18 ఏళ్ల
లోపువారు ఆత్మహత్య చేసుకుంటే అది హత్యే!
‘18 ఏళ్ల లోపువారు ఆత్మహత్య చేసుకున్నా అది హత్యే!’ అనేది ఇటీవల విడుదలైన ఓ
సినిమాలోని హీరో డైలాగ్. ఇది అక్ష్యర సత్యం. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. 18
ఏళ్ల లోపు పిల్లలు ముఖ్యంగా విద్యార్థులలో ఎక్కువ శాతం మంది ఇటు తల్లిదండ్రులు,
అటు విద్యాసంస్థల వేధింపులకు, హింసకు గురవుతున్నారు. వారిది యాంత్రిక జీవనం
అయిపోయింది. ఓ ఆటాలేదు. ఓ పాటా లేదు. పుస్తకాల మోత, ఎప్పుడూ చదువు, చదువు... ఇదే
వారి బతుకైపోయింది. ఆ బతుకులో జీవంలేదు. వారి ఆలోచనలకు, ఇష్టాలకు ప్రాధాన్యతేలేదు.
ఇక ప్రేమానుబంధాలు, ఆత్మీయత, అనురాగాలు మచ్చుకైనా కానరావు. పిల్లలు వాటికి
దూరమైపోతున్నారు. తల్లిదండ్రుల చెప్పిన
చదువులే చదవాలి. వారు చేరమన్న కోర్సులోనే చేరాలి. అందుకు వారి స్థాయి చాలకపోయినా
అలాగే ఈడ్చుకురావాలి. ఆ చిన్నారులకు మరో గత్యంతరం లేదు. చాలా మంది విద్యార్థుల
బతుకులు దుర్భరమైపోతున్నాయి. తల్లిదండ్రులకు ఏవో తీరని కోరికలు ఉంటాయి. వారు ఏ
డాక్టరో, ఇంజనీరో చదవాలని, ఐఏఎస్ కొట్టాలని కలలు కంటారు. వారికి సాధ్యంకాదు.
అటువంటివారిలో అధిక మంది వాటిని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు
పెడతారు. ఆ ప్రయత్నాలు చాలా తీవ్రస్థాయిలో
ఉంటాయి. ఇంకొందరు చదువులోనూ, క్రీడలలోనూ వృత్తిలోనూ, వ్యాపారంలోనూ ఉన్నతంగా
ఉంటారు. తమ పిల్లలు కూడా అదేవిధంగా తయారు కావాలని ఆ కాంక్షిస్తారు. అలా అనుకోవడంలో
తప్పులేదు. కానీ వారు చదువులో ఉన్నతంగా నిలవాలని వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తారు.
పిల్లల ఇష్టాఇష్టాలతో పనిలేదు. వారు
చెప్పిన విధంగా చదవాలి. అంతేకాకుండా వారు కోరుకున్నన్ని మార్కులు రావాలి. కొందరు
తల్లిదండ్రులకు అత్యాశ ఎక్కువ. పిల్లవాడి సామర్ధ్యాన్ని అంచనావేయలేరు. 95 శాతం
మార్కులు వచ్చినా వారికి సంతృప్తి ఉండదు. ఇంకో రెండు శాతమో, మూడు శాతమో వస్తే
బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అంత కష్టపడి అన్ని మార్కులు సాధించినా
తల్లిదండ్రులు, గురువుల మెప్పు పొందలేకపోయామని ఆ విద్యార్థులు బాధపడుతుంటారు. ‘ఛీ
ఈ చదువులు’ అనుకునే స్థాయికి వారు వస్తారు.
మరికొందరైతే పిల్లల
ఆలోచనా విధానం, వారి శారీరక స్థితి, వారి జ్ఞాన సామర్థ్యం తెలుసుకోకుండా డాక్టర్
సీటు రావాలని కోరుకుంటారు. కోచింగ్ లో చేర్పిస్తారు. లక్షల రూపాయలు ఫీజులు
చెల్లిస్తారు. ఇక తమ బిడ్డ డాక్టర్ సీటు కొట్టేసినట్లు ఊహించుకుంటారు. ఆ బిడ్డ
పరిస్థితిని గమనించరు. వారు ఏవైనా సమస్యలు చెప్పినా పట్టించుకోరు. ఇంకా అది
సాధించాలి, ఇది సాధించాలి అని ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఒక ఏడాది సీటు
సాధించకపోతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆ సీటు రాకపోతే ఇక
జీవితంలేదన్నట్లు ప్రవర్తిస్తారు. విద్యార్థుల మానసిక స్థితిమీద చావు దెబ్బ కొడతారు.
రెండో ఏడాది దీర్ఘకాల కోచింగ్, అప్పుడూ
రాకపోతే మూడే ఏడాదీ ఇంకా అదే కోచింగ్... విద్యా
సంస్థలు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఇలా సాగిపోతుంటాయి తల్లిదండ్రుల ఆలోచనలు,
వారి చర్యలు. ఆ బిడ్డ సీటు సాధించాలి లేదా చావాలి. పిల్లలకు కుటుంబ వ్యవస్థ,
సున్నితమైన అంశాల గురించి చెప్పరు. బంధాలు, అనుబంధాలను ఆస్వాదించే అవకాశం ఇవ్వరు.
వావి వరసలు నేర్పరు. పిల్లలు ఇతర సమస్యలు ఏవి చెప్పినా అటు తల్లిదండ్రులు, ఇటు గురువులు
పట్టించుకోరు. కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్,
తోటి విద్యార్థుల వికృత చేష్టలు, వారి బెదిరింపులు, అలాగే కొందరు గురువుల
వెకిలి చూపులు, వారి లైంగిక వేధింపులు, హెచ్చరికలు, చేర్పించిన కోర్సులో పుస్తకాలు
చదవలేని స్థితి, ఆయా సబ్జెక్టుల పట్ల ఆసక్తిలేకపోవడం, ఆడపిల్లలైతే తోటి
విద్యార్థుల ప్రేమ వేధింపులు, యాసిడ్ దాడులు, తీవ్రమైన ఒత్తిడి, హింస, భయం.....
ఇలా ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. వాటిని తల్లిదండ్రులకు, విద్యా
సంస్థ యాజమాన్యాలకు చెప్పినా ఫలితం ఉండదు.
యాజమాన్యాల
దృష్టంతా వ్యాపారంపైన, సంపాదనపైనే ఉంటుంది. పిల్లల జీవితాలు ఎలా పాడైనా వారికి
పట్టదు. ఇంకా మార్కుల కోసం వారిని వేధిస్తుంటారు. ఏ కారణం వల్లో మార్కులు సరిగా
రాకపోతే వారిని కించపరుస్తారు. అవమానిస్తారు. అవహేళన చేస్తారు. కొందరు గురువులుగా
కాకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. మరోవైపు పిల్లలకు తల్లితండ్రుల వద్ద ప్రేమగా
గడిపే అవకాశాలు, పరిస్థితులు బాగా తగ్గిపోతున్నాయి. ప్రేమకు మొకంవాసిపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఆ పసి
మనసులు ఎంత తల్లడిల్లుతాయో ఆ తల్లిదండ్రులు ఏనాడైనా ఆలోచిస్తున్నారా? వారు చెప్పే
మాటలను వినడానికి ప్రయత్నిస్తున్నారా? వారి సమస్యలను తెలుసుకోవడానికి
ప్రయత్నిస్తున్నారా? లేదు. చివరికి వారు మరో గత్యంతరంలేక బలవన్మరణానికి
పాల్పడుతున్నారు. నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్య
చేసుకుంటున్నారు. ఇటువంటి వాటిని ఆత్మహత్యలు అని ఎలా అంటాం. అవన్నీ హత్యలే. అందుకు
బాధ్యులు తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థల యాజమాన్యాలే. ఇటువంటి హత్యలు
పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టవలసి ఉంది. ముఖ్యంగా అత్యంత దారుణంగా ప్రవర్తించే
తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. బిడ్డ ఆత్మహత్య చేసుకున్న తరువాత
ఏడ్చి ప్రయోజనం ఉండదు. వారు బతికి ఉండగానే వారు చెప్పేవి వినాలి. వారి సమస్యలు
పరిష్కరించాలి. వారిని ప్రేమగా బుజ్జగించి నచ్చజెప్పాలి. తల్లి,తండ్రి, గురువు దైవం అంటారు. ఆ తరువాత
గురువులు బాధ్యతగా వ్యవహరించాలి. గురువు స్థానానికి వారు తగిన గౌరవం ఇవ్వాలి.
అప్పుడే ఇటువంటి హత్యలు ఆగుతాయి.
- శిరందాసు
నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment