Oct 10, 2025

తెలుగు రాష్ట్రాలకు ఓ వరం మంగళగిరి ఎయిమ్స్





రికార్డు స్థాయిలో 28 లక్షలు దాటిన అవుట్ పేషెంట్లు

అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యసేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్-ఎయిమ్స్) రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ వరం. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో 183.11 ఎకరాల విస్తీర్ణంలో  ఎయిమ్స్ కోసం భారీ భవనాలు నిర్మించారు. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునికమైన  కార్పోరేట్  వైద్య సేవలు  ఇక్కడ అందిస్తారు. నిపుణులైన వైద్యులు అత్యంత శ్రద్ధతో  రోగులకు ఇక్కడ వైద్యం చేస్తారు.  ఔట్ పేషెంట్ ఆధార్ కార్డు చూపించి,  రూ.10 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు వైద్యసేవలు అందిస్తారు. వైద్య పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లలో అయ్యే ఖర్చులో పోలిస్తే, మూడవ వంతు మాత్రమే అవుతుంది.  ప్రైవేటు ఆస్పత్రులలో మాదిరి ఇక్కడి వైద్యులు తొందరపడి ఆపరేషన్లు సూచించరు. వృద్ధుల విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణ వైద్యంతోపాటు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా రోగుల అవసరాలను తీర్చడానికి బహుళ విభాగాలలోని సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2018లో ఇక్కడ ఎయిమ్ సేవలు మొదలయ్యాయి. మంగళగిరి ఎయిమ్స్‌కి చెందిన వైద్యసేవలు తొలుత విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో రెండు కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో గతంలో టీబీ శానిటోరియం ఉండేది. ఈ  ప్రాంతాన్ని ఎయిమ్స్‌కి కేటాయించారు. ఇక్కడ నిర్మించిన  భవనాలలో 2019 మార్చిలో  శాశ్వత క్యాంపస్‌లో ఓపీడీ సేవలు ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్ పేషెంట్ సేవలు కూడా  మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరి 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా మంగళగిరి ఎయిమ్స్‌ని జాతికి అంకితం చేశారు. 2024, డిసెంబరు 17న  జరిగిన ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరి ఎయిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ప్రారంభంలో రోజుకు 50, 100 మంది వచ్చే రోగులు  ఇప్పుడు 3500 నుంచి 4000 వరకు వస్తున్నారు. ఇక్కడ ఎయిమ్స్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు  అవుట్ పేషెంట్(ఓపీ)ల సంఖ్య 28 లక్షలు దాటిపోయింది. ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ చరిత్రలో ఇది మరో మైలురాయి. 50 వేలకు పైగా ఎమర్జర్సీ కేసులను చూశారు. 49 లక్షలకుపైగా ల్యాబ్ టెస్టులు చేశారు. ఇక్కడ జనరల్ వార్డులలో 651 బెడ్స్, ఐసీయూలో 76 బెడ్స్, ప్రైవేటు వార్డులో 17 బెడ్స్, డే కేర్ సర్వీస్ వార్డులో 104 బెడ్స్  ఉన్నాయి. ఎయిమ్స్ డ్రోన్ సేవలు కూడా ప్రారంభించింది. రక్త నమూనాలను సేకరించి రక్త పరీక్షలు చేస్తున్నారు. అన్ని విభాగాలలో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నారు.    ఇక్కడి వచ్చే రోగులలో దాదాపు 50 శాతం మంది గుంటూరు, కృష్ణా జిల్లాల వారే ఉంటారు. ఆ తర్వాతే ఇతర జిల్లాల వారు ఉంటారు. తెలంగాణ నుంచి వచ్చేవారిలో   ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువ. కర్ణాటక, బీహార్ ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ఏడాది ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకిగ్ ఫ్రేమ్‌వర్క్‌( Indian Institutional Ranking Framework)లో మంగళగిరి ఎయిమ్స్ దేశంలో 29వ ర్యాంక్ లో, ఏపీలో నెంబర్ వన్ ర్యాంక్‌తో రాష్ట్రంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా నిలిచింది. ఎయిమ్స్ కు సమీపంలోనే జాతీయ రహదారికి ఆనుకుని ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి మరో పది ఎకరాలు కేటాయించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

సమస్యలు:


ఎయిమ్స్‌లో నిపుణులైన వైద్యులతోపాటు ఇన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ పలు సమస్యలు కూడా ఉన్నాయి. రోగులు పెరుగుతున్న స్థాయిలో వైద్యులను, సిబ్బందిని, మెడికల్  షాప్ కౌంటర్లను, క్యాంటిన్‌లో సౌకర్యాలను పెంచలేదు. నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది. లోపలికి వెళ్లడానికి, ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, డిపార్ట్ మెంట్‌లో రిజిస్ట్రేషన్‌కు, డాక్టర్‌ని కలవడానికి, టెస్టులకు ఫీజులు చెల్లించడానికి, టెస్ట్‌లు చేయించుకోవడానికి, మందులు కొనడానికి దాదాపు ఏడెనిమిది చోట్ల క్యూలలో నిలబడాలి.  అదే స్పెషలిస్ట్‌కు చూపించవలసిన అవసరం వస్తే మరోసారి క్యూలో నిలబడాలి.   ఒక్కోచోట గంటసేపు కూడా ఎదురు చూడాలి. టెస్ట్‌లకు డబ్బు చెల్లించే కౌంటర్లు ఒక చోట ఉండవు. తెలియక ఒక కౌంటర్ వద్ద క్యూలో నిలబడి, దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కాదని చెబుతారు. అప్పుడు మరో కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడాలి. రోగులను క్రమ పద్దతిలో క్యూలో నిలపడానికి తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో రోగుల మధ్య గొడవలు, తోపులాటలు సర్వసాధారణం. ఇక్కడ ఓపీ వైద్యం పూర్తి కావడానికి ఒక పూట నుంచి రోజు పడుతుంది.  అందించేది కార్పోరేట్ వైద్యం అయినా, రోగుల కష్టాలు వర్ణనాతీతం.  కొన్ని చోట్ల రోగులు లేక వారి బంధువులు  సిబ్బంది చిత్కారాలకు గురికావలసి వస్తోంది.డాక్టర్లు అందరూ రోగుల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఎంతో ఓపికతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. అయితే,  సిబ్బందిలో కొందరు మాత్రం రోగుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఎక్కువ సమయం సెల్ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. రోగులను పట్టించుకోరు.  గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు తగిన సమాచారం ఎవ్వరూ సరిగా ఇవ్వరు. దాంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు సాయంత్రం వారి ఊరు వెళ్లి, మళ్లీ రెండవ రోజు రావాలి. కొన్ని టెస్ట్‌లు ఆ రోజు లేక మరుసటి రోజు చేస్తారు.

రిపోర్టులు కూడా మరుసటి రోజు ఇస్తారు. సీటీస్కాన్‌, ఆల్ట్రా స్కాన్, ఎమ్మారై స్కాన్‌, వినికిడి టెస్ట్... వంటి వాటికి  నెల రోజులకు పైగా ఎదురు చూడవలసి ఉంటుంది. అలాగే, భోజనశాల, క్యాంటిన్ నిర్వహణ కూడా చాలా అధ్వాన్నంగా ఉంది. భోజనశాలలో టేబుల్‌పై  మంచి నీళ్ల జగ్గులు, గ్లాసులు ఉండవు. వాటర్ బాటిల్ కొనుక్కోమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఈ విషయమై రోగులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెడికల్ షాపుల నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంది. ఎయిమ్స్‌లో అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, నిర్వహణ పరంగా రోగులు, వారి బంధువులు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దిగువ స్థాయి సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రోగుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సిబ్బందిని విసిగించే మాట వాస్తవమే. అయితే, వారికి ఓపికగా సమాధానం చెప్పవలసిన బాధ్యత సిబ్బందిపై ఉంటుంది.




చేయవలసిన మార్పులు:


అన్ని విభాగాలలో డాక్ట దగ్గర నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు తగినంత మందిని నియమించాలి. సాంకేతికతను వినియోగించుకుని  నిర్వహణలో సమూలంగా మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది. రోగులు అయిదు, ఆరు సార్లు క్యూలో నిలబడవలసిన అవసరంలేకుండా మార్పులు చేయాలి.  రోగులు అన్నిచోట్ల గంటల తరబడి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి వర్ణనాతీతం.       ప్రతి విభాగంలో, క్యూలో రోగులు నిలబడిన ప్రతిచోట ఒక సెక్యూరిటీ గార్డును తప్పనిసరిగా నియమించాలి. వారు క్యూని నియంత్రించాలి. ఎయిమ్స్ వంటి సంస్థ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసిన అవసరం ఉంది.  రోగి ఏ విషయం అడిగినా, వారికి అర్థమయ్యే రీతిలో ఓపికగా సమాధానం చెప్పే విధంగా ప్రత్యేక సమాచార కౌంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే, రోగులు, వారి బంధువుల పట్ల మర్యాదగా ప్రవర్తించే విధంగా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. రోగులు, వారి బంధువులు వందల మంది తమ ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఎయిమ్స్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటారు. వారిని త్వరగా భోజనం చేసి వెళ్లిపొమ్మని సెక్యూరిటీ సిబ్బంది గదమాయిస్తుంటారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా తప్పు పట్టలేము. వారు అలా ఎక్కడబడితే అక్కడ భోజనం చేయడం వల్ల ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రం అవుతాయి. అందువల్ల వారు భోజనాలు చేయడానికి ఒక ప్రత్యేక భోజనశాలను ఏర్పాటు చేయాలి.

కోట్ల రూపాయల వ్యయం చేసి, పలు భవనాలు నిర్మించారు. అవుట్ పేషెంట్లు భోజనం చేసే సౌకర్యం కల్పించకపోవడం పెద్ద లోపమే. ఎయిమ్స్ యాజమాన్యం తలుచుకుంటే ఈ సమస్యలను పరిష్కరించడం భారమైన విషయం ఏమీ కాదు. ఎయిమ్స్‌కు వచ్చే రోగుల సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి, తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఒక కమిటీని నియమించవలసిన అవసరం ఉంది. ఆ కమిటీ నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ సునాయాసంగా పరిష్కారం అవుతాయి.   ఎయిమ్స్ యాజమాన్యం ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు నిర్వహణా లోపాలను సరిదిద్దుతుందని ఆశిద్దాం.


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914








Oct 9, 2025

న్యాయవ్యవస్థలో పారదర్శకత పెరగాలి

దేశంలో న్యాయవ్యవస్థ తీరుతెన్నులు

మన దేశంలో ఎన్నడూ లేనంతగా న్యాయవ్యవస్థ వార్తల కెక్కుతోంది. కొంత మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతుంటే, మరికొంత మంది తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు, చేసిన వ్యాఖ్యానాలు విస్మయం కలిగిస్తున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. వీటిలో ఏ ఒక్కటీ మరొకదాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా అస్థిరమైన రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా న్యాయవ్యవస్థ ఉండాలి. ఆ దిశగా న్యాయవ్యవస్థ స్వీయప్రక్షాళనకు దిగింది. అయినా,  న్యాయం అందరికీ సమానంగా అందుతుందా? బెయిల్ విషయంలో పేదవాడికి ఒక రకంగా, రాజకీయ నాయకుడు, ఆర్థిక నేరగాళ్లకు ఒక రకంగా ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం అత్యంత ప్రమాదకరం. అది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది.  ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, జైళ్లపాలు కావడంతో, న్యాయమూర్తులు తమకు అనుకూలమైన వారుగా ఉండాలనే భావన వారిలో మొదలైంది. ఈ రకమైన ఆలోచనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయినా,   న్యాయవ్యవస్థలో ప్రభుత్వం జోక్యానికి ఎమర్జెన్సీ కాలంలోనే బీజం పడింది. అప్పటి ప్రధానమంత్రి ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో  తీర్పు తమకు అనుకూలంగా రావాలన్న ఆలోచన ఆనాటి ప్రభుత్వ పెద్దల్లో వచ్చింది. దాంతో, అప్పుడు సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు  సీనియర్  జడ్జిని కాదని, 4వ స్థానంలో ఉన్న జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.   ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ,  సీనియర్ జడ్జీలు రాజీనామాలు చేశారు. అప్పటి నుంచి కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా,  జడ్జీల నియామకాల్లో, బదిలీల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటూ వస్తోంది. అవినీతికి పాల్పడిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కొందరు న్యాయమూర్తులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు.  రూ.1.9 కోట్ల మోసం కేసులో సరైన ఆధారాలు లేకుండా నిందితులైన దంపతులకు బెయిల్ మంజూరు చేసిన  ఢిల్లీ సెషన్స్ కోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులకు గత సెప్టెంబరు నెలలో సుప్రీం కోర్టు శిక్ష విధించింది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. 2009లో అప్పటి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన రాజీనామా చేశారు.  అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు   2011లో రాజీనామా చేశారు.  రాజ్యసభ అభిశంసనకు గురైన తొలి న్యాయమూర్తిగా ఆయన నిలిచారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన రెడ్డి ప్రలోభాలకు లోనై బెయిలు ఇచ్చిన కేసులో 2012లో నలుగురు జడ్జీలు అరెస్ట్ అవడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇటీవల అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఓ  న్యాయమూర్తి ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. ఆయనపై రాజ్యసభలో, లోక్‌సభలో వివిధ రాజకీయ పార్టీలు అభిశంసన నోటీసులు కూడా ఇచ్చాయి. ఇవన్నీ బహిరంగమైన అంశాలు. న్యాయమూర్తుల అవినీతికి సంబంధించిన అన్ని అంశాలు వెల్లడికావు. ఇందుకు సంబంధించి వారికి అంతర్గత విచారణ వ్యవస్థ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపై ఫిర్యాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే చేరతాయి. న్యాయవ్యవస్థ పనితీరు, అవినీతి ఆరోపణలకు సంబంధించి 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 1631 ఫిర్యాదులు అందాయి. కేంద్ర మంత్రి లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. అయితే, అంతర్గత విచారణ వ్యవస్థ రహస్యంగా ఉంటుంది. అందువల్ల, ఈ ఫిర్యాదులపై విచారణ ఏ స్థాయిలో ఉందో,  ఏ రకమైన చర్యలు తీసుకున్నారో బయటకు తెలియదు. ఇంతే కాకుండా, కోర్టు వ్యాఖ్యలు, తీర్పులపై కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన తర్వాత భార్య అయినా, భర్త అయినా మరొకరితో ఇష్టంగా శృంగారంలో పాల్గొంటే నేరం కాదని  సుప్రీం కోర్టు పేర్కొంది. భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త అసహజ శృంగారం జరపడం నేరం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటువంటి తీర్పులను కొందరు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్ జిల్లాలో ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని విష్టుమూర్తి విగ్రహం విషయమై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.


కుల వ్యవస్థపై నిర్మితమైన మన సమాజంలో న్యాయమూర్తుల నియామకాల విషయంలో కూడా కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  2018 నుంచి  మొత్తం 715 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించారు. వారిలో 551 మంది (77.06%) అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి  ఈ ఏడాదిలో మార్చిలో రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌  తెలిపిన ప్రకారం,  2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు హైకోర్టు  న్యాయమూర్తులుగా నియమితులైన 743 మందిలో 93 మంది ఓబీసీలు (12.5 శాతం) మాత్రమే ఉన్నారు. 23 మంది ఎస్సీలు (3 శాతం), 17 మంది ఎస్టీలు (2.2 శాతం) ఉన్నారు. 105 మంది (14 శాతం) మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మిగిలిన 164 మంది  ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందినవారు. వారిలో 22 మంది ఎస్సీ  (3.08%), 16 మంది ఎస్టీ  (2.24%), 89 మంది ఓబీసీ  (12.45%), 37 మంది మైనారిటీలు (5.17%) ఉన్నారు. అగ్రవర్ణాలలో అత్యధిక మంది  బ్రాహ్మణులే ఉన్నారని తెలుస్తోంది. మహిళలకు తగిన స్థాయిలో ప్రతినిధ్యం లేదు.అంతే కాకుండా, పదవీవిరమణ చేసిన వెంటనే కొందరు న్యాయమూర్తులు పదవులలో నియమితులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ విధంగా ప్రభుత్వ పదవులు పొందడం మంచి పద్దతి కాదు. ఆ పదవులు ఆశించే, న్యాయమూర్తులు పదవిలో ఉండగా, ప్రభుత్వాలకు,  రాజకీయ నాయకులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారని ప్రజలు భావించే అవకాశం ఉంది.

మరోవైపు, రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 600 మంది న్యాయవాదులు గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం  ఉందని  పేర్కొన్నారు.  కొన్ని రాజకీయ సమూహాలు న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా నిరాధారమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, వారికి అనుకూల ఫలితాలు పొందేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థ ఏ విధమైన ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయవ్యవస్థ పవిత్రత, స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవలసిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో, లోపాలను సవరిదిద్దడంతోపాటు న్యాయవ్యవస్థ స్వతంత్రను కూడా కాపాడాలి.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులపై జరుగుతున్న విచారణ స్థాయిలో న్యాయమూర్తులపై విచారణ జరగడంలేదన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు అటు రాజకీయ వ్యవస్థ, ఇటు న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  ఈ నేపథ్యంలో, న్యాయవ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, విశ్వసనీయతను పరిరక్షించడంలో   పలువురు  న్యాయమూర్తులు  పదవీవిరమణ  తర్వాత ప్రభుత్వం నుండి ఎలాంటి పదవులు తీసుకోరాదని బహిరంగంగా ప్రతిన చేశారు. అలాగే, 21 మంది న్యాయమూర్తులు వారి ఆస్తుల వివరాలను  వెల్లడించారు. ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సంతోషించతగిన అంశాలు. ఈ విధంగా న్యాయవ్యవస్థ స్వీయ ప్రక్షాళనకు రంగంలోకి దిగడం అభినందనీయం.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914  

Sep 22, 2025

‘ఆమె’ప్రేమలో రజా హుస్సేన్


ఈ ముసలోడికి 68 ఏళ్ల వయసులో ఈ ప్రేమ కవిత్వం ఏమిటని లోకులు ఆడిపోసుకుంటారన్న ఆలోచన, కించిత్తు భయం ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, కవి అబ్దుల్  రజా హుస్సేన్‌కు ఉన్నాయి. అయినా, అది ప్రేమ కవిత్వం. దానిని ఆపడం ఎవరికీ సాధ్యంకాదు. చివరకు ఎప్పుడూ ప్రేమ కవిత్వం జోలికి వెళ్లని రజా హుస్సేన్‌కు కూడా సాధ్యం కాలేదు. ఈ వయసులో మనసులో ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా తన్నుకొచ్చింది. అతనిలోని గాఢమైన ప్రేమికుడు బయటపడ్డాడు. పైగా ‘‘ ఉష్! నేను ప్రేమలో వున్నా చప్పుడు చేయకండి.!!’’అని కోరుకోవడంతోపాటు  ‘‘కళ్లముందెప్పుడూ ‘ఆమె’ రూపమే. నిద్రలో, మెలకువలో, అంతెందుకు? ఊపిరిలో కూడా ‘ఆమే’.’’ అని స్పష్టంగా చెప్పేశారు.    తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేయడంతోపాటు ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టిన రజా హుస్సేన్ ‘ఆమె’పై ప్రేమతో చక్కటి భాష, భావంతో ఈ ప్రేమ కవిత్వం అద్భుతంగా రాశారు.

‘‘ప్రేమ అనేది అంతులేని రహస్యం, ఎందుకంటే దానిని వివరించగల సహేతుకమైన కారణం లేదు ’’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. ‘‘అందాన్ని ఆస్వాదించు, కావాలని కోరుకోకు’’ అన్నాడు కవీంద్రుడు. ‘‘నా ప్రేమ కవిత్వం లౌకిక వాసనలంటనిది. అలౌకికమైంది’’ అని రజా హుస్సేన్ అన్నారంటే దాదాపు కవీంద్రుని ధోరణిలోని ఈ కవిత్వం సాగిందని నాకు అనిపించింది. ‘‘ప్రేమంటే ఇదీ అని ఇదమిద్ధంగా చెప్పడం కష్టమే. పరిమళాన్ని కళ్లకు చూపడం ఎంత కష్టమో, ప్రేమని చూపడమూ అంతే కష్టం.’’అని తేల్చి చెప్పి ప్రేమకు సలాంచేసి గులామైపోయారు రజా హుస్సేన్. అంటే, అంతగా ప్రేమలో మునిగిపోయాడు. చూసినకొద్దీ చూడాలనిపించేదే ప్రేమ ఎమో?..కరుకుదనం, బాధ లేని గాయాలు..నడిచే నీ పాదాల అడుగుల సడి శ్రవణానందమే...గుప్పుమంటున్న పాదముద్రల పరిమళం.. ఉలిక్కిపడి నిద్రలేస్తే ఎదురుగా నీ రూపం... రాచపుండు వంటి ప్రేమకు మందు ప్రేమించడమే...ప్రేమంటే లౌకిక వాసనలకు అందనిది...ఆమె కోసం కన్నీటితో దీపం వెలిగించడం...దాగుడు మూతల ప్రేమ... కోయిల పాట-నిశ్శబ్దం-నువ్వున్నప్పుడు -లేనప్పుడు...ఆ అందాన్ని కొలిచే కలమానం నా హృదయమే సుమా!...మనసు విలువ తెలియాలంటే మనసుండాలి..... అని ‘ఆమె’ కవిత్వం సాగింది. ఈర్ష్యా ద్వేషాలు, కులమతాల కొట్లాటలు, కుతకుత ఉడికిపోతున్న సంక్షోభం... వంటి వాటికి దూరంగా కాస్తంత ఉపశమనం, ప్రశాంతత కోసం ప్రేమవైపు పరుగులు తీశారు. ప్రేమ లోతులకు వెళ్లారు. ఆస్వాదించి అలౌకికానందం పొందారు. జీవితంలో ‘ఆమె’తో పెనవేసుకున్న ప్రేమ జ్ఞాపకాలు, అనుభవించడం, ఆనందించడం, ప్రేమలోని సౌందర్యం, మాధుర్యం, ప్రేమ భావన, బాధలు, వెదలు, వేదనలు ....... అంతా రజా హుస్సేన్ అనుభవించి మనకు ‘ఆమె’ కవిత్వ రూపంలో అందించారు. అయినా, ఆయన ప్రేమ దాహం తీరలేదు. ‘‘56 అక్షరాలతో ఏకరువుపెట్టినా నీ మీద ప్రేమ వర్ణించలేను!!’’ అన్నది ఆయన భావన. దిష్టి తగిలి తమ ప్రేమ ఒట్టిపోయిందన్నది ఆయన బాధ. ప్రతి కవితకి తగిన విధంగా తన ఊహా సుందరి లేదా ఉంది, లేదని చెప్పిన  ‘ఆమె’ అందమైన ఫొటోలను అద్భుతంగా అద్దారు. అక్కడ కూడా  అలౌకిక ప్రేమతో ‘ఆమె’ను అన్ని రూపాలలో, భంగిమలలో  చూపడం విశేషం.

‘ఆమె’ పుస్తకం వెల:రూ.100
కాపీలకు : 9063167117

సమీక్షకులు: శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Sep 12, 2025

చేనేత రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి!

రేపటి కోసం ఎడిటోరియల్ పేజీ
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కళాకారులపై కూటమి ప్రభుత్వం చల్లని చూపు  పడింది. ఈ ప్రభుత్వం చేనేత వృత్తిని గౌరవించడంతోపాటు చేనేత కార్మికుల చిందించే శ్వేదాన్ని గుర్తించింది. చేనేత ఉత్పత్తులతోపాటు మార్కెటింగ్‌కు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  చేనేత కళాకారుల  జీవనాన్ని మెరుగు పరచడం కోసం  ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.  చేనేత కుటుంబాలలో వెలుగు నింపుతోంది. చేనేత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే, సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాల మోతలు మోగుతాయి. ప్రభుత్వం చేనేతకు సహకరిస్తే,  అది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.  చేనేత రంగం అభివృద్ధి చెందడంతోపాటు చేనేత కుటుంబాలకు, అలాగే, చేనేత అనుబంధ రంగాలలో ఇతరులకూ ఉపాధి అవకాశాలు పెరుగుపడతాయి.  చేనేత ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగి ఈ రంగం కూడా సంపదని సృష్టిస్తుంది. చేనేత కార్మికులకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 7 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నా.  ఈ పథకం ప్రకారం చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. మర మగ్గం ఉన్న కుటుంబానికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. ఈ ఉచిత విద్యుత్  పథకం కోసం  కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు చేయనుంది.  ఈ పథకం ద్వారా రాష్ట్రంలో  చేనేత మగ్గాలు ఉన్న 50 వేల కుటుంబాలు,  మర మగ్గాలు ఉన్న 15 వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మగ్గానికి ఉచిత విద్యుత్  ఇవ్వడం అంటే చేనేత కార్మికుడి కష్టానికి గౌరవం ఇవ్వడమే.  ఎన్టీఆర్  భరోసా పెన్షన్ పథకం కింద 50 ఏళ్లు దాటిన ఒక్కో చేనేత కళాకారుడికి రూ.4000 పెన్షన్ ఇస్తున్నారు. 92,724 చేనేత కుటుంబాలకు సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ కింద మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలలో రూ.74 కోట్లతో కొత్త చేనేత క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిద్వారా 11,374 మంది చేనేత మహిళలకు లబ్ధి చేకూరుతుంది.  నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  చేనేత వస్త్రాల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే  భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన త్రిఫ్ట్ నిధులను  కూటమి ప్రభుత్వం మళ్లీ అమలులోకి తీసుకొచ్చింది. 5,386 మంది చేనేత కళాకారులకు  రూ.5 కోట్లను విడుదల చేసింది. చేనేత క్లస్టర్స్ లో నమోదైన చేనేత కళాకారులకు మగ్గం, ఇతర మగ్గం పరికరాలు 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది.  కేంద్ర ప్రభుత్వ ముద్ర యోజన పథకం క్రింద చేనేత కళాకారులు,  చేనేత సహకార సంఘాలు ముడిసరుకుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా 20శాతం సబ్సిడీ తో రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం కింద 18 నుంచి 50 ఏళ్ల లోపు చేనేత కళాకారుడు మరణిస్తే రూ.2 లక్షల జీవిత భీమా చెల్లిస్తారు. ఈ పథకానికి ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 18 నుంచి 70 ఏళ్ల మధ్య చేనేత కళాకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే  ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం  కింద రూ.2 లక్షల చెల్లిస్తారు.   చేనేత కళాకారులకు ఆరోగ్య బీమా పథకం  కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో నూతన టెక్స్‌టైల్స్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది.  1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల( ఎంఎస్ఎంఈ) పార్కుల్లో చేనేత కళాకారుల కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. చేనేత సహకార సంఘాలను పటిష్టపరిచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సంఘాలకు  త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. 

చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికవడం కూడా చేనేత వర్గాలకు కలిసి వచ్చింది.  మంత్రి నారా లోకేష్‌తోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా చేనేత రంగం అభివృద్ధిపైనే ఉంటుంది. జాతీయ చేనేత దినోత్సవం రోజు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో కూడా వారు ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. చేనేత కళాకారులు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తనను 90,160 మెజార్టీతో గెలిపించారన్న విశ్వాసం కూడ మంత్రి లోకేష్‌కు ఉంది. దాంతో,  మంత్రి నారా లోకేష్‌తోపాటు ఆయన సతీమణి బ్రాహ్మణి  కూడా  చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా  వ్యవహరిస్తున్నారు.  గతంలోనే మంత్రి లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మంగళగిరి ఆటోనగర్‌లో వీవర్‌శాల ఏర్పాటు చేశారు.  ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు, చేనేత సూర్యుడిగా పేరొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మంగళగిరిలో కొత్తగా ఏర్పాటు చేసే పెద్ద పార్కుకి ప్రగడ కోటయ్య పేరు పెట్టి, అక్కడ ఆయన విగ్రహం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.  చేనేత వారసత్వాన్ని ప్రదర్శించేందుకు అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత పరిశ్రమ ఎదగాలన్న తపన ఉన్న పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’  కింద రాష్ట్రానికి వచ్చిన తొమ్మిది అవార్డుల్లో నాలుగు చేనేత రంగానికే వచ్చాయి. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ ద్వారా చేనేత ఉత్పత్తుల మార్కెట్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు వేల చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదయ్యాయి. చేనేతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Sep 4, 2025

మానవ అక్రమరవాణా నిరోధించడంలో విఫలం


మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలేదు. అయితే, ఆడపిల్లలే అధికంగా ఉన్నారని సమాచారం. బాలికలను, మహిళలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు.  అవయవాల కోసం కూడా  మానవ అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో మ‌హిళా సెక్స్ వ‌ర్క‌ర్లు గణనీయంగా ఉన్నారు. ఓ పక్క అక్రమ రవాణా, మరోపక్క ఆర్థిక పరిస్థితుల వల్ల సెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా ఆందోళన కరమైన అంశం. ఒక నివేదిక ప్రకారం 2021లో 1,33,447 మంది మహిళా సెక్స్ వర్కర్లతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, 2024లో 1,19,367 మందితో రెండవ స్థానంలో ఉంది.  మానవ అక్రమరవాణా, వ్యభిచారం నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వాలు ఏవీ తీవ్రంగా పరిగణిస్తుట్లు కనిపించడంలేదు. ఇందుకోసం రాష్ట్రంలో ఓ పటిష్టవంతమైన వ్యవస్థలేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్ (యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌-ఏహెచ్‌టీయూ)లను ఏర్పాటు చేశారు. వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క యూనిట్‌లో  ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నేరుగా  నమోదు చేయలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లు తమ వద్ద ఉన్న పిల్లలు, యువతుల మిస్సింగ్, అక్రమ రవాణా కేసులు ఈ మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్‌కు  బదిలీ చేయవలసి ఉంది. ఆ కేసులను ఏహెచ్‌టీయూలు స్వతంత్రంగా దర్యాప్తు  చేపట్టాలి, కానీ  వాస్తవ పరిస్థితుల్లో  అలా జరగడం లేదు. దాంతో  ఆ కేసులు విచారణ నీరుగారి పోతోంది. గత 5 ఏళ్ళుగా  కనీసం 10 శాతం మంది నిందితులకు కూడా  శిక్షలు పడలేదు.

 శారీరక దోపిడీ లేదా లైంగిక దోపిడీ, బానిసత్వం, దాస్యం లేదా అవయవాలను బలవంతంగా తొలగించడం, పిల్లలు, మానవ అక్రమ రవాణా ముప్పును ఎదుర్కోవడానికి  భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 370, 370A ఉన్నాయి. లైంగిక వేధింపులు, దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ-పోక్సో (పీఓసీఎస్ఓ) చట్టం చేశారు. బాలికలు, మహిళలను అమ్మడం, కొనడం, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలో   నిర్దిష్ట చట్టాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రం కూడా  వారి రక్షణకు GOMs.No.1 (2003), GOMs.No.28 (2012), GOMs.No.43 (2015 ) జారీ చేసింది.  ఇన్ని చట్టాలు, జీఓలు ఉన్నప్పటికీ ఫలితంలేదు. వాటిని  అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. బాధిత బాలికలకు, మహిళలకు  తగిన రీతిలో  పునరావాసం, పరిహారం లభించడంలేదు. 2016 నుండి 2022 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 2,460 మందిని అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నుంచి రక్షించారు. వారిలో పది శాతం మందికి కూడా పునరావాస సహాయం లభించలేదు. దీని వలన వారు తిరిగి లైంగిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. అక్రమ రవాణాదారులకు శిక్ష విధించే రేటు 8 శాతం మించిలేదు. వీరికి అందాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవీ అందలేదు.  పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైంది. ముఖ్యంగా నల్సా (నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) వారు  2015లో రూపొందించిన పథకం ప్రకారం నరక కూపాల నుంచి విముక్తి పొందిన  ప్రతి మహిళకు లేదా బాలికకు లక్ష రూపాయల నుంచి రూ.8 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా, జీవో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారం  విముక్తి పొందిన బాధితులకు రూ.20 వేలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి. కానీ, విముక్తి పొందినవారిలో ఐదు శాతం మందికి మించి ఆర్థిక సహాయం అందలేదు.
బాధితులకు  రక్షణ కరువైంది.  బాధితుల పిల్లలు వివక్షకు గురవడం మరో తీవ్రమైన అంశం. ఇది బాధిత మహిళలకు అయిన గాయాలను ఇంకా తీవ్ర చేస్తోంది. సెక్స్ వర్కర్లను అనధికారిక కార్మికులుగా పరిగణించి, వారికి అందించే అన్ని సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తింపచేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కావడంలేదు. న్యాయ వ్యవస్థ కూడా ఈ బాధిత మహిళలు, బాలికల రక్షణ, వారి పునరావాసం, ఉపాధి... వంటి విషయాలలో ప్రత్యేక దృష్టి సారించవలసి ఉంది.  సెక్స్ వర్కర్లను, వ్యభిచార గృహాలు, అక్రమ రవాణా నుంచి రక్షించబడినవారి సంక్షేమం కోసం అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’, హెచ్ఈఎల్‌పీ(సొసైటీ ఫర్ హెల్ప్ ఎంటైర్ లోయర్ అంద్ రూరల్ పీపుల్)వంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. బాధిత మహిళల తరఫున పోరాటం చేస్తున్నాయి.  అయినా, ప్రభుత్వాల నుంచి తగినంత స్థాయిలో స్పందన రాకపోవడం బాధాకరం.  విముక్తి పొందిన బాలికలు, యువతుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టవలసి ఉంది. వారికి న్యాయం, గౌరవం, ఉపాధి,  ఆర్థిక భద్రత కల్పించడం వంటి అంశాల విషయమై  ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉంది.    వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడేవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. దానిని పటిష్టవంతంగా అమలు చేయాలి. వారు మళ్లీ గౌరప్రదంగా సమాజంలో బతికే వెసులుబాటు కల్పించాలి.  వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి  రక్షణ, సంక్షేమం, నష్ట పరిహారం కోసం సింగిల్ విండో విధానం ద్వారా వారు ప్రయోజనాలు పొందేందుకు  రాష్ట్ర ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకోవలసి ఉంది. అక్రమ రవాణాలో బయటపడిన వారిని నేరస్థుల వలే  షెల్టర్ హోమ్‌లలో సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచడం భావ్యంకాదు.  అందుకు ప్రత్యామ్నయంగా కమ్యూనిటీ-ఆధారిత పునరావాసం కోసం సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. తద్వారా వారు సమాజంలో కలిసిపోయి జీవించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలు కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సహాయక సేవల సమీక్ష, పర్యవేక్షణ, వాటి అమలు కోసం ఏర్పాటు చేసే కమిటీలలో  సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి ప్రాతినిధ్యం కల్పించవలసి ఉంది. బాధితులు తమ హక్కులు తిరిగి పొందేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్పష్టమైన, పటిష్టమైన విధానాలు, సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని అన్ని విధాల ఆదుకోవలసిన అవసరం ఉంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Sep 3, 2025

సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం కోసం తీర్మానం

విజయవాడ: ఆగస్టు 19 నుండి 21 వరకు సీనియర్ జర్నలిస్ట్ ఫోరం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహాసభల్లో సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తీర్మానించినట్లు ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి. జనార్ధన్,ఉపాధ్యక్షులు ఎస్. అజాద్, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావులు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన విలేకర్ల సమావేశంలో కేరళలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ ఫోరం జాతీయ మహాసభలో చేసిన తీర్మానాలను, రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రాష్ట్రాల  నుండి 250 మంది, సీనియర్ జర్నలిస్టులు ప్రథమ జాతీయ మహాసభకు విచ్చేసారని, ప్రారంభ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ముగింపు సమావేశానికి ప్రతిపక్ష నేత సతీషన్, గోవా మాజీ గవర్నర్ పిళ్ళై హాజరై మహాసభ విజయాన్ని కాంక్షించారని పేర్కొన్నారు.  ఈ సభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో  వెటరన్స్ కు పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకు రు.20,000 తో జాతీయ పెన్షన్

విధానం ఉండాలని మహాసభ తీర్మానించినట్టు తెలిపారు. కరోనా సమయంలో ఉపసంహరించిన రైల్వే పాసులను  పునరుద్ధరించాలని మహాసభ డిమాండ్ చేయడం జరిగిందన్నారు.  దక్షిణ భారతదేశంలో ఆంధ్ర,తెలంగాణలో మాత్రమే వెటరన్స్ కు  ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందన్నారు.  జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను,గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టు కుటుంబానికి వైద్యం,
ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలుకు దోహదపడాలని మహా సభ నిర్ణయించిందన్నారు.  హెల్త్ ఇన్సూరెన్స్ ను రు.5 లక్షలకు పెంచి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్స్ తరహాలో మన రాష్ట్రంలోని సిమ్స్, రిమ్స్, ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూడా జర్నలిస్టులకు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం కల్పించాలన్నారు.

మధ్యప్రదేశ్ తరహాలో   వెటరన్స్ కు పర్మినెంట్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలన్నారు., కర్ణాటక తరహాలో అన్ని బస్సుల్లో ( ఎసితోసహా) ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.  రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో లాగా జిల్లా స్థాయి జర్నలిస్టులకు కూడా స్టేట్ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. కేరళ మహా సభలో రాష్ట్రం నుండి. యం. వి.రామారావు, హెచ్.ఆజాద్,,యం. నరేంద్ర రెడ్డి, ఎస్.నాగార్జున రావు,, జాతీయ సమితి సభ్యులు గా, డా. టి. జనార్దన్, జాతీయ ఉపాధ్యక్షులు గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గం వారిని అభినందించింది.

సమాచార శాఖ సంచాలకులకు వినతి

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్ష్ శుక్ల ఐఏఎస్ కి, అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత కి ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేసారు. కార్యక్రమం లో ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. టి. జనార్దన్, గౌరవ అధ్యక్షులు నాగార్జున, ఉపాధ్యక్షులు ఎస్. అజాద్,ఎం. నరేంద్ర రెడ్డి, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీవీజేయూ గౌరవాధ్యక్షునిగా శిరందాసు నాగార్జున

విజయవాడ: ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులుగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావుని ఎంపిక చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు  డాక్టర్ టి. జనార్దన్, ప్రధాన కార్యదర్శి  జి. చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సిద్ధార్ధ నగర్‌లో సోమవారం జరిగిన వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారు వివరించారు. యూనియన్  రిజిస్ట్రేషన్ ప్రక్రియను మన యూనియన్ ఉపాధ్యక్షులు వెంకటరత్నం సారధ్యంలో ఈనెల 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. ఈ ప్రక్రియలో ఆయనకు అందరూ సహకరించాలని కమిటీ నిర్ణయించింది. యూనియన్ కార్యవర్గంలోకి  గౌరవ అధ్యక్షులుగా శిరందాసు నాగార్జున రావు (మంగళగిరి) సహాయ కార్యదర్శులుగా పి.భుజంగ రావు (ధర్మవరం) ఆర్.రాజశేఖర్ (విజయవాడ)లను  తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. జర్నలిస్టులుగా 20 ఏళ్లు పూర్తి అయి, తగిన ఆధారాలు కలిగి ఉండి, 58 ఏళ్లు నిండిన వారు, తాజాగా అక్రెడిటేషన్ కలిగినవారిని సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. సభ్యత్వ రుసుము రూ.500గా, ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం రూ.100 చెల్లించాలని నిర్ణయించారు. యూనియన్‌లో  221 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, వారిలో  130 మంది మాత్రమే సభ్యత్వ రుసుం  చెల్లించారు. మిగతా 91 మంది ఈనెల 15లోగా సభ్యత్వ రుసుంతో పాటు, దరఖాస్తును విజయవాడలోని మన కోశాధికారి రామారావు(7286964554)కి పంపాలని తెలిపారు. లేనిచో జాబితా నుండి పేర్లు  తొలగించాలని కార్యవర్గం నిర్ణయించింది. మన సభ్యుల ప్రవర్తన గౌరవప్రదంగా హుందాగా  ఉండాలని, అలా లేని పక్షంలో, ఎవరిపైనైనా  ఫిర్యాదులు అందితే, వారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు  చేసేందుకు ముగ్గురితో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ఎంవీ.రామారావు(విజయవాడ), హెచ్.ఆజాద్(అనంతపురం), వేగి రామ చంద్రరావు(విశాఖపట్నం)లుగా ఉంటారు.58 ఏళ్లు నిండి, వెటరన్ జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ కలిగిన వారు కొత్త సభ్యులుగా చేరమని కమిటీ పిలుపు ఇచ్చింది.