Sep 6, 2019

దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వ  నిర్ణయాలు
         
                ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేవిధంగా అనేక నిర్ణయాలు తీసుకొని సంచలనాలు సృష్టిస్తోంది. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవానికి తెరతీసింది.  వ్యవస్థలో సమూల మార్పు, సామాజిక సమానత్వం, అవినీతి నిర్మూలనకు నడుం కట్టింది. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, దేశంలో ఎవరూ చేయని అనేక చట్టాలను  చేసింది. పార్టీ ఫిరాయింపులకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో రాజకీయంగా ఆదర్శంగా నిలిచేవిధంగా జగన్ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలలోని సభ్యులు ఎవరైనా పార్టీ మారదలచుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి రావాలన్న నిబంధన విధించారు. అంతే కాకుండా పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ కు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. ఈ ప్రభుత్వ పనితీరుకు దేశం మొత్తం ఒక్కసారిగా ఏపీ వైపు చూస్తోంది. అందరికీ సమాన అవకాశాల కోసం నూతన చట్టాలు చేసింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే యువతకు 2.8 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి చరిత్ర సృష్టించింది. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా రివర్స్ టెండరింగ్ కి పూనుకుంది. మన రాజకీయ వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవడానికి అనేక తప్పుడు మార్గాలు అనుసరిస్తుంటారు. ఆ రకమైన అవినీతి చర్యలకు స్వస్తి చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో అడ్డదారులు తొక్కడానికి వీరందరూ భయపడే పరిస్థితి వచ్చింది. దాంతోనే ప్రభుత్వంలో చాలా మార్పు వచ్చింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో శాశ్విత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలలో, విద్యాపరంగా సీట్ల కేటాయింపుల్లో బీసీలకు జరిగే అన్యాయాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కమిషన్ ద్వారా అవకాశం ఏర్పడుతుంది. అలాగే దయనీయంగా ఉన్న ఎంబీసీల(అత్యంత వెనుకడిన తరగతులు) పరిస్థితి మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. సమాజంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు స్థానం కల్పించే విధంగా మంత్రి మండలిని రూపొందించారు. ఏ రాష్ట్రంలో జరుగని విధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి అయిదుగురిని ఉప ముఖ్య మంత్రులుగా నియమించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన శాసనసభ తొలి సమావేశాల్లోనే కౌలు రైతుల సంక్షేమంఉద్యోగాల కల్పనల్యాండ్‌ టైటిల్‌, అట్టడుగు వర్గాలుమహిళల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి అనేక చట్టాలు చేశారు. నామినేషన్ విధానంలో చేపట్టే కాంట్రాక్ట్ పనులలో, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్, అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏకంగా శాసనసభలో చట్టం చేశారు. ఇప్పటి వరకు అందరూ మాటలు చెప్పిన వారే గానీ చట్టం చేసినవారు లేరు. పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్తోమత ఈ బలహీన, బడుగు, దళిత వర్గాలకు లేదు. కనీసం నామినేటెడ్ కాంట్రాక్టులైనా వచ్చే అవకాశం లభిస్తుంది.  ఈ చట్టం ఆ సామాజిక వర్గాలలో సంపూర్ణ ఆత్మస్థైర్యాన్ని నింపింది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేశారు. దాంతో యువతకు ప్రభుత్వంపై ఓ నమ్మకం ఏర్పడింది. వ్యవసాయ రంగం పురోగతిరైతు సంక్షేమం కోసం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్,  రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి  ఏర్పాటు చేశారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్,  ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ లను ఏర్పాటు చేశారు. టెండరింగ్ ప్రక్రియలో ఈ ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా టెండరింగ్ పనులను హైకోర్టు జడ్జి ఖరారు చేసే విధంగా చట్టం రూపొందించారు.  ఈ రకమైన పలు చట్టం చేసిన మొదటి ప్రభుత్వంగా ఏపీ రికార్డుకెక్కింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రభుత్వంలో పారదర్శక పాలనకు నిదర్శనగా ప్రభుత్వం ద్వారా జరిగే కోటి రూపాయలకు మించిన లావాదేవీ ఏదైనా ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. ఆ లావాదేవీ ఏ కంపెనీ ద్వారా, ఏ సంస్థ ద్వారా జరుగుతుందో ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా వివరాలు అందుబాటులో ఉంచుతారు.  మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ పాలన రూపకల్పనలో భాగంగా  గ్రామ, పట్టణ ప్రాంతాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడానికి గ్రామసేవకుల వ్యవస్థను ప్రారంభించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా వీరు వ్యవహరిస్తారు. ప్రజలకు వీరు అందించే సేవల ద్వారా నాయకులుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం ప్రవేశపెట్టారు. అలాగే సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయటానికి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రారంభించారు.

కేంద్రం, తెలంగాణతో సంత్సంబంధాలు
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలతో సంత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర రావుతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర విభజన, నదీ జలాల సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిధులు, గ్రాంట్లను పెంచాలని, పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు రావలసిన నిధులు తక్షణం విడుదల చేయాలని, నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి, రాష్ట్రా భివృద్ధికి సహకరించాలని కోరారు. పార్లమెంట్‌ హామీ మేరకు విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని,  పదేళ్లపాటు జీఎస్టీఐటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, రెవెన్యూ లోటు రూ.22,948 కోట్లను పూడ్చాలని, పోలవరం ప్రాజెక్ట్  కోసం ఖర్చు చేసిన రూ.5,103 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరుతూ ప్రధానికి ప్రత్యేకంగా ఓ లేఖ అందజేశారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం  చేపట్టిన రెండు నెలల్లోనే  దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు.  వీడీపీ అసోసియేట్స్ వారు ముఖ్యమంత్రుల పనితీరుపై దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన సర్వేలో 3వ స్థానం పొందారు.  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో,  యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్  రెండో స్థానంలోతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 5వ స్థానంలో నిలిచారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో కూడా సీఎం జగన్మోహన రెడ్డి  4వ ర్యాంక్ సాధించారు. నవరత్న పథకాలుసామాజిక న్యాయంఅవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టడం ద్వారా జగన్ అందరి మనసులలో సుస్థిర స్థానం సంపాదించారు. దూకుడుగా వ్యవహరిస్తున్నా చిరకాలం గుర్తుండే శాశ్విత నిర్ణయాలు తీసుకుంటున్నారు.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...