Aug 22, 2019


ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం?
                  సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనం సృష్టించనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయమే మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు అందుకు అంగీకరించలేదు. హైదరాబాద్ ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.  రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇక్కడ కూడా తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ ని రెండవ రాజధానిగా చేసే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్ట్రపతికి  శీతాకాల విడిదిగా ఉంటోంది. సికింద్రాబాద్ లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు, ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. అలాగే సిమ్లాలో రాష్ట్రపతికి వేసవి విడిది కూడా ఉంది.  
               కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజలలో బీజేపీ మంచి పట్టు సాధించింది. అలాగే  సీడీఎస్ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) నియామక నిర్ణయం కూడా పలువురిని ఆకట్టుకుంది.   ఇదే క్రమంలో అటు తెలంగాణలో టీఆర్ఎస్ ని దెబ్బతీసి, హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఇటు ఏపీ ప్రజల మనసు చూరగొనాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విధంగా   రెండు తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో  వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2023లో తెలంగాణలో తమ పార్టీ  అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.    

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...