కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కేసన శంకరరావు డిమాండ్
అమరావతి, మే 6 : రాష్ట్రంలో పని చేసే కాంట్రాక్ట్,
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సోమవారం ఒక ప్రకటలో
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక
సంస్థలు ప్రభుత్వ సొసైటీలు రాష్ట్ర ప్రభుత్వాల
పథకాలు యూనివర్శిటీలలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు పని
చేస్తున్నారని తెలిపారు. వీరంతా వివిధ
రకాల పేర్లతో కాంట్రాక్ట్, ప్రభుత్వం నియమించిన పలు ఏజన్సీల
ద్వారా 3 నుంచి 18 ఏళ్లుగా పనిచేస్తున్నాని వివరించారు. పలు శాఖలలో అనేక మంది అత్యంత
అనుభవం, అత్యున్నత విద్యార్హతలు కలిగిన వారు
ఉన్నారు. వారంతా అణచివేత, అవమానాలకు గురవతున్నారు. కాంట్రాక్ట్
ఏడాది వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తుంటారు. అందువల్ల
వీరికి ఉద్యోగ భద్రత ఉండదు. ఎన్ని ఏళ్లు చేసినా ఏ బ్యాంకు వీరికి రుణం కూడా
ఇవ్వదు. ఇతర ఏ సౌకర్యాలు పొందలేరు. ఇన్ని
ఏళ్లుగా వీరంతా ప్రభుత్వ విభాగాలలో పని చేస్తున్నా తగిన వేతనం ఇవ్వడంలేదు. వారు
కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా
పని చేస్తున్నా వారికి ఆరోగ్య కార్డులు లేవు. బీమా సౌకర్యం లేదు. వారికి సెలవులు దొరకండా కూడా అతి కష్టం. జీతాలు కూడా అతి తక్కువగా అత్యంత దారుణంగా
ఇస్తున్నారు. కొన్ని ఏజన్సీలు వారికి
జీతాలు సరిగా ఇవ్వరు. ఆలస్యంగా ఇస్తారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటివాటిని సక్రమంగా చెల్లించరు. తక్కువ జీతాలు ఇవ్వడం సమాన
పనికి సమావేతనం అన్న సూత్రానికి ఇది విరుద్ధం.
ప్రభుత్వమే ఇన్ని ఏళ్లుగా ఉద్యోగులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగించడం అన్యాయం. అక్రమం. ఇక
ప్రైవేటే సంస్థలలోని అక్రమాలను ప్రభుత్వం ఏం అదుపు చేయగలదని శంకరరావు
ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతాలు
చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం
వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల వేతనాలు
వర్తించవని పంజాబ్ - హర్యానా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ‘ఒకే పనికి ఒకే వేతనం’అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందని తెలిపారు.
ఉద్యోగులకు దక్కవలసిన ప్రయోజనాలు
దక్కకుండా చేయడానికే ప్రభుత్వాలు కృత్రిమ ప్రాతిపదికలు సృష్టిస్తున్నాయని
సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే బాధ్యతలు నిర్వహిస్తూఒకేరకమైన పనిచేస్తున్న ఇద్దరి వేతనాల్లో ఒకరు శాశ్వతమనీ మరొకరు తాత్కాలికమనీ అంటూ వివక్ష
చూపడం కుదరదనీ సంక్షేమ రాజ్యంలో అస్సలు కూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఎవ్వరూ ఇష్టపూర్వకంగా తక్కువ వేతనానికి పనిచేయరనీ గత్యంతరం లేని స్థితిలో కుటుంబ
పోషణ కోసం తమ ఆత్మగౌరవాన్నీహుందాను విలువనూ తగ్గించుకొని ఇందుకు
సిద్ధపడతారని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేవిధమైన
పనిచేసే వారి వేతనాల్లో తేడాలు ఉండటమంటే అది వారి శ్రమను దోచుకోవడమూ అణచివేయడమూ
అవుతుందని న్యాయస్థానం విశ్లేషించింది. భారత రాజ్యాంగంలోని 141వ అధికరణాన్ని గుర్తుచేస్తూ ఉద్యోగి పర్మినెంటా కాంట్రాక్టా అనే దానితో నిమిత్తం
లేకుండా సమానపనికి సమానవేతనం పొందడమన్నది ఉద్యోగి తిరుగులేని హక్కుగా
సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒక సంస్థలో ఒకే విధమైన పనిచేస్తున్న వారందరికీ
సమానవేతనం ఇవ్వాలని 1976 కార్మికచట్టంలో ఉంది. ప్రభుత్వ
చట్టాలను, సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి
అర్హతల ఆధారంగా పర్మినెంట్ చేసి, వారికి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా
వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగులతో
సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, వారు పని చేసే చోట తగిన
భద్రతా ప్రమాణాలు పాటించాలని శంకరరావు కోరారు.
No comments:
Post a Comment