ఏపీలో గ్రామ పాలన
సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఓ రికార్డ్ అయితే, ఇందుకోసం నిర్వహించిన పరీక్షలు కూడా మరో రికార్డ్. ఇప్పటి వరకు యూపీపీఎస్సీ ద్వారా 14 లక్షల మంది పరీక్షలు రాసిన రికార్డు ఉంది. హాజరు శాతం 50 వరకు ఉంది. అయితే గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షలకు దేశంలోనే తొలిసారిగా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. 88 శాతంకు పైగా హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ సచివాలయాల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇంటి పన్ను చెల్లింపు, కుల, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపు 35 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయం, పశుసంవర్థక, రెవెన్యూ, వైద్యం, ఉద్యాన, అటవీ, సంక్షేమం, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ... వంటి శాఖలకు సంబంధించిన సేవలన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ పథకాలు, సేవలు లబ్దిదారులకు అందడాన్ని మరింత సులభతరం చేస్తారు. తొలి దశలో 1500 చోట్ల సచివాలయ భవనాలను కూడా నిర్మిస్తారు. ఇప్పటికే ఆగస్ట్ 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైంది. లక్షా 93వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక్కరి చొప్పున ఈ వలంటీర్లు సేవలందిస్తారు. కుటుంబం, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు వారు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా ఇల్లు లేనివారికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తుంది. అలాగే ఇతర ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తారు. ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు వీరే ఇంటింటికి తిరిగి అందజేస్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు కూడా వీరే ద్వారానే అందజేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థ మొత్తం సమర్థవంతంగా పని చేసిననాడు గ్రామస్వరాజ్యం సాధించినవారమవుతాము.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment