సాంకేతికత ద్వారా పెరిగిన ప్రజల సంతృప్తి స్థాయి
ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ
సచివాలయం, అక్టోబర్ 10: ప్రభుత్వ
కార్యకలాపాలలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ అన్నారు.
సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ
మందిరంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి
వరకు జరిగిన రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను
హాజరైన ఒక గ్రామ సభలో ఓ రైతు మాట్లాడుతూ ‘‘గతంలో మేం
భూముల వివరాలు తెలుసుకోవడం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగేవారం.
ఇప్పుడు అన్ని వివరాలు ఇంటర్నెట్ లో చూసుకుంటున్నాం. కార్యాలయాల
చుట్టూ తిరిగే బాధ తప్పింది’’ అని
ప్రభుత్వ పనితీరుపట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. అలాగే
ఆర్టీజీ ద్వారా ప్రతి అంశం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
అవసరమైన మార్పులు చేర్పులు చేసి దీనిని ఇంకా విస్తృతపరిచి
ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫోన్
కాల్స్ ద్వారా ప్రజల సంతృప్తి, అసంతృప్తి,
ఎందుకు అసంతృప్తితో ఉన్నారో తెలుసుకోవడం వల్ల లోపాలను సరిదిద్దడానికి
అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ప్రజల
సంతృప్తి స్థాయిని పెంచవచ్చని చెప్పారు. ప్రధానంగా
గృహనిర్మాణం, పశుసంవర్థక శాఖ, సంక్షేమ
శాఖలపై లబ్దిదారుల సంతృప్తి, ఆయా
శాఖ సమాచారం, ఆర్టీజీ
డేటా, లబ్దిదారులను అడగవలసిన ప్రశ్నలపై చర్చించారు.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించి లబ్దిదారులను అడగవలసిన ప్రశ్నలలో కొన్ని
మార్పులు చేశారు.
డేటా సేకరణ, దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం,
ప్రభుత్వ పథకాల అమలుపై లబ్దిదారుల అభిపరాయాల సేకరణ, వారి
సంతృప్తి తెలుసుకోవడం, వివిధ రకాలుగా
విశ్లేషించడం వంటి వాటితో ఆర్టీజీని అత్యంత సౌకర్యవంతంగా రూపొందించినట్లు ప్రభుత్వ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్
చెప్పారు. ప్రజా సాధికార సర్వేలో రేషన్ కార్డులు లేని అందరికీ కార్డులు మంజూరు
చేస్తామని చెప్పారు. పేదలకు ప్రభుత్వ గృహం
మంజూరు చేయడానికి రేషన్ కార్డు, ఆధార్
కార్డు తప్పనిసరి అని గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే తెలిపారు.
కొంతమందికి రేషన్ కార్డులు లేనందున ఇళ్లు మంజూరు చేయలేకోతున్నట్లు చెప్పారు.
పశు సంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి
గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ తమ శాఖ 4 పథకాలు
అమలు చేస్తున్నట్లు చెప్పారు. తమ శాఖ
ద్వారా 20 లక్షల మంది లబ్దిపొందుతున్నట్లు చెప్పారు.
మున్సిపల్ పరిపాలన, సంక్షేమ
శాఖలకు సంబంధించి కొంత సమాచారం కావాలని ఆర్టీజీ వారు అడుగగా సీఎస్ పునీఠా వెంటనే
సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆ సమాచారం ఆర్టీజీ వారికి అందించమని ఆదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్
రావత్, ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబు తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment