Jul 10, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -4

రమణమూర్తి గారిని 1988లోనే చూశాను


సందర్భానుసారం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వృత్తిపరంగా క్రియేటివిటీ చూపుతూ, సంచలన వార్తలు రాయగల దమ్మున్న జర్నలిస్ట్ వల్లూరి వెంకట రమణమూర్తి. 1988లో నేను మా ఊరు మంగళగిరికి ఉదయం రిపోర్టర్ గా పని చేసే సమయంలో విజయవాడ బందర్ రోడ్డులోని ఉదయం కార్యాలయం వద్ద రమణమూర్తి గారిని నేను మొదటిసారిగా చూశాను. అప్పటికే ఆయన ఓ సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన సన్నగా ఉండేవారు. షర్ట్  మాచిపోయింది.  ఇప్పటికి కూడా నా కళ్లకు ఆ రూపం కనిపిస్తోంది. నేను ఉదయం ఆఫీసు లోపల ఉన్నాను. ఆయన లోపలకు వస్తున్నారు. అప్పుడే, అక్కడివారు ‘‘ఈయనే కొండపల్లి సీతారామయ్యని ఇంటర్వ్యూ చేసిన రమణమూర్తి’’ అని గుసగుసలాడినట్లు చెప్పారు. ఆ తర్వాత విశాఖ-ఆంధ్రజ్యోతిలో ఆ రమణమూర్తి గారితో కలిసి పనిచేశాను. ఆయన బ్యూరో ఇన్ చార్జి, నేను సిటీ డెస్క్ ఇన్ చార్జి, అలా మా మధ్య పరిచయం ఎక్కువయింది. ఎంత గొప్ప జర్నలిస్టు అయినా, వేమూరి రాధాకృష్ణ గారిలా అదే పేపర్ కు యజమానులు కాలేరు. రమణమూర్తి గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘లీడర్’ అయ్యారు. తెలుగులో అన్ని విధాలా ఆ స్థాయికి ఎదిగి  విజయం సాధించిన జర్నలిస్టులు వేమూరి రాధాకృష్ణ, రావి రామ ప్రసాద్, వీవీ రమణ మూర్తి, రవిప్రకాష్ మాత్రమే కనిపిస్తున్నారు. వీరిలో ముగ్గురు మన ఆంధ్రజ్యోతి వారు కావడం విశేషం.

చాలా మంది సంచలన వార్తలు రాస్తారు. ఆ తర్వాత నిర్ణయం డెస్క్ వారికి వదిలివేస్తారు. అయితే, రమణమూర్తి గారికి సంచలన వార్తలు రాయడంతోపాటు అందులో క్రియోటివిటీ చూపడం కూడా ఆయన ప్రత్యేకత. ఆ వార్తకు పేపర్లో తగిన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా, అవసరమైతే తనే బాధ్యత తీసుకునే దమ్ము రమణమూర్తి గారికి ఉంది. మొన్న మనం కలిసినప్పుడు ఓ విద్యార్థి 8వ ర్యాంకు సాధించిన వార్తకు సంబంధించిన విషయాలు చెప్పారు. అప్పుడు నేను సిటీ డెస్క్ లోనే ఉన్నాను. ఆ విద్యార్థి నివాసమైన పూరి గుడిసె ముందు నిలబెట్టిన ఫొటోలు సిటీ టాబ్లాయిడ్ లో నేను కూడా వాడాను. అంతేకాదు, ఆ రోజు నేను, ‘‘అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి ... లాంటి వారు చదువుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చదివాను. ఇప్పుడు ఈ విద్యార్థిని చూస్తున్నాను’’ అని అనుకున్నాను. విద్యార్థి నేపథ్యంతో సంబంధంలేకుండా ఫస్ట్ ర్యాంకు వారికి మాత్రమే ఫస్ట్ పేజీలో స్థానం కల్పించే రోజుల్లో, అడిగితే మేనేజ్ మెంట్ కు తానే చెబుతానని రమణమూర్తి గారు పూర్తి బాధ్యత తీసుకుని,  8వ ర్యాంకు వచ్చిన విద్యార్థికి సంబంధించిన ఫొటోలు, వార్త మొదటి పేజీలో వాడించారు. నాకు బాగా గుర్తు అప్పట్లో ఆ వార్త, ఫొటోలు ఫస్ట్ పేజీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఆ వార్తని పాఠకులు చాలా ఆసక్తిగా చదివారు. ఆంధ్రజ్యోతిని మెచ్చుకున్నారు. ఆ వార్త ప్రజంటేషన్ లో రమణమూర్తి గారు సంచలనంతోపాటు క్రియేటివిటీ చూపించారు. అప్పటి ఎండీ కానూరి జగదీష్ ప్రసాద్ గారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత అన్ని పత్రికలవారు ఆ ఒరవడిని కొనసాగించారు.

అటువంటి సంచలనాలు నేను విజయవాడ-ఆంధ్రభూమిలో పనిచేసే సమయంలో తాడి ప్రకాష్ గారు చేయడం చూశాను. విషయం పూర్తిగా గుర్తులేదు. ఓ రోజు వీథిన పడిన ఓ పేద కుటుంబం ఫొటో నాలుగు కాలాలు ఫస్ట్ పేజీలో పెట్టి, రైటప్ రాశారు. రెండు, మూడు లైన్ల రైటప్ లోనే విషయం అంతా ఉంది. అప్పట్లో అలా ఫొటోలు పెట్టడం ఓ సంచలనం. పాఠకులను బాగా ఆకట్టుకునేవి.  సామాజికంగా ప్రాధాన్యత కలిగిన అనేక ఫొటోలు ప్రకాష్ గారు పెట్టేవారు. అప్పుడు అక్కడ సతీష్ చంద్ర గారు బ్యూరో ఇన్ చార్జిగా ఉండేవారు. ఆయన కూడా సంచలన వార్తలు రాయడంలో దిట్ట. రమణమూర్తి గారు కూడా అటువంటి వార్తలు రాయడంతోపాటు ప్రజంటేషన్ లో కొత్తదనం చూపించేవారు. అందువల్లనే జర్నలిస్టుగా విశాఖలో అగ్రస్థానాన నిలిచారు. రాయడమే కాదు, సాగర్... వంటి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేశారు. తయారు చేయడమే కాదు, ఇప్పటికీ సాగర్, రఘు లాంటి వారు, ‘‘జర్నలిజంలో రమణమూర్తి గారే మా గురువు గారు, ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాం.’’ అని చెబుతారు. అటువంటి అభిమానం సాధించడం కూడా సామాన్యమైన విషయం ఏమీ కాదు.

ఎటువంటి వార్తనైనా రమణమూర్తిగారు చాలా చాలా స్పీడ్ గా రాయగలరు. బ్యూరో చీఫ్ గా ఆయన అటు మెయిన్ కి, ఇటు టాబ్లాయిడ్ కి ప్రధాన వార్తలు ఇచ్చేవారు. టాబ్లాయిడ్ కి ఎక్కువగా తొలుత రఘు, కళ్యాణ రామ్ ఇచ్చేవారు. సాగర్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఇచ్చేవారు. అయినా, ఒక్కోసారి ఫస్ట్ పేజీకి బేనర్ వార్త ఉండేదికాదు. అంటువంటి సందర్భంలో, ‘‘సార్ ఈరోజు టాబ్లాయిడ్ కి బ్యానర్ వార్త లేదు. ఏదో ఒకటి మీరే ఇవ్వాలి’’ అని రమణమూర్తి గారిని అడిగేవాడిని. రాజకీయానికి సంబంధించినదో, మరొకటో ఆయన అరగంటలో రాసి ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో ఆయన వెళుతున్నానని చెప్పి వెళ్లిపోతున్నప్పుడో, చేయి ఊపి వెళ్లిపోతున్నప్పుడో, బేనర్ వార్త లేదని అడిగేవాడిని. అలాంటప్పుడు, 10,15 నిమిషాల్లో ఆసక్తిగా చదివించగలిగే రీతిలో స్టోరీ రాసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటి సమర్థత కలిగిన జర్నలిస్ట్ రమణమూర్తి గారు.

1995కి ముందు ఒకసారి ఎన్నికల సమయంలో, ‘‘ఎప్పుడూ డెస్క్ లో కూర్చొని ఉంటే ఎట్లా సార్, రేపు పాడేరు వెళదాం రండి’’ అని రమణమూర్తిగా నన్ను పిలిచారు. ఆయనతో వెళ్లాను. పాడేరులో ఆ రోజు సంత జరుగుతోంది. అక్కడ అటవీ ఉత్పత్తులు అమ్మేవారికి, కొనేవారికి ఎన్టీఆర్ బొమ్మ చూపించి, ‘‘ఇతను ఎవరు?’’ అని వారిని అడిగారు.  ప్రతి ఒక్కరూ, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు’’ అని చెప్పారు. తెలుగులో అంతటి మహానటుడు, ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ తెలియకపోవడం ఏమిటని, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజం. వారితో చాలా విషయాలు సంభాషించాం. చాలా ప్రశ్నలు వేశారు.  ప్రముఖ  రాజకీయ నాయకుల్లో  వారికి ఒక్క ఇందిరా గాంధీ తప్ప మరెవరూ తెలియదు. ఇందిరా గాంధీ వాళ్లకు ఇళ్లు కట్టించినట్లు చెప్పారు. దూరంగా ఉన్న ఆ ఇళ్లను కూడా చూపారు. దటీజ్ ఇందిరా గాంధీ. రమణమూర్తిగారితో బయటకు వెళ్లడం వల్ల నాకు ఆ విషయం తెలిసింది.

ఎలక్ట్రానిక్ మీడియా తొలితరానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తోట భావన్నారాయణ గారు సీనియర్ జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన సాగర్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు.  ఒకసారి నన్ను అడిగారు. ‘‘సార్, డెస్క్ లో పనిచేసే నాలాంటి వారికంటే, రమణ మూర్తి గారి లాంటి వారిని చేయండి చాలా విషయాలు చెబుతారు’’ అని చెప్పాను. ‘‘రమణమూర్తి గారిని అడిగాను. ఇస్తాన్నన్నారు. కుదరడంలేదు. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను’’ అని భావన్నారాయణ గారు చెప్పారు. రమణమూర్తి గారు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది.  వార్తలు సేకరించే పద్దతులు, స్పీడ్ గా ఇచ్చే టెక్నిక్ లు రమణమూర్తి గారు చెబితే, యువ జర్నలిస్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

No comments:

Post a Comment

ఆంధ్రజ్యోతి పరివారం -7

మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే ప...