ఉదాహరణకు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం, సబ్సిడీ ఇవ్వడం వంటి చర్యల వల్ల వాటి అమ్మకాలతోపాటు డిమాండ్ పెరుగుతుంది. ఆ విధంగా ఉత్పత్తి
ప్రకియ జరగడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. చేనేత అంటే దానికి అనుబంధంగా 10-15 రకాల వృత్తుల వారు
ఉపాధి పొందే అవకాశం ఉంది. పత్తి పంట ద్వారా వ్యవసాయదారులు, నూలు వడకడం,
ఆసు తోడటం, పడుగులు చేయడం, రంగుల అద్దకం, కుంచెలు,
లాకలు తయారు
చేసేవారు, మగ్గాలు, రాట్నాలు వంటివి తయారుచేసే వడ్రంగులు, చివరకు వస్త్రాల అమ్మకం
ఇలా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రోడ్లు, అంగన్ వాడీ భవనాల వంటి వాటి నిర్మాణం, పాఠశాలలు, శ్మశానాలు,
చెరువులు, కాలువలు వంటి వాటి
మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా ఒక పక్క గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. మరో పక్క ఉపాధి లభిస్తోంది. గ్రామీణ చిన్నతరహా
పరిశ్రమలతోపాటు బుట్టలకు, తట్టలకు, చీపుర్లకు, కొవ్వొత్తులకు,
చాక్ పీస్ లకు సబ్సిడీ ఇచ్చినా అక్కడ ఉత్పత్తి
ప్రక్రియ జరుగుతుంది. ఉపాధి లభిస్తుంది. ప్రజాకర్షణ పేరుతో
ఒకరికొకరు పోటీపడి ప్రజలకు డబ్బు ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టడం ఎంతమాత్రం మంచిదికాదు. దానికి బదులు ఓ పలుగు, పార ఇవ్వండి.
మట్టి తవ్వే పని చేసుకొని బతుకుతారు. గతంలో ఆదరణ పేరుతో కుల వృత్తులు, చేతి వృత్తి పనులకు
సంబంధించిన పరికరాలు ఇచ్చారు. ఇస్త్రీ పెట్టె, బార్బర్ షాపు సామాగ్రి, సన్నాయి, డోలు,
చేపలు పట్టే వలలు, కొలివి సామాను, కుండలు, బొమ్మలు తయాలరు చేసే
సామాగ్రి లాంటి వాటిని ఇచ్చారు. ఇప్పుడు సామాజిక
పరిస్థితులలో మార్పులు వచ్చాయి. డ్రైక్లీనర్, బార్బర్,
గాజులు, ఫ్యాన్సీ షాపులు, బ్యూటీ పార్లర్, హోటళ్లు,
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, కుటీర పరిశ్రమలకు విస్తృత స్థాయిలో రుణాలు ఇవ్వవచ్చు. చేసే వ్యాపారం, ఉత్పత్తి ఆధారంగా రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు, సబ్సిడీలు ఇవ్వడం
ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఆ ఇచ్చే రుణాలు ప్రచారార్భాటంగా కాకుండా ఆచరలో సాధ్యమయ్యే విధంగా ఉండాలి. బ్యాంకుల ఇష్టానికి వదిలివేస్తే మంజూరు చేసినవాటిలో సగం కూడా ఇవ్వరు. కొన్ని బ్యాంకులు 30 శాతం కూడా ఇవ్వవు. అలా కాకుండా ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి పేదలు పడే పాట్లు తగ్గించవలసిన అవసరం ఉంది. వృత్తుల పరమైనవాటికి
అతి తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.
భూస్వాములు,
వ్యాపారవేత్తలు, అప్పులుపాలైన పేద రైతులను ఒకే గాటన కట్టి రుణమాఫీ చేయడం కూడా సరైన చర్య కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ (ప్రజల) ధనం అధికంగా వ్యయమై పేద రైతులతోపాటు ధనవంతులు కూడా లబ్దిపొందుతారు. ఇటువంటి చర్యలు సమసమాజ నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వ ఏ ఆశయం తో ఆ పథకం ప్రవేశపెట్టిందో అది నెరవేదరు. ఇటువంటి పథకాలు
ప్రవేశపెట్టేటప్పుడు పేదలకు, అట్టడుగు వర్గాలకు
మాత్రమే ప్రయోజనం కలిగేవిధంగా విధివిధానాలు రూపొందించాలి. దానికంటే వ్యవసాయ ఉత్పత్తులకు
గిట్టుబాటు ధరలు లభించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు
చేసినవారవుతారు.
వ్యవసాయ ఉత్సత్తుల దిగుబడి సమయంలో ధరలు పూర్తిగా
పడిపోవడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఉదాహరణకు టమోటాలు ప్రస్తుతం కిలో రూ.3 లకు రైతులు అమ్ముకోవలసి
వస్తోంది.
కోత కూలి పోతే రైతుకు ఎంత మిగులుతుందో అందరికీ
తెలిసిందే.
ఆదే టమోటాను ప్రాసెసింగ్ కు మళ్లిస్తే ధరలు అంతగా
పడిపోవు.
ప్రస్తుత
ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధ్యానత ఇస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి అనేక రాయితీలు ఇస్తోంది. ఇటువంటి చర్యల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. పేద విద్యార్థులు కూడా
ఉన్నత చదువుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు
రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా గతంలో కారుల్లో తిరిగే
ధనవంతుల పిల్లలు కూడా లబ్ది పొందారు. ఇటువంటి వాటికి అడ్డుకట్టవేయవలసిన అవసరం ఉంది. పండుగల సందర్భంలో పలురకాల వస్తువులతో ఓ సంచి ఇస్తున్నారు. సంక్రాంతికి కూడా అలాంటి సంచే ఇచ్చారు. దీనిని దృష్టిలోపెట్టుకొని
మరో పార్టీ వారు సరుకులతో కూడిన సంచులు కాకుండా సంక్రాతికి ఇంటింటికి ఏకంగా అరిశల
ప్యాకెట్ ఇస్తామని హామీ ఇచ్చే ప్రమాదం ఉంది. ఇవి అంత అవసరమా? ఆలోచించడం.
మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 32 కులాలలో యాచక వృత్తి చేసుకునేవారు కూడా ఉన్నారు. సామాజికంగా,
ఆర్థికంగా ఆ కులాల వారి బతుకు దుర్భరంగా ఉంది. తమకు రూ.25 వేల నుంచి రూ.లక్షల వరకు అప్పు ఇప్పిస్తే చిన్న చిన్న వ్యాపారులు చేసుకొని బతుకుతామని
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలోనే వారు అధికారులను అడిగారు. ఈ కులాల వారితోపాటు అలా
బతకాడానికి ముందుకు వచ్చేవారికి చిన్ని చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల ద్వారా జీవించడానికి ఏ ప్రభుత్వమైనా నిజాయితీగా అవకాశం కల్పించడం వల్ల
రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు వారి జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం,
సమాజ శ్రేయస్సు దృష్ట్యా అశాస్త్రీయ రుణ మాఫీలను, ఉచితంగా ఇచ్చేవాటిని తగ్గించవలసిన అవసరాన్ని అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.
-
శిరందాసు
నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment