రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి
సచివాలయం, నవంబర్ 27: సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.గోపాల గౌడ ప్రతిపక్షనేత లాగా మాట్లాడటం భావ్యంకాదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి హితవు పలికారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. రాజధాని భూసమీకరణకు సంబంధించి గౌడ చేసిన వ్యాఖ్యలను లింగారెడ్డి ఖండించారు. ఓ మాజీ న్యాయమూర్తి రాజకీయ నాయకునిలా,రాజకీయపరమైన లక్ష్యంతో ప్రజలను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం, సొంత భాష్యాలు చెప్పడం బాధాకరం అన్నారు. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారని, ఒక నివేదికలోని మంచీ చెడులను సమీక్షించి దానిని అమలు చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందన్నరు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా, సమదూరంలో ఉండాలని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించినట్లు వివరించారు. ఇక్కడ నుంచి అనంతపురం జిల్లాలోని కర్నాటక సరిహద్దు ప్రాంతం 420 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని ఒడిస్సా సరిహద్దు ప్రాంతం 520 కిలో మీటర్లు ఉంటుందని, ధనికొండలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆ దూరం అనంతపురం జిల్లా వారికి 320, శ్రీకాకుళం జిల్లా వారికి 620 కి.మీ. అవుతుందని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండగా, రెండేళ్లకే ఎందుకు వచ్చారని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రాజెక్ ని అయినా త్వరగా పూర్తి చేయమని ఎవరైనా డిమాండ్ చేస్తారని, రెండేళ్లకే ఇక్కడ భవనాలు నిర్మించుకోని వచ్చే విమర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమను త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామన్నారు. మాజీ న్యాయమూర్తులు ఈ విధంగా మాట్లడటం భావ్యం కాదన్నారు. తాను కూడా కాన్ స్టిట్యూషన్ లా లో మాస్టర్ డిగ్రీ చేశానని, ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా న్యాయవిరుద్దమైన చర్య అవుతుందని లింగారెడ్డి ప్రశ్నించారు. భూ సేకరణ రెండు రకాలని ఒకటి రైతులు స్వచ్చందంగా భూమి ఇవ్వడం అని, దానినే భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అంటారని, రెండు భూ సేకరణ అంటారని తెలిపారు. 20 వేలకు పైగా రైతులు 33 వేలకు పైగా ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారని చెప్పారు. వారిలో వంద మంది కూడా కోర్టుకు వెళ్లలేదంటే మిగిలినవారందరూ సహకరించినట్లే గదా అని అన్నారు. 2013 చట్టం ప్రకారం అయితే బలవంతంగా భూమి సేకరించవలసి ఉంటుందని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించారని, ఆ సభల్లో 99 శాతం మంది రైతులు ఒప్పుకునే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. ఆ గ్రామ సభల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆందోళన కూడా చేశారని తెలిపారు. ఆందోళనలు కూడా చేస్తే గ్రామసభలు నిర్వహించలేదనడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని ఉంటే సంబంధిత కోర్టు స్టే ఇచ్చి ఉండేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే నిర్మాణం ఆలస్యం అవుతుందని చెప్పారు. అలాగే రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే త్వరగా పూర్తి అవుతుందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళిక రూపొందించే బాధ్యత సింగపూర్ కంపెనీకి ఇవ్వడమేమిటని అడగటంలో అర్ధంలేదన్నారు. మన దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విదేశాలకు వెళ్లి ప్రాజెక్టులు నిర్మించలేదా? అలాగే ఎంతోమంది మేథావులు విదేశాల్లో అనేక పనులు చేస్తున్నారని, అలాగే ఆయా దేశాలకు చెందినవారు వారివారి అనుభవం ఆధారంగా ఇక్కడ పని చేస్తారని, ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందని, ఆ విధంగా సంకుచితంగా ఆలోచించకూడదని అన్నారు.ఓ ప్రతిపక్ష నేతగా, పోటీ కాంట్రాక్ట్ దారునిగా మాట్లాడినట్లు ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే లాంటి వారే కోర్టుకు వెళ్లారని, ఆ పార్టీకి చెందిన రైతులు ఎవరూ వెళ్లలేదని చెప్పారు. రాజ్యాంతం ప్రసాధించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా భావి తరాల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూమి సమీకరించినట్లు తెలిపారు. రాజధాని అంటే భవనాలు, పరిపాలనే కాదని, ఆర్థిక, విద్య, వైద్యం తదితర అన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయని అన్నారు. ప్రతిపక్షం వారు నిర్వహించే సభల్లో మాట్లాడేవారు ప్రభుత్వంపై బురదజల్లే విధంగా, ప్రతిపక్షంలా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడవద్దని సలహా ఇచ్చారు.
క్రిస్మస్ కంటే ముందే చంద్రన్న కానుక
సంక్రాంతి, క్రిస్మస్ కు సంబంధించిన చంద్రన్న కానుకలు క్రిస్మస్ కంటే ముందే ఇస్తామని లింగారెడ్డి చెప్పారు.ప్రభుత్వం రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని, ప్రతి పైసా సద్వినియోగం చేస్తామని, ఎక్కడైనా దుర్వినియోగం అయినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్లు తెలిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కందులు, శనగలకు సంబంధించి పప్పు దిగుబడి నిష్పత్తి ఆధారంగా టెండర్లు ఖరారు చేస్తామని, అయితే అందులో తేడాలు ఏమైనా ఉంటే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేడా ఉన్నట్లు తేలితే టెండర్లును రద్దు చేస్తామని, అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటామని లింగారెడ్డి చెప్పారు.
No comments:
Post a Comment