Aug 16, 2022

చిరంజీవి ఓ సంచలనం



చిరంజీవి ఆ పేరే  తెలుగుసినిమా రంగంలో ఓ పెను సంచలనం. ఓ మెరుపు.  తుఫానులా దూసుకువచ్చారు. తిరుగులేని మెగాస్టార్ లా ఎదిగారు. అద్వితీయమైన డ్యాన్సులు, అమోఘమైన నటనతో యువత గుండెల్లో తిష్టవేశాడు. డ్యాన్స్ చేయడంలో తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పగలిగేవిధంగా సాధన చేశాడు. మెరుపు వేగంతో డ్యాన్సులు చేసి హీరోగా విజయం సాధించారు. తన బ్రేక్ డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు.  అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. తన నటన, డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. మెరిసే కళ్లతో, హావభావాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల  మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారు.  

ఎంత ఎదిగినా ఒదిగి ఉండి నిర్మాతల్లోనూ, దర్శకుల్లోనూ సుస్థిర స్థానం పొందగలిగారు. దానికితోడు అతని నటన శిఖరాగ్రానికి చేరుకోవడానికి వీలుగా  కథా బలం ఉన్న పాత్రలు లభించాయి. తిరిగి చూసుకునే పనిలేకుండా తెలుగు చిత్రజగత్తులో దూసుకుపోయారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లిచేసుకోవడం కూడా అతనికి అన్ని విధాలా కలిసివచ్చింది. ఆమె సోదరుడు అల్లు అరవింద్ ఆయనకు కొండంత అండగా నిలిచారు. చిరంజీవి సోదరులు  నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా అన్నకు తగ్గ తమ్ముళ్లుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన అండతో ఎదుగుతూ తమ తమ ప్రత్యేకతలు చాటుకున్నారు. అన్న పేరును కూడా నిలుపుతున్నారు. వారికి చిరంజీవి లాంటి అన్న దొరకడం ఎంత అద‌ృష్టమో, చిరంజీవికి నాగబాబు, పవన్ కల్యాణ్ లాంటి తమ్ముళ్లు  దొరకడం కూడా అంతే అదృష్టం. చిరంజీవికి మరో అదృష్టం రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా తండ్రి పేరును నిలిపే విధంగా తన సత్తా చాటుతూ  ఎదుగుతున్నారు. 

నటనలో శిఖరాగ్రానికి చేరుకున్న చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో కొంతమేర ఫలితాలు సాధించినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై, కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా  నిస్వార్థంగా సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటన ద్వారా తెలుగు సినీజగత్తులో ఉన్నత శిఖరాలకు చేరిన చిరంజీవి ఏ రంగంలో ఉన్నా నిజాయితీగా వ్యవహరించడం వల్ల మంచి మనిషిగా గుర్తింపు పొందారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవలో కూడా ముందున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి నేత్ర, రక్తనిధి,



ఆక్సిజన్ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా తన అభిమానులకు ఆదర్శంగా నిలిచారు.   దేశం మొత్తంలో   మూడు వేలకు పైగా చిరంజీవి అభిమాన సంఘాలున్నాయి. అభిమానులు కూడా రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. అభిమానులకు నిజమైన హీరోగా నిలిచి వారినీ ఉత్తమ మార్గంలో నడిపిస్తున్నారు.

ఈ మెగా హీరో అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.  పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు  1955 ఆగస్టు 22న  చిరంజీవి జన్మించారు. తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగి కావడంతో తరచూ పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేవారు. దాంతో చిరంజీవి ప్రాథమిక విద్యాభ్యాసం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో కొనసాగింది.ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, నరసాపురం శ్రీ వై.ఎన్. కళాశాలలో బీకాం పూర్తి చేశారు.   1976లో చెన్నైలోని  మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందారు. 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి- సురేఖల వివాహం జరిగింది. వారికి సుస్మిత, శ్రీజ ఇద్దరు కుమార్తెలు.  ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ.

1978లో పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నట ప్రస్థానం మొదలైంది. అయితే, ప్రాణంఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది.  సినిమా రంగంలో చిరంజీవి అందుకున్న మొదటి పారితోషికం వెయ్యి నూట పదహార్లు. నటజీవితం ప్రారంభంలో హీరోగానే కాకుండా విలన్ గా, ఇతర ప్రాముఖ్యత గల పలు పాత్రలు పోషిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని తనదైన గుర్తింపు పొందారు.  తెలుగు సినీరంగ దిగ్గజాలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఉద్ధండుల హవా కొనసాగే సమయంలో చిరంజీవి తన బ్రేక్ డ్యాన్సులు, ఫైట్లతో కొత్త ట్రెండ్ ను సృష్టించి వారితో పోటీపడ్డారు. ఆ తరువాత హీరోగా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయినా, ఎంత పేరుప్రఖ్యాతులు వచ్చినా క్రమశిక్షణ, శ్రమించే స్వభావాన్ని, హుందా తనాన్ని వదిలిపెట్టలేదు. అవే ఆయనకు శ్రీరామరక్షగా నిలిచాయి. 

మనవూరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన తరువాత  ‘ఖైదీ’ చిత్రం చిరంజీవిని స్టార్‌ హీరోగా నిలబెట్టింది. ‘ఖైదీ’ సాధించిన సక్సెస్‌తో చిరంజీవి సుప్రీమ్‌ హీరో అయ్యారు. ఈ సినిమా కలెక్షన్స్‌ లో ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించింది.  ఖైదీ తెలుగు సినిమా పోకడను మార్చింది. దాంతో  స్పీడ్ పెరిగింది. దాంతో చిరంజీవి ఓ కొత్త  ట్రెండ్‌కు నాంది పలికాడు.  ‘మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్‌, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ’ వంటి పక్కా కమర్షియల్‌ చిత్రాలతో విజయపరంపర కొనసాగింది.   ఆయన రేంజ్‌ ఓ స్థాయిలో పెరిగిపోయింది.  ‘అడవి దొంగ’ ఘన విజయంతో చిరంజీవి పెద్ద స్టార్‌ హీరోగా మారిపోయారు.  ‘విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయ్‌, రాక్షసుడు, దొంగమొగుడు’ చిత్రాలు చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ని ఇంకాఇంకా పెంచేశాయి.  ‘పసివాడి ప్రాణం’ సంచలన విజయం సాధించింది.  ‘స్వయంకృషి’తో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.  స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమైంది.  మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దానిని ప్రదర్శించారు. 

‘మంచిదొంగ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలతో  కొత్త రికార్డులు సృష్టించారు. ‘రుద్రవీణ’ సినిమాని సొంతంగా నిర్మించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్నారు. ‘ఖైదీ నెంబర్‌ 786‘, ‘మరణ మృదంగం’తో మెగాస్టార్‌ అయ్యారు. 100వ చిత్రం ‘త్రినేత్రుడు’ ఆ తరువాత ‘స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ’ వంటి వరుసగా విజయవంతమైన చిత్రాలతో అభిమానుల ఆనందానికి అవధులులేవు.  ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’  అద్వితీయమైన విజయంతో  రికార్డులను తిరగరాసింది.  గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు’ ఇలా ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి.  ‘ఘరానా మొగుడు’ అత్యధిక  వసూళ్లను సాధించింది.  ఆ తరువాత హిందీలో   ప్రతిబంద్‌,  ఆజ్‌కాగూండారాజ్‌ చిత్రాలలో నటించి భారతీయ ప్రేక్షకులను అలరించారు.  ఆ తరువాత ‘హిట్లర్‌’ వంటి  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించారు.  మాస్టర్‌, బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం, అన్నయ్య, ఇద్దరు మిత్రులు, శ్రీమంజునాథ’ వంటి వరుస మెగా హిట్స్‌తో పరిశ్రమని ఒక ఊపు ఊపారు.  ‘ఇంద్ర’తో తన రికార్డులను తానే తిరగరాసి తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచారు. చిరంజీవి నటసార్వభౌమ నందమూరి తారక రామారావుతో తిరుగులేని మనిషిలో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో మెకానిక్ అల్లుడులో,  సూపర్ స్టార్ కృష్ణతో తోడుదొంగలు, కొత్తపేటరౌడీ,  ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో మోసగాడు, కృష్ణంరాజుతో మనఊరి పాండవులు, ప్రేమతరంగాలు, పులిబెబ్బులి వంటి చిత్రాలలో నటించారు. 

 ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’తో నవ్వులు పండించి  భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. ‘స్టాలిన్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాత రాజీయ రంగ ప్రవేశం చేశారు.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత దాదాపు పది సంవత్సరాలు సినీ జీవితానికి విరామం ప్రకటించారు. తరువాత 150వ చిత్రంగా  ఖైదీనంబర్‌ 150లో నటించారు.  మళ్లీ వరుసగా సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నారు. నటనలో అత్యంత ప్రతిభను కనపరిచి మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్  బహుమతులు గెలుచుకున్నారు.  చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 2006 లో కేంద్రం నుంచి పద్మభూషణ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ఘరానా మొగుడు చిత్రాన్ని 1993   భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శించారు.  ఈ సినిమాతో చిరంజీవి దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు.  ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే వంటి పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌తో  పోల్చి  ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అని కొనియాడాయి.  చిరంజీవిని ‘ద వీక్’ పత్రిక  ‘ద న్యూ మనీ మెషీన్’ గా పేర్కొంది.  

1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు  దేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం 1.25 కోట్ల రూపాయలు అందుకున్నారు.   1999-2000 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా  సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు.   చిరంజీవిని భారతీయ సినిమాను ప్రభావితం చేసిన ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకడిగా 2013లో  ఐబీఎన్ లైవ్  పేర్కొంది.తగ్గేదేలే అన్నరీతిలో  చిరంజీవి ప్రస్తుతం కూడా దూసుకుపోతూనే ఉన్నారు. కథ ఎంపికలో చిరంజీవి  తీసుకునే  సమయం, జాగ్రత్తలు అందరికీ తెలిసినవే. నటనే ఆయనకు సర్వస్వం. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా రాజకీయాలను పూర్తిగా వదిలివేశారు. వాటికి స్వస్తిచెప్పారు.  నటనకే అంకితమయ్యారు. ఇప్పుడు కూడా ఎవగ్రీన్ హీరోలా ఈ తరం వారితో  పోటీపడుతూ  కొత్త లుక్ తో సంచలనాలు సృష్టించబోతున్నారు.  ఎప్పటికప్పుడు అప్ డేట్ అవడం చిరంజీవి ప్రత్యేకత.  అందుకు గాడ్‌ఫాదర్‌లోని ఈ కొత్త స్టిల్సే నిదర్శనం.  ఇదే కాకుండా భోళా శంకర్, పేరు ప్రకటించని మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. మంచి ఫిట్‌నెస్‌తో, తాజా లుక్‌తో యంగ్ హీరోలా అభిమానులను అలరించనున్నారు. మళ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తారని ఆశిద్ధాం.  కొండంత అండగా ఆయనకు అభిమానులు ఉండగా, చిరంజీవికి రికార్డులకు కొదవేముంటుంది.


 - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


May 31, 2022

కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం

తమిళనాడులో మూడున్నరేళ్ల చిన్నారికి ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’జారీ చేసింది ప్రభుత్వం. తమిళనాడులో ఇటువంటి సర్టిఫికెట్ జారీ చేయటం తొలిసారి కావటం విశేషం.భారతదేశం విభన్న మతాల కలయిక..అందుకే భారత్ ను భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం గల దేశం అంటారు. అటువంటి భారత్ లో ఓ చిన్నారిని స్కూల్లో చేర్పించాలంటే కులానికి, మతానికి సంబంధించి కాలమ్‌ పూర్తి చేయాలి.ఆ చిన్నారి తల్లిదండ్రులు  కులానికి మతానికి సంబంధించి కాలం నింపేదిలేదని, పాపకు సీట్ ఇవ్వాలని అడిగారు. కానీ సదరు స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ పాపకు సీట్ ఇవ్వటానికి నిరాకరించింది.అలా మరికొన్ని స్కూళ్లకు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది వారికి. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నారు. తమిళనాడులో తొలిసారిగా ఆ పాపకు కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ జారీ చేశారు.తమిళనాడు కేకే పుదూర్‌కు చెందిన ఎస్‌ నరేష్‌ కార్తీక్‌-గాయత్రి దంపతులు తమ మూడున్నరేళ్ల పాప  విల్మ కు ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’ పొందారు. ఫలితంగా ఆ చిన్నారి ఏ కులానికి, మతానికి చెందిన మనిషికానట్లే.

సీడ్‌రీప్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన 33 ఏళ్ల నరేష్ మాట్లాడుతూ.. కులమతాల పేరుతో తమ బిడ్డ ‘విల్మ’ను నిర్బంధించడం ఇష్టం లేక తన పేరున కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నామని తెలిపారు. నిజానికి 1973లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పిల్లలను స్కూల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదు. ఈ విషయం వారికి తెలియదు. స్కూళ్లలో కూడా ఈ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. 1973, 2000వ సంత్సరంలో తమిళనాడు విద్యా శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులోనూ ఇదే విషయాన్ని పేర్కొంది. ‘కులం లేదు, మతం లేదు’ అని తల్లిదండ్రులు చెబితే కనుక ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టేందుకు ప్రజలను అనుమతించాలంటూ పాఠశాల విద్యా డైరెక్టర్‌ను ఆదేశించింది.కానీ స్కూళ్లు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి.మతం, కులం కాలాన్ని నింపకుండా స్కూల్‌లో చేర్చుకోబోమని స్కూల్ యాజమాన్యాలు అవి నింపటం కచ్చితం అని తేల్చి చెప్పడంతో నరేష్ దంపతులు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్‌ను సంప్రదించారు. ఆయన కోయంబత్తూరు తహశీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారి సమస్య పరిష్కారమైంది. చిన్నారి తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడంతో కోయంబత్తూరు నార్త్ తహసీల్దార్ వారికి ‘నో రిలిజియన్-నో క్యాస్ట్’ సర్టిఫికెట్ జారీ చేశారు.

 కాగా, కుల, మత రహిత సర్టిఫికెట్ వల్ల ప్రభుత్వ రిజర్వేషన్లకు తమ కుమార్తె అనర్హురాలిగా మారుతుందని తమకు తెలుసని ఆ అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ప్రకారం.. బేబీ విల్మ ఏ కులానికి, మతానికి చెందినది కాదు. ‘మతం లేదు, కులం లేదు’ అనే సర్టిఫికేట్‌ను పొందొచ్చన్న విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదని, ఇటువంటి ధ్రువీకరణ పత్రాన్ని పొందటానికి మరింత మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నానని నరేష్ తెలిపారు.

Jan 25, 2022

ఏపీలోని 26 జిల్లాలు

1. శ్రీకాకుళం – శ్రీకాకుళం

2. విజయనగరం – విజయనగరం

3. మన్యం జిల్లా – పార్వతీపురం

4. అల్లూరి సీతారామరాజు – పాడేరు

5. విశాఖపట్టణం – విశాఖపట్టణం

6. అనకాపల్లి – అనకాపల్లి

7. తూర్పుగోదావరి – కాకినాడ

8. కోనసీమ – అమలాపురం

9. రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం

10. నరసాపురం – భీమవరం

11. పశ్చిమ గోదావరి – ఏలూరు

12. కృష్ణా – మచిలీపట్నం

13. ఎన్‌టీఆర్ జిల్లా – విజయవాడ

14. గుంటూరు – గుంటూరు

15. బాపట్ల – బాపట్ల

16. పల్నాడు – నరసరావుపేట

17.ప్రకాశం – ఒంగోలు

18. ఎస్‌పీఎస్ నెల్లూరు – నెల్లూరు

19. కర్నూలు – కర్నూలు

20.నంద్యాల – నంద్యాల

21. అనంతపురం – అనంతపురం

22.శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి

23.వైఎస్సార్ కడప – కడప

24.అన్నమయ్య జిల్లా – రాయచోటి

25.చిత్తూరు – చిత్తూరు

26. శ్రీ బాలాజీ జిల్లా – తిరుపతి

Nov 1, 2021

రైతన్నకు బాసటగా ‘సమరభేరి’

గోలి మధు పుస్తక సమీక్ష

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల అన్నదాతల పోరాటం మొదలై పది నెలలు దాటింది. పోరాటంలో ఎంతోమంది రైతులు అసువులుబాశారు. ఈ నెలలో కూడా లఖింపూర్ ఖేరిలో  శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రైతులను ప్రభుత్వాలకు అనుకూల వర్గానికి  చెందిన రాక్షసమూక వాహనాలతో తొక్కించి నలుగురు రైతులతోపాటు ఓ జర్నలిస్టును, మరో ముగ్గురు సామాన్య వ్యక్తులను మొత్తం ఎనిమిదిమందిని హత్య చేసింది. ఈ హింసాత్మక ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా, అతని అనుచరులు నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనకు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ కవి గోలి మధు కవితా సమరంతో సంఘీభావం ప్రకటించారు. రైతులు ఎంత ఆవేశంతో, ఆవేదనతో ఉద్యమం కొనసాగిస్తున్నారో అంతే తీవ్రస్థాయిలో ఉద్యమం మొదలైన తొలిరోజుల్లో మధు 25 రోజుల్లో 58 కవితలు రాశారు. రైతు సమరభేరి పేరుతో వాటిని పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. ఆ తరువాత కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాలు రద్దు కాలేదు. ఉద్యమం ఉధృతమైంది. మధు కవిత్వ శైలి కూడా పదునెక్కి అదేరీతిలో కొనసాగుతోంది. మళ్లీ మరో 55 కవితలు రాశారు. మొత్తం 113 కవితలతో రెండో ముద్రణ కూడా తీసుకువచ్చారు. ఇటీవల మంగళగిరిలో ‘రైతు సమరభేరి’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. 2020 సెప్టెంబరు 15 ఒక బిల్లు, 17న రెండు బిల్లులు లోక్ సభలో ఆమోదం పొంది చట్టాలయ్యాయి. ఈ మూడు వ్యవసాయ చట్టాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ సరిహద్దులలో గడ్డకట్టేచలిని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు దాదాపు పది నెలలుగాచేస్తున్న పోరాటం చరిత్ర సృష్టించింది. ఏ ప్రభుత్వమైనా రైతులకు లబ్ధిచేకూరేవిధంగా, పండిన పంటకు గిట్టుబాటుధర లభించే విధంగా వారికి రక్షణగాచట్టాలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారికి సర్వవిధాల లబ్ధి చేకూరేవిధంగా, వారికిరక్షణగా, అండగా నిలిచే చట్టాలను రూపొందించింది. రైతులకు ఆదాయ పెంచడం, వినియోగదారుల ప్రయోజనాల కోసం ఈ మూడు చట్టాలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. అయితే, చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణాధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. ఈ చట్టాలు రైతులకు మేలు చేసేవిలా కనిపించినా, బహుళజాతి సంస్థల చేతిలో రైతులు చిక్కుకునే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన. వీటి వల్ల చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని, రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతాయని వారి భయం. కార్పొరేట్  సంస్థలకు మేలు చేసేవిధంగా వీటిని చేశారని ప్రతిపక్షాల ఆరోపణ.అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి  వెళతాయన్నది వారి వాదన. ఆచరణలో వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉండదని  చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు  చట్టబద్దతలేదు. కనీస మద్దతు ధర అమలుకాకపోతే కోర్టును ఆశ్రయించే  అవకాశం కూడాలేదు. ఈ నేపథ్యంలో రైతుల పోరాటాన్ని, పోరాటంలో  మృతి చెందిన రైతులను చూసి గోలి మధు చలించిపోయారు. సామాజిక స్ప హతో తన  వంతుగా స్పందించి కవితా సమరం కొనసాగిస్తున్నారు. రైతులు అక్కడ సమరభేరి మోగిస్తే, మధు ఇక్కడ కవితా సమరభేరి మోగించారు. తన కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించడానికి నడుం బిగించారు. రైతు శ్రమని అర్ధం చేసుకొని  రైతాంగం ఉద్యమానికి తన వంతు అండగా నిలిచారు. రైతుకు సేద్యం, స్వేదం చిందించమే తెలుసు, కార్పొరేట్ శక్తుల వలే మోసం చేయడం తెలియదని తన కవితల ద్వారా ఎలుగెత్తి చాటారు. మధు వృత్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో వర్క్ ఇనస్పెక్టర్, ప్రవత్తి మాత్రం సామాజిక  స్ప హతో రచనలు చేయడం. ముఖ్యంగా కవిత్వం రాయడం. ఈ మధ్య కాలంలో రైతు ఉద్యమంపై కనీసం ఓ కవితన్నా రాయనిదే మధుకు నిద్రపట్టదు. చట్టాల నిర్మూలనే లక్ష్యమని, అప్పటివరకు పోరు ఆగేదిలేదని రైతుబాంధవులు వేస్తున్న అడుగులు విశ్వానికి వెలుగు రేఖలని... కలుపు మీద చేసే  పోరు స్ఫూర్తిగా పురుగుపుట్రపై చూపే తెగువే ఆయుధంగా... హస్తినలో తిరగబడ్డాడు రైతు ... నేను సైతం అని గోలి మధు తన కవితలతో కదంతొక్కారు. బతుకు చిత్రం తిరగబడి, రైతు జీవన చిత్రం ఛిద్రమౌతుంటే రైతు పేరిట సొమ్ముచేసుకున్న విశ్వాసమైనాలేక సంఘీభావమే కరువాయే... అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతకు మూడు వ్యవసాయ బిల్లుల బాణాలు గుచ్చుకుని విలవిలలాడుతుంటే వారి ఓట్లతో అధికారం చేపట్టిన వారికి రైతుల పట్ల దయలేదని, ఆకలి తీర్చేది రైతు, ఆకలి తీర్చుకుని అణగదొక్కేది పాలకవర్గం అని  ఆక్రోశం వెళ్లగక్కారు. ధర్మాగ్రహానికి దుర్మార్గం తలవంచక తప్పదులే అన్న భావనతో మధు ఉన్నారు. చైతన్యం ప్రవాహమై గడ్డకట్టే చలిలో కూడా నిలిచిన రైతు బాంధవులకు శిరసాభివందనం చేశారు. నల్లచట్టాల నిర్మూలనకై ఉపక్రమించిన పరాక్రమానికి అక్రమార్కుల విధ్వంసంపై ధ్వజమెత్తిన రైతు పిలుపు చరిత్రలో మరో మలుపని చాటారు. ముదనష్టపు మూడు వ్యవసాయ బిల్లులు అమలైతే కనిపించే అవసరాలకు కార్పొరేట్ దిక్కైతే పులినోట చిక్కే బతుకే రైతు బతుకు అని అద్వితీయంగా రాశారు. ఈ బిల్లులు అమలైతే రైతుకే కాదు మానవాళికీ పగులుతుంది మాడు అని హెచ్చరించారు. గజగజ వణికించే చలిలో గిజగిజలాడుతూ అన్నదాతలేమో ఊపిరి వదులుతూ ఉద్యమాల బాటలో వెలిగిపోతోంది భారతావని అని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలితో చెలిమి చేస్తూ... సమరం చేస్తున్న రైతుకు ఒక్కొక్క సంఘీభావపు పలకరింత వారికి పులకరింతై మదగజాన్ని తరిమివేసే శక్తినిస్తుందని కవితీకరించారు. హస్తినలో బిగిసిన పిడికిలి ఎర్రకోటను ఉక్కిరిబిక్కిరిచేయక మానదని ముందేచెప్పారు. కార్పొరేట్ల చెరలోకి నెట్టివేయబడుతున్నది ఒక్క రైతే కాదుదేశభవిత కూడా అని హెచ్చరించారు. మొన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఆ తరువాత  రైల్వే ఒక్కొక్కటి వడివడిగా కార్పొరేట్ల కౌగిలిలో ఒదిగిపోతుందని  ఆందోళన వ్యక్తం చేశారు. అపార వనరులు కార్పొరేట్లపరమై ప్రభుత్వ సంస్థలన్నీ బడాబాబుల సంకల్లోకి దూరుతున్నాయన్న వాస్తవాలను  తెలియజెబుతూ జనంలో చైతన్యాన్ని నింపుతున్నారు. పుడమి పుత్రుల ప్రాణత్యాగాలకు, సంకల్పబలానికి ప్రపంచమే నివ్వెరపోతుందన్నారు. ఆవేదన అగ్నికణమై, ఆలోచన అంకుశమై పాలకుల్ని నిలువరించేదే.. అదే అదే హస్తినలోని అన్నదాత హోరన్నారు. దేశద్రోహలంతా దేశభక్తులై అధర్మాన్ని పరాకాష్టకు చేర్చారని, చావులెన్నైనా సడలని పోరు, మిషన్ గన్నులు లేవు,పాలకుల అండదండలులేవు, ఐనా మానవాళికి దిశానిర్దేశం చేసే దిశగా సాగుతున్న పోరని విశ్లేషించారు. చలిలో పెద్దపులులై పోరాడుతూ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమై సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రైతన్నల త్యాగాలకు సలాం సలాం లాల్ సలాం అని కొనియాడారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలపని, సంఘీభావం ప్రకటించని నటచక్రవర్తులకు, సినీ పెద్దలకు, చివరకు మీడియానుకూడా వదలకుండా అందరికీ మధు తనదైన శైలిలో చురకలంటించారు. రైతు సమరభేరికి  చేయూతగా నిలవాలని, కళ్లు తెరవండి తరలిరండి రైతు పోరుకు బాసటగా నిలవండి  భరతమాత పుత్రులారా రండి అని పిలుపునిచ్చారు మధు.

- ఎస్.భరత్

Mar 15, 2021

స్త్రీ ఏమి కోరుకుంటుంది?

 హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు.

 రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు "ఆ ప్రతిపాదన ఏమిటంటే "మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదుకదా శిక్ష కూడా అనుభవించాలి"మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు".

 “ప్రశ్న ఏమిటంటే

'ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?' 

 సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం లభిస్తుంది. అని అనగా...

 రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించారు.

హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పనిమనిషి మరియు మరెంతో మందిని కలుసుకున్నారు.

 ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే, ఆస్తిపాస్తులని కొందరు, శారీరక సుఖాలని కొందరు మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు, మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది అన్నారు

 ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు.

 నెల ముగిసిపోయే సమయం వచ్చింది,

 మరోవైపు, హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానం సేకరించలేకపోయాడు.

 అప్పుడు ఎవరో చాలా దూరంగా, మరొక దేశంలో ఒక మంత్రగత్తె నివసిస్తున్నారని సమాచారం, ఇస్తూ ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు, అని సలహా ఇచ్చారు

 అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్‌తో పాటు, పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్న ఆమెను అడిగాడు.

అందుకు  మంత్రగత్తె,  "మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను" అని షరతు పెట్టింది.

 హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు మంత్రగత్తె ను చూస్తే చాలా ముసలిదానిలా కనిపిస్తూ ఉంది, మరియు చాలా అందవికారంగా ఉంది, తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహమంటే మిత్రుడికి అన్యాయం చేయటమే, అని ఆలోచించి సమాధానం తెలీకున్నా పరవాలేదు, కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు.అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు

 కానీ సిద్దిరాజు మాత్రం, తన స్నేహితుడు, తన దేశ రాజు అయిన హర్షవర్ధనున్ని కాపాడటానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి  వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.

 అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, “ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

 హర్షవర్ధనుడు ఈ సమాధానంకు సంతృప్తి పడ్డాడు,

అతను తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు.  రాజు సమాధానం ఒప్పుకొని, హర్షవర్ధనున్ని విడుదల చేసి తన రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు.

 మరోవైపు, తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో, “మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది.  మీ స్నేహితుడిని కాపాడటానికి మీకు మీరే త్యాగం చేసారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంది

 “ప్రతిరోజూ, నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను మరియు తరువాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు. అని అడిగింది

దానికి సిద్ధిరాజ్ అది మీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి, నీవు ఎలా వున్నా సరే అలాగే కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు.

 ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి మీరు నన్ను స్వయంనిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటానుఅని అన్నది.

 “వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం.  చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది.....

 ఇందులో పాఠకులు గమనించాల్సిందేమంటే

 సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు.

 అందువల్ల, భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి.

 భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కాని, ఆమె జీవితంలో సగం మాత్రమే మీరు, మిగితా భాగాన్ని, ఆ సగం భాగాన్నయినా విడుదల చేయాలి, దీనితో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనస్సుందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి, మీలో మానవత్వం మొగ్గతొడిగితే తాను మీ మనోక్షేత్రంలో పూవై పూస్తుంది...

హిందూ వివాహం - ఆచారవ్యవహారాలు

 వివాహ పద్ధతులు 

కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే  వివాహం బ్రహ్మ వివాహం  

యజ్ఞం చేయడం కోసం రుత్విక్కుకు కన్యని దక్షిణగా  ఇవ్వడం - దైవవివాహం.

ఆవు, ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వడం - ఆర్ష వివాహం.

మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణిగా   ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం - ప్రాజాపత్య వివాహం. 

తల్లి, తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవడం  గాంధర్వ వివాహం.  

షరతు పెట్టి వివాహం చేసుకోవడం - అసుర వివాహం.  

కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం - రాక్షస వివాహం.

కన్య నిదురపోతున్నప్పుడు, ఏమరు పాటుగా ఉన్నప్పుడు అనుభవించి ,చేసుకున్న వివాహం - పైశాచిక వివాహం.

పెళ్ళిలో వధూవరులు ఒకరిపై ఒకరు  తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదెందుకు?

మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టేది శుభాసూచికముతో  పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని,  జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని.  జీలకర్ర, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తొలిస్పర్శ .ఎప్పుడైతే ఒకరినిఒకరు తాకుతారో అప్పుడే పెళ్ల యిపోయిన ట్లు.

తలంబ్రాలు పోసుకునే దెందుకు??

ప్రధమంగా నాలుగుసార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటిపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు.  ఆ సమయాన మంత్రాలకు అర్ధం సంతానం వృద్ధి చెందాలని మగవాడు, ధన ధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ....ఇలా సమస్త సంపదలు, సుఖాలు కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశము.

సప్తపది అనగా ఏంటి?

వధువుని  ఏడడుగులు నడిపిస్తూ.... నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని , సుఖాన్ని పశువ్రుద్ధిని, రుతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి.  ఇరువురము ధర్మ,మోక్ష, సుఖ కార్యాలను కలసి చేద్దాము.

పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్ధం ఏంటి?

పెళ్ళికొడుకైన నేను నీ మేడలో మాంగల్యం కడుతున్నాను,  నా, నీ జీవనం  ఈ క్షణం నుండి ప్రారంభం.  నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుస్శుతో మనం కలసి ఉండాలి. రెండు తాళి బొట్లు గౌరీ శంకరులు.  పరస్పరం ఒక్కటై అత్తింటి వార్నీ,  పుట్టింటి వారిని రెండు తాలిబోట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్ధం.   

పెళ్ళిలో అల్లుడి కాళ్ళు మామ గారెందుకు కడుగుతారు?

ఓ పెండ్లి కూమారుడా  పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను , నా కన్యమనిని,  ధర్మ, అర్థ, కామ , మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను.  ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను....

"ఓ వరుడా......నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారయనుడవి,  నా బిడ్డ లక్ష్మి దేవి, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను" అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి,  శ్రీ లక్ష్మి నారాయనులుగా భావించి నమస్కరిస్తారు.

 నల్ల పూసలు ధరించేది ఎందుకు?

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం.  దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా  ఉండటానికి ముక్యంగా ధరిస్తారు.  అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు.  నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భర్త, భార్యను ఎప్పుడు తాకాలి?

వివాహాది మంత్రాల ప్రకారమూ, సామాజిక ధర్మం ప్రకారం, భార్యకు కడుపు నిండా తిండి పెట్టి , కప్పుకోవడానికి, సిగ్గును దాచు కోవడానికి  బ‌ట్ట‌లు ఇవ్వాలి. అన్ని వైపుల నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి.  అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరిగా వెళ్ళడానికి అర్హుడు.

భార్య, భర్తకు ఏ వైపుగా  ఉండాలి?

సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.   కన్యాదాన సమయాన, విగ్రహ ప్ర‌తిష్ఠ‌ల స‌మ‌యంలో   కుడి వైపున ఉండాలి. 

బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి.   శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు. 


Feb 4, 2021

ఇండియన్ రైల్వే నూతన సేవలు

 ఎవరైనా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఒకటీ లేదా రెండు బ్యాగుల లగేజీని తమతో తీసుకెళ్తుంటారు. కొంత మందికి మాత్రం నాలుగైదు లగేజీ బ్యాగులు ఉంటాయి. వాటిని మొయ్యలేక, తీసుకెళ్లలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే శాఖ కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. 

ఇందుకోసం రైల్వే శాఖ... బుక్‌బ్యాగేజ్ (BookBaggage) అనే యాప్ తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఈ సర్వీసును ప్రయాణికులు పొందవచ్చు. దీని వల్ల మీరు ఇంట్లో ఉండి... మీ లగేజీని ఇంటి నుంచి ఎక్కడికి పంపాలో డిసైడ్ చేయవచ్చు. మీరు కోరుకున్నట్లే లగేజీని తీసుకొని... దాన్ని శానిటైజ్ చేసి... మీరు చెప్పిన చోటికి రైల్వే శాఖ తరలిస్తుంది. అంటే... మీరు రైల్వేస్టేషన్‌కి లగేజీని మీతోపాటూ తెచ్చుకోవాల్సిన పనిలేదు. దాని దారిన అది మీరు వెళ్లాలనుకున్నచోటికి యాప్ సర్వీస్ ద్వారా వెళ్లిపోతుంది. 

నిజానికి మీరు బుక్ బ్యాగేజ్ ద్వారా అప్లై చేసుకుంటే... మీ ఇంటి నుంచి తీసుకెళ్లే లగేజీని... రైల్లోనే ప్రత్యేక బోగీలో ఉంచుతారు. అది మీరు ఎక్కే రైలు కావచ్చు లేదో మరో రైలు కావచ్చు. ఏదైతేనేం... మీ ప్రయాణం ఎంత వేగంగా జరుగుతుందో, మీ సామాన్లు కూడా అంతే వేగంగా డెస్టినేషన్ చేరుకుంటాయి. మీరు రైలు దిగి... మీ గమ్యానికి చేరుకోగానే... మీ లగేజీని... అక్కడకు తెచ్చేస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఒక్కో బ్యాగుకీ రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఇతరత్రా ఎన్ని ఖర్చులున్నా... వాటితో ప్రయాణికులకు సంబంధం లేదు. రైల్వే శాఖ ఆ యాప్ ద్వారా ఈ సర్వీసును మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ట్రావెలర్స్‌కి ఈ సదుపాయం బాగా ఉపయోగపడగలదు. 


డెలివరీ ఇలా ఉంటుంది. ముందుగా మీరు లగేజీ ఇవ్వగానే దాన్ని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లి... 360 డిగ్రీల్లో అంటే... మొత్తం శానిటైజ్ చేస్తారు. ఇందుకోసం ఫస్ట్ అల్ట్రావయలెట్ లైట్ వాడుతారు. తర్వాత లగేజీని ప్యాక్ చేస్తారు. అందువల్ల మీ లగేజీ పాడవ్వదు. మీరు యాప్ సర్వీస్ ద్వారా... మీ లగేజీ ఎక్కడుందో ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లగేజీకి ఎలాంటి సమస్యలూ రాకుండా పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని రైల్వే శాఖ తెలిపింది.

ఈ సర్వీస్ పొందేందుకు మీరు ముందుగా బుక్ బ్యాగేజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 గంటల తరవాత నుంచి మీకు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 3 గంటల తర్వాత మీ లగేజ్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు హోమ్ నుంచి లగేజీ డెలివరీకి ఆర్డర్ ఇస్తే... మీరు ఎక్కే రైలు బయలుదేరే 3 గంటల ముందే లగేజీని తీసుకుపోతారు. తద్వారా మీరు ఎక్కే రైలులోనే లగేజీ కూడా ఉండేలా చేస్తారు. 

లగేజీ డెలివరీకి ముందే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరే పావు గంట ముందే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని బ్యాగులు ఉంటే... అన్ని రూ.125లు చెల్లించాల్సి ఉంటుంది. ట్రైన్ గమ్యానికి చేరుకున్న తర్వాత 3 గంటల్లో మీ లగేజీ మీరు కోరుకున్న చోటికి తెస్తారు. 

ఈ సర్వీసు చాలా బాగుందని ప్రయాణికులు చెబుతున్నారు. కొంత మంది ముసలివారు సామాన్లు మోయలేరు. అలాంటి వారికి ఈ సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు, ఫిల్మ్ షూటింగ్ వారు... భారీ ఎత్తున లగేజీని తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఈ సర్వీస్ ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.