చేనేత కులాల పునరేకీకరణ
v రాజకీయ
అధికారమే లక్ష్యం
v తీవ్రంగా
ప్రయత్నిస్తున్న వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్
v ఆగస్ట్
7 జాతీయ
చేనేత దినోత్సవం
రాజకీయంగా
బలపడటం కోసం రాష్ట్రంలోని చేనేత కులాలు
ఏకమవుతున్నాయి. రాష్ట్రంలో
వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేత,
దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే
కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో
ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, తొగటశాలీలు, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాలభక్తులు, తొగుల
వీరక్షత్రియ, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కుర్ని, ఖత్రి, నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోల, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్, సాలివన్, నెస్సి మొదలైన కులాలు
ఉన్నాయి. ఇందులోని
దాదాపు 19 కులాల వారు
ఏపీలో ఉన్నారు. అధిక కులాలు అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో చేనేతకు
మంచి గుర్తింపు లభించింది.
ఆ ఉద్యమంలో భాగంగా 1905, ఆగస్టు 7న
కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేయడంతో విదేశీ వస్తు బహిష్కరణ
ప్రారంభమైంది. ఆ తరువాత
చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. మహాత్మా
గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు.
అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. జాతీయ స్థాయిలో చేనేత
పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి
2015 ఆగస్టు 7ను జాతీయ
చేనేత దినోత్సవం (నేషనల్
హ్యాండ్లూమ్-డే)గా నిర్వహించాలని
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ రంగానికి చెందిన కులాల నుంచి రాష్ట్ర శాసనసభలో
ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించడంలేదు.
దానికి ప్రధాన కారణం చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం. ఏ కులానికి చెందినా వ్యవసాయ రంగం నుంచి
ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఎన్నికవుతున్నారు. మంత్రులు అవుతున్నారు. ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. చేనేత రంగం విషయానికి
వచ్చేసరికి రాష్ట్ర జనాభాలో 13 శాతం మంది
ఉన్నా ఈ కులాల నుంచి ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో ఈ కులాల నుంచి ఒక్కరు
కూడా లేరు. చేనేత శాఖ మంత్రి అయిన వారికి ఈ రంగంపై
పూర్తి అవగాహన లేక తగిన రీతిలో అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలేదు. చేనేత కులాల నుంచి
ఒకరిద్దరు చట్టసభలకు ఎన్నికైనా వారికి చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపైన సంపూర్ణ అవగాహన
ఉండటంలేదు. దాంతో ఈ
రంగం అభివృద్ధి కుంటుపడింది.
చేనేత కులాల వారు, చేనేత
కార్మికులు ఆర్థికంగా గానీ,
వృత్తిపరంగా గానీ అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండాపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం
మూడు లక్షల మంది ప్రత్యక్షంగా,
8 లక్షల మంది
పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. వారి
సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు
చెందిన ప్రజాప్రతినిధులకు,
రాజకీయ నాయకులకు చెప్పుకోవలసిన
పరిస్థితి ఏర్పడింది. వీరి
సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు
వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, సౌకర్యాలు.... వంటి సమస్యలు ఆమూలాగ్రం తెలుసుకోవడానికి
వారికి సమయం ఉండదు. ఈ కారణంగా
కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. దామర్ల రమాకాంతరావు, ప్రగడ కోటయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీ, గోలి వీరాంజనేయులు వంటివారు మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా
నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికుల మధ్యే తిరిగేవారు. వారికి చేనేత
సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది.
అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగంలోని
కార్మికుల పరిస్థితి దయనీయ
స్థితికి చేరింది. ఈ కులాల
వారు, కార్మికులు
నానా అవస్థలు పడుతున్నారు.
చేనేత వర్గాల వారు దాదాపు 65
లక్షల మంది, అంటే
రాష్ట్ర జనాభాలో 13 శాతం మంది ఉన్నా ఒక్క శాసనసభ్యుడు కూడా లేరు. మంత్రి పదవీ లేదు. చివరికి చేనేత మంత్రిత్వ శాఖ కూడా మరో కులం వారు నిర్వహించవలసి వస్తోంది. చేనేత
కులాల నుంచి ఎంపీలుగా నిమ్మల కిష్టప్ప,
బుట్టా రేణుక, ఎమ్మెల్సీగా
పోతుల సునీత ఉన్నా, వారికి
నేరుగా చేనేత రంగంతో సంబంధంలేదు.
చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబంలో పుట్టిపెరిగి, ఆ వృత్తితో పెనవేసుకుపోయి, ఆ రంగంలోని సమస్యలపై
పూర్తి అవగాహన ఉన్న గంజి చిరంజీవి మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో 12 ఓట్ల తేడాతో
ఓడిపోయారు. ఆయన గెలిచి
ఉంటే ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కి ఉండేది. అంటే మంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా చేనేత కులాల నుంచి ఎన్నిక
కాలేదు.
పరిస్థితులు ఇలా ఉంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయగలిగింది ఏమీలేదు. తమ
వర్గానికి చెందిన
వారు శాసనసభ్యులుగా ఎన్నికైతే మంత్రి పదవి ఇవ్వమని అడగవచ్చు. ఎమ్మెల్యేనే లేకపోతే ఏం అడుగుతారు? చేనేత కులాల వారికి
పరిస్థితి పూర్తిగా అర్ధమైంది.
అందరూ ఐక్యంగా ఉండి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా
దిగజారుతుందని గ్రహించారు.
ఈ నేపధ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ను బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగడానికి
ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్ని కులాలను ఒకే వేదికపైకి
తీసుకురావడానికి ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజమండ్రిలో
జూన్ 24న ఏర్పాటు చేసిన సభకు 14 చేనేత కులాలకు చెందిన పెద్దలు హాజరై
అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలని
నిర్ణయించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేయాలని
తీర్మానించారు. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత
సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆయా కులాల పెద్దలతో
నేతవృత్తి,
ఉద్యోగ,
మహిళా,
యువజన,
విద్యార్ధి,
న్యాయ,
వైద్య,
వాణిజ్య
విభాగాలు ఏర్పాటుపై చర్చావేదికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా
చేనేత కులాల నాయకులతో ఫ్రంట్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 45 శాసనసభ
నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలవారు ఉన్నారు. అంటే అంత
మంది ఎమ్మెల్యేల తల రాతలు రాసే స్థితిలో వారు ఉన్నారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేనేత
జనబలం ఉండి గెలవడానికి అవకాశం ఉన్న లోక్ సభ, శాసనసభ స్థానాలను ఆయా పార్టీల
నేతలను కలిసి అడగాలని నిర్ణయించుకున్నారు. 15 అసెంబ్లీ,
5 ఎంపీ సీట్లు
కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలలో
పోటీ చేసే చేనేత కులాల వారికి ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాలుగా ఫ్రంట్ తరపున
మద్దతుపలకనున్నారు. ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజమండ్రి, ఏలూరు వంటి
నగరాలలో ఐక్యవేదికలు ఏర్పాటు చేశారు. కర్నూలు, నెల్లూరులలో వేల మందితో చేనేత మహాదీక్షలు, అనంతపురంలో
చేనేత సహకార సంఘాల బాధ్యులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయా కులాల
నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ ఉత్సాహంతో త్వరలో విజయవాడలో 4 లక్షల
మందితో ‘చేనేత కులాల ఆత్మగౌరవ సభ’ను భారీ స్థాయిలో
నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చేనేత రంగం అభివృద్ధికి, ఆ కులాలకు
చెందిన వారి ఉపాధి కల్పనకు వెయ్యి కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు
చేయాలని చేనేత కులాల నాయకులు ఎంపీలు కిష్టప్ప, రేణుక, ఎమ్మెల్సీ
సునీత, మాజీ మంత్రి మురుగడు హనుమంతరావు,
మంగళగిరి
మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, విశ్వనాధ్,
ఆకాశపు
స్వామి వంటివారు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు.
చేనేత వృతితో
నేరుగా సంబంధం ఉన్నవారికే కార్పోరేషన్ బాధ్యతలు అప్పగించాలని కూడా వారు
కోరుతున్నారు.
-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment