Jan 30, 2018

పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ సంస్థల ఆసక్తి


Ø  సీఎం 14 దావోస్ పర్యటన విజయవంతం
Ø ఏపీలో పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సుజ్లాన్ గ్రూప్ ఆసక్తి
Ø మంత్ర డాటా సెంటర్స్ ఏర్పాటుకు సిద్దం
Ø వైజాగ్ మెడ్‌టెక్ పార్కులో యురోపియన్ సెగ్మెంట్
      
   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ సారి జరిపిన  4 రోజుల దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం బృందం దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. కాస్త అనారోగ్యంగా ఉన్నప్పటికీ సీఎం జనవరి 22 నుంచి 25 వరకు చాలా బిజీగా గడిపారు.  ఏపీ నుంచి వెళ్లిన సీఎం బృందానికి అంతర్జాతీయంగా పలువురు మేథావులను, వివిధ కంపెనీల ముఖ్యకార్య నిర్వహణాధికారులు, పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులను కలుసుకొని, ప్రపంచం వ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న అనేక కొత్తకొత్త విషయాలను, పారిశ్రామిక రంగం విస్తరణ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. అనేక దిగ్గజ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడిపెట్టడానికి ఆసక్తి చూపించాయి. ఈ పర్యటనలో 25 ద్వైపాక్షిక సమావేశాలు, రెండు ఎంఓయులు జరిగాయి. తొలుత జ్యూరీక్ చేరిన సీఎం  పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రోన్ పాల్, చీఫ్ ఇన్వెస్టర్ ఆఫీసర్ సందీప్ రాజ్ తో మొదటి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు..  పాల ఉత్పత్తుల కోసం సహకార సంస్థల ఏర్పాటు, ఉద్యాన పంటలకు ప్రోత్సహాం తదితర అంశాలను చర్చించారు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి ప్రణాళికతో రండి. మీకు అన్నివిధాలా సహకారం అందజేస్తాం. సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తున్నాం అని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎ సూచించారు. కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా తెలిపారు. పండ్లతోటల సాగు, కూరగాయల సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు  రోన్ పాల్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి భవిష్యత్తు  కార్యాచరణను సవివరంగా ప్రకటిస్తామన్నారుఈ సంస్థ  మన దేశంలో ఇప్పటికే వ్యవసాయ రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టింది. మన రాష్ట్రంలోని  కుప్పంలోమహారాష్ట్రలోని నాందేడ్ లో ఇప్పటికే పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం జ్యురిక్ స్టేట్ తో సిస్టర్ స్టేట్ అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో  జూరిచ్, ఏపీ ప్రభుత్వం అధికారులు సిస్టర్ స్టేట్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.  జ్యూరిక్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్ వాకెర్ స్పా, ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి బ్యూన్ సాటర్, జ్యూరిక్ ప్రభుత్వానికి చెందిన ప్రాజెక్టు మేనేజర్ కొరిన్ వ్యేర్ సీఎంని కలిశారు.  ఒప్పందం వల్ల పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణ, ప్రాంతీయాభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. రెండో రోజు దావోస్ లో జరిగిన బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం ప్యానెల్ డిస్కషన్ లో ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సానుకూలాంశాలను వివరించారుపెట్రోలియం రిఫైనరీ రంగంలో ప్రసిద్ధి చెందిన సౌదీ ఆర్మ్‌కో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ విభాగం  వైస్ ప్రెసిడెంట్  సైద్ ఎ. అల్ హద్రమీ చర్చలు జరిపారు. ఏపీలో చమురు సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్న దృష్ట్యా హద్రమీ ఆసక్తి కనబరిచారు.  ఆంధ్రప్రదేశ్ లో  640 .కి.మీ మేర చమురు, రసాయనాలు, పెట్రెకెమికల్స్ ఇన్వె స్టిమెంట్ రీజియన్ (పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ పెట్టుబడుల ప్రాంతం- పీసీపీఐఆర్) లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు  ప్రాధాన్యతా కేంద్రంగా సౌదీ ఆర్మ్‌కో ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని   సౌదీ ఆర్మ్‌కో సంస్థకు  సీఎం సూచించారు. చమురు శుద్ధి రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నామని సైద్ హద్రమీ అన్నారు. సి.., పిడబ్ల్యుసి సంయుక్తంగా నిర్వహించిన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా‘  వ్యాపార విభాగ (బిజినెస్ సెషన్)‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీకీ  వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై -బెంగుళూరు ఇండస్ట్రియల్
కారిడార్లు రెండూ ఒక వరం అని చెప్పారు. తిరుపతి  ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఇప్పటికే సెల్కాన్,డిక్సన్, కార్బన్ లాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని గుర్తు చేశారు.శ్రీ సిటీ సెజ్ లో ఫాక్స్‌కాన్ మొబైల్ తయారీ కంపెనీ లో ఒకే చోట 12 వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిని  హరిత, ఆహ్లాదభరిత వాతావరణం ఉట్టిపడేలా ప్రపంచ స్థాయిలో ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని, ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. 150 కంపెనీలను ఏపీకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న  మిడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం గలవారు, శాస్త్ర నిపుణులతో 45 నుంచి 50 వేలకు పైగా ఉద్యోగాల కల్పన, దీనికి రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ సంస్థ పని చేస్తోంది. వైజాగ్ మెడ్‌టెక్ పార్కులో భాగస్వామ్యం తీసుకుని క్రమంగా విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వైజాగ్ మెడ్‌టెక్ పార్కులో యురోపియన్ సెగ్మెంట్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
          సీఎంని మర్యాదపూర్వకంగా  కలిసిన ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్ అమరావతి అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పి, అమరావతిలో ప్రాంతీయ ప్రధాన కార్యలయాన్ని ప్రారంభించడానికి అంగీకారం తెలిపారు. అమరావతిలో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎంతో సమావేశమైన ఏజిల్ లాజిస్టిక్స్ సంస్థ సీఈవో తరక్ సుల్తా అల్ ఎస్సా ఏపీలో వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామన్నారుప్రభుత్వ నేతగా ఉన్న వ్యక్తి నుంచి సాంకేతికతకు సంబంధించిన మాటలు వినడం తనకు అమితాశ్చర్యంగా ఉందని, సంస్థలకు సంబంధించిన వారు కూడా ఇంత పరిజ్ఞానంతో మాట్లాడలేరని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టించేందుకు మీరు మమ్మల్ని ఒప్పించనవసరం లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మేము ఇప్పటికే స్థిర నిర్ణయం తీసుకున్నాంఅని చెప్పారు.
 హిటాచీ ప్రెసిడెంట్ తొషైకీ హిగషిహర కూడా సీఎంతో భేటీ అయ్యారుసిటిజన్ లైఫ్ సైకిల్ ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌ అంశంపై హిటాచి సంస్థతో ఏపీ ఈడీబీ ఎంవోయూ కుదుర్చుకుంది. సుజ్లాన్ గ్రూప్ సీఎండీ తుల్సి తంతి సీఎంతో సమావేశమై పవన, సౌర, గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగాలలో తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. ఈ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ నిల్వ అంశంలో భారీ పరిశోధనలు చేస్తున్న ఈ గ్రూప్ ఏపీలో పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చింది. మంత్ర డాటా సెంటర్స్ బోర్డ్ మెంబర్ మోహన్ చైనాని సీఎంని కలిసి ఏపీలో  డాటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గూగుల్, యాక్సెంచర్ డాటా సెంటర్లు కూడా ఏపీలో ఏర్పాటు చేయిస్తామని చెప్పారు.  అందుకు అవసరమైన భూమి, విద్యుత్, ఫైబర్ వసతులు కల్పించాలని కోరారు.  కావాల్సిన అన్ని అనుమతులు 21 రోజుల్లో కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.అత్యున్నత ఎలక్ట్రానిక్ మెడికల్ హెల్త్ రికార్డుల తయారీపై అధ్యయనం చేస్తున్న గ్లోబల్ ఫార్మా కంపెనీ రోషేభారతదేశంలో దీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. రోషేప్రతినిధి క్రిస్టోఫె ఫ్రాంజ్‌ సీఎంని కలిసి తమ సంస్థ భారత్ లో మరింతగా విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తనను కలిసిన ఏబీబీ అధ్యక్షుడు చున్యున్‌గుకు సీఎం సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్ రంగాలలో ఏపీ అనుసరిస్తున్న నూతన విధానాలను, అమరావతిలో కాలుష్య రహిత విద్యుత్ వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించి ఏపీలో  ఏబీబీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విధానాలను అధ్యయనం చేసి, తయారీ కేంద్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చున్యున్‌గు బదులిచ్చారు. వ్యవసాయ ఉపకరణాలు, ఉత్పత్తులకు పేరుగాంచిన యూపీఎల్ సంస్థ గ్లోబల్ సీఈవో జై షరోఫ్ తో సీఎం భేటీ అయిన సందర్భంగా ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, సమర్ధ నీటి నిర్వహణ చేపట్టడం, వ్యవసాయ వ్యయ భారాన్ని నియంత్రించడం, ఉత్పాదకత పెంచడం తమ సంస్థ లక్ష్యాలని ఆయన వివరించారు.
భారత్ లో రెండో డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటుకు  సిద్ధంగా ఉన్నట్లు కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూ సీఎంకు చెప్పారు. మహీంద్ర సంస్థ గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రతో సీఎం భేటీ అయ్యారు. మా రాష్ట్రాన్ని ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దటం నా స్వప్నంఅని చంద్రబాబు వివరించారు. ఇండస్ట్రియల్  సిటీ సెజ్‌ను ఏపీలో ఏర్పాటుచేయడానికి అన్ని విధాలుగా  సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసినవారిలో బ్లూమ్‌బెర్గ్సంస్థ సీఈవో జస్టిన్ స్మిత్. హెచ్ పీ 3డీ ప్రింటింగ్ హెడ్ స్టీఫెన్ నిగ్రో, నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేశ్‌, బ్లాక్‌చైన్ టెక్నాలజీకి చెందిన ఎథేరియంవ్యవస్థాపకుడు జో లుబిన్, రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజా, జాన్సన్ ఇన్వెస్టిమెంట్స్  ప్రతినిధి యుల్లి జాన్సన్, శానిటరీవేర్ తయారీదారులుగా పేరొందిన లిగ్జిల్ గ్రూపు సీఈఓ కిన్యా సెటో, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) సంస్థ చైర్మన్, సీఈవో సంజీవ్ అహుజా. ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ డస్సాల్ట్గ్రూపు ప్రతినిధి బెర్నార్డ్ చార్లెస్, బిజినెస్ అప్లికేషన్స్‌లో వరల్డ్ లీడర్‌గా ఉన్న శాప్ ప్రతినిధులు ఉన్నారు. దావోస్‌లో జరిగిన సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో, ఇంటరాక్టివ్ లంచాన్ విత్ టాప్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్అనే కార్యక్రమంలో టెక్నాలజీస్ ఫర్ టుమారోఅనే అంశంపై సీఎం అద్బుతంగా ప్రసంగించారు. జ్ఞాన సంపదతో రాత్రికి రాత్రే అద్భుతాలు చేయవచ్చని, నవ్య ఆవిష్కరణలు మన జీవన విధానాన్నే మార్చివేస్తున్నాయని చెప్పారు.ఈ పర్యటనలో సీఎం తన ప్రసంగాలు, చర్చల సందర్భంగా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్( వ్యాపార అనుకూల వాతావరణం), -ప్రగతి, రియల్‌టైమ్ గవర్నెన్స్, 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 కాంపెయిన్లు, ఫైబర్ గ్రిడ్ తో అనుసంధానం, 6 వేలకు పైగా వర్చువల్ క్లాస్‌రూములు, డ్రోన్ల వినియోగం, -ఆఫీసు, -క్యాబినెట్, బయోమెట్రిక్, 1100 నెంబర్ కాల్ సెంటర్, క్లౌడ్ హబ్ పాలసీ, 20 వేలకు పైగా సీసీ కెమరాల వినియోగం గురించి వివరించారు. రాష్ట్రం మొత్తాన్ని స్మార్ట్ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నామని చెప్పారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్ గా మార్చడం తమ  ధ్యేయం అన్నారు. తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ  అత్యంత ఆనందదాయకమైన జీవనం సాగించేలా చూడటం, 2022కు దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం, 2050 ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బృందంలో  రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడురాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్ ఉన్నారు.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...