పరిపాలనా సౌలభ్యం కోసం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని అంశాలు ఒకే
రకంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలనాపరమైన అంశాలు దేశ వ్యాప్తంగా ఒకే
విధంగా ఉండటం వల్ల వ్యయం తగ్గుతుంది. జమిలీ ఎన్నికలైతే ప్రభుత్వానికి, పార్టీలకు
ఖర్చు తగ్గుతుంది. విద్యాపరంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు వంటివి ఒకటే ఉంటే విద్యార్థులకు ఖర్చు తక్కువ,
సౌలభ్యంగా ఉంటుంది. అలాగే చట్టాలు, పన్నులు, గుర్తింపు కార్డులు, కొన్ని
సర్టిఫికెట్లు... వంటివి ఒకే రకంగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ’ఏక్తా భారత్‘
భావన కూడా నెలకొంటుంది. అయితే మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు విషయంలో అది
సాధ్యం కాదు. ఆ రకమైన ఆలోచన మంచిదీ కాదు. మన దేశంలో 122 భాషలు, 19,500
మండలికాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు,
ఆదీవాసీలు, దళితులు, అణగారిన,
పీడనకుగురైన వర్గాలు, అనేక మతాలు, భాషలు, విభిన్న
సంస్కృతులకు నిలయం భారత్. వీటికి తోడు ఇక్కడ వేళ్లూనుకున్న వేల కులాలు ఉన్నాయి.
దేశంలోని
పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం తయారు చేయడం కోసం డాక్టర్ బాబా
సాహేబ్ అంబేద్కర్ తోపాటు దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు 284 మందితో రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ
పరిషత్ను ఏర్పాటు చేశారు. వీరంతా పరోక్ష
ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు, భారత్ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పూర్తి
స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్ల పాటు ఆగవలసి వచ్చింది. భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న
ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ మూడేళ్ల కాలం
అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన కృషి
ఫలితంగా 12 షెడ్యూల్స్,
25 భాగాలు, 448 ఆర్టికల్స్తో ప్రపంచంలోనే
అత్యుత్తమమైన అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దేశంలోని 22
షెడ్యూల్ భాషలకు రాజ్యాంగంలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 29
పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు
పాటించేందుకు స్వేచ్ఛను కల్పిచింది. రాజ్యాంగ రూపకల్పనలో మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తలకు
విఘాతం కలిగించే విధంగా షా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై అనేకమంది ధ్వజమెత్తుతున్నారు.
దేశంలో హిందీ భాషతో పాటు ప్రాచీనంగా ఉన్న అనేక భాషలు ఉన్నాయి. దక్షిణాధి భాషలు
అంతకంటే ఎక్కువ ప్రాచీనంగా ఉన్నాయి. భాష, సంస్కృతి చాలా బలీయమైనవి. హిందీ రాజభాషగా
గుర్తింపు పొందినా ప్రాంతీయ భాషలకు కూడా తగిన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే
గతంలో మాదిరి ఉధృతంగా మాతృభాషా ఉద్యమాలు జరుగుతాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
-
శిరందాసు నాగార్జున, సీనియర్
జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment