విద్యార్థి సంఘ ఉద్యమాలు మరి ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బలహీనపడటం అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా ప్రమాదరకం. విద్యార్థులు విద్యతోపాటు దేశభక్తి, సమాజాభివృద్ధి ఆలోచనలు, సేవాతత్పరతను పెంపొందించుకోవాలి. కొన్ని ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు దేశంలో బలమైన విద్యార్థి ఉద్యమాల అవసరం ఉంది. ప్రభుత్వాల వింత పోకడల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాక ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలను గాడిలో పెట్టడానికి బలమైన, శక్తివంతమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలి. విద్యావ్యవస్థ, విద్యా విధానాలలో మార్పుల వల్ల విద్యార్థి ఉద్యమాలు నీరుగారాయి. విద్యార్థులలో పూర్వపు చైతన్యం కొరవడింది. స్వాతంత్ర్యానికి ముందు, తరువాత కూడా దేశంలో బలమైన విద్యార్థి ఉద్యమాలు నడిచాయి. రాజకీయ మార్పులకు, సమసమాజాభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. గతంలో విద్యార్ధులు అనేక ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు. అటు రాజకీయ నాయకులకు, ఇటు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అన్ని రాజకీయ పార్టీలలో పేరు ఘడించిన రాజకీయ నాయకులందరూ విద్యార్థి ఉద్యమాల నుంచే వచ్చారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ వారు నైతిక విలువలతో కూడిన రాజకీయ నాయకులుగా ఎదిగారు. విద్యార్థి ఉద్యమ, ముఖ్యంగా వామపక్ష విద్యార్థి ఉద్యమ నేపధ్యం కలిగిన వారు కులమతాలకు అతీతంగా సామాజిక చైతన్యం కలిగినవారుగా ఎదిగారు. అనేక విద్యార్థి సంఘాలు క్రియాశీలకంగా ఉండటం, పోటీలు పడటం వల్ల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. రాజకీయ, ఇతర సమస్యలను ఎదుర్కొనే సమర్థులుగా తయారయ్యేవారు. ఉత్తమ శ్రేణి నాయకత్వం తయారవడానికి విద్యార్థి సంఘాలు దోహదపడతాయి. ఆ దశలో వారికి కులమత వ్యత్యాసాలు తెలియవు. అభ్యుదయ భావాలు అవలర్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పథం కలిగించి, సమసమాజ స్థాపనకు కృషి చేసేవి. సమాజం పుట్టుక, పరిణామక్రమం, కులాల ఏర్పాటుకు చారిత్రక నేపధ్యం, మానవతా విలువలు, కులంకంటే మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అనేక అంశాలను ఆయా పార్టీల పెద్దలు వివరించేవారు.
విద్యావ్యవస్థ, బోధనలో వచ్చిన మార్పులు, కుప్పలుతెప్పలుగా ఏర్పడిన కాలేజీ వల్ల కాలక్రమంలో విద్యార్థి ఉద్యమాలు బలహీనపడ్డాయి. విద్యా బోధనలో నాణ్యత కూడా తగ్గింది. కాలేజీ యాజమాన్యాలు చేసే వికృత చేష్టల వల్ల విద్యార్థులలో చదువు తప్ప ఇతరిత్రా చైతన్యం నశించింది. అటు రాజకీయం, ఇటు సామాజిక అంశాల పట్ల అవగాహన కూడా తగ్గింది. ఫీజుల పేరుతో సర్టిఫికెట్లను కూడా ఇవ్వకుండా వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాల తీరుకు నిరసన తెలిపే పరిస్థితులు కూడా లేవు. పరిస్థితులు అంత దయనీయంగా మారిపోయాయి. వామపక్ష రాజకీయ పార్టీలు కూడా విద్యార్ధి ఉద్యమాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ ప్రభావం పార్టీల ఎదుగుదలపై స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధి సంఘాలను ఈ విధంగా వదిలివేస్తే ఆ పార్టీలు బలహినపడడటమే కాకుండా సమాజానికి ముఫ్పు అనేది ఆయా పార్టీల పెద్దలు గ్రహించవలసి ఉంది. విద్యార్ధి సంఘాలు, ఉద్యమాలు ఎప్పుడైతే బలహీనపడ్డాయో అప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాలలోకి వచ్చేవారు తగ్గిపోయారు. ఉత్తమ నాయకత్వం కొరవడింది. రౌడీలు, గూండాలు, వ్యాపారవేత్తలు, కులాల పేరుతో రెచ్చగొట్టేవారు రావడం మొదలై రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ప్రజా సేవకంటే, ధనం దండుకోవడానికే ప్రాధాన్యత పెరిగింది. విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. సామాజిక పరంగా కూడా విద్యార్థులలో చైతన్యం, అవగాహన పూర్తిగా తగ్గిపోయాయి. విద్యార్థి దశలోనే వారు కులాలకు ప్రాధాన్యత ఇస్తూ మానసికంగా కలుషితమవుతున్నారు. సామాజిక స్పృహ లేకుండాపోతోంది. కనీస మౌలిక వసతులు, అర్హత కలిగిన బోధకులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోవడం కూడా ఇటువంటి మార్పులు రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
1936 నుంచి దేశంలో విద్యార్ధి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జేఎన్టీయూ నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియా, విశాఖలోని ఆంధ్రా యూనివర్సి వరకు అనేక యూనివర్సిటీలు పలు ఉద్యమాలకు వేదికలుగా నిలిచాయి. రాజకీయ ఉద్యమాలతోపాటు శాస్త్రీయ విద్యావిధానం అమలుకు, స్త్రీ వాదం బలపడటానికి, దళిత, బహుజన, కులాతీత,మతాతీత ఉద్యమాలు అనేక నిర్వహించారు. విశ్వజనీన భావన ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. నేడు విద్యార్థుల ఆత్మహత్యలు, పరువు హత్యలు, అరాచక శక్తుల ఆగడాలకు విద్యార్థినులు బలవడాలు అనేకం జరుగుతున్నాయి. ఏనాడైతే విద్యార్ధి ఉద్యమాలు బలపడతాయో ఆనాడే ఇటువంటి చర్యలకు చెక్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. మళ్లీ అందరూ, అన్ని స్థాయిలలో విద్యార్ధి ఉద్యమాలను నిర్మించి, సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన అవసరం ఉంది. రాజకీయ మేథావులైన పెద్దలు ఆలోచించాలి.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment