ఆడపిల్లని హైలెట్ చేసిన ‘చేనేత బతుకు’
ముఖ్యంగా ‘మగ్గం బతుకు’ అనే కథలో చేనేత
కార్మికుని దుస్థితితోపాటు ఆడపిల్ల కుటుంబానికి ఎంత చేదోడువాదోడుగా ఉంటుందో చాలా
చక్కగా వివరించారు. ఆడపిల్ల అయితే తల్లికి, మగ పిల్లవాడైతే తండ్రికి సహాయపడతారనేది
నానుడి. ఆడపిల్ల పుడితే భయపడే రోజులు పోయాయి. వారు కూడా, వారు కూడా ఏంటి కొన్ని
కుటుంబాలలో మగపిల్లల కంటే ఆడపిల్లలే చదువులో ప్రతిభ చూపుతున్నారు. కుటుంబాన్ని
ఆదుకోవడంలో ముందుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటున్నారు. ఈ
కథలో మల్లేశ్వరి పాత్ర కూడా అటువంటిదే. లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని తెలిసిన తరువాత
అబార్షన్లు చేయించుకోవాలనేవారికి కనువిప్పు కలిగించే రీతిలో రాసిన ఈ చిన్న కథలో జీవితంలోని అనేక అంశాలను కళ్లకు
కట్టారు. మనిషి ఔన్నత్యాన్ని చాటే చెప్పారు. ఓ చేనేత కార్మికుడు ఆత్మాభిమానంతో
బతికే తీరుని వివరించిన గొప్ప కథ ఇది. అలాగే ‘ఉపాధి’ కథలో కూడా ఓ ఆడపిల్ల కుటుంబం
కోసం ఏ విధంగా కష్టపడుతుందో తెలియజెప్పారు.
సమాజ క్షేత్రంలో మానవ సంబంధాలు
రిక్తమవుతున్న వేళ ఓ రచయిత, ఓ కవి వాస్తవాలవైపు దృష్టిపెట్టి తన కలాన్ని ఎలా
ఝుళిపించాలో ‘కథనం దొరికింది’ కథలో వివరించారు. సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే
మోసాలను తెలియజెబుతూ ‘కనువిప్పు’, ‘ఇదోరకం విద్య’ కథల ద్వారా హెచ్చరించారు. ఆడపిల్లలు ఝాన్సిరాణీ, రుద్రమదేవి, ఆదిశక్తిలా
ఉండాలని ‘భలే అమ్మాయిలు’ కథలో సూచించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా రాసిన
‘హేతువు’ కథలో భూతాలు, దెయ్యాలు లేవని, నిజమైన దెయ్యాలు భూతవైద్యులేనని, వారి
మోసపూరిత కటనని కూడా వివరించారు. ‘ఆదర్శమా వర్థిల్లు’, ‘ఉపాధి’ కథలు కుల రహిత
సమాజం, కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఇస్తూ రాశారు. దురలవాట్లకు బానిసైతే బతుకు
దుర్బరమవుతుందని ‘మారిన మనసు’ కథలో హెచ్చరించారు. ఒక రచయిత తన రచనను అచ్చు రూపంలో
చూసుకోవడానికి ఎంత తపన పడతాడో ‘చిత్తగించవలెను’ కథ ద్వారా వివరించారు. మనిషి
కేంద్రంగా సమాజ జీవన వాస్తవికత సంఘర్షణల నుంచి వస్తువుని స్వీకరిస్తూ రచయిత
దృక్పదం నుంచి కథ వెనుక గల లక్ష్యాన్ని
స్థానీయత, నాటకీయత, క్లుప్తత, భావసరళత, శిల్పపరంగా అక్షర శరాలను సంధిస్తూ..కథను
చివరికంటా చదివించే కొసమెరుపు ముగింపు రచయిత సృజించగలిగితే అలాంటి కథల్ని పాఠకలోకం
తప్పక ఆస్వాదిస్తుందని యువ రచయితల భుజంతట్టి మరీ చెప్పారు.
ఇక తన వ్యాసాలలో దేశంలో చేనేత రంగం
దుస్థితి, చేనేత కార్మికుల బతుకు, ఈ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని
ఎండగట్టారు. మొత్తం మీద మనిషితనాన్ని తన
రచనలలో చేనేత కార్మికుల దయనీయ స్థితితోపాటు సముద్ర తీర అందాలను కూడా వర్ణించారు. అన్నదాత
రైతైతే వస్త్రదాత చేతన్న అంటూ కదలవోయి నేతన్నా, కదలిరా నేత కార్మిక వంటి గీతాలు ఇందులో
ఉన్నాయి.
ఎప్పుడూ ప్రేమ గీతాలు రాసే ఆచార్య ఆత్రేయ
‘‘ గాలిలోన తేలిపోయే చీరగట్టిన
చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో
చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే
నేసినారు.... అని సందేశాత్మక లలిత గీతాలు రాసినట్లు అభ్యుదయ కథలు, నాటికలు, గీతాలు రాసే భూపతి సన్నజాజీ పూసేవేళ
..., నీ చెదరని చిరునవ్వు..... వంటి భావ గీతాలు కూడా రాశారు. అన్నిటికంటే ముఖ్యం కేవలం
రెండవ తరగతి మాత్రమే చదువుకున్న చేనేత
కార్మికుడైన భూపతి తన జీవితానుభవంతో
కులమతాలు లేని సమసమాజం కోరుకుంటూ ఇంతటి గొప్ప కథలు రాయడం విశేషం.
పుస్తకం పేరు: చేనేత బతుకు
రచయిత
పేరు: సందుపట్ల భూపతి,
పుస్తకం
ధర: రూ.80/- పేజీలు
: 90
ప్రతులకు
: ఇంటి నెంబర్ 3/03(74ఏ), గండాలయ పేట,
మంగళగిరి-522503,
సెల్ నెంబర్:
9603569889
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914
No comments:
Post a Comment