Jun 10, 2019


మంత్రి మండలి నిర్ణయాలు
(10-06-2016 సోమవారం)

          సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం  సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా పాల్గొన్నారు.

పెద్ద పెద్ద నిర్ణయాలను కూడా కొద్ది సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తీసుకున్నారు.
మాది రైతు ప్రభుత్వం- రైతు ప్రభుత్వంలా కనిపించేలా ప్రభుత్వం పనితీరు ఉండాలి.

1.    అవినీతి రహిత పాలన :
ఏయే శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో పరిశీలించాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని  ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఏయేశాఖలో అవినీతి జరిగిందో గుర్తించి వాటిని ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరచాలని నిర్ణయం. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఎవరైనా చేయవచ్చు. టెక్నికల్ సపోర్టింగ్ టీమ్ వివిధ పనులకు సంబంధించిన వివరాలను జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడుతుంది. వారి సిఫారసుల్లో ప్రతి అంశాన్ని  ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి మండలిలో నిర్ణయం.

2.    నా ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారు అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  ఏ మంత్రిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే తక్షణమే తొలగింపు. మంత్రి పదవికి రెండున్నరేళ్లు గ్యారెంటీ ఉండదు.. అవినీతి మరక అంటితే ఏ క్షణమైనా తొలగించేందుకు నిర్ణయం.
3.    మాది రైతు ప్రభుత్వం. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంటుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది.
4.    రైతు భరోసా :
రైతు భరోసా పథకం అక్టోబర్ 15న ప్రారంభం అవుతుంది. ఈ పథకం కింద రైతుకు రూ.12,500 అందజేస్తారు. ఈ ఆర్థిక సాయాన్ని కమర్షియల్ బ్యాంకులు రైతులకు చెల్లించలేని పక్షంలో ప్రాథమిక సహకార బ్యాంకుల ద్వారా అందజేస్తాం.దీనికి సంబంధించి ఆర్థిక, వ్యవసాయ, పురపాలక శాఖ మంత్రులతో కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం.
5.    గ్రామ/ వార్డు వాలంటీర్లు :
ప్రతి ప్రభుత్వ పథకం గడప గడపకు చేరవేసే విధంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. ఆగస్ట్ 15న గ్రామ/ వార్డు వాలంటీర్ల నియామకం ఉంటుంది. గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్థ త్వరితగతిన ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం. గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2 నుంచి పని చేస్తాయి.  పట్టణ వాలంటీర్లు డిగ్రీ, గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంత వాలంటీర్లు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి.
6.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు :
 వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.  ఈ కమిషన్ కు ముఖ్యమంత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. 6 లేదా 7 మంది సభ్యులుంటారు. రైతు సంఘం నాయకులు, నిపుణులు ఈ కమిషన్ లో సభ్యులుగా ఉంటారు.
7.    వైఎస్సార్ వడ్డీలేని రుణాలు :
వ్యవసాయ పంట రుణాల (క్రాప్ లోన్)కు వడ్డీ లేదు. వడ్డీ కట్టలేని, కట్టని రైతులను బ్యాంకులు అడగొద్దని సూచన. రైతుల తరపున ప్రభుత్వమే ఈ వడ్డీ చెల్లిస్తుంది.  గ్రామ వాలంటీర్లు  ద్వారా ఇది అమలు జరుగుతుంది.

8.    ఇన్ పుట్ సబ్సిడీ :
 గత ప్రభుత్వం 2014-18 వరకు రూ.2000 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ చెల్లించలేదు. రైతు నష్టపోకుండా తక్షణమే దాన్ని రైతులకు తిరిగి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. గిట్టుబాటు ధరను సీజన్ ప్రారంభం (తొలకరి)లోనే ప్రకటిస్తారు. మార్కెట్ రేటు ప్రకారమే గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయం.

9.    ప్రకృతి వైఫరీత్యాల సహాయ నిధి(కెలామిటీ రిలీఫ్ ఫండ్) కు రూ.2000 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం

10.   రూ.3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి  ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయం

11.    ఉచిత బోర్లు:
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క నియోజక వర్గంలో ప్రాధాన్యత క్రమంలో రిగ్  లు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశం. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో  ఉచిత బోర్లు వేయడానికి అందుబాటులో ఉంచాలని ఆదేశం. ఇందు కోసం ప్రభుత్వం 200 రిగ్గులు కొనుగోలు చేస్తుంది.

12.    మద్దతు ధర :

ఈ సీజన్ లో ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని ఆరోపణలు కేబినెట్ దృష్టికి వచ్చాయి. ఆ సమస్యను వెంటనే సరి చేసి మద్దతు ధర రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. 

13.    రైతు బీమా :

రైతులకు కి 100 శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. ఇకపై ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. క్లెయిమ్ బాధ్యత ప్రభుత్వానిదే. రైతులపై ఎటువంటి భారం ఉండదు.  రైతుకు లబ్ధి చేకూర్చే వరకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

14.    గృహనిర్మాణాలు :

 ప్రతి గ్రామంలో అర్హత కలిగి ఇళ్లు లేని వారిని అందరినీ గుర్తించి ప్రభుత్వం ఆయా గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి  లబ్ధిదారులకు ఉగాది రోజున పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం. లబ్ధిదారులకు సంతృప్తి స్థాయి(సాచురేషన్)లో ఈ పథకం అమలు జరిగేలా నిర్ణయం. రిజిస్ట్రేషన్ ఆ ఇంటి ఇల్లాలి పేరుపైనే ఉండేలా మంత్రి మండలి నిర్ణయం. ఇల్లాలికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి.

15.    వైఎస్సార్ పేరు మీద రాబోయే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం. మొదటి సంవత్సరంలో స్థలాల ఎంపిక జరుగుతుంది. మిగతా నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయం.

16.    అమ్మఒడి :

బడికి తమ బిడ్డను పంపే ప్రతి తల్లికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించే అమ్మ ఒడి కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే)రోజున ప్రారంభం.ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల దేనికి పంపినా ఈ సహాయం చేస్తారు.

17.    సహకార రంగం అభివృద్ధికి కృషి
సహకార రంగం పునరుద్ధరణకు తక్షణమే చర్యలు. వెంటనే చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించాలని నిర్ణయం

18.    ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. ప్రత్యామ్నాయంగా ఆ ఉద్యోగులకే ఆ లబ్ధి చేకూరే లాగా చర్యలు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. లాభాపేక్ష లేని సంస్థలకు ఇచ్చి ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు.

19.    ఉద్యోగుల సంక్షేమం :

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1వ తేదీ నుండి 27 శాతం మధ్యంతర భృతిని(ఐఆర్) అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.815 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. తద్వారా 4.24 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.

20.    సీపీఎస్ రద్దు :

 సీపీఎస్ రద్దుకు  సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక శాఖ మంత్రి ఛైర్మన్ గా  కార్యదర్శులు  సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసి దీనిపై కార్యాచరణ రూపొందిస్తారు.

21.    కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ :

 అర్హతలు, అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం.. ఆర్ధిక శాఖ, విద్యుత్, వైద్య శాఖ, పంచాయితీ రాజ్, విద్యా శాఖ, పురపాలక శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశం

22.    శానిటేషన్(పారిశుద్ధ్యం):

 అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.18,000 జీతం ఇవ్వాలని కేబినెట్  నిర్ణయం. కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు

23.    వేతనాల పెంపు :

మెప్మా, సెర్ఫ్ లో రిసోర్స్ పర్సన్, యానిమేటర్లకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం

24.    అంగన్ వాడీలు, హోంగార్డులులకు తెలంగాణ రాష్ట్రం కంటే రూ. 1000 ఎక్కువ వేతనం ఇవ్వాలని నిర్ణయం. 

25.    పౌర సరఫరాలు:
ప్రస్తుతం రేషనింగ్ విధానంలో బియ్యం సరఫరా సక్రమంగా సాగడం లేదు. రిసైక్లింగ్ అవుతోంది. కాబట్టి ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కేబినెట్ నిర్ణయం. వీటిని 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు బ్యాగ్స్ కింద ప్యాక్ చేసి దీనితో పాటు 5 నిత్యవసర వస్తువులను గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారుని ఇంటికే చేర్చాలని నిర్ణయం. ఈ విధానాన్ని సెప్టెంబర్ కు 1 నుంచి అమలులోకి తీసుకురావాలని మంత్రి మండలి నిర్ణయం.

26.    పాఠశాలలకు కొత్త రూపు :

రాష్ట్రంలో 40వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత యథాస్థితిని ఫోటోలు తీసి వాటి  పంపాలి. తద్వారా వాటి స్థితిగతులను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా మౌలిక వసతులు కల్పించడం. అనంతరం సంపూర్ణంగా పాఠశాలలను ఆధునీకరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం

27.    మధ్యాహ్నా భోజన పథకం :

సెంట్రలైజ్డ్  కిచెన్ ఏర్పాటు చేయడం.. 40 కి.మీ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు వేడివేడిగా గుడ్డుతో సహా భోజనం అందించాలని నిర్ణయం వంట వారికి ఎటువంటి నష్టం లేకుండా, ఆందోళన చెందకుండా  భోజనాల వడ్డించే బాధ్యతను అప్పగించి వారిని నెలకు 3 వేల రూపాయల వేతనం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం

28.     రాష్ట్ర విద్యా క్రమబద్దీకరణ కమిషన్ ఏర్పాటు: ఈ కమిషన్ ఏర్పాటు ద్వారా విద్యా పర్యవేక్షణ, సహేతుకమైన ఫీజు... నాణ్యమైన విద్య, ఆర్ టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) వంటి అన్ని అంశాలను సమీక్షించి మంచి విద్యా విధానాన్ని రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయం.

29.    విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు :

 విద్యా సంస్కరణల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. దీని ద్వారా విద్యా వ్యవస్థ, ఫీజులు, మౌలిక వసతులు కల్పన, తీసుకురావాల్సిన మార్పులు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.

30.    ప్రతి ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఫ్రీ సీట్లు పేద, మధ్య తరగతి వారికి తప్పనిసరిగా కేటాయించేలా గట్టి చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమత్రి ఆదేశం.

31.    అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు స్థానిక శాసన సభ సభ్యుడు ఛైర్మన్ గా సలహా సంఘం ఏర్పాటు. ఆస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు.

32.    సరిగా లేని 108, 104 వాహనాలు స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాలని మంత్రి మండలి నిర్ణయం. దీనికి వైద్య, రవాణా శాఖలు సంయుక్తంగా బాధ్యతను తీసుకోవడమే కాక 20 నిమిషాల్లో వైద్య సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం.

33.    ఆశా వర్కర్ల వేతనాల పెంపు :

ఆశా వర్కర్ల వేతనాన్ని 3 వేల రూపాయల నుండి 10 వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆశావర్కర్ల లాగే పని చేస్తున్న 7200 మందికి వేతనాన్ని 400 నుండి 4 వేల రూపాయలకు పెంపు

34.    అంగన్ వాడీ కార్యకర్తల వేతనాల పెంపు:

 అంగన్ వాడీ కార్యకర్తలకు వేతనం 10,500 రూపాయల నుండి 11,500 రూపాయలకు పెంపు. ఆయాకు 6 వేల నుండి 7 వేలకు పెంపు

35.    అవినీతికి తావులేని ఇసుక విధానాన్ని అమలు చేయలని నిర్ణయం. ప్రస్తుత విధానాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఇసుక మాఫియా సమూలంగా నిర్మూలించాలి. ఆదాయం ప్రభుత్వానికి వచ్చేలా వచ్చే కేబినెట్ లో సమగ్ర విధానంపై చర్చ. వ్యక్తులకు కాకుండా ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు సరసమైన ధరకు లభించేలా చర్యలు.

36.    ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం

 ఆర్టీసీని రాష్ట్ర  ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్  పర్యవేక్షిస్తారు. ఈ కమిటీలో రవాణా, ఆర్థిక శాఖా మంత్రులు ఉంటారు. వీరితో పాటు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు అవుతుంది. ఈ రెండు కమిటీలు సంయుక్తంగా చర్చించి ఉత్తమ విధానంతో ముందుకు వస్తారు. ప్రస్తుతం ఆర్టీసీ 6,373 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. 53 వేలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వీటికి అవసరమైన నిధులను సమీకరించే ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు.

37.    విద్యుత్ ఒప్పందాల పున:సమీక్ష:

ఇప్పటివరకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అవినీతి రహిత విధానాన్ని రూపొందించే దిశగా విద్యుత్ శాఖా మంత్రి, అధికారులు ఒక నివేదిక తయారు చేసి కేబినెట్ కు సమర్పించాలని ఆదేశం.

38.    విద్యుత్ కోతల్లేకుండా చూడాలి. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించే  దిశగా విద్యుత్  శాఖా మంత్రి ఒక కార్యాచరణ రూపొందించి ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తేవాలో వెల్లడిస్తారని మంత్రి మండలిలో చర్చించాం.

39.    ఆరోగ్య శ్రీ : 

ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు. ఎక్కువ వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయం

40.    ఆవులు, గేదెల ఇన్సూరెన్స్ :

ఒక్కో రైతుకు 5 పశువుల వరకు 15-30 వేల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయం. గుజరాత్, హర్యానాలో ఇటువంటి బీమా పథకం ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. 

41.    డెయిరీల బలోపేతం :

పాల ఉత్పత్తి కేంద్రాలను బలోపేతం చేసి పునరుద్ధరించేలా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి  ఆదేశించారు. సహకార చట్టాలను కొంత మంది వ్యక్తులు కట్టుదిట్టం చేసుకున్నారని దీన్ని పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం.

42.    అగ్రిగోల్డ్ :

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు లబ్ధి చేసేందుకు తక్షణమే 1150 కోట్ల రూపాయలను కోర్టులో జమ చేయాలని మంత్రి మండలి నిర్ణయం. 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేయాలని నిర్ణయం.

43.    వేరుశెనగ విత్తనాల పంపిణీ : వేరుశెనగ విత్తనాల పంపిణీ అనంతపురం జిల్లాలో సక్రమంగా జరగడం లేదని కేబినెట్ దృష్టికి రావడంతో వెంటనే  విత్తనాల పంపిణీ రేపటి నుంచే జరగాలని ముఖ్యమంత్రి  ఆదేశం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...