యుద్ధప్రాతిపదికన తుపాను సహాయక చర్యలు
Ø జాతీయ విపత్తుగా ప్రకటించమని కేంద్రాన్ని కోరిన సీఎం
Ø ప్రభుత్వ సిబ్బంది పనితీరుకు ప్రశంసలు
Ø విరివిగా విరాళాలు ఇస్తున్న దాతలు
Ø ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం
సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. విద్యుత్ సరఫరా పనుల్లో 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి 200 మంది చొప్పున 12జిల్లాల నుంచి సిబ్బంది వచ్చి పని చేస్తున్నారు. మొత్తం 1,802గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, 1,369 గ్రామాలకు విద్యుత్ ఇచ్చారు. మిగిలిన 433 గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్దరించే పనిలో సిబ్బంది ఉన్నారు. వ్యవసాయం, పశుసంవర్థక, ఉద్యానవన,మత్స్య విభాగాలలో జరిగిన నష్టాలను దాదాపు అంచనా వేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంత త్వరగా పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంతం కృషి చేస్తోంది. ఈ నెలాఖరుకే బాధితుల బ్యాంకు ఖాతాలలో నష్ట పరిహారం జమ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసి బస్ సర్వీసులన్నీ పునరుద్దరించారు. టెలికం కనెక్టివిటీ 99.7 శాతం పూర్తయ్యింది. 1,329 పాఠశాలల్లో 1,59,000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. 47వేల గుడ్లు పంపిణీ చేశాం. 5 రోజుల్లో 8.47లక్షల మందికి భోజనాలు అందజేశారు. కార్డులతో సంబంధంలేకుండా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. విద్యుత్ సరఫరా కోసం 232 జనరేటర్లు పనిచేస్తున్నాయి. 184 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని రవాణా చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సురక్షితమైన నీరు అందించడానికి ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు బాగా ఉపయోగ పడుతున్నాయి. 11,700 మంది శానిటరీ సిబ్బంది బ్లీచింగ్, క్లోరినేషన్,ఫాగింగ్ పనులు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 248 ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.700 మంది రోగులకు చికిత్స అందించారు. ముఖ్యంగా అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని పాఠశాలలన్నింటిలోని విద్యార్థులకు వైద్య పరిక్షలు చేయడానికి ఏర్పాటు చేశారు. చెట్ల తొలగింపునకు క్రేన్లను, 1,000 విద్యుత్ రంపాలను తెప్పించారు. రోడ్లపైన, పొలాల్లో చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 34 ఫైర్ సర్వీసెస్ బృందాలు, 24ఎస్ డిఆర్ ఎఫ్ బృందాలు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయి. పొలాలలో కూలిపోయిన చెట్లను తొలగించే పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతానికి చాలా వరకు సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయి.
మానవతా దృక్పదంతో దాతలు అనేకమంది ముందుకు వస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలు అందజేస్తున్నారు. స్మార్ట్ ఏపి ఫౌండేషన్, సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు. దీనిని దృష్టిలోపెట్టుకుని ప్రభుత్వం తుపాను బాధితుల కోసం విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేసింది.apcmrf.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్ లైన్ లో దాతలు విరాళం చెల్లించిన వెంటనే దాతల పేరుతో సీఎం సంతకమున్న ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. దేశ విదేశాల నుంచి ప్రజలు నేరుగా విరాళాలు పంపేందుకు వీలుగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొందరు గ్రామాలను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తిత్లీ ఉద్దానం రికనస్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ (తూర్పు)కు స్పందన బాగా వుంది. ప్రభుత్వ సిబ్బంది దసరా ఉత్సవాలు కూడా చేసుకోకుండా, కుటుంబసభ్యులకు దూరంగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. వారి స్ఫూర్తిని దెబ్బతీసేలా గొడవలు చేయవద్దని, సహాయ చర్యలకు ఆటంకాలు కల్పించవద్దని, చేతనైతే తలా ఓ చేయివేసి సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment