అంబేద్కర్ స్మృతివనంపై వారం వారం సమీక్ష
మంత్రి నక్కా ఆనంద బాబు
సచివాలయం, డిసెంబర్ 4: రాజధాని
అమరావతిలో నిర్మించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను ఇకనుంచి వారం వారం
సమీక్షిస్తానని సాంఘీక సంక్షేమ, సినిమాటోగ్రఫీ
శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని
సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ స్మృతి వనం పనులను సంబంధిత శాఖల
అధికారులతో సమీక్షించారు. స్మృతి వనం వద్ద గ్రౌండ్ లెవెల్ పనులు పూర్తి అయ్యాయని
అధికారులు మంత్రికి చెప్పారు. ఒక పక్క అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే పనులు
కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, 20 అడుగుల పెడస్ట్రల్
ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విగ్రహం
చుట్టూ తిరగడానికి అనుకూలంగా కొంత ఖాళీ ప్రదేశం ఉంటుందని, విగ్రహం క్రింద లైబ్రరీ వస్తుందని, అలాగే 3500 సీటింగ్ సామర్ధ్యం గల ఓ కన్వెన్షన్ హాలు
నిర్మిస్తామని తెలిపారు. విగ్రహంలోని అన్ని భాగాలు తల, పుస్తకం, వేళ్లు, కాళ్లు
వంటి వాటి కొలతలను అధికారులు మంత్రికి వివరించారు. 5 అడుగుల నమూనా విగ్రహం ఈ నెల 10న వస్తుందని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో
ఉన్న విగ్రహం తరహాలో దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ద్వారా స్మృతి వనం నమూనాలను, అక్కడ జరుగుతున్న పనులను, వివిధ కోణాలలో అంబేద్కర్ నమూనా విగ్రహాన్ని
చూపించారు. అలాగే చైనాలో బుద్ధ విగ్రహం, ముంబైలో శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను,
న్యూయార్క్ లోని లిబర్టీ విగ్రహాన్ని చూపించారు. చైనా నుంచి తెప్పిస్తే లోహ విగ్రహం విడిభాగాలు
మాత్రమే పంపుతారని, రాష్ట్రంలో తయారు చేస్తే మొత్తం ఒక్కటిగా తయారు చేస్తారని
చెప్పారు. రాష్ట్రంలో కూడా ముగ్గురు శిల్పులు ఉన్నట్లు తెలిపారు. నమూనా విగ్రహాన్ని మాథూరామ్ అర్ట్ సెంటర్ వారు
తయారు చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు
మాట్లాడుతూ విగ్రహం తయారీ, వినియోగించే లోహం, ముఖ కవళికల వంటి విషయాలలో జాగ్రత్త
వహించాలని చెప్పారు. విగ్రహం తయారీకి సంబంధించి రాష్ట్రంలోని శిల్పులను
సంప్రదించమని ఆదేశించారు. విగ్రహం దీర్ఘకాలం మన్నికగా ఉండేవిధంగా రూపొందించడానికి
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విగ్రహం రూపకల్పన, హావభావాల విషయంలో
ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్మృతి వనం పనులలో వేగం పెంచమని
చెప్పారు. విగ్రహం తయారీ సంస్థలు, విగ్రహం ఏర్పాటు చేసిన తరువాత దాని శుభ్రత,
నమూనా విగ్రహం మొదలైన అంశాలను చర్చించారు. సమావేశంలో సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య
కార్యదర్శి ఎస్ఎస్ రావత్, డైరెక్టర్
ఎం.రామారావు, ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ
జీఎస్ ఆర్ కెఆర్ విజయ్ కుమార్, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం
కార్యదర్శి కల్నల్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment