌరులు ముందుగానే రుచి చూశారు. యువకుడిగా, విమర్శనాత్మక దృక్పథంతో ఉండటం అంటే ఆనాటి పరిస్థితులతో మమేకమవ్వడమే. బాలగోపాల్ కూడా అలాగే చేశారు: మార్క్సిజంపై ఆసక్తితో మొదలుపెట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్లోని పోరాటపటిమ గల వామపక్ష రాజకీయాలను అనుసరించారు, వాటికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా, గ్రామీణ ఆంధ్రలోని ఆదివాసులు, దళితులతో కూడిన అతిపెద్ద అణగారిన వర్గాలను ఒక బలమైన రాజకీయ శక్తిగా సంఘటితం చేయడంలో ఆ వామపక్షాలు చేసిన కృషికి ఆయన అండగా నిలిచారు.ఆయన తెలుగు, ఆంగ్ల భాషలలో హక్కుల విషయాలపై రాశారు. ఆయన వ్యాసాలు దాదాపు ఎల్లప్పుడూ కేవలం జరిగిన సంఘటనల నివేదికల కన్నా ఎక్కువగా ఉండేవి. ఈ విషయంలో ఆయన ఒక కొత్త రాత ప్రక్రియకు మార్గదర్శకుడని చెప్పవచ్చు; అది వర్ణనాతీతమైనది: స్థానిక వివరాలు, చరిత్రలపై నిష్కళంకమైన శ్రద్ధ చూపుతూనే, వేగవంతమైన, హింసాత్మక పరివర్తనలో ఉన్న ఒక సమాజంలోని వర్గ, కుల స్వరూపాలను మనకు వివరిస్తూ, ఆయన విస్తృత చిత్రాన్ని ఆవిష్కరించగలిగారు. చివరికి, ఒక సంఘటనను దాని తక్షణ, చారిత్రక సందర్భాలలో, వర్గాలు, కులాల మధ్య మరియు భారత ప్రజలకు, భారత రాజ్యానికి మధ్య మారుతున్న సామాజిక, రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఎలా 'చదవాలో' మనం నేర్చుకున్నాం.
‘సహకార భూమి’కి సంపూర్ణంగా సహకరిస్తాం
సహకార వ్యవస్థకు ఓ దిక్సూచి ఈ పత్రిక
ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎండీ రామకృష్ణ భరోసా
విజయవాడ, జూన్ 9: సహకార రంగం విలువలు, విశిష్టత, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా కృషిచేస్తున్న ‘సహకారభూమి’ పక్షపత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) అండగా నిలుస్తుందని సంస్థ చైర్పర్సన్ గన్ని వీరాంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ భరోసా ఇచ్చారు. సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను విజయవాడలోని సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని విశిష్ట అతిథిగా హాజరైన నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి, మలి ప్రతిని గౌరవ అతిథి ఆర్.వి. రామకృష్ణకు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆప్కాబ్ చైర్పర్సన్ గన్ని మాట్లాడుతూ.. సహకార రంగం బలోపేతానికి ఇటువంటి పత్రికలు అత్యంత అవసరమని చెప్పారు. సహకారభూమి వ్యవస్థాపకులైన సహకారవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, సంఘాలు ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా, సహకార ఉద్యమం సజీవంగా ఉండాలని, దాని విలువలు సమాజానికి తెలియజేయాలనే మహోన్నత లక్ష్యంతో ఈ పత్రికను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సహకార రంగానికి సంబంధించిన సమాచారం, చరిత్ర, విలువలు, స్ఫూర్తిదాయక గాథలను ప్రజలకు చేరవేస్తూ సహకారభూమి ఒక ఉద్యమంలా పనిచేస్తోందని గన్ని కితాబిచ్చారు. సహకారభూమి కార్యాలయంలో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించే నినాదాలు, సహకార ఉద్యమ ప్రముఖుల చిత్రాలు, వారి సేవలను ప్రదర్శించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సహకారోద్యమ సీనియర్ నాయకుడు దాసరి కేశవులును హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ‘సహకారం మన సంస్కృతి - సహజీవనం మన సంప్రదాయం, సంఘశక్తే సహకార శక్తి’ వంటి సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతున్నా, సహకార రంగానికి సంబంధించిన అవగాహన కల్పించే పత్రికల అవసరం మరింత పెరిగిందన్నారు. సహకార రంగంలో జరుగుతున్న సేవలు, విజయాలు, సవాళ్లు ప్రజలకు తెలియాలంటే సహకారభూమి వంటి వేదికలు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని గన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో సహకారభూమి పత్రికకు సంస్థాగత మద్దతు అందించే అంశాన్ని ఆప్కాబ్ స్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్) స్థాయిలో పత్రిక విస్తరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆప్కాబ్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి, సహకారభూమికి సాధ్యమైనంత సహకారం అందించే దిశగా కృషి చేస్తామని గన్ని వివరించారు.
సహకార రంగానికి సేవలందిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు అందించగలిగే మద్దతు, సహాయంపై నాబార్డ్ అధికారులతోనూ చర్చిస్తామని తెలిపారు. సహకారభూమి సహకార విలువలను పరిరక్షిస్తూ, రైతులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, మేధావుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించే దిశగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాబోయే తరాల మనస్సుల్లో సహకార భావజాలం నిలిచిపోయేలా పత్రిక చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ ఎడిటర్ అక్బర్ పాషా, న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణ, పత్రిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పత్రిక డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రావాలని సూచిస్తూ, అందుకు వ్యయమయ్యే 50 వేల రూపాయలు, పత్రిక కార్యాలయం నిర్వహణకు మరో 10 వేల రూపాయలను వ్యక్తిగత విరాళంగా ప్రకటించి, అక్కడికక్కడే అందజేశారు.
గౌరవ అతిథిగా హాజరైన ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ సందేశమిస్తూ.. పత్రిక అన్ని సంఘాలకు చేరాల్సిన అవసరముందని, ఇందుకు ఆప్కాబ్ చేయూతనిస్తుందని చెప్పారు. వెబ్సైట్ రూపకల్పన కోసం ఆయన కూడా సంస్థ తరపున 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఆప్కాబ్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. విశిష్ట అతిథిగా నాబార్డ్ ప్రతినిధి చంద్ర మూర్తి సందేశమిస్తూ.. సహకారభూమి పత్రిక అత్యవసరంగా డిజిటల్ రూపంలోకి రావాల్సిన అవసరముందన్నారు. పత్రికకు నాబార్డ్ అందించే సాయంపై కూడా ఆలోచన చేస్తామని, తమ సంస్థ నుంచి కూడా సాంకేతిక సహకారం పొందవచ్చని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి వెటరన్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మావతి అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయుల సంఘ నేత చావా రవి సభకు స్వాగతం పలికారు. సీనియర్ సహకరవాదులు, జర్నలిస్టులు దాసరి కేశవులు, ఇఫ్కో రవీంద్ర, జి.వి. రంగారెడ్డి, శిరందాసు నాగార్జున, ప్రసాదరెడ్డి, టి.వి. నరసింహారావు, దుర్గరాజు స్వాతి, డి. రామారావు, వై. శ్రీనివాసరావు, శివప్రసాద్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Jun 4, 2026
చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగానే పూర్తి పెన్షన్ లెక్కింపు
ఈపీఎఫ్ఓ (EPFO) అవలంబిస్తున్న 'ప్రొ-రేటా' (Pro-rata) పద్ధతిని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది. సర్వీస్ కాలాన్ని విభజించి పెన్షన్ను తగ్గించే పాత పద్ధతి చెల్లదని, పదవీ విరమణ సమయంలో చివరిగా తీసుకున్న 60 నెలల సగటు వేతనం ఆధారంగానే పూర్తి పెన్షన్ను లెక్కించాలని స్పష్టం చేసింది.
ఈపీఎఫ్ పెన్షన్ లెక్కింపుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల వివరాలు:
ప్రొ-రేటా పద్ధతి రద్దు: 2014 సవరణ తర్వాత ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ప్రొ-రేటా పద్ధతిని కోర్టు తప్పుబట్టింది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ భారీగా తగ్గిపోతుందని పేర్కొంది.
సరైన లెక్కింపు సూత్రం: పదవీ విరమణకు ముందున్న చివరి 60 నెలల (5 సంవత్సరాలు) సగటు జీతం ఆధారంగానే పింఛనును లెక్కించాలని ఆదేశించింది.అర్హులైన వారందరికీ వర్తింపు: ఈ తీర్పు కేవలం పిటిషన్ వేసిన వారికి మాత్రమే కాకుండా, అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగికి/పెన్షనర్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
వడ్డీతో బకాయిలు: ఈపీఎఫ్ఓ తప్పుడు విధానాల వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి, ఆ బకాయిలను 8 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు – అధిక PF పెన్షన్పై కీలక తీర్పు
ప్రో-రాటా విధానం రద్దు
▶▶ ఉద్యోగ సేవా కాలాన్ని విభజించకుండా పెన్షన్ను లెక్కించాలి : 12 వారాల్లో అమలు
కె. సునిల్కుమార్
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేసిన ప్రో-రాటా (అనుపాత) విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం ద్వారా అధిక PF పెన్షన్ లెక్కింపులో వివాదాస్పద ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
హైకోర్టు న్యాయమూర్తి హర్ప్రీత్ సింగ్ బ్రార్ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, పెన్షన్ను లెక్కించేటప్పుడు 2014 సెప్టెంబర్ 1కు ముందు మరియు తర్వాత సేవా కాలాన్ని విడదీయకూడదు. బదులుగా, చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా మొత్తం పెన్షన్ను లెక్కించాలి.
పెన్షన్ పునఃలెక్కింపుతో వచ్చే బకాయిలపై 8% వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది.
ఈ తీర్పులో పెన్షనర్లు చాలా కాలంగా కోర్టుల్లో లేవనెత్తుతున్న పలు అంశాలపై అనుకూల ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా, డీఏ (Dearness Allowance) మరియు వేతన సవరణ బకాయిలను కూడా పెన్షన్ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవాలి అని పేర్కొంది.
ముఖ్యాంశాలు
2024 ఫిబ్రవరి 14న EPFO జారీ చేసిన ప్రో-రాటా విధానం అమలు సర్క్యులర్ను కోర్టు రద్దు చేసింది.
సురీందర్ కుమార్ సింగ్ సహా వంద మందికి పైగా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ తీర్పు కేవలం పిటిషనర్లకే కాకుండా అందరికీ వర్తిస్తుంది అని కోర్టు స్పష్టం చేసింది.
ప్రయోజనాలు పొందేందుకు పెన్షనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపింది.
అలాగే, ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన వారి పెన్షన్ పునఃపరిశీలన, బకాయిల చెల్లింపు మరియు వడ్డీ చెల్లింపును 12 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
ఈ నెల 27న జారీ చేసిన సమాధానం ప్రకారం, ఇతర అర్హులైన పెన్షనర్లు కూడా 3 నెలలలోపు EPFO అధికారులకు దరఖాస్తు చేసి ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
Jun 3, 2026
పర్యావరణ, ప్రజా ఆరోగ్యమే ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం
భవిష్యత్తులో తలెత్తే సమస్యలను, అవసరాలను ముందుగానే ఊహించగల దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పారిశుద్ధ్యంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు, ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా రూపు దిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా కార్పోరేషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యమే ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం. చెత్త పన్నుని రద్దు చేయడంతోపాటు చెత్త నుంచి కూడా ఆదాయం సమకూర్చే మార్గాలను గృహిణులకు ఈ ప్రభుత్వం చూపుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలతో రాష్ట్రంలో 2015లో ఈ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి దీనిని ప్రారంభించారు. వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, వ్యర్థాలను శుద్ధి చేయడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం, వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి అనేక కార్యక్రమాలను చేపడుతోంది. స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను తడిచెత్త, పొడిచెత్త, బయోమెడికల్ వేస్ట్... వంటి వివిధ రకాలుగా వేరుచేసి సమర్థవంతంగా నిర్వహించడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. సంపద సృష్టించేవిధంగా రాష్ట్రంలో పలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది. మునిసిపల్, పంచాయతీ సిబ్బందికి, ఆషా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే, వివిధ వ్యాపార సంస్థల అసోసియేషన్ల వారు, కళాకారులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల వారిని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
సీఎం చంద్రబాబు ప్రతి నెలలో ఒక రోజు పారిశుద్ధ్యానికి కేటాయింపు
ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన రాష్ట్రాంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి నెలలో ఒక రోజు(మూడవ శనివారం) ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్రకు కేటాయిస్తున్నారు. ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొంటూ, తానే చీపురు పట్టుకుని వీధులను శుభ్రంచేయడంతోపాటు పరిసరాలన్నిటినీ పరిశీలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్నారు. వారి వృత్తిలో తలెత్తే సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తున్నారు. సీఎం, కార్పొరేషన్ చైర్మన్ పాల్గొనడంతో, ప్రతి జిల్లాలో కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు కూడా పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.
గ్రీన్ ఏపీ లక్ష్యంగా
గ్రీన్ ఏపీ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులు, హరిత హైడ్రోజన్, పచ్చదనాన్ని పెంచడం, కాలుష్య నిర్మూలనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం ప్రధాన పాత్ర పోషించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్బన్, టెర్రెస్ గార్డెనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో తయారు చేసే వివిధ రకాల కంపోస్టింగ్ కి సంబంధించి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పచ్చదనం విస్తరిస్తోంది. ఈ పచ్చదనం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వాతావరణంలో వేడి తగ్గుతోంది.
పట్టాభిరామ్, అధికారుల బృందం వివిధ రాష్ట్రాలలో అధ్యయనం
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లక్ష్యాలను ఓ యజ్ఞంలా స్వీకరించి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టాభిరామ్ దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై, నవీ ముంబై, పూణే మెట్రోపాలిటన్ ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రం పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, కర్ణాటకలోని మంగళూరు, ఉడిపి, పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా, ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, తెలంగాణలోని సిద్ధిపేట.... వంటి నగరాలు, పట్టణాలలో పర్యటించి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆయా కార్పోరేషన్లలో ఇంటింటా చెత్త సేకరణ విధానం, తడిచెత్త, పొడి చెత్త వేరుచేయడం, తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలు, చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ టైల్స్ తయారీ విధానం, పట్టణంలోని మౌలిక సదుపాయాల నిర్వహణ...మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టాభిరామ్ తన వ్యక్తిగత యూరప్ పర్యటనలో కూడా పలు నగరాలలో పర్యటించి అక్కడ అవలంబించే పద్ధతులను అధ్యయనం చేశారు. డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్, స్విడ్జర్లాండ్.. మొదలైన దేశాలలో పర్యటించి వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ రీసైక్లింగ్... వంటి అంశాలను పరిశీలించారు. వారి పర్యటనలలో గ్రహించిన అంశాలను, మన రాష్ట్రంలో అమలు చేయదగినవాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
స్వచ్ఛ అవార్డులు ప్రకటించిన తొలి రాష్ట్రం ఏపీ
‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారి సేవలను గుర్తించి, అటువంటి వారిని గౌరవించి, ప్రోత్సహించే విధంగా గత అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. దేశంలో ఇటువంటి అవార్డులను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. స్వచ్ఛ చాంపియన్ పేరుతో ఈ అవార్డులను వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చా రు. మొత్తం అన్ని వర్గాల వారిని స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్(స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్), స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ హాస్పటల్స్, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ హోటల్స్, స్వచ్ఛ పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), స్వచ్ఛ వారియర్స్(శానిటేషన్ వర్కర్లు), స్వచ్ఛ గ్రామ పంచాయితీలు, స్వచ్ఛ గ్రామ సంస్థలు, స్వచ్ఛ అంగన్ వాడీలు, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ రైతుబజార్లు, స్వచ్ఛ పరిశ్రమలు(అతిపెద్ద, పెద్ద), స్వచ్ఛ ఎన్జీవోస్(స్వచ్ఛంద సంస్థలు)/పౌర సంస్థలు, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ అని 12 కేటగిరీలుగా విభజించి ఈ అవార్డులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 రాష్ట్ర స్థాయి, 1,421 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చారు. పారిశుద్ధ్యం పర్యావరణ పట్ల ఆసక్తి ఉన్నవారిలో ఈ అవార్డులు ఉత్సాహం నింపాయి.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలు
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత మునిసిపల్ కార్యాలయాలుగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. తొలుత అమరావతిలోని ఏపీ సెక్రెటేరియేట్ నుంచి మొదలు పెట్టారు. గత ఆగస్టు 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించారు. వాటి స్థానంలో స్టీల్, గాజు బాటిళ్లను వాడుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఉద్యోగికి ఉచితంగా స్టీల్ బాటిళ్లు అందజేశారు. సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ కూడా లభించింది. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా మార్చేశారు. తొలుత అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లోని 20 జిల్లాల్లో 62 మునిసిపల్ కార్యాలయాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కూడా రోజుకు 15 నుంచి 18 గంటలు పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటించడంతోపాటు అధికారులు, ఏజన్సీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, అందరూ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యే విధంగా ఉత్సాహపరుస్తున్నారు.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
Jun 1, 2026
వైభవంగా గుత్తికొండ ధనుంజయ జన్మదిన వేడుకలు
మంగళగిరి: మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుజయరావు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని దామర్ల నాంచారమ్మా చెరువు ప్రాంగణంలోని భవనారుషి స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేకా కృష్ణార్జున రావు మాట్లాడుతూ సాహితీ కళారంగాల అభ్యున్నతికి గుత్తికొండ ధనుంజయరావు గారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని అన్నారు. విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబాత్తుని లక్ష్మణరావు మాట్లాడుతూ నిబద్దత, ఓర్పు, సహనంతో కూడిన వైఖరి కారణంగానే గుత్తికొండ ధనుంజయరావు గారిని తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో పదవి వరించిందని చెప్పారు. ఈ విధంగా సామాన్య కార్యకర్తను గౌరవించడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని అభిప్రాయపడ్డారు. తోలుత మానవతా వేదిక కమిటీ సభ్యులు అందరూ సమూహంగా ధనుంజయరావు దంపతులను ఘనంగా సన్మానించారు. అటుపిమ్మట పురప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు శాలువాళ్లతోనూ, పుష్పగుచ్చాలతోనూ ఘనంగా సత్కరించారు.
పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల తెలుదేశం పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీ అనిత, ధనుంజయరావు బాల్యమిత్రులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మంచా విజయమోహనరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు శిరందాసు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించే రీతిలో జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధనుజయరావు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం
మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో నగర ప్రముఖులు ముగ్గురు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున రావులను ఆ టెక్...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...






