§ క్రమపద్దతిలో
వాణిజ్య కేంద్రాల నిర్మాణం
§
ప్రణాళికా బద్ధంగా పట్టణాలు, ప్రాంతాలు,
రోడ్లు, పార్కులు
§
ప్రతి పట్టణంలో జూనియర్ కాలేజీ, మెట్రో
స్టేషన్
§ సీఆర్డీఏ ప్రాజెక్ట్
నివేదిక
ఆధునిక
రాజధాని అమరావతి మహానగరంలో 27 పట్టణాలు ఉండేవిధంగా సీఆర్డీఏ (రాజధాని
ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రాజెక్ట్ నివేదిక రూపొందించింది. గుంటూరు
జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో
53,478 ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించనున్న విషయం
తెలిసిందే. ఇందులో గ్రీన్-బ్లూ (పచ్చదనం-జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని
కేటాయించారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలో మీటర్ల ప్రాంతంలో రాజధాని నిర్మాణం
జరుగుతుంది. రాజధానిలో వివిధ అంశాలకు
ప్రాధాన్యత ఇస్తూ 9 నగరాలు (పరిపాలన, ఆర్థిక, న్యాయ,
వైద్య, పర్యాటక, మీడియా,
ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల
నగరాలు) నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి
ఎకరాలలో రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. దాదాపు 28 వేల ఇళ్లు, లక్ష
మంది జనాభా ఉంటారు. ఒక్కో పట్టణంలో నాలుగు రహదారులు నిర్మిస్తారు. వాటిని పట్టణ
సరిహద్దులలో నిర్మించే ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తారు. ప్రతి పట్టణంలో ఒక
జూనియర్ కాలేజీ, ఒక మెట్రో స్టేషన్
నిర్మిస్తారు.
ఒక్కో పట్టణాన్ని నాలుగు సమాన ప్రాంతాలు
(నైబర్ హుడ్- ఇరుగుపొరుగు) గా విభజిస్తారు. 250 ఎకరాలలో కిలోమీటర్ లోపల ఉండే ఒక్కో
ప్రాంతంలో దాదాపు 7 వేల గృహాలు, 25 వేల జనాభా ఉంటారు. ఈ ప్రాంతంలో ఉండే అందరికి నడచి
వెళ్లేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్ మాల్ వంటివి అందుబాటులో ఉంటాయి.
రాజధానిలో ఇటువంటి ప్రాంతాలు వంద వరకు ఉంటాయి. ఒక్కో ఇరుగుపొరుగు ప్రాంతాన్ని మళ్లీ నాలుగు
సమానమైన చిన్ని చిన్న ప్రాంతాలు(కమ్యునిటీలు)గా విభజిస్తారు. 62.5 ఎకరాలలో అర
కిలోమీటరు పరిధిలో ఉండే ఈ కమ్యునిటీలో దాదాపు 1700 ఇళ్లు, ఆరు వేల జనాభా ఉంటారు. ఒక్కో కమ్యునిటీని మళ్లీ రెండు నుంచి నాలుగు క్లస్టర్(పరిమిత
ప్రదేశం)లుగా విభజిస్తారు. ఒక్కో క్లస్టర్ లో ఒక్కో పార్కు ఉంటుంది. అలాగే ఆ
ప్రదేశంలో ఉండేవారందరికీ కలిపి వాహనాలు నిలుపుకోవడానికి ఉమ్మడి పార్కింగ్ ప్రదేశం
ఉంటుంది. ఒక్కో క్లస్టర్ 15 నుంచి 30 ఎకరాల ప్రదేశంలో ఉంటుంది. ఇందులో మూడు వందల
నుంచి 8 వందల కుటుంబాల వరకు ఉంటాయి. జనాభా 1500 నుంచి మూడు వేల వరకు ఉంటారు. ప్రణాళికాబద్దంగా
నిర్మిస్తున్న నగరమైనందున కావలసిన రీతిలో పట్టణాలు, ప్రాంతాలు, క్లస్టర్లు,
రోడ్లు, వాణిజ్య కేంద్రాలు, కాలేజీలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, పార్కింగ్
ప్రదేశాలు విభజించుకోవడానికి, నిర్మించుకోవడానికి వీలవుతుంది.
క్రమపద్దతిలో వాణిజ్య కేంద్రాల నిర్మాణం
కృష్ణా
నది ఒడ్డున ఒక క్రమ పద్దతిలో వాణిజ్య కేంద్రాలను(భవనాలు) నిర్మించాలని
ప్రతిపాదించారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన వాణిజ్య కేంద్రం (సీబీడీ-సెంట్రల్ బిజినెస్
డిస్ట్రిక్ట్)గా తీర్చిదిద్దుతారు. ఇక్కడ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, కార్పోరేట్
కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. వాణిజ్యపరంగా మూడు ప్రాంతీయ కేంద్రాలను కూడా
ఏర్పాటు చేస్తారు. స్థానిక వాణిజ్య అవసరాలకు ప్రతి కమ్యునిటీలో ఒక షాపింగ్ కాంప్లెక్స్
నిర్మిస్తారు.
60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు
అంతర్జాతీయ
నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో విశాలమైన రోడ్లు
నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల
వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు
నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు,
186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల
పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని
నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో
నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం 3 నగర స్థాయి పార్కులు, 27
పట్టణ స్థాయి పార్కులు, వందకు పైగా చిన్న పార్కులు ఏర్పాటు
చేస్తారు. అత్యంత ఆధునికంగా ప్రపంచ స్థాయిలో మహా అద్భుత నగర నిర్మాణ పనులలో
సీఆర్డీఏ నిమగ్నమై ఉంది.
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం, సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
No comments:
Post a Comment