వదంతులు ఆధారంగా జరిగే
హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం
హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ హెచ్చరిక
సచివాలయం, అక్టోబర్ 11: వదంతుల ఆధారంగా అల్లరి
మూకలు విచక్షణారహితంగా హింసాత్మక ఘటనలకు పాల్పడటాన్ని చట్టం తీవ్రంగా
పరిగణిస్తుందని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
రాష్ట్రంలో ఏవో సంఘటనలు జరుగుతున్నట్లు వదంతులు
వ్వాపింపజేసి, ధృవీకరణ కాని వార్తలతో రెచ్చగొట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని
ఆమె పేర్కొన్నారు. అత్యున్నత న్యాయం స్థానం సుప్రీం కోర్టు కూడా సామూహికంగా చిత్రహింసలకు
పాల్పడే సంఘటనలను తీవ్రంగా పరిగణించింది. దేశంలో ఇటువంటి సంఘటనలకు తావులేకుండా వాటిని అరికట్టేందుకు,
నివారించేందుకు, కఠిన చర్యలు తీసుకునే విధంగా తన తీర్పులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని
వివరించారు. రాష్ట్రంలో ఇటువంటి వదంతులు వ్యాపించకుండా, రెచ్చగొట్టే ఘటనలు జరుగకుండా
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందు కోసం ప్రతి
జిల్లాలో ఎస్పీని, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలోని కమిషనరేట్లలో ఎస్పీ స్థాయి అధికారిని
నోడల్ అధికారులుగా నియమించినట్లు వివరించారు. ప్రతి జిల్లాలోని నోడల్ ఆఫీసర్ కు
సహాయకులుగా ఒక డీఎస్పీని నియమించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలను
నివారించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నాయకత్వంలో ఉండే ఈ బృందంలో ఒక ఎస్డీపీఓ, ఒక సీఐ,
టెక్నికల్ టీమ్ ఉంటారని అనురాధ వివరించారు.
No comments:
Post a Comment