Aug 9, 2019


ఒకే దేశం - ఒకే రాజ్యాంగం


‘ఒకే దేశం - ఒకే రాజ్యాంగం’ అదే బీజేపీ లక్ష్యం.  ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అంటూ ఏక్తా భారత్ అనే నినాదంతో  జనసంఘ్ పార్టీ పుట్టింది. కాల క్రమంలో అది భారతీయ జనతా పార్టీ(బీజేపీ)గా ఏర్పడింది. ఆ పార్టీ సిద్ధాంత రూప కర్త రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ఉద్దేశం కూడా అదే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే ఎన్నికలు - ఒకే కార్డు,  ఒకే విధమైన రిజర్వేషన్ విధానం -  దేశ పౌరులందరికీ (స్త్రీ, పురుషులిద్దరికీ) సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను..... విధానాలతో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ
నేపధ్యంలో  దేశ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ
సంచలన  నిర్ణయాలు తీసుకున్నారు. అదే జమ్ము-కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే రాజ్యాంగంలోని 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దు, జమ్ము-కశ్మీర్ విభజన నిర్ణయాలు.  భారతదేశ చరిత్రలో 1947 ఆగస్ట్ 15 తరువాత గుర్తుంచుకోతగిన రోజు 2019 ఆగస్ట్ 5. ఆ రోజున  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  103 క్లాజులతో 58 పేజీల ‘జమ్ము-కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్-2019’ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఉమ్మడి జమ్ము-కశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజన అయ్యాయి. జమ్ము-కశ్మీర్‌ శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించాయి. ప్రస్తుతం కశ్మీర్‌ ప్రాంతపరిధిలోని పది జిల్లాలు, జమ్ము ప్రాంతంలోని పది కలిపి 20 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడింది. అలాగే లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో లద్దాఖ్‌ ప్రాంతం చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకె)కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. ఆ ప్రాంతం మొత్తంపై కేంద్ర అధికార పరిధి పెరిగింది.  రాజ్యసభ ఆ బిల్లును  ఆమోదించింది. మరో పక్క అదే సమయంలో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. దాంతో జమ్ము- కశ్మీర్‌ శాసనసభలో భారతరాజ్యాంగం తక్షణం పూర్తి  స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుని ఆగస్ట్ 6న లోక్ సభలో చర్చకు పెట్టారు. బీజేపీకి బలం ఉన్నందున అక్కడ కూడా ఆమోదం పొందుతుంది.  ఈ బిల్లు రూపొందించడంలో మోడీ, అమిత్ షాలు ఇద్దరూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘనవిజయం సాధించారు. ఈ ఇద్దరూ హీరోలుగా నిలిచారు.   దేశంలో అత్యధిక మంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ, శాంతి భద్రతల విషయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటూ, 70 ఏళ్లుగా రావణ కాష్టంలా రగులుతున్న సమస్యకు పరిష్కారం చూపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థిర, చరాస్తులను వదులుకొని ఎక్కడెక్కడో తలదాసుకుంటున్న కశ్మీరీ పండిట్ ల ఆనందానికి అవధులులేవు. ఈ చర్యతో మోడీ, అమిత్ షాలు ఇద్దరూ దేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ మాదిరిగా గుర్తుండిపోతారు.
            చర్చ జరుగకుండా ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెట్టడంలో అర్ధంలేదు. జమ్ము- కశ్మీర్‌ ప్రాంతంలో శాంతిలేదు. ప్రజలకు భద్రత కరువైంది. ఏడు దశాబ్దాలుగా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఆర్టికల్‌ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. మరో పక్క ఆ ప్రాంతంలో అశాంతిని పెంచడానికి, కల్లోలం సృష్టించడానికి  పాకిస్తాన్  చేస్తున్న చేష్టలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితులలో ముందుగా ఈ వ్యూహం బయటపెట్టి, చర్చించిన తరువాత చర్యలకు దిగితే దేశం లోపల, వెలుపల ఎన్నో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది. అందువల్లనే దూరాలోచనతో వారు ఈ ఆలోచనను అత్యంత గోప్యంగా ఉంచి, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొని బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల ఆ ప్రాంత ప్రజల హక్కులు ఏమీ హరించుకుపోలేదు. వారి గౌరవానికి ఏవిధంమై భంగం కలుగదు. వారి మత విశ్వాలసాలకు, సంస్కృతికి ఎటువంటి హానీ ఉండదు. దేశంలోని ఇతర పౌరులకు ఉన్న అన్ని హక్కులు వారు అనుభవిస్తారు. అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి. ఇంకా అదనంగా అక్కడి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. అక్కడ శాంతి నెలకొంటే, కేంద్రం శాంతిభద్రతలపై కాకుండా, అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వీటన్నికంటే ముఖ్యంగా  దేశ సమైక్యతకు, సమగ్రతకు మేలు జరుగుతుంది.  దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా నెలకొనడానికి అవకాశం ఏర్పడుతుంది.

           ఇప్పటి వరకు భారత పార్లమెంటులో చేసే ఏ చట్టంలోనైనా ‘జమ్ము-కశ్మీర్ మినహా’ అని ఉంటుంది. ఇక నుంచి పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం జమ్ము-కశ్మీర్‌లో అమలవుతుంది. ఇప్పటి వరకూ జమ్ము-కశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూముల విక్రయించే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా అక్కడ భూములను కొని, అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది అంత సామాన్యమైన నిర్ణయం ఏమీకాదు. ఈ నిర్ణయం వల్ల ఇంటా బయట ఎదురయ్యే అన్ని అంశాలను దృష్టిలోపెట్టుకొనే వారిద్దరూ రంగంలోకి దిగి ఉంటారు. అందులో అనుమానం ఏమీలేదు. బిల్లు ప్రవేశపెట్టడానిక ముందు వారు తీసుకున్న జాగ్రత్తలే ఇందుకు నిదర్శనం. ఇక ముందు తలెత్తే అన్నిటిని కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొనగలదని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914






No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...