Jan 30, 2018

సమయం ఎక్కువలేదు-నిధులు ఖర్చు చేయండి


నోడల్ ఏజన్సీ సాంఘీఖ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు
          
           సచివాలయం, జనవరి 30: ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు వచ్చేశామని, ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉందని, పనుల వేగం పెంచి ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయాలని సాంఘీఖ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం  జరిగిన ఎస్సీసీ, ఎస్టీసీ 19వ నోడల్ ఏజన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోల్చితే నిధుల వినియోగంలో కొంత మెరుగు కనిపిస్తోందన్నారు. ఎస్టీ, ఎస్సీ నిధులు 70 నుంచి 75 శాతం మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన వాటిని కూడా చివరి త్రైమాసికంలో ఖర్చు చేయాలని చెప్పారు. గేదెలు కొనుగోలుకు సంబంధించి అధికారులు చెప్పే ధరలకు, రైతులు మార్కెట్ లో కొనుగోలు చేసే ధరలకు వ్యత్యాసం ఉందన్నారు.  వచ్చే బడ్జెట్ లో ఎస్టీ, ఎస్సీలకు ఉపయోగపడే, ఆర్థికంగా భరించగలిగే పథకాలు రూపొందించమన్నారు. ట్రాక్టర్లు కొనుగోలు వంటి పథకాలలో లబ్దిదారుల భాగం ఎక్కువగా ఉన్నందున కొన్ని మండలాల్లో వారు ముందుకు రావడంలేదన్నారు. ఇతరులకు ఇచ్చేవిధంగా గిరిజన రైతులకు కూడా సబ్సిడీ ఇస్తున్నారని, అలా కాకుండా వారికి సబ్ ప్లాన్ నుంచి అదనంగా సబ్సిడీ ఇవ్వాలన్నారు.  అటువంటి పథకాలకు ఎక్కువ సబ్సిడీ ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించమని మంత్రి ఆదేశించారు.
        ఎస్సీ కాంపొనెంట్ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,847.13 కోట్లు కేటాయించగా, నోడల్ ఏజన్సీలకు చెందిన 44 ప్రభుత్వ శాఖలు జనవరి 25 వరకు రూ.7,469.36 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ ప్రకారం రూ.10,916.34 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎస్టీ కాంపొనెంట్ కింద ఈ ఏడాది రూ.3,528.78 కోట్లు కేటాయించగా, నోడల్ ఏజన్సీకి చెందిన 45 శాఖలు జనవరి 25 వరకు రూ.2,610.37 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. సవరించిన బడ్జెట్ ప్రకారం రూ. 4,025.97 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

         సాంఘీక సంక్షేమ శాఖ  ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్  ఎస్సీసీ, ఎస్టీసీ నిధుల వినియోగానికి సంబంధించి అన్ని శాఖల పనితీరుని సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులు ప్రవేశపెట్టడానికి తగిన ప్రణాళికలు రూపొందించమని ఆదేశించారు. చేపల చెరువులు, ట్రాక్టర్లు కొనుగోలు వంటి పథకాలలో లబ్దిదారులకు బీనామీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆధార్ నెంబర్ తో సహా లబ్దిదారుల పేర్లు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.  సివిల్ సప్లైస్, యూత్ సర్వీసెస్, ఎనర్జీ, ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, సెర్ప్, సర్వశిక్ష అభియాన్, హార్టీ కల్చర్, మన బడి, అంగన్ వాడీ భవనాలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు తదితర అన్ని విభాగాల్లో నిధుల వినియోగాన్ని సమీక్షించారు. మిగిలిన నిధులను వచ్చే రెండు నెలల్లో ఖర్చు చేయాలని చెప్పారు. గిరిజనులకు ప్రయోజనం కలిగిలా, వారికి ఏవి అవసరమో వాటికి సంబంధించిన కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి, బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమ కమిషనర్ కాంతిలాల్ దండే, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ సుజాతాశర్మ,  మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత,  ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి కల్నల్ వి.రాములు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గందం చంద్రుడు, పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Jan 29, 2018

ఫిబ్రవరి 2 నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటన


                      సచివాలయం, జనవరి 29: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మూడు రోజులపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రభుత్వ అదనపు కార్యదర్శి లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎం.అశోక్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పర్యటన వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.
ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానం బయలుదేరతారు. సాయంత్రం 4.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ప్రముఖులు స్వాగతం పలుకుతారు. ఆ తరువాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 4.50 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శంకర్ నేత్ర చికిత్సాలయానికి చేరుకుంటారు. 5 గంటలకు ఆ చికిత్సాలయాంలో అదనపు సౌకర్యాలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఆత్కూరు గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 6.50 గంటలకు సర్వర్ణభారతి ట్రస్ట్ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
         3వ తేదీ శనివారం ఉదయం 7.45 గంటలకు సర్వర్ణభారతి ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గంలో భయలుదేరి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 8.30 గంటలకు పెదనందిపాడు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 8.50 గంటలకు  పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు. 9.30 గంటలకు జరిగే కాలేజీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 10.15 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాఫ్టర్ లో బయలుదేరి 10.45 గంటలకు గుంటూరులోని ఓమెగా ఆస్పత్రి సమీపంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అగతవరప్పాడు ఒమేగా ఆస్పత్రికి చేరుకొని 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆంకాలజీ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 12 గంటలకు జెకెసీ కాలేజీ వద్దకు చేరుకొని నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. జెకెసి కాలేజీ నుంచి 2.15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాఫ్టర్ లో సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.15 గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
             4వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు  స్వర్ణభారతి ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ఆయనకు ప్రముఖులు వీడ్కోలు పలుకుతారు. అక్కడ 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, 12.35 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసానికి చేరుకుంటారు.

ఫిబ్రవరి 2న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, జనవరి 29: అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల అన్ని శాఖల కార్యదర్శులు తమ ఎజెండా అంశాలను సాధారణ పరిపాలనా శాఖకు పంపిచాలని పేర్కొన్నారు. 

కిలిమంజారో అధిరోహించిన ఏపీ విద్యార్థులు

మంత్రి ఆనందబాబు అభినందనలు
          సచివాలయం, జనవరి 29: ఆఫ్రికా ఖండంలోని అతిఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు అభినందించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో సోమవారం మధ్యాహ్నం మంత్రి ఆ విద్యార్థినీ, విద్యార్థులను, వారి కోచ్ లను శాలువాలు, పూలమాలలో సత్కరించి, సర్టిఫికెట్లు అందజేశారు. పది మంది విద్యార్థినులు ఎస్.శిరీష, కె.రమ్యశ్రీ, బి.ఇందిరాబాయి, వై.కవిత, సీ.పద్మావతి, కె.మహాలక్షి, జీ.హేమలత, బి.సునీత, కె.అమ్ములు, ఎం.సీ.మహాలక్ష్మి, అయిదుగురు విద్యార్థులు డి.లక్ష్మణ్, బి.రమేష్, వి.శ్రీకాంత్, డి.కృష్ణ కుమార్, బి.సురేష్ మొత్తం 15 మంది  ఆఫ్రికా ఖండం టాంజానియా దేశంలోని 19,341 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరం అధిరోహించి ఈ నెల 26న భారత గణతంత్ర దినోత్సవం రోజు 1350 అడుగుల జాతీయ పతాకాన్ని ఎరుగవేశారు. అంతేకాకుండా గౌరవ సూచకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనందబాబు, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల జెండా చిత్రపటాలను అక్కడ ఉంచారు.  విద్యార్థులకు శేఖర్ బాబు, పరమేష్ కుమార్, రఘునాద్ లు కోచ్ లుగా శిక్షణ ఇచ్చారు. కోచ్ రఘునంద్ టీమ్ లీడర్ గా, నీలిమ గైడ్ గా వ్యవహరించి వారిని కిలిమంజారో పర్వత శిఖరం వరకు తీసుకువెళ్లి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తమ గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులోనే కాకుండా అనేక సాహస కార్యక్రమాలలో పాల్గొంటూ విజయశిఖరాలను అధిరోహిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. తమ విద్యార్థులు కూచిపూడి నృత్యంలో, కోలాటంలో, మేరాథన్ లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారని, 9 మంది విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారని గుర్తు చేశారు. తమ విద్యార్థులు అందరూ మట్టిలో మాణిక్యాలన్నారు. ఈ విద్యార్థులు కిలిమంజారో శిఖరంపైన ప్రపంచంలోనే అత్యంత నిడివి గల 1350 అడుగుల జాతీయ పతాకాన్ని ఎరుగవేశారని తెలిపారు. గతంలో తెలంగాణ విద్యార్థులు 600 అడుగుల పతాకాన్ని ఎగురవేశారని చెప్పారు. ఇటువంటి సాహస కార్యక్రమాలకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీ కార్యదర్శి కల్నల్ వి.రాములు, కోచ్ లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

అరకువ్యాలీ కాఫీ రుచి చూడండి-గిరిజనులను ఆదుకోండి

మంత్రి నక్కా ఆనందబాబు

మార్కెట్ లోకి అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ ప్యాకెట్లు విడుదల
కాఫీ బాగుంది, రోజూ తాగుతా: మంత్రి జవహర్
              
          సచివాలయం, జనవరి29: అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ సేవించి, రుచి చూసి, ఆస్వాదించి గిరిజనులను ఆదుకోవాలని సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు పిలుపు ఇచ్చారు. సచివాలయం 3వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సమావేశమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తో కలసి ఆయన అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్ కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గిరిజన ఉత్పత్తులతోపాటు కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి, మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ(జీసీసీ) విధి అని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహంతో 2014లో రూ.90 కోట్ల టర్నోవర్ ఉన్న జీసీసీ వ్యాపారం  రూ.247 కోట్లకు చేరుకుందన్నారు. ఈ ఏడాది రూ.317 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు లక్ష్యం అని తెలిపారు. మూడు ఏళ్ల నుంచి అరకు కాఫీకి ప్రాచుర్యం లభిస్తోందన్నారు. ఈ రోజు అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ 2 గ్రాముల ప్యాకెట్లు 4 లక్షలు, 10 గ్రాముల ప్యాకెట్లు లక్ష విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచడానికి రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో సచివాలయంలో కూడా ఒక షాపును ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనందబాబు చెప్పారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకు కాఫీ రుచిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. పోడు, గంజాయి సాగు చేసుకొనో గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన కుటుంబాలు నెలకు రూ.10వేలు సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాఫీ ప్యాకెట్లు విడుదల సందర్భంగా అందించిన కాఫీ రుచి చూసి బాగుందని, ఇక తాను రోజూ ఈ కాఫీనే తాగుతానని చెప్పారు. సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ మాట్లాడుతూ 1993 నుంచి అరకుయ కాఫీ మార్కెటింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, 25 ఏళ్లకు ఆ ప్రయత్నాలు ఫలించాయని చెప్పారు. భాగస్వామ్య సదస్సులలో దేశవిదేశీయులకు ఆరకు కాఫీ రుచి చూపించినట్లు తెలిపారు. అరకు కాఫీ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

        జీసీసీ ఎండి రవిప్రకాష్ మాట్లాడుతూ గత మూడేళ్లలో జీసిసి అభివృద్ధి క్రమాన్ని వివరించారు.   గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న  ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 25 లక్షల మంది గిరిజనులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  సేవలందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గిరిజనుల అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ పంటలను  వారికి తగు గిట్టుబాటు ధరలను చెల్లించి కొనుగోళ్ళు చేసి, వాటిని ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మకాలు చేయటంలో దేశం మొత్తంలోని  గిరిజన సహకార  సంస్థల్లో జీసీసీ  అగ్రగామిగా ఉందన్నారు. గత 3 ఏళ్లుగా జీసిసి లాభాల్లో నడుస్తున్నట్లు చెప్పారు. ఇన్ స్టంట్ కాఫీని ఏలూరు దగ్గర వున్న వేహాన్ కాఫీ వారి ప్రాసెసింగ్ యూనిట్లో తయారు చేయించినట్లు రవిప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాఫీ డీలర్లు అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ ప్యాకెట్ల కోసం అడ్వాన్స్ గా రూ.30 లక్షల రూపాయల చెక్ ని మంత్రి ఆనందబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సాంఘీక సంక్షేమ శాఖ  కమిషనర్ర ఎం.రామారావు, వేహాన్ కాఫీ సంస్థ యజమాని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Jan 28, 2018

అధికారం దుర్వినియోగం చేస్తే.. `సుప్రీం` న్యాయ‌మూర్తిని కూడా తొల‌గించ‌వచ్చు!

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య మన రాజ్యాంగం సున్నితమైన సమతౌల్యం ఉండేటట్టు చేస్తుంది. ఇందులో ఏదీ ఒకదానిని ఒకటి అధిగమించకుండా చూస్తుంది. పార్లమెంట్‌ చట్టాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ ఆ చట్టాలను విశ్లేషిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వ విధానంలోని మంత్రిమండలి విధానాన్ని మనం స్వీకరించాం. అధికారాల విభజన, న్యాయ సమీక్ష వ్యవస్థను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. రాజ్యాంగ నాలుగో భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల ఆలోచన ఐరిష్‌ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత, మన దేశ సామాజిక, మత పరిస్థితులను; అవిద్య, దారిద్య్రం వంటి అంశాలకు అన్వయించుకుంటూ మన రాజ్యాంగ నిర్మాతలు ఒక విస్తృత రాజ్యాంగాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ సలహాదారు బీఎన్‌ రావు, ముసాయిదా సంఘం అధ్యక్షుడు, భారతజాతి రాజ్యాంగ పితగా గౌరవించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ల సేవలను స్మరించుకోవాలి.న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకుగాను న్యాయమూర్తుల నియామకం గురించి రాజ్యాంగ పరిషత్‌లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి ఆసక్తికరంగా ఉంటుంది. ఉన్నత న్యాయస్థానాలలో జరిగే నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో జరగాలన్నది అందులో ఒకటి. కానీ దీనిని డాక్టర్‌ అంబేడ్కర్‌ చాలా గట్టిగా నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి చాలా సమర్థుడైన వ్యక్తేనని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నప్పటికీ, ఆయనకు కూడా మనుషులందరికీ ఉండే భావాలే ఉంటాయని అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని మూడింట రెండువంతుల సభ్యుల అంగీకారం ద్వారా ఖరారు చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టాలంటూ మరొక ప్రతిపాదన కూడా వచ్చింది. దీనిని కూడా అంబేడ్కర్‌ నిరాకరించారు. రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఆ అధికారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంబేడ్కర్‌ విశ్లేషించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం గురించి ఆర్టికల్‌ 124(4) వివరిస్తుంది. దీనినే అభిశంసన అని పిలుస్తారు. ఇందుకు పార్లమెంట్‌ ఉభయ సభలలో మూడింట రెండువంతులకు తగ్గకుండా సభ్యుల మద్దతు ఉండాలి.

అలాగే ఓటింగ్‌ తప్పనిసరి. అనుచిత ప్రవర్తన, అసమర్థత కారణాలుగా వారిని తొలగించడానికి అవకాశం ఉంది. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ రాష్ట్ర గవర్నర్, న్యాయమూర్తిని నియమిస్తున్న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రతించిన తరువాత రాష్ట్రపతి చేపడతారు. హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీరులోనే ఉంటుంది. దీనిని గురించి ఆర్టికల్‌ 217(1) వివరిస్తుంది. 

సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల తొలగింపు కోసం 1968లో పార్లమెంట్‌ న్యాయమూర్తుల దర్యాప్తు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం పరిధిలో 1969లో వారి తొలగింపు విధివిధానాలను రూపొందించింది. వందమంది లోక్‌సభ సభ్యులు, లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు స్పీకర్‌ లేదా చైర్మన్‌ల వద్ద తొలగింపు కోసం తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. పరిశీలన తరువాత ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ తీర్మానాన్ని కనుక అనుమతిస్తే ఈ అంశాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సంఘానికి నివేదిస్తారు.

ఇందులో ఒక సభ్యుడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. ఒకరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. రాజ్యాంగ నిపుణుడని స్పీకర్‌ లేదా చైర్మన్‌ భావించిన వ్యక్తిని మూడో సభ్యునిగా ఎంపిక చేస్తారు. ఈ సంఘం దర్యాప్తు పూర్తి చేసి, నివేదిక సమర్పించిన తరువాత సదరు న్యాయమూర్తి దోషి అని తేలితే అప్పుడు తొలగింపు తీర్మానాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. అయితే ఈ పద్ధతి పూర్తిగా నిష్ఫలమైనదని గతానుభవం రుజువు చేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత రెండు సందర్భాలలో మాత్రమే న్యాయమూర్తులను అభిశంసించాలని కోరడం జరిగింది. వారు– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామస్వామి, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్రా చటర్జీ. ఇందులో జస్టిస్‌ రామస్వామి మీద ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం వీగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. ఇక లోక్‌సభ ఓటింగ్‌కు చేపట్టడానికి ముందే జస్టిస్‌ సౌమిత్రా చటర్జీ పదవికి రాజీనామా చేశారు.

కేశవానందభారతి వర్సెస్‌ కేరళ ప్రభుత్వం (ఏఐఆర్‌ 1973 ఎస్‌సీ 1461) కేసులో స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటని 13 మంది సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిభ కాకుండా మిగిలిన అంశాలు నిర్వహించిన పాత్ర అప్రాధాన్యమైనదని చెప్పలేం. కొన్ని కేసులలో రాజకీయ ప్రమేయం, ప్రాంతీయ, మతపరమైన మనోభావాలు ప్రధానంగా ప్రభావం చూపాయి. ప్రఖ్యాత భారత రాజ్యాంగ వ్యాఖ్యాత గ్రన్‌విల్లే ఆస్టిన్‌ కూడా నియామకాలలో పైకి చెప్పని ఉద్దేశాలు ఉన్నాయనే చెప్పారు.

కోర్టులలో కేసులు పేరుకు పోవడానికి కారణం తృప్తికరంగా లేని న్యాయమూర్తుల నియామకం కారణమని ఎంసీ సెతల్వాడ్‌ నాయకత్వంలోని మొదటి లా కమిషన్, భారత మాజీ అటార్నీ జనరల్‌ అభిప్రాయం. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాలేదు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య వైరుధ్యం పొడసూపినా, లేదా కార్యనిర్వాహక శాఖలోనే అంతర్గత విభేదాలు వచ్చినప్పటికీ వివాదాలు బయటకి పొక్కలేదు. ఇలాంటి చిన్న చిన్న విభేదాలను ఆ విధానం తనలోనే దాచేసుకుంది.


న్యాయమూర్తుల నియామకం విధానం 1950 నుంచి 1993 వరకు తృప్తికరంగానే సాగింది. ఈ కాలంలో భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి ఆమోదం లభించని సందర్భాలు ఏడు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1993 (4) ఎస్‌సీసీ 441) కేసులో జస్టిస్‌ ఏ ఎం అహ్మదీ ఇచ్చిన మైనారిటీ తీర్పులో ఇందుకు సంబంధించిన గణాంకాలు కనిపిస్తాయి.

ఈ కేసునే సెకెండ్‌ జడ్జస్‌ కేసు అని పేర్కొంటూ ఉంటారు. జస్టిస్‌ జేఎస్‌ వర్మ వివరించిన మేరకు, ఈ తీర్పు ప్రకారం మెజారిటీ విశ్లేషించినదేమిటంటే, న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేయదలిచిన వ్యక్తులలో ప్రతికూల లక్షణాలు ఉంటే వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లడమనే పాత్రకు మాత్రమే కార్యనిర్వాహక వ్యవస్థ పరిమితం కావాలి. దీనితో కార్యనిర్వాహక వ్యవస్థ పాత్ర నిష్ఫలమైంది.


 కొలీజియం న్యాయమూర్తుల నియామకంలో చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థ అయింది. కొలీజియం సిఫారసులను కొట్టివేసే అధికారం ఏ కోర్టుకు లేదు. కోలీజియం సిఫారసుల మేరకు నియామకాలు జరపడానికే న్యాయ సమీక్షకు ఉన్న అధికారం పరిమితమైంది. న్యాయమూర్తుల నియామకంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా లాంఛనంగా మారింది. కొలీజియం సిఫారసులను కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతికి తెలియ చేస్తే ఆయన నియామకాలు చేపడతారు.

ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సెకెండ్‌ జడ్జస్‌ కేసులో మెజారిటీ తీర్పును రచించిన జస్టిస్‌ జేఎస్‌ వర్మ తరువాత తన అభిప్రాయం మార్చుకున్నారు. న్యాయమూర్తుల నియామకాలను జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి/ప్రధాని/ భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఇందులో సభ్యులుగా ఉండాలని ఆయన చెప్పారు.

అసలు ఎలాంటి న్యాయమూర్తులు దేశానికి కావాలి? రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగించినప్పుడు నెహ్రూ, ఆ న్యాయమూర్తులు అత్యంత విజ్ఞానవంతులు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజాస్వామిక దేశంలోను పాలన పాలించేవారి అనుమతితో సాగుతుంది. అమెరికాలో న్యాయమూర్తుల నియామకానికి సెనేట్‌ ఆమోదం అనివార్యం. కానీ ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా దూరంగా ఉండిపోయింది.


దీనితో జవాబుదారీ తనం గురించిన ప్రశ్న తలెత్తింది. పార్లమెంట్‌ చేసిన నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ చట్టం, 2014 దీని ఫలితమే. దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు వ్యతిరేకించారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థదే పై చేయి అన్న సంగతి సెకెండ్‌ జడ్జస్‌ కేసుతోనే నిర్ధారణ అయిందని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్, జస్టిస్‌ గోయెల్, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ మెజారిటీ తీర్పులో పునరుద్ఘాటించారు.

కొలీజియం పని విధానాన్ని మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవలసిందని కోరుతూ 16–12–2015న రాజ్యాంగ ధర్మాసనం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. సీనియర్‌ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరారు. ఈ సలహాలను గ్రంథస్థం చేయడానికి ఒక సంఘాన్ని కూడా నియమించారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ఈ వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోవాలని భావించారు. అవి– అర్హత ప్రమాణం, నియామక విధానంలో పారదర్శకత, సరైన విధాన అవగాహన నిర్వహణకు ఒక సచివాలయం ఏర్పాటు.


అయితే కొలీజియం వ్యవహార సరళి, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కొలీజియం సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జె. చలమేశ్వర్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి సెప్టెంబర్, 2016లో ఒక లేఖ రాశారు. దేశంలో సాగుతున్న పాలన, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సున్నిత సమతౌల్యం మీద అది చూపుతున్న ప్రభావం గురించి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ఆ లేఖ లేవనెత్తింది.

పత్రికలలో వెలుగు చూసిన మేరకు ఆ లేఖలో ఆయన కొలీజియం పద్ధతి పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. అయితే ఆ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలను పరిష్కరించారో లేదో మాత్రం తెలియదు. కొలీజియం వ్యవహారాలేవీ ప్రజలకు తెలియవు. ఆఖరికి కొలీజియంలో సభ్యులు కాని ఉన్నత న్యాయమూర్తులకు కూడా అక్కడ జరిగిన చర్చల వివరాలు తెలియవు.

సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తులు, కొలీజియంలో కూడా సభ్యులు అయిన జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు 12–1–2018న విలేకరుల సమావేశంలో గళం విప్పడం దేశంలో సంచలనమైంది. ఈ నలుగురిలో సీనియర్‌ చలమేశ్వర్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో జస్టిస్‌ గొగొయ్‌ తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నవారు. ఆ నలుగురు రెండు మాసాల క్రితం ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడిగా రాసిన లేఖ ప్రతిని కూడా విలేకరులకు అందించారు.

కొలీజియం వ్యవస్థలోని దోషాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సహేతుకత లేకుండా కేసులను ధర్మాసనాలకు కేటాయిస్తున్న తీరును గురించే వారు ప్రధానంగా లేఖలో ఆరోపణలు చేశారు. ఆ తరువాత కూడా కొన్ని పరిణామాలు జరిగాయి. సీపీఐ నాయకుడు డి. రాజా వెళ్లి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకోవడం గురించి కొన్ని పత్రికలు విమర్శించాయి.

ఆ తరువాత అసలు న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరెస్సెస్‌ కార్యకర్త ఒకరు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇంకా సీపీఎం నాయకుడు యేచూరి ఉన్నత న్యాయస్థానంలో పనితీరు దిగజారడం, న్యాయమూర్తుల మధ్య విభేదాల గురించి గళమెత్తడంతో అసలు ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసన తీసుకురావడానికి సంకేతమనే అనుమానాలు కలిగించింది.

(27–1–2018న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మేధావుల ఫోరమ్‌ సభలో చదివిన ఉపన్యాసం)

-జస్టిస్‌ ఎం.ఎన్‌. రావ్‌

వ్యాసకర్త హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి

ఏపీలో ఇన్నోవేషన్ వ్యాలీ


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
               సచివాలయం, జనవరి 27: టెక్నాలజీలో, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)లో ముందున్న ఏపీలో ఇన్నోవేషన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా సచివాలయం 1వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఇన్నోకేషన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కూడా సహకరిస్తుందన్నారు. దావోస్ పర్యటన విజయవంతంగా జరిగినట్లు తెలిపారు. ప్రపంచంలోని మేథావులు, పారిశ్రామికవేత్తలను ఒక వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు  ఇదన్నారు. తాను ఇప్పటి వరకు 14 సార్లు ఈ సదస్సుకు వెళ్లానని చెప్పారు. 20 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఈ సదస్సుకు హాజరయ్యారన్నారు. ప్లీనరీలో మాట్లాడిన తొలి భాతర ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు.  4వ పారిశ్రామిక విప్లవం, టెక్నాలజీ, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించి కొత్తకొత్త అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.  భారత్ అత్యంత శక్తివంతమైన దేశం, ఇక్కడ అవకాశాలు ఎక్కువ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్ట్రాంగ్, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవారు అధికంగా ఉండటంతోపాటు అతి పెద్ద మార్కెట్ కలిగి ఉందని అందువల్ల ప్రపంచం మొత్తం భాతర్ వైపు చూస్తోందని చెప్పారు. ఈ పర్యటనలో రెండు ఎంఓయులు జరిగినట్లు, 25 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్నట్లు వివరించారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించి 50 సంస్థలు మెడ్‌టెక్ ఇన్నోవేషన్‌ సెంటర్‌ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖలు) ఇచ్చినట్లు తెలిపారు. దావోస్ లో భారత్, ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయంగా నిలిచాయని, తాము ముఖ్యమైన అన్ని అంశాల్లో పాల్గొన్నామని చెప్పారు.
యుపీఎల్ లిమిటెడ్ కంపెనీ గ్లోబల్ సీఈవో జై షరోఫ్ తో సమావేశమైనట్లు తెలిపారు. వర్షం పడకపోయినా సాగు నీటికి ఉపకరించే ఒక ఉత్పత్తిని యూపీఎల్ సంస్థ రూపొందించినట్లు తెలిపారు.  భూమిలోని నీటిని గ్రహించి క్షామం ఏర్పడిన సందర్భంలో నెమ్మదిగా నీటిని విడుదల చేసే ఉత్పత్తి ఇదని, దీనిని మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి వారిని ఏపీకి ఆహ్వానించినట్లు చెప్పారు

            రాష్ట్ర విభజన నేపధ్యంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని, పెట్టుబడులు రాబట్టడానికి, పరిశ్రలమ ఏర్పాటుకు ఎంతో కృషి చేయడంతోపాటు కష్టం, తెలివితేటలు, అధికారులు, ఉద్యోగుల నిబద్దతతో పనిచేయడం వల్ల రెండంకెల వృద్ధి రేటు సాధించామని, వ్యవసాయ రంగంలో అద్వితీయమైన వృద్ధి రేటు సాధించామన్నారు. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించగలిగితే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.  పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ బెంచ్ మార్క్ తీసుకున్నట్లు తెలిపారు.  ఒక్క కాల్ తో ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అయ్యే విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయోగంగా పేర్కొన్నారు. ప్రజల సంతృప్తి పెరిగిందన్నారు. పనులు త్వరగా అవడం, వారి ఫిర్యాదులు పరిష్కారం అవుతుంటనే సంతృప్తి స్ధాయి పెంరుగుతుందని చెప్పారు.  ప్రస్తుతుం 30 శాఖలను అనుసందానం చేశామని, త్వరలో అన్ని శాఖలను ఇందులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రతి రోజూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నామన్నారు. సాంకేతిక అభివృద్ధితో స్కాలర్ షిప్ లు, పెన్షన్లలో దుర్వినియోగం తగ్గందని, గతంలో దెయ్యాలు కూడా పెన్షన్ తీసుకునేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. భూధార్ తో భూమి సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. అంతర్జాతీయ సమితి పర్యావరణ సంస్థ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. లక్షా 35 వేల ఎకరాల్లో ఈ రకమైన సాగుచేస్తున్నట్లు చెప్పారు. కాలుష్యం లేకుండా, పెస్టిసైడ్స్ తగ్గిస్తూ. భూసారం పెంచుకుంటూ, తక్కువ ఖర్చు, ఆరోగ్యాన్ని రక్షించుకునేవిధంగా 2027 నాటికి రాష్ట్రంలో గ్రీన్ అగ్రికల్చర్ ని అభివృద్ధి చేస్తామన్నారు.
            రాష్ట్రంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ద్వారా దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3.7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. అనంతపురానికి  కియా మోటార్స్ రావడం, దక్షిణ కొరియా టౌన్ షిప్ ఏర్పడటంతో అక్కడి వాతావరణం మారిపోయిందన్నారు. బెంగళూరు విమానాశ్రయం మనకి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. హుద్ హుద్ తుపాను తరువాత విశాఖ పట్నం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడ విమాన ప్రయాణికుల సంఖ్య పెరింగిదని చెప్పారు. ఈజీ టు బిజినెస్ లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచామని, 21 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నామనిపరిశ్రమల స్థాపన విషయంలో అధికారులు పారిశ్రామికవేత్తల వెంటపడుతున్నారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన పనులకు సంబంధించి నాబార్డ్ ద్వారా నిధులు ఇప్పించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి కాంక్రిట్ పని కూడా ప్రారంభమవుతుందన్నారు. నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రమంతటా సాగు, త్రాగు నీరు అందిస్తామని చెప్పారు. పట్టిసీమ ద్వారా నీరందించడంతో ఈ ఏడాది అధిక వ్యవసాయ దిగుబడులు వచ్చాయని, రూ.2500 నుంచి రూ.3000 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం లభించినట్లు చంద్రబాబు  చెప్పారు.
ప్రకృతితో మమేకం కండి: చంద్రబాబు
             ప్రజలందరూ ప్రకృతితో మమేకం కావాలని, ప్రకృతిని ఆరాదించి, ప్రేమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంప్రదాయాలు పాటిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ, దానిపట్ల చైతన్యం తీసుకురావాలన్నారు. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుందన్నారు. ఏరువాక పవిత్రమైన కార్యక్రమం అని, అందరికీ తిండిపెట్టే రైతన్నకు సంఘీభావం తెలుపుతూ దానిని పండుగలాగా జరుపుకున్నామని గుర్తు చేశారు. సంపదకు మూలం నీరని అందువల్ల జలసిరికి హారతి ప్రారంభించామన్నారు. పుష్కరాలకు అఖండ హారతి పట్టామన్నారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం నిర్వహించి పండుగ వాతావరణంలో చెట్లకు పూజలు చేశామన్నారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు స్పూర్తిగా అమ్మకు వందనం పేరుతో తల్లిని గౌరవించడం, అభిమానించడం, ప్రేమించడం, ఆరాధించడం వంటివి పిల్లలకు అలవాటు చేస్తున్నామన్నారు. అలాగే రేపు ఉదయం 7 గంటలకు విజయవాడలో సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో అదే సమయానికి పవిత్రమైన మనసు, పరిశుభ్రతతో సూర్య నమస్కారాలు చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సూర్య నమస్కారాల వల్ల మానసికంగా, శారీరకంగా లాభం చూకూరుతుందని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది రథసప్తమి రోజున గానీ లేక ఆ తరువాత వచ్చే మొదటి ఆదివారం (సూర్యుని ఇష్టమైన రోజు) గానీ  ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారుకుల మత రహితంగా అందరికీ ఆరాధ్య దైవం సూర్యుడని, ఎటువంటి పక్షపాతం లేకుండా అందరి సుఖసంతోషాలకు కారణం అయన అన్నారు. సూర్య కిరణాల ఆధారంగా ఎంతో శాస్త్రీయంగా అరవిల్లిలో దేవాలయం నిర్మించారని చెప్పారు. ఆధ్యాత్మికంగానే కాకుండా విజ్ఞానపరంగా కూడా సూర్యుడుకి ప్రాముఖ్యత ఉందన్నారు. అందరికీ డీ విటమిన్ అందిస్తారని, చైతన్య స్పూర్తి అని, క్రమశిక్షణకు నిదర్శనం అని తెలిపారు. అలుపెరుగని సూర్యుడు జస్టిస్ చక్రవర్తిలాగా అందరికీ ఒకటే న్యాయం అందిస్తారన్నారు. అత్యంత శక్తి కేంద్రమైన సూర్యకిరణాల నుంచి వచ్చే శక్తిని 60 నిమిషాలు సేవ్ చేయగలిగితే ఉచిత విద్యుత్ అందించడంతోపాటు కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. సూర్యుడనేది వాస్తవం అని అందువల్లే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఖరారు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ పెరిగిందని చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారు.