Nov 4, 2017

పటిష్టమైన ఆధార్ వ్యవస్థ


మొరోకో బృందానికి వివరించిన యుఐడిఏఐ చైర్మన్ జె.సత్యనారాయణ
Ø 118.69 కోట్ల ఆధార్ కార్డులు జారీ
Ø 1247.07 కోట్ల ప్రామాణిక లావాదేవీలు

      సచివాలయం, నవంబర్ 3: దేశంలో ఆధార్ కార్డుల సమాచార సేకరణ, డేటా వ్యవస్థను పటిష్టమైన భద్రతతో రూపొందించినట్లు యుఐడిఏఐ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. మన దేశంలోని ఆధార్ వ్యవస్థ, అనుసందానం గురించి తెలుసుకోవడానికి  మొరోకో మంత్రి నూరుద్దీన్ బుతాయబ్ నాయకత్వంలో ఒక బృందం శుక్రవారం అమరావతికి వచ్చింది. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం మొరోకో బృందానికి సత్యనారాయణ ఆధార్ కార్డులు రూపొందించే విధానం, వాటి ఉపయోగం గురించి రియల్ టైమ్ డేటా చూపుతూ  వివరించారు. నెట్ వర్క్, ఇంటర్నెట్ పరంగా వ్యవస్థకు నష్టం కలుగకుండా, గోప్యత పరంగా గట్టి భద్రతతో దీనిని రూపొందించినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రతి పౌరుడికి ఇది ఒక డిజిటల్ గుర్తింపుగా ఉంటుందన్నారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లో ఉంటుందని, 8 ప్రాంతీయ కార్యాలయాలు, రెండు పెద్ద డేటా సెంటర్లు ఉన్నట్లు తెలిపారు.
దేశంలో ఇప్పటి వరకు 118,69,34,754 ఆధార్ కార్డులను జారీ చేయగా, 14,87,64,063 సార్లు అప్ డేట్ చేసుకున్నట్లు,  మొత్తం 1242,37,36,586 ప్రామాణిక  లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఆధార్ వివరాలు నమోదుకు సంబంధించి 211 రిజిస్ట్రార్లు, 754 నమోదు ఏజన్సీలు, 6,74,335 మంది ధృవీకరించిన ఆపరేటర్లు, సూపర్ వైజర్లు, 48,434 నమోదు కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. బయోమెట్రిక్ విధానంలో పది వేళ్లు, రెండు కళ్ల ఐరిస్ నమోదు చేస్తారని, ఒక్కో వేలుకు సంబంధించి 20 గుర్తులు ఉంటాయని తెలిపారు. ఆధార్ వినియోగానికి సంబంధించి 2016లో ఒక చట్టం చేశారని, అందులో అన్ని వివరాలు స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. ఆధార్ నెంబర్ ఆధారంగానే రేషన్, పెన్షన్, ప్రభుత్వ సబ్సిడీలు, గ్రామీణ ఉపాధి హామీ పథకంస్కాలర్ షిప్స్ వంటి వాటికి అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే భూముల రిజిస్ట్రేషన్ వంటి వాటికి కూడా ఈ నెంబర్ ని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ వల్ల పాదర్శకతతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఇప్పటివరకు 8 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆదా అయినట్లు తెలిపారు.  ఆధార్ కు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి వివిధ భాషల్లో 24 గంటలూ పని చేసే సిబ్బంది ఉంటారని చెప్పారు. దేశంలో ఇ-ప్రగతి గురించి కూడా వివరించారు. దేశంలో జరిగే లావాదేవీలన్నీ నమోదవుతాయని తెలిపారు. రాష్ట్రంలో సీఎం డ్యాష్ బోర్డు ద్వారా 170 కార్యక్రమాలకు సంబంధించిన రియల్ టైం  వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫార్మా హబ్, విద్యా హబ్, ఏపీ ఫైబర్ నెట్ తదితర అంశాలు కూడా వివరించారు.

అవినీతికి తావులేకుండా లబ్దిదారునికి ప్రయోజనం
           ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారునికి ప్రయోజనం చేకూరడానికి, ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు సమయండబ్బు ఆదా అవుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ వివరించారు. కోటి 40 లక్షల కుటుంబాలకు 28,942 చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై పలు రకాల ఆహార ధాన్యాలు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో సరఫరా చేసిన సరుకులకు సరైన జవాబుదారి ఉండేది కాదని, ఇప్పుడు 86 శాతం సరుకులు, 50 శాతం కిరోసిన మాత్రమే పంపిణీ జరుగుతున్నట్లు నమోదవుతుందని వివరించారు. ఆచరణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.  నగదు రహిత లావాదేవీలు కూడా జరుపుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పొలం నుంచి వినియోగదారునికి చేరేవరకు అన్ని దశల గురించి సవివరంగా తెలిపారు. రైతులు వద్ద కొనుగోలు చేసినవాటికి 7 రోజుల్లో ఆన్ లైన్ లో చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నెల నుంచి రెండు నెలల సమయం పట్టేదని చెప్పారు. పౌరసరఫరాల శాఖ వాహనాలు బయలుదేరినప్పటి నుంచి  డిపోకు చేరేవరకు ఎక్కడ ఉందో ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చన్నారు.

ప్రజలే ముందు 1100లో 2వేల మంది సిబ్బంది
            రియల్ టైమ్ గవర్నెస్(ఆర్టీజీ)కి చెందిన బాలాజీ ప్రజలే ముందు(పీపుల్స్ ఫస్ట్) 1100 గురించి వివరించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటిని పరిష్కరించి, వారి సంతోష స్థాయిని పెంచేందుకు ఈ ఏడాది మే 251100 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కాల్ సెంటర్లో  రెండు వేల మంది సిబ్బంది 360 రోజులు 24 గంటలూ  పని చేస్తుంటారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు, వివిధ కార్యక్రమాల పట్ల వారి సంతృప్తి తెలుసుకుంటూ ఉంటారని తెలిపారు.  రోజుకు పది వేల కాల్స్ వస్తుంటాయన్నారు. పెన్షన్ దారులు 77 శాతం సంతృప్తిగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. మొరాకో బృందం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పారు. అనేక అనుమానాలను వ్యక్తం చేసి నివృత్తి చేసుకున్నారు.

రూ.1500 కోట్లు తగ్గిన ఖర్చు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
        తొలుత పౌరసరఫరాల శాఖ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆధార్ ను రూ.169 కోట్ల వ్యయంతో అనుసందానం చేసి రూ.1500 కోట్లు ఖర్చు తగ్గించినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు తగ్గాయని, నిజమైన లబ్దిదారునికి సరుకులు అందుతున్నట్లు తెలిపారు. 1100 కాల్ సెంటర్ ద్వారా ప్రజా సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న మొదటి రాష్ట్రం ఏపీ అని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, -ప్రగతి సీఈఓ ఎస్.బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Nov 3, 2017

పేదలకు వేగంగా ఇళ్ల నిర్మాణానికి చర్యలు


మంత్రి కాలువ శ్రీనివాసులు
Ø లబ్దిదారులకు అవగాహన సదస్సులు
Ø 2014 కంటే ముందు మంజూరై, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు రూ.25వేలు
Ø ప్రాజెక్ట్ డైరెక్టర్లకు భారీ లక్ష్యాల నిర్ధేశం
Ø కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుకు ప్రయత్నం

   సచివాలయం, నవంబర్ 2: రాష్ట్రంలో పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద వేగంగా ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4 బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.  గృహ నిర్మాణ శాఖ 13 జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లతో ఈ ఉదయం సమావేశమై రాష్ట్రంలో ఈ పథకం పనితీరుని సమీక్షించినట్లు చెప్పారు. ఇప్పటివరకు చక్కటి పనితీరు కనపరిచిన శాఖ సిబ్బందికి ఇంకా భారీ లక్ష్యాలను నిర్ధేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేదల సొంత ఇంటి కల నెరవేర్చడానికి  రూ.19వేల కోట్లతో 13 లక్షల ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారుఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేందుకు లబ్దిదారులకు అవగాన కల్పించడానికి కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయడంతోపాటు నియోజకవర్గాల వారీగా, అవసరమైన చోట్ల మండలాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2014 కంటే ముందు మంజూరై, నిర్మాణం పూర్తి కాని ఇళ్లు 2.60 లక్షలు ఉన్నాయని, వాటిలో లక్షా 50 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి  చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వాటికి గతంలో రూ.70వేలు మాత్రమే మంజూరు చేశారని, వారు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడానికి మరో రూ.25వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతమందికి ఈ విషయం తెలియదని, అవగాహనా సదస్సుల ద్వారా వారికి తెలియని విషయాలు తెలియజెప్పి ఇళ్లు త్వరగా నిర్మించుకునేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మండల స్థాయిలో ఏఈలకు లక్ష్యాలు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రధాన కార్యాలయంలో పని చేసేవారిని ప్రత్యేక అధికారులుగా నియమించి, ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడానికి  వారిని కూడా బాధ్యలను చేసినట్లు  తెలిపారు.
        పేదలు కూడా సౌకర్యవంతంగా ఉండే శాశ్వితమైన ఇళ్లు నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూ.95 వేల సబ్బిడీతోపాటు ఉపాధి హామీ పథకం కింద రూ.55వేలు అందజేస్తున్నట్లు వివరించారు. తమకు గ్రామస్థాయిలో తగినంత సిబ్బంది లేనందున రూ.55వేలకు సంబంధించి 90 రోజుల పనిదినాల మస్టర్ బాధ్యతలను గతంలో మాదిరిగానే పంచాయతీరాజ్ సిబ్బందికి అప్పగించినట్లు చెప్పారు. ఈ నెల 1 నుంచి ఈ కార్యక్రమాలను ఉపాధి హామీ సిబ్బందే చూసుకుంటారన్నారు.
      రాష్ట్రంలో పేదలకు ఏప్రిల్ నెలలో 16,061 ఇళ్లు, మేలో 14,014, జూన్ లో 15,692, జూలైలో 18,305, ఆగస్ట్ లో 24,061, సెప్టెంబర్ లో 26,060, అక్టోబర్ లో 28,593 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను ఇంకా పెంచినట్లు చెప్పారు. 2014 కంటే ముందు మంజూరు చేసిన వాటిలో 10,426 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. నిర్మాణం వేగంగా జరిగేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, జన్మభూమి కమిటీ సభ్యులను అందరినీ భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుకు ప్రయత్నం
2020 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గ్రామీణ యోజన (పీఎంఏవై) పథకం కింద మరిన్ని ఇళ్లు మంజూరు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాము త్వరలో ఈ విషయమై ఢిల్లీ వెళ్ల కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు.  ప్రజా సాధికార సర్వే అనేది అత్యుత్తమమైనదని, ఆ సర్వే ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 31 లక్షల మంది ఇళ్లు కావాలని కోరినట్లు వివరించారు. వారిలో 20.99 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, వారికి ఇళ్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. కేంద్రానికి చెందిన ఆవాస్ వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్లతో సహా వారి పేర్లు  అప్ డేట్ చేసినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.

గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత


మంత్రి కాలవ శ్రీనివాసులు
Ø 13 జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లతో సమీక్ష
Ø వారం వారం సమీక్షతో వ్యవస్థని పరిగెత్తించాలి
Ø నా పనితీరుపై నేను కూడా సీఎంకు నివేదికలు ఇస్తా
Ø  అలసత్వం ప్రదర్శించే ఏఈలు, వర్క్ ఇనస్టెక్టర్లపై చర్యలు
Ø 2018 జూన్ కి 5 లక్షలు, 2019 జనవరికి 10 లక్షల ఇళ్లు లక్ష్యం

   సచివాలయం, నవంబర్ 2: తమ ప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 13 జిల్లాలకు చెందిన ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులతో మంత్రి సమావేశమై ఎన్టీఆర్  గృహ నిర్మాణ పథకం ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము వెళ్లిన ప్రతి గ్రామంలో, సర్వేల్లో పేదలు ఇళ్లు కావాలని అడుగుతున్నారని, అందువల్లే ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చి, ఇళ్ల నిర్మిణం త్వరగా జరగాలని  వెసులుబాట్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇంటిని 750 చదరపు అడుగుల వరకు, జాయింట్ వాల్స్ నిర్మించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అలాగే బిల్డింగ్ ప్లాన్ నించి కూడా మినహాయింపు ఇచ్చారని తెలిపారు.  రాష్ట్రంలో గృహాలు లేని బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్లు నిర్మించే బృహత్తరమైన చాలా పెద్ద రూ.19వేల కోట్ల ప్రాజెక్ట్ అని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఉద్యోగులకు సంతృప్తినిస్తుందని, అలాగే ఏఈలకు, వర్క్ ఇనస్టెక్టర్లకు గ్రామాల్లో గౌరవం పెరుగుతుందన్నారు. గృహ నిర్మాణ పథకం అమలులో ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇదంతా సిబ్బంది శ్రమ ఫలితమేనని  కొనియాడారు. కొంతవరకు ప్రగతి సాధించినప్పటికీ, అధిగమించాల్సిన లక్ష్యం చాలా ఉందని,  2018 జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు, 2019 జనవరి నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇక నుంచి వారం వారం జరిగిన పనులను సమీక్షించుకుంటూ వ్యవస్థని పరిగెత్తించాలని, ప్రతి జిల్లాలో ప్రగతిని చూపించాలని పిలుపు ఇచ్చారు. ఇబ్బందులను, సమస్యలను అధిగమించి సత్తాచాటాలన్నారు. లక్ష్యాన్ని ప్రణాళికా బద్దంగా సాధించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పారు. ఉద్యోగుల పనితీరు మదింపు చేసి తక్కువ పనిచేసే ఉద్యోగుల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికి వారు తమ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. తాను కూడా మంత్రిగా నెలకు ఒకసారి సీఎంకు తన వ్యక్తిగత పనితీరుపై నివేదికను ఇస్తానని చెప్పారు. తాను కర్నూలు జిల్లాకు ఇన్ ఛార్జిగా ఉన్నందున అక్కడకు ఎన్ని సార్లు వెళ్లింది, ఏఏ ప్రాంతాలు సందర్శించింది, ఎన్ని సమస్యలను పరిష్కరించింది, అలాగే తన నియోజకవర్గానికి నెలలో 10 రోజులు వెళ్లవలసి ఉందని, అక్కడ సమస్యలను, పరిష్కరించిన అంశాలను, అలాగే మొత్తం మీద ఎన్ని పాఠశాలలు, హాస్టళ్లు సందర్శించింది తదితర వివరాలను సీఎంకు అందజేస్తానని చెప్పారు. అలాగే అధికారులు, ప్రతి ఒక్క బాధ్యులు తమతమ పనితీరును సమీక్షించుకోవాలని చెప్పారు.

పని విషయంలో, లక్ష్యాలను పూర్తి చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శించే ఏఈలు, వర్క్ ఇనస్టెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమకు ఎవరిమీద శత్రుత్వంలేదని, పనిపై శ్రద్ధ చూపనివారి వల్ల ఇంతటి పెద్దఎత్తున పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి నష్టం జరుగుతుందని, అందువల్ల అటువంటివారిపై చర్యలు తీసుకొని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని మంత్రి కాలవ చెప్పారు.
        గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయని, అయితే వాటిని అధిగమించి సమర్థవంతంగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. వర్క్ ఇనస్టెక్టర్లు ఒక్కొక్కరు 250 ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించవలసి ఉందని, అలాగే జియో ట్యాంగింగ్ వారు చేయాలని వారితోపాటు డీఈలు, వర్క్ ఇనస్టెక్టర్ల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. కృష్ణా, గుంటూరు, విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పని తీరు ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉందన్నారు. పని జరిగిన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పారు.
జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ లో ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇటుకల రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నట్లు చెప్పారు. పరిస్థితిని  సీఎంకి గిరిజన ప్రాంతాలకు అదనపు నిదులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని మంత్రి చెప్పారు. కొన్ని జిల్లాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. వెంటనే సిబ్బందిని నియమించుకోమని చెప్పారు. సిబ్బంది నియామకం, అవుట్ సోర్సింగ్ ఏజన్సీల అంశంపై కూడా చర్చించారు.  ఇంకా చురుకుగా పనిచేస్తేనే లక్ష్యాలను అధిగమించగలమని ఎండి చెప్పారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య కూడా పాల్గొన్నారు.