Sep 11, 2026

చేనేత కులాలు ఏకమవుతున్న వేళ





చేనేత వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న దృఢసంకల్పంతో చేనేత కులాల వారు అందరూ ఏకమవుతున్నారు. చేనేత వర్గం వారు విద్య, వ్యాపారపరంగా ఎదుగుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నప్పటికీ, రాజకీయంగా తగిన ప్రాధాన్యత లేదన్న భావన వారిలో నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంతే కాకుండా, ఈ రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత కులాల వారు విద్య, వైద్యం, వ్యాపార రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. మన దేశంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. పద్మశాలి, దేవాంగ, తొగట, తొగట వీరక్షత్రియ, భావసార క్షత్రియ, కుర్ని, జాండ్ర, పట్టుసాలి, స్వకులశాలి, కురిమిశెట్టి (కుర్ణి), నెస్సి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాల భక్తులు, సాధనాసురులు, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్, కైకాల మొదలియార్, సాలియర్, దేవాంగ చెట్టియర్, సౌరాష్ట్రియన్స్, పట్టుసాలియర్, కైకోలరస్, సెంగుంత.. వంటి అనేక చేనేత కులాల వారు ఉన్నారు. ఇందులో దాదాపు 18 చేనేత కులాల వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఇందులో కొన్ని కులాలు జాతీయస్థాయిలో అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. చేనేత కులాల వారు అన్ని రంగాలలో పరస్పరం సహకరించుకుంటూ, రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఈ కులాల మధ్య ఐక్యత కోసం వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, అఖిల భారత పద్మశాలి సంఘం, ఇతర చేనేత కుల సంఘాల వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చేనేత కులాల వారు రాజకీయంగా బలపడటంతోపాటు, చట్ట సభల్లో తమ వాటా స్థానాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.

చేనేత ఉత్పత్తులు, ఆప్కో ప్రక్షాళన, చేనేత సహకార సంఘాల సమస్యలపై ఓవైపు చేనేత కార్మిక సంఘాల వారు ఈ నెల 2న ఏపీలోని మంగళగిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, చేనేత ఉద్యమ శంఖారావం పూరించారు. ఒకే మగ్గం-ఒకే గమ్యం, చేనేత వర్గాలను ఏకం చేద్ధాం అన్న పిలుపుతో ఈ నెల 5న అమెరికాలోని న్యూజెర్సీలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ యూఎస్ఏ ప్రాంతీయ సదస్సును నిర్వహించింది. కులం, ప్రాంతం, భాషలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాలను అంతర్జాతీయ వేదికపై ఏకం చేయాలన్నది ఈ సదస్సు లక్ష్యం. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది జీవించే చేనేత కులాల నుంచి ఏపీ
శాసనసభలో ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత శాసనసభలో ఆ ఒక్కరు కూడా లేరు. అత్యంత దయనీయమైన పరిస్థితి ఏమిటంటే, రెండ తెలుగు రాష్ట్రాలలో చేనేత శాఖలకు మంత్రులుగా చేనేత రంగానికి చెందని ఇతర కులాల వారు ఉన్నారు. చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు పది శాతం చేనేత కులాల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ఆ ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం ఎన్నికలలో రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలన్నది చేనేత వర్గాల డిమాండ్.
రాజకీయ పార్టీలు తమను గుర్తించేవిధంగా ఐక్యత చాటే ప్రయత్నంలో చేనేత కులాల వారు ఏకం కానున్నారు. ఏపీలో 175 మంది శాసనసభ్యుల్లో చేనేత కులాల నుంచి ఒక్కరంటే ఒక్కరే కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్(టీడీపీ) ఉన్నారు. శాసన మండలిలో పంచుమర్తి అనురాధ(టీడీపీ) ఉన్నారు. అయినా, వారికి ఆ శాఖ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేనేత కులం నుంచి ఉన్న ఒక్క సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆమెకు కూడా చేనేత శాఖ ఇవ్వలేదు. టీఆర్ఎస్ నుంచి శాసనసభలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శాసనమండలిలో ఎల్.రమణ ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందువల్ల, తెలంగాణలో అత్యధికంగా ఉన్న చేనేత కులం పద్మశాలీయుల్లో ఒకరిని కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి తీసుకుని, మంత్రి పదవి ఇవ్వవలసిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా చేనేత కులాలకు చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన మంత్రులకు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఈ రంగం పట్ల తగినంత అవగాహన లేకపోవడ వల్ల వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాలు.... వంటి సమస్యలు సమగ్రంగా తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదు. అవగాహనా లోపం వల్ల నిజమైన చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అందడంలేదు. ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రంపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించవలసి ఉంది. అందుకు చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయ నేతలుగా ఎదగవలసిన అవసరం ఉంది. చేనేత కులాల నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రగడ కోటయ్య... వంటి నేతలు లేకపోవడం వల్ల ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికులకు సన్నిహితంగా ఉండేవారు. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. జాతీయ స్థాయిలో చేనేత గళం వినిపించగల దమ్ముండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల విద్యా, వ్యాపార, పారిశ్రామిక పరంగా ఎదిగినా, రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది.
నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది. ఆ దిశగా, రాజకీయం లక్ష్యంతో ఉద్యమించాలని చేనేత కులాల వారు నిర్ణయించుకున్నారు. అందరూ ఐక్యంగా ఉండి ఒక్కతాటిపై నిలబడి, శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న కొన్ని సంఘాలు వివిధ కారణాల వల్ల ప్రస్తుతం యాక్టివ్ గా లేవు. అందువల్ల కూడా ఈ రంగానికి నష్టం జరిగింది. ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్, అఖిల భారత పద్మశాలి సంఘం, దేవాంగ.. తదితర ఇతర కుల సంఘాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి. చేనేత వర్గాల వారు విద్య, వ్యాపార, ఆర్థిక పరంగా బలపడటంతోపాటు రాజకీయంగా ఎదగడానికి ఈ సంఘాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి . అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయా సంఘాలు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా సమావేశమై అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇందుకు చేనేత కులాల ఐక్యతతోపాటు రాజకీయంగా యువతను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని గుర్తించారు. ఇందుకోసం అన్ని చేనేత కులాల వారు కలిసి పనిచేయాలని తీర్మానించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత కులాలతోపాటు, చేనేత కార్మిక సంఘాలను కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు. ఏపీలో దాదాపు 45 శాసనసభ నియోజకవర్గాల్లో, తెలంగాలో 30కి మించి గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలవారు ఉన్నట్లు నిర్ధారించారు. అంటే, అంత మంది ఎమ్మెల్యేలను నిర్ణయించగల స్థితిలో చేనేత కులాలవారు ఉన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, నిరంతరం చేనేత వర్గాలు రాజకీయంగా ఎదగడానికి కృషిచేయాలని భావిస్తున్నారు. చేనేత కులాల వారు గెలిచే అవకాశం ఉన్న అధిక నియోజకర్గాలలో ఆయా పార్టీల టిక్కెట్లు దక్కించుకోవాలన్న గట్టి నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయా సంఘాలు ఐక్యంగా భారీ స్థాయిలో బహిరంగ సభలు కూడా నిర్వహించాలన్న ఆలోచనతో వారు ఉన్నారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

చేనేత కులాలు ఏకమవుతున్న వేళ

చేనేత వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న దృఢసంకల్పంతో చేనేత కులాల వారు అందరూ ఏకమవుతున్నారు. చేనేత వర్గం వారు విద్య, వ్యాపారపరంగ...