విపత్తు
పునరుద్ధరణ ప్రాజెక్టుపై సీఎస్ సమీక్ష
సచివాలయం, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో విపత్తు
పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని
సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ బ్యాంకు బృందం, విద్యుత్, పంచాయతీరాజ్
ఇంజనీరింగ్ విభాగం, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, గ్రేటర్ విశాఖ మునిసిపల్
కార్పోరేషన్, విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అధికారులతో విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు
పనులను సీఎస్ సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి
జిల్లాల్లో 5 ఏళ్ల (2015-2020) కాలపరిమితికి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.2220 కోట్లు. ఈ ప్రాజెక్ట్ నిబంధనలు,
మార్గదర్శకాలు, వంతెనలు, రోడ్ల నిర్మాణం, విస్తరణ, విద్యుత్, మురుగునీటి కాలువల
నిర్మాణం, విశాఖలోని కైలాసగిరి హిల్ ప్రాజెక్ట్, విశాఖ జూలాజికల్ పార్క్, కంబాలకొండ ఎకో పార్క్, నిర్మాణ నాణ్యతలు,
కన్సెంల్టింగ్ ఏజన్సీలు, భూగర్భ కేబుల్ పనులు, టెండర్లు, బిల్లుల చెల్లింపు, నిధుల
వినియోగం, బీమా తదితర అంశాలను సమీక్షించారు. వివిధ విభాగాలలో జరిగిన పనుల గురించి
అధికారులు సీఎస్ కు వివరించారు.
ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ నిర్ణీత కాలంలో ఈ ప్రాజెక్ట్
పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన
బిల్లులను వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు చెప్పారు. ప్రపంచ బ్యాంకు బృందానికి అభినందనలు తెలిపారు. ఈ
సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్, నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు జి.అనంతరాము, కె.కరికాల
వలవన్, కె.ఎస్.జవహర్ రెడ్డి, ఐజీపీ రాజీవ్ కుమార్ మీనా, ప్రపంచ
బ్యాంకు బృందం సభ్యులు టాస్క్ ఫోర్స్ టీమ్ లీడర్ దీపక్ సింగ్, నేహా వ్యాప్
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment