Feb 20, 2018

24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు


పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ రెడ్డి
Ø 11 అంశాల ప్లీనరీ సెషన్స్
Ø 8 అంశాల  రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్
Ø రెండు కొరియా, జపాన్ సెషన్స్
Ø భారీగా పెట్టుబడులు రాక
Ø ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అనుకూల వాతావరణం

           సచివాలయం, ఫిబ్రవరి 20: విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు భాగస్వామ్య సదస్సు జరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ రెడ్డి చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సదస్సుకు సంబంధించిన అంశాలను ఆయన వెళ్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 2001, 2003, 2004లలో ఈ సదస్సులు జరిగాయాని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరిగే మూడవ సదస్సు ఇదని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో  కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సులలో గతంలో కేంద్ర ప్రభుత్వం సెషన్స్ మాత్రమే జరిగేవని, ఈ సారి  కేంద్రానికి చెందిన 11 ప్లీనరీ సెషన్స్ తోపాటు 8 అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్ ఉంటాయని తెలిపారు. ప్లీనరీ సెషన్స్ లో సన్ రైజ్ ఏపీ, ఇండస్ట్రీ 4.0, స్కిల్ డెవలప్ మెంట్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, మౌలికవసతుల అభివృద్ధి, రాష్ట్ర సెషన్స్ లో ఆటోమొబైల్, టెక్స్ టైల్, పునరుత్పాదక శక్తి, పర్యాటకం, ఎరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ ఎక్విప్ మెంట్ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అంతేకాకుండా కొరియాజపాన్ దేశాలకు చెందిన రెండు సెషన్స్ కూడా జరుగుతాయని చెప్పారు. ఈ సదస్సు ప్రారంభం రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరవుతారన్నారు. 14 దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, అంతర్జాతీయంగా పేరున్న 39 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు మొత్తం 2500 మందిని ఆహ్వానించినట్లు వివరించారు.
                సీనియర్ నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని, ఆయన వల్ల రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అన్నారు. 2016లో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.3,44,201 కోట్ల పెట్టుబడులు, 7,03,727 మందికి ఉపాధి లభించే సంస్థల ఏర్పాటుకు సంబంధించి 290 అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) జరిగినట్లు వివరించారు. వాటిలో 65.17 శాతం సంస్థలు, 44.26 శాతం పెట్టుబడులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 2017లో జరిగిన సదస్సులో 14,96,513 మందికి ఉపాధి కల్పించే  రూ.7,65,994 కోట్ల పెట్టుబడులతో స్థాపించే ప్రాజెక్టులకు సంబంధించి 586 అవగాహన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. వాటిలో 39.76 శాతం ప్రాజెక్టులు, 33.86 శాతం పెట్టుబడులకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సదస్సులలో కాకుండా 11,28,340 మందికి ఉపాధి లభించే రూ.3,15,713 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు సంబంధించి 941 ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. వాటిలో 53 శాతం ప్రాజెక్టులకు సంబంధించి 38 శాతం పెట్టుబడులతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
రెండు సదస్సులు కలుపుకొని పారిశ్రామిక విభాగంలో 8,74,658 మందికి ఉపాధి లభించే  రూ.2,92,300 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించే ప్రాజెక్టులకు సంబంధించి 178 ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. వాటిలో 54 శాతం ప్రాజెక్టులు 57.80 శాతం పెట్టుబలతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులలో కొన్ని నిర్మాణ దశలో, మరి కొన్ని యంత్రాల అమర్చే దశలో, ఇంకొన్ని ప్రారంభించే దశలో ఉన్నాయని చెప్పారు.
                     రాష్ట్రంలో సముద్రతీరం అధికంగా ఉండటం, వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం వల్ల  ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఆశాజనకంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ రంగానికి ఇక్కడ అనుకూల వాతావరణం ఉన్నందన్నారు.  ఈ రంగంలో రెండు సదస్సులలో 88,793 మందికి ఉపాధి కల్పించే రూ.9,702 కోట్లతో ప్రారంభించే ప్రాజెక్టులకు సంబంధించి 243 ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. వాటిలో 62 శాతం ప్రాజెక్టులు 65 శాతం పెట్టుబడులతో నిర్మాణదశలో ఉన్నట్లు తెలిపారు. ఈ రంగం అభివృద్ధి చెందడం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఇటు వినియోగదారులకు నాణ్యమైన ఆహారపదార్ధాలు లభిస్తాయన్నారు.  ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి జర్మనీకి చెందిన ఒక లాబ్ ఈరోజే మంగళగిరిలో ప్రారంభించినట్లు చెప్పారు. ఆసియా ఖండంలోనే  ఈ లాబ్ మొదటి స్థానంలో ఉందని, ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ కూడా ఇస్తారని తెలిపారు. డాక్టరేట్ చేసే విద్యార్థుల పరిశోధనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులు పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. సీఎం కష్టపడి పెట్టుబడులు రాబడుతున్నట్లు చెప్పారు.  అనంతపురంలోని కియా ప్లాంట్‌లో ఫ్రేమ్‌వర్క్‌ ఇన్‌స్టలేషన్‌ పనులను ఈ నెల 22న సీఎం ప్రారంభిస్తారని మంత్రి అమరనాథ రెడ్డి తెలిపారు.

ఏపీలో ప్రకృతి వ్యవసాయ విప్లవం

               ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి  వ్యవసాయసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో పచ్చదనం నింపడంతోపాటు ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా ఆహార ఉత్పత్తులు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. 2018ని ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.  విషపూరితమైన కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక మందులకు దూరంగా సాగుకు కృషి చేస్తున్నారు. సహజసిద్ధ వ్యవసాయం ద్వారా సాధించిన ఆహారోత్పత్తులు మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా చేస్తాయి. రాష్ట్రంలో రైతులు ఓ వైపు అధిక ఉత్పత్తి వ్యయంవర్షాబావ పరిస్థితులను, మరో వైపు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితులను  ఎదుర్కొంటున్నారుప్రజలు విషపూరితమైన  క్రిమి సంహారక మందులు విపరీతంగా చల్లిన ఆహార పదార్ధాలను తింటూ రోగాల బారిన పడుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి మళ్లకపోతే మరో 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించింది.  ప్రస్తుత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ప్రపంచానికి మనుగడ ఉండదు.  2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగిస్తే  పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో చాలా జీవరాసులు అంతరించిపోతున్నాయి.  ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అటు భూసారం దెబ్బతినకుండా,  రైతు ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు, ఇటు ప్రజారోగ్యం కాపాడేందుకు వ్యూహాత్మకంగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంకు నిపుణులు, ఐడీహెచ్ - టీఎంజీ పరిశోధనావేత్తలు వంటి అనేక మంది దీనికి మద్దతు పలుకుతున్నారు.
           రైతు సమస్యలపైన, వారి ఆదాయం పెంచడంపైన ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టింది.  ఈ విషయంలో  రైతన్నలు విజయం సాధించారు. ఇష్టానుసారంగా ఎరువులు, పురుగుమందులు వాడకుండా రూ.328 కోట్లకుపైగా ఆదా చేశారు.  ప్రకృతి వ్యవసాయం ద్వారా ధాన్యం ఉత్పత్తి 6 శాతం, పత్తి 10 శాతం, వేరుశనగ 23 శాతం అధికంగా ఉత్పత్తి సాధించారు. ఈ విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది.  కాకినాడ, తిరుపతి, గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద  సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రైతు శిక్షణ శిబిరాలు మంచి ఫలితాలనిచ్చాయి. రైతులకు అవగాహన కల్పించడానికి, వారు ప్రకృతి వ్యవసాయం వైపు మారడానికి ఉపయోగపడ్డాయి. గత డిసెంబర్ లో నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పాలేకర్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి రాష్ట్రంలోని అన్ని మండలాలు, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 8 వేల మంది రైతులు హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల 331 మండలాల్లోని 972 గ్రామాల నుంచి ఏడాది, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఇందులో మెళకువలు తెలిసి, అధిక ఉత్పత్తులు సాధించిన 5 వేల మందితోపాటు మిగిలిన 333 మండలాల నుంచి కూడా 1700 మంది కొత్త రైతులు , 13 వందల మంది మహిళా రైతులు, కార్పోరేట్ రంగం నిపుణులు కూడా పాల్గొన్నారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రకృతి వ్యవసాయ సాగుకు ఉపయోగపడే పరికరాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.   ఇక్కడ శిక్షణ పొందిన రైతులు తమ గ్రామాలలోను, ఇతర గ్రామాలలోనూ రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
               వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, వానపాములు అంతరించిపోవడం, భూసారం దెబ్బతినడం, ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు, బీజామృతం, ఘన, ధ్రవజీవామృతం తయారుచేయడం, చీడపీడల నుంచి రక్షణ కల్పించే పద్దతులు, వివిధ పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అంతర్ పంటల సాగు వంటి అంశాలలో రైతులకు శిక్షణ ఇచ్చారురైతులు, వినియోగదారుల సంక్షేమం, భూసారం పెంచే వినూత్న పద్దతులు, ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం వంటి విషయాలను వారికి వివరించారు. ఈ విధానంలో రైతులు దీర్ఘకాలంలో లాభపడతారు. ఒక గ్రామంలో ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే సర్టిఫికేషన్ తేలికవుతుంది. రసాయన రహిత ఆహార పదార్ధాలు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందిఈ కార్యక్రమానికి 5 ఏళ్ల వరకు 700 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు రాష్ట్రీయ కృషివికాస్ యోజన, పరంపరాగత్ కృషివికాస్ యోజన, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి. 5 ఏళ్ల కాలంలో అజీమ్ ప్రేమ్ జీ ఫిలాంత్రొపిక్ ఇన్షియేటివ్  రూ.100 కోట్లు ఖర్చు చేస్తుంది. భవిష్యత్ అంతా ప్రకృతి వ్యవసాయానిదే2016-17లో రాష్ట్రంలోని 704 గ్రామాల్లో 40,656 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి వచ్చారు. 2017-18లో రాష్ట్రంలోని సగం 331 మండలాల్లో 399 క్లస్టర్లలో 972 గ్రామాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో ఎంపిక చేసిన గ్రామాలతో కలుపుకొని  ప్రస్తుతం 1,38,993 మంది రైతులు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ప్రకృతి వ్యవసాయం పద్దతులు అనుసరిస్తున్నారు. వీరిలో 25 శాతం మంది రైతులు విత్తన దశ నుంచే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు  రాష్ట్రంలో లక్షా 80 వేల మంది, 2024 నాటికి 60 లక్షల మంది రైతుల వరకు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టే అవకాశం ఉంది. తద్వారా నూరు శాతం పచ్చని ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. 2027 నాటికి ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం కృషి చేస్తాంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Feb 16, 2018

చివరి త్రైమాసికంలోనే అదనపు బడ్జెట్


ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
          సచివాలయం, ఫిబ్రవరి 16: ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అదనపు బడ్జెట్ అడగవద్దని, ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే బడ్జెట్ లోనే పెట్టుకోవాలని, అదనపు బడ్జెట్ కావాలంటే చివరి త్రైమాసికంలోనే ఇస్తామని ఆర్థిక మంత్రి యనమ రామకృష్ణుడు అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సమీక్షించారు. ఆయా శాఖలకు కేటాయించిన నిధులను అవసరాన్ని బట్టి ఇతర పథకాలు, ప్రాజెక్టులకు వినియోగించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. అయితే స్థిరాస్తులకు కేటాయించిన నిధులను రెవెన్యూ ఖర్చులకు మళ్లించకూడదని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో స్థిరాస్థి ఖర్చులు పెంచుతామని చెప్పారు.   కేటాయించిన నిధులు ఖర్చు చేసిన తరువాత మాత్రమే అదనపు నిధులు అడగాలన్నారు. ప్రతి శాఖ  ముఖ్యమంత్రి హామీలను, ఇంటింటికి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను ఇస్తామని చెప్పారు. ఈ పనులు పంచాయతీరాజ్ శాఖలో ఎక్కువగా ఉంటాయని, ఇది చాలా ముఖ్యమైన శాఖని పేర్కొన్నారు. రోడ్లు, త్రాగునీరు, భూగర్బ మురుగునీటిపారుదల పనులను పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలలో  అప్పటికి ఉన్న జనాభా ప్రాతిపదికన నీటి పథకాలను రూపొందిస్తారని, జనాభా పెరిగిన తరువాత ఆ పథకాలు సరిపోవన్నారు. అవి పాతబడిపోయి ప్రస్తుత అవసరాలను తీర్చలేవని చెప్పారు.  అందువల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలోపెట్టుకొని పథకాలను చేపట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే పథకాలకు నిష్పత్తి ప్రకారం ఎంత ఖర్చయినా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మానవాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామీణుల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ  అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ పోస్టులను త్వరగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
          గ్రామ పంచాయతీలలో 80 శాతం సిసి రోడ్లు పూర్తి అయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యునికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇందుకు రూ.430 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు.  రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనన్నారు. నివాస ప్రాంతాలకు మెటల్ రోడ్లు వేసినట్లు తెలిపారు. నీటి పథకాలను భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల వరకు పెరిగే జనాభా అవసరాలను దృష్టిలోపెట్టుకొని రూపొందిస్తున్నాట్లు వివరించారు. ఐటీ విభాగంలో వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని, అలాగే జీఎస్టీ, విద్యుత్, ఉత్పత్తి ఇన్సెంటివ్స్  వంటి  రాయితీలు ఇవ్వవలసి ఉన్నందున అదనపు నిధులు కేటాయించాలని మంత్రి కోరారు. ఫాన్స్ కాన్ వంటి అయిదు అంతర్జాతీయ సంస్థలు రానున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని లోకేష్ చెప్పారు. వైద్య ఆరోగ్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్లు ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ లో కోటి ఎకరాలకు నీరందించినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాయలసీమకు 160 టీఎంసీలు, కొత్త ఆయకట్టు 70 వేల ఎకరాలకు 40 టీఎంసీల నీరుల నీరందించినట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా రబీపంట వేశారని తెలిపారు. చెరువులు కూడా నింపినట్లు మంత్రి చెప్పారు.
          ఎన్టీఆర్ సుజల పథకానికి, లెడ్ బల్బులకు నిధులు పెంచమని పంచాతీరాజ్ శాఖ అధికారులు కోరారు. వచ్చే నవంబర్ నాటికి రాష్ట్రంలోని వీధి బల్బులు అన్నీ ఆన్ లైన్ కు ఎక్కుతాయని, అలాగే విద్యుత్ కనెక్షన్లు కూడా కంప్యూటరైజేషన్ అయిపోతాయని, మాన్యువల్ ఏమీ ఉండదని వివరించారు. ఎండీఓల వాహనాలకు నిధులు ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 25వేల బోర్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్  పాలసీలతోపాటు సైబర్, డీటీపీ వంటి కొత్త పాలసీలు ప్రకటించామని, -ప్రగతి, స్టార్ట్ అప్ కంపెనీలు, మౌలిక వసతులు, సబ్సిడీలు తదితరాలకు అవసరం ఉన్నందున తమ శాఖకు  ఎక్కువ నిధులు కేటాయించాలని  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యునికేషన్స్ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. మేజర్ కంపెనీలు అనేకం వస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 42 మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది కోటి మందికి డిజిటల్ లిటరేచర్ పై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.  ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయడం దేశంలో మన రాష్ట్రం 4వ ర్యాంకులో ఉన్నట్లు  వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా 24 గంటలు వైద్య సేవలతోపాటు బైక్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఐటిడీఏ అధికారులు ప్రతివారం తనిఖీలు చేస్తుంటారని చెప్పారు. డయాలసిస్ కేంద్రాలు మరో 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సహజ ప్రసవాలు బాగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యసేవలను నీతిఅయోగ్ కూడా ప్రశంసించినట్లు చెప్పారు. డాక్టర్ పోస్టుల భర్తీకి డాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. ప్రస్తుతం పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించాలని చెప్పారు. నిధుల మంజూరు, బిల్లుల చెల్లింపుల  విషయంలో ఆర్థిక సహకరించాలని ఆమె కోరారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావలసిన నిధులు, నరేగా, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులు, నాబార్డ్ రుణాలు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్, బీమా, 104 ఉద్యోగుల జీతాలు, మహాప్రస్థానం పథకం, తెలుగు గంగ తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
          ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శులు కెవివి సత్యనారాయణహేమా మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.