Mar 13, 2017

అమరావతికి ఐటీ కంపెనీల రాక

   ü ఒకే రోజు 8 కంపెనీలను ప్రారంభించిన సీఎం
ü కీలక పాత్ర పోషిస్తున్న ఏపీఎన్ఆర్టీ
ü వందల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి
ü మైక్రోసాఫ్ట్, హెచ్ సీఎల్ కూడా వచ్చే అవకాశాలు
ü ఐటీ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు వెబ్ సైట్

           
నూతన రాజధాని అమరావతికి ఐటీ కంపెనీల రాక మొదలైంది. గత నెల 17వ తేదీ ఒక్క రోజే విజయవాడలో అత్యాధునికంగా నిర్మించిన ఇండ్ వెల్ స్క్వేర్ భవనంలో 8 కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కంపెనీల ద్వారా 650 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరో 20 కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత మరో వంద కంపెనీల వరకు ఇక్కడ స్థాపించడానికి ప్రవాస ఆంధ్రులు ఆసక్తి చూపుతున్నాను.  ఐటీ కంపెనీలు, ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) కంపెనీల రాకకు, పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగువారి సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతూ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, వేల మందికి ఉపాధి కల్పించడానికి ఏపీఎన్ఆర్టీ ప్రణాళికలు రూపొందించుకుంది. ప్రభుత్వ సలహాదారుడైన డాక్టర్ రవి వేమూరి అధ్యక్షులుగా పూర్తీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్షలేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు. 2016 మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ఈ సొసైటీలో 83 దేశాలకు చెందిన 32వేల మంది సభ్యులుగా ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. 192 మంది అంతర్జాతీయ కోఆర్డినేటర్లు, ఆరుగురు ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. ఈ సొసైటీ ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పని చేస్తోంది. ప్రవాస తెలుగువారికి పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. ముందుకు వచ్చినవారికి పెట్టుబడులకు సంబంధించిన, న్యాయపరమైన సలహాలు, బ్యాంకింగ్ సేవలు అందజేస్తోంది. పరిశ్రమల స్థాపనలో వివిధ ప్రక్రియలలో వారికి సహాయ సహకారాలు అందజేస్తోంది. వారు స్వదేశానికి వచ్చే సమయంలో ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ దగ్గర నుంచి హోటల్ రూమ్స్, క్యాబ్స్ బుకింగ్, దేవాలయాల సందర్శనలకు సహాయపడుతోంది. ప్రవాస తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో కూడా ఈ సొసైటీ సహకారం అందిస్తుంది.  డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు, పాస్ పోర్టు, ఓటర్ కార్డు వంటి వాటిని పోగొట్టుకున్నప్పుడు వాటిని వెతికే విషయంలో ఈ సొసైటీకి సంబంధించిన బృందం సహాయపడుతుంది. వారి సమయం వృధాకాకుండా చూస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలలో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తోంది. గత నవంబర్ వరకు విశాఖపట్నంలో  ప్రవాస తెలుగువారు 9 ఐటీ కంపెనీలను స్థాపించారు. ఆ కంపెనీల (డీజిట్, ఎవాల్యూట్, నెట్ వర్క్ ఆబ్జెక్ట్, రిసికార్ప, కైరోస్,అంజూర్,ప్రిమస్,ఫ్యాబిట్,థాట్ వేవ్) ద్వారా 430 మందికి ఉపాధి లభిస్తోంది.

విజయవాడలో యాక్సెల్‌ ఐటీ, హార్జన్‌ ఐటీ, ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌, అడాప్ట్‌ సొల్యూషన్స్‌, అడ్వాన్స్‌ సాప్ట్‌, ఇంటెల్లి సాఫ్ట్‌, టైమ్‌స్క్వేరిట్‌ వంటి ఐటీ కంపెనీలను ప్రారంభించారు. అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఏపీఎన్‌ఆర్టీయే సమకూర్చనుంది.  ఈ కంపెనీల్లో పనిచేయడానికి అనుకూలంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తగి శిక్షణ ఇప్పించేందుకు మరో 14 కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలను ఇక్కడ  ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలకు మంగళగిరి వద్ద ఉన్న ఐటీ టవర్‌లో స్థలం కేటాయించారు. ప్రస్తుతం ప్రారంభించిన ఐటీ కంపెనీలకు కావలసిన అభ్యర్థులను ఎంపిచేసి వారికి శిక్షణ ఇస్తారు. మూడు మాసాల్లో శిక్షణ పూర్తి చేసి జూన్‌ నాటికి వారు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలుగా చేరే అవకాశం ఉంది. అభ్యర్థులు ఐటీసిఇఎన్ టీఆర్ఏఎల్.ఐఎన్( itcentral.in) అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి తమ దరకాస్తుని పోస్ట్ చేయాలి.  అర్హులైన అభ్యర్థులను వారు ఇంటర్వ్యూకు పిలిచి, ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు.  అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నగరాన్ని పెద్ద ఐటీ హబ్‌గా రూపొందిస్తే  ఇంజినీరింగ్‌ యువతకు స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్ రప్టివ్ సాఫ్ట్ వేర్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ వంటి సంస్థలు ప్రారంభించారు. అత్యధిక మంది రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.
రూ.201.50 కోట్ల పెట్టుబడితో 2615 మందికి ఉపాధి
          అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో దాదాపు రూ.201.50 కోట్ల పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ తో 75 పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా 2615 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల స్థాపనకు 6348.50 యూనిట్ల హెచ్ పీ విద్యుత్, 8,96,976 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వాటిలో లక్ష్మీ ప్లాస్టిక్స్, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, శ్రీభరణి ఎంటర్ ప్రైజెస్, సీ అండ్ ఎన్ ఇండస్ట్రీస్, ఎస్వీ పాలిమర్స్,మార్క్ ఆంగ్రో ఇండస్ట్రీస్, గౌతమ్ ఇండస్ట్రీస్, జీఎస్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు  ఉన్నాయి. నాలుగు ఐటీ, ఒక ఆటోమొబైల్ కంపెనీలు విశాఖపట్నంలో తమ యూనిట్లను స్థాపించడానికి వచ్చే ఫిబ్రవరిలో పనులను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటోమోటిక్ రోబోటిక్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ప్రెసిసింగ్ ఇంజన్ టెస్టింగ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ని స్థాపించాలన్న యోచనలో ఉంది. ఈ యూనిట్ స్థాపిస్తే 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అమరావతి, విశాఖలలో వచ్చే మార్చిలో 14 ఐటీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంశాలలో  శిక్షణ ఇస్తారు.
ఇంతే కాకుండా దేశంలో ఐటి దిగ్గజాల్లో ఒకటైన అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కూడా ఇక్కడ తమ యూనిట్ స్థాపించే ప్రయత్నంలో ఉంది.  తమ అతిపెద్ద డెవలప్ మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఇక్కడ 30 ఎకరాల స్థలంలో నిర్మించాలన్న ఆలోచనతో ఆ కంపెనీ ఉంది. ఇందు కోసం  ఆ కంపెనీ దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తమ యూనిట్ ను  అమరావతిలో స్థాపించే అవకాశం ఉంది. ఈ విషయమై ఏపీకే చెందిన ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం చంద్రబాబు నాయుడు పలుసార్ల చర్చలు జరిపారు. ఎలాగైనా ఆ కంపెనీని ఇక్కడకు తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. ఈ కంపెనీలన్నీ అమరావతి వస్తే ఇది పెద్ద సాఫ్ట్ వేర్ హబ్ గా రూపొందే అవకాశం ఉంది. అలాగే వేల మంది యువతకు ఉపాధి లభిస్తుంది.

-                                                                              శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Mar 9, 2017

ఫలితాల ఆధారిత బడ్జెట్

Ø 2017-18  బడ్జెట్ 13న ప్రవేశపెట్టే అవకాశం
Ø వినూత్న విధానంలో బడ్జెట్
Ø 7 మిషన్ల ప్రాతిపధికగా లక్ష్యాల నిర్ధేశం
Ø యువతకు, ఆడబిడ్డలకు కొత్త పథకాలు
Ø  ఇ-ప్రగతి నామ సంవత్సరంగా ప్రకటన
Ø అవసరాలే కొలమానంగా కేటాయింపులు
Ø ప్రణాళిక-ప్రణాళికేతర విభజనలేదు
Ø ప్రతి కుటుంబం రూ. 10 వేల ఆదాయమే లక్ష్యం         
వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) ఫలితాల ఆధారిత బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మానవాభివృద్ధి సూచికకు దేశంలో కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వే దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  13న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఫలితాలు రాబట్టేదిగా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. నిధుల ఏకీకరణ, మళ్లింపుతో ఇప్పటివరకు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించింది. గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కనిపిస్తోంది. ఈ సారి కూడా కొత్త శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ అదే పంథాలో ఉండే అవకాశం ఉంది. సమర్థ నీటి వినియోగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్థ సంవత్సరంలో వ్యవసాయంలో వృద్ధి రేటు 24.5 శాతం నమోదైంది. వచ్చే ఏడాది వ్యవసాయ రంగం 25 శాతం, అనుబంధ రంగాలు 30 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించారు. అంతేకాకుండా 7 మిషన్ల ప్రాతిపధికగా లక్ష్యాలు, ఫలితాలు  నిర్ధేశించుకొని బడ్జెట్ ను  తయారు చేయనున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన కష్టాలను అధిగమించి, అభివృద్ధి సాధించేందుకు మిషన్ మోడ్ తో పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక రంగ మిషన్, సామాజిక, పారిశ్రామిక, సేవా రంగాలతోపాటు మౌలికసదుపాయాలు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మిషన్ మొత్తం ఏడు మిషన్లతో ఈ ప్రభుత్వం  కొత్త శకం ప్రారంభించింది. నవ్యాంధ్రప్రదేశ్ నిలదొక్కుకొని అగ్రస్థానానికి ఎగబాగటానికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా.
          పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించడంతోపాటు అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో మిషన్ల విధానాన్ని తీసుకువచ్చారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ఫలిత ఆధారిత బడ్జెట్ గా అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత ఉండేవిధంగా అన్ని శాఖలు జాగ్రత్త వహిస్తున్నాయి.  ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం ఉండాలనేది ప్రభుత్వ అభిప్రాయం. అన్ని శాఖల్లో సంపూర్ణ పారదర్శకత కోసం 2017-18 సంవత్సరాన్ని ప్రభుత్వం ఇ-ప్రగతి నామ సంవత్సరంగా ప్రకటించింది. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నిధుల సమీకరణ కోసం జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్, రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థ, మునిసిపట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మొత్తం ఆ సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.

         సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయి.   వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టింది. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా వచ్చే  ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండేవిధంగా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యావ్యవస్థను సంస్కరించి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించి, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయి.

          అవసరాలే కొలమానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదు. వినూత్న విధానంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు  తమ అవసరాలకు తగ్గట్టు అంచనాలు రూపొందించారు.  అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు చేస్తున్నారు.   సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా వుంటుందన్నది అందరి అభిప్రాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు.  పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడాలన్నది  ప్రభుత్వ లక్ష్యం.   2018 డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో ప్రవేశ పెట్టనున్న కొత్త  బడ్జెట్ చాలా కీలకం కానుంది.
            కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు బడ్జెట్లు  ప్రవేశపెట్టారు. ఇది మూడవ బడ్జెట్. ఇందు లో  యువతకు, ఆడబిడ్డల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి స్పష్టంగా కనిపించేలా ఈ బడ్జెట్ ను రూపొందించనున్నారు. కొత్త బడ్జెట్ రూ.1,46,833 కోట్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం తగ్గుతుందని, రుణ చెల్లింపులు పెరుగతాయన్నది ఆర్థిక శాఖ అంచనా. కేంద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుదన్న అభిప్రాయం కూడా ఉంది. 2016-17తో పోలిస్తే బడ్జెట్‌ పరిమాణం 7.55 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. 2015-16తో పోలిస్తే 2016-17 బడ్జెట్‌ పరిమాణం ఏకంగా 20.9 శాతం పెరిగింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల బడ్జెట్‌ పరిమాణం తగ్గనుందని తెలుస్తోంది.

     కేంద్ర పథకాల ద్వారా ఎక్కువ నిధులను తెచ్చుకోవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర వార్షిక బడ్జెట్ ఇప్పటికే పార్లమెంట్ లో ప్రవేశపెట్టినందున, దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కు రూపకల్పన జరుగుతోంది.   కేంద్ర పథకాల్లో 60:40 నిష్పత్తిలో నిధులు వస్తాయి. ఉపాధి హామీ తరహాలో డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని నిధులు వస్తాయి. ఇవి కాకుండా కేంద్ర అథారిటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆయా మార్గాల్లో గ్రాంట్లు గానీ, తక్కువ వడ్డీతో రుణాలు గానీ, ఎంత వీలైతే అంత తెచ్చుకొనేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. కేంద్రం అమలు చేస్తున్న 73 పథకాలతో లక్ష్య సాధనను నిర్దేశించుకొని, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 153 రకాల ప్రభుత్వ కార్యకలాపాలను నరేగా(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులతో ఏకీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా ఈ సారి రూ.7500 కోట్లు ఖర్చుచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అలాగే. స్వచ్ఛ భారత ఫండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ వద్ద రూ.40 వేల కోట్ల కార్పస్‌ ఉంది. కేంద్ర పథకాలకు కేటాయించిన నిధుల్లో ఏ శాఖ ఎంత అవకాశం ఉంటే ఆ మేరకు నిధులు తెచ్చుకునే విధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశ జనాభాలో 4.43 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు.  ఆ దామాషా ప్రకారం నిధులు తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

-                                                   శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Mar 6, 2017

ఫైబర్ గ్రిడ్ ద్వారా సాంకేతిక విప్లవం

ü ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్
ü రాష్ట్రంలో 17 సీసీసీలు
ü అమరావతి, విశాఖపట్నంలలో డేటా సెంటర్లు

     
    ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. మొదట ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో జనవరిలో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పది లక్షల సీపీఈ బాక్సులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం లక్షకుపైగా కనెక్షన్లు ఇచ్చారు. మార్చి చివరకు పది లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఈ నేపధ్యంలో ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాలతోపాటు ఒక రాష్ట్ర స్థాయి సెంటర్, 3 పోలీస్ కమిషనరేట్ స్థాయి సెంటర్లు మొత్తం 17 ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల సమాచారం ఈ కేంద్రాలకు చేరేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.  జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల్లో సీసీసీ ఏర్పాటు చేయడానికి మూడు వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనం సమకూరుస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో కమిషనరేట్ స్థాయిలో సీసీసీలు ఏర్పాటు చేయడానికి అదనంగా మరో 3వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనాలు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి సీసీసీ ఏర్పాటుకు అమరావతిలో 8 వేల నుంచి పది వేల చదరపు అడుగుల భవనం సమకూరుస్తారు. ప్రతి సీసీసీకి అత్యాధునిక కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలు వంటి వాటిని సమకూరుస్తారు. జిల్లా సీసీసీలు  రాజధాని సీసీసీకి అనుసంధానంగా పని చేస్తుంటాయి. సమాచారం విషయంలో  భవిష్యత్ లో వీటిని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అమరావతి, విశాఖలలో డేటా సెంటర్లు
అలాగే రాజధాని అమరావతితోపాటు విశాఖపట్నంలలో రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో  రాజధానిలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) వారు ఇంట‌ర్నెట్‌ ఇన్నొవేటివ్ జ‌పాన్‌(ఐఐజె) సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు అమరావతిలో కూడా పర్యటించారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 9,500 ప్రాంతాలలో 18 వేల సీసీ కెమెరాలు అమర్చుతారు. క్లౌడ్ ప్రాతిపదికన వీసీఎస్(విర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్)ప్రవేశ పెట్టడానికి 4వేల తరగతి గదులను ఎంపిక చేశారు. దాదాపు 5 వేల పాఠశాలలకు ఫైబర్‌నెట్‌ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఫైబర్ గ్రిడ్ ఫేజ్-1లో భాగంగా దేశ వ్యాప్తంగా 12వేల టెలికమ్ టవర్లను అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా ఫైబర్‌నెట్‌ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా  ఇ-ప్రగతిలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఏర్పడుతుంది.


-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

మిషన్ల ప్రాతిపధికగా 2017-18 బడ్జెట్ లక్ష్యాలు

·       13న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
·       ప్రతి శాఖ ఇ-ప్రగతితో అనుసంధానం
·       యువతకు, ఆడబిడ్డలకు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం
·       ఒక్కో మిషన్ పై 45 రోజులకు ఒకసారి సమీక్ష
·       ప్రణాళిక-ప్రణాళికేతర విభజనలేదు
·       సుస్థిర సమ్మిళిత వృద్ధే ధ్యేయం
·       సంక్షేమం-అభివృద్ధి సమతూకం
·       బడ్జెట్ పై నోట్ల రద్దు ప్రభావం పడనుందా?
·       పన్నుల ఆదాయం తగ్గే అవకాశం        
      వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్ లక్ష్యాలను 7 మిషన్ల ప్రాతిపధికగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిచింది.  మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, 13న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఫలితాలు రాబట్టేదిగా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ఆయా శాఖాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన కష్టాలను అధిగమించి, అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిషన్ మోడ్ తో పని చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక రంగ మిషన్, సామాజిక, పారిశ్రామిక, సేవా రంగాలతోపాటు మౌలికసదుపాయాలు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మిషన్ మొత్తం ఏడు మిషన్లతో ఈ ప్రభుత్వం  కొత్త శకం ప్రారంభించింది. పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించడంతోపాటు అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఈ మిషన్ల విధానాన్ని తీసుకువచ్చారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ఫలిత ఆధారిత బడ్జెట్ గా అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత ఉండేవిధంగా అన్ని శాఖలు జాగ్రత్త వహిస్తున్నాయి.  ఇక నుంచి అన్ని మిషన్లపైన 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం ఉండాలనేది ప్రభుత్వ అభిప్రాయం. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నారు.

         సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయి.   వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టింది. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా వచ్చే  ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండేవిధంగా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం ప్రధాన ఆకర్షణగా అగ్రి టూరిజంను ప్రోత్సహిస్తారు. విద్యావ్యవస్థను సంస్కరించి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగానికి అపార నిధులు, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయన్న భావన పలువురిలో ఉంది. అక్షరాస్యతలో, నాక్ రేటింగ్ లో రాష్ట్రం వెనుకబడి వుండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పీఎంకేవీవై (ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన) పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. దానిని మొదటి స్థానంలోకి తీసుకువెళ్లేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో కనీసం 50 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

          అవసరాలే కొలమానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు  తమ అవసరాలకు తగ్గట్టు అంచనాలు రూపొందించారు.  అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు చేస్తున్నారు.   సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా వుంటుందన్నది అందరి అభిప్రాయం. బడ్జెట్ కేటాయింపుల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయించారు.  పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేందుకు ఈ బడ్జెట్ తోడ్పాటు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.   2018 డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో  ప్రవేశ పెట్టనున్న కొత్త  బడ్జెట్ చాలా కీలకం కానుంది.
 కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టే ఈ మూడవ బడ్జెట్ లో  రాష్ట్రంలోని యువతకు, ఆడబిడ్డల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి కళ్లకు కట్టేలా ఈ బడ్జెట్ ను రూపొందించనున్నారు. కొత్త బడ్జెట్ రూ.1,46,833 కోట్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం తగ్గుతుందని, రుణ చెల్లింపులు పెరుగతాయన్నది ఆర్థిక శాఖ అంచనా. కేంద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుదన్న అభిప్రాయం కూడా ఉంది. 2016-17తో పోలిస్తే బడ్జెట్‌ పరిమాణం 7.55 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. 2015-16తో పోలిస్తే 2016-17 బడ్జెట్‌ పరిమాణం ఏకంగా 20.9 శాతం పెరిగింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల బడ్జెట్‌ పరిమాణం తగ్గనుందని తెలుస్తోంది.

     కేంద్ర పథకాల ద్వారా ఎక్కువ నిధులను తెచ్చుకోవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది.  కేంద్ర పథకాల్లో 60:40 నిష్పత్తిలో నిధులు వస్తాయి. ఉపాధి హామీ తరహాలో డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని నిధులు వస్తాయి. ఇవి కాకుండా కేంద్ర అథారిటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆయా మార్గాల్లో గ్రాంట్లు గానీ, తక్కువ వడ్డీతో రుణాలు గానీ, ఎంత వీలైతే అంత తెచ్చుకొనేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారుచేస్తున్నారు. ఢిల్లీతో సంబంధాలు పెంచుకొని ఎక్కువ నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఆయా శాఖల అధికారులు ఎంపీలతో కలసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత ఫండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ వద్ద రూ.40 వేల కోట్ల కార్పస్‌ ఉంది. కేంద్ర పథకాలకు కేటాయించిన నిధుల్లో ఏ శాఖ ఎంత అవకాశం ఉంటే ఆ మేరకు నిధులు తెచ్చుకునే విధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశ జనాభాలో 4.43 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు.  ఆ దామాషా ప్రకారం నిధులు తెచ్చుకునేవిధంగా ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
 -          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Feb 27, 2017

నరేగా నిధులతో గ్రామీణాభివృద్ధి

Ø 2017-18లో భారీ ప్రతిపాదనలు
Ø నిధుల వినియోగ లక్ష్యం రూ.7500 కోట్లు
Ø 4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు
Ø 4 లక్షల పంట సంజీవని కుంటలు
Ø 3 వేల కిలోమీటర్ల పొడవున మొక్కల  పెంపకం
Ø6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు
Ø 70 మినీ స్టేడియంల నిర్మాణం
Ø 90 లక్షల డ్వాక్రా సభ్యుల భాగస్వామ్యం
Ø ‘పల్లెవనం’ పేరుతో గ్రామాల్లో మొక్కలు

        రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి, ఉపాధి హామీకి నరేగా(ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) అత్యంత ఉపయోగకరంగా ఉంది. దీని ద్వారా గ్రామీణులకు ఉపాధితోపాటు అభివృద్ధి జరుగుతోంది. ఈ నిధులతో గ్రామాల్లో పాఠశాల భవనాలు, సిసి రోడ్లు మొదలైన మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే చెరువులు, పంటసంజీవని కుంటల తవ్వకం, చిన్నచిన్న కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, అడవుల పెంపకం, చెట్లు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడేవిధంగా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు నిర్మించడం  వంటి  పనులు చేపడతారు.  153 రకాల కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఉన్న ఈ నిధుల వినియోగానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించేందుకు  త్వరలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నిధులను సమర్ధవంతంగా వినియోగించడానికి, జవాబుదారీతనం వుండేలా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా  సంపద సృష్టి జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
ఎక్కువ శాఖలు నరేగా నిధులు ఉపయోగించుకుని ఆస్తులు సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ పథకం అమలులో రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తున్నందుకు కేంద్రం ప్రశంచింది. ఈ నిధులను వినియోగించి ఉపాధి హామీ పనులు కల్పించడంలో రెండవ స్థానంలో ఉన్న ఏపీని మొదటి స్థానానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.

       రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 661 మండలాల్లోని 13,104 గ్రామ పంచాయతీల్లో ఈ ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఈ పథకం కింద 84,68,774  జాబ్ కార్డులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నాటికి రాష్ట్రంలో నరేగా కింద 11,54,297 పనులు పూర్తి చేశారు. 5,87,080 పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 17,47,57,199 వ్యక్తిగత పని దినాలు కల్పించారు. కూలీలకు కూలి కింద రూ. 2,471 కోట్లు చెల్లించారు. 37,84,846 కుటుంబాలకు చెందిన 62,09,757 మందికి ఉపాధి కల్పించారు.

      రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ పంటలు విషపూరితమవుతున్నాయి. వీటిని వినియోగించిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వాడటం వల్ల మన దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, మిరపకాయలు, కూరగాయలను కొన్ని దేశాలు తిరస్కరిస్తున్నాయి.  సేంద్రీయ ఎరువుల వాడటం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడమేకాకుండా పర్యావరణానికి  రక్షణ చేకూరుతుంది. పర్యావరణ సమతౌల్యతను కాపాడుకోగలిగితే అటు పంటలకు, ఇటు ప్రజలకు కూడా అన్ని విధాల ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.   రసాయనిక ఎరువులు వాడుతూపోతే భూసారం దెబ్బతింటుంది. రానురాను పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సేంద్రీయ వ్యవసాయాన్నే ప్రోత్సహిస్తోంది. సేంద్రీయ వ్యవసాయానికి మించిన మరో ఉత్తమ మార్గంలేదని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇన్ని  ప్రయోజనాలు ఉన్నందున  రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించింది. ఉత్పత్తిలో సస్య రక్షణ చర్యలు చేపట్టి  నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా నరేగా నిధులతో భారీ స్థాయిలో వర్మికంపోస్ట్ యూనిట్లను నెలకొల్పేవిధంగా రైతులను ప్రోత్సహిస్తోంది.  వ్యవసాయ -ఉద్యానవ శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, సెర్ప్ సమన్వయంతో వర్మి కంపోస్ట్ తయారీ, సరఫరాకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు.

    ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయల నరేగా నిధులు ఖర్చు చేశారు.  వచ్చే అర్థిక సంవత్సరం 2017-18లో రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నిధులతో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 4 లక్షల పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల వర్మి కంపోస్ట్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అలాగే  3 వేల కిలోమీటర్ల పొడవున మొక్కల  పెంపకం చేపడతారు.  4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించారు.  6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపడతారు.  రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ధేశించారు.  70 మినీ స్టేడియాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నరేగా నిధులతో మొక్కల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అటు ఉపాధి, ఇటు పచ్చదనం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అటవీ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో,  రహదారులకు ఇరువైపులా ఈ నిధులతో మొక్కలు పెంచుతారు.
      నగర వనాలతో ఆశించిన ఫలితాలు లభించాయి. అందువల్లపల్లెవనంపేరుతో గ్రామాల్లో కూడా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.   గ్రీన్ ఫీల్డ్ లక్ష్య సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుంది.   ఉద్యానవన శాఖ అత్యధిక ఫలితాలు సాధిస్తే పర్యావరణానికి  ఎక్కువ మేలు జరుగుతుంది. రైతులు అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎక్కువ అవకాశం వుంటుంది. నరేగా నిధులను ఖర్చు చేయడం ద్వారా ఈ శాఖ  నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది. 
ఈ నిధులు వినియోగించి చేపట్టే ఉపాధి కార్యక్రమాల్లో రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు చెందిన  90 లక్షల మంది సభ్యులను భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ విధంగా చేస్తే  ప్రతి కుటుంబానికి నెలకు ఖచ్చితంగా రూ. 10 వేల ఆదాయం లభించే అవకాశం లభిస్తుంది.

          ఈ పథకం కింద చేపట్టే పనులను నిధుల కోసం ఆపకుండా, ఆయా శాఖలు తమ వద్ద ఉన్న నిధులను వినియోగించి ఆ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ తరువాత ఎటూ ఆ నిధులు వస్తాయి కాబట్టి డబ్బు ముందుగా ఖర్చు చేసినా ఆయా శాఖలకు ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రతి శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించి లక్ష్యాలను నిర్ణయించుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా నరేగా నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువమందికి ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ పచ్చదనం నింపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

వివాదాస్పద ఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలో దిట్ట

         వివాదాలకు చిరునామా రామ్ గోపాల్ వర్మ.  పరిచయం అక్కరలేని సంచలన సినిమా దర్శకుడు. వివాదాస్పద వాస్తవ ఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలో వర్మ దిట్ట.  అటు సినిమా, ఇటు నిజజీవితంలో ఏదో ఒక వ్యాఖ్య చేసి  వార్తలకెక్కడం ఆయన జీవన శైలిగా మారిపోయింది. సినిమా హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు, చివరికి మత విశ్వాసాలను కూడా  వదలరు. కొన్ని సందర్భాల్లో  చాలా వింత వింతగా  మాట్లాడతారు. ఆయన మాటల ద్వారా ఎంతోమందిని నొప్పిస్తుంటారు. మెప్పిస్తుంటారు. వివాదాలు, సంచలనాలే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో  కొత్తకొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటారు.  వివాదాలు లేకపోతే ఆయనకు ఒక్క క్షణం కూడా గడవదు. ఎంతటి వివాదాన్నైనా వర్మ సీరియస్ గా తీసుకోరు. అదే ఆయన ప్రత్యేకత.  ఆయన ఎన్నుకునే సినిమా కథలు కూడా ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో వివాదాలు రేపి, సంచలనాలు సృష్టించిన వాస్తవ సంఘటనలే అయి ఉంటాయి.  సినిమా టైటిల్ ద్వారా కూడా వర్మ రాము సంచలనాలు సృష్టించగల నేర్పరి. 26/11 ఇండియాపై దాడి, రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి వంటి సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, రక్తి కట్టించడం అంత సామాన్యమైన విషయమేమీకాదు. ఇవన్నీ చాలా వివాదాస్పద వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రాలు. ఈ కథలతో సంబంధం ఉన్న వ్యక్తులు, గ్రూపులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇవేమీ చారిత్రక కథలు కాదు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు. ముఖ్యంగా రక్త చరిత్ర, వంగవీటి చిత్రాలు నిర్మిస్తున్నట్లు వర్మ ప్రకటించినప్పుడు చాలా మంది కంగారుపడ్డారు. ఈ కథలకు సంబంధించి వాస్తవ సంఘటనలు తెలిసినవారు, కీలక పాత్ర పోషించినవారు, మంచి, చెడు ఫలితాలు అనుభవించినవారు ఇంకా బతికే ఉన్నారు. ముఖ్యంగా ఈ కథల్లోని ప్రధాన పాత్రల భార్యలు, వారి పిల్లలు అందరూ బతికే ఉన్నారు. ఆయా కథలకు సంబంధించి కొన్ని ప్రధాన సంఘటనలు ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనాలు  సృష్టించాయి. ఇటువంటి చిత్రాలను నిర్మించి వర్మ ఏం గొడవలు సృష్టిస్తాడోనని కూడా కొందరు భయపడ్డారు. ప్రజలే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా భయపడ్డారు.  ఈ చిత్రాలను నిర్మించవద్దని వర్మకు కొందరు మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో చెప్పారు. కొందరు మామూలుగా, కొందరు బెదిరించి మరీ చెప్పారు. సినిమాలు నిర్మించడంలో ఎంతటి ప్రావీణ్యత ఉందో ఇటువంటివి ధైర్యంగా ఎదుర్కొనడంలో కూడా వర్మ ఘటికుడు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రని, సమాజంలో పలు అంశాలతో పెనవేసుకున్న సంఘటనలను ఎటువంటి వివాదాలకు తావులేకుండా చిత్ర రూపం కల్పించడంలో వర్మ దిట్ట అని రుజువైంది. ఈ చిత్రాలను వర్మ చాలా చాకచక్యంగా నిర్మించారు.
       భారతీయ సినిమా చరిత్రలో ఆ రంగంలోని 24 విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న అత్యంత శక్తివంతుడైన దర్శకుడు వర్మ.   కథల ఎంపిక, చిత్రానువాదం, దర్శకత్వం, చిత్ర ప్రచారం విషయంలో తనకు తనే సాటి.  అతనితో పోల్చగల దర్శకులు మరొకరులేరు. ప్రతి చిత్రంపై అతని ముద్ర ఉంటుంది. అదే అతని ప్రత్యేకత. భారతీయ చిత్ర పరిశ్రమలో  మెగా దర్శకులుగా పేరుపొందినవారి ప్రతిభా సామర్థ్యాలతో పోల్చిచే ఇతనికి చాలా అదనపు అర్హతలు, తెలివితేటలు, శక్తి, సామర్ధ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. కథ- కథనం -  సంగీతం- చిత్రీకరణలో కొత్తదనం చూడంతోపాటు ఆధునిక సాంకేతికతను ఆసాంతం వాడుకునే సమర్ధత ఉన్న దర్శకుడు వర్మ. కొత్త కొత్త ఆలోచనలు, కొత్తపోకడలు పోవడంతోపాటు ఎటువంటి ఆలోచననైనా సినిమాగా రూపొందించగల  సత్తా, సామర్ధ్యం ఆయనకు ఉన్నాయి. కథ పాతదే అయినా కొత్త తరహాలో, అత్యాధునిక సాంకేతిక విలువలతో చిత్రం నిర్మించడం అతని ప్రత్యేకత. అందుకే ఇంత సుదీర్ఘ కాలం వర్మ దర్శకుడిగా మనగలుగుతున్నారు. ఇక  చిత్ర ప్రచారం విషయంలో  ఏ దర్శకునికీ లేని ప్రత్యేక సామర్థ్యం అతనికి ఉంది. ఇంతకు ముందు కూడా ఎవరూ సినిమా ద్వారా గానీ, వ్యక్తిగతంగానీ ఇంతటి ప్రచారాన్ని పొందలేదు. ముందు ప్రేక్షకులను ఆకర్షించేవిధంగా, వారిలో ఆసక్తి రేకెత్తించే విధంగా సినిమా పేరుపెడతారు. ఆ తరువాత కథ, కథనంపై సంచనల వ్యాఖ్యలు చేస్తారు. దాంతో అందరి నోళ్లలో వర్మ, అతని కొత్త సినిమాపైనే చర్చ జరుగుతుంది. వంగవీటి తరువాత యథావిధిగా వర్మ మరో ప్రకటన చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, ముఖ్యమంత్రి అవ్వాలన్న కలలు కల్లలై జైలుకు వెళ్లిన శశికళ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని స్నేహితురాళ్లు ఇద్దరి మధ్య ఉన్న విషయాలను తెరకెక్కిస్తానని వర్మ చెప్పారు. తనదైన శైలిలో కథలో చివరి భాగం చెప్పి చర్చకు తెరలేపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు తట్టుకోలేక జయలలిత ఆత్మ సమాధిలో నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ గా వర్మ చెప్పారు.

శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Feb 22, 2017

ఎల్ఈడీ బల్బులతో భారీగా విద్యుత్ ఆదా

v ఏడాదికి రూ.11,022 కోట్ల ఆదా
v దేశంలో 21,21,69,709 ఎల్ఈడీ బల్బులు పంపిణీv ఏపీలో 2,07,81,743 పంపిణీ
         ఆధునిక సమాజంలో విద్యుత్ లేకుండా ఒక్క క్షణం గడవదు. ఏ ప్రాంత అభివృద్ధి అయినా విద్యుత్ సరఫరాపైనే అధారపడి ఉంటుంది. విద్యుత్ సరఫరా తగినంత లేక అనేక ప్రాంతాలలో పలు చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతోపాటు విద్యుత్ ని ఆదా చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నాయి. ఎల్ఈడి (లైట్ ఎమిట్టింగ్ డైయోడ్)  బల్బుల వినియోగం వల్ల 45 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. 60 వాట్స్ సాధారణ బల్బు జీవిత కాలం 1200 గంటలయితే, 6-8 వాట్స్ ఎల్ఈడీ బల్బు జీవిత కాలం 50 వేల గంటలు. సాధారణ బల్బుతో పోల్చితే ఎల్ఈడీ బల్బు జీవిత కాలం నాలుగు రెట్లు ఎక్కువ.  అలాగే సాధారణ 60 వాట్స్ బల్బుతో సమానంగా 8 వాట్స్ ఎల్ఈడీ బల్బు కాంతిని ఇస్తుంది. అంటే చాలా తక్కువ విద్యుత్ తో ఎక్కువ కాంతిని పొందవచ్చు. ఈ బల్బులను వినియోగించడం వల్ల వినియోగదారుల విద్యుత్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది. దేశంలో మొదటిసారిగా పాండిచేరిలో 2014 ఫిబ్రవరి 7న డిస్కమ్స్ సహకారంతో సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చే ఎనర్జీ ఎఫిసియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(ఈఈఎల్ పి)ని ప్రారంభించారు.  ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బుల వాడకం మొదలుపెట్టాయి. దాంతో దేశంలో భారీ స్థాయిలో విద్యుత్  ఆదా అవుతోంది. ఈ పథకాన్ని 2015 జనవరి 5న డొమెస్టిక్ ఎఫిసియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(డీఈఎల్ పీ)గా మర్చారు. అందరికీ ఎల్ఈడీ బల్బులు అందజేసే ఉజాల(యుజెఏఎల్ఏ-ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 మే1న ప్రారంభించారు. ఈ పథకం కింద 9 వాట్ల లెడ్ బల్బును రాయితీపైన అందజేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు బల్బులు ఇస్తున్నారు. ఇళ్లలో  60 వాట్ల బల్బు వాడే స్థానంలో వీటిని వాడుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరకు వీటిని అందజేశారు.  దీని అసలు ధర 160 రూపాయలు ఉండగా, రాష్ట్రాలలో సబ్సిడీపై 10 రూపాయల నుంచి 85 రూపాయల వరకు వినియోగదారులకు అందజేశారు. ఎల్ఈడీ బల్బులు సబ్సిడీపై ఇవ్వడాన్ని ఏపీలో 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. ఇక్కడ అత్యధిక సబ్సిడీపై అతి తక్కువ ధరకు ఒక్కో బల్బు పది రూపాయలకే ఇచ్చారు.
 ఏడాదికి రూ.11,022 కోట్ల ఆదా:  2017 ఫిబ్రవరి 21వ తేదీ ఉజాల డ్యాష్ బోర్డు లెక్కల ప్రకారం ఈ బల్బులు వాడటం వల్ల దేశం మొత్తం మీద ఏడాదికి 27,554 ఎంఎన్ కెడబ్ల్యూహెచ్ విద్యుత్, రూ.11,022 కోట్లు ఆదా అయ్యాయి. పీక్ అవర్ డిమాండ్ 5,516 మెగావాట్స్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి 26,98,863 ఎండబ్లూహెచ్ (మెగావాట్ అవర్స్) విద్యుత్,  రూ.1,080 కోట్లు ఆదా అయింది. పీక్ అవర్ డిమాండ్ 540 మెగావాట్స్ కు తగ్గింది. దాదాపు 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుండటంతో ఎల్ఈడీ బల్బుల పంపిణీ ప్రక్రియని ముమ్మరం చేశారు. ఉజాల పథకం కింద 2017 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రానికి  దేశంలో 21,21,69,709 ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈ బల్బుల పరిశ్రమలు 2016 డిసెంబర్ 31 వరకు 26 కోట్ల 30 లక్షల బల్బులు అమ్మాయి. 2019 నాటికి దేశంలో 77 కోట్ల సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ విధంగా వంద మిలియన్ కెడబ్ల్యూహెచ్ (కిలోవాట్ అవర్) విద్యుత్ ఆదా అవుతుందని అంచనా.
           రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే 3,09,12,435 బల్బులు పంపిణీ చేసి గుజరాత్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2,07,81,743 బల్బులతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, 2,07,28,359 బల్బులతో మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉన్నాయి. 1,50,16,547  బల్బులతో ఉత్తర ప్రదేశ్ 4వ స్థానం, 1,45,50,181 బల్బులతో కర్ణాటక 5వ స్థానంలో, 1,25,16,616  బల్బులు పంపిణీ చేసి రాజస్థాన్ 6వ స్థానంలో, 1,09,97,122 బల్బులు పంపిణీ చేసి బీహార్ 7వ స్థానంలో, 1,07,95,778 బల్బులతో మధ్యప్రదేశ్ 8వ స్థానంలో, 1,01,08,040 బల్బులతో కేరళ 9వ స్థానంలో ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కోటి బల్బుల లోపలే పంపిణీ చేశాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
        మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, ఇళ్లలోనూ లెడ్ లైటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఓ ఛాలెంచ్ గా తీసుకొని దిగ్విజయంగా అమలు చేస్తోంది. విద్యుత్ ని ఆదా చేయడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పలు బహుమతులను కూడా గెలుచుకుంది. మళ్లీ ఇప్పుడు లెడ్ బల్బుల వినియోగం వల్ల అయ్యే విద్యుత్ ఆదా గురించి  ప్రజలకు అవగాహన కలిగించి, విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బులను వినియోగించి విద్యుత్ ని సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయాన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.  ఏపీలో నగర వీధులన్నిటినీ లెడ్ బల్బుల వెలుగులతో నింపేశారు. పట్టణాల వీధుల్లో కూడా పూర్తిగా ఈ బల్బులను అమరుస్తున్నారు. చాలా వరకు పూర్తి చేశారు. ఇక గ్రామ వీధులపై దృష్టి పెట్టారు. విశాఖ నగర వీధుల్లో అత్యధికంగా 1,02,227 బల్సులను అమర్చారు. ఇక్కడ 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. విజయవాడలో 32,296 బల్బులు అమర్చారు.
నెల్లూరులో 23,202 బల్బులు అమర్చగా 59.19 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. ఏలూరులో 8,035 బల్బులు అమర్చగా, 59.69 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.
 కాకినాడలో 12,365, గుంటూరులో 10,096, అనంతపురంలో 9,912, విజయనగరంలో 9,450, తిరుపతిలో 9,038,  కర్నూలులో 5, 045, రాజమండ్రిలో 5,770 బల్సులు అమర్చారు. మునిసిపల్ వీధులలో కూడా ఈ బల్బులే కాంతులు వెదజల్లుతున్నాయి. కావలి వీధుల్లో 6,007 బల్బులు, హిందూపూర్ లో 6,397, నరసరావు పేట వీధుల్లో 4,871 బల్బులు అమర్చారు. మిగిలిన మునిసిపాలిటీలలో ఆయా పట్టణాల పరిధిని బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఈ బల్బులు ఏర్పాటు చేశారు.
      రాష్ట్రంలోని 12,909 గ్రామాల్లోని 25 లక్షల సాధారణ వీధి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడానికి ఏర్పాట్లు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచే శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలోని 120 సాధారణ వీధి బల్బుల స్థానంలో  ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఇంకా మరికొన్ని గ్రామాలలో కూడా అమర్చారు. అన్ని గ్రామాలలో ఈ బల్బులను అమరిస్తే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందా అవుతుందని అంచనా.   వంద శాతం ఇళ్లలో వినియోగించడానికి మొత్తం 2.32 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం మొత్తం అమలయితే 1291 ఎంయు(మిలియన్ యూనిట్స్) విద్యుత్ ను పొదుపు చేయవచ్చని అంచనా. పీక్ అవర్స్ లో లోడ్ ను 620 మెగావాట్స్ కు తగ్గించవచ్చని భావిస్తున్నారు.  ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేశారు. ఓ సర్వే ప్రకారం ఆ జిల్లాల్లో 58 వేల మంది వినియోగదారులు ఒక్కో బల్బుకు ఏడాదికి 73.7 యూనిట్స్ విద్యుత్ ను ఆదా చేశారు.
విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా:  విశాఖపట్నంలో అన్ని వీధి దీపాలు హుద్ హుద్ తుపానుకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానంలో లెడ్ బల్బులను అమర్చారు. 92 వేల ఎల్ఈడీ వీధి బల్బులను 45 రోజులలో అమర్చి రికార్డు సృష్టించారు. ఈ  బల్బుల వల్ల నెలకు 40 నుంచి 45 శాతం వరకు విద్యుత్ ఆదా అయింది. ఆ ప్రకారం 2015 సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.4.23 కోట్లు తగ్గింది. ప్రస్తుతం విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.  రాష్ట్రంలోని 111 మునిసిపాలిటీలలో 5.7 లక్షల వీధి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చటానికి పూనుకున్నారు. ఇప్పటికే చాలావరకు మునిసిపాలిటీలలో బల్బులు మార్చారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు:   రాష్ట్రంలో జరుగుతున్న ఎల్ఈడీ లైటింగ్ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రపంచ బ్యాంక్, ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) వంటి సంస్థలు పనితీరును మెచ్చుకున్నాయి. పారిస్ లో జరిగిన సిఓపి-21 సమ్మిట్ లో ఎల్ఈడీ వీధి లైట్ల వినియోగం ద్వారా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో  ఆదా అయిన విద్యుత్ అంశాన్ని చర్చించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,చైనా, ఇండియా,సౌత్ ఆఫ్రికా) వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే ప్రదర్శించి, ఇతర దేశాలకు ఓ రోల్ మోడల్ గా నిలిచింది.
అవార్డులు: ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 2015కు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి  విశాఖ మహానగర పాలక సంస్థ జాతీయ అవార్డు సాధించింది.
     - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్