Sep 20, 2019


18 ఏళ్ల లోపువారు ఆత్మహత్య చేసుకుంటే అది హత్యే!
  ‘18 ఏళ్ల లోపువారు ఆత్మహత్య చేసుకున్నా అది హత్యే!’ అనేది ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని హీరో డైలాగ్. ఇది అక్ష్యర సత్యం. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. 18 ఏళ్ల లోపు పిల్లలు ముఖ్యంగా విద్యార్థులలో ఎక్కువ శాతం మంది ఇటు తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థల వేధింపులకు, హింసకు గురవుతున్నారు. వారిది యాంత్రిక జీవనం అయిపోయింది. ఓ ఆటాలేదు. ఓ పాటా లేదు. పుస్తకాల మోత, ఎప్పుడూ చదువు, చదువు... ఇదే వారి బతుకైపోయింది. ఆ బతుకులో జీవంలేదు. వారి ఆలోచనలకు, ఇష్టాలకు ప్రాధాన్యతేలేదు. ఇక ప్రేమానుబంధాలు, ఆత్మీయత, అనురాగాలు మచ్చుకైనా కానరావు. పిల్లలు వాటికి దూరమైపోతున్నారు.  తల్లిదండ్రుల చెప్పిన చదువులే చదవాలి. వారు చేరమన్న కోర్సులోనే చేరాలి. అందుకు వారి స్థాయి చాలకపోయినా అలాగే ఈడ్చుకురావాలి. ఆ చిన్నారులకు మరో గత్యంతరం లేదు. చాలా మంది విద్యార్థుల బతుకులు దుర్భరమైపోతున్నాయి. తల్లిదండ్రులకు ఏవో తీరని కోరికలు ఉంటాయి. వారు ఏ డాక్టరో, ఇంజనీరో చదవాలని, ఐఏఎస్ కొట్టాలని కలలు కంటారు. వారికి సాధ్యంకాదు. అటువంటివారిలో అధిక మంది వాటిని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు.  ఆ ప్రయత్నాలు చాలా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఇంకొందరు చదువులోనూ, క్రీడలలోనూ వృత్తిలోనూ, వ్యాపారంలోనూ ఉన్నతంగా ఉంటారు. తమ పిల్లలు కూడా అదేవిధంగా తయారు కావాలని ఆ కాంక్షిస్తారు. అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ వారు చదువులో ఉన్నతంగా నిలవాలని వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తారు. పిల్లల  ఇష్టాఇష్టాలతో పనిలేదు. వారు చెప్పిన విధంగా చదవాలి. అంతేకాకుండా వారు కోరుకున్నన్ని మార్కులు రావాలి. కొందరు తల్లిదండ్రులకు అత్యాశ ఎక్కువ. పిల్లవాడి సామర్ధ్యాన్ని అంచనావేయలేరు. 95 శాతం మార్కులు వచ్చినా వారికి సంతృప్తి ఉండదు. ఇంకో రెండు శాతమో, మూడు శాతమో వస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అంత కష్టపడి అన్ని మార్కులు సాధించినా తల్లిదండ్రులు, గురువుల మెప్పు పొందలేకపోయామని ఆ విద్యార్థులు బాధపడుతుంటారు. ‘ఛీ ఈ చదువులు’ అనుకునే స్థాయికి వారు వస్తారు.
           మరికొందరైతే పిల్లల ఆలోచనా విధానం, వారి శారీరక స్థితి, వారి జ్ఞాన సామర్థ్యం తెలుసుకోకుండా డాక్టర్ సీటు రావాలని కోరుకుంటారు. కోచింగ్ లో చేర్పిస్తారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తారు. ఇక తమ బిడ్డ డాక్టర్ సీటు కొట్టేసినట్లు ఊహించుకుంటారు. ఆ బిడ్డ పరిస్థితిని గమనించరు. వారు ఏవైనా సమస్యలు చెప్పినా పట్టించుకోరు. ఇంకా అది సాధించాలి, ఇది సాధించాలి అని ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఒక ఏడాది సీటు సాధించకపోతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆ సీటు రాకపోతే ఇక జీవితంలేదన్నట్లు ప్రవర్తిస్తారు. విద్యార్థుల మానసిక స్థితిమీద చావు దెబ్బ కొడతారు.  రెండో ఏడాది దీర్ఘకాల కోచింగ్, అప్పుడూ రాకపోతే మూడే ఏడాదీ  ఇంకా అదే కోచింగ్... విద్యా సంస్థలు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఇలా సాగిపోతుంటాయి తల్లిదండ్రుల ఆలోచనలు, వారి చర్యలు. ఆ బిడ్డ సీటు సాధించాలి లేదా చావాలి. పిల్లలకు కుటుంబ వ్యవస్థ, సున్నితమైన అంశాల గురించి చెప్పరు. బంధాలు, అనుబంధాలను ఆస్వాదించే అవకాశం ఇవ్వరు. వావి వరసలు నేర్పరు. పిల్లలు ఇతర సమస్యలు ఏవి చెప్పినా అటు తల్లిదండ్రులు, ఇటు గురువులు పట్టించుకోరు. కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్,  తోటి విద్యార్థుల వికృత చేష్టలు, వారి బెదిరింపులు, అలాగే కొందరు గురువుల వెకిలి చూపులు, వారి లైంగిక వేధింపులు, హెచ్చరికలు, చేర్పించిన కోర్సులో పుస్తకాలు చదవలేని స్థితి, ఆయా సబ్జెక్టుల పట్ల ఆసక్తిలేకపోవడం, ఆడపిల్లలైతే తోటి విద్యార్థుల ప్రేమ వేధింపులు, యాసిడ్ దాడులు, తీవ్రమైన ఒత్తిడి, హింస, భయం..... ఇలా ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. వాటిని తల్లిదండ్రులకు, విద్యా సంస్థ యాజమాన్యాలకు చెప్పినా ఫలితం ఉండదు.
           యాజమాన్యాల దృష్టంతా వ్యాపారంపైన, సంపాదనపైనే ఉంటుంది. పిల్లల జీవితాలు ఎలా పాడైనా వారికి పట్టదు. ఇంకా మార్కుల కోసం వారిని వేధిస్తుంటారు. ఏ కారణం వల్లో మార్కులు సరిగా రాకపోతే వారిని కించపరుస్తారు. అవమానిస్తారు. అవహేళన చేస్తారు. కొందరు గురువులుగా కాకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. మరోవైపు పిల్లలకు తల్లితండ్రుల వద్ద ప్రేమగా గడిపే అవకాశాలు, పరిస్థితులు బాగా తగ్గిపోతున్నాయి.  ప్రేమకు మొకంవాసిపోతున్నారు.  ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఆ పసి మనసులు ఎంత తల్లడిల్లుతాయో ఆ తల్లిదండ్రులు ఏనాడైనా ఆలోచిస్తున్నారా? వారు చెప్పే మాటలను వినడానికి ప్రయత్నిస్తున్నారా? వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? లేదు. చివరికి వారు మరో గత్యంతరంలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటువంటి వాటిని ఆత్మహత్యలు అని ఎలా అంటాం. అవన్నీ హత్యలే. అందుకు బాధ్యులు తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థల యాజమాన్యాలే. ఇటువంటి హత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టవలసి ఉంది. ముఖ్యంగా అత్యంత దారుణంగా ప్రవర్తించే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. బిడ్డ ఆత్మహత్య చేసుకున్న తరువాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. వారు బతికి ఉండగానే వారు చెప్పేవి వినాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. వారిని ప్రేమగా బుజ్జగించి నచ్చజెప్పాలి.  తల్లి,తండ్రి, గురువు దైవం అంటారు. ఆ తరువాత గురువులు బాధ్యతగా వ్యవహరించాలి. గురువు స్థానానికి వారు తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడే ఇటువంటి హత్యలు ఆగుతాయి.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Sep 6, 2019

దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వ  నిర్ణయాలు
         
                ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేవిధంగా అనేక నిర్ణయాలు తీసుకొని సంచలనాలు సృష్టిస్తోంది. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవానికి తెరతీసింది.  వ్యవస్థలో సమూల మార్పు, సామాజిక సమానత్వం, అవినీతి నిర్మూలనకు నడుం కట్టింది. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, దేశంలో ఎవరూ చేయని అనేక చట్టాలను  చేసింది. పార్టీ ఫిరాయింపులకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో రాజకీయంగా ఆదర్శంగా నిలిచేవిధంగా జగన్ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలలోని సభ్యులు ఎవరైనా పార్టీ మారదలచుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి రావాలన్న నిబంధన విధించారు. అంతే కాకుండా పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ కు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. ఈ ప్రభుత్వ పనితీరుకు దేశం మొత్తం ఒక్కసారిగా ఏపీ వైపు చూస్తోంది. అందరికీ సమాన అవకాశాల కోసం నూతన చట్టాలు చేసింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే యువతకు 2.8 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి చరిత్ర సృష్టించింది. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా రివర్స్ టెండరింగ్ కి పూనుకుంది. మన రాజకీయ వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవడానికి అనేక తప్పుడు మార్గాలు అనుసరిస్తుంటారు. ఆ రకమైన అవినీతి చర్యలకు స్వస్తి చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో అడ్డదారులు తొక్కడానికి వీరందరూ భయపడే పరిస్థితి వచ్చింది. దాంతోనే ప్రభుత్వంలో చాలా మార్పు వచ్చింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో శాశ్విత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలలో, విద్యాపరంగా సీట్ల కేటాయింపుల్లో బీసీలకు జరిగే అన్యాయాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కమిషన్ ద్వారా అవకాశం ఏర్పడుతుంది. అలాగే దయనీయంగా ఉన్న ఎంబీసీల(అత్యంత వెనుకడిన తరగతులు) పరిస్థితి మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. సమాజంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు స్థానం కల్పించే విధంగా మంత్రి మండలిని రూపొందించారు. ఏ రాష్ట్రంలో జరుగని విధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి అయిదుగురిని ఉప ముఖ్య మంత్రులుగా నియమించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన శాసనసభ తొలి సమావేశాల్లోనే కౌలు రైతుల సంక్షేమంఉద్యోగాల కల్పనల్యాండ్‌ టైటిల్‌, అట్టడుగు వర్గాలుమహిళల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి అనేక చట్టాలు చేశారు. నామినేషన్ విధానంలో చేపట్టే కాంట్రాక్ట్ పనులలో, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్, అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏకంగా శాసనసభలో చట్టం చేశారు. ఇప్పటి వరకు అందరూ మాటలు చెప్పిన వారే గానీ చట్టం చేసినవారు లేరు. పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్తోమత ఈ బలహీన, బడుగు, దళిత వర్గాలకు లేదు. కనీసం నామినేటెడ్ కాంట్రాక్టులైనా వచ్చే అవకాశం లభిస్తుంది.  ఈ చట్టం ఆ సామాజిక వర్గాలలో సంపూర్ణ ఆత్మస్థైర్యాన్ని నింపింది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేశారు. దాంతో యువతకు ప్రభుత్వంపై ఓ నమ్మకం ఏర్పడింది. వ్యవసాయ రంగం పురోగతిరైతు సంక్షేమం కోసం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్,  రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి  ఏర్పాటు చేశారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్,  ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ లను ఏర్పాటు చేశారు. టెండరింగ్ ప్రక్రియలో ఈ ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా టెండరింగ్ పనులను హైకోర్టు జడ్జి ఖరారు చేసే విధంగా చట్టం రూపొందించారు.  ఈ రకమైన పలు చట్టం చేసిన మొదటి ప్రభుత్వంగా ఏపీ రికార్డుకెక్కింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రభుత్వంలో పారదర్శక పాలనకు నిదర్శనగా ప్రభుత్వం ద్వారా జరిగే కోటి రూపాయలకు మించిన లావాదేవీ ఏదైనా ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. ఆ లావాదేవీ ఏ కంపెనీ ద్వారా, ఏ సంస్థ ద్వారా జరుగుతుందో ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా వివరాలు అందుబాటులో ఉంచుతారు.  మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ పాలన రూపకల్పనలో భాగంగా  గ్రామ, పట్టణ ప్రాంతాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడానికి గ్రామసేవకుల వ్యవస్థను ప్రారంభించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా వీరు వ్యవహరిస్తారు. ప్రజలకు వీరు అందించే సేవల ద్వారా నాయకులుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం ప్రవేశపెట్టారు. అలాగే సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయటానికి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రారంభించారు.

కేంద్రం, తెలంగాణతో సంత్సంబంధాలు
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలతో సంత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర రావుతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర విభజన, నదీ జలాల సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిధులు, గ్రాంట్లను పెంచాలని, పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు రావలసిన నిధులు తక్షణం విడుదల చేయాలని, నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి, రాష్ట్రా భివృద్ధికి సహకరించాలని కోరారు. పార్లమెంట్‌ హామీ మేరకు విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని,  పదేళ్లపాటు జీఎస్టీఐటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, రెవెన్యూ లోటు రూ.22,948 కోట్లను పూడ్చాలని, పోలవరం ప్రాజెక్ట్  కోసం ఖర్చు చేసిన రూ.5,103 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరుతూ ప్రధానికి ప్రత్యేకంగా ఓ లేఖ అందజేశారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం  చేపట్టిన రెండు నెలల్లోనే  దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు.  వీడీపీ అసోసియేట్స్ వారు ముఖ్యమంత్రుల పనితీరుపై దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన సర్వేలో 3వ స్థానం పొందారు.  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో,  యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్  రెండో స్థానంలోతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 5వ స్థానంలో నిలిచారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో కూడా సీఎం జగన్మోహన రెడ్డి  4వ ర్యాంక్ సాధించారు. నవరత్న పథకాలుసామాజిక న్యాయంఅవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టడం ద్వారా జగన్ అందరి మనసులలో సుస్థిర స్థానం సంపాదించారు. దూకుడుగా వ్యవహరిస్తున్నా చిరకాలం గుర్తుండే శాశ్విత నిర్ణయాలు తీసుకుంటున్నారు.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Sep 4, 2019

బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా?



·       రుణాల ఎగవేత అధికం
·       ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ నష్టం
·       చిరు వ్యాపారులకు నిబంధనలు అధికం
·       బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచాలి
                  
          ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలను దేశంలోని రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి, సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 1969 జూలై 19న బ్యాంకుల జాతీయం చేశారు. పేద-మధ్య తరగతి వర్గాలను వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా? అంటే బడా బాబులకు ఉపయోగపడినంతగా పేదలకు, రైతులకు ఉపయోగపడటంలేదనే చెప్పాలి. బ్యాంకులు జాతీయం చేసి 50 ఏళ్లు గడిచినా  ఏ ఉద్దేశాలతో బ్యాంకులను జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు కొంతవరకు మాత్రమే నెరవేరాయి. ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే ఎక్కువగా ఉపయోపడుతున్నాయి. వాళ్లే బ్యాంకుల సొమ్మును బొక్కేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను  మోసం చేసి వేల కోట్లు దిగమింగుతున్నారు. ఆ డబ్బుని రాబట్టే సరైన వ్యవస్థ మన దేశంలో లేకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు కూడా తగిన రీతిలో పకడ్భందీగా చట్టాలను రూపొందించలేకపోతున్నాయి. దాంతో బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులను మోసం చేయడం ఏడాదికేడాది పెరిగిపోతోంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. వినియోగదారులు చేసిన మోసాలను బ్యాంకులు గుర్తించగలిగిన సరాసరి సమయం 22 నెలలుగా ఉంది.  2018-19లో బ్యాంకుల వినియోగదారులైన కొంతమంది పారిశ్రామికవేత్తలు రూ.71,542.93 కోట్ల  మేర బ్యాంకులను మోసం చేశారు.  ఈ మోసాలకు సంబంధించి 6,801 కేసులు నమోదయ్యాయి. 2017-18లో రూ.41,167.04 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకే  అధిక వాటా ఉంది. బ్యాంకుల్లోనే అధిక మోసాలు వెలుగు చూశాయి.
                       2018-19లో వినియోగదారుల మోసాల వల్ల రూ.64,509.43 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోయాయి. ఈ మొత్తానికి సంబంధించి 3,766 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఉన్నాయి. అంటే ఈ మోసగాళ్లు విదేశీ బ్యాంకులను కూడా వదిలిపెట్టలేదు. మోసాలన్నింటిలో రుణ ఎగవేతలే ఎక్కువగా ఉన్నాయి. కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, నగదు జమలకు సంబంధించిన మోసాలు 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే ఫోర్జరీ, మోసాలకు  సంబంధించి 72 భారీ కేసులు నమోదయ్యాయి. రూ.లక్ష కన్నా తక్కువ రుణం తీసుకొని ఎగ్గొట్టినవారి కేసులు 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నవారే బ్యాంకులను మోసం చేశారని స్పష్టమవుతోంది. ఇక్కడ ఒక విషయం మనం ముఖ్యంగా గమనించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా, ప్రైవేటు రంగ బ్యాంకులైనా రైతులకు, మధ్యతరగతి వారికి, చిరు వ్యాపారులకు 50 వేల రూపాయల రుణం కావాలంటే పాతిక రకాల నిబంధనలు విధిస్తారు. బంగారం, స్థిరాస్తులు, హామీలు... వంటివి కావాలి. చిరు వ్యాపారులు రూ.50 వేల రుణం తీసుకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలా కోటి రూపాయలతో 20 కుటుంబాలు బతుకుతాయి. వారి రుణ బకాయి చెల్లించకపోతే ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇంకా ఏదైనా తేడా వస్తే ఆస్తులు వేలం వేస్తారు. ఈ బడా పారిశ్రామికవేత్తలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఎగ్గొట్టగలుగుతున్నారు? ఏడాదికేడాది బ్యాంకులకు ఈ రకమైన నష్టాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ ఎందుకు పకడ్భందీగా వ్యవహరించడంలేదు? ఆ పారిశ్రామికవేత్తల కనుసన్నలలోనే ఈ బ్యాంకులు, ప్రభుత్వాలు నడుస్తున్నాయోమో అని అనిపిస్తోంది.
                    ప్రభుత్వాలు ప్రకటించే రుణ ప్రణాళికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు 50 శాతం రుణాలు కూడా బ్యాంకులు వారికి ఇవ్వవు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే సందర్భాలలో కూడా వారిని నానా వేధింపులకు గురి చేస్తారు. బడా వ్యాపారులకు ఇచ్చే దాంట్లో నాలుగవ వంతు రుణాలు చిరు వ్యాపారులకు ఇస్తే కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. బకాయిలు తిరిగి చెల్లించే శాతం కూడా పెరుగుతుంది. తక్కువ మొత్తంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. చిరు వ్యాపారులు, రైతులు పరువు గురించి ఆలోచిస్తారు. అవకాశం ఉన్న మేరకు శాయశక్తులా బకాయిలు చెల్లిస్తారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీ పెట్టే  వ్యాపారులకు  అటువంటివి ఏమీ ఉండవు.  అంతే కాకుండా వారి వద్ద నుంచి బకాయిలు వసూలు చేసుకోవడానికి శక్తివంతమైన సాధనాలు ఏమీ లేవు. రుణాలు ఇవ్వడానికి నియమనిబంధనలు బలహీనంగా ఉన్నందువల్లే వారు అలా చేయగలుతున్నారు.  అందువల్ల వారికి రుణాలు ఇవ్వడానికి హామీలు, నిబంధనలు కఠినతరం చేయవలసి ఉంది. అలాగే బకాయిలు వసూలు చేసుకోవడానికి కూడా కఠిన చట్టాలు చేయాలి. ఈ పరిస్థితులలో దేశంలో ఆర్థిక రంగం బలోపేతం కావడానికి, ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలను పటిష్టపర్చవలసిన అవసరం ఉంది. అలాగే బ్యాంకులు సామాన్యులు, రైతులు, చిరువ్యాపారుల అవసరాలు తీర్చగలిగే విధంగా వారికి రుణాలు ఇచ్చే విషయంలో నిబంధనలు సరళతరం చేయాలి.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Aug 31, 2019

రాజధానిని తరలించే అవకాశంలేదు





v 34 వేల ఎకరాల భూ సమీకరణ
v తాత్కాలిక శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణం
v రూ.40వేల కోట్ల వ్యయంతో కొనసాగుతున్న 36 ప్రాజెక్టుల నిర్మాణాలు
v 65 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 13 వందల ఎకరాల కేటాయింపు
v రాజధాని తరలింపు భారీ వ్యయంతో కూడిన పని
v అనుకూలంగా లేని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
v అభివృద్ధి వికేంద్రీకరణకు కొన్ని ముఖ్య నగరాలపై దృష్టి
v రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవకాశం
v కొంత భూమి రైతులకు తిరిగి ఇచ్చే ఆలోచన

              కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవడం, ఇటీవల పట్టణాభివృద్ధి  శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రాంత ప్రజలలో  రాజధానిని తరలిస్తారన్న ఆందోళన మొదలైంది. రాష్ట్ర నడిబొడ్డున, కృష్ణా నది ఒడ్డున స్థల ఎంపిక, భూసేకరణ, కొన్ని నిర్మాణాలు పూర్తి కావడం, మరి కొన్ని నిర్మాణ పనులు జరుగుతుండటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో రాజధానిని తరలించే అవకాశం లేదు. ప్రదేశం ఎంపిక, భూ సేకరణ విషయంలో కొంతమందికి  అభ్యంతరాలు ఉంటాయి. అలాగే లాభ నష్టాలు కూడా ఉంటాయి. అది సహజం. కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో అందరినీ సంతృప్తిపరచడం అసాధ్యం. అమరావతి భూసేకరణ, నిర్మాణాలు, కాంట్రాక్టుల ప్రక్రియలో అవకతవకలు జరిగడానికి అవకాశం ఉంది. అయితే  ఈ పరిస్థితులలో రాజధానిని మార్చడం అత్యంత వ్యయప్రయాసలు, భారంతో కూడుకొన్న పని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రభుత్వం అటువంటి అలోచన చేసే అవకాశాలు చాలా తక్కువ. అవకతవకలను సరిదిద్ధడానికి, రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పలువురు భావిస్తున్నారు.  
                      గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రాజధాని అమరావతిగా ప్రకటించారు. ఈ గ్రామాలకు చెందిన 28,158 మంది రైతుల నుంచి 34 వేలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతులకు చాలా వరకు ప్లాట్లు పంపిణీ చేశారు.
           తాత్కాలిక శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి.  అక్కడ నుంచే చట్టాలు రూపొందించండం, పరిపాలన, కోర్టు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపు 65 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 13 వందలకు పైగా ఎకరాల భూమి కేటాయించారు. కొన్ని సంస్థలకు అప్పగించారు. వందల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలు ఇక్కడ క్యాంపస్‌లు నిర్వహిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు సంబంధించి ప్రభుత్వ వసతి గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. రాజధానిలో ప్రతి పేదకు కట్టించే ఇళ్ల నిర్మాణం చాలా వరకు పూర్తి అయింది. కొన్నిటి నిర్మాణం పూర్తి కాగా, కొన్నిటి నిర్మాణం చివరి దశలో ఉన్నాయి.
                రాజధానిలో రూ.40వేల కోట్ల విలువైన 36 ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 35 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తి అయ్యాయి. పది వంతెనలు నిర్మించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. గత ఏడాదే దానిని ప్రారంభించారు. మౌలిక వసతులకు సంబంధించిన పలు పనులు మధ్యలో ఆగిపోయాయి. కొద్దిపాటి వ్యయంతో పలు భవనాల నిర్మాణం పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఆ భవనాలన్నిటినీ ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఇక్కడ ఇంత వ్యయం చేసి, ఇన్ని నిర్మాణాలు జరిగిన తరువాత రాజధానిని తరలించే ఆలోచన ప్రభుత్వం చేయదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు గానీ, బీజేపీ ఎంపీ గానీ  మాట్లాడుతున్న మాటల ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. 1. రాజధాని అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలను నిదానంగా పూర్తి చేయడం. 2. రాజధానికి ఇంత భూమి వద్దనుకుంటే కొంత భూమి రైతులకు తిరిగి ఇచ్చే అవకాశం. దానికి విధి విధానాలు రూపొందించండ. 3.అధికార వికేంద్రీకరణలో భాగంగా ఆయా ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి, కర్నూలులలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం. 4. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం. 5.పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం విశాఖ, తిరుపతి, దొనకొండ, అనంతపురంలపై ప్రత్యేక శ్రద్ధ. 6.రాష్ట్రమంతటితోపాటు సముద్ర తీరం వెంట పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం.... వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధానిని తరలించడం గానీ, రెండు మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేయడం గానీ అత్యంత వ్యయంతో కూడుకున్న పని. ప్రస్తుతం రాజధాని కోసం అంత వ్యయం చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు ‘నవరత్నాల’ అమలుకు భారీ వ్యయం అవుతుంది. ప్రభుత్వం దృష్టంతా నవరత్నాలపైనే ఉంది. అయితే రాజధాని అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ జరిగే సమయంలో త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Aug 24, 2019


అరుణ్‌ జైట్లీ కన్నుమూత!


                
                న్యూడిల్లీ: భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు.  గత కొంతకాలంగా మూత్రపిండాలు,  క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయను గతంలో వైద్యం చేయించడం కోసం అమెరికా తీసుకువెళ్లారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ ఫలితం లేదు. అరుణ్ జైట్లీ మరణించిన విషయాన్ని  ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

               2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్య మంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు.  2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బీజేపీ విజయం సాధించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు.
1952 నవంబర్ 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో అరుణ్‌ జైట్లీ జన్మించారు. వారిది పంజాబీ హిందూ కుటుంబం. తండ్రి న్యాయవాది. ఢిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో (1960- 1969)పాఠశాల విద్య అభ్యసించారు.  1973లో కామర్స్‌ లో డిగ్రీ, 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో  ఏబీవీపీ ఉద్యమాలలో పాల్గొన్నారు.  1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అరుణ్‌ జైట్లీ 1982 మే 24న సంగీత డోగ్రీని వివాహం చేసుకున్నారు.   1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు,  కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.  పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు.
                   1991 నుంచి ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అరుణ్ జైట్లీకి ఇద్దరు పిల్లలు సోనాలీ జైట్లీరోహన్‌ జైట్లీ. వారు ఇద్దరూ కూడా న్యాయవాదులే. తాత దగ్గర నుంచి  వారిది న్యాయవాదుల కుటుంబం. 
http://tolivelugu.com/abvp-to-rajyasabha/

Aug 22, 2019


ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం?
                  సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనం సృష్టించనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయమే మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు అందుకు అంగీకరించలేదు. హైదరాబాద్ ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.  రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇక్కడ కూడా తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ ని రెండవ రాజధానిగా చేసే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్ట్రపతికి  శీతాకాల విడిదిగా ఉంటోంది. సికింద్రాబాద్ లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు, ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. అలాగే సిమ్లాలో రాష్ట్రపతికి వేసవి విడిది కూడా ఉంది.  
               కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజలలో బీజేపీ మంచి పట్టు సాధించింది. అలాగే  సీడీఎస్ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) నియామక నిర్ణయం కూడా పలువురిని ఆకట్టుకుంది.   ఇదే క్రమంలో అటు తెలంగాణలో టీఆర్ఎస్ ని దెబ్బతీసి, హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఇటు ఏపీ ప్రజల మనసు చూరగొనాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విధంగా   రెండు తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో  వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2023లో తెలంగాణలో తమ పార్టీ  అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.    

Aug 9, 2019


ఒకే దేశం - ఒకే రాజ్యాంగం


‘ఒకే దేశం - ఒకే రాజ్యాంగం’ అదే బీజేపీ లక్ష్యం.  ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అంటూ ఏక్తా భారత్ అనే నినాదంతో  జనసంఘ్ పార్టీ పుట్టింది. కాల క్రమంలో అది భారతీయ జనతా పార్టీ(బీజేపీ)గా ఏర్పడింది. ఆ పార్టీ సిద్ధాంత రూప కర్త రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ఉద్దేశం కూడా అదే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే ఎన్నికలు - ఒకే కార్డు,  ఒకే విధమైన రిజర్వేషన్ విధానం -  దేశ పౌరులందరికీ (స్త్రీ, పురుషులిద్దరికీ) సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను..... విధానాలతో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ
నేపధ్యంలో  దేశ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ
సంచలన  నిర్ణయాలు తీసుకున్నారు. అదే జమ్ము-కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే రాజ్యాంగంలోని 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దు, జమ్ము-కశ్మీర్ విభజన నిర్ణయాలు.  భారతదేశ చరిత్రలో 1947 ఆగస్ట్ 15 తరువాత గుర్తుంచుకోతగిన రోజు 2019 ఆగస్ట్ 5. ఆ రోజున  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  103 క్లాజులతో 58 పేజీల ‘జమ్ము-కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్-2019’ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఉమ్మడి జమ్ము-కశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజన అయ్యాయి. జమ్ము-కశ్మీర్‌ శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించాయి. ప్రస్తుతం కశ్మీర్‌ ప్రాంతపరిధిలోని పది జిల్లాలు, జమ్ము ప్రాంతంలోని పది కలిపి 20 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడింది. అలాగే లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో లద్దాఖ్‌ ప్రాంతం చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకె)కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. ఆ ప్రాంతం మొత్తంపై కేంద్ర అధికార పరిధి పెరిగింది.  రాజ్యసభ ఆ బిల్లును  ఆమోదించింది. మరో పక్క అదే సమయంలో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. దాంతో జమ్ము- కశ్మీర్‌ శాసనసభలో భారతరాజ్యాంగం తక్షణం పూర్తి  స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుని ఆగస్ట్ 6న లోక్ సభలో చర్చకు పెట్టారు. బీజేపీకి బలం ఉన్నందున అక్కడ కూడా ఆమోదం పొందుతుంది.  ఈ బిల్లు రూపొందించడంలో మోడీ, అమిత్ షాలు ఇద్దరూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘనవిజయం సాధించారు. ఈ ఇద్దరూ హీరోలుగా నిలిచారు.   దేశంలో అత్యధిక మంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ, శాంతి భద్రతల విషయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటూ, 70 ఏళ్లుగా రావణ కాష్టంలా రగులుతున్న సమస్యకు పరిష్కారం చూపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థిర, చరాస్తులను వదులుకొని ఎక్కడెక్కడో తలదాసుకుంటున్న కశ్మీరీ పండిట్ ల ఆనందానికి అవధులులేవు. ఈ చర్యతో మోడీ, అమిత్ షాలు ఇద్దరూ దేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ మాదిరిగా గుర్తుండిపోతారు.
            చర్చ జరుగకుండా ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెట్టడంలో అర్ధంలేదు. జమ్ము- కశ్మీర్‌ ప్రాంతంలో శాంతిలేదు. ప్రజలకు భద్రత కరువైంది. ఏడు దశాబ్దాలుగా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఆర్టికల్‌ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. మరో పక్క ఆ ప్రాంతంలో అశాంతిని పెంచడానికి, కల్లోలం సృష్టించడానికి  పాకిస్తాన్  చేస్తున్న చేష్టలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితులలో ముందుగా ఈ వ్యూహం బయటపెట్టి, చర్చించిన తరువాత చర్యలకు దిగితే దేశం లోపల, వెలుపల ఎన్నో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది. అందువల్లనే దూరాలోచనతో వారు ఈ ఆలోచనను అత్యంత గోప్యంగా ఉంచి, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొని బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల ఆ ప్రాంత ప్రజల హక్కులు ఏమీ హరించుకుపోలేదు. వారి గౌరవానికి ఏవిధంమై భంగం కలుగదు. వారి మత విశ్వాలసాలకు, సంస్కృతికి ఎటువంటి హానీ ఉండదు. దేశంలోని ఇతర పౌరులకు ఉన్న అన్ని హక్కులు వారు అనుభవిస్తారు. అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి. ఇంకా అదనంగా అక్కడి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. అక్కడ శాంతి నెలకొంటే, కేంద్రం శాంతిభద్రతలపై కాకుండా, అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వీటన్నికంటే ముఖ్యంగా  దేశ సమైక్యతకు, సమగ్రతకు మేలు జరుగుతుంది.  దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా నెలకొనడానికి అవకాశం ఏర్పడుతుంది.

           ఇప్పటి వరకు భారత పార్లమెంటులో చేసే ఏ చట్టంలోనైనా ‘జమ్ము-కశ్మీర్ మినహా’ అని ఉంటుంది. ఇక నుంచి పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం జమ్ము-కశ్మీర్‌లో అమలవుతుంది. ఇప్పటి వరకూ జమ్ము-కశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల విక్రయించే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా అక్కడ భూములను కొని, అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది అంత సామాన్యమైన నిర్ణయం ఏమీకాదు. ఈ నిర్ణయం వల్ల ఇంటా బయట ఎదురయ్యే అన్ని అంశాలను దృష్టిలోపెట్టుకొనే వారిద్దరూ రంగంలోకి దిగి ఉంటారు. అందులో అనుమానం ఏమీలేదు. బిల్లు ప్రవేశపెట్టడానిక ముందు వారు తీసుకున్న జాగ్రత్తలే ఇందుకు నిదర్శనం. ఇక ముందు తలెత్తే అన్నిటిని కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొనగలదని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914