Jul 3, 2017

అమరావతికి ప్రముఖ సంస్థల రాక

        అంతర్జాతీయ నగరాల సరసన చేర్చేవిధంగా అత్యాధునికంగా నిర్మిస్తున్న ప్రజారాజధాని అమరావతి మహానగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు తరలి వస్తున్నాయి. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూల అభివృద్ధి చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాలు అమరావతికి మూలస్థంభాలుగా నిలుస్తాయి. మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సేవల రంగం వంటివి ఒకేసారి 13 ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్‌ అంచనాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాజధాని పరిధిలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, విద్య, వైద్యం, నివాస, తాగునీరు, ఆతిధ్యం, రవాణా, విద్యుత్, టెలీఫోన్ వంటి సౌకర్యాలను సమకూరిస్తేనే ఏ సంస్థ అయినా నిర్మాణం మొదలు పెడుతుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఆ పనులలో నిమగ్నమై ఉంది. నగరంలోపల రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  . టార్గెట్‌ 2018’ నినాదంతో ఇతర పనులు కూడా వేగం పుంజుకున్నాయి. దానికితోడు అమరావతి బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి రావడంపరిశ్రమల స్థాపనుకు అన్నివిధాల అనుకూల పరిస్థితులు, సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం  భూములు ఇవ్వడంతోపాటు, మౌలిక వసతులు కల్పంచడంతో అనేక సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.  ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో కూడా ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేపడుతోంది. అనంతపురం నుంచి అమరావతి వరకు  ఎక్కడా మలుపులేని 598.830 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూ సేకరణ, సమీకరణ పనులు మొదలయ్యాయి
             విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన రెండవ పార్టనర్ షిప్ సమ్మిట్ లో రూ. 1.4 కోట్ల పెట్టుబడులతో 2.01 లక్షల మందికి ఉపాధి కల్పించే 65 ఒప్పొందాలను సీఆర్డీఏ చేసుకుంది. వీటిలో 64 శాతం పెట్టుబడులు కొత్త రాజధానిలో మౌలికవసతులు అభివృద్ధికి సంబంధించినవే ఉన్నాయి. జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), మేటి సంస్థల  సభ్యులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సంస్థలు రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లుగా ఏపీలో కూడా ఇండస్ట్రియల్‌క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సీఎం ప్రతిపాదించారు. శ్రీసిటీ లేదా కృష్ణపట్నంలో జపాన్‌ ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొత్త రాజధానిలో రవాణా వ్యవస్థ అభివృద్ధిపై జైకా సంస్థ దీర్ఘ కాలిక, స్వల్పకాలిక, మధ్య తరహా ప్రణాళిక వ్యూహరచనను చేస్తోంది. ఇక్కడ స్పోర్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ సిటీలకు బృహత్తర ప్రణాళికలను తయారు చేస్తోంది. అమరావతిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ఐటీసీ, లీలా, మహీంద్రా రిసార్ట్స్‌, హిల్టన్ గ్రూపు, హాలిడే ఇన్ వంటి దాదాపు 20 ప్రముఖ  సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

              దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను తీసుకురావల్లన్న ఉద్దేశంతో ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.  భూ కేటాయింపులు కూడా జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారుఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ - ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ - భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రాంగణం కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. విద్యా సంస్థలన్నింటిని ఐనవోలు, నీరుకొండ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడే భూములను కేటాయిస్తోంది.  తాత్కాలిక సచివాలయం నిర్మాణం  తరువాత  ఇక్కడ విద్యా నగరానికే పునాది పడింది. ఐనవోలు గ్రామంలో తమిళనాడుకు చెందిన  ప్రతిష్టాత్మకమైన విట్‌ విశ్వవిద్యాలయం ఏపీ కేంపస్  భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.  ఈ ఏడాదికి నూతన అడ్మిషన్లు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతానికి  గుంటూరులో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. అమరావతిలో తొలిదశ నిర్మాణం పూర్తికాగానే, ఇక్కడకు మార్చుతారు. అత్యుత్తమ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైఫై బస్సులు, హాస్టళ్లతో జులై 19న ఈ క్యాంపస్ కు ప్రారంభోత్సవం చేస్తారు. స్టార్ స్టూడెంట్ప్రోగ్రామ్ కింద ప్రతి జిల్లా నుంచి  టాపర్ గా నిలిచిన ఒక బాలిక, ఒక బాలుడిని ఎంపిక చేసి వారికి ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో 100 ఎకరాల్లో  నిర్మాణం చేపట్టారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతోపాటు ఒక మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ  తాత్కాలికంగా ఈ విద్యా సంవత్సరం నుంచి చెన్నయ్‌లో అడ్మిషన్లు ప్రారంభిస్తోంది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వంద ఎకరాల స్థలం కేటాయించింది. తరువాత మరో వంద ఎకరాలు కేటాయించే అవకావం ఉంది. అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్శిటీ 2018లో ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. క్లౌడ్ నెట్‌వర్క్ ఆధారంగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే దూర ప్రాంతాల్లోని డివైస్‌లకు సమాచార మార్పిడి జరిపి వందలాది విద్యార్థులకు అమృత విశ్వవిద్యాలయం ద్వారా విద్యాబోధన జరుగుతోంది.  ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ యూనివర్సిటీ ముందుకొచ్చింది. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్   కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తారు.

             అబుదాబీకి చెందిన బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య, వైద్య విద్య, పర్యాటక, అతిథ్య, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది. ఈ మేరకు ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ షెట్టి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు  మధ్య ఒప్పందం కుదిరింది. ఆ  ఒప్పందం ప్రకారం అమరావతిలో ప్రత్యేక సౌకర్యాలతో 1500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారు. హెల్త్‌కేర్‌ క్లబ్‌గా దీనిని తీర్చిదిద్దనున్నారు. 2018 డిసెంబరు నాటికి ప్రపంచ స్థాయిలో మెడికల్‌ ఎనలిటిక్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. వైద్య రంగంలో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఏషియాలోనే క్వాంటమ్‌ కంప్యూటర్‌ సెంటర్  ప్రారంభిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయ వైజ్ఞానిక భాగస్వామిగా వారి సహకారంతో ప్రపంచ స్థాయి వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. ఫార్మాస్యూటికల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, అమరావతి వైద్య విజ్ఞాన ప్రాసెస్‌ ఔట్‌ సోర్సింగ్‌ కేంద్రాలను కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగాల కల్పనలో ఈ సంస్థలు కీలక భూమిక పోషిస్తాయి.

      శాఖమూరులో 300 ఎకరాల స్థలంలో  అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) డిస్నీ వరల్డ్ తరహాలో పార్కుని ఏర్పాటు చేయనుంది.  ఈ పార్కు నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో సాహస క్రీడలు, జల  క్రీడలు, అంతర్జాతీయస్థాయి ఉద్యానవనాలు, మ్యూజిక్ ఫౌంటేన్, వాటర్ ఫాల్స్, బటర్ ఫ్లై పార్క్, రిసార్టులు, హోటళ్లు, షాపింగ్ కేంద్రాలు, ధియేటర్లు... ఇలా అన్నీ ఉంటాయి. అమరావతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, ప్రధాన రహదారులకు ఇరువైపులా, రాజధానిలో 21.3 కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగుకు ఇరువైపులా ఉద్యనవనాలు అభివృద్ధి చేయడానికి ఏడీసీ బ్లూప్రింట్ ను కూడా సిద్ధం చేసింది. నగరంలో గ్రీన్-బ్లూ (పచ్చదనం-జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని కేటాయించారు.
             బ్రిటన్ కు చెందిన ట్రాన్స్ స్టాడియా సంస్థ ఇక్కడ 60 రకాల క్రీడా కార్యకలాపాల నిర్వహణకు అనుకూలంగా ఉండేవిధంగా, 4 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం నిర్మించడానికి ముందకు వచ్చింది. ఇందుకోసం సాధ్యమైనంత త్వరగా భూమి కేటాయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సుమారు రూ.250 కోట్లతో ఒక ఫైవ్‌ స్టార్‌, నాలుగు త్రీస్టార్‌, 6 జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలు, రూ.4000 కోట్ల వ్యయంతో 2 ప్రఖ్యాత ఆస్పత్రులు అమరావతిలో ఏర్పడబోతున్నాయి. అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారుల విభాగంతో ఒప్పందం కూడా జరిగింది. మంగళగిరిలో ప్రపంచస్థాయి ఐ.టి.రంగ సంస్థలు కొలువుదీరనున్నాయి. రాబోయే రెండేళ్లలో మంగళగిరి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇక్కడి ఆటోనగర్‌ ప్రాంతం 16వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో  వివిధ పరిశ్రమలు, ఆటోమొబైల్‌, .టి.సంస్థలు నెలకొల్పనున్నారు. ఆటోనగర్‌ పక్కన ఉన్న 30 ఎకరాల భూమిని వివిధ ఐ.టి.కంపెనీలకు కేటాయించారు. ఇప్పటికే పైడేటా ఐ.టి.సంస్థ భవనం నిర్మించారు. ఆరు ఐటీ కంపెనీల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. మరోపక్క రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్, సబార్టేరియల్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. నిర్ణిత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేయాలని నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Jul 1, 2017

తుది దశలో అమరావతి మాస్టర్ ప్లాన్


v అత్యుత్తమ ఆకృతులు సిద్ధం
v త్వరలో నిర్మాణం ప్రారంభం
v ఉష్ణోగ్రత తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యత
v స్థానిక గ్రామాల అస్థిత్వం కాపాడే ప్రణాళికలు
v ఉద్యోగాల కల్పనకు సీబీడీ ఏర్పాటు
          
            
అంతర్జాతీయ నగరాల సరసన చేర్చేవిధంగా అత్యాధునికంగా నిర్మించనున్న ప్రజారాజధాని అమరావతి మహానగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన తుది దశకు వచ్చింది. మొదటి దశ నిర్మాణాలకు కావలసిన నిధులు కూడా చాలావరకు సమకూరాయి. జల కళ-పచ్చదనం నిండిన అంతర్జాతీయ స్థాయి అద్భుత అమరావతి నగర (బ్లూ-గ్రీన్ సిటీ) నిర్మాణానికి రూ.58 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రధాన నిర్మాణాలు ఈ ఏడాది మొదలుపెట్టి  2019 ఎన్నికల నాటికి 32,463 కోట్లు ఖర్చు చేయాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది. బ్రిటన్ కు చెందిన  నార్మన్ ఫోస్టర్ సంస్థ కొత్త రాజధానిలోని ప్రతి కట్టడం  ఏకరూపత,  ప్రభుత్వ భవనాలు అత్యున్నతంగా(ఐకానిక్‌), ఆకృతులు విలక్షణంగా (యునిక్‌) ఉండేవిధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ సంస్థ పలు దఫాలు, అనేక రకాల ఆకృతులను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపించింది. ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సిద్ధం చేసిన 4 ప్రాథమిక డిజైన్లలో ఒకదానిని ప్రభుత్వం అత్యున్నతమైనదిగా భావించి, మళ్లీ దానికి కొద్దిగా మార్పులు చేర్పులు సూచించింది. కొద్ది రోజుల్లో ఆ సంస్థ తుది ప్లాన్ ను అందజేయనుంది. ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించేవిధంగా రూపొందించడానికి జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో పాటు స్థానికంగా వుండే గొప్ప అనుభవశీలురైన ఆర్కిటెక్టుల సహాయ సహకారాలను ప్రభుత్వం తీసుకుంటోంది. నార్మన్ ఫోస్టర్ సంస్థ కూడా  సంప్రదాయ నిర్మాణ రీతులకే పెద్దపీట వేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి,  మండలాలలోని 25 రెవెన్యూ గ్రామల(29 గ్రామాలు)పరిధి 53,478 ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమి నిర్మించాలనేది  మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. చారిత్రకంగా నది ఒడ్డున ఉన్న నగరాల్లోనే నాగరికత వెలసిల్లింది. ఆధునిక యుగంలో కూడా నది ఒడ్డునే ఇంతటి విశాల నగర నిర్మాణం జరగబోతోంది.  అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ. అందువల్ల అటు ఆర్టిటెక్ట్ సంస్థ, ప్రభుత్వం ఆ కోణంలో ఎక్కువ దృష్టి పెట్టాయి. అమరావతిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉండేలా ఇప్పటి నుంచే ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఉష్ణోగ్రతలకు అనుగుణంగా భవన నిర్మాణంలో అనుసరించిన రీతుల్ని అధ్యయనం చేసారు. ఉష్ణోగ్రతల్ని తగ్గించేందుకు సంప్రదాయ భవనాలే అనుకూలమన్న భావనను ఆర్టిటెక్ట్ సంస్థ వ్యక్తం చేసిందివాషింగ్టన్‌, లండన్‌ వంటి ప్రముఖ నగరాల్ని పరిశీలించిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ముఖ్యంగా అక్కడి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? వాటిని తట్టుకునేలా భవన నిర్మాణాల్లో అనుసరించిన విధానాలేంటి? గాలి వీచే తీరు ఎలా ఉంటుంది? వంటివి అధ్యయనం చేసింది. అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు, ఇక్కడి గాలివాటం వంటివి పరిగణనలోకి తీసుకుని ఆకృతుల్ని రూపొందించింది. అబుదాబిలో అద్దాలతో నిర్మించిన భవనాల వెలుపల 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సంప్రదాయ పద్ధతుల్లో నిర్మించిన భవనాల వెలుపల 48 డిగ్రీలు, చుట్టూ చెట్లున్న సంప్రదాయ భవనాల వెలుపల 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. సంప్రదాయ పద్ధతుల్లో నిర్మించిన భవనాలే మంచిదని ఆ సంస్థ సూచించింది. ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, నగర నిర్మాణంలో ఏ తరహా విధానాలను అనుసరించాలో ప్రపంచంలో వున్న అన్ని అత్యుత్తమ విధానాలను పరిశీలించి వాటిని ఇక్కడ అనుసరిస్తారు.

         రాజ్ భవన్, శాసనసభ, ఉన్నత న్యాయస్థానం, సచివాలయం భవంతులు అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్థిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేసుకోవడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించడానికి ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కృషి చేస్తోంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతులు మనిషి నాడీ మండలాన్ని, రాసుల్ని అనుసరించి ఉండాలని వాస్తు సిద్ధాంతి రాఘవయ్య సూచించారు. పుత్రజయ, ఆస్థానా, వాషింగ్టన్ డీసీ, లండన్, బ్రెసీలియా, అబుదాబి, న్యూఢిల్లీ, గాంధీనగర్, నయారాయపూర్, చండీగర్  తదితర నగరాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైనవాటిని తీసుకొని, వాటికంటే అత్యుత్తమంగా బ్లూ, గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఆర్ధిక కార్యకలాపాలకు వేదికగా, ప్రపంచశ్రేణి నగరంగా, ప్రజా రాజధానిగా భాసిల్లేవిధంగా అమరావతిని రూపొందించనున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి సీఎం తరచూ సంబంధింత మంత్రులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అధికారులతో సమావేశమై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం దాదాపు 3,165 నివాసాలతోపాటు విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి మొత్తం రూ.4,750 కోట్లు ఖర్చు అవుతుందని అచనాలను రూపొందించారుప్రభుత్వ భవనాల సముదాయం 900 ఎకరాల్లో నిర్మిస్తారు.  ఈ ప్రాంతం ఉత్తర-దక్షిణాలుగా నాలుగు కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు ఉంటుంది.  దీని మధ్య భాగంలో సెంట్రల్‌ స్పైన్‌ డిల్లీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు ఉండే రాజ్‌పథ్‌ మాదిరిగా ఉంటుంది. దీనిని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మూడు నాలుగు రకాలుగా ప్రతిపాదించింది. ఒక దానిలో ఇది రాజ్‌పథ్‌ మాదిరిగా తిన్నగా ఉంటే, మరోదానిలో జిగ్‌జాగ్‌గా ఉంది. ఒక నమూనాలో రహదారికి బదులుగా జలమార్గం ఉంది. ఒక చోట మధ్యలో అంతా పచ్చదనం, చెట్లు ఉంటాయి. ఇలా పలు రకాల నమూనాల్ని ఆ సంస్థ ప్రతిపాదించగా, దీనిలో ఒకదానిని సీఎం ఎంపిక చేసి కొన్ని సూచనలు చేశారు. ఆ ప్రకారం తుది రూపం ఇవ్వవలసి ఉంది.

         రాజధాని ప్రాంతంలో వచ్చే వందేళ్లలో జరిగే మార్పులు, అంచనాల ఆధారంగా అత్యంత కీలకమైన వాణిజ్య సదుపాయాలు, కల్పన, ప్రజల అవసరాలకు సంబంధించి సీఆర్డీఏ పలు ప్రాతిపాదనలు చేసిందిరాజధానిలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగేలా జిల్లా కేంద్ర వాణిజ్య కేంద్రాలు (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్-సీబీడీ) ఏర్పాటు చేయడంతోపాటు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. కృష్ణానదీ సమీపంలో అవకాశాల వెల్లువ సృష్టించేలా కేంద్ర వాణిజ్య జిల్లాను ఆర్థిక రాజధాని తరహాలో నిర్మిస్తారు. అత్యాధునిక ఆర్థిక వ్యవస్థ రాజధాని మొత్తం విస్తరించేలా మరో మూడు ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలను రాజధాని అంతటా ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రాంతీయ వాణిజ్య కేంద్రంలో 5 లక్షల వరకు జనాభా నివాసం ఉండేలా ప్రణాళికలను రూపొందించారు. మొత్తం 3 ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలు, 22 పట్ణణ వాణిజ్య కేంద్రాలు, 53 నేబర్ హుడ్ వాణిజ్య కేంద్రాలతోపాటు, 3 హోల్ సేల్ మార్కెట్ల నిర్మాణానికి సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలో వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ 9 నగరాలు (పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు) నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి ఎకరాలలో రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది.

          అమరావతి నిర్మాణానికి కొన్ని జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించగా, సింగపూర్, చైనా, జపాన్, బ్రిటన్, ఆస్థానా వంటి దేశాలు తమ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి దశలో ఖర్చు చేయాలనుకుంటున్న నిధులను సమకూర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో సీఆర్డీఏ ప్రయత్నించి విజయం సాధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్), ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తున్నాయి. పీపీపీ విధానంలో మౌలిక వసతులు, బాండ్స్ వంటి ఇతర మార్గాల్లో కూడా  సీఆర్డీఏ నిధులను సమకూరుస్తోంది. నిర్మాణంలో అన్నిదశలలో అత్యాధునిక సాంకేతికత అందించడానికి  అనేకమంది ముందుకు వస్తున్నారు. మాస్టర్ ప్లాన్ అందిన వెంటనే టెండర్లు పిలిచి రాజధాని నిర్మాణాలు మొదలుపెట్టడానికి సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914