Dec 1, 2018


చేనేత వర్గాలపై ప్రధాన పార్టీల కన్ను
v ప్రభావితం చేయగల నియోజకవర్గాల గురించి ఆరా
v చేనేత కులాల ఐక్యతకు ఆ వర్గాల నాయకుల కృషి  
v బీసీ నాయకుల మద్దతు కోరిన చేనేత కుల నాయకులు
v ఈ సారి ఎక్కువ టిక్కెట్లు దక్కించుకునే అవకాశం   
                    

రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కదలికలు మొదలయ్యాయి. రెండు, మూడు నెలల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. అలాగే కుల సంఘాలు కూడా ఏ పార్టీ తరపునైనా సరే అవకాశం ఉన్నమేరకు తమతమ కులాలకు ఎక్కువ  టిక్కెట్లు దక్కించుకోవడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కుల వ్యవస్థ వేళ్లూనుపోయిన ఈ సమాజంలో కుల ప్రస్థావనలేకుండా రాజకీయం నడవదు. ఏ రాజకీయ పార్టీ అయినా కుల ప్రాతిపధికన టిక్కెట్లు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పద్మశాలీలతోపాటు 19 చేనేత కులాలకు చెందిన వారు 75 లక్షలకుపైగా ఉన్నారు. అయినా ఒక్కరు కూడా శాసనసభుకు ప్రాతినిధ్యం వహించడంలేదు. దాంతో వారిలో పట్టుదల పెరిగింది. ఆ కులాల వారందరూ ఈసారి తమవారిని గెలిపించుకోవాలన్నా గట్టిపట్టుదలతో ఉన్నారు. రాజకీయ భాగస్వామ్యం కోసం చేనేత కులాలవారు ఏకమవుతున్నారు. వారిలో పద్మశాలీలు, దేవాంగులు ఎక్కువగా ఉంటారు. ముందు ఈ రెండు కులాలవారు ఏకమవడం ముఖ్యం. వీరు ఏకమైతే మిగిన కులాలవారు వారితో కలవడం తేలికవుతుంది. రాజకీయంగా వారు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. చేనేత రంగం రోజురోజు దిగజారుతోంది. చట్ట సభలలో చేనేత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కరువయ్యారు.  దాంతో వారి సమస్యలను చట్టసభల్లో వినిపించడానికి అవకాశం లేకుండా పోయింది.  అటు పార్లమెంట్ లోగానీ, ఇటు ఏపీ శాసనసభలో గానీ చేనేత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. చట్ట సభలలో చేనేత గళం విప్పడానికి ఈ వర్గానికి రాజకీయ వారసత్వం కరువైంది.  చేనేత ఓటర్లు గణనీయంగా ఉన్నా ఏపీ శాసనసభలో 175 మంది సభ్యులలో  ఆ వర్గానికి చెందిన ఒక్కరు కూడా లేరు. ప్రస్తుత ఎన్నికలు, రాజకీయ వ్యవస్థలో చట్టసభకు పోటీ చేసి గెలిచేటంతటి ఆర్థిక స్తోమత కూడా వారికిలేదు.  అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, కర్నూలు జిల్లా నుంచి బుట్టా రేణుక మాత్రమే పార్లమెంటులో ఉన్నారు. రాష్ట్ర శాసనసభలో ఎవరూలేకపోవడంతో వారి పరిస్థితిని గమనించి శాసనమండలిలో  ఈ వర్గానికి చెందిన పోతుల సునీతకు అవకాశం కల్పించారు. జనాభా ప్రకారం రాష్ట్రంలో 18 వరకు శాసనసభ స్థానాలు  చేనేత కులాలకు దక్కాలి.  కనీసం 10 మంది చేనేత కులాల నుంచి ఎమ్మెల్యేలుగా వస్తేనే వారికి న్యాయం జరుగుతుందని  భావిస్తున్నారు. ఈ అంశాలను గుర్తించిన ఆ కులాల పెద్దలు రాష్ట్రంలో చేనేతకు చెందిన పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్ మొదలైన కులాలవారినందరినీ  కలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేనేత కులాలన్నీ ఏకమైతే తప్ప ఫలితం ఉండదని వారికి అర్ధమైంది. చేనేత కులాలు ఎవరికి వారు తాము ఎక్కువ మందిమి ఉన్నామంటే తాము ఎక్కవమందిమి ఉన్నాం  అని వాదించుకుంటూ పోతే సాధించేది ఏమీ లేదని, అందరం నష్టపోతామని వారికి అర్ధమైంది. ఆ విధమైన మాటలు ఐక్యతకు విఘాతం కలిగిస్తాయన్నది వారి భావన. అలా మాట్లాడేవారి నోటికి కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ భాగస్వామ్యం ఉంటేనే నిలదొక్కుకోగలుగుతామని నిర్ణయానికి వచ్చి  అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయ భాగస్వామ్యం కోసం ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టిక్కెట్ల సంపాదనలో బీసీ నాయకుల సహకారం కూడా తీసుకుంటున్నారు. వారు కూడా చేనేత వర్గానికి పూర్తి సహకారం అందిస్తామని మాట ఇచ్చారు. బలీయమైన శక్తిగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి వచ్చే ఎన్నికల్లో  ఎక్కువ టిక్కెట్లు పొంది,  గణనీయంగా శాసనసభ స్థానాలు గెలుచుకోవాలన్న  గట్టి పట్టుదలతో ఉన్నారు. చేనేత వర్గానికి చెందిన వ్యక్తి ఏ పార్టీ తరపున పోటీ చేసినా  మద్దతు పలికి గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడనుంది. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, ప్రజారాజ్యం మూడు ఈ వర్గాలపై దృష్టిసారించాయి. ఈ వర్గం ప్రభావితం చేయగల నియోజకవర్గాల గురించి ఆరా తీస్తున్నాయి. దాదాపు 15 శాసనసభ, 5 లోక్ సభ స్థానాల్లో వీరి సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తేలింది. ఆ నియోజకవర్గాల్లో మూడు పార్టీల తరపున ఈ సారి గణనీయంగా సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ అయినా సరే చేనేత వర్గానికి చెందిన ఏ కులం వారికి టిక్కెట్ ఇచ్చినా వారిని గెలిపించుకోవాలన్న గట్టిపట్టుదలతో చేనేత వర్గ నాయకులు ఉన్నారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...