Sep 25, 2019


‘ఒకే దేశం - ఒకే భాష’ సాధ్యమేనా?

             ఒకే దేశం ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకే ఎన్నికలు - ఒకే కార్డు,  ఒకే విధమైన రిజర్వేషన్ విధానం -  దేశ పౌరులందరికీ (స్త్రీపురుషులిద్దరికీ) సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను, ఒకే పోటీ పరీక్ష ..... మాదిరిగా ఒకే భాష సాధ్యమేనా? వేల సంవత్సరా నుంచి  పలు ప్రాచీన భాషలకు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న  మన దేశంలో అది సాధ్యం కాదు. హిందీ దివస్‌ సందర్భంగా ఒకే దేశం-ఒకే భాష అని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ‘‘యావత్‌ భారతావనిని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం హిందీ భాషకు ఉంది. అంతర్జాతీయంగా భారత్‌కు విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలి. 2020 నుంచి హిందీ దివస్‌ను ఘనంగా జరుపుకుంటాం. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా హిందీకి మంచి గుర్తింపు తీసుకొస్తాం’’ అన్న షా మాటలను దేశ వ్యాప్తంగా సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకె అధినేత స్టాలిన్, సినీ హీరో కమల్ హాసన్, ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ వంటి పలువురు తప్పుపట్టారు. నిరసన వ్యక్తం చేశారు. మాతృభాషాభిమానం మెండుగా ఉన్న దక్షిణాది, ముఖ్యంగా తమిళనాడు నుంచి తీవ్రస్థాయిలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, లేదంటే మరో భాషా ఉద్యమానికి సిద్ధమవుతామని డిఎంకే పార్టీ వర్గాలు హెచ్చరించాయి. కర్ణాటకలో అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాషాభిమానులు రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 'ఒకే దేశం-ఒకే భాష' ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాగా  ఏచూరి పేర్కొన్నారు. దేశమంటే కేవలం హిందీ, హిందుత్వ కాదని.. వాటి కంటే  భారత్‌ ఎంతో విశాలమైందని అసదుద్దీన్ పేర్కొన్నారు. భారతీయులందరి భాష  హిందీ మాత్రమే కాదని, ఇక్కడ ఎన్నో సంస్కృతులు, ఎన్నో మాతృభాషలు ఉన్నాయని, ముందు వాటి అందాన్ని, భిన్నత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి అంటూ వ్యాఖ్యానించారు.  షా వ్యాఖ్యలు భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదాన్ని తెస్తాయని స్టాలిన్ హెచ్చరించారు. హిందీ భాషను దేశమంతా బలవంతంగా రుద్దాలనుకోవడం ముర్ఖత్వమని  ఎండీఎంకే అధ్యక్షుడు వైగో వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే హిందీ వద్దనుకునే రాష్ట్రాలు భారత్‌లో ఉండే పరిస్థితి లేదని  హెచ్చరించారు. జల్లికట్టుపై ఆందోళన కేవలం ఓ నిరసనలా సాగిందని, భాషా పోరాటం దానికంటే మహోగ్రంగా ఉంటుందని, అటువంటి మహోగ్ర భాషాపోరాటాన్ని భారత్ కోరుకోదని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

              పరిపాలనా సౌలభ్యం కోసం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని అంశాలు ఒకే రకంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలనాపరమైన అంశాలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండటం వల్ల వ్యయం తగ్గుతుంది. జమిలీ ఎన్నికలైతే ప్రభుత్వానికి, పార్టీలకు ఖర్చు తగ్గుతుంది. విద్యాపరంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు వంటివి  ఒకటే ఉంటే విద్యార్థులకు ఖర్చు తక్కువ, సౌలభ్యంగా ఉంటుంది. అలాగే చట్టాలు, పన్నులు, గుర్తింపు కార్డులు, కొన్ని సర్టిఫికెట్లు... వంటివి ఒకే రకంగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ’ఏక్తా భారత్‘ భావన కూడా నెలకొంటుంది. అయితే మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు విషయంలో అది సాధ్యం కాదు. ఆ రకమైన ఆలోచన మంచిదీ కాదు. మన దేశంలో 122 భాషలు, 19,500 మండలికాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకుగురైన వర్గాలు, అనేక మతాలు,  భాషలు, విభిన్న సంస్కృతులకు నిలయం భారత్. వీటికి తోడు ఇక్కడ వేళ్లూనుకున్న వేల కులాలు ఉన్నాయి.
దేశంలోని పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం తయారు చేయడం కోసం డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ తోపాటు దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు 284 మందితో రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా  పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు,  భారత్ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్ల పాటు ఆగవలసి వచ్చింది.  భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్  మూడేళ్ల కాలం అవిశ్రాంతంగా శ్రమించారు.  ఆయన కృషి ఫలితంగా 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దేశంలోని 22 షెడ్యూల్‌ భాషలకు రాజ్యాంగంలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 29 పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛను కల్పిచింది. రాజ్యాంగ రూపకల్పనలో మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తలకు విఘాతం కలిగించే విధంగా షా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై అనేకమంది ధ్వజమెత్తుతున్నారు. దేశంలో హిందీ భాషతో పాటు ప్రాచీనంగా ఉన్న అనేక భాషలు ఉన్నాయి. దక్షిణాధి భాషలు అంతకంటే ఎక్కువ ప్రాచీనంగా ఉన్నాయి. భాష, సంస్కృతి చాలా బలీయమైనవి. హిందీ రాజభాషగా గుర్తింపు పొందినా ప్రాంతీయ భాషలకు కూడా తగిన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది.  హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే గతంలో మాదిరి ఉధృతంగా మాతృభాషా ఉద్యమాలు జరుగుతాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...