Nov 3, 2017

15 నుంచి విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు


వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

Ø సన్న,చిన్నకారు రైతుల ప్రయోజనాలపై చర్చ
Ø అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలకు ఆహ్వానాలు
Ø 15 వందల మంది ప్రతినిధులు హాజరు
Ø ముగింపు సభలో సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ పాల్గొంటారు
Ø సదస్సు నిర్వహణకు కమిటీల నియామకం
Ø రాష్ట్రంలో రూ.160 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్
Ø ఏపీ సాయిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్  ఏర్పాటు

        సచివాలయం, నవంబర్ 2: విశాఖపట్నంలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక సదస్సు-2017ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని చిన్న,సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం నిర్వహించే ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణయ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొంటారని తెలిపారు. సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహించే ఈ సదస్సుకు దాల్ బర్గ్ సలహాదారుగా ఉన్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, సంబంధిత కార్యదర్శులు, వ్యవసాయశాఖ సంచాలకులను, దేశంలోని వ్యవసాయ, దాని అనుబంధ విశ్వవిద్యాలయాల కులపతులను, విద్యార్థలును, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రా శాస్త్రవేత్తలను, పరిశోధకులను, రాష్ట్రంలోని 13 జిల్లాలల్లోని అభ్యుదయ రైతులు, స్వచ్ఛంద సంస్థలను, వ్యవసాయశాఖ, దాని అనుబంధ శాఖల ఉన్నతాధికారులను, అయోవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ విశ్వవిద్యాలయంల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. వ్యవసాయ రంగంతోపాటు దాని అనుబంధ రంగాలైన ఉద్యానవన, రొయ్యలు, చేపల ఉత్పత్తి, పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగంలో సాంకేతిక, సృజనాత్మకత, భూసార పరీక్షలు, వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక పరికరాలు, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్, పరపతి తదితర అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి, డిజిటల్ మ్యాపింగ్, ఉపగ్రహాల ద్వారా భూసార పరిక్షలు, వాతావరణం ప్రాతిపదికగా ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెంచేందుకు చిన్న, సన్నకారు రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం  బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ఆఫ్రికాలోని నూతన టెక్నాలజీతో ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఇది లాభాపేక్షలేని సంస్థ అని తెలిపారు. ఈ ఫౌండేషన్ మన దేశంలో బీహార్, ఒరిస్సా రాష్ట్రాలతో కూడా ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో అయోవా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అమెరికాలో వెయ్యి ఎకరాలను ఒకే కుటుంబం సాగుచేస్తుందని, వారు వాడే యంత్రాల ఖరీదు రూ.22 కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలిపారు. అక్కడ పొలాల్లో ఒకరిద్దరే పని చేస్తుంటారన్నారు. ఆ రకమైన వ్యవసాయం ఇక్కడ సాద్యం కాదని, ఇక్కడ అన్ని చిన్న కమతాలే ఉంటాయని చెప్పారు. మనకు అనుకూతమైన యంత్రాలు కావాలన్నారు. మన రాష్ట్రంలో రూ.160 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు చెప్పారు.  ఈ నెల 17న జరిగే సదస్సు ముగింపు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సు అంశం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిందని,  బిల్ గేట్స్ కూడా వస్తున్నట్లు తెలియడంతో అనేక మంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, తమకు కూడా ఆహ్వానాలు పంపమని కోరుతూ పలువురు మెస్సేజ్ లు పంపినట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, గతంలో ఐటీ,ఐటీ.. అన్న ఆయన ఇప్పుడు ఏటీ (అగ్రిటెక్నాలజీ), ఏటీ ... అంటున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయరంగం బాగుందని, వర్షాలు కురిశాయని, నదులు నిండాయని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

       వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖలో జనవరిలో జరిగిన పార్టనర్ షిప్ సబ్ మిట్ జరిగిన స్థాయిలోనే వ్యవసాయ సాంకేతిక సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఏడాది అర్థ సంవత్సరం గణాంకాల ప్రకారం జీవీఏ (రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ)లో ప్రాధమిక వ్యవసాయరంగంలో 16 శాతం వృద్ధి రేటు కనిపిస్తోందన్నారు. ఈ సదస్సులో ప్రధానంగా చిన్న,సన్నకారు రైతులకు ఉపయోగపడే అంశాలనే ఎక్కువ చర్చించడం జరుగుతుందన్నారు. 15 వందల మంది ప్రతినిధులు పాల్గొనడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు వ్యవసాయ సాంకేతిక అంశాలకు సంబంధించిన పోటీ, గ్రామీణ సలహాల సేవలు, మార్కెటింగ్, క్రెడిట్, డేటా సేకరణ, దాని పూర్తి స్థాయి వినియోగం వంటి అంశాలను చర్చిస్తారని వివరించారు. బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా వంటి దేశంలో పరిశోధనలు చేసి ఫలితాలు సాధించిందని చెప్పారు. పంటలకు నేల లక్షణాలు ముఖ్యమని, ఆఫ్రికా సాయిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్  నెలకొల్పి, అక్కడ వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి, పరీక్షించి భూసారాన్ని మెరుగుపరిచారని వివరించారు  మన రాష్ట్రంలో కూడా ఏపీ సాయిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్  ని నెలకొల్పి శాటిలైట్లు, డ్రోన్ ల ద్వారా భూసారాన్ని పరీక్షించి, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు, లేని ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి తగిన సహాయం, సహకారాలు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ రంగానికి వెంటనే ఉపయోగపడే అంశాలకు సంబంధించి పోటీ జరుగుతుందని, ఆ పోటీకి ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఏపీ నుంచి 30, విదేశాల నుంచి 20, మిగిలినవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయని వివరించారు. ఈ దరఖాస్తులను జ్యూరీ పరిశీలించి వాటిలో ఉత్తమమైన పదింటిని ఎంపిక చేస్తుందని, వారు సదస్సులో తమ ప్రాజెక్టులను ప్రదర్శించిన తరువాత ముగ్గురిని ఎంపిక చేసి వారికి అవార్డులు అందజేసి సన్మానాలు చేస్తారని చెప్పారు. సదస్సు జరిగే 3 రోజులు 50 నుంచి 60 స్టాళ్లతో ఎగ్జిబిషన్ నిర్వహించడం దీని ప్రత్యేకతగా పేర్కొన్నారు. సదస్సుని విజయవంతంగా నిర్వహించడానికి స్టీరింగ్ కమిటీ, వర్కింగ్, ప్రొటోకాల్, ఆహ్వనం, వసతి, రవాణ, పిచ్ కాంపిటీషన్, కంటెంట్, సెక్యూరిటీ, నగర సౌందర్య, సాంస్కృతిక, ప్రసారమాద్యమాల, ప్రదర్శన తదితర కమిటీలను నియమించినట్లు రాజశేఖర్ వివరించారు.  వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ కూడ పాల్గొన్నారు.

Nov 1, 2017

రైతులకు వరం గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం


 v 150 మండలాల్లో అమలు
v సమర్థవంతంగా నిర్వహిస్తున్న సెర్ఫ్
v పేదరిక నిర్మూలనే  ప్రభుత్వ లక్ష్యం
      
      ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం (ఆర్ఐజీపి- రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్) రైతులకు ఓ వరం నిలుస్తోంది.  ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రధాన ఉద్దేశం రైతులకు అన్ని విధాల సహాయపడటం. ఈ సంస్థ మినీ ఫీడ్ మిక్చర్ ప్లాంట్లను సమకూరుస్తుంది. అలాగే ఘనజీవామృతం, వెర్మీకంపోస్ట్ తయారు చేయడానికి సహకరించడంతోపాటు విత్తనాలు పంపిణీ చేస్తుంది. సేంద్రీయ ఎరువులు, పోషక విలువలున్న మొక్కల పెంపకం, కోళ్ల ఫారాలు, రూరల్ రిటైల్ చైన్ మార్ట్స్ వంటి విషయాలలో రైతులకు సహాయపడుతుంది. వివిధ పంటలు పండించే రైతులతోపాటు కూరగాయలు, మామిడితోటలు, జీడిమామిడితోటలు, చింతమండు, వేరుశనగ, గొర్రెలు,మేకలు పెంపకం, కోళ్ల పెంపకం, డెయిరీ, అన్న సంజీవనీ జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ పథకాన్ని సెర్ఫ్ సమర్థవంతంగా అమలు చేస్తోంది.  ఈ సంస్థ వివిధ జిల్లాల్లో ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం) కార్యక్రమాలను కూడా చేపట్టింది.  పశ్చిమగోదావరి జిల్లాను మే 29న ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం) జిల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు
     వెలుగు ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నా ఇంకా అనేక మండలాలలో లక్షల కుటుంబాలు ఇంకా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నాయి. పలు నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 150 మండలాల్లో నిరుపేదలు, షెడ్యూల్ కులాలు, గిరిజన కుటుంబాలు మానవాభివృద్ధి, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడి ఉన్నట్లు తేలింది. దాంతో సెర్ప్ ఆ మండలాల్లో గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం అమలు చేస్తోంది. 13 జిల్లాల్లో 664 మండల సమాఖ్యలు, 27,813 గ్రామ సంఘాలు, 6,96,302 స్వయం సహాయక సంఘాల ద్వారా 89 లక్షల మంది నిరుపేద, పేద మహిళల ఆర్థిక, ఆర్థికేతర అవసరాల కోసం వెలుగు ప్రాజెక్ట్ పని చేసింది.  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా పేదరికం కొంతవరకు తగ్గినప్పటికీ షెడ్యూల్ కులాలు, గిరిజనులు, మహిళలలో అధిక శాతం మంది ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ వర్గాల్లోని 63 శాతం మంది స్త్రీలు రక్త హీనతతో బాధపడుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మాతా,శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మలవిసర్జనకు బహిర్భూమికి వెళ్లేవారు కేరళలో 5.6 శాతం ఉంటే రాష్ట్రంలో 65 శాతం మంది ఉన్నారురాష్ట్రంలో కుటుంబాల మధ్య సంపద అసమానంగా ఉంది. ముఖ్యంగా మొత్తం జనాభాలో పేదరికాన్ని పోల్చి చూస్తే ముస్లింలు, ఎస్సీలు, గిరిజనులలో 23 శాతం మంది పేదరికంలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో చిన్న,సన్నకారు రైతులు అభివృద్ధి అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో సెర్ప్ ప్రపంచ బ్యాంకు సహాయంతో స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంఘాల్లో 90 వరకు పేద కుటుంబాల సభ్యులే ఉంటారు.
         ఎస్సీ,ఎస్టీ కుటుంబాలు ఎక్కువగా ఉండి, స్త్రీల అక్షరాస్యత తక్కువ, నీటి పారుదలలేని వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్న 150 మండలాలను గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం కింద ఎంపిక చేశారు. ఈ మండలాల్లోని 2.50 లక్షల పేద కుటుంబాలు వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 50 శాతం అధికంగా ఆదాయం పొందడం, మానవాభివృద్ధి సేవలు ఎక్కవగా అందుబాటులోకి తేవడంతోపాటు వారు సామాజిక, సాంఘిక హక్కులు పొందడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో ఎస్సీ,ఎస్టీ, చిన్న,సన్నకారు రైతులే 70 శాతం భాగస్వాములుగా ఉంటారు.

   ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం రూ.643.88 కోట్లు కేటాయించింది. విలువల గొలుసు (వాల్యూ చైన్), మానవాభివృద్ధి కార్యక్రమాలకు, సామాజిక రక్షణ, హక్కులు పొందడానికి ఈ నిధులు వినియోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ కాలపరిమితి 5 ఏళ్లు, అంటే జూన్ 2019 లోపల వీటికి ఖర్చు చేయాలి. ఈ నిధులను విలువల గొలుసు కార్యక్రమాలకు రూ.232.4 కోట్లు, రిటైల్ చైన్స్ కు రూ.36.5 కోట్లు, మానవాభివృద్ధికి రూ.119.5 కోట్లు, ఒన్ స్టాప్ షాప్ కు రూ.67.39 కోట్లు, ఐసీటీకి రూ.117 కోట్లు, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కు రూ. 71.09 కోట్లు కేటాయించారు.  రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 150 మండలాల్లో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల  శారీరక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు, పౌష్టికాహారం అందించడానికి, ఆ కుటుంబాలకు చెందిన స్త్రీల అక్షరాస్యత పెంచడం, మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం వంటి మానవాభివృద్ధి కార్యక్రమాలకు, చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం వెచ్చిస్తారుఆ విధంగా రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్9440222914