సచివాలయం, ఫిబ్రవరి 15: శాసన
మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి శుక్రవారం
సాయంత్రం రాజీనామా చేశారు. శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావుకు ఆయన తన
రాజీనామా లేఖని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభకు పోటీ చేయాలన్న
ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను సర్వేపల్లి శాసనసభ
నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు.
Feb 15, 2019
Feb 14, 2019
హస్తినలో ఆంధ్రుల సత్తా చాటిన చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినలో ఆంధ్రుల సత్తా మరోసారి చాటారు. 68 ఏళ్ల వయసులో కూడా పోరాట పటిమ ప్రదర్శించారు. ధర్మపోరాట దీక్ష ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఢిల్లీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తింది. స్వామి కార్యంతోపాటు స్వకార్యం అన్నట్లు, రాష్ట్ర సమస్యకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంతోపాటు బిజేపీఏయతర రాజకీయ పార్టీల మధ్య బంధాన్ని పఠిష్టం చేసి విజయం సాధించారు. మనకి దేశ వ్వాప్తంగా భరోసా లభించింది. సమాఖ్య వ్యవస్థ బలపడటానికి అవకాశం ఏర్పడింది. ఈ క్రెడిట్ వంద శాతం చంద్రబాబుకే దక్కుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగడుతూనే ఉన్నారు. మొదట రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ధర్మపోరాట దీక్షలు చేశారు. అన్ని దీక్ష సభలలో 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా వచ్చిన మోడీ తిరుపతిలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను ప్రదర్శించారు. 2018 ఏప్రిల్ 20న తన పుట్టిన రోజున విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆహారం తీసుకోకుండా ధర్మపోరాట దీక్ష చేశారు. దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా పుట్టినరోజున రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేసి చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకతను చాటుకున్నారు. 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ఏప్రిల్ 30న తిరుపతిలో ధర్మపోరాట దీక్ష బహిరంగ సభ నిర్వహించారు. అప్పటికి సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ 2014 ఏప్రిల్ 30న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఆ రోజు అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తరువాత మే 22న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కశాశాల మైదానంలో, జూన్ 29న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలో, జూలై 29న ఒంగోలులో, సెప్టెంబర్ 29న తాడేపల్లిగూడెంలో, అక్బోబర్ 30న కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం సమీపంలో, నవంబర్ 20న నెల్లూరు ఎస్ విజీఎస్ కాలేజ్ గ్రౌండ్లో, డిసెంబర్ 26న అనంతపురంలో ధర్మపోరాట దీక్షలు చేశారు. కేంద్ర ఉలిక్కిపడేలా సభలు నిర్వహించారు. అన్ని చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జనం భారీ స్థాయిలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. అన్ని సభలలో ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి చంద్రబాబు నాయుడు నిరసన తెలిపారు. పక్షపాత ధోరణిని ఎండగట్టారు. రాజధాని అమరావతి, పోలవరం బహుళార్ధ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులివ్వాలని, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఉండి ఉంటే 90 శాతం గ్రాంటు వచ్చేదని, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏపీకి ఎందుకివ్వరు? అని ప్రశ్నించారు. నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హామీలని, వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని, సర్దార్పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారని వివరించారు. కేంద్ర నమ్మకద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 11న దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ధర్మపోరాట దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాన్ని మరో సారి మారు మ్రోగించారు. దీక్షకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ‘‘నాకు గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రతినిధిని, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడిని. నేను కోరేది నాకు న్యాయం చేయమని కాదు, నా రాష్ట్రానికి న్యాయం చేయమని. మా హక్కులు నెరవేర్చమని, విభజన చట్టంలో ఉన్న 18 అంశాలు అమలు చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసిన చంద్రబాబు హస్తినలో కూడా దీక్ష చేసి ప్రత్యేక హోదా అంశానికి జాతీయ స్థాయి ప్రాధాన్యత కల్పించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేసి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. దేశం నలుమూలల నుంచి జాతీయ స్థాయి నేతలు, రాజకీయ ఉద్దండులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, మూలాయం సింగ్, శరద్ యాదవ్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, శత్రుఘ్న సిన్హా వంటి వారు కదిలివచ్చి మద్దతు తెలిపారు. అయితే రాష్ట్రం కోసం జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఉభయ కమ్యూనిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్, కొత్త పార్టీ జనసేన మద్దతు ప్రకటించలేదు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914
Feb 13, 2019
ప్రజా రాజధాని అమరావతి పుస్తకం ఆవిష్కరించిన సీఎం
సచివాలయం, ఫిబ్రవరి 13 : సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రాసిన ‘ప్రజా రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం సచివాలయంలోని 1వ బ్లాక్ లో ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుంచి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల ఏర్పాటు, ల్యాండ్ పూలింగ్ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నిటినీ ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్ కాంప్లెక్స్ భవనం, విట్ భవనాల వరకు అన్ని ఫొటోలు ఇందులో ఉన్నాయి. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి అభినందించారు.
రాష్ట్రం కోసం దీక్ష చేస్తే, ఖర్చులపై
దుష్ప్రచారం
మంత్రి కాలవ శ్రీనివాసులు
సచివాలయం, ఫిబ్రవరి 13: రాష్ట్రం కోసం ఢిల్లీలో చేసిన
ధర్మపోరాట దీక్ష ఖర్చుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సమాచార, పౌర
సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా
కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర
ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల వారు ఈ దీక్షలో పాల్గొన్నారని
తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి ఒకటి, రాయలసీమ నుంచి ఒకటి రెండు రైళ్లు పెట్టామన్నారు.
రైళ్లకు రూ.కోటీ 23 లక్షలు, ఏపీ
భవన్లో రూ. కోటీ 60 లక్షలు మొత్తం రూ.2 కోట్ల 83 లక్షలు ఖర్చయినట్లు మంత్రి వివరించారు.
అయితే ప్రతిపక్షాలు రూ.10 కోట్లు ఖర్చయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వారి విమర్శ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుందన్నారు. మనం రాష్ట్రం కోసం ఈ దీక్ష చేశామని చెప్పారు. 2011 సెప్టెంబరు 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
నరేంద్ర మోదీ ‘సద్భావన మిషన్’ పేరుతో
మూడు రోజుల పాటు చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష ఖర్చు కంటే చాలా ఎక్కువన్నారు. అది
ఆయన తన సొంతానికి, పార్టీ ప్రయోజనాల కోసం చేసిన దీక్షగా
పేర్కొన్నారు. మన
ధర్మపోరాటం ఏపీకి చెందిన ఐదు కోట్ల ప్రజల కోసం చేసిన దీక్ష అని మంత్రి కాలవ
అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు
మంత్రి మండలి నిర్ణయం
Ø ప్రతి
రైతు కుటుంబానికి రూ.10వేలు
Ø ప్రతి
డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్
సచివాలయం, ఫిబ్రవరి 13: వ్యవసాయానికి
ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయం 1వ బ్లాక్ లో సమావేశమైన మంత్రి మండలి
నిర్ణయించింది. సమావేశం అనంతరం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు
మీడియాతో మాట్లాడుతూ మంత్రి మండలి నిర్ణయాలను వివరించారు. వ్యవసాయ రంగంలో నూతన
ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు సమగ్ర విధానం రూపొందించడానికి, వ్యవసాయ, ఉద్యానవనాల
విద్య క్రమబద్ధీకరణకు ఉద్దేశించి ఈ మండలి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర,
తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా మండలిలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇకపై
అగ్రికల్చర్, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరన్నారు.
వీరి సర్వీసులను పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటివరకు లేదని చెప్పారు. దీనికి
సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయ విద్య
మరింత నాణ్యత, నైపుణ్యత, సాంకేతికతతో
కూడిన విధంగా చేయడానికి ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయ
విద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారి సర్టిఫికేట్లు పరిశీలించి నకిలీ సర్టిఫికేట్లను
ఏరివేసే కార్యక్రమం కూడా మండలి చేపడుతుందన్నారు. వ్యవసాయ కోర్సులను నిర్వహించే
కళాశాలలకు సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా సక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారా
లేదా సర్టిఫికేట్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా తదితర అంశాలను తనిఖీ చేసే పూర్తి అధికారం
వ్యవసాయ మండలికి ఉంటుందని, ఇది చట్టబద్ధత కలిగి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ గుర్తింపు పొందే
కళాశాలలను ఈ మండలి సిఫారసు చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఉద్యాన విద్యలో ప్రమాణాలు
మరింత పెరగడానికి కొత్తగా ఏర్పాటయ్యే మండలి ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి
తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయం
తీసుకున్నట్లు తెలిపారు. సిమ్ కార్డుతో పాటు 3 ఏళ్లు
కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు
ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం
ఇచ్చే రూ.6వేలతో కలిపి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే
కేంద్ర నిబంధన ప్రకారం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రూ.6 వేలు ఇస్తారు. రాష్ట్ర
ప్రభుత్వం అందరికీ ఇస్తుందని చెప్పారు. కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత
ఇస్తామన్నారు. ఆ శాఖ అధికారులు విధివిధానాలు రూపొందిస్తారని చెప్పారు. రాష్ట్రంలో
మొత్తం 76.21 లక్షల కమతాలు ఉన్నాయని, 5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది రైతులు ఉన్నారని వివరించారు. ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. రైతు రుణ మాఫీ
చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబానికి
రూ.10వేలు చొప్పున ఇవ్వడం ద్వారా రైతులకు మొత్తం రూ.7,621 కోట్ల లబ్ది చేకూరుతుందని చెప్పారు.
గ్రామ పంచాయతీలలోని కంటింజెన్సీ
ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1998లో డీఎస్సీ లో అర్హత పొందిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయం
తీసుకున్నట్లు చెప్పారు. అలాగే, 2008లో డీఈడీ, బీఈడీ అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్లో ఉన్న
వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని
పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 1983-96 మధ్యలో నియమితులైన
స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించిందన్నారు.
గత మంత్రి మండలి సమావేశంలో 31 ఆస్పత్రులలో
పడకలను పెంచాలని నిర్ణయించగా, ఈసారి మరో 22 ఆస్పత్రుల స్థాయి
పెంచాలని, ఐఏఎస్ అధికారులు, ఎన్జీవోలు,ఉద్యోగులకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు. జర్నలిస్టులకు కూడా అమరావతిలో నామమాత్రపు ధరకు 30 ఎకరాలు ఇవ్వాలని,
డబ్బు మొత్తం రెండేళ్లలో మూడు వాయిదాలలో చెల్లించడానికి అవకాశం కల్పించారని, మొదటి వాయిదా చెల్లించిన వెంటనే భూమిని స్వాధీనం
చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర
వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 9 పశుసంవర్థక
పాలిటెక్నిక్లు, 9 ఫిషరీస్ పాలిటెక్నిక్ల ఏర్పాటుకు
మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. ఒక్కో కళాశాలలో 50
సీట్లు ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి ఈ
కళాశాలలు ప్రారంభం అవుతాయన్నారు.
ఢిల్లీ
ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.కోటీ 23లక్షలు, ఏపీ భవన్లో అయ్యింది రూ. కోటీ 60 లక్షలు) మొత్తం రూ.2 కోట్ల 83
లక్షలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
వక్కలిగ రిజర్వేషన్ల పరిధి చిత్తూరు వరకు పెంపు
బీసీ(బి)లో ఉన్న వక్కలిగ/కుంచటిగ
సామాజిక వర్గానికి ఇచ్చే రిజర్వేషన్ చిత్తూరు జిల్లాలో వున్న వారికి కూడా వర్తింపు
చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఈ కులాల జనాభా 5 లక్షల మంది అని తెలిపారు. ఎక్కువ మంది అనంతపురం జిల్లా
మడకశిర ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. ఇంత వరకు పరిశ్రమల శాఖలో వున్న లిడ్క్యాప్ ఇకపై సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్
పరిధిలో పనిచేస్తుందని చెప్పారు. సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పరిధిలో ఉన్న సెంట్రల్
సెక్రటేరియట్ లైబ్రరీలో ఒక గెజిటెడ్ లైబ్రేరియన్ పోస్టు, 78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
పోస్టులను మంజూరు చేస్తూ మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు 9 సీనియర్ అసిస్టెంట్స్,
28 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 28 మంది శాంప్లింగ్ అసిస్టెంట్
పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయించామన్నారు. టంగుటూరి ప్రకాశం
పంతులుగారి హయాంలో 1954లో వైకుంఠపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన
చేశారని, అప్పటి నుంచి డెల్టా ప్రజల
ఆకాంక్ష అదని, ఈరోజు దానిని నెరవేర్చడంపై ఆయకట్టు రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోందని
చెప్పారు. ఈ విషయమై మంత్రి మండలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ
తీర్మానం చేసినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.
‘ప్రజా రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
సీనియర్ జర్నలిస్టు శిరందాసు నాగార్జున రాసిన ‘ప్రజారాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుండి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత సాధికార సంస్థ (సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల ఏర్పాటు, ల్యాండ్పూలింగ్ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటివరకు జరిగిన జరుగుతున్న ప్రభుత్వ, ప్రవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నింటిని ఫోటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్ కాంప్లెక్స్ భవనం, విట్ భవనాల వరకు అన్ని ఫోటోలను ఇందులో పొందుపరిచారు. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Feb 12, 2019
13న ఉదయం 8 గంటలకే మంత్రి మండలి సమావేశం
సచివాలయం,ఫిబ్రవరి 11:
ఈ నెల 13వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగవలసిన
మంత్రి మండలి సమావేశం ఉదయం 8 గంటలకే జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ
మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి
మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Subscribe to:
Posts (Atom)
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...


