నిన్న సోమవారం(31.10.2022) నేను అమరావతిలోని విట్(వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్శీటీకి వెళ్లాను. మా బంధువుల అమ్మాయికి కన్వీనర్ కోటాలో అక్కడ సీటు వచ్చింది. ఆ అమ్మాయిని చేర్చడానికి వెళ్లాను. ఇదేమిటి స్మశానంలో యూనివర్శిటీ అనుకుంటున్నారా? ఇది నిజంగా ప్రపంచ ర్యాంకింగ్ యూనివర్సిటీయే. గ్రాఫిక్ కాదు. ఇందులో కనిపించేవి నిజమైన భవనాలే. ఇక్కడ దెయ్యాలు గట్రా తిరగవు. ఇక్కడ రెండు వేల మందికి పైగా విద్యార్థులు, వారికి బోధించే అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. మన దేశంలోని నలుమూలకు చెందిన వారే కాకుండా విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇది నిజమైన యూనివర్శిటీయే అని మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు. ఆ విషయం వదిలివేయండి.
Nov 1, 2022
విశ్వవిద్యాలయాలతో నా అనుబంధం
నిన్న సోమవారం(31.10.2022) నేను అమరావతిలోని విట్(వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్శీటీకి వెళ్లాను. మా బంధువుల అమ్మాయికి కన్వీనర్ కోటాలో అక్కడ సీటు వచ్చింది. ఆ అమ్మాయిని చేర్చడానికి వెళ్లాను. ఇదేమిటి స్మశానంలో యూనివర్శిటీ అనుకుంటున్నారా? ఇది నిజంగా ప్రపంచ ర్యాంకింగ్ యూనివర్సిటీయే. గ్రాఫిక్ కాదు. ఇందులో కనిపించేవి నిజమైన భవనాలే. ఇక్కడ దెయ్యాలు గట్రా తిరగవు. ఇక్కడ రెండు వేల మందికి పైగా విద్యార్థులు, వారికి బోధించే అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. మన దేశంలోని నలుమూలకు చెందిన వారే కాకుండా విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇది నిజమైన యూనివర్శిటీయే అని మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు. ఆ విషయం వదిలివేయండి.
Oct 30, 2022
Oct 22, 2022
దూకుడు పెంచిన చంద్రబాబు
పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నాదెండ్లలో, నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రత్తి పంటను చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పొలం గట్లపై యువకుడిలా నడిచారు.ఓ చిన్న కాలవను ఎగిరి గంతేసి మరీ దాటారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు పర్యటనలో భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.నరసరావుపేట, గురజాల బహిరంగ సభలకు జనం భారీగా తరలి వచ్చారు. ఆ జనసమూహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆవేశంతో విజయోత్సాహంతో ప్రసంగించారు. ప్రజలను ఉత్తేజపరిచారు.
ఇక పవన్, చంద్రబాబు ఇంత కాలం తరవాత కలవడంతో రాజకీయ పొత్తులపై చర్చించుకోవడం మొదలైంది. అయితే, పొత్తుల ప్రస్తావన రాలేదని ఇరు పార్టీల నేతలు చెప్పారు. ప్రస్తుతానికి పొత్తుల ప్రసక్తిలేకపోయినా వారు కలిసి పోరాడటానికి సిద్ధమయ్యారు. దీనిని పొత్తుకు మొదటి అడుగుగా భావించవచ్చు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
Oct 18, 2022
హిజాబ్ మత వివాదం కాదు హక్కులు,స్వేచ్ఛ సమస్య
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశమంతా వ్యాపించి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. మతాచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించిన ఈ సున్నితమైన అంశం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వాలు,వర్గాలు, మతాల మధ్య చిచ్చుకు దారితీసింది. కర్ణాటక ఉడిపి జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీకి కొందరు ముస్లిం విద్యార్థినులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో హిజాబ్ ధరించి రావడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను తరగతులకు అనుమతించలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఏకంగా కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఈ వివాదం మరింత ముదిరింది. ఉడిపి జిల్లా నుంచి కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. ప్రతి రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ధరించడం తమ మత ఆచారమని ముస్లింల వాదన. వాస్తవానికి ఇది మతానికి సంబంధించిన అంశమైనప్పటికీ, వివాదం మాత్రం మతాల మధ్య కాకుండా రెండు వర్గాల మధ్యే తలెత్తింది. రెండు వర్గాల వారూ ఆందోళనకు దిగారు. నిరసనలు, విద్యార్థుల సస్పెన్షన్, ధర్నాలు, ఆందోళనలు, పోలీస్ కేసులు, అరెస్టులు.. పెద్ద దుమారమే చెలరేగుతోంది.
హిజాబ్ ధరించడం ముస్లిం విద్యార్థినులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని, ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ మార్చి 15న సంచలన తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిని సుప్రీం కోర్టులోని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 10 రోజులు విచారించింది. ఈ ధర్మాసనం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ నెల 13న ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ జస్టిస్ ధూలియా తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు.చివరకు ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్కు నివేదించారు. ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం రెండు మతాల మధ్య చిచ్చుకు దారి తీసింది. ఇరు మతాల వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.తాము రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటామని అంటారని, అయితే, తాము రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ఇద్దరు భార్యలకు గౌరవంగా చూస్తామని ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు. కానీ, హిందువులు ఒకరినే వివాహం చేసుకుని, మరో ముగ్గురు ఉంపుడుగత్తెలను ఉంచుకుంటారని, భార్యకు గానీ, ఉంపుడుగత్తెలకు గానీ గౌరవం ఇవ్వరని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఇది మతం సమస్యకాదు. హక్కుల సమస్య. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరా? ముస్లింలు అందరూ హిజాబ్ ధరిస్తారా? అన్న ప్రశ్నలు ఇక్కడ ముఖ్యం కాదు. ఈ వివాదం పూర్తిగా మహిళల హక్కులకు సంబంధిచినదే. ఎందుకంటే ఇరాన్లో బహిరంగ ప్రదేశాలలో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. దానిని అక్కడ మహిళలు వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్ ను వ్యతిరేకిస్తూ ఇరాన్లో మహిళలు రోడ్డెక్కారు. దేశంలోని అత్యధిక నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 35 మంది మృతి చెందారు.వందలాది సామాజిక కార్యకర్తలను, రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు అరెస్టులు చేశారు.ఇదే సమయంలో కాలేజీల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ భారత్లో కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడి ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరాన్లోని మహిళలు తాము హిజాబ్ ధరించం అని ఆందోళనలకు దిగినే, ఇక్కడ భారత్లోని విద్యార్థినులు తాము హిజాబ్ ధరిస్తామని ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ, ఇక్కడ నిరసలు, ఆందోళనలు చేసేవారు ముస్లింలే. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా, ఇరుదేశాల మహిళలు హక్కుల గురించే మాట్లాడుతున్నారు. తమ హక్కులకు, స్వేచ్ఛకు ప్రభుత్వాలు భంగం కలిగిస్తున్నాయనే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హిజాబ్ను ధరించడం, ధరించకపోవడం మహిళల ఇష్టాఇష్టాలకు, స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వారు వాదిస్తున్నారు. వారికి, వీరికి ఇద్దరికీ మనదేశంలోని మహిళా హక్కుల కార్యకర్తలు మద్దతు పలుకుతున్నారు. ఈ చర్యలు మహిళల హక్కులను హరించడమేనని వారు పేర్కొంటున్నారు. ఇరాన్లో ఇస్లాం పేరుతో మహిళలపై బలవంతంగా హిజాబ్ను రుద్దడం, భారత్లో యూనిఫామ్ పేరుతో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించకూడదని చెప్పడం ప్రభుత్వాలు మహిళలను నియంత్రించడానికి చేసే ప్రయత్నాలలో భాగమేనని మండిపడుతున్నారు. మహిళలు ధరించే దుస్తులపై ప్రభుత్వాల నియంత్రణ ఏమిటని అడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం కోర్టువైపే ఉంది. ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఉంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్టు. 944022914
Oct 14, 2022
హిందీ భాషపై దుమారం
దక్షిణాదిన తీవ్ర నిరసన
విద్యావేత్తల ఆందోళన
భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ప్రతీకగా నిలిచే భారత్లో ఏ ఒక్క భాషనైనా ఇతర భాషల కంటే ఎక్కువ చేసినా అది దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల భాషలను అధికార భాషలుగానే కేంద్రం పరిగణించాలని, హిందీని తప్పనిసరి చేసే ప్రయత్నం చేయొద్దని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధానిని కోరారు. దేశంలో హిందీ భాషను మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రం తన ప్రయత్నాలను విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని స్టాలిన్ హెచ్చరించారు. మరో సారి హిందీ వ్యతిరేక ఉద్యమం రావాలని తాము కోరుకోవడం లేదని డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. హిందీని అభివృద్ధి చెందని రాష్ట్రాల భాషగా డీఎంకేకు చెందిన మరో ఎంపీ ఇళంగోవన్ పేర్కొన్నారు.పశ్చిమబెంగాల్, గుజరాత్,మహారాష్ట్ర,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా లేదన్నారు.
హిందీ భాషను బలవంతంగా రుద్దితే దేశం ముక్కలవుతుందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎఎస్ అళగిరి కేంద్రాన్ని హెచ్చరించారు.బీజేపీ పాలనలో హిందీని అధికార భాషగా రుద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భారత్కు జాతీయ భాష అంటూ ఏదీ లేదని, ఇతర అధికారిక భాషల మాదిరిగానే హిందీ కూడా ఓ అధికారిక భాష మాత్రమేనని తెలంగాణ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హిందీని రాష్ట్రాలపై రుద్దడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.
రాజకీయ పార్టీల నేతలే కాకుండా విద్యావేత్తలు కూడా ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకొని ఉద్యోగాలు సంపాదించాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే యువత మనుగడ కష్టమని, హిందీని రుద్దడమంటే భావి పౌరుల జీవితాలతో ఆడుకోవడమేనన్న భావన వారిలో నెలకొంది. ప్రాంతీయ భాషలకు, మాతృభాషలకు ప్రాధాన్యత కలిగిన భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశంలో ఇలాంటి నిర్ణయాల వల్ల విద్యా,ఉపాధి పరంగా ఇబ్బందులు తలెత్తడమేకాకుండా ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
Oct 8, 2022
మదరాసీలు - తెలుగువారు
పొట్టి శ్రీరాములు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి.
ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రా న్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేశారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు.
తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది.
ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.
గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక.... రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యం శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. ఆ త్యాగజీవి కీ.శే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది.
Sep 18, 2022
దటీజ్ బాలకృష్ణ!
నందమూరి అందగాడు, నటరత్న, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కుమారుడు, నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినా బాలకృష్ణ తన నటనా ప్రతిభతో నటుడిగా ఉన్నత శిఖరాలధిరోహించారు. తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన యువరత్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అనేక వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఆయన పౌరాణిక, జానపద, సాంఘిక, సైన్స్ ఫిక్షన్ వంటి 106 చిత్రాలలో నటించారు.నట సింహంగా పేరు పొందిన బాలకృష్ణను కుటుంబ సభ్యులు,అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు.
ఫ్యాక్షన్ డైలాగులు చెప్పడంలో దిట్టగా పేరొందిన బాలయ్య 1960లో జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు జన్మించారు. చెన్నై టీనగర్ బజుల్లా రోడ్డులోని హాస్యనటుడు శివరావు ఇంటిని 1953లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో ఉండగానే బాలకృష్ణ జన్మించారు. ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం. ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆరవ కుమారుడైన బాలకృష్ణ తల్లిదండ్రుల చెప్పుచేతల్లో ఎంతో క్రమశిక్షణగా పెరిగారు. బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాదులోనే గడిచింది. ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే నటుడు కావాలని ఆయన అనుకున్నారు. అయితే, కనీసం డిగ్రీ పూర్తి చేయాలన్న తండ్రి కోరిక మేరకు హైదరాబాద్ నిజాం కళాశాలలో బీఏ చదివారు.
1982 డిసెంబరు 8న బాలకృష్ణ వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు బ్రాహ్మణి, తేజస్విని, ఒక కుమారుడు తారకరామ తేజ మోక్షజ్ఞ. బాలకృష్ణ 14 సంవత్సరాల వయసులోనే 1974లో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించారు. తర్వాత తండ్రితో కలిసి ఎక్కువ చిత్రాలలో నటించారు. బాలకృష్ణ తండ్రి దర్శకత్వం వహించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాలలో నటించారు. తండ్రి ద్వారా అపారమైన నటనానుభవాన్ని గఢించారు.
దానవీరశూర కర్ణ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు దర్శకుడైన ఎన్టీఆర్ హరికృష్ణ, బాలకృష్ణల చేతకూడా సెట్ పనులు చేయించారు. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ సెట్ లో బాయిస్ తో పనిచేయిస్తూ ఎన్టీఆర్ కు కనిపించారు. అది చూసి ఆయన సెట్ లో పనులు చేయించడమేకాదు, మనం కూడా చేయాలని అని చెప్పారు. ఒక్క సెట్ వర్కే కాదు, లైట్ బాయ్, ప్రొడక్షన్, మేకప్, కాస్ట్యూమ్ తదితర పనులు చేసే అందరితోపాటు సినీ పరిశ్రమలోని అందరినీ గౌరవించాలి. మన ఎదుగుదలలో అందరి కృషి ఉంటుందన్నారు. అందరినీ సమానంగా చూడాలని చెప్పారు. చెప్పిన సమయం కంటే ముందే సెట్ కు రావాలని కూడా చెప్పారు. అప్పటి నుంచి బాలకృష్ణ తండ్రి మాటలను శిరోధార్యంగా భావించారు. అందరినీ గౌరవించేవారు.
దాన వీర శూర కర్ణ సినిమాలో హరికృష్ణ కుమారుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ‘రామ్ రహీమ్’ చిత్రంలో నటించారు.1984లో రూపొందించిన సాహసమేజీవితం చిత్రంతో బాలయ్య కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మొదలైంది. అక్కడ నుంచి కమర్షియల్ చిత్రాలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఆ తరువాత యాక్షన్, ఫ్యాక్షన్ చిత్రాలలో నటించి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. కత్తి పట్టి, డైలాగ్ చెప్పి, కంటి చూపుతో కలెక్షన్లలో రికార్డులు సృష్టించారు.యాక్షన్, డ్యాన్సులు, ఫైట్స్, హావభావాల ప్రదర్శన,డైలాగ్స్ చెప్పడంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్నారు. సమరసింహారెడ్డి చిత్రంతో ఫాక్షన్ చిత్రాలకు ఓ ఊపు తెచ్చారు. అప్పటి నుంచి బాలయ్యలోని నటసింహం జూలు దులిపింది. బాలయ్య తొడకొట్టినా, మీసం తిప్పినా రచ్చరచ్చే.బాలకృష్ణ సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులకు పండగే. థియేటర్లు హౌస్ ఫుల్. కలెక్షన్ల వర్షం.
1974లో తాతమ్మ కలలో బాలయ్యకు తాతమ్మగా నటించిన విలక్షణ నటి భానుమతి, మళ్లీ పది సంవత్సరాల తరువాత 1984లో మంగమ్మగారి మనవడు చిత్రంలో నానమ్మగా నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.బాలయ్యకు మంచిపేరు తెచ్చిపెట్టంది. బాలయ్య సినీజీవితంలో గొప్ప మలుపు అది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. ఆ తరువాత కథానాయకుడు,భార్యాభర్తల బంధం,నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వసహోదరులు, భార్గవరాముడు,మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు,నారీనారీ నడుమ మురారి, లారీడ్రైవర్, ఆదిత్య 369, భైరవద్వీపం, బొబ్బిలి సింహం,శ్రీకృష్ణార్జున విజయం, ముద్దుల మొగుడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా,శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమీపుత్రశాతకర్ణి, రూలర్ వంటి చిత్రాలలో నటించారు. బాలయ్య 106వ చిత్రం అఖండ భారీ కలెక్షన్లతో ఘన విజయం సాధించింది.
బాలకృష్ణ నటనతోపాటు నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించారు. ‘సుల్తాన్, బాల గోపాలుడు, ‘అల్లరి పిడుగు, ప్రాణానికి ప్రాణం సినిమాలకు సమర్ఫకుడిగా వ్యవహరించిన బాలకృష్ణ తండ్రి జీవితంపై తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా మారడమే కాకుండా, ఆ చిత్రాలలో తానే హీరోగా నటించారు. నందమూరి వారసుడిగా సినిమా రంగంలో తండ్రి ఎన్టీఆర్ నటించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు,దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక,చారిత్రక పాత్రలను పోషించారు. మెప్పించారు. ఒక రకంగా అది బాలకృష్ణకు అదృష్టంగా భావించవచ్చు. సినిమా రంగంలో తండ్రి పేరు చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ఎదుగుతూ వచ్చారు. అందంలో తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ఉంటారు. అందువల్లే బాలయ్యను అభిమానులు నందమూరి అందగాడు అని పిలుచుకుంటారు.
ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా, రావణుడిగా, బాలయ్య హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో తండ్రి కొడుకులు ద్విపాత్రాభినయం చేయడం ఒక ప్రత్యేకత. అది ఒక రికార్డు.
హీరోయిన్ విజయశాంతితో అత్యధికంగా 17 చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు.వెండితెరపై ఈ జంటకు మంచిపేరొచ్చింది.ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో బాలయ్య హీరోగా నటించారు. అందులో 9 చిత్రాలు హిట్టయ్యాయి. బాలయ్య 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’కి కోదండరామిరెడ్డే దర్శకులు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 7 చిత్రాల్లో నటించారు. 1987లో ఒకే సంవత్సరంలో బాలకృష్ణ నటించిన 8 సినిమాలు విడుదలవడం విశేషం.బాలయ్య సినీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కుంగిపోలేదు. అలాగే, ఘనవిజయాలు సాధించినప్పటికీ పొంగిపోలేదు.
బాలకృష్ణకు తను నటించిన చిత్రాలలో సమర సింహారెడ్డి అంటే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే రజనీకాంత్ ముత్తు, అమితాబచ్చన్ అగ్నిపథ్, చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి అంటే బాలయ్యకు ఇష్టం.బాలకృష్ణ పైసావసూల్ సినిమా కోసం మొదటిసారి పాట పాడారు. పాండురంగడు చిత్రంలో మాతృదేవోభవా అన్న సూక్తి మరిచాను అనే పాటలో పశ్చాత్తాప పడిన కొడుకు పాత్రలో బాలకృష్ణ జీవించారు. ఈ పాటకి థియేటర్లలో ప్రేక్షకులు కన్నీటిపర్యంతమయ్యారు.
తెలుగులో తొలి టైమ్ మిషన్ నేపథ్యం గల సినిమా ‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటన అమోఘం.ఈచిత్రాన్ని ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
మొత్తం 15 చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ‘అధినాయకుడు’లో తాతా,తండ్రి,మనవడుగా మూడు పాత్రల్లో నటించారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో మూడు సినిమాలు ‘భార్యభర్తల అనుబంధం, ‘గాండీవం’, శ్రీరామరాజ్యంలలో నటించారు. బాలయ్య కృష్ణ, కృష్ణంరాజులతో కలిసి సుల్తాన్ చిత్రంలో నటించారు. బాలకృష్ణ అతిథి పాత్రలో ఒకే ఒక చిత్రం ‘త్రిమూర్తులు’లో నటించారు. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు,కృష్ణంరాజు,చిరంజీవి, నాగార్జున కూడా అతిథి పాత్రలలో నటించారు.
బాలయ్య స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ‘నర్తనశాల’ సినిమా నిర్మాణం సౌందర్య మరణంతో ఆగిపోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో దాదాపు 80 శాతం షూటింట్ పూర్తి అయిన ‘విక్రమ సింహ భూపతి’ సినిమా వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేదు. బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. జై బాలయ్య అని పేరు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా దీని టీజర్ విడుదల చేశారు. అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. బాలయ్య ఆగస్టు 30, 2022 నాటికి తన నటప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
బాలయ్య బాబు ఆహా టీవీలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రొగ్రామ్ను కూడా విజయవంతంగా నిర్వహించారు. తన స్టైల్లో పంచ్ మీద పంచ్ వేస్తూ హాస్యం పండిస్తూ సరదా సరదాగా నడిపారు. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడతారని, ఓపెన్ గా ఉంటారని,బాలయ్యది చిన్న పిల్లవాడి మనస్తత్వం అని అతని సన్నిహితులు చెబుతారు. సినిమా సెట్ లోకి రాగానే చిత్ర బృందంలోని వారందరికి విష్ చేయడం బాలయ్య బాబుకు
అలవాటు.తండ్రి మాదిరిగానే బాలయ్య తెల్లవారు జామున 3.30 గంటలకే నిద్రలేస్తారు. యోగా,వ్యాయామం చేస్తారు. సేవారంగంలో కూడా బాలయ్య ముందున్నారు.హైదరాబాద్ లోని వారి తల్లిగారి పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నందమూరి బసవతారకం-రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ పాలకమండలి ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రిని లాభాపేక్షలేకుండా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తోన్న ఆస్పత్రిగా నీతి అయోగ్ కూడా దీనిని గుర్తించింది.
అన్ని విషయాలలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. తండ్రి మూడుసార్లు గెలిచిన అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచే బాలయ్య 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
బాలకృష్ణ 2001లో నరసింహానాయుడు, 2010లో సింహా, 2014లో లెజెండ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు మూడు అందుకున్నారు. 1994లో భైరవద్వీపం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, పాండు రంగడు చిత్రానికి సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు, సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు ఉత్తమ నటుడిగా భరతముని అవార్డులు,లెజెండ్ చిత్రానికి ఉత్తమ కథానాయకునిగా దక్షిణ భారత సినిమాటోగ్రాఫర్స్ అవార్డు అందుకున్నారు. 2007లో అక్కినేని అభినయ పురస్కారంతో బాలయ్యను సత్కరించారు. ఇంకా సంతోషం, సీమా, సిని‘మా’, టీఎస్ఆర్ నేషనల్ అవార్డులు వంటివి అనేకం అందుకున్నారు.
ఇప్పటి వరకూ ఒక్క వ్యాపార ప్రకటనలో కూడా నటించకపోవడం బాలయ్య ప్రత్యేకత. నాకు ఈ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే. వారిచ్చిన ఇమేజ్ను మన స్వార్థం కోసం ఉపయోగించకోకూడదన్నదే నాన్న ఎన్టీఆర్ గారి అభిప్రాయం. ఆయన బాటలోనే నేను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించలేదని చెప్పారు. దటీజ్ బాలకృష్ణ.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...








