Jan 2, 2017

పారిశ్రామిక ప్రగతి 9.98 శాతం


·       ప్రణాళికా శాఖ అర్థ సంవత్సరం గణాంకాలు
·       ఖనిజాలు, సహజ వాయువు 87.50 శాతం వృద్ధి
·       మైనింగ్ విభాగంలో అధిక శాతం నమోదు


         ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం గడచిన అర్థ సంవత్సరంలో స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 9.98 శాతం సాధించింది. పారిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆహ్వానించడానికి, పారిశ్రామిక వృద్ధి రేటు పెంచేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో ఈ రంగంలో ఫలితాలు కనిపిస్తున్నాయి.  సామాజిక, ఆర్ధికాభివృద్ధికి  దోహదపడేవాటిలో పారిశ్రామిక రంగం అత్యంత ముఖ్యమైనదిగా ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమల స్థాపన జరిగితే ఉత్పత్తి పెరగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోంది. దాంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.25 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి రేటు, 2015-16 నాటికి 11.1 శాతం నమోదై రెండంకెల వృద్ధి రేటు సాధించి.
   రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక  ఉత్పత్తి రూ.63,229 కోట్లతో  9.98 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ గణాంకాలను 2011-12 ధరల ఆధారంగా రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించింది. గత ఏడాది అర్థ సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఉత్పత్తి రూ. 57,490 కోట్లు.  ఈ ఏడాది మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రూ.32,022 కోట్లతో 10.49 శాతం వృద్ధి రేటు సాధించగా, రెండవ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 31,207 కోట్లతో 9.46 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో అర్థ సంవత్సరంలో పారిశ్రామిక రంగం  5.60 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది.

మైనింగ్ లో 12.20 శాతం వృద్ధి రేటు
           పారిశ్రామిక రంగంలోని వివిధ విభాగాలను పరిశీలించినట్లైతే  మైనింగ్, క్వారీల్లో రూ. 5,750 కోట్ల ఉత్పత్తి జరిగి 12.20 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొదటి త్రైమాసికంలో రూ. 2,838 కోట్లతో 12.35 శాతం, రెండవ త్రైమాసికంలో రూ.2,912 కోట్లతో 12.05 వృద్ధి రేటు నమోదైంది. ఖనిజాల ఉత్పత్తి పెరగడం వల్ల ఈ విభాగంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఖనిజాలు, సహజవాయువు ఉత్పత్తి పెరుగుదల అద్వితీయంగా పెరిగి, 87.50 శాతం వృద్ధి రేటు నమోదైంది. అలాగే గ్రావెల్, కలర్ గ్రానైట్ ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు రూ.9,125 కోట్లతో 11.70 శాతం వృద్ధి రేటు సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 4,454 కోట్లతో 10.01 శాతం, రెండవ త్రైమాసికంలో రూ. 4,671 కోట్లతో 13.36 శాతం వృద్ధి రేటు నమోదైంది.  విద్యుత్ ఉత్పత్తులు పెరగడంతో ఈ వృద్ధి సాధ్యమైంది.

           ఉత్పత్తి విభాగం రూ.25,798 కోట్లతో 10.20 శాతం వృద్ధి శాతం సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 12,941 కోట్లతో 10.83 శాతం, రెండవ త్రైమాసికంలో రూ. 12,857 కోట్లతో 9.57 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ విభాగంలో  ప్రైవేట్ కార్పోరేట్ రంగం 11.90 శాతం వృద్ధి రేటు సాధించింది.  నిర్మాణ విభాగం రూ.22,556 కోట్లతో 8.52 శాతం వృద్ధి రేటు సాధించాయి. మొదటి త్రైమాసికంలో రూ. 11,789 కోట్లతో 9.87 శాతం, రెండవ త్రైమాసికంలో రూ.10,767 కోట్లతో 7.08 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొత్తంగా చూస్తే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉంది.

        పెట్టుబడులు రాబట్టడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల వేగవంతంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. దాంతో రాష్ట్రంలో  ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నిలవడం ఖాయం.

ఫిన్ టెక్ సిటీగా విశాఖ అభివృద్ధి

·       పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి కంపెనీల ఆసక్తి
·       పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు

         విశాఖ నగరాన్ని ఫిన్ టెక్(ఫైనాన్షియల్ టెక్నాలజీ) సిటీగా అభివృద్ధి కానుంది. ఈ సిటీకి కావలసిన అన్ని రకాల రోడ్డు, వాటర్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, అనువైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న రుషికొండ సైబర్ వ్యాలీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిన్ టెక్ టవర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రోత్సహకాలు, కొత్త కంపెనీల స్థాపనకు వీలుగా విధానాల సడలింపు, సౌకర్యాల వల్ల ఇప్పటికే పలు సంస్థలు పెట్టబడులు పెట్టాయి. తమ బ్రాంచ్ లను ప్రారంభించాయి. ఇంకా అనేక బహుళజాతి కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతో రాష్ట్రంలోని యువతకు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
       ఇటలీకి చెందిన పార్టీటు42 ఇన్నొవేషన్స్ రీసెర్చ్ ల్యాబ్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ విశాఖలో తమ బ్రాంచ్ ని స్థాపించనుంది. ఎలక్ట్రానిక్స్, ఉత్పత్తి రంగంలో లీడింగ్ లో ఉన్న తైవాన్ పెట్టుబడులు పెట్టడానికి భారత్ ఉత్తమమైనదిగా భావిస్తోంది. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్(ఐఈఎస్ఏ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో తైవాన్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. అనేక ఫిన్ టెక్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.
         విశాఖ ఫిన్ టెక్ టవర్ లో పలు సంస్థలు ప్రారంభమైయ్యాయి.  పేటీఎంలో 200 మంది ఉద్యోగం చేస్తున్నారు. జీఎంఎస్ స్టాఫ్ట్ వేర్ లో వంద మంది ఉద్యోగులు ఉన్నారు. మరో నాలుగు కొత్త కంపెనీలలో 60 మంది పని చేస్తున్నారు. విశాఖ వీఐపీ రోడ్డులోని డిజైనేటెడ్ టెక్నాలజీ పార్క్(డీటీపీ)లో జిగాకామ్, స్పిండర్ సాఫ్ట్ ఎల్ఎల్ సీ, మైలాస్ టెక్నాలజీ, బీ సెక్యూర్, వీఎస్ టీ, అవని సాఫ్ట్ వేర్, సీజీఎస్ ఐటీ టెక్నాలజీ మొత్తం 7 కంపెనీలను స్థాపించారు. వీటిలో 526 మందికి ఉపాధి లభిస్తోంది. టెక్ మహేంద్ర డీటీపీ బిల్డింగ్ లోని మూడు కంపెనీలలో మొత్తం 230 మందికి ఉపాధి లభించింది.

ఐటీ కంపెనీలు: విశాఖలోని వీఐపీ రోడ్డులో 35 వేల చదరపు అడుగులు వివిధ ఐటీ కంపెనీ కార్యాలయాలకు కేటాయించారు. ఉడా కాంప్లెక్స్ లో 24 వేల చదరపు అడుగులు కేటాయించారు. ఇక్కడ తుది దశ పనులు జరుగుతున్నాయి. విప్రో బిల్డింగ్ లో 2,12,000 చదరపు అడుగులలో విప్రో సంస్థ వచ్చే ఏడాది మార్చి నాటికి  స్వాధీనంలోకి తీసుకుంటుంది. వారు సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి)గా మార్పు చేయాలని దరకాస్తు చేయనున్నారు. హిల్-2 (ప్రైవేట్-మహతి) లో 65 వేల అడుగుల కార్యాలయాల స్థలం ఖాళీగా ఉంది. హిల్-3 (ఇంక్యుబేషన్ టవర్)లో నూతన కంపెనీలను ప్రారంభించారు. ఈ కంపెనీల స్వాధీనంలో 6500 చదరపు అడుగులు ఉంది. మిగిలిన  చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయి. హిల్-3(మిలినియం) భవనం నిర్మాణంలో ఉంది. ఇక్కడ రెండు లక్షల అడుగుల ఎవరికీ కేటాయించలేదు. దీని నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతుంది. ఇక్కడ కూడా కార్యాలయాలు ప్రారంభిస్తే మరిన్ని ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

సీఈజెడ్ ఏర్పడితే మరిన్ని రాయితీలు


Ø ఎగుమతి ఆధారిత ఫ్యాక్టరీలకు అవకాశం
Ø ఉద్యోగా కల్పన ఆధారంగా పన్నుల మినహాయింపు
Ø తీర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి


          రాష్ట్ర తీరప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న నేపధ్యంలో కేంద్రం ‘తీర ఉపాధి మండలి’ (కోస్టల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ - సీఈజెడ్‌) ఏర్పాటు చేయడం ద్వారా మరిన్నీ రాయితీలు అభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్రంలోనే కాకుండా తీరం వెంట భూగర్భంలోనూ అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది.  దానికి తోడు రాష్ట్రంలో  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. సాగర తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి) ఏర్పడుతోంది. దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటి కారిడార్ ఇది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు 2500 కిలో మీటర్లు విస్తరించి ఉండే కారిడార్ ఇది.  భవిష్యత్ లో ఇది తూర్పు ఆర్థిక  కారిడార్ గా కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. వీటన్ని దృష్ట్యా దేశీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు తీర ప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉండటం,  తక్కువ జీతాలకే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో విదేశీ సంస్థలు అనేకం రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని బహుళజాతి కంపెనీలు  రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకున్నాయి.

           ఇదిలా ఉండగా, దేశంలో తీర ప్రాంతంలో స్థానికంగా ఉండే మానవ వనరుల్లో నైపుణ్యాలను ఉపయోగించుకుని వారికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఇందు కోసం నీతి (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సఫార్మేషన్ ఇండియా - ఎన్ఐటీఐ) అయోగ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో  తీర ఉపాధి మండళిఏర్పాటు చేయనుంది. గతంలో ఏర్పాటైన ఎస్‌ఈజెడ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి)లు, ఎన్ఐఎంజెడ్ (నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్- ప్రత్యేక పెట్టుబడి, పారిశ్రామిక, ఉత్పాదక మండలి)లకు భిన్నంగా ఇది ఉంటుంది. దీనిని కనీసం 400-500 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఈ జోన్ లో ఎగుమతి ఆధారిత యూనిట్లను ప్రోత్సహించాలన్న యోచనలో కేంద్రం ఉంది. అందువల్ల తీర ప్రాంతంలో, పోర్టులకు దగర్లో దీనిని  ఏర్పాటు చేస్తారు.  పరిశ్రమలో ఉపాధి పొందే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఐదేళ్ల నుంచీ పదేళ్ల వరకూ కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. పదివేల మంది ఉపాధి కల్పిస్తే ఐదేళ్లు, 20 వేల మంది ఉద్యోగులు ఉంటే 10 ఏళ్ల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొన్ని కార్పొరేట్‌ రాయితీలు ఇస్తారు.
          సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా   ప్రస్తుతం దేశంలో రెండు సీఈజెడ్ లను ఏర్పాటు చేస్తారు. తూర్పున ఏపీలో, పశ్చిమాన గుజరాత్ లో  వీటిని ఏర్పాటు చేస్తారు. వచ్చే బడ్జెట్‌లో  సీఈజెడ్‌లపై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు ఆచార్య అరవింద్‌ పనగారియా సారధ్యంలో ఒక బృందం ఏపీలో సీఈజెడ్‌ ఏర్పాటుకి ఉన్న అవకాశాలను సెప్టెంబర్ లో పరిశీలించింది. సీఈజెడ్‌ ఏర్పాటుకి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం-గంగవరం, కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతాలు అనువైనవిగా ఈ బృందం భావించింది.
          విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ ఎగుమతులకు ఈ పోర్టులు అనుకూలంగా ఉన్నాయి.  పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారు. మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలో ఏపీ అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   2015-16 లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాకలతోపాటు తీర ఉపాధి మండలి కూడా ఏర్పడితే ఇక్కడి తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుంది.

అమరావతి మౌలిక వసతుల ప్రణాళిక పూర్తి


Ø 90 శాతం పైగా భూమి స్వాధీనం
Ø ప్రధాన రోడ్లకు టెండర్ల పిలుపు
Ø ప్రముఖ సంస్థలకు భూముల కేటాయింపు
Ø మౌలిక వసతులు, భూగర్భ కేబుల్ కు త్వరలో టెండర్లు
Ø 742 ఎంఎల్డీ మంచినీరు – 592 ఎంఎల్డీ మురుగునీరు
Ø 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు - 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరా
          
          నూతన ప్రజా రాజధాని అమరావతి మహానగరానికి కావలసిన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళిక పూర్తి అయింది. అత్యున్నత స్థాయిలో మౌలిక వసతులతోపాటు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం, పర్యావరణ అనుకూల అభివృద్ధి అమరావతికి మూలస్థంభాలుగా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న రాజధానికి అవసరమైన ప్రధాన రోడ్లు, నీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా, కేబుల్ వ్యవస్థ వంటి మౌలిక అవసరాలను తీర్చడానికి కావలసిన చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆధునిక రాజధానికి 742 ఎంఎల్ డీ(మిలియన్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇంత నీటి సరఫరాకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునికమైన రీతిలో మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. 592 ఎంఎల్ డీల మురుగు నీరు ప్రవహించే అవకాశం ఉందని లెక్క తేల్చారు. ఇందు కోసం 316 (నాళాలు, అనుబంధ నాళాలు) కిలోమీటర్లు +277 (సంగ్రాహకాలు) కిలో మీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణం చేస్తారు. అలాగే 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరాకు కావలసిన చర్యలు చేపట్టారు. ఇన్ ఫ్రాస్టక్చర్, పీఎంసీ(ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్), బ్రూ అండ్ గ్రీన్ (జలకళ-పచ్చదనం) ... అందరు కన్సల్టెంట్లతో సీఆర్డీఏ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సేవల రంగం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

90 శాతం పైగా భూమి స్వాధీనం
            అమరావతి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. 90 శాతం పైగా భూమిని సీఆర్టీఏ స్వాధీనం చేసుకుంది.  రాజధాని పరిధిలో 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 37,505 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 34,984 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అత్యంత ఆధునిక ప్రభుత్వ భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్ లుగా లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్, మన దేశానికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ లను ఎంపిక చేశారు. మిగిలిన ప్రభుత్వ భవనాల ఆర్కిటెక్ట్ ల ఎంపికకు కూడా టెండర్లను పిలిచారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యంగా ప్రజా రవాణా వ్యవస్థకు రూపకల్పన చేశారు. దానికి అనుగుణంగానే ప్రధానమైన రోడ్లు అన్నిటికి టెండర్లు పిలిచారు. భూగర్భంలో ఈహెచ్ టీ(ఎలక్ట్రానిక్ హై టెక్షన్) కేబుల్ లైన్స్ అమర్చడానికి టెండర్లను త్వరలో పిలుస్తారు.

 రానున్న అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగునంగా రాజధానిలో వివిధ ప్రముఖ విద్య, వైద్య సంస్థలకు భూములు కేటాయించారు. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు.  ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

  రాజధానిలో పాఠశాలలు, స్టార్ హోటళ్లు, హాస్పటళ్లు, ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్) సెక్టార్ లో నిర్మాణానికి సీఆర్డీఏ ఆర్.ఎఫ్.పీ.లను ఆహ్వానించింది.  160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. అందులో భాగంగా  జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఆర్ఎఫ్ పీలను ఆహ్వానించింది. అలాగే ఒక 5స్టార్, ఒక 4స్టార్, 4 త్రీస్టార్ హోటళ్లకు ఆర్ఎఫ్ పీలను విడుదల చేసింది. ఇప్పుడే ప్రత్యేక పరిశ్రమగా ఎదుగుతున్న ఎంఐసీఈ రంగంలో కూడా టెండర్లను పిలిచారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ శక్తి వంటి వాటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.

రాజధాని అమరావతిలో 27 పట్టణాలు


§  క్రమపద్దతిలో వాణిజ్య కేంద్రాల నిర్మాణం
§  ప్రణాళికా బద్ధంగా పట్టణాలు, ప్రాంతాలు, రోడ్లు, పార్కులు
§  ప్రతి పట్టణంలో జూనియర్ కాలేజీ, మెట్రో స్టేషన్
§  సీఆర్డీఏ ప్రాజెక్ట్ నివేదిక

         ఆధునిక  రాజధాని అమరావతి మహానగరంలో 27 పట్టణాలు ఉండేవిధంగా  సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రాజెక్ట్ నివేదిక రూపొందించింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 53,478 ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో గ్రీన్-బ్లూ (పచ్చదనం-జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని కేటాయించారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలో మీటర్ల ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుంది.  రాజధానిలో వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ 9 నగరాలు (పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు) నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి ఎకరాలలో రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. దాదాపు 28 వేల ఇళ్లు, లక్ష మంది జనాభా ఉంటారు. ఒక్కో పట్టణంలో నాలుగు రహదారులు నిర్మిస్తారు. వాటిని పట్టణ సరిహద్దులలో నిర్మించే ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తారు. ప్రతి పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ,  ఒక మెట్రో స్టేషన్ నిర్మిస్తారు.
          ఒక్కో పట్టణాన్ని నాలుగు సమాన ప్రాంతాలు (నైబర్ హుడ్- ఇరుగుపొరుగు) గా విభజిస్తారు. 250 ఎకరాలలో కిలోమీటర్ లోపల ఉండే ఒక్కో ప్రాంతంలో దాదాపు 7 వేల గృహాలు, 25 వేల జనాభా ఉంటారు. ఈ ప్రాంతంలో ఉండే అందరికి నడచి వెళ్లేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్ మాల్ వంటివి అందుబాటులో ఉంటాయి. రాజధానిలో ఇటువంటి ప్రాంతాలు వంద వరకు ఉంటాయి.  ఒక్కో ఇరుగుపొరుగు ప్రాంతాన్ని మళ్లీ నాలుగు సమానమైన చిన్ని చిన్న ప్రాంతాలు(కమ్యునిటీలు)గా విభజిస్తారు. 62.5 ఎకరాలలో అర కిలోమీటరు పరిధిలో ఉండే ఈ కమ్యునిటీలో దాదాపు 1700 ఇళ్లు, ఆరు వేల జనాభా ఉంటారు. ఒక్కో  కమ్యునిటీని మళ్లీ రెండు నుంచి నాలుగు క్లస్టర్(పరిమిత ప్రదేశం)లుగా విభజిస్తారు. ఒక్కో క్లస్టర్ లో ఒక్కో పార్కు ఉంటుంది. అలాగే ఆ ప్రదేశంలో ఉండేవారందరికీ కలిపి వాహనాలు నిలుపుకోవడానికి ఉమ్మడి పార్కింగ్ ప్రదేశం ఉంటుంది. ఒక్కో క్లస్టర్ 15 నుంచి 30 ఎకరాల ప్రదేశంలో ఉంటుంది. ఇందులో మూడు వందల నుంచి 8 వందల కుటుంబాల వరకు ఉంటాయి. జనాభా 1500 నుంచి మూడు వేల వరకు ఉంటారు. ప్రణాళికాబద్దంగా నిర్మిస్తున్న నగరమైనందున కావలసిన రీతిలో పట్టణాలు, ప్రాంతాలు, క్లస్టర్లు, రోడ్లు, వాణిజ్య కేంద్రాలు, కాలేజీలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు విభజించుకోవడానికి, నిర్మించుకోవడానికి వీలవుతుంది.

క్రమపద్దతిలో వాణిజ్య కేంద్రాల నిర్మాణం
కృష్ణా నది ఒడ్డున ఒక క్రమ పద్దతిలో వాణిజ్య కేంద్రాలను(భవనాలు) నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన వాణిజ్య కేంద్రం (సీబీడీ-సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్)గా తీర్చిదిద్దుతారు. ఇక్కడ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, కార్పోరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. వాణిజ్యపరంగా మూడు ప్రాంతీయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. స్థానిక వాణిజ్య అవసరాలకు ప్రతి కమ్యునిటీలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు.

60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది.  ఆహ్లాదకరమైన వాతావరణం కోసం  3 నగర స్థాయి పార్కులు, 27 పట్టణ స్థాయి పార్కులు, వందకు పైగా చిన్న పార్కులు ఏర్పాటు చేస్తారు. అత్యంత ఆధునికంగా ప్రపంచ స్థాయిలో మహా అద్భుత నగర నిర్మాణ పనులలో సీఆర్డీఏ నిమగ్నమై ఉంది.


జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.







ఏపీలో 44 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు


·       అత్యధికంగా గన్నవరం నుంచి 76 శాతం పెరుగుదల
·       తిరుపతి నుంచి 43 శాతం పెరుగుదల
·       విశాఖలో 15 లక్షలు దాటిన ప్రయాణికులు
·       విమానాశ్రయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

           రాష్ట్రంలో రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామికంగా, విద్య,వైద్య పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో దేశ, విదేశీ ప్రయాణికులు వచ్చిపోతుండటంతో విమాన సర్వీసులు కూడా పెంచారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం, తిరుపతి, గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో, ఈ ఏడాది అదే కాలంలో ఆయా విమానాశ్రయాల నుంచి ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సంబంధిత అధికారులు విడుదల చేశారు. గత ఏడాది రాష్ట్రంలో  16,91,448 మంది ప్రయాణించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 24,28,612 మందికి చేరింది. అంటే 44 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్బోబర్ వరకు ప్రయాణించిన ప్రయాణికులను ఈ ఏడాది అదే కాలంతో పోల్చితే 19 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది.
           గన్నవరం విమానాశ్రయంలో అత్యధికంగా 76 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. అమరావతికి విదేశీ ప్రముఖులు, దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు తాకిడి ఎక్కువైంది. దాంతో అమరావతికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గత ఏడాది 8 నెలల్లో ఈ విమానాశ్రయం నుంచి 2,48,662 మంది ప్రయాణించగా, ఈ ఏడాది అదే కాలంలో 4,37,928 మంది ప్రయాణించారు. విశాఖ నగరం వివిధ పరిశ్రమలు, ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గత ఏడాది 11,00,114 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 15,25,518 మంది ప్రయాణించారు. 39 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. ఏడుకొండల స్వామివారికి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుపతి విమానాశ్రయం నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 43 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 2,01,272 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 2,87,131 మంది ప్రయాణించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే క్రమంలో ఇక్కడ నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 21 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 1,41,440 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 1,71,491 మంది ప్రయాణించారు.  కడప విమానాశ్రయంలో ఈ ఏడాదే రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ నుంచి 6,544 మంది ప్రయాణించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ ప్రైవేటు విమానాశ్రయం కూడా ఉంది.
             రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు సాధించే క్రమంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో
మౌలిక వసతుల కల్పనలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్ పోర్ట్  ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో విమాన రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో  ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండటంతో దీని ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్ తో దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభిస్తుంది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచుతారు. అందువల్ల తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతారు.  రాష్ట్రంలో అతి పెద్దదైన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు కూడా విమాన సర్వీ సులు నడుస్తున్నాయి. దీనిని  కూడా  అభివృద్ధి చేస్తారు. రాజమండ్రిలోని మధురపూడి  విమానాశ్రయంలో రన్ వేని విస్తరణ కోసం 850 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఉన్న 1750 మీటర్ల  రన్ వేను 3,165 మీటర్ల కు పొడిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో  జరుగుతున్న ఈ రన్ వే విస్తరణ పనులు 2018 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారు.

   కొత్త విమానాశ్రయాల నిర్మాణం:  విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశవిదేశీ వ్యాపారులు, అధికారులు, పర్యాటకులకు గన్నవరం విమానాశ్రయం ఒక్కటే సరిపోదన్న ఆలోచనతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)తో అంతర్జాతీయ స్థాయిలో దీనిని నిర్మిస్తారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు.

జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆశాజనకంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు

Ø మత్స్య సంపదలో తిరులేని పురోగతి
Ø అగ్ర రాష్ట్రాల స్థాయికి ఎగబాకుతున్న ఏపీ
            రాష్ట్రంలో ఈ ఏడాది అర్థ సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రణాళికలు ఫలించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి  రూ. 2,21,907 కోట్ల(2011-12 ధరలలో)తో వృద్ధి రేటు 12.23 శాతం ఉండగా, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రూ. 42,006 కోట్లతో 24.44 శాతంగా ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 7.20 శాతం కాగా, వ్యవసాయం, అనుబంధ రంగాలలలో 2.51 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. రెండంకెల సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా  మత్స్య పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.  ఈ రంగం రూ.17,578 కోట్ల ఉత్పత్తితో  తిరుగులేనివిధంగా 42.57 శాతం వృద్ధి రేటు సాధించింది.   చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో  రాష్ట్రం నిలిచింది. అద్వితీయమైన మత్స్య సంపదకు ఏపీ చిరునామాగా మారింది. జాతీయ స్థాయిలో ఈ అర్ధ సంవత్సరంలో 5.26 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. ఆ తరువాత పండ్లు, పూలు ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఉద్యానవన రంగం లక్ష్యానికి మించి రూ.3,151 కోట్లతో 18.33 శాతం వృద్ధి సాధించింది. ఇక ప్రధానమైన వ్యవసాయ రంగం 759 కోట్ల ఉత్పత్తితో 3.69 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో వృద్ధి రేటు 1.55 శాతం మాత్రమే నమోదైంది.
పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 9.98 శాతం

పారిశ్రామిక రంగంలో ఈ ఏడాది అర్థ సంవత్సరంలో రాష్ట్రం ఉత్పత్తి రూ.63,229 కోట్లతో  9.98 శాతం నమోదైంది. జాతీయ స్థాయిలో 5.60 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది. పారిశ్రామిక రంగంలో వివిధ విభాగాలను పరిశీలిస్తే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు రూ.9,125 కోట్లతో 11.70 శాతం, మైనింగ్, క్వారీలు రూ. 5,750 కోట్లతో 12.20 శాతం, ఉత్పత్తి విభాగం రూ.25,798 కోట్లతో 10.20 శాతం, నిర్మాణ విభాగం రూ.22,556 కోట్లతో 8.52 శాతం వృద్ధి రేటు సాధించాయి.
సేవల రంగం ఈ అర్థ సంవత్సరంలో రూ.1,16,672 కోట్లతో 9.57 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ స్థాయిలో 9.20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ రంగంలో వివిధ విభాగాలను పరిశీలిస్తే ఒక్క రైల్వేస్ లో జాతీయ స్థాయి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో  మైనస్ 5.30 వృద్ధి రేటు నమోదైంది. మిగిలిన విభాగాలు 8 నుంచి 10 శాతం పైగా వృద్ధి రేటు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు రూ.25,212 కోట్లతో 11.11 శాతం, కమ్యూనికేష్స్ విభాగం రూ.4,842 కోట్లతో 8.37 శాతం, రవాణా విభాగం రూ.18,065 కోట్లతో 9.61 శాతం,  బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలు రూ.11,407 కోట్లతో 8.20 శాతం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రూ. 22,592 కోట్లతో 9.15 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రూ.12,387 కోట్లతో 9.63 శాతం వృద్ధి రేట్లు సాధించాయి.
ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ)లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ రూ.4,93,641 కోట్లతో 10.99 శాతం వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచింది.   ఈ ఏడాది అర్థ సంవత్సరంలో కూడా అగ్రభాగానే ఉంది. దాదాపు అన్ని రంగాలలో జాతీయ స్థాయిని మించి అభివృద్ధి నమోదవుతోంది. వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నివడం ఖాయం.

జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.