ఎస్సీ,ఎస్టీల కోసం దేశంలో ఎక్కడాలేనన్ని పథకాలు
మంత్రి నక్కా ఆనందబాబు
సచివాలయం, డిసెంబర్ 4:
ఎస్సీ,ఎస్టీల కోసం దేశంలో ఎక్కడాలేనన్ని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు సాంఘీక సంక్షేమ, సినిమాటోగ్రఫీ
శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో
మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన
ఎస్సీ, ఎస్టీల పథకాల వివరాలు వెళ్లడించారు.
దళితులను, గిరిజనులను పైకి తీసుకురావడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా
పేర్కొన్నారు. 2014 నుంచి జనాభా దామాషా ప్రకారం సబ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు
తెలిపారు. నాలుగేళ్లలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద రూ.29,025.85 కోట్లు
కేటాయించి, రూ.26,922.92(92.75శాతం) కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది
షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కింద రూ.11,228.11 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి
నెల నోడల్ ఏజన్సీలను సమావేశపరచి, సమీక్ష చేసి పథకాలను సమర్థవంతంగా అమలు
చేస్తున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్ఞాన భూమి పోర్టల్ ఏర్పాటు
చేసి విద్యార్థులకు ప్రతినెలా స్కాలర్ షిప్స్ అందే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లలో
14,34,723 మంది మెట్రిక్ అనంతర విద్యార్థులకు రూ.2,447.85 కోట్లు ఉపకారవేతనాల
రూపంలో అందజేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.47 లక్షల మంది విద్యార్థుల కోసం
రూ.761.82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మెట్రిక్ పూర్వ ఉపకారవేతనాల కింద
1,08,072 మంది 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.79.63 కోట్లు అందజేసినట్లు
చెప్పారు. ఈ ఏడాది లక్షా 14 వేల మంది కోసం 21.68 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 9,
10 తరగతికి చెందిన 3,54,690 మంది విద్యార్థులకు రూ.99.37 కోట్లు అందజేసినట్లు
చెప్పారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద 4 ఏళ్లలో రూ.126.31 కోట్లు ఖర్చు
చేయగా, ఈ ఏడాది బడ్జెట్ లో రూ.42.57 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం
తీసుకుంటున్న చర్యల వల్ల మెట్రిక్ పూర్వ వసతి గృహాలలోని విద్యార్థులు గత సంవత్సరం
పదవ తరగతిలో 90.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. లక్షా 5వేల మందికి
4 ఏళ్లలో రూ.1225.92 కోట్లు ఖర్చు చేసినట్లు, ఈ ఏడాది రూ.437.83 కోట్లు
కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్ సీస్
విద్యానిధి, నైపుణ్యాభివృద్ధి వంటి పథకాల కింద కూడా భారీ స్థాయిలో నిధులు ఖర్చు
చేసినట్లు చెప్పారు. అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకం కింద గతంలో ఇచ్చే రూ.10
లక్షలను రూ.15 లక్షలకు పెంచినట్లు చెప్పారు.
ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించామని, ఇప్పటి వరకు
11,752 ఎస్సీ కులాల జంటలకు రూ.80 కోట్లు అందజేసినట్లు చెప్పారు. అంబేద్కర్ స్మృతి
వనానికి ఎగ్జిక్యూటివ్ ఏజన్సీగా ఉన్న ఏపీఐఐసీకి 20 ఎకరాల భూమిని కేటాయించి,
రూ.97.69 కోట్ల బడ్జెట్ విడుదల చేసినట్లు చెప్పారు. చర్మకారులకు పింఛన్,
పనిముట్లు, పెట్టుబడి నిధి, డప్పు కళాకారులకు పింఛన్ వంటి కొత్త పథకాలు
ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 188 గురుకుల విద్యాలయాల్లో 1,07,000
విద్యార్థులు చదువుతున్నారని, గత సంవత్సరం ఈ విద్యాలయాల్లో చదివిన 232 మంది నీట్
లో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 45 మంది విద్యార్థులు నేపాల్, చైనా, జపాన్,
అమెరికా, దుబాయ్ దేశాలను సందర్శిచారన్నారు. అక్కడ పని చేసే కాంట్రాక్ట్, పార్ట్
టైమ్ ఉపాధ్యాయుల జీతాలు పెంచినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్
కులాల సహకార సంస్థ ద్వారా వివిధ ఆర్థిక పథకాలను అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక
సంవత్సరంలో 1,07,257 మంది లబ్దిదారులకు రూ.2124.30 కోట్ల వ్యయం, రూ.1162.54 కోట్ల
సబ్సిడీతో స్వయం ఉపాధి, పశుసంవర్థక, భూమి ఆధారిత, భూమి కొనుగోలు వంటి పథకాలను అమలు చేశారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా
షెడ్యూల్ కులాల కార్పోరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్ డీసీ, ఎన్ఎస్ కెఎఫ్ డీసీ పథకాల
ద్వారా 485 ఇన్నొవా కార్లు, 294 రవాణా వాహనాలు, 200 ట్రాక్టర్లు, 660 డ్రెయిన్
క్లీన్ మిషన్లు, 350 పాసెంజర్ పవర్ ఆటోలు పంపిణీ చేసినట్లు వివరించారు. విశాఖ,
ఏలూరు, తిరుపతి, అనంతపురంలలో రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ స్కిల్ ట్రైనింగ్
సెంటర్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
గిరిజన సంక్షేమ
శాఖ పథకాలు
గిరిజన సంక్షేమానికి కూడా
ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి ఆనందబాబు చెప్పారు. షెడ్యూల్
తెగల ఉప ప్రణాళిక కింద 4 ఏళ్లలో రూ.10,033.44 కోట్లు కేటాయించగా, రూ.8,949.54
కోట్లు(89.20 శాతం) ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది షెడ్యూల్ తెగల కాంపొనెంట్
కింద రూ.4,176.61 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వీరికి ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి,
భూమి కొనుగోలు, చిన్ననీటి పారుదల, నైపుణ్యాభివృద్ధి, ఎన్ఎస్ టీఎఫ్ డీసీ వంటి
పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొన్ని కొత్త పథకాలు కూడా
ప్రకటించినట్లు చెప్పారు.
నాలుగేళ్లలో 2,41,345
మంది మెట్రిక్ అనంతర విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో రూ.364.01 కోట్లు
అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రూ.112.27 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 4
ఏళ్లలో 5 నుంచి 8వ తరగతి చదివే 18,397 మంది విద్యార్థులకు రూ.2.16 కోట్లు ఖర్చు
చేశారు. ఈ ఏడాది రూ.1.91 కోట్లు కేటాయించారు. 4 ఏళ్లలో 9,10 తరగతి విద్యార్థులు
1,01,051కి రూ.42.32 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.34.86 కోట్లు కేటాయించారని
చెప్పారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఎంపికైన అభ్యర్థికి 9 నెలల పాటు
రూ.10,000 చొప్పున స్టైఫండ్, మరో రూ.2వేలు ఏక మొత్తం గ్రాంట్ గా ఇస్తున్నట్లు
తెలిపారు. వీరికి కూడా అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యా నిధి, ఉచిత విద్యుత్(జగ్జీవన్
జ్యోతి పథకం), చంద్రన్న పెళ్లి కానుక వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వారి
కోసం రాష్ట్రంలో ప్రీ-మెట్రిక్ హాస్టళ్లు 405 నిర్వహిస్తున్నారని, వాటిని దశల
వారీగా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నామని, ఇప్పటి వరకు 179 మార్చినట్లు
వివరించారు. గత సంవత్సరం ఈ హాస్టళ్లలో చదివే పదవ తరగతి విద్యార్థులు 91.38 శాతం
వృద్ధి సాధించినట్లు తెలిపారు. ఇంటర్ నుంచి పీహెచ్ డీ వరకు చదువుకునే విద్యార్థినీ
విద్యార్థుల కోసం 158 వసతి గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 55,575 మంది
విద్యార్థులతో 184 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు
చెప్పారు. గిరిజనులకు ఇంటి నిర్మాణం కింద ఈ ఏడాది అదనంగా రూ.383.85 కోట్లు
అందజేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవే కాకుండా పైప్ లైన్, పోషకవిలువలు
పెంపొందించే పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పేదరికంపై గెలుపు పథకంలో భాగంగా
ఈ ఏడాది16,232 మందికి లబ్ది చేకూర్చేవిధంగా రూ.139.48 కోట్లు కేటాయించారని మంత్రి
ఆనందబాబు తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమం, సాధికారిత
శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్
రావత్, డైరెక్టర్ రామారావు, ఏపీ
గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment