విస్తరించిన పర్యాటక రంగం
రాష్ట్రంలో
పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతూ నూతన పోకడలుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు
విజన్ కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ
రంగం విస్తరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అవకాశాలను ఆ శాఖ సంద్వినియోగం
చేసుకుంటోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించి
అమలు చేస్తోంది.
ఆధ్యాత్మిక పర్యాటకం, గ్రామీణ
పర్యాటకం, బీచ్ పర్యాటకం, వినోద
పర్యాటకం... ఇలా అన్ని వైపులా అన్ని రంగాల్లో ఈ శాఖ చొచ్చుకుపోతోంది. పర్యాటకానికి
అవకాశం ఉన్న పుణ్యక్షేత్రాలు, పురాతన దేవాలయాలు, ప్రదేశాలు, నదులు, కాలువలు,
సెలయేర్లు, సుందర ప్రదేశాలు, సముద్రతీరాలు వంటి వాటిని అభివృద్ధి పరుస్తోంది. నదులలో భద్రతతో కూడిన
బోటు షికారుకు ఏర్పాట్లు చేశారు. పర్యాటకులకు కావలసిన హోటల్స్, వినోద కేంద్రాలు, రోడ్లు, పర్యాటక
అతిధి గృహాలు ... వంటి మౌలిక సదుపాయాలు సమకూరుస్తోంది. దేశ, విదేశ
పర్యాటకులకు ఆంధ్ర వంటకాలు రుచి చూపిస్తున్నారు. గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ది
చేసే క్రమంలో నూతనంగా చేపట్టిన సంస్కృతి ప్రాజెక్టుకు విస్తృత ప్రచారం
కల్పిస్తున్నారు. భారతీయ జీవనం, రాష్ట్రంలో ఆయా ప్రాంతాల సంస్కృతి, కళల అభివృద్ధి
ఆ శాఖ అనేక చర్యలు చేపట్టింది. తెలుగు
సంస్కృతి, తెలుగు నృత్య రీతులు, తెలుగు
వంటలు, సాంప్రదాయానికి ప్రతీక అయిన సంక్రాంతి వేడుకల నిర్వహణ,
హరికధ, బుర్ర కధ, ఒగ్గుకథ,
కోలాటం, థింసా నృత్యం వంటి కళలతోపాటు
వారసత్వంగా వచ్చే కళల పునరుజ్జీవానికి
స్ధానిక కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా ఈ శాఖ మంచి ఫలితాలను
సాధిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఈ
రంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకు ముందు ఎన్నడూలేని రీతిలో ఈ రంగం విస్తృత
స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఆ శాఖ చేపట్టే
అంతర్జాతీయ ఈవెంట్లు, సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్, ఎయిర్ షో వంటి పర్యాటక ఉత్సవాల
ద్వారా ప్రజలలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతోంది. రాజధాని
అమరావతిని కూడా పర్యాటకులను ఆకర్షించే రీతిలో రూపొందిస్తున్నారు.
దేశంలో 13 శాతం
అంటే రాష్ట్రలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంట భూగర్భంలో
నిక్షిప్తమై ఉన్న అపారమైన ఖనిజ సంపద
పరిశ్రమల నిర్మాణానికి, పోర్టులు
ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడటంతోపాటు బీచ్
టూరిజానికి ఉపయోగపడుతోంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అనేక కార్యక్రమాలు
రూపొందించింది. ఈ రంగంలో ఆర్థిక వృద్ధి
రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 6.96 శాతం వున్న
అభివృద్ధి సూచిక రాష్ట్రం చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి చర్యలతో 2017-18 ఆర్ధిక
సంవత్సరానికి 11.22 శాతం అభివృద్ధి సూచికను చేరుకుంది. పవిత్ర సంగమంగా ప్రసిద్ది కెక్కిన కృష్ణా,
గోదావరి నదీసంగమ ప్రాంతాన్ని సందర్శకులను ఆకట్టుకునేవిధంగా
తీర్చిదిద్దారు. ముఖ్యంగా కృష్ణానదికి మహర్ధశపట్టుకుంది. విజయవాడలో నది ఒడ్డున
అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భవానీ ద్వీపాన్ని అన్ని సౌకర్యాలతో పర్యాటకులను
ఆకర్షించేవిధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పర్యాటక ఆస్తులకు సంబంధించిన
పూర్తి సమాచారం భద్రపరిచే ఏర్పాటు చేస్తున్నారు
గండికోటలో నూతనంగా ఏర్పాటు చేయదలచిన ఎడ్వంచర్స్ అకాడమీ పనులు
డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించారు. ఎపిటిడిసి వెబ్
సైట్లో పర్యాటక పండుగలకు సంబంధించిన సమాచారం డిజిటల్ క్యాలెండర్ రూపంలో
అందుబాటులో ఉంచే ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకుల
సౌకర్యార్థం ఆ శాఖ ఆధునిక ఓల్వో బస్సులను ప్రవేశపెట్టింది. పూనా, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ,
జైపూర్, హైదరాబాద్, మైసూర్లలో
మాదిరి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్
వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పర్యాటక
శాఖ భాగస్వామ్యంతో మహీంద్ర జూమ్ కార్లు ప్రవేశపెట్టింది. ఎవరికి వారు డ్రైవింగ్ చేసుకునేలా ఏర్పాటు
చేసిన ఈ బ్యాటరీ అద్దె కార్లు గన్నవరం విమానాశ్రయం, విజయవాడ
బెంజ్ సర్కిల్, సచివాలయం వద్ద అందుబాటులో ఉంచుతారు. తెలుగు
సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఆహారం
గురించి నేటి తరంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ
స్ధాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఆ శాఖ ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్
పేరుతో ఆహార పండుగలు నిర్వహిస్తోంది.
తపాలా శాఖ
అందిస్తున్న మై స్టాంప్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని పన్నెండు
పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక తపాళా బిళ్లలను విడుదల చేయించింది. తద్వారా
ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పర్యాటక ప్రాంతాలు మరింతగా జన బాహుళ్యంలోకి వెళ్లేలా
చేస్తోంది. పర్యటక రంగ పరంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల వివిధ జాతీయ,
అంతర్జాతీయ స్ధాయి సంస్ధలు పర్యాటక శాఖకు అవార్డులు అందిస్తున్నాయి.
ఈ క్రమంలో పర్యాటక రంగంలో సమగ్ర
అభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా వరుసగా రెండేళ్లు రాష్ట్ర పర్యాటక శాఖకు అరుదైన గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం
ప్రకటించింది. అంతే కాకుండా ఇండియా టుడే ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాన్ క్లేవ్
లో ఏపీ టూరిజం దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందని కొనియాడుతూ పర్యాటక రంగంలో
అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అవార్డును పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియకు ఉప
రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందించారు. పర్యాటక
ప్రాజెక్టులను వేగవంతం చేయడం కోసం ఏకగవాక్ష విధానాన్ని మరింత సరళీకరించి,
పటిష్టపరిచారు. పర్యాటక
పెట్టుబడిదారులు తమ అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్ధితి
ఎదురు కాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కల్పించే సౌకర్యాల వల్ల ఈ రంగంలో
పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. దాంతో ఈ
రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
-
శిరందాసు నాగార్జున,
సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment