జాతీయ స్థాయికి మించి రాష్ట్రంలో వృద్ధి
తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. జాతీయ సగటు కన్న ఎక్కువగా ఉంది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మాత్రం రాష్ట్రం వెనుకబడి ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,23,664లు ఉండగా, 2017-18లో రూ.1,42,054కు చేరుకుంది. ఏడాది వ్యవధిలో రూ.18,390 (14.87 శాతం) పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం(రూ. 1,12,764)కన్నా ఇది ఎక్కువ, తెలంగాణ (రూ.1,75,534) కన్నా తక్కువ. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే వెనుకబడి ఉన్నాం. నాలుగేళ్ల కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనేక అవార్డులు సాధించి రికార్డు నెలకొల్పింది. దాదాపు 511 అవార్డులు లభించాయి. సేవా భావం, నిజాయితీ, పారదర్శకత,జవాబుదారీ తనం, వినమ్రత, సమభావం, పట్టుదల, ఆశాభావంతో కష్టపడి, ఇష్టపడి పనిచేయవలసిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది. రాష్ట్రాభివృద్ధిలో అధికార యంత్రాంగానికి కీలక భూమిక. అందువల్లే ఆర్ధికంగా ఇబ్బందులున్నా ఉద్యోగులకు ప్రభుత్వం 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది.
బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోంది. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి దశలలో ప్రభుత్వం అండగా నిలిచి ఒక చరిత్ర సృష్టించింది. బాల్యం, చదువు, ఉపాధి, వివాహ దశలు,
సొంత ఇల్లు, ఆరోగ్యం, వృద్ధాప్యం అన్ని దశల్లో చేయూతనిస్తోంది. రూ.50 వేల కోట్లతో 19 లక్షల ఇళ్లు నిర్మిస్తోంది. మరో 5 లక్షల ఇళ్లు అదనంగా నిర్మించాలని నిర్ణయించింది. గ్రామాలలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. పట్టణాలలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉంది. చంద్రన్న పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, 6 లక్షల మహిళలకు అన్న అమృత హస్తం పథకం అందిస్తున్నారు. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకాన్ని 5 లక్షల 60 వేల మంది ఉపయోగించుకున్నారు. 24.65 లక్షల మంది చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. గిరి గోరు ముద్దలకు రూ.23 కోట్లు, సబల పథకానికి రూ.40 కోట్లు ప్రభుత్వం వ్యయం చేస్తోంది. ఎన్టీఆర్ బేబి కిట్స్ 5.21లక్షల మందికి అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా 36 లక్షల మందికి లబ్ది చేకూరింది. 2358 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ అభివృద్ధి చేశారు. 5.62 లక్షల మంది బాలికలకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. 6 లక్షల మందికి ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ లు, 12 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందజేశారు. 100 శాతం విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్రం 100 శాతం ఓడిఎఫ్ సాధించడం ఒక చరిత్ర. గౌరవప్రదంగా ప్రతి పేదకు ఆహారం అందించే అన్నా కేంటిన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఆకర్షణీయంగా రూపొందించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 58.15 శాతం పూర్తిచేశారు. పట్టిసీమ,పురుషోత్త పట్నం ద్వారా పోలవరం ఫలితాలు రైతులకు ముందే అందిస్తున్నాయి. రాష్ట్రంలో పోలవరంతోపాటు దానికి సమానమైన మరో 57 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. వాటిలో 10 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నెలలో మరో 12 ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరకు 45 ప్రాజెక్టుల వరకు ప్రారంభిస్తారు. 5 ఏళ్లలోపే ఇన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment