Jul 6, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -2



ఆంధ్రజ్యోతి పరివారం ఆత్మీక కలయిక ఓ అద్భుతం

నాకు ఆంధ్రజ్యోతితో 1984 నుంచి అనుబంధం ఉంది. అందులో విశాఖ-ఆంధ్రజ్యోతి

అనుబంధం ఓ భాగం. అయితే, ఎన్నో తీపి, మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, అక్కడ స్టాఫ్, రామకృష్ణ బీచ్, ఆంధ్రయూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్.... ఇలా ఎన్నో జ్ఞాపకాలు అనుబంధాలు. ఆంధ్రజ్యోతి ఉద్యోగులు కాకుండా ఇతర గొప్ప వ్యక్తలు, ముఖ్యంగా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే అనేక మందితో పరిచయం. అన్నిటికంటే ముఖ్యం. విశాఖ వాతావరణం. బీచ్ అందాలు, పచ్చని ప్రదేశాలు, మరి ముఖ్యంగా సామాజికంగా ప్రశాంత వాతావరణ... ఇలా ఎన్నో. నాకు విజయవాడతో అనుబంధం ఎక్కువ, ఆ తర్వాత హైదరాబాద్. అందువల్ల విశాఖలో ప్రశాంతత నాకు చాలా చాలా బాగా నచ్చింది.

ఇక మన ఆంధ్రజ్యోతి పరివారం విషయానికి వస్తే, మన లీడర్ వీవీ రమణమూర్తి గారు, కోనేరు షర్మిల గారు, వింజమూరి ఆనంద్ గారు(రమణమూర్తి గారు చెప్పినట్లు ఆనంద్ మొదటిసారిగా చాలా కష్టపడ్డారు) పూనుకొని మనల్ని అందరినీ కలిపారు. వారి వల్ల మనం ఎంతో ఆనందాన్ని అనుభవించాం. దీర్ఘకాలం తర్వాత ఎంతోమంది మిత్రులను చూడగలిగాం. వారి ముఖాలలో ఆనందాన్ని చూసి చాలా సంతోషించాం. ఆర్థిక భారం, పనిభారం అంతా రమణమూర్తి గారిదే అనుకోండి. మనలో ఒకరు ‘లీడర్’గా ఎదగడం వల్లే మనల్ని అందరినీ బాధ్యతగా, మరి ముఖ్యంగా ప్రేమ, ఆత్మీయతతో కలపగలిగారు. చాలా సంతోషం. ఈరోజుల్లో ఇంత డబ్బు ఖర్చుచేసి, ఇంత ఆత్మీయత, ప్రేమ చూపగలిగేవారు దొరకడం మన అదృష్టం.  రమణమూర్తి గారికి, ఇంత ఖర్చుచేసి, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఆయన సతీమణి గారికి ప్రత్యేకంగా అభినందనలు.

మన వారిలో ఇవటూరి సురేష్, చంద్రశేఖర్ గారు, గోపరాజు నారాయణ రావు గారు, పారుపల్లి శ్రీధర్ గారు, ఎం.శ్రీనివాసరెడ్డి, అవ్వారు శ్రీనివాసరావు, ఫ్రొఫెసర్ డాక్టర్ రెడ్డి తిరుపతిరావు, ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ డి.రమేష్, ఆర్.రమేష్ చంద్ర, ఇ.సదాశివరావు, కాపు మోహన్ రావు, కేఎస్ఎస్ బాపూజీ, ఐవీ రాజేశ్వరరావు, చింతపల్లి పైడిరాజు... తదితరులతో టచ్ లోనే ఉన్నాను.  మిగిలిన అందరినీ చూసి 30 ఏళ్లు దాటిపోయింది.

మన గ్రూపులో నా ఫొటో చూసి, నన్ను గుర్తుపట్టిన వెంటనే, మన విశాఖ-ఆంధ్రజ్యోతి మొదటి బ్యూరో ఇన్ చార్జి బి.నారాయణ రావు గారు నాకు ఫోన్ చేసి, ‘‘విశాఖకు వస్తున్న మీరు మా ఇంట్లోనే దిగాలి’’ అని ఆహ్వానించారు. నన్నే కాదు చాలా మందిని ఆహ్వానించారు. అయితే, గుంటూరు చంద్రశేఖర్ గారు, డాక్టర్ గోపరాజు నారాయణ రావు గారు, పారుపల్లి శ్రీధర్ గారు, నేను వారి ఇంట్లోనే దిగాం. నేను ఒక రోజు ముందే శనివారం వచ్చాను. రెండు రోజులు ఆయన అతిథి  మర్యాదలు స్వీకరించాను.

 నేను విశాఖలో దిగడంతోనే మన వీఎస్ ఆనంద్ నవ్వుతూ స్వాగతం పలికారు. తన కారులో నారాయణ రావు గారి ఇంటికి తీసుకువెళ్లారు. ఆటోనగర్ లో ఉన్న నా పుస్తకాల బండిల్ ని వర్షం, ట్రాఫిక్ జామ్ లో ఎంతో శ్రమపడి లీడర్ కార్యాలయానికి చేర్చారు. ఆదివారం ఉదయం నారాయణ రావు గారి ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ కారులో లీడర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మధ్యలో ఓ హోటల్ లో టిఫిన్ పెట్టించారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ తన కారులో మళ్లీ నారాయణ రావు గారి ఇంటి వద్ద దింపారు. ఇలా ఎన్నో రకాలుగా ఆనంద్ ఈ రెండు రోజులు నాకు ఎంతో సహాయపడ్డారు. ఆనంద్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే కష్టపడ్డారని రమణమూర్తి గారు జోక్ చేశారు. కష్టపడటం ఆనంద్ కు పెద్ద కష్టం ఏమీ కాదు. మరో ముఖ్యం విషయం ఏమిటంటే, మనకు ఇచ్చిన జ్ఞాపికలో ఆనంద్ పేరు ఎదురుగా full time enjoy life అని రాసి ఉంది. ఆ రకంగా ఆనంద్ కష్టజీవి మాత్రమే కాదు, పేరుకు తగినట్లు  తొటివారికి సహాయపడుతూ ఆనందంగా జీవించడం ఆయన సహజలక్షణం.  ఆనంద్ తో జరిపిన క్షణాలు నా మదిలో పదిలం.

ఇప్పటికే గ్రూపులో చాలా మంది తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాయడానికి తెలిసిన పదాలు చాలడంలేదన్నారు. అది నిజం. కొందరు చాలా దూరం నుంచి వచ్చారు.  అందరం ఆనందంగా గడిపాం. ఈ 30 ఏళ్లలో చాలా మంది వివిధ రకాల హోదాలకు ఎదిగిపోయారు. అయినా, అందరూ ఆ నాటి ఆంధ్రజ్యోతి ఉద్యోగులుగానే వ్యహరించారు. అందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆ మధుర క్షణాల అనుభూతులు అందరిలో స్పష్టంగా కనిపించాయి. రామప్రసాద్ గారి దగ్గర నుంచి రమణమూర్తి గారు, నారాయణ రావు గారు, నవత గారు, షర్మిల గారు, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరరావు, రఘు, కళ్యాణరామ్, సుబ్బు, విజయ్, సాంబ, ప్రసాదరావు గారు, అబ్దుల్లా, నల్లనయ్య గారు,  సీతమ్మధార రమేష్, గాజువాక పైడిరాజు... వంటి వారిని కలవడం చాలా అనందం కలిగించింది. చాలా మంది పేర్లు గుర్తులేవు. మనషులు అందరూ గుర్తు ఉన్నారు. అక్కడ వారి పేర్లు చెప్పినా, అంతలోనే మరచిపోయాను. మన అందరి మనసులు, శరీరాలు రీచార్జి అయ్యాయి. రోజులు కాదు, నెలలు, ఏళ్లకు సరిపడ రీచార్జి అయ్యాయి.

చివరలో మనందరికీ వంటచేసి, చేయించిపెట్టిన మహిళను సన్మానించడం నాకు చాలా బాగా నచ్చింది. దటీజ్ రమణమూర్తి. రమణమూర్తిగారి మనవడి ఏకపాత్రాభినయం చాలా చాలా బాగుంది. ఆ వయసులో అంతటి సుదీర్ఘమైన డైలాగ్స్ గుర్తుపెట్టుకుని, హావభావాలు ప్రదర్శిస్తూ ఏకపాత్రాభినయం చేయడం గ్రేట్.

మిత్రులారా ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు రాయాలి. మన రవీంద్ర చెప్పినట్లు  రాస్తాను.

 

విశాఖ జ్ఞాపకాలు

ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం చేసే సమయంలోనే శ్రీనివాసరెడ్డి, నేను కలిసి బీజేఎంసీ, ఎంజేఎంసీ రెండు డ్రిగ్రీలు చాలా కష్టపడి పూర్తి చేశాం. ఆ రకంగా శ్రీనివాసరెడ్డి నా సహ ఉద్యోగి మాత్రమే కాదు, నా క్లాస్ మేట్ కూడా.   మా ఇద్దరికి జర్నలిస్టుల కోటాలోనే సీట్లు వచ్చాయి.  కష్టపడి అని ఎందుకు చెప్పానంటే, మేం ఇద్దరం దీర్ఘ కాలం సిటీ డెస్క్ లో చేశాం. అందువల్ల అర్థరాత్రి 2 గంటల వరకు ఆఫీసులోనే ఉండేవారం. ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా క్లాసులకు వెళ్లేవారం. ఆ వెళ్లడం కూడా ఎలా అంటే, ఇద్దరం చెరో సైకిల్ మీద బస్టాండ్ వరకు వెళ్లేవాళ్లం. అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు చాలా ఎత్తు ఉంటుంది. తొక్కడం కష్టం. అందువల్ల బస్టాండ్ లో సైకిళ్లు పెట్టి, బస్సులో యూనివర్సిటీకి వెళ్లేవాళ్లం. మన సీతమ్మధార రమేష్, కంచరపాలెం రిపోర్టర్ (పేరు గుర్తులేదు), వీరి ఇద్దరిలో ఎవరో ఒకరు మా ఇద్దరి పేర్లపై ప్రతి నెల బస్సు పాసులు తీసుకు వచ్చి, ఇచ్చేవారు. ఓ పేపర్ పై టైప్ చేసిన బస్ పాస్ నెలకొకసారి ఇచ్చేవారు. ఇవి అక్రెడిటేషన్ లేకుండా ఇచ్చే పాస్ లు. పాస్ లేనప్పుడు, పాస్ రావడం ఆలస్యం అయినప్పుడు కొన్ని సార్లు రొప్పుకుంటారోసుకుంటా సైకిల్ పై వెళ్లేవాళ్లం. మరికొన్ని సార్లు నడిచికూడా వెళ్లేవాళ్లం. అలా ఆ రెండు డిగ్రీ పూర్తి చేశాం. శ్రీనివాసరెడ్డి రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు. విశాఖ తీపి గుర్తుల్లో ఇది ఒకటి.

No comments:

Post a Comment

ఆంధ్రజ్యోతి పరివారం -7

మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే ప...