Jul 13, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -7



మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి

మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే పరిచయం. అక్కడే మేం మంచి స్నేహితులమయ్యాం. మోహన్ రావు ఆంధ్రజ్యోతి-హైదరాబాద్ నుంచి విశాఖకు ట్రాన్స్ ఫర్. ఆంధ్రజ్యోతి-హైదరాబాద్ లో నా క్లాస్ మేట్ తిప్పావఝ్జుల కుమార్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తొలుత కుమార్ రిఫరెన్స్ తో మోహన్ రావు నాకు పరిచయం. ఆ పరిచయం స్నేహంగా మారి, ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీనివాసరెడ్డి మాత్రం నాకు విశాఖలోనే పరిచయం. మేమిద్దరం విశాఖలోనే ఆంధ్రయూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ పూర్తి చేసిన విషయం మీకు తెలుసు.

విశాఖ-ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారిలో ఎక్కువ మంది జీతాలపై బతికేవాళ్లమే. నాకు మాత్రం రూ.2 వేలు జీతం. శ్రీనివాసరెడ్డి కూడా స్పాట్ న్యూస్ అపాయింట్ మెంట్. అందువల్ల అతనికీ దాదాపు నా అంతే వచ్చేది. మోహన్ రావు ఏపీఎల్ అపాయింట్ మెంట్ అందువల్ల నాకంటే ఎక్కువగా ఉండేది. అందరికీ మనీ మేనేజ్ మెంట్ తెలుసు. చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకునేవాళ్లం. అదీగాక, విశాఖ కొత్త, అక్కడ ఆఫీసులో వాళ్లు తప్ప బయట వాళ్లు ఎవరూ పెద్దగా తెలియదు. ఆ రూ.2వేలు జీతంతో మేమిద్దరం, మాకు ఇద్దరు పిల్లలు నలుగురం చాలా సంతోషంగా బతికేవాళ్లం. శుక్రవారం ఆఫ్. ప్రతి శుక్రవారం అందరం రామకృష్ణ బీచ్ కు వెళ్లేవాళం. అప్పుడు కైలాసపురం నుంచి బీచ్ కి ఆర్టీసీ బస్ చార్జి రూ.2లు ఉండేది. ఒకటే టిక్కెట్. నాకు ఫ్రీ పాస్ ఉండేది. పిల్లలకు టికెట్ లేదు. జీవితం సాఫీగానే సాగేది. ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే ఎవరికైనా సమస్య.  ఎవరికైనా ఇబ్బంది వస్తే, మిషన్ సెక్షన్ లో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన వద్ద వడ్డీకి తీసుకునేవారు.  అతని పేరు గుర్తు లేదు. లావుగా ఉండేవారు. జీతాలు ఇచ్చే రోజున అక్కడే ఉండి, వడ్డీ లేదా అసలు వసూలు చేసుకునేవారు.  చాలా మంది అతని వద్ద వడ్డీకి అప్పు తీసుకునేవారు. వడ్డీ రూ.3లు. నేను కూడా రెండు మూడుసార్లు తీసుకున్నట్లు గుర్తు. వెయ్యి, రెండు వేలు మాత్రమే తీసుకునేవాడిని. ఎందుకంటే మళ్లీ తిరిగి చెల్లించడం కష్టం గదా. అదీగాక అప్పు తీర్చేదాక నాకు నిద్రపట్టదు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించడం నాకు అలవాటు. అందువల్ల నా మిత్రులకు నేనే అప్పు ఇచ్చేవాడిని గానీ, నేను ఎవరి వద్ద అప్పు తీసుకునేవాడిని కాదు.    నాకు ఎప్పుడైనా అత్యవసరం అయితే, నేను రూ.2ల వడ్డీకి ప్రయత్నించేవాడిని. ఒకసారి ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆపరేషన్. మిషన్ సెక్షన్ అతని అడిగాను, ఆ సమయంలో అతని వద్ద కూడా లేవు. చాలా మంది వద్ద ప్రయత్నించాను. ఆఫీసులో ఎక్కువ మంది, నాకు సన్నిహితంగా ఉండేవారందరూ ఆ జీతాలతో బతికేవారే. అందువల్ల వారిని అడగలేదు.  వాస్తవానికి నేను అడిగితే ఇచ్చేవారు ఇద్దరు ఉన్నారు. మా మామగారిని అడిగితే ఇచ్చేవారే. వాళ్ల వద్ద తీసుకోవడం నాకు ఇష్టంలేదు. నా పెళ్లి జరిగిన తర్వాత వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పెళ్లి రోజుకు బట్టలు కుట్టిస్తామన్నా, వద్దని నేనే కుట్టించుకున్నాను. నా పెళ్లికి వాళ్లు బట్టలు కుట్టించడం ఏమిటి? అని అనుకునేవాడిని. అది నా స్వభావం. మా బావ, మేనత్త కొడుకు, మా అమ్మ చిన్నమ్మ కొడుకు, మా పెదనాన్న అల్లుడు బిట్రా ముకుందరావుని అడిగితే ఇస్తారు. అయితే, ఆయనతో ఓ సమస్య. నేను అవసరంలో ఉన్నానని తెలిస్తే చాలు అడక్కుండానే ఇస్తారు. తిరిగి ఇస్తే తీసుకోరు. ‘‘నాకు నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వడం ఏమిటిరా?’’ అని అరుస్తారు. నా భార్యకు ఆపరేషన్ జరిగే రోజు తర్వాతి రోజే అన్నవరంలో ఆయన కూతురు పెళ్లి. ఆ సమయంలో ఆయనను అడగటం బాగోదని నేను అడగలేదు. అలాగే, ఆమె ఆపరేషన్ కు సిద్దమయ్యాం. ఈఎస్ఐ ఆస్పత్రి- ఆపరేషన్ ఫ్రీ. అయినా, కొంత డబ్బు చేతిలో ఉంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే, ఆపరేషన్ కు సిద్ధమయ్యాం. ఉదయం ఆస్పత్రికి ఆఫీస్ స్టాఫ్ చాలా మంది వచ్చి పలకరించి వెళ్లారు. చివరికి మోహన్ రావు - శ్రీనివాసరెడ్డి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరూ డ్యూటీకి వెళ్లాలి.  చివరకు మోహనరావు నా జేబులో రూ.2 వేలు పెట్టి ‘‘అవసరం అవుతాయోమో ఉంచుకో’’ అని చెప్పి వెళ్లిపోయాడు.   మోహనరావు వెళ్లిపోయిన తర్వాత శ్రీనివాసరెడ్డి ‘‘నాగార్జునా నాది ఓ పోజిటివ్ బ్లడ్. ఎవరికైనా డొనేట్ చేయవచ్చు. నీ మిసెస్ కి ఆపరేషన్ గదా బ్లడ్ ఏమైనా అవసరమైనే నేను ఇస్తాను. నేను సెలవు పెట్టి వచ్చాను. సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాను’’ అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ఈఎస్ఐలో సూర్యాకాంతం అనే డాక్టర్ ఉండేవారు. ఆమె విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ పేరు సూర్యాకాంతం, అందుకనే ఆమె పేరు ఇప్పటికీ గుర్తు ఉంది.

ఆపరేషన్ జరిగిన తెల్లారి, వాళ్ల అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత మా బావ ఆస్పతికి వచ్చి, పలకరించి, నేను అడగకుండానే ‘‘అవసరం అవుతాయి ఉంచుకో’’ అని నాకు రూ.3 వేలు ఇచ్చి వెళ్లారు.  ఆ తర్వాత కొంత కాలానికి మోహన్ రావుకు వడ్డీ లేకుండా అసలు రూ.2 వేలు ఇచ్చేశాను. మా బావకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే, ఇచ్చినా ఆయన తీసుకోడు. పైగా ‘‘నాకు నువ్వు తిరిగి డబ్బులు ఇవ్వడం ఏమిటిరా?’’ అని అరుస్తాడు. ఆపరేషన్ జరిగిన రోజు సంఘటనలు నేను చాలా మందికి చాలా సార్లు చెప్పాను.

(అయిపోయింది)

ఆంధ్రజ్యోతి పరివారం -6

                                                                    ఆంధ్రజ్యోతి మేనేజ్ మెంట్

నేను జర్నలిస్టుగా దాదాపు 11 సంస్థలలో పనిచేశాను. వాటన్నిటిలో అప్పటికి, ఇప్పటికీ ఆంధ్రజ్యోతి నెంబర్-1, ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్. ఆంధ్రజ్యోతి అంటే, ఇక్కడ స్పాట్ న్యూస్. నాది స్పాట్ న్యూస్ అపాయింట్ మెంట్. నేను ఆంధ్రజ్యోతి-విశాఖ లాంచింగ్ ఎడిషన్ లో రూ.2వేల జీతానికి చేరి, రూ.3 వేలు పెరిగే వరకు పని చేశాను. నేను రాజీనామా చేసిన తర్వాత, అప్పటి వరకు నాకు  మిగిలిపోయిన సెలవులు నెలా 15 రోజులకు రూ.4,500 ఇచ్చారు. దాదాపు నా 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎక్కడా మిగిలిపోయిన సెలవుల జీతం ఇంత ఇవ్వలేదు. మిగిలిన సెలవుల జీతం ఇచ్చినట్లే గుర్తు లేదు. 

ఇక్కడ స్పాట్ న్యూస్ క్లర్క్ మేరి కుమారి గారి గురించి చెప్పాలి. నాకు ఇప్పటికీ  సీఎల్స్, సిక్ లీవ్స్, ఈఎల్స్ పెట్టే విధానం తెలియదు. ఈ సెలవులు పెట్టే విషయంలో ఒక్కో సంస్థలో హెచ్ఆర్ విధానం ఒక్కోలా ఉంటుంది. ఒక రకమైన సెలవు తర్వాత, ఇంకో రకమైన సెలవు పెట్టకూడదని, ఎక్కువ రోజులు పెట్టాలంటే ఒక రకమైన సెలవు, తక్కువ రోజులైతే ఒక రకమైన సెలవు అని ఉంటాయి.  సెలవులు ఎలా పెట్టాలో తెలియక, సెలవులు పెట్టే సమయంలో   మేరి కుమారి గారిని విసిగిస్తుండేవాడిని. నా పరిస్థితి కొద్ది రోజులు చూసి, చివరికి ఆమె ఇలా చెప్పారు. ‘‘మీకు ఎప్పటి నుంచి ఎప్పటి ఎప్పటి వరకు ఎన్ని రోజులు  సెలవు కావాలో రాసి, కింద సంతకం చేసి నాకు ఇవ్వండి. అక్కడ ఏ సెలవు రాయాలో నేను చూసుకుంటాను. సెలవుల విషయంలో మీకు నష్టం జరగకుండా నేను చూసుకుంటాను’’ అని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి లీవ్ లెటర్ లో నేను ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నానో, అదే రాసేవాడిని. ఏ సెలవో రాసేవాడిని కాదు. చివరకు నేను ఆంధ్రజ్యోతిలో రాజీనామా చేసి, విశాఖలోనే వార్తలో చేరారు. 15 రోజులు తర్వాత, ఆంధ్రజ్యోతి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘‘ఆంధ్రజ్యోతిలో మిగిలిపోయిన మీ సెలవులకు డబ్బు ఇవ్వమని హెడ్ ఆఫీసు(విజయవాడ) నుంచి మెసేజ్ వచ్చింది. వచ్చి తీసుకు వెళ్లండి’’ అని చెప్పారు. మిగిలిపోయిన సెలవులు అంటే వెయ్యి రూపాయలో, 15 వందల రూపాయలో వస్తాయని అనుకుంటూ ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లాను. నెలా 15 రోజులు సెలవులు మిగిలిపోయాయని రూ.4.500లు ఇచ్చారు. నాకు అన్ని సెలవులు మిగలడానికి ప్రధాన కారకురాలు మేరి కుమారి గారు.  ఆంధ్రజ్యోతిలో నేను మానివేసే సమయంలో తీసుకున్న జీతం రూ.3 వేలు. ఆ సమయంలో ఊహించని విధంగా నెలా 15 రోజుల జీతం, అంత డబ్బు అందుకొని నేను ఎంత ఆనందించానో మాటలలో చెప్పడం చాలా కష్టం. మీరే ఊహించుకోండి. దటీజ్ ఆంధ్రజ్యోతి.

ఆంధ్రజ్యోతిలో ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్(ఏపీఎల్), దాని అనుబంధ సంస్థ స్పాట్ న్యూస్‌పై ఎడిటోరియల్ స్టాఫ్ ని, రిపోర్టర్స్ ని అపాయింట్ చేసుకునేవారు. ఏపీఎల్ వారికి, స్టాట్ న్యూస్ వారికి జీతంలో, నైట్ డ్యూటీ అలవెన్సులలో చాలా వ్యత్యాసం ఉండేది. అప్పట్లో నైట్ డ్యూటీ అలవెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడా లేదనుకుంటా. నా అపాయింట్ మెంట్ స్పాట్ న్యూస్. జీతం కూడా ఏపీఎల్ వారికి 1వ తేదీనే ఇచ్చేవారు. మాకు ఆలస్యంగా ఇచ్చేవారు. 

నాకు తెలిసినంతలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎడిటోరియల్ స్టాఫ్ ని, రిపోర్టర్స్ ని చాలా గౌరవంగా, మర్యాదగా చూసుకునేది. ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోయినా, ఇబ్బందికరంగా అనిపించినా ఉద్యోగం నుంచి తొలగించేదికాదు.  కలకత్తాకో, మద్రాస్ కో ట్రాన్స్ ఫర్ చేసేవారు.  అప్పటి ఎండీ కానూరి జగదీష్ ప్రసాద్ గారు విశాఖ వచ్చినప్పుడుల్లా ఎడిటోరియల్ స్టాఫ్ తో మీటింగ్ పెట్టేవారు. అందరికీ అప్సరా హోటల్ నుంచి బిర్యానీ వచ్చేది. ప్రతి మీటింగ్ లో నేను ఏదో ఒకటి ఆయనను అడిగేవాడిని. ఆయన చాలా సింపుల్ గా సమాధానాలు చెప్పేవారు. ఒకసారి, ‘‘సార్, ఏపీఎల్ వారికి, స్పాట్ న్యూస్ వారికి జీతంలో చాలా వ్యత్యాసం ఉంది.’’ అని అడిగాను. ‘‘అందుకోసమే గదా స్పాట్ న్యూస్ పెట్టింది’’ అని ఆయన సింపుల్ గా సమాధానం చెప్పారు. ‘‘ఆ వ్యత్యాసాన్ని తక్కువగా ఉండేట్లు చూడండి’’ అని అడిగాను. ‘‘చూస్తాం’’ అని మాత్రమే సమాధానం చెప్పారు. మరోసారి, ‘‘ఏపీఎల్ వారికి 1వ తేదీనే జీతం ఇచ్చారు. 5వ తేదీ వచ్చినా మాకు జీతం ఇవ్వలేదు సార్’’ అని చెప్పారు.  అప్పుడు మా స్టాఫ్ లో కొందరు ‘‘నాగార్జున ఏంటి ఇలా అడిగారు’’ అనుకున్నారు. అయితే, ఎండీ గారు మాత్రం  వెంటనే ఆ రోజే జీతం ఇప్పించే ఏర్పాటు చేశారు. ఇంకోసారి, ఎండి గారు వచ్చినప్పుడు, ఆ సమయంలో ఎడిటోరియల్ స్టాఫ్ ని తీసుకునే ఉద్దేశం ఉంది. విజయనగరం జిల్లాలో ఓ గ్రామీణ విలేకరి. పేరు గుర్తులేదు. అతను వార్తలు చాలా చక్కగా రాసేవారు. డెస్క్ లో పెన్ను పెట్టే అవకాశంలేకుండా ఏ వార్త ఎంత రాయాలో అంతే రాసేవారు. అటువంటి వ్యక్తిని డెస్క్ లోని తీసుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం. అదే విషయం నేను ఎండీ గారికి చెప్పాను. నేను చెప్పినదంతా విని, ఆయన అక్కటే మాట అన్నారు. ‘‘తీసుకోండి, పడేది మీరేకదా’’అని అన్నారు. అంటే, అతను బాగా రాయలేకపోతే, ఇబ్బందిపడేది మేమేకదా అన్నది ఆయన  ఉద్దేశం. ఆ తర్వాత ఆ విలేకరిని డెస్క్ లోకి తీసుకున్నాం. కొంత కాలం తర్వాత అతను ఆర్టీసీ కండక్టర్ గా సెలక్ట్ అయి వెళ్లిపోయారని చెప్పారు. 

ఇప్పటి ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా చాలా వరకు ఆ పద్దతులనే అనుసరిస్తోంది. కరోనా సమయంలో దాదాపు రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీసు హైదరాబాద్  సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను. ఎడిటోరియల్ స్టాఫ్ కి అదే మర్యాద, జీతం 5 నుంచి 8వ తేదీ మధ్యలో అందరికీ ఇచ్చేవారు. చాలా హాయిగా పని చేసుకున్నాను. నేను ఉన్న సమయంలో ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ స్టాఫ్ తో  ఒకసారి సమావేశమయ్యారు.  వాస్తవానికి అక్కడే రిటైర్ అవుదామని అనుకున్నాను. కుటుంబ అవసరాల రీత్యా నేను మంగళగిరిలో ఉండవలసి ఉన్నందున, నాకు ఇష్టంలేకుండానే, బాధపడుతూ రాజీనామా చేసి వచ్చాను. 

ఆ తర్వాత నేను పనిచేసిన వాటిలో న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు యాజమాన్యం నాకు బాగా నచ్చింది. చెన్నైలో  ఆ గ్రూపునకు సంబంధించిన ఏపీవీక్లీ.కామ్ కు చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా పనిచేశాను. అక్కడ  నాకు ఒకసారి జీతం పెరిగింది. నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, జీతం అందుకునే సమయంలో మాత్రమే ఎవరికైనా  జీతం ఎంత పెరిగిందో తెలిసేది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో అలా కాదు, నెల ముందే తెలుస్తుంది. ఒకసారి నేను డెస్క్ లో పని చేసుకుంటున్న సమయంలో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ సక్సేనా గారు నా వద్దకు వచ్చి, ‘‘Please come to my cabin’’ అన్నారు. వాస్తవానికి ఆఫీస్ బాయ్ చేత కబురు చేయవచ్చు. కానీ, ఆయనే నా వద్దకు వచ్చారు. ఆయనతోపాటు కేబిన్ కు వెళ్లిన తర్వాత, ఎదురుగా కుర్చీ చూపించి, కూర్చోమన్నారు. నేను కూర్చున్న తర్వాత, సొరుగులో నుంచి ఒక లెటర్ తీసి, ‘‘వచ్చే నెల నుంచి మీకు జీతం  పెరుగుతుంది’’ అని చెప్పి, ఆ లెటర్ నా చేతికి ఇచ్చి, అభినందించారు. వచ్చే నెల నుంచి నా జీతం ఎంత పెరుగుతుందో ఆ లెటర్ లో రాసి ఉంది. సునీల్ సక్సేనా అంతటి వ్యక్తి నా పట్ల అంత మర్యాదగా ప్రవర్తించడం, వచ్చే నెల నుంచి పెరిగే జీతం నాకు ముందుగానే తెలియజేయడం, అభినందనలు తెలపడం... నాకు చాలా ఆనందం కలిగించాయి. జీతం పెరిగిన సమయంలో ఎక్కడా నేను అంతటి గౌరవం పొందలేదు. సాక్షిలో నాకు న్యూస్ ఎడిటర్ గా ప్రమోషన్ ఇచ్చి, ఒక్కసారిగా జీతం రూ.5 వేలు పెంచారు. అక్కడ కూడా జీతం అందుకున్న సమయంలోనే ప్రమోషన్ వచ్చినట్లు, జీతం పెరిగినట్లు తెలిసింది. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయంలోనే మరో సంఘటన, ఓ రోజు  నేను డెస్క్ లో పని చేసుకుంటున్న సమయంలో హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ నుంచి ఓ క్లర్క్ నా వద్దకు వచ్చి, హ్యాపీ బర్త్ డే అని చెప్పి, నాకు ఓ గ్రీటింగ్ కార్డు అందించి, నా చేతిలో ఓ కిలో స్వీట్ ప్యాకెట్ పెట్టారు. ఆ సమయంలో నేను ఎంత ఆనందించానో, అంత ఆశ్చర్యపోయాను.  ఆ సంస్థలో ప్రతి ఒక్కరి పుట్టిన రోజున చెన్నైలో పేరు పొందిన ఓ పెద్ద స్వీట్ షాపు నుంచి ఓ కిలో స్వీట్స్ తెప్పించి, గ్రీటింగ్ కార్డుతో కలిపి ఇస్తారు. వాస్తవానికి ఆ రోజు నా పుట్టిన రోజు కాదు. నేను మెట్రిక్ పరీక్షలు రాసే సమయంలో మా రామూ మాస్టార్ రాసిన తేది అది. అదే నా బయోడేటాలో ఉంటుంది. ఆ ప్రకారం,  ఆ రోజు  నాకు గ్రీటింగ్స్ తెలిపారు. పుట్టిన రోజు పేరుతో అంతటి ఆత్మీయ అభినందనలు మరే సంస్థలోనూ అందుకోలేదు. అయితే, ఆధాన్, పొలిటికోస్ సంస్థలలో మాత్రం మెయిల్ కు గ్రీటింగ్స్ పంపారు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  కూడా నాకు ఉద్యోగం మానడం, సురేష్‌ని వదిలిపెట్టి రావడం ఇష్టంలేదు. అప్పట్లో హైదరాబాద్ లో చదువుకుంటున్న  మా అబ్బాయి కోరికపై  అక్కడ రాజీనామా చేసి,  సాక్షి లాంచింగ్ కంటే ముందే హైదరాబాద్ లో సాక్షి.కామ్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేరాను. 

నేను పనిచేసిన సంస్థలలో ఆంధ్రజ్యోతి, సాక్షి, ఐ అండ్ పీఆర్ (అవుట్ సోర్సింగ్ సంస్థ), ఆధాన్ మాత్రమే పీఎఫ్ చెల్లించాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సమయంలో చెల్లించిన పీఎఫ్ వల్ల నాకు జీవితంలో ఎంతో మేలు జరిగింది. ఆ పీఎఫ్ పెట్టుబడిగా పెట్టడం వల్ల ఆ ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాను.

Jul 11, 2026

ఆంధ్రజ్యోతి పరివారం - 5



సీరియస్ విషయాలయలతోపాటు కొన్ని సరదా విషయాలు... నేను సిటీ డెస్క్ ఇన్ చార్జిగా ఎక్కువ కాలం పనిచేసినందున, సిటీలో పనిచేసేవారందరూ ఎక్కువగా పరిచయం. ప్రతిరోజూ కలిసేవారం. రఘు, సాగర్, కళ్యాణరామ్, సుబ్బు(చాగంటి సుబ్రహ్మణ్యం-ఫొటోగ్రాఫర్), విజయ్, సాంబ,  నగర విలేకరులు అందరూ ప్రతి రోజూ కలిసేవారు. కొందరు ఫోన్లు చేసేవారు. అందువల్ల వారితో సాన్నిహిత్యం ఎక్కువ.

 విశాఖలో నన్ను అతి ఎక్కువగా నవ్వించింది సుబ్రహ్మణ్యమే. సీరియస్ గా మీటింగ్ జరిగే సమయంలో కూడా చెవులో ఏదో చెప్పి నవ్వించేవారు. శ్రీధర్ ఓ రెండు జోకులు స్పాట్ న్యూస్-స్టాక్ న్యూస్, న్యూస్ ఎడిటర్ – న్యూసెన్స్ ఎడిటర్ కూడా గుర్తు చేశారు. సుబ్బు మా ఇంటికి వచ్చి మా పిల్లలను ప్రత్యేకంగా తీసిన ఫొటోలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి.  రఘు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాముఖ్యత కలిగిన, సంచలనం కలిగించే న్యూస్ రాయాలన్న ఆతృతతో ఉండేవారు. అలాగే, మంచి మంచి వార్తలు రాసేవారు. అయితే, తను రాసే కొన్ని ముఖ్యమైన వార్తలకు లీడ్ రాయమని సురేష్ ని అడిగేవారు. సురేష్ పనిలో ఉంటే బతిమిలాడేవారు. సురేష్ జోక్ లు వేస్తూ, ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేసేవాడు. ఒక్కోసారి సిగరెట్ ఇస్తే రాస్తాననేవాడు. తన దగ్గర ఉంటే, ఇచ్చేవారు. లేకపోతే తెచ్చిఆస్తాను రాయమని అడిగేవారు. తెచ్చిఇస్తేనే రాస్తాననేవాడు సురేష్. చివరికి సిగరెట్ తెచ్చి ఇచ్చి, రాయించుకుని వెళ్లేవారు రఘు. ఆ తర్వాత సుబ్బు వచ్చి రెండు జోకులు పేల్చి వేళ్లేవారు. నాకు గుర్తు ఉన్నంత వరకు గోపరాజు నారాయణ రావు గారు, సురేష్, శ్రీధర్ గారు హెడ్డింగ్స్ బాగా పెట్టేవారు. అయితే, నేను ఎక్కువగా హెడ్డింగ్స్ గోపరాజు నారాయణ రావు గారు, సురేష్ చేత పెట్టించేవాడిని. నారాయణరావు గారు జనరల్ లో ఉండేవారు. ఆయనకు ఐటం ఇస్తే, కొద్దిసేపటి తర్వాత హెడ్డింగ్ పెట్టి ఇస్తానని చెప్పి, అలాగే పెట్టి ఇచ్చేవారు. ఫొటో రైటప్స్ అబ్దుల్లా బాగా పెట్టేవారు. సిటీ పేజీలు అయినందు, కేవలం రైటప్ ఫొటోలు ఎక్కువగా వాడేవారం. అబ్దుల్లా నా డెస్క్ లో ఉన్నా, వేరే డెస్క్ లో ఉన్నా,  నేను అతనిచేతే ఎక్కువగా రైటప్స్ రాయించేవాడిని. నేను ఎక్కువగా ఇజ్రాయిల్, సుధీర్ చేత పేజీలు పెట్టించేవాడిని. సుధీర్ ఎంత స్పీడ్ గా పెట్టేవాడో, ఇజ్రాయిల్ అంత జాప్యం చేసేవాడు. పేజీ మేకప్ లో రోజుకో కొత్తదనం చూపించాలని సుధీర్ తాపత్రయపడేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అప్పట్లో పేజీలో రంగుల కోసం, పేజీలపైన హెడ్డింగ్ పక్కన, మాకు కావలసిన రంగు రావడం కోసం రంగుల శాతం రాసేవారం. మిషన్ సెక్షన్ లోకి వెళ్లి ఆ రంగుల శాతం తెలుసుకునేవాళ్లం. ఈ విషయంలో సురేష్ చాలా చురుకుగా ఉండేవాడు.  అప్పట్లో ఎవరున్నా సరే, మేం డెస్క్ లోనే సిగరెట్ తాగేవాళ్లం. ఎడిటోరియల్ డెస్క్ లో ఆ సౌలభ్యం ఉండేది. వార్త రావడంతో సెంట్రలైజ్డ్ ఏసీలు వచ్చాయి. దాంతో, డెస్క్ లో సిగరెట్ తాగే అవకాశం ఉండేదికాదు.  నేను కూడా అప్పట్లో సిగరెట్ తాగేవాడిని.  అయితే, నేను 15 ఏళ్ల క్రితం సిగరెట్ ని పూర్తిగా మానేశాను. మళ్లీ ముట్టుకోలేదు. ట్రైనీ సబ్ ఎడిటర్ దగ్గర నుంచి న్యూస్ ఎడిటర్ వరకు హోదాలతో సంబంధంలేకుండా డెస్క్ లో అంతా కలిసి పనిచేసేవాళ్లం.  భాషతోపాటు అన్ని విషయాలు కూడా అలాగే చర్చించేవాళ్లం. అలా సరదా సరదాగా టైం తెలియకుండా  డ్యూటీ చేసేవారం.

ఆనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసినవారు ఇప్పుడు, ప్రభుత్వంలో, ప్రైవేటు రంగంలో, పత్రికా రంగంలో ఉన్నత హోదాలకు ఎదిగిపోయారు. అయితే, మొన్న జరిగిన సమావేశంలో అవేమీ తెలియకుండా, మేం అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో అలాగే గడిపేశాం. నేను మన కార్యక్రమానికి వచ్చి ఎంత ఆనందించానో, సుబ్బు పరిస్థితిని చూసి అంత బాధపడ్డాను. ఒక్క జోక్ కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అయితే, సుబ్బు మనల్ని నవ్వించలేకపోయినా, అతను మాత్రం నవ్వుతూనే ఉన్నారు. ఇంత కాలానికి మనందరం కలిసిన ఆనందం అతని నవ్వులో చూశాను. నేను ఒంగోలులో వార్తకు ఎడిషన్ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఒకసారి  సుబ్బు అక్కడికి వచ్చారు. అప్పుడు సుబ్బు హిందులో చేసేవారు. నాలుగు జోకులు వేసి నన్ను నవ్వించి వెళ్లారు. ఆ తర్వాత ఇదే చూడటం.

విశాఖ ఆంధ్రజ్యోతిలో ఇద్దరు మూర్తులతో నాకు సాన్నిహిత్యం ఉండేది. వారిలో అకౌంటెంట్ మూర్తి మేం పెట్టే హెడ్డింగ్స్ ని సరదాగ తెగ విమర్శిస్తుండేవారు. అందులో సద్విమర్శలు కూడా ఉండేవి.  ఆయన మాట తీరుని బట్టి ఆయనకు తెలుగు భాషా ప్రావీణ్యం ఉన్నట్లు అర్థమైంది.  ఒక రోజు ఆయనను ‘‘అకౌంట్‌గా పనిచేసే మీకు ఇంతటి తెలుగు ఎలా అబ్బంది’’ అని అడిగాను. తాను చిన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లో ఉండి చదువుకున్నట్లు చెప్పారు.

 

Jul 10, 2026

నిర్మాణ రంగంలో పురివిప్పిన ‘మయూరి’ టెక్ పార్క్











పద్మశాలీయుల విజయపతాక

మంగళగిరి చేనేతకు విస్తృత స్థాయి ప్రచారం కల్పించిన యింజమూరి శ్రీనివాసరావు

చేనేతలు గర్వించతగ్గ స్థాయికి ఎదిగిన యింజమూరి శ్రీనివాసరావు

మంగళగిరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేనేత, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. ఇప్పుడు నారా లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గంగా కూడా పేరుపొందింది. ఏదిఏమైనా చేనేత పరంగానే మంగళగిరికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. మంగళగిరి చేనేతకు ఇంతటి గుర్తింపు తీసుకురావడానికి కృషిచేసిన ముఖ్యులలో యింజమూరి శ్రీనివాసరావు ఒకరు. మంగళగిరిలోని వారికి కూడా తెలియకుండా అనేక రకాల వస్త్రాలు నేయించి, దేశం అంతటా వ్యాపారం చేశారు. ఎగుమతిదారులకు సరఫరా చేశారు. చీరలకు, ఇతర రకాల చేనేత వస్త్రాల తయారీకి మంగళగిరి ఓ బ్రాండ్ గా గుర్తింపు పొందడానికి యింజమూరి శ్రీనివాసరావు కృషి ఎంతో ఉంది. శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి అయిన తర్వాత, మంగళగిరిలో చేనేత(పద్మశాలి) వర్గానికి చెందిన తమ్మిశెట్టి రామకృష్ణ, జంజనం రెడ్డయ్య కలిసి 1986లో కొత్తగా సన్ ఫ్లవర్ పేరుతో  ప్రారంభించిన హోల్ సేల్ చేనేత వస్త్రవ్యాపార సంస్థలో రూ.600ల జీతం, లాభాలలో  10 శాతం వాటాతో గుమస్తాగా చేరారు. మంగళగిరి చేనేతకు పేరు రావడానికి కీలక వ్యక్తులు వీరు ఇద్దరే అయినప్పటికీ, ఫీల్డ్ లో వర్క్ చేసిన ముఖ్య వ్యక్తి యింజమూరి శ్రీనివాసరావు. తమ్మిశెట్టి రామకృష్ణ మంగళగిరిలో అప్పటి జనసంఘ్ పార్టీ ప్రముఖ నేత. పేదలకు ఆర్థిక సహాయం చేసేవారు.   ఆయనకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది.  ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఆయన కోడలే. రామకృష్ణ  పొగాకు వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో చేనేత వస్త్ర వ్యాపారం వైవు మళ్లారు. జంజనం కుటుంబ రెడ్డయ్య కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉండేవారు. చేనేతలో శిక్షణ, కొత్త డిజైన్ల తయారీ, రంగుల అద్దకం,  ఆధునిక సాంకేతిక పద్ధతులు, చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ సహకారం అందిస్తూ, చేనేత కార్మికుల ఉత్పాదకత, ఆదాయం పెంచడానికి వీవర్స్ సర్వీస్ సెంటర్ ప్రయత్నించేది. ఆ విధంగా రెడ్డయ్యకు చేనేత ఉత్పత్తులు, మార్కెటింగ్ పై మంచి పట్టు ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినందువల్ల, ఆయన బయట ఉండి సహాయ సహకారాలు అందించగలరు గానీ, వ్యాపారంలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేని పరిస్థితి. ఇక తమ్మిశెట్టి రామకృష్ణ విషయానికి వస్తే, ఆయన పెట్టుబడి పెట్టగలరు గానీ, చేనేత వ్యాపారంపై పట్టులేదు. ఈ పరిస్థితుల్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టేటట్లు, రెడ్డయ్య డిజైన్, మార్కెటింగ్ లో పూర్తి సహకారం అందించేట్లు, లాభాలు చెరిసగం పంచుకునే విధంగా ఒప్పందం కుదిరింది.  వీరు ఇద్దరూ 1986 మార్చిలో ‘సన్ ఫ్లవర్’ పేరుతో  వ్యాపార సంస్థను స్థాపించారు. అయితే, చేనేత వస్త్రాలు నేయించడం, వాటిని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి యువకులు కావలసి వచ్చింది. అప్పుడు, ఆ హోల్ సేల్ వ్యాపారం చూసుకోవడానికి రామకృష్ణ తన సోదరుడి కుమారుడు తమ్మిశెట్టి లక్ష్మణరావుని, రెడ్డయ్య తన మేనల్లుడు యింజమూరి శ్రీనివాసరావులను నియమించుకున్నారు.   1986 ఆగస్టులో యింజమూరి శ్రీనివాసరావు ఈ వ్యాపార సంస్థలో అడుగుపెట్టారు.  మంగళగిరిలో చీరలతోపాటు ఇతర చేనేత వస్త్రాలు నేయించడం, వాటిని జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడం శ్రీనివాసరావు, లక్ష్మణరావులు చూసేవారు.  శ్రీనివాసరావు సౌమ్యుడు, మాటకారి, మర్యాదస్తుడు, కలుపుగోలుతనంతోపాటు నీతి, నిజాయితీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి కావడంతోపాటు రంగులు, డిజైన్ల తయారీలో చురుకుగా ఉండటంతో వ్యాపారంలో దూసుకుపోయారు.  

మంగళగిరి చేనేత వస్త్రాల ప్రత్యేకత

అప్పట్లో మంగళగిరిలో 40, 60 నెంబర్ దారంతో సాదా, పేటు చీరలు మాత్రమే ఎక్కువగా నేసేవారు. ఇవి పట్టుబడి చీరలుగా ప్రసిద్ధి చెందాయి. రంగులకు, చేనేత వస్త్రాల మన్నికకు అప్పుడు, ఇప్పుడూ మంగళగిరికి మంచి పేరుంది. నూలుకు వివిధ రకాల రంగుల అద్దకం(డైయింగ్)లో మంగళగిరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీటితోపాటు రంగులు అద్దకం చేసే మేస్త్రీలు, కార్మికుల ప్రత్యేక నైపుణ్యం వల్ల రంగులు చాలా ఆకర్షణీయంగా, మన్నికగా, ఎలవకుండా ఉండేవి. కొన్ని రంగులకు మంగళగిరి ప్రత్యేకంగా నిలిచేది. ముఖ్యంగా పచ్చి మామిడికాయ, మెజంత, చంద్రకాంత రంగుల చీరలను రైతు వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు. నూలును చేనేతకు అనుకూలంగా పడుగుగా తయారు చేయడంలో కూడా నైపుణ్యత గల కార్మికులు ఇక్కడ ఉన్నారు.   చీరలు, ఇతర చేనేత వస్త్రాలను దట్టంగా, నైపుణ్యతతో నేయడం మంగళగిరి చేనేత కళాకారుల ప్రత్యేకత.ఈ చేనేత వస్త్రాలు చెమటను ఎక్కువగా పీల్చడం వల్ల కూడా మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారు. 

మంగళగిరి చేనేత వస్త్రాల తయారీలో కొత్త పోకడలు 

రామకృష్ణ, రెడ్డయ్యల సారధ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి డిజైనర్ల సహకారంతో శ్రీనివాసరావు  కొత్త కొత్త రంగులు, డిజైన్ల విషయంలో నూతన ఒరవడిని సృష్టించారు. రంగులు వందలు కాదు వేల రకాలు సృష్టించారు. మంగళగిరిలో చింతక్రింది రాధాకృష్ణ అనే చేనేత కార్మికుడితో ఒక మగ్గంపై నేత నేయించడం మొదలుపెట్టి, మంగళగిరి, దాని చుట్టుపక్కల గ్రామాలలో వందల మగ్గాలపై చీరలతోపాటు డ్రెస్ మెటీరియల్, దేశవిదేశాలలో ధరించే అనేక ఇతర చేనేత వస్త్రాలు నేయించారు. ముఖ్యంగా నిజామ్ బోర్డర్ పేరిట తయారైన చీరలు, జాకెట్లు మంగళగిరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మంగళగిరిలో నిజామ్ బోర్డర్ ని మొదలుపెట్టింది వీరే. తొలుత ఢిల్లీలోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐసీ)వారి షోరూమ్ లో 20 చీరలు అమ్మకానికి పెడితే, ఓ గంటలో అమ్ముడుపోయాయి. దాంతో, అప్పటి ఆ సంస్థ ఎండీ మాళవిక ఖన్నా100 చీరలకు ఆర్డర్ ఇచ్చారు. ఆ వంద చీరలు ఆ షోరూమ్ లో  అమ్మకానికి పెడితే, ఒక్క రోజులో అమ్ముడుపోయాయి. ఇక వారు వెనక్కి తిరిగి చూడలేదు. దేశంలోని న్యూఢిల్లీ,  ముంబై, పూనే, బెంగళూరు, హైదరాబాద్ ... వంటి నగరాలలో జరిగే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ నిర్వహించి భారీ స్థాయిలో వ్యాపారం చేశారు.  రోజురోజుకు వ్యాపారం పెరుగుతూ వస్తోంది. ఎగ్జిబిషన్స్ లో స్టాల్స్ పెట్టడంతోపాటు హోల్ సేల్ వ్యాపారులకు, సీసీఐసీ, లేపాక్షి... వంటి సంస్థలకు, ఎగుమతిదారులకు వీరు చేనేత వస్త్రాలు సరఫరా చేసేవారు.  ఆమ్రస్,.... వంటి అనేకమైన అద్భుతమైన రంగులతో, అత్యాధునిక డిజైన్లతో అన్ని వర్గాల, ముఖ్యంగా సంపన్న వర్గాల మహిళలను ఆకట్టుకునే విధంగా  చేనేత చీరలు నేయించి, మార్కెటింగ్ చేశారు. నూతన డిజైన్లు రూపొందించడంలో అబ్రహమ్ ఠాకూర్, మార్తాండ్ సింగ్, రాఖేష్ ఠాకూర్, రీతూకుమార్, బందేజ్ అర్చనా షా, తరుణ్ తహ్లియాన్... వంటి అంతర్జాతీయ డిజైనర్లు వీరికి సహకరించారు. సాధారణంగా చీరలకు పడుగు, పేకలకు ఒకే నెంబర్ దారం వాడతారు. వీరు డ్రెస్ మెటీరియల్ కు పడుగు, పేకల దారం నెంబర్లు మార్చడంతోపాటు  కలనేత, మల్టీ కలర్, మిస్సింగ్ చెక్ వంటివి తయారు చేయించారు. కుర్తాకు 80/80 నెంబరు నూలు వాడితే, పైజమాకు 60/40 నెంబర్ల నూలు వాడేవారు. మిస్సింగ్ చెక్ వస్త్రం మొట్టమొదట మంగళగిరిలోనే తయారైంది. దానిని వీరే నేయించారు. 

మంగళగిరిలో రహస్యంగా చేనేత ఉత్పత్తులు

1990 దశకంలో  అనేక రకాల నూతన వస్త్రాలను వీరు మంగళగిరిలో రహస్యంగా నేయించారు. జపాన్, యూరప్ దేశాలలో మంచి డిమాండ్ ఉన్న స్టోల్స్(24X72) తయారు చేయించారు. ఆయా దేశాలకు ఎగుమతి చేసే ఎగుమతిదారులకు వాటిని సరఫరా చేసేవారు.  ఈ వస్త్రాల విషయం ఇతరులకు తెలిస్తే, తమ వ్యాపారానికి పోటీదారులు తయారవుతారని, వీటిని చాలా రహస్యంగా నేయించారు. ఇటువంటి వస్త్రాలు ఇక్కడ తయారయ్యాయని, మంగళగిరిలోని వారికి చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు. క్లోజ్డ్ మగ్గాల షెడ్ల లోపల వీటిని నేసేవారు. తయారైన వస్త్రం వారికి తెలియకుండా బయటకు వెళ్లేదికాదు. ఈ విషయం రహస్యంగా ఉంచమని చేనేత కళాకారులకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పేవారు. అందువల్ల ఎవరికీ తెలియదు. 1987లో అబ్రహమ్, ఠాకూర్ ల ఆర్డర్లపై దుప్పటాస్(36X84) నేయించి, సరఫరా చేశారు. అప్పట్లో నార్నె విజయలక్ష్మీ ప్రభాకర్ అనే కౌన్సిల్ సభ్యురాలు వీరికి సహాయ సహకారాలు అందించారు. మంగళగిరిలో చింతక్రింది రాధాకృష్ణ, అందె రామస్వామి, చింతక్రింది చిన వీరరాఘవులు, అందె కనకలింగేశ్వరరావు, తిరువీధుల సాంబశివరావు, అందె శివశంకరరావు, బిట్రా ఆదినారాయణ, పొట్లాబత్తుని లక్ష్మణరావు, జంజనం మల్లేశ్వరరావు, మునగాల గోపాలకృష్ణ... వంటి వారు వీరికి చీరలు, ఇతర చేనేత వస్త్రాలు నేయించి ఇచ్చేవారు. 

విడిపోయిన రామకృష్ణ - రెడ్డయ్య 

చేనేత వస్త్ర వ్యాపారం అద్వితీయంగా జరుగుతూ, లక్షల్లో లాభాలు వచ్చే సమయంలో వ్యాపార భాగస్వాములైన  రామకృష్ణ-రెడ్డయ్యల మధ్య విభేదాలు వచ్చి 1991లో  విడిపోయారు. ఇద్దరూ వేరు వేరుగా వ్యాపారాలు నిర్వహించారు. వారు విడిపోయిన సమయంలో శ్రీనివాసరావు, లక్ష్మణరావులకు వారు చెరో రూ.30వేలు ఇచ్చారు. ఆ తర్వాత శ్రీనివాసరావు, లక్ష్మణరావులు రెడ్డయ్య  కొత్తగా ప్రారంభించిన ‘సోలార్ సిస్టమ్’ అనే వ్యాపార సంస్థలో చేరారు. జీతంతోపాటు వారిద్దరికీ లాభాల్లో ఒక్కొక్కరికి  25 శాతం వాటా ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.  రెడ్డయ్య వద్ద ఒక ఏడాది బాగా వ్యాపారం  చేశారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం రెడ్డయ్య వాటా ఇవ్వకపోవడంతో వారిద్దరూ ఆయన వద్ద మానేశారు. వీరి విషయంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన  గజం గోవర్థన్, మంగళగిరికి చెందిన ఇంజమూరి శ్రీకృష్ణ రాజేంద్ర ప్రసాద్ లు మధ్యవర్తిత్వం చేసినా ఫలితంలేదు. 

శ్రీనివాసరావు- లక్ష్మణరావుల వ్యాపారం

1992 అక్టోబరు 25న రెడ్డయ్య సంస్థ నుంచి బయటకు వచ్చిన  శ్రీనివాసరావు, లక్ష్మణరావులు నవంబరు 5న  సొంతంగా ‘శ్రీబాలాజీ శారీస్’ అనే పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. గతంలో రామకృష్ణ-రెడ్డయ్యలు వీరిద్దరికీ ఇచ్చిన  రూ.60 వేల పెట్టుబడితో 100 చీరలతో వ్యాపారం ప్రారంభించారు. మంగళగిరిలో చీరలు నేయించే మాస్టర్ వీవర్స్, ఢిల్లీలో కొనుగోలు చేసే హోల్ సేల్ వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల వారు వీరికి పూర్తి సహకారం అందించారు. వాస్తవానికి చీరలు, ఇతర చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేవారికి, ఎగుమతిదారులకు వీరిద్దరు మాత్రమే తెలుసు. అసలు యజమానులు  రామకృష్ణ-రెడ్డయ్యలు తెలియదు. వారు ఎప్పుడూ వీరికి కనిపించలేదు. వ్యాపారం మొత్తం వీరిద్దరే చూసేవారు. అందువల్ల, వ్యాపారం వీరిదే అని వారు అనుకున్నారు.  ఈ ఇద్దరూ వంద చీరలతో మొదలుపెట్టిన వ్యాపారం ఆరు నెలల్లో నెలకు 500 చీరలకు పెరిగింది. హైదరాబాద్ దిల్‌షుక్ నగర్ లో వీరి కార్యాలయం ఉండేది.  వ్యాపారం మంచి ఊపందుకుంది. ఫ్యాబ్ ఇండియా, వెస్ట్ సైడ్... వంటి వ్యాపార సంస్థలకు వీరు డ్రెస్ మెటీరియల్, దుప్పటాస్ సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మంగళగిరిలో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడానికి శ్రీనివాసరావు ఎంతగానో దోహదపడ్డారు. 1992 నుంచి 2010 వరకు దాదాపు 18 సంవత్సరాలు వీరిద్దరూ కలిసి భారీ స్థాయిలో వ్యాపారం చేశారు. మంచి లాభాలు గడించారు. 

మంగళగిరి చీరలు ప్రముఖుల కొనుగోలు

శ్రీనివాసరావు హయాంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నాగపూర్, కోల్ కతా, హైదరాబాద్ లలో   ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ లో మంగళగిరి చీరలను జాతీయ స్థాయిలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇప్పటికీ వారు కొనుగోలు చేస్తున్నారు. ఒక చీర నచ్చి సోనియా గాంధీ కొనుగోలు చేస్తే, మిస్ యూనివర్స్ సమయంలో ఐశ్వర్యారాయ్ ముచ్చటపడి రెండు డ్రెస్సులు తీసుకున్నారు. శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో బాలీవుడ్ నటీమణులు వైజయంతీమాల, జయాబచ్చన్, షబనా అజ్మీ .. వంటివారితోపాటు తెలుగు నటీమణులు శ్రీదేవి, సౌందర్య, సుమలత... వంటివారు చీరలు కొనుగోలు చేశారు.  మంగళగిరి చీరలను రామోజీరావుకు చెందిన కళాoజలి షోరూంకు కూడా వీరు సప్లై చేశారు.   ఏపీ గవర్నర్ షిండే వంటి వారు కూడా శ్రీనివాసరావుని  అభినందించారు. 

విడిపోయిన శ్రీనివాసరావు- లక్ష్మణరావు

వ్యాపారం బాగా సాగే సమయంలో 2010లో విభేదాల కారణంగా శ్రీనివాసరావు, లక్ష్మణరావులు విడిపోయారు. అయితే, తనకు పోటీగా చేనేత వ్యాపారం పెట్టవద్దని లక్ష్మణరావు శ్రీనివాసరావుని కోరారు. చేనేత వ్యాపారం చేయనని  శ్రీనివాసరావు ఆయనకు మాట ఇచ్చారు.  ఇచ్చిన మాట ప్రకారం తనకు బాగా తెలిసిన చేనేత వస్త్ర వ్యాపారాన్ని శ్రీనివాసరావు కొనసాగించలేదు. నీతి, నిజాయితీలకు, మాటకు కట్టుబడి ఉండే శ్రీనివాసరావు ఆ తర్వాత నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఆ రంగంలో కూడా ‘మయూరి టెక్ పార్క్’ ద్వారా మంగళగిరికి మంచి గుర్తింపు తెచ్చారు.  

చేనేతపై తగ్గని మక్కువ

శ్రీనివాసరావు చేనేత వ్యాపారాన్ని వదిలినా, చేనేతపై మక్కువతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి చెందినవారితో  సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017లో చేనేతపై ఓ పాట రాయించి, ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణకు చెందిన ఎర్రమాద వెంకన్ననేత జాతీయ చేనేత దినోత్సవం కోసం చాలా కాలం పోరాడారు. చివరికి ఆయన పోరాటం ఫలించి, భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.  అలాగే, అంతర్జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం కోసం  వెంకన్న నేత, మరికొందరు మిత్రులతో కలిసి యింజమూరి శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించాలంటే, యునెస్కో (UNESCO - United Nations Educational, Scientific and Cultural Organization)లోని  194 సభ్య దేశాలలో మెజార్టీ సభ్యదేశాలు అంగీకరించవలసి ఉంది. ఇందుకోసం, అంతర్జాతీయంగా వివిధ దేశాలలో చేనేత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు తమ మిత్ర బృందంతో కలిసి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా దేశాలలో ప్రదర్శనలు నిర్వహించారు. చేనేతపై మక్కువతోనే ఆయన ఇప్పటికీ  క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో, వరల్డ్ వీవర్స్ ఫోరమ్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు. 

నిర్మాణ రంగంలో కూడా రాణించిన శ్రీనివాసరావు 

శ్రీనివాసరావు ఏ రంగంలో అడుగుపెట్టినా, ఆ రంగంలో మెళకువలు తెలుసుకుని దూసుకుపోతారు. వస్త్ర వ్యాపారం చేసే రోజులలో వచ్చిన లాభాలతో ప్రతి ఏడాది మంగళగిరి, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు. ఆ భూముల ధరలు ఏడాదికేడాది పెరుగుతూ వచ్చాయి. నిర్మాణ రంగంలో దిగడానికి ఆ భూములు బాగా ఉపయోగపడ్డాయి. అప్పట్లో కొన్న భూములు ఇప్పటికీ కొన్ని అలానే ఉన్నాయి. నిర్మాణ రంగంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అవే అడ్డుపడుతున్నాయి.  అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తన మేనమామ తోడల్లుడు శీలం ఏడుకొండలు భాగస్వామ్యంతో  2010లో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వారి భాగస్వామ్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వారి పిల్లలు కూడా ఆ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు.  తొలుత బెంగళూరులో నిర్మాణాలు మొదలుపెట్టారు. 24 ఫ్లాట్ల ప్రాజెక్ట్ తో ప్రారంభమైన వారి వ్యాపారం, 66 ఫ్లాట్లు, 92 ఫ్లాట్ల అపార్ట్ మెంట్లు, కమర్షియల్ నిర్మాణాలు చేపట్టి, విజయవంతంగా కొనసాగించారు. 2015 వరకు అయిదు ప్రాజెక్టులు పూర్తి చేశారు. రాష్ట్ర విభజనతో శ్రీనివాసరావు కన్ను  మళ్లీ సొంత ఊరు మంగళగిరిపై పడింది. అప్పట్లో ఆయన చేనేత వ్యాపారం కూడా ఇక్కడే ప్రారంభించి విజయం  సాధించారు. ఇప్పుడు మంగళగిరి రాజధాని అమరావతిలో భాగమైంది. టెక్నాలజీ పార్క్ ఆలోచనతో ఉన్న ఏపీ ప్రభుత్వంతో 2017లో రెంటల్ గ్యారంటీ ప్రోత్సాహక ఒప్పందం చేసుకున్నారు. మంగళగిరిలోని జాతీయ రహదారి పక్కన రెండెకరాల స్థలంలో ఎనిమిది అంతస్తుల ‘మయూరి టెక్ పార్క్’ నిర్మాణం చేపట్టారు. అయితే, 2019లో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఉన్నవారందరికీ కష్టాలు మొదలైనట్లే, వీరికి కూడా కష్టాలు మొదలయ్యాయి. రెంటల్ గ్యారంటీ ప్రోత్సాహక ఒప్పందం రద్దయింది. బెదిరింపులు మొదలయ్యాయి. పెట్టుబడి మొత్తం అలా నిలిచిపోయింది. అయినా, భాగస్వాములు ఇద్దరూ ధైర్యంగా నిలబడ్డారు. ఇబ్బందులను ఎదుర్కొంటూ, అలాగే నిర్మాణాన్ని మందకొడిగా కొనసాగించారు. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో వీరి దశ తిరిగింది. మయూరి టెక్ పార్క్ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ 350 కార్లు పార్కు చేసుకోవచ్చు.   స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(RTIH) కోసం మయూరి టెక్ పార్క్ లో ఒక ఫ్లోర్ రెంట్ కు తీసుకున్నారు. దాంతో, ఈ పార్క్ రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించింది. 2025 ఆగస్టు 25న ఈ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది.   టాటా సన్స్ చైర్మన్ ఎన్.

చంద్రశేఖరన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ హబ్‌ను ప్రారంభించారు. శ్రీనివాసరావు కష్టం ఫలించింది. ఆ పక్కనే ఉన్న మరో రెండెకరాల స్థలంలో రెండవ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు కుమారుడు హేమంత్, భాగస్వామి ఏడుకొండలు కుమారులు సాయి శ్రీనివాస్, రాంబాబులు రంగంలోకి దిగారు. వారు నిర్మాణాలను చూస్తుంటే, పెద్దలు ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. 

శ్రీనివాసరావు బాల్యం

చేనేత వస్త్రాల అమ్మకం, నిర్మాణ రంగంలో మంగళగిరిని ఒక స్థాయిలో నిలిపిన శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యింజమూరి భాస్కరరావు, పిచ్చమ్మ దంపతులకు 1966 ఆగస్టు 10న అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జన్మించారు. శ్రీనివాసరావుకు అన్న ఫణి కుమార్, తమ్ముడు వెంకటేశ్వరరావు ఉన్నారు.  ఉద్యోగరీత్యా  తండ్రి  ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ అయినందున ఆయన విద్యాభ్యాసం పలు చోట్ల జరిగింది. అక్షరాభ్యాసం నాగార్జున సాగర్ లో జరిగితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా  కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ లో 2వ తరగతి వరకు చదివారు. ఖమ్మంలో 4వ తరగతి వరకు, నర్సరావుపేటలో 6వ తరగతి, మచిలీపట్నంలో 7వ తరగతి చదివారు. 8వ తరగతి నుంచి  డిగ్రీ బీకాం వరకు అప్పటి కృష్ణా జిల్లా, ఇప్పటి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చదివారు. 1987లో వాళ్ల నాన్న రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి, అక్కడ స్టెనో జాబ్ ఇప్పించారు. ఆ జాబ్ ఒక్క రోజు మాత్రమే చేసి, నచ్చక రాజీనామా చేశారు. దాంతో, వాళ్ల నాన్న ఆగ్రహానికి గురైతే, వాళ్ల అమ్మే అడ్డుకుని ఆదుకున్నారు. 

శ్రీనివాసరావు - సీతామహాలక్ష్మిల వివాహం

గుంటూరుకు చెందిన శీరపు సూర్యనారాయణ, సర్వలక్ష్మిల కుమార్తె సీతామహాలక్ష్మిని 1993 ఏప్రిల్ 24న శ్రీనివాసరావు వివాహం చేసుకున్నారు. అన్యోన్య దంపతులుగా వారు జీవితం కొనసాగిస్తున్నారు. తన భార్య  తనకు అన్ని విధాల ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు చెబుతారు.  సీతాదేవి వంటి భార్య దొరకడం తన అదృష్టంగా ఆయన భావిస్తారు. ఆయన ఎదుగుదలలో, వారి కుటుంబ వ్యవస్థ బలీయంగా ఉండటంలో ఆమె పాత్ర కీలకం. శ్రీనివాసరావుకు కుమారుడు హేమంత్, కుమార్తె హారిక ఉన్నారు. హేమంత్ బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి, అమెరికాలోని మియామి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ నిర్మాణరంగంలో స్థిరపడ్డారు.  హారిక డిగ్రీ పూర్తి చేశారు. కుమార్తెను హిందూపురంలోని వస్త్ర వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 

సేవా కార్యక్రమాలు

యింజమూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ సిబ్బంది పిల్లలకు, పేద పిల్లలకు చదువులకు సహాయం చేస్తుంటారు. తిరుపతి, శ్రీశైలం అన్నదాన సత్రాలలో ఒక్కో రూమ్ కట్టించారు. అమరావతి దేవాలయంలో వారి తల్లిదండ్రుల పేర్లపై ఒక రూమ్ నిర్మించారు. అలాగే, హైదరాబాద్ లోని పద్మశాలి వృద్ధాశ్రమంలో ఒక రూమ్ కట్టించారు. మంగళగిరిలోని మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుంటారు. శ్రీనివాసరావు తన అన్నదమ్ములు, ఇతర బంధువుల ఆడపిల్లలు 11 మందిని తమ వద్దనే ఉంచుకుని చదివించారు. వారు అన్ని విధాల ఎదగడానికి, వారి వివాహాల విషయంలో సహాయసహకారాలు అందించారు. ఈ విషయంలో ఆయన భార్య సీతామహాలక్ష్మి గొప్పతనాన్ని అభినందించాలి.  శ్రీనివాసరావు వద్ద పనిచేసిన ఉద్యోగులు, వాచ్ మెన్, తోట కాపలాదారుల పిల్లలు అందరినీ ఉన్నత చదువులు చదివించారు. వారిలో సీఏ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తన వద్ద అకౌంటెంట్ గా పని చేసిన ఉద్యోగికి ఒక ఫ్లాట్ కూడా ఉచితంగా రాసి ఇచ్చారు. ఆయన ఉదార స్వభావానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

మా నాన్నంటే నాకు చాలా ఇష్టం

రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో తహశీల్దార్ వద్ద తన తండ్రి డ్రైవర్ గా ఉద్యోగం చేసినప్పటికీ ఒక్క పైసా కూడా ఏనాడూ లంచం తీసుకోలేదు. నిజాయితీగా ఉండేవారు. అందుకే, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అని శ్రీనివాసరావు చెప్పారు.  ఆయన జీవిత కాలంలో ఒక్క రూపాయి దాచిపెట్టలేదు. ఒక్క ఇంటి స్థలం కొనలేదు. సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు. అంత నిజాయితీగా ఉద్యోగం చేసి, మా ముగ్గురు అన్నదమ్ములను పెంచి, పెద్ద చేశారు. 

నాన్న తోడబుట్టినవారిని విమానం ఎక్కించి, శ్రీవారి దర్శనం

శ్రీనివాసరావు తన తండ్రి భాస్కరరావు తోడబుట్టిన శివసత్యనారాయణ, బాపనయ్య, మాధవరావు, గోపాలకృష్ణ అయిదుగురు అన్నదమ్ములను తొలిసారిగా విమానం ఎక్కించి హైదరాబాద్ నుంచి తిరుపతి తీసుకువెళ్లారు. శ్రీవారి ఆలయంలో ఉదయం అన్ని సేవలు అయ్యేంతవరకు శ్రీవెంకటేశ్వరుడికి పది అడుగుల దూరంలో కూర్చొని దాదాపు గంటసేపు తనివితీరా చూసి తరించారు. అద్వితీయమైన ఆనందం పొందారు. ‘‘అది  ఓ మిరాకిల్’’ అని శ్రీనివాసరావు బాబాయి మాధవరావు అన్నారు. ఆ అయిదుగురులో ఈయన ఒక్కరే జీవించి ఉన్నారు.

-----------------------------------------------------------------------------------------

మూస విధానం నుంచి ఆధునిక హంగులు

మంగళగిరి చీరలు 1986 వరకు ఒక మూస విధానంలో తయారు అవుతూ పట్టుబడి చీరలుగా ప్రసిద్ధి చెందాయి. అవి కొన్నిప్రాంతాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ సమయంలో   వీవర్స్ సర్వీసు సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జంజనం రెడ్డయ్య, పద్మశాలి ప్రముఖులు తమ్మిశెట్టి రామకృష్ణ కలిసి వ్యాపార సంస్థను స్థాపించి,  మొట్టమొదటి సారిగా ఒకప్పటి నిజాం కాలంనాటి ‘నిజాంబోర్డర్’  చీరలు  తయారు చేసి వాటిని  మార్కెట్ కి పరిచయం చేశారు.  ఆ మహానుభావుల దగ్గర పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మొట్టమొదటి చేనేత ప్రదర్శన క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగింది.  అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దానిని ఆరంభించి, మా చీరలు, దుప్పట్టాలు భాగ్యనగర ప్రజలకు పరిచయం చేశారు. క్రాఫ్ట్ కౌన్సిల్ మొట్టమొదటి చైర్ పర్సన్ కమలమ్మ,  ఆ తరువాత ఢిల్లీ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్  చైర్ పర్సన్ మాళవిక ఖన్నా మా చీరలు మెచ్చి వారి స్టోర్స్ కోసం కొనుగోలు చేశారు.  మా నిజాం బోర్డర్ చీరలు ప్రపంచానికి పరిచయం చేశారు.  డ్రెస్ మెటీరియల్ ఆవిర్భావానికి ఆద్యులు విజయలక్ష్మీ ప్రభాకర్. ఆమె  ప్రోద్భలంతోనే మొట్టమొదటిసారిగా బ్లౌజ్ మెటీరియల్ తయారుచేసి మార్కెట్ కి పరిచయం చేశాం. లేపాక్షి ఎండీ గాయత్రీ రామచంద్రన్, జగదా రాజప్ప,  క్రాఫ్ట్ కౌన్సిల్ సభ్యులు లలితా ప్రసాద్, ఉషమ్మ, మీనాక్షి, నివేదిత, కృష్ణారావు, సునీలాగజపతి, అంజు, పోద్దార్, అంజనా సోమాని, ఆషారెడ్డి, ప్రముఖ డిజైనర్లు  రాకేశ్, ఠాకూర్, మాపు(మార్తాండ్, సింగ్ )  తదితరులు సహకారం అందించారు. వారిని ఎన్నటికీ మరువలేము.   వాస్తవంగా మంగళగిరి ఎదిగిన విధానం ఇలా ఉంటే, కొంతమంది స్వార్ధపరులు గతం మరిచి తామే నిజాంబోర్డర్ ని పుట్టించినట్లు ఈ సమాజానికి తప్పుడు మెసేజ్ ఇవ్వడం బాధాకరం.  నిజాం బోర్డర్ ని తయారు చేసి మంగళగిరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన మా గురువులకు శతకోటి వందనాలు. మంగళగిరి చీరల ఆవిర్భావం గురించి చరిత్ర మొత్తం తెలిసిన వ్యక్తులు పద్మశ్రీ గజం గోవర్ధన్, పద్మశ్రీ  గజం అంజయ్య, ఉప్పాడ సత్యనారాయణ, గద్వాల్ సత్యనారాయణ,  మంగళగిరి చీరలు మార్కెట్ కి పరిచయం చేసి ఊరు ఉన్నతికి కారకులైన మా గురువులు జంజనం రెడ్డయ్య, తమ్మిశెట్టి రామకృష్ణలకు  హృదయపూర్వక వందనాలు.

మీ
యింజమూరి శ్రీనివాసరావు


మంగళగిరి గర్వించతగ్గ స్థాయికి ఎదిగిన యింజమూరి శ్రీనివాసరావు


బీసీ వర్గం చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టిన యింజమూరి శ్రీనివాసరావు అటు మంగళగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు ఇటు ఆధునిక అమరావతిలో నిర్మాణ రంగంలో కూడా మంగళగిరి గర్వించతగ్గ స్థాయికి ఎదిగారు. ఆనాడు యుక్త వయసులో చేనేత రంగానికి, నేడు నిర్మాణ రంగంలో మయూరి టెక్ పార్క్ ద్వారా మంగళగిరికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు.  ఈ మయూరి టెక్ పార్క్ భవనంలోని రెండు ఫ్లోర్లు( 4, 6) 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' (RTIH) ను ఏర్పాటు చేశారు. మరో ఫ్లోర్ లో మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండవ ఫ్లోర్ లో మైనింగ్ శాఖ కార్యాలయం, 5వ ఫ్లోర్ లో ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్, 7వ ఫ్లోర్ లో గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగాల వారి కార్యాలయాలు ఉన్నాయి. యింజమూరి శ్రీనివాసరావు  సాధారణ కుటుంబంలో జన్మించి, ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.

 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914




ఆంధ్రజ్యోతి పరివారం -4

రమణమూర్తి గారిని 1988లోనే చూశాను


సందర్భానుసారం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వృత్తిపరంగా క్రియేటివిటీ చూపుతూ, సంచలన వార్తలు రాయగల దమ్మున్న జర్నలిస్ట్ వల్లూరి వెంకట రమణమూర్తి. 1988లో నేను మా ఊరు మంగళగిరికి ఉదయం రిపోర్టర్ గా పని చేసే సమయంలో విజయవాడ బందర్ రోడ్డులోని ఉదయం కార్యాలయం వద్ద రమణమూర్తి గారిని నేను మొదటిసారిగా చూశాను. అప్పటికే ఆయన ఓ సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన సన్నగా ఉండేవారు. షర్ట్  మాచిపోయింది.  ఇప్పటికి కూడా నా కళ్లకు ఆ రూపం కనిపిస్తోంది. నేను ఉదయం ఆఫీసు లోపల ఉన్నాను. ఆయన లోపలకు వస్తున్నారు. అప్పుడే, అక్కడివారు ‘‘ఈయనే కొండపల్లి సీతారామయ్యని ఇంటర్వ్యూ చేసిన రమణమూర్తి’’ అని గుసగుసలాడినట్లు చెప్పారు. ఆ తర్వాత విశాఖ-ఆంధ్రజ్యోతిలో ఆ రమణమూర్తి గారితో కలిసి పనిచేశాను. ఆయన బ్యూరో ఇన్ చార్జి, నేను సిటీ డెస్క్ ఇన్ చార్జి, అలా మా మధ్య పరిచయం ఎక్కువయింది. ఎంత గొప్ప జర్నలిస్టు అయినా, వేమూరి రాధాకృష్ణ గారిలా అదే పేపర్ కు యజమానులు కాలేరు. రమణమూర్తి గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘లీడర్’ అయ్యారు. తెలుగులో అన్ని విధాలా ఆ స్థాయికి ఎదిగి  విజయం సాధించిన జర్నలిస్టులు వేమూరి రాధాకృష్ణ, రావి రామ ప్రసాద్, వీవీ రమణ మూర్తి, రవిప్రకాష్ మాత్రమే కనిపిస్తున్నారు. వీరిలో ముగ్గురు మన ఆంధ్రజ్యోతి వారు కావడం విశేషం.

చాలా మంది సంచలన వార్తలు రాస్తారు. ఆ తర్వాత నిర్ణయం డెస్క్ వారికి వదిలివేస్తారు. అయితే, రమణమూర్తి గారికి సంచలన వార్తలు రాయడంతోపాటు అందులో క్రియోటివిటీ చూపడం కూడా ఆయన ప్రత్యేకత. ఆ వార్తకు పేపర్లో తగిన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా, అవసరమైతే తనే బాధ్యత తీసుకునే దమ్ము రమణమూర్తి గారికి ఉంది. మొన్న మనం కలిసినప్పుడు ఓ విద్యార్థి 8వ ర్యాంకు సాధించిన వార్తకు సంబంధించిన విషయాలు చెప్పారు. అప్పుడు నేను సిటీ డెస్క్ లోనే ఉన్నాను. ఆ విద్యార్థి నివాసమైన పూరి గుడిసె ముందు నిలబెట్టిన ఫొటోలు సిటీ టాబ్లాయిడ్ లో నేను కూడా వాడాను. అంతేకాదు, ఆ రోజు నేను, ‘‘అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి ... లాంటి వారు చదువుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చదివాను. ఇప్పుడు ఈ విద్యార్థిని చూస్తున్నాను’’ అని అనుకున్నాను. విద్యార్థి నేపథ్యంతో సంబంధంలేకుండా ఫస్ట్ ర్యాంకు వారికి మాత్రమే ఫస్ట్ పేజీలో స్థానం కల్పించే రోజుల్లో, అడిగితే మేనేజ్ మెంట్ కు తానే చెబుతానని రమణమూర్తి గారు పూర్తి బాధ్యత తీసుకుని,  8వ ర్యాంకు వచ్చిన విద్యార్థికి సంబంధించిన ఫొటోలు, వార్త మొదటి పేజీలో వాడించారు. నాకు బాగా గుర్తు అప్పట్లో ఆ వార్త, ఫొటోలు ఫస్ట్ పేజీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఆ వార్తని పాఠకులు చాలా ఆసక్తిగా చదివారు. ఆంధ్రజ్యోతిని మెచ్చుకున్నారు. ఆ వార్త ప్రజంటేషన్ లో రమణమూర్తి గారు సంచలనంతోపాటు క్రియేటివిటీ చూపించారు. అప్పటి ఎండీ కానూరి జగదీష్ ప్రసాద్ గారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత అన్ని పత్రికలవారు ఆ ఒరవడిని కొనసాగించారు.

అటువంటి సంచలనాలు నేను విజయవాడ-ఆంధ్రభూమిలో పనిచేసే సమయంలో తాడి ప్రకాష్ గారు చేయడం చూశాను. విషయం పూర్తిగా గుర్తులేదు. ఓ రోజు వీథిన పడిన ఓ పేద కుటుంబం ఫొటో నాలుగు కాలాలు ఫస్ట్ పేజీలో పెట్టి, రైటప్ రాశారు. రెండు, మూడు లైన్ల రైటప్ లోనే విషయం అంతా ఉంది. అప్పట్లో అలా ఫొటోలు పెట్టడం ఓ సంచలనం. పాఠకులను బాగా ఆకట్టుకునేవి.  సామాజికంగా ప్రాధాన్యత కలిగిన అనేక ఫొటోలు ప్రకాష్ గారు పెట్టేవారు. అప్పుడు అక్కడ సతీష్ చంద్ర గారు బ్యూరో ఇన్ చార్జిగా ఉండేవారు. ఆయన కూడా సంచలన వార్తలు రాయడంలో దిట్ట. రమణమూర్తి గారు కూడా అటువంటి వార్తలు రాయడంతోపాటు ప్రజంటేషన్ లో కొత్తదనం చూపించేవారు. అందువల్లనే జర్నలిస్టుగా విశాఖలో అగ్రస్థానాన నిలిచారు. రాయడమే కాదు, సాగర్... వంటి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేశారు. తయారు చేయడమే కాదు, ఇప్పటికీ సాగర్, రఘు లాంటి వారు, ‘‘జర్నలిజంలో రమణమూర్తి గారే మా గురువు గారు, ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాం.’’ అని చెబుతారు. అటువంటి అభిమానం సాధించడం కూడా సామాన్యమైన విషయం ఏమీ కాదు.

ఎటువంటి వార్తనైనా రమణమూర్తిగారు చాలా చాలా స్పీడ్ గా రాయగలరు. బ్యూరో చీఫ్ గా ఆయన అటు మెయిన్ కి, ఇటు టాబ్లాయిడ్ కి ప్రధాన వార్తలు ఇచ్చేవారు. టాబ్లాయిడ్ కి ఎక్కువగా తొలుత రఘు, కళ్యాణ రామ్ ఇచ్చేవారు. సాగర్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఇచ్చేవారు. అయినా, ఒక్కోసారి ఫస్ట్ పేజీకి బేనర్ వార్త ఉండేదికాదు. అంటువంటి సందర్భంలో, ‘‘సార్ ఈరోజు టాబ్లాయిడ్ కి బ్యానర్ వార్త లేదు. ఏదో ఒకటి మీరే ఇవ్వాలి’’ అని రమణమూర్తి గారిని అడిగేవాడిని. రాజకీయానికి సంబంధించినదో, మరొకటో ఆయన అరగంటలో రాసి ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో ఆయన వెళుతున్నానని చెప్పి వెళ్లిపోతున్నప్పుడో, చేయి ఊపి వెళ్లిపోతున్నప్పుడో, బేనర్ వార్త లేదని అడిగేవాడిని. అలాంటప్పుడు, 10,15 నిమిషాల్లో ఆసక్తిగా చదివించగలిగే రీతిలో స్టోరీ రాసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటి సమర్థత కలిగిన జర్నలిస్ట్ రమణమూర్తి గారు.

1995కి ముందు ఒకసారి ఎన్నికల సమయంలో, ‘‘ఎప్పుడూ డెస్క్ లో కూర్చొని ఉంటే ఎట్లా సార్, రేపు పాడేరు వెళదాం రండి’’ అని రమణమూర్తిగా నన్ను పిలిచారు. ఆయనతో వెళ్లాను. పాడేరులో ఆ రోజు సంత జరుగుతోంది. అక్కడ అటవీ ఉత్పత్తులు అమ్మేవారికి, కొనేవారికి ఎన్టీఆర్ బొమ్మ చూపించి, ‘‘ఇతను ఎవరు?’’ అని వారిని అడిగారు.  ప్రతి ఒక్కరూ, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు’’ అని చెప్పారు. తెలుగులో అంతటి మహానటుడు, ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ తెలియకపోవడం ఏమిటని, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజం. వారితో చాలా విషయాలు సంభాషించాం. చాలా ప్రశ్నలు వేశారు.  ప్రముఖ  రాజకీయ నాయకుల్లో  వారికి ఒక్క ఇందిరా గాంధీ తప్ప మరెవరూ తెలియదు. ఇందిరా గాంధీ వాళ్లకు ఇళ్లు కట్టించినట్లు చెప్పారు. దూరంగా ఉన్న ఆ ఇళ్లను కూడా చూపారు. దటీజ్ ఇందిరా గాంధీ. రమణమూర్తిగారితో బయటకు వెళ్లడం వల్ల నాకు ఆ విషయం తెలిసింది.

ఎలక్ట్రానిక్ మీడియా తొలితరానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తోట భావన్నారాయణ గారు సీనియర్ జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన సాగర్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు.  ఒకసారి నన్ను అడిగారు. ‘‘సార్, డెస్క్ లో పనిచేసే నాలాంటి వారికంటే, రమణ మూర్తి గారి లాంటి వారిని చేయండి చాలా విషయాలు చెబుతారు’’ అని చెప్పాను. ‘‘రమణమూర్తి గారిని అడిగాను. ఇస్తాన్నన్నారు. కుదరడంలేదు. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను’’ అని భావన్నారాయణ గారు చెప్పారు. రమణమూర్తి గారు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది.  వార్తలు సేకరించే పద్దతులు, స్పీడ్ గా ఇచ్చే టెక్నిక్ లు రమణమూర్తి గారు చెబితే, యువ జర్నలిస్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Jul 8, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -3


 విశాఖ నాకు సురేష్‌ని ఇచ్చింది


విశాఖపట్నం జీవితం అంటే నాకు ఇవటూరి సురేష్‌తో ముడిపడి ఉంటుంది. ఓ గొప్ప మిత్రుడు సురేష్‌ని విశాఖ నాకు ఇచ్చింది. నేను చూసిన పరిధిలో, నాకు తెలిసినవారిలో లౌక్యం తెలియని, కల్మషం లేని, అత్యంత నిజాయితీపరుడు సురేష్. సురేష్ నాకు 1989 నుంచి తెలుసు. జర్నలిజం వృత్తిలో మేమిద్దరం చాలా కాలం కలిసి పనిచేశాం. విజయవాడ ఆంధ్రభూమి లాంచింగ్ ఎడిషన్ లో ట్రైనీ సబ్ ఎడిటర్లుగా మేం ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం. విశాఖ ఆంధ్రజ్యోతి లాంచింగ్ ఎడిషన్‌లో సబ్ ఎడిటర్లుగా ఒకే జీతంపై, ఒకే రోజు జాయిన్ అయ్యాం. ఆ తర్వాత విశాఖ వార్త లాంచింగ్ ఎడిషన్‌లో ఒకే రోజు, ఒకే జీతంపై సీనియర్ సబ్ ఎడిటర్లుగా జాయిన్ అయ్యాం.  చెన్నై న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో మాత్రం సురేష్ నాకంటే ముందు జాయిన్ అయ్యాడు.  సురేష్ అక్కడ తెలుగు పీపుల్స్.కామ్ కి  చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా, ఇన్ చార్జిగా ఉన్న సమయంలో నేను కూడా అక్కడ చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను. అలా ఈ వృత్తిలో చాలా కాలం ప్రయాణం చేశాం. కలిసి పనిచేసినంత కాలం ప్రతి రోజూ ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. కలిసే పనిచేసేవాళ్లం. సాంకేతికంగా కొత్త అంశాలను ఇద్దరం కలిసే నేర్చుకునేవాళ్లం. ప్రతిరోజూ ఆఫీసులో కలిసి ఉన్నా, ఆఫ్ రోజున కూడా కలిసేవాళ్లం. అంత స్నేహంగా ఉండేవాళ్లం.  సురేష్ తెగ కబుర్లు చెబుతాడు. విశాఖలో ఈనాడు ప్రారంభం రోజు జరిగిన సంఘటనల నుంచి అతను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ గమనించిన విషయాల వరకు పూసగుచ్చినట్లు చెప్పేవాడు.   అతనికి ఉన్న పరిచయాల వల్ల అతనికి చాలా విషయాలు తెలుసు. ఎన్నో విషయాలు చెప్పేవాడు. విశాఖలో అతనికి తెలిసినవారినందరినీ పరిచయం చేసేవాడు. సురేష్ ది విశాఖ అయినందు, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన నారాయణరావుగారు, రమణమూర్తి గారు, మన నవ్వులరేడు సుబ్బు.. లాంటివారందరూ అతనికి పాత పరిచయస్తులే.

1991 మే 19న ఆంధ్రజ్యోతి విశాఖ ఎడిషన్ ప్రారంభమైంది. అంతకంటే కొద్ది రోజుల ముందే మేమిద్దరం ఆంధ్రజ్యోతిలో చేరిపోయాం. ఈ ఎడిషన్ కోసమే ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారు మమ్మల్ని ఇద్దరినీ ఇంటర్వ్యూచేసి తీసుకున్నారు.   విశాఖ నాకు కొత్త. సురేష్ సొంత ఊరు విశాఖ. అక్కడ అండ, దండ అన్నీ సురేషే.

 నేను విశాఖ వచ్చిన కొత్తలో వసీరా(వక్కలంక సీతారామారావు) అక్కడ ఆంధ్రభూమిలో పనిచేసేవారు. అప్పుడు ఆయన భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్లడం వల్ల, వసీరా ఒక్కరే ఇంట్లో ఉండేవారు. దాంతో, నన్ను ఆ ఇంట్లో సెట్ చేసేశారు. మా ఫ్యామిలీని విశాఖ తీసుకువచ్చే వరకు నేను వసీరా గారి ఇంట్లోనే ఉన్నాను. ఆ విధంగా వసీరా నాకు మంచి మిత్రుడు అయ్యారు.   ఇక ప్రముఖ కథా రచయితలు రావి శాస్త్రి(రాచకొంద విశ్వనాథ శాస్త్రి), కారా మాస్టార్(కాళీపట్నం రామారావు), విరసం వ్యవస్థాపకులలో ఒకరైన చలసారి ప్రసాద్, వంగపండు ప్రసాదరావు, కృష్ణాబాయి,  ప్రముఖ నట శిక్షకుడు డాక్టర్ సత్యానంద్, కె.బాలగోపాల్ గారి ప్రియ శిష్యుడు వీఎస్ కృష్ణ(మానవ హక్కుల కృష్ణ - అప్పట్లో డెక్కన్ క్రానికల్ లో పనిచేసేవారు), ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం మాజీ హెడ్ ప్రొఫెసర్ పి.బాబీవర్థన్... వంటి అనేక మందిని సురేష్ నాకు పరిచయం చేశాడు. రావి శాస్త్రి గారు చనిపోయిన రోజు మేం ఇద్దరం కలిసే వెళ్లాం. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విద్యార్థిని కాక ముందే బాబీవర్థన్ గారిని సురేష్ నాకు పరిచయం చేశాడు. చలసారి ప్రసాద్, కారా మాస్టార్ లాంటి వారితో సురేష్ కి సాన్నిహిత్యం ఎక్కువ. వాళ్లు సురేష్ తో ఫ్రెండ్స్ లా మాట్లాడేవారు.  జగదాంబ సెంటర్ సమీపంలో  కారా మాస్టార్ గారి అబ్బాయి ఉండేవారు. మాస్టారు కూడా అక్కడే ఉండేవారు. ఒక సాహితీ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి కారా మాస్టార్ గారిని నెల రోజులపాటు మేం ప్రతిరోజూ కలిసేవారం. జగదాంబ సెంటర్ వార్త కార్యాలయం వద్ద  ఓ అరుగుమీద కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునేవారం. అప్పట్లోనే కారా మాస్టార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. అయితే, తెల్లారి లేస్తే, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, ఆ ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోవడం ఆయనకు ఇష్టంలేదు. తీసుకోవాలా? వద్దా? అన్న మీమాంసలో ఉండేవారు. ఏం చేద్దాం అని సురేష్ ని కూడా అడిగేవారు. చివరకు కారా మాస్టార్ ఆ అవార్డు తీసుకుని, ఆ డబ్బుని ‘కథానిలయం’ కోసం ఖర్చు చేశారు.  ప్రముఖ సంపాదకులు పతంజలి గారిని పరిచయం చేసింది కూడా సురేషే. ఆయన ఎడిటర్ గా ఉన్న సాక్ష్మి లాంచింగ్ ఎడిషన్ లో హైదరాబాద్ లో నేను చీఫ్ సబ్ ఎడిటర్ చేరినప్పటికీ, అంతకు ముందే మహానగర్ కు ఎడిటర్ గా ఉన్న సమయంలో సురేష్ ఆయన వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశాడు. సురేష్ హైదరాబాద్ లో కార్టూనిస్ట్ శ్యామ్ మోహన్ తో కలిసి ఒక రూమ్ లో ఉండేవాడు. అప్పుడు శ్యామ్ మోహన్ ని పరిచయం చేశాడు. పేర్లు గుర్తుకు రావడంలేదు.  ఇలా చాలా  మంది రచయితలను, ఇతర ప్రముఖులను సురేష్ నాకు పరిచయం చేశాడు.

సురేష్‌తో కలిసి దీర్ఘకాలం పనిచేసినందున ఎన్నో మధుర జ్ఞపకాలు ఉన్నాయి. ఒక్క విషయం మాత్రం తప్పక చెప్పాలి. నేను వార్తలో మానివేసిన తర్వాత, టీవీ9కి సెలెక్ట్ అయ్యాను. అయితే, జీతం విషయం రవిప్రకాష్ గారితో మాట్లాడి, అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపుతామని మౌళి గారు చెప్పారు. కానీ, అపాయింట్ మెంట్ ఆర్డర్ మాత్రం రాలేదు. అది అందడానికి ఆలస్యం అయ్యేట్లు ఉంది. అదే సమయంలో, చెన్నై న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు నుంచి వార్తలో  ఇచ్చిన జీతం కంటే 25 శాతం హైక్ తో నాకు అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. కనీసం ఇంటర్వ్యూకి కూడా హాజరుకాలేదు. ఆ ఆర్డర్ కేవలం సురేష్ వల్లే వచ్చింది. సురేష్ యాజమాన్యంతో మాట్లాడి నాకు ఇంటర్వ్యూ లేకుండా, చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపించే ఏర్పాటు చేశాడు.  ఆ తర్వాత ఆరు నెలలకే నాకు జీతం పెంచే ఏర్పాటు చేశాడు. చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో సురేష్ చెప్పిన అమెరికా (అంతకు కొద్దిరోజుల ముందే అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికా వెళ్లి వచ్చాడు) కబుర్లతో ఆనందంగా కాలం గడిపేశాను. మా అబ్బాయి కోరికపై అక్కడ మానేసి, హైదరాబాద్ సాక్ష్మి లాంచింగ్ ఎడిషన్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను.

విశాఖలో ఆరోగ్యం బాగోక నేను సీడీఆర్ లో చేరినప్పుడు,  సురేష్ దగ్గర ఉండి చూసుకున్నాడు. నన్నే కాదు, రమణమూర్తి గారిని అయితే, ఇంకా ఎక్కువగా చూశాడు.  ఒక సారి రమణమూర్తి గారు కూడా ఆరోగ్యం బాగోక సీడీఆర్ లో చేరారు. ఎక్కువసేపు ఆయన దగ్గరే ఉండి కుటుంబ సభ్యుడు కంటే ఎక్కువగా చూశాడు. అప్పుడు నేను ప్రతిరోజు రమణమూర్తి గారిని చూడటానికి ఆస్పత్రికి వెళ్లేవాడిని, నాకంటే ముందే వచ్చి సురేష్ అక్కడ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి పూట కూడా అక్కడే ఉండేవాడు.  సురేష్ వ్యక్తిత్వం అంత గొప్పది. నా జీవితంలో ఎన్నో విషయాలలో అత్యంత ముఖ్యుడు సురేష్. వాస్తవానికి సురేష్ తో నా అనుబంధం గురించే చెప్పేటంతటి భాష నాకు తెలియదు. అటువంటి సురేష్ ని నాకు అందించి, అత్యంత సన్నిహితుడ్ని చేసింది విశాఖ.  అందుకే విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. సముద్ర తీరం అంటే నాకు ఎంతో ఇష్టం. విశాఖ, చెన్నై రెండు సముద్రతీర నగరాలలో మేం ఇద్దరం కలిసి పనిచేశాం.

ఇక విశాఖ ఆంధ్రజ్యోతి రావి రామప్రసాద్, గారపాటి నరశింహారావు,  గుంటూరు చంద్రశేఖర్, కొమ్మూరి రాజా, గోపరాజు నారాయణరావు, వీవీ రమణమూర్తి, బి.నారాయణరావు గార్లతోపాటు, మోహన్ రావు, శ్రీనివాసరెడ్డి, సాగర్‌, కోటేశ్వరావు(స్పోర్ట్స్), సుబ్బు,  రఘు, కళ్యాణరామ్, అబ్దుల్లా, అకౌంటెంట్ మూర్తి, స్పాట్ న్యూస్ మూర్తి..... లాంటివారిని అనేక మందిని ఇచ్చింది. నాకు విశాఖలో తెలిసిన వారిలో ఎక్కువ మంది సురేష్, సాగర్, నవత, షర్మిల, అబ్దుల్లా, కృష్ణ... వంటి వారందరూ సామాజికంగా మార్పు కోరుకునే రెబల్సే. వారి జీవన శైలిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. దేశంలో అత్యంత నిజాయితీపరులైన విలేకరులలో సాగర్ ఒకరు.  విలేకరిగా సాగర్ నిజాయితీ గురించి నేను ఎంతో మందికి చెప్పాను. ఇక ముందు కూడా చెబుతూ ఉంటాను.  నిజాయితీయే కాదు, మనిషిగా కూడా సాగర్ చాలా ఎత్తుకు ఎదిగారు.

Jul 6, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -2



ఆంధ్రజ్యోతి పరివారం ఆత్మీక కలయిక ఓ అద్భుతం

నాకు ఆంధ్రజ్యోతితో 1984 నుంచి అనుబంధం ఉంది. అందులో విశాఖ-ఆంధ్రజ్యోతి

అనుబంధం ఓ భాగం. అయితే, ఎన్నో తీపి, మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, అక్కడ స్టాఫ్, రామకృష్ణ బీచ్, ఆంధ్రయూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్.... ఇలా ఎన్నో జ్ఞాపకాలు అనుబంధాలు. ఆంధ్రజ్యోతి ఉద్యోగులు కాకుండా ఇతర గొప్ప వ్యక్తలు, ముఖ్యంగా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే అనేక మందితో పరిచయం. అన్నిటికంటే ముఖ్యం. విశాఖ వాతావరణం. బీచ్ అందాలు, పచ్చని ప్రదేశాలు, మరి ముఖ్యంగా సామాజికంగా ప్రశాంత వాతావరణ... ఇలా ఎన్నో. నాకు విజయవాడతో అనుబంధం ఎక్కువ, ఆ తర్వాత హైదరాబాద్. అందువల్ల విశాఖలో ప్రశాంతత నాకు చాలా చాలా బాగా నచ్చింది.

ఇక మన ఆంధ్రజ్యోతి పరివారం విషయానికి వస్తే, మన లీడర్ వీవీ రమణమూర్తి గారు, కోనేరు షర్మిల గారు, వింజమూరి ఆనంద్ గారు(రమణమూర్తి గారు చెప్పినట్లు ఆనంద్ మొదటిసారిగా చాలా కష్టపడ్డారు) పూనుకొని మనల్ని అందరినీ కలిపారు. వారి వల్ల మనం ఎంతో ఆనందాన్ని అనుభవించాం. దీర్ఘకాలం తర్వాత ఎంతోమంది మిత్రులను చూడగలిగాం. వారి ముఖాలలో ఆనందాన్ని చూసి చాలా సంతోషించాం. ఆర్థిక భారం, పనిభారం అంతా రమణమూర్తి గారిదే అనుకోండి. మనలో ఒకరు ‘లీడర్’గా ఎదగడం వల్లే మనల్ని అందరినీ బాధ్యతగా, మరి ముఖ్యంగా ప్రేమ, ఆత్మీయతతో కలపగలిగారు. చాలా సంతోషం. ఈరోజుల్లో ఇంత డబ్బు ఖర్చుచేసి, ఇంత ఆత్మీయత, ప్రేమ చూపగలిగేవారు దొరకడం మన అదృష్టం.  రమణమూర్తి గారికి, ఇంత ఖర్చుచేసి, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఆయన సతీమణి గారికి ప్రత్యేకంగా అభినందనలు.

మన వారిలో ఇవటూరి సురేష్, చంద్రశేఖర్ గారు, గోపరాజు నారాయణ రావు గారు, పారుపల్లి శ్రీధర్ గారు, ఎం.శ్రీనివాసరెడ్డి, అవ్వారు శ్రీనివాసరావు, ఫ్రొఫెసర్ డాక్టర్ రెడ్డి తిరుపతిరావు, ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ డి.రమేష్, ఆర్.రమేష్ చంద్ర, ఇ.సదాశివరావు, కాపు మోహన్ రావు, కేఎస్ఎస్ బాపూజీ, ఐవీ రాజేశ్వరరావు, చింతపల్లి పైడిరాజు... తదితరులతో టచ్ లోనే ఉన్నాను.  మిగిలిన అందరినీ చూసి 30 ఏళ్లు దాటిపోయింది.

మన గ్రూపులో నా ఫొటో చూసి, నన్ను గుర్తుపట్టిన వెంటనే, మన విశాఖ-ఆంధ్రజ్యోతి మొదటి బ్యూరో ఇన్ చార్జి బి.నారాయణ రావు గారు నాకు ఫోన్ చేసి, ‘‘విశాఖకు వస్తున్న మీరు మా ఇంట్లోనే దిగాలి’’ అని ఆహ్వానించారు. నన్నే కాదు చాలా మందిని ఆహ్వానించారు. అయితే, గుంటూరు చంద్రశేఖర్ గారు, డాక్టర్ గోపరాజు నారాయణ రావు గారు, పారుపల్లి శ్రీధర్ గారు, నేను వారి ఇంట్లోనే దిగాం. నేను ఒక రోజు ముందే శనివారం వచ్చాను. రెండు రోజులు ఆయన అతిథి  మర్యాదలు స్వీకరించాను.

 నేను విశాఖలో దిగడంతోనే మన వీఎస్ ఆనంద్ నవ్వుతూ స్వాగతం పలికారు. తన కారులో నారాయణ రావు గారి ఇంటికి తీసుకువెళ్లారు. ఆటోనగర్ లో ఉన్న నా పుస్తకాల బండిల్ ని వర్షం, ట్రాఫిక్ జామ్ లో ఎంతో శ్రమపడి లీడర్ కార్యాలయానికి చేర్చారు. ఆదివారం ఉదయం నారాయణ రావు గారి ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ కారులో లీడర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మధ్యలో ఓ హోటల్ లో టిఫిన్ పెట్టించారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ తన కారులో మళ్లీ నారాయణ రావు గారి ఇంటి వద్ద దింపారు. ఇలా ఎన్నో రకాలుగా ఆనంద్ ఈ రెండు రోజులు నాకు ఎంతో సహాయపడ్డారు. ఆనంద్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే కష్టపడ్డారని రమణమూర్తి గారు జోక్ చేశారు. కష్టపడటం ఆనంద్ కు పెద్ద కష్టం ఏమీ కాదు. మరో ముఖ్యం విషయం ఏమిటంటే, మనకు ఇచ్చిన జ్ఞాపికలో ఆనంద్ పేరు ఎదురుగా full time enjoy life అని రాసి ఉంది. ఆ రకంగా ఆనంద్ కష్టజీవి మాత్రమే కాదు, పేరుకు తగినట్లు  తొటివారికి సహాయపడుతూ ఆనందంగా జీవించడం ఆయన సహజలక్షణం.  ఆనంద్ తో జరిపిన క్షణాలు నా మదిలో పదిలం.

ఇప్పటికే గ్రూపులో చాలా మంది తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాయడానికి తెలిసిన పదాలు చాలడంలేదన్నారు. అది నిజం. కొందరు చాలా దూరం నుంచి వచ్చారు.  అందరం ఆనందంగా గడిపాం. ఈ 30 ఏళ్లలో చాలా మంది వివిధ రకాల హోదాలకు ఎదిగిపోయారు. అయినా, అందరూ ఆ నాటి ఆంధ్రజ్యోతి ఉద్యోగులుగానే వ్యహరించారు. అందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆ మధుర క్షణాల అనుభూతులు అందరిలో స్పష్టంగా కనిపించాయి. రామప్రసాద్ గారి దగ్గర నుంచి రమణమూర్తి గారు, నారాయణ రావు గారు, నవత గారు, షర్మిల గారు, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరరావు, రఘు, కళ్యాణరామ్, సుబ్బు, విజయ్, సాంబ, ప్రసాదరావు గారు, అబ్దుల్లా, నల్లనయ్య గారు,  సీతమ్మధార రమేష్, గాజువాక పైడిరాజు... వంటి వారిని కలవడం చాలా అనందం కలిగించింది. చాలా మంది పేర్లు గుర్తులేవు. మనషులు అందరూ గుర్తు ఉన్నారు. అక్కడ వారి పేర్లు చెప్పినా, అంతలోనే మరచిపోయాను. మన అందరి మనసులు, శరీరాలు రీచార్జి అయ్యాయి. రోజులు కాదు, నెలలు, ఏళ్లకు సరిపడ రీచార్జి అయ్యాయి.

చివరలో మనందరికీ వంటచేసి, చేయించిపెట్టిన మహిళను సన్మానించడం నాకు చాలా బాగా నచ్చింది. దటీజ్ రమణమూర్తి. రమణమూర్తిగారి మనవడి ఏకపాత్రాభినయం చాలా చాలా బాగుంది. ఆ వయసులో అంతటి సుదీర్ఘమైన డైలాగ్స్ గుర్తుపెట్టుకుని, హావభావాలు ప్రదర్శిస్తూ ఏకపాత్రాభినయం చేయడం గ్రేట్.

మిత్రులారా ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు రాయాలి. మన రవీంద్ర చెప్పినట్లు  రాస్తాను.

 

విశాఖ జ్ఞాపకాలు

ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం చేసే సమయంలోనే శ్రీనివాసరెడ్డి, నేను కలిసి బీజేఎంసీ, ఎంజేఎంసీ రెండు డ్రిగ్రీలు చాలా కష్టపడి పూర్తి చేశాం. ఆ రకంగా శ్రీనివాసరెడ్డి నా సహ ఉద్యోగి మాత్రమే కాదు, నా క్లాస్ మేట్ కూడా.   మా ఇద్దరికి జర్నలిస్టుల కోటాలోనే సీట్లు వచ్చాయి.  కష్టపడి అని ఎందుకు చెప్పానంటే, మేం ఇద్దరం దీర్ఘ కాలం సిటీ డెస్క్ లో చేశాం. అందువల్ల అర్థరాత్రి 2 గంటల వరకు ఆఫీసులోనే ఉండేవారం. ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా క్లాసులకు వెళ్లేవారం. ఆ వెళ్లడం కూడా ఎలా అంటే, ఇద్దరం చెరో సైకిల్ మీద బస్టాండ్ వరకు వెళ్లేవాళ్లం. అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు చాలా ఎత్తు ఉంటుంది. తొక్కడం కష్టం. అందువల్ల బస్టాండ్ లో సైకిళ్లు పెట్టి, బస్సులో యూనివర్సిటీకి వెళ్లేవాళ్లం. మన సీతమ్మధార రమేష్, కంచరపాలెం రిపోర్టర్ (పేరు గుర్తులేదు), వీరి ఇద్దరిలో ఎవరో ఒకరు మా ఇద్దరి పేర్లపై ప్రతి నెల బస్సు పాసులు తీసుకు వచ్చి, ఇచ్చేవారు. ఓ పేపర్ పై టైప్ చేసిన బస్ పాస్ నెలకొకసారి ఇచ్చేవారు. ఇవి అక్రెడిటేషన్ లేకుండా ఇచ్చే పాస్ లు. పాస్ లేనప్పుడు, పాస్ రావడం ఆలస్యం అయినప్పుడు కొన్ని సార్లు రొప్పుకుంటారోసుకుంటా సైకిల్ పై వెళ్లేవాళ్లం. మరికొన్ని సార్లు నడిచికూడా వెళ్లేవాళ్లం. అలా ఆ రెండు డిగ్రీ పూర్తి చేశాం. శ్రీనివాసరెడ్డి రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు. విశాఖ తీపి గుర్తుల్లో ఇది ఒకటి.

ఆంధ్రజ్యోతి పరివారం -7

మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే ప...