Feb 22, 2026

మంగళగిరిలో చేనేత కులాల గర్జన

నేడు మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ


దేశంలో వ్యవసాయ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే చేనేత రంగం నేడు దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ హామీలు సరైన రీతిలో అమలు కాకపోవడంతో రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత సంఘాలన్నీ ఏకమై ‘చలో మంగళగిరి’ పిలుపును ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘చేనేత గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. సమస్త చేనేత కులాల వారు ఏకంకండి అని పిలుపునిచ్చాయి. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలన్న సంకల్పంతో చేనేత కార్మికులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రి సమీపంలోని వై జంక్షన్ వద్ద చేనేత సర్కిల్ వరకు మహా ప్రదర్శన నిర్వహించి, అక్కడే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ‘చేనేత గర్జన’ విజయవంతం చేసేందుకు వివిధ చేనేత సంఘాల నేతలు నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ చేనేత కులాలకు చెందిన చేనేత కార్మికులను ఏకం చేశారు. ఉద్యమబాట పట్టించారు. ప్రభుత్వాల మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడంలేదన్నది వారి బాధ. శాసనసభల్లో తమకు తగిన ప్రాధాన్యత లేదన్నది వారి ఆవేదన.
రాష్ట్రంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీరక్షత్రియ, స్వకులశాలి, కుర్హీనసెట్టి (కుర్ణి)(నెస్సి), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు,కరికాల భక్తులు, సాధనాసూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ మొత్తం 18 చేనేత కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవి అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇన్ని చేనేత కులాల నుంచి శాసనసభలో కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, శాసనమండలిలో విజయవాడ నుంచి పంచుమర్తి అనురాధ ఇద్దరు మాత్రమే ఉన్నారు.
రాజకీయ ప్రాధాన్యత అలా ఉంటే, వృత్తిపరంగా చేనేతకు సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాల వంటి అనేక సమస్యలు ఉన్నాయి. చేనేతకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదన్నది వారి ఆరోపణ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులు అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండ్. నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రం తెలియకపోవడం వల్ల కూడా వారి సమస్యలు పరిష్కారం కావడంలేదన్న భావన ఉంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించగల గల నేతలు ఎదిగి, శాసనసభలకు ఎన్నిక కావలసి ఉంది. చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు మాచాని సోమప్ప, ప్రగడ కోటయ్య, పుచ్చల సత్యనారాయణ, కుండా రామయ్య, అగిశం వీరప్ప, దామర్ల రమాకాంతరావు, గోలి వీరాంజనేయులు వంటివారు మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది.
చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది ఉన్నా ఒక్క మంత్రి పదవి కూడా లేదు. చేనేత మంత్రిత్వ శాఖ ఈ వృత్తి గురించి తెలియని, మరో కులం వారు నిర్వహించడం వల్ల వారికి చేనేత సమస్యలపై అవగాహన ఉండదు. నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది.
రాజకీయపరమైన, వృత్తి పరమైన అన్ని సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఈ చేనేత గర్జన నిర్వహించనున్నారు.
‘చేనేత గర్జన’ డిమాండ్లు
1. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ల కేటాయింపుల్లో చేనేతకు న్యాయం చేయాలి.
2.జౌళి పరిశ్రమకు అనుకూల, చేనేత వ్యతిరేక విధానాలలో మార్పు రావాలి.
3.ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ రక్షణకు, కార్మికుల జీవనానికీ, మనుగడకూ తోడ్పడే నిర్ణయాలు తీసుకోవాలి.
4.చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి.
5. కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి.
6. చేనేత కార్మికులతోపాటు చేనేత ఉప వృత్తులు చేసుకునే కార్మికులందరికీ ప్రతి సంవత్సరం రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలి.
7. అర్హులైన అందరికీ పెన్షన్ మంజూరు చేయాలి.
8. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
9. చేనేత సహకార సంగా రుణాలు రద్దు చేయాలి.
10.చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ రేట్లకు సప్లై చేయాలి.
11. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి.
12. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి.
13. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో నేత కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహకారం అందించాలి.
14.ఆత్మహత్యలు, ఆకలి చావులతో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
15. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందించే పథకాన్ని వెంటనే అమలుపరచాలి.
16. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి.
17. చేనేత సహకార సంఘాల పాలక వర్గాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
18. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్లు భూమి ఇచ్చి, అందులో వర్క్‌ షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్ ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు ...