Mar 4, 2024

మహాబీర విత్తనాల ఉపయోగాలు



మహాబీర మొక్క తులసి మొక్కలా కనబడుతుంది. ఐతే, ఈ మొక్క ఆకులు కాస్త పెద్దవిగా ఉంటాయి.  మహాబీర విత్తనాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు మహాబీర విత్తనాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ  విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు వున్నాయి. మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామరపై లేపనం చేస్తే తగ్గిపోతాయి. మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తాయి.

ఈ గింజల్లో డైటరీ ఫైబర్స్, విటమిన్ కె, విటమిన్ ఎ, ఐరన్ & యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు నిర్వహణ, కనిపించే జీవసంబంధమైన వయస్సు తగ్గింపు, రోగనిరోధక శక్తి, మధుమేహం నియంత్రణ మొదలైన ప్రయోజాలున్నాయి. నీటిలో నానబెట్టినప్పుడు, దాని అసలు పరిమాణం కంటే 30 రెట్లు ఉబ్బిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మృదువైన ఉబ్బిన గింజలు అప్పుడు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.  అధిక శరీర వేడి నుండి ఉత్పన్నమయ్యే చికాకు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

సోరియాసిస్, ఎగ్జిమా మొదలైన చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఈ గింజలు ఎసిడిటీ/బర్నింగ్ సెన్సేషన్‌ని తగ్గిస్తాయి. మధుమేహ చికిత్సకు మంచిది. మహాబీర విత్తనాలు సులభంగా ప్రేగు కదలికను నిర్ధారించడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొట్టలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.
మహాబీర గింజలు  జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నందున, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహ సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది.

మహాబీర విత్తనాల పోషక విలువ

మహాబీర గింజలలో బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్, విటమిన్ ఎ, విటమిన్ కె ఉన్నాయి. ఇందులో పొటాషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, ఫోలేట్స్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.

గింజలను ఒక గ్లాసు నీటిలో కొన్ని గంటలు నానబెట్టి, మిశ్రమాన్ని త్రాగాలి. ఒక టీస్పూన్ మహాబీర గింజలను 1 గ్లాసు లేదా 200 మి.లీ వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, ఆపై మృదువైన, ఉబ్బిన గింజలను మీరు ఎంచుకునే తయారీలో ఉపయోగించండి. 
4 నుండి 6 గ్రాముల మహాబీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినండి.  అల్పాహారం కోసం ఇతర విత్తనాలను కూడా కలిగి ఉన్నాము.

అవిసె గింజలు, సబ్జా విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, సీతాఫలం విత్తనాలు కలోంజి  లేదా నిగెల్లా విత్తనాలు కూడా మంచివే. 


Feb 18, 2024

డయాబెటిస్ వారికి 11 ఉత్తమ ఆహారాలు

డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం, రెగ్యులర్ మెడికల్ చెక్-అప్స్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉన్న ఆహారాన్నితీసుకోవాలి.గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక వ్యక్తి  రక్తంలో చక్కెర స్థాయిలో ఆహారం ప్రభావం గురించి చెప్పే సంఖ్య. ఇది 0 నుండి 100 మధ్య స్కేల్ కలిగి ఉంది. 100 కు ఉదాహరణ స్వచ్ఛమైన గ్లూకోజ్. తక్కువ GI ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచవు. అధిక GI ఆహారాలు చక్కెర స్థాయిలలో తక్షణ పెంచుతాయి.  50 కన్నా తక్కువ GI విలువ తక్కువగా పరిగణిస్తారు. 50 ‐60 మధ్య GI విలువ సగటుగా పరిగణిస్తారు. 60 పైన జిఐ విలువ ఎక్కువ. 

1. శనగలుChickpeas (Kabuli Channa): శనగలను ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది చక్కెర స్థాయిలలో వచ్చే చిక్కులను నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక.

2. బీన్స్ Beans:అలసందలు, సోయాబీన్స్, చిక్కుడు, రాజ్మా, బఠాణీ వంటి అన్ని రకాల బీన్స్- కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్, ఫైబర్  గొప్ప వనరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బీన్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

3. బ్రోకలీ Broccoli: బ్రోకలీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఫైబర్ అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న బ్రోకలీతో పాటు బచ్చలికూర వంటి ఇతర ఆకుకూరలు చక్కెర స్థాయిలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి,.

4. గోధుమ బ్రెడ్ Whole Grain Bread: ఇది మానవ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. Whole Grain Bread శోషణ, జీర్ణక్రియకు మంచిది.

5. వోట్మీల్ Oatmeal;ఓట్మీల్ కరిగే ఫైబర్  గొప్ప మూలంగా పనిచేస్తుంది.కడుపులోని ఆహారం నుండి గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ గంటలు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి అల్పాహారం ఎంపికగా పరిగణిస్తారు.

6. యాపిల్స్ :  రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆపిల్ అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉండే గొప్ప మూలం. ప్రతిరోజూ ఒక ఆపిల్‌ను తినాలి. అది తక్కువ GI పోషకాలతో నిండి ఉంటుంది. ఇతర తక్కువ GI పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లాక్ జామున్, ఆరెంజ్ మొదలైనవి ఉన్నాయి. 

జామ, బొప్పాయ, నేరేడు పండ్లు తినవచ్చు.

అరటి, మామిడి వంటి పండ్లు అధిక GI పండ్లు. అటువంటి పండ్లను  మితంగా తినాలి.

7. కాకరకాయ Bitter Gourd: రుచిలో చేదు, అయితే కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే మూడు క్రియాశీల యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. కాకరకాయలో కనిపించే చారంతిన్ అనే సమ్మేళనం గ్లూకోజ్ స్థాయిలను తక్కువగా, చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

8. కోడి గుడ్లు రోజుకు ఆరు వరకు తినవచ్చు. నాన్ వెజ్ ఏదైనా ఓ కప్పు తినవచ్చు. సుగర్ ఉన్నవారికి ఉల్లిపాయలు  ఓ వరం. 

9. పాలకూరతోపాటు అన్ని రకాల ఆకు కూరలు. కాయగూరలు దోస, కీరదోస... వంటివి తినగలిగినవి ఎన్నైనా తినవచ్చు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) ఉత్తమం. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తినాలి. 

10.అన్ని రకాల చిరుధాన్యాలతో తయారు చేసే పిండితో చేసిన రొట్టెలు మంచివి. ప్రతి రోజూ ఓ స్పూన్ మెంతుపొడి తింటే మంచిది. 

11. నట్స్, dark chocolate 



Jan 13, 2024

మలబద్ధకం - చికిత్స

 11 చిట్కాలు

మలబద్ధకం అంటే ఒక వ్యక్తికి మలవిసర్జన అవడం  చాలా కష్టం కావటం.  ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన ఆహారపు అలవాట్లు పెరగడంతో, మలబద్ధకం కూడా ప్రబలమైన సమస్యగా మారుతోంది. ఆహారం పెద్ద ప్రేగు గుండా వెళుతుంది, ఇక్కడ నీటిలో ఎక్కువ భాగం గ్రహించి మలం ఏర్పడుతుంది. ఇది శరీరం నుండి బహిష్కరించబడుతుంది మరియు మలబద్ధకం ఉంటే, ఈ మలం బయటకు వెళ్ళడం కష్టం, బాధాకరమైనది మరియు రక్తస్రావం కూడా కావచ్చు.

పిల్లలతో పాటు వృద్ధులలో మలబద్ధకం సాధారణం. పెద్దలతో పోలిస్తే పిల్లలు చాలా ఎక్కువ జంక్ ఫుడ్  తింటారు. వయస్సు పెరిగేకొద్దీ, పెద్దలు దంతాలు కోల్పోవడం ప్రారంభిస్తారు మరియు వారు తక్కువ నమలడం వల్ల అజీర్ణం మరియు మలబద్దకానికి దారితీస్తుంది. ఫైబర్, నీరు, కెఫిన్ మొదలైన అన్ని అంశాలతో సహా ఆహారo లో  మార్పుల కలయిక మలబద్దకాన్ని సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

 

1. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగటం మంచిది. దీనికి కొంచెం బేకింగ్ సోడా జోడించండి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

2. ఉదయాన్నే ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి అల్లం టీ మరొక గొప్ప నివారణ.

3. కొద్దిగా తేనె లేదా చక్కెరతో ఒక గ్లాసు వెచ్చని పాలు మలబద్దకానికి మంచి ఔ షధంగా చెప్పవచ్చు.

4. సునాముఖి ఆకు పొడి మలబద్ధకాన్ని నివారిస్తుంది.  గోరువెచ్చని నీటిలో ఈ ఆకు పొడిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

5. నిద్రపోయేటప్పుడు నాభిపై కొన్ని చుక్కల గోరువెచ్చని ఆముదపు నూనెను పూయడం వల్ల ఉదయాన్నే మలం తేలికగా బయటకు పోతుంది. 

6. జామ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్, అరటి  తదితర పండ్లు మలం సులభంగా బయటకు వెళ్ళడానికి సహాయపడతాయి.

7. మలబద్ధకం చికిత్సలో ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతుంది.

8. మలబద్దకం రాకుండా ఉండటానికి సుమారు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి..

9. అధిక కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు,  కెఫిన్ మలబద్దకానికి ప్రధాన కారణాలు. అందువల్ల వాటిని తీసుకోకూడదు.

10.  త్రిఫల సూర్ణంను వెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.  ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి లక్షణాలను కలిగి ఉంది. ఇది పెద్దప్రేగు మొత్తం ప్రక్షాళనకు సహాయపడుతుంది.

11. పావన ముక్తసనం, యోగా ముద్ర, ధనూర్ ఆసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.  వీటి ద్వారా పేరుకుపోయిన వాయువును విడుదల చేయడం, మలం బయటకు వెళ్ళడం జరుగుతుంది.

ఈ చిట్కాలను అనుసరించడం తో పాటు మలబద్ధకం నుండి దీర్ఘకాలిక నివారణను అందించడంలో ఆహారం, జీవనశైలి క్రమశిక్షణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు తీసుకోవడం మంచిది.

Jan 3, 2024

జాతి రత్నం సావిత్రిబాయి పూలే


మూఢవిశ్వాసాలతో ఛాందస మత గ్రంథాల నిర్బంధాల మధ్య స్త్రీ కి విద్య అవసరం లేదంటూ నిర్బంధాలు విధించిన ఛాందసవాదుల ను ఎదిరించి తానే విద్యకు శ్రీకారం చుట్టి భారతదేశ తొలి ఉపాధ్యయునిగా ఎంపికై భారత దేశ వ్యాప్తంగా విద్యను స్త్రీలకు అందించిన భారతదేశ జాతిరత్నం సావిత్రిబాయి పూలే అని ప్రముఖవైద్యులు కే వి ఎస్ సాయి ప్రసాద్ అన్నారు.. ది 3-1- 2024 బుధవారం ఉదయం పాత మంగళగిరి పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన తొలి భారతీయ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . 190 సంవత్సరాలకు పూర్వం ఆనాటి మత దురంకారులతో అనేక అవమానాలు గురైనా.. మొక్కవోని ధైర్యంతో స్త్రీలు ఎందుకు విద్యను అభ్యసించకూడదు అంటూ తానే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య వ్యాప్తికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి స్త్రీ అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు... కానీ నేడు విద్య వింత పొగడలు పోతోందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటూ ప్రజలకు విద్యను దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే ఆశయాలు స్ఫూర్తినిస్తాయన్నారు.

మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ రేఖా కృష్ణార్జున్ రావు మాట్లాడుతూ నాటి దుర్భర పరిస్థితుల్లో సావిత్రిబాయి పోరాటాన్ని వివరిస్తూ వర్తమానంలోనే దుస్థితికి చైతన్య లోపమే కారణం అని దీనిని మనం అధిగమించాలన్నారు.నవ యువ కవి గోలి మధు మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను గుర్తించి ప్రతి మహిళ విద్యా వంతురాలు కావాలని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఆమె చేసిన, నేడు బ్రష్టు పట్టిన కార్పొరేట్ విధానానికి వ్యత్యాసాన్ని గుర్తించి ఈ పరిస్థితులు మారాలన్నారు. బుద్ధభూమి మాస పత్రిక వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య ప్రసంగిస్తూ సావిత్రిబాయిపూలే సేవలను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన వారి కృషి గొప్పదని అన్నారు.కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి డాక్టర్ సాయి ప్రసాద్ , ప్రముఖులు పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిరందాసు నాగార్జున, అవ్వారు శ్రీనివాసరావు,సందుపట్ల భూపతి, ఆకురాతి రత్నరావు, మహమ్మద్ యూసఫ్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, చిలక వెంకటేశ్వరరావు, కంచర్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం

ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్

గుంటూరు, జనవరి 2: ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ తెలిపారు. ఖాతాదారులు కార్యాలయానికి రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినట్లు చెప్పారు. బృందావన్గార్డెన్స్ పి ఎఫ్ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులు, ఖాతాదారులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. ఖాతాదారులకు ఇ-మెయిల్, ఎక్స్, కుకు., వాట్సాప్ 9494657469 వంటి ప్రచారసాధనాలు, గ్రీవెన్స్సెల్ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రతినెల 15వతేదీ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ముతోపాటు తమ వాటా ధనాన్ని కూడా పిఎఫ్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. దీనిలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. చెల్లింపులు ఆలస్యమైతే 33 నుంచి వంద శాతం జరిమానా, 12 శాతం వడ్డీ వసూలు చేస్తామని, కొన్ని సందర్భాలలో శిక్షలు విధిస్తామని ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ జెఆర్ మాధవ శంకర్ మాట్లాడుతూ కనీసం 20 మంది సిబ్బంది పనిచేసే సంస్థలు పిఎఫ్ పరిధిలోకొస్తాయన్నారు. నెలకు రూ. 15 వేల పైన వేతనం పొందే కార్మికుడు, ఉద్యోగి బేసిక్, డిఎ మొత్తంపై యజమాని నుంచి షేర్ధనం పొందిన వారికి హయ్యర్ (అధిక) పెన్షన్ మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. ఒకవేళ పెన్షనర్ అకాల మరణం చెందితే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుందని తెలిపారు.

 టెలికం జిల్లా సలహా కమిటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో పత్రికల్లో పనిచేస్తున్న 58 ఏళ్ళు నిండిన వారు సత్వరమే పెన్షన్ పొందటానికి పిఎఫ్ సిబ్బంది సహకరించాల న్నారు. ఈ సందర్భంగా కమిషనర్, సహాయ కమిషనర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె శరచ్చంద్రజ్యోతిశ్రీ, కందిమళ్ళ వెంకట్రావు, శిరందాసు నాగార్జున, షేక్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Dec 17, 2023

తెలంగాణ ప్రభుత్వానికి కొత్త పథకం తెచ్చిన తంటా!


తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఓ కొత్త పథకం పెద్ద తంటా తెచ్చిపెట్టింది.  ప్రభుత్వ పథకాల వల్ల ఎక్కువ మంది లబ్ధిపొందుతారు. సాధారణంగా ఆ పథకం పరిధిలోకి రానివారు కొందరు ఈర్ష్యపడుతుంటారు. అంతేగానీ, ఎవరూ నష్టపోరు. అయితే, ఈ పథకం ఒక వర్గానికి తీవ్ర నష్టం కలిగించింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా  ‘మహాలక్ష్మి పథకం’ ప్రకటించింది. ఇందులో తెలంగాణ మహాలక్ష్మి ఆర్థిక సహాయ పథకం, తెలంగాణ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం, తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మూడు ఉన్నాయి. అందులో మొదటగా  ‘ఉచిత బస్సు ప్రయాణ పథకం’ని ఈ నెల 9న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. మహిళలు అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నొలబెట్టుకుందన్నారు.   ఈ పథకం ద్వారా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరూ తెలంగాణ అంతటా  ఆర్టీసీ బస్సుల్లో  ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకాన్ని  7,290 బస్సులకు వర్తింపజేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కువ మంది బస్సులు మాత్రమే ఎక్కుతున్నారు. మెట్రో రైళ్లు, ఆటోలు ఎక్కేవారు బాగా తగ్గిపోయారు. దీంతో, బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం గురించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రతిరోజూ టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.  మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీ కార్తీక సోమవారం కావడంతో రికార్డు స్థాయిలో 50 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ మునిశేఖర్ చెప్పారు. ఈ పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య ఏడాదికి  40 శాతం నుంచి 55 శాతానికి పెరుగుతుందని అంచనా.

ఇంతవరకు బాగానే ఉంది. మహిళలందరూ బస్సులు ఎక్కడం వల్ల  ఆటోలు ఎక్కే మహిళలు లేరు.రాష్ట్రం అంతటా ఇదే సమస్య. ఈ పథకం వల్ల తాము  ఉపాధి పోయి వీధినపడుతున్నామని  ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. మహిళలందరూ ఆర్టీసీ బస్సులు ఎక్కితే, ఎన్నో ఏళ్లుగా ఆటోలనే నమ్ముకున్న తాము బతికేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము కుటుంబాలతో సహా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు  వాపోతున్నారు. ఈ పథకం మహిళలకు మంచిదైనా, తమకు కష్టాలు తెచ్చిపెట్టిందని గగ్గోలు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉంటారని ఒక అంచనా. తమ ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులకు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు విద్యార్థుల బలిదానాలు జరిగాయని, ఇప్పుడు ఆటోడ్రైవర్ల బలిదానాలు జరగాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో  ధర్నాలు నిర్వహించారు. మహాలక్ష్మి పథకం రద్దుపై పునరాలోచన చేయాలని  విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే  డ్రైవర్లపై ఉన్న అన్ని రకాల ట్యాక్స్ లను రద్దుచేసి, తమకు ప్రతి నెలా రూ.20వేలు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఆటో రిక్షా కోసం రోజుకు రూ.400 అద్దె చెల్లించాలని,  డీజీల్/పెట్రోల్ కోసం మరో రూ.400 ఖర్చు చేస్తున్నామని, ఇప్పుడు తమ సంపాదన పడిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పథకం వల్ల ఎన్నడూ లేని మరో సమస్య వచ్చి పడింది.  ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని పురుషులు డిమాండ్ చేస్తున్నారు.   ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు.

ఆటోడ్రైవర్ల సమ్మె హెచ్చరిక

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, తమను అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం, కో-కన్వీనర్లు వి.కిరణ్, బి.శ్రీకాంత్ తదితరులు డిమాండ్ చేశారు.కర్నాటకలో మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యపై ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘‘ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది వారి గురించి ఏదైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి’’ అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆటోడ్రైవర్ల సమస్యను పరిశీలించి, వారిని ఆదుకొనవలసిన అవసరం ఉంది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914