Ø
మౌలిక
సదుపాయాల కల్పనకు రూ.9,190 కోట్లు
Ø కన్సల్టెంట్లతో ఈ నెలాఖరున సమావేశం
Ø ఏడీసికి భూమి కేటాయించాలని నిర్ణయం
Ø అడ్డగోలు కట్టడాలకు అడ్డుకట్ట
Ø అమరావతిలో శీతలీకరణ వ్యవస్థ ప్రతిపాదన
Ø రాజధానిలో బంగళాల విస్తీర్ణాలు ఖరారు
Ø 5 క్లష్టర్లలో 12 అంతస్తుల 68 టవర్లు
Ø
11 నమూనాలపై 21 వేల మందికి
పైగా అభిప్రాయాలు
అమరావతిలో మౌలికవసతులు, ఇతర అభివృద్ధి
ప్రాజెక్టులకు సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటివరకు రూ.9,190 కోట్ల విలువైన పనులను చేపట్టింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సౌర సాంకేతిక పరిజ్ఞానం, విద్య,
మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆతిధ్య,
పర్యాటక రంగాలలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు
పెట్టేందుకు బ్రిటన్ సంస్థలు ఆసక్తి
చూపుతున్నాయి. ఇప్పటికే యూకేకి చెందిన పలు కంపెనీలు విశాఖ కేంద్రంగా
పనిచేస్తున్నాయి.
మరిన్ని రంగాలలో ఏపీలో విస్తరించేందుకు ఆ దేశ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఐవోటీ ద్వారా డిజిటల్ సెక్యూరిటీ ఐడీ తయారీకి సంబంధించి కవి హోల్డింగ్ సంస్థ
కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ సంస్థ ఇప్పటికే విశాఖపట్నంలో దీనిపై ఫెజెట్టే సంస్థతో కలిసి ఒక పైలట్
ప్రాజెక్ట్ చేస్తోంది. సెన్సర్లు, బయోమెట్రిక్స్, జీపీఎస్ అనుసంధానంతో ఒక సురక్షిత ఐడీ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ప్రాజెక్టు తీరుతెన్నులను పరిశీలించి రాష్ట్ర పోలీస్శాఖ దీన్ని ఉపయోగించుకునే
అవకాశం ఉంది.
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ)
ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించాలని, అందుకు వీలుగా కొంత భూమిని కార్పొరేషన్కు కేటాయించాలని ప్రభుత్వం
నిర్ణయించింది.
మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరగడానికి ఏడీసి చర్యలు
తీసుకుంటోంది.
అడ్డదిడ్డమైన నిర్మాణాలు జరిగితే అద్భుత నగరం
నిర్మించడం సాధ్యకాదు. అందువల్ల రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో,
సీఆర్డీఏ పరిధిలోని మిగిలిన గ్రామాలు, పురపాలక సంఘాలు, నగరాల పరిధిలో ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టడం ఇక
వీలుపడదు.
సీఆర్డీఏ గట్టి చర్యలు తీసుకుంటుంది. 5 క్లష్టర్లలో 68 టవర్లుగా శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్
అధికారులు,
గెజిటెడ్, నాన్ గెజిటెడ్
అధికారులు,
నాలుగో తరగతి ఉద్యోగులకు గృహనిర్మాణం చేపడతారు. 12 అంతస్థులుగా ఒక్కో టవర్ నిర్మిస్తారు. ఈ టవర్లకు సంబంధించిన
ఆకృతులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఉంటాయి. మంత్రులు,
న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు బంగళాలు నిర్మిస్తారు. ఒక్కొక్క బ్లాకులో నాలుగు బంగళాల చొప్పున అవసరమైన సంఖ్యలో నిర్మాణం చేపడతారు. మొత్తం 11
నమూనాలపై
ప్రజల అభిప్రాయం కోరగా,
21 వేల మందికిపైగా స్పందించారు. ఆకృతుల రూపకల్పనలో
ప్రజాభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. వీఐపీ హౌసింగ్లో
భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, చట్టసభల స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం నిర్మించనున్న బంగళాల విస్తీర్ణాలు దాదాపుగా ఖరారయ్యాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్
బంగళాను 2,500
చదరపు గజాల్లో, 9000 చ.అడుగుల విస్తీర్ణంతో,
చదరపు గజానికి రూ.3,162 వ్యయంతో నిర్మిస్తారు. హైకోర్టు జడ్జిల కోసం 36 బంగళాలను ఒక్కొక్కటి 2,000 చ.గ.ల్లో, 6,000 చ.అ.
విస్తీర్ణంతో, చ.గ.
రూ.1722 - రూ.1865 ఖర్చుతో నిర్మిస్తారు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ బంగళాలను ఒక్కొక్కటి 2,000 చ.గ.ల్లో, 6,000 చ.అ.
బిల్టప్ ఏరియాతోనూ, చట్టసభల డిప్యూటీ
స్పీకర్, డిప్యూటీ చైర్మన్ కోసం 2,000 చ.గ.ల్లో, 5,000 చ.అ.తోనూ నిర్మిస్తారు. మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ కోసం 35 బంగళాలను ఒక్కొక్కటి 2,000 చ.గ.ల్లో, 6,000 చ.అ.
విస్తీర్ణంతో కడతారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శుల కోసం
టైప్-1లో 25
బంగళాలను ఒక్కొక్కటి 1500 చ.గ.ల్లో 5000
చ.అ. విస్తీర్ణంతో, సలహాదారుల కోసం టైప్-2గా 15 బంగళాలను ఒక్కొక్కటి 1500 చ.గ.ల్లో, 4,000 చ.అ.
బిల్టప్ ఏరియాతోనూ, సెక్రటరీలు, అడిషనల్ డీజీ, ఐజీ, పీసీసీఎఫ్, ఏసీసీఎఫ్, హెచ్వోడీల కోసం మొత్తం 75 బంగళాలను ఒక్కొక్కటి 1,000 చ.గ.ల్లో 4,000
చ.అ. విస్తీర్ణంతో నిర్మిస్తారు. రాజధాని అమరావతి
నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో నిర్మాణాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది.
భవిష్యత్ లో అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలకే అధిక
ప్రాధాన్యత ఇస్తారు. త్వరలో 1500 ఎలక్ర్టిక్ వాహనాలు
ప్రవేశపెట్టనున్నారు. 30 నిమిషాలలో నగరంలో ఎక్కడి
నుంచి ఎక్కడికైనా చేరుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం. ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో సింగపూర్ కు చెందిన ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ సూచనలు, సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ వాటర్ అథారిటీ, వాటర్ మాస్టర్ ప్లాన్, అమరావతి ప్లానింగ్, డిజైన్ అండ్ రీసెర్చ్
ఇనిస్టిట్యూట్ ఏర్పాటు, క్యాపిటల్ రీజియన్
ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (సీఆర్ఐపీఏ), ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణంలో భాగంగా అమరావతిలో ఉష్ణోగ్రతలను తగ్గించే
డిస్ర్టిక్ట్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. దాదాపు 40
శాతం ఇంధనం ఆదాయ చేసే ఈ తరహా వ్యవస్థ ప్రపంచంలో
తొలిసారి సింగపూర్లో ఏర్పాటు చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలు వుండే అమరావతిలో ఈ తరహా వ్యవస్థ అత్యవసరమని ప్రభుత్వం
భావిస్తోంది.
గుజరాత్లో నర్మదానది
మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించే సర్దార్ వల్లభాయ్
పటేల్ విగ్రహం తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం
నిర్ణయించింది.
ప్రభుత్వం ఈ నెలలో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ
ఏర్పాటు చేయనుంది.
రాజధాని అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో భారీ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని
ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే అతిపెద్దదిగా రూపొందించనున్న దీనికి ‘కోస్టా మెరీనా’ అనే పేరు పరిశీలనలో ఉంది. దీని ఏర్పాటుకు ముంబయి కేంద్రంగా పనిచేసే ఓషన్ బ్లూ
బోటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ముందుకు వచ్చింది. అమరావతికి ఆనుకుని ప్రవహిస్తున్న కృష్ణానదిలో బోటింగ్, సెయిలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇందులో బోట్ నిర్మాణం, బోట్ల మరమ్మతులు, శిక్షణ కేంద్రం, బోట్ విక్రయ కేంద్రాలు,
లైట్ హౌస్, ఫుడ్ కోర్టులు, బీచ్ వాలీబాల్ వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి
ఉంది.
ఇటీవల కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదాన్ని
దృష్టిలోపెట్టుకొని స్థానిక మత్స్యకారులకు అత్యాధునిక బోట్లను నడపడంలో
తగిన తర్ఫీదు ఇస్తారు. పర్యాటక రంగ అభివృద్ధికే కాకుండా ఇది స్థానిక
మత్స్యకారులకు ఉపాధి కల్పించే కేంద్రంగా ఉంటుంది. పూర్తి పర్యావరణరహితంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
ఈ తరహా కేంద్రాల ఏర్పాటు ద్వారా నదీ తీర ప్రాంత ఆర్థిక
కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. పరిపాలన, పచ్చదనం,
జలకళ, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక వ్యవస్థ, విద్య, వైద్యం, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే పర్యాటకం, ప్రజా రవాణా వ్యవస్థ వెరసి అమరావతిని కాలుష్యరహిత మహానగరంగా నిర్మించాలని
ప్రభుత్వం పలు కోణాల్లో ఆలోచనలు చేస్తోంది.
-
శిరందాసు
నాగార్జున, సీనియర్
జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment