Aug 24, 2019


అరుణ్‌ జైట్లీ కన్నుమూత!


                
                న్యూడిల్లీ: భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు.  గత కొంతకాలంగా మూత్రపిండాలు,  క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయను గతంలో వైద్యం చేయించడం కోసం అమెరికా తీసుకువెళ్లారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ ఫలితం లేదు. అరుణ్ జైట్లీ మరణించిన విషయాన్ని  ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

               2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్య మంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు.  2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బీజేపీ విజయం సాధించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు.
1952 నవంబర్ 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో అరుణ్‌ జైట్లీ జన్మించారు. వారిది పంజాబీ హిందూ కుటుంబం. తండ్రి న్యాయవాది. ఢిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో (1960- 1969)పాఠశాల విద్య అభ్యసించారు.  1973లో కామర్స్‌ లో డిగ్రీ, 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో  ఏబీవీపీ ఉద్యమాలలో పాల్గొన్నారు.  1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అరుణ్‌ జైట్లీ 1982 మే 24న సంగీత డోగ్రీని వివాహం చేసుకున్నారు.   1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు,  కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.  పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు.
                   1991 నుంచి ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అరుణ్ జైట్లీకి ఇద్దరు పిల్లలు సోనాలీ జైట్లీరోహన్‌ జైట్లీ. వారు ఇద్దరూ కూడా న్యాయవాదులే. తాత దగ్గర నుంచి  వారిది న్యాయవాదుల కుటుంబం. 
http://tolivelugu.com/abvp-to-rajyasabha/

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...