Feb 18, 2026

ప్రశ్నించే పాత్రికేయమే సత్యాన్వేషణ

బండారు రాధాకృష్ణ వ్యాసాలపై సమీక్ష


జర్నలిస్ట్ కు సామాజిక స్పృహ ఉండాలి. దానికి నూరు శాతం న్యాయం చేశారు ప్రముఖ నటుడు, విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ బండారు రాధాకృష్ణ. వృత్తి ధర్మానికి కట్టుబడిన వ్యక్తి. 86 ఏళ్ల వయసులో కూడా సామాజిక చైతన్యంతో విధంగా వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంతోపాటు విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి శుక్రవారం ‘వివేచన’ పేరుతో ఓ కాలం కూడా నిర్వహిస్తున్నారు. వయసు మీదపడుతున్నా, సడలని దృఢత్వంతో, సామాజిక బాధ్యతతో, ముఢనమ్మకాలకు వ్యతిరేకంగా, యువతని మేల్కొలిపే విధంగా ఎంతో చురుకుగా తన రచనలు కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు పుణికిపుచ్చుకున్న రాధాకృష్ణ మంచి నటుడు. 50కి పైగా నాటకాలలో నటించారు. లంబాడీ రాందాసు అనే నాటకాన్ని ఆటపాటి లక్ష్మి హీరోయిన్ గా 50 చోట్ల ప్రదర్శించారు. 26 ఏళ్లకుపైగా ఈనాడు విలేకరిగా పనిచేసిన రాధాకృష్ణ 65 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ చదివి, సింగరేణి కాలరీస్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే కమ్మూనిస్టు కార్మిక సంఘాలతో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే కమ్మూనిస్టు నేతలతో పరిచయాలు. కమ్యూనిస్టు భావజాలంతో ఎరుపెక్కిన ఆయన కలానికి ఇప్పటికీ పవర్ తగ్గలేదు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా రాసేవారో, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే స్పందన, అదే రాత. అదే ఆయన ప్రత్యేకత. 2020 నుంచి 2025 వరకు ఆయన రాసిన 50 వ్యాసాల సంపుటిని ఇటీవల విజయవాడలో ఆవిష్కరించారు. పాఠకులను ఆకట్టుకునే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో తన వ్యాసాలను బావా బావా అనుకునే రెండు పాత్రలతో మొదలు పెట్టి సమకాలీన సమాజంలో జరిగే, జరుగుతున్న అనేక అంశాల లోతులకు వెళతారు. మనిషికి తలెత్తే అనేక ప్రశ్నలు ‘సత్యాన్వేషణ’లో ఉన్నాయి. 172 పేజీల ఈ వ్యాస సంపుటిలో పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉన్నాయి.
గుడి-బడి అనే వ్యాసంలో ఈ సమాజంలోని మనుషులకు గుడులమీద ఉన్న శ్రద్ధ బడులపై లేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి, యువత ఆలోచనను వ్యవసాయంవైపు మళ్లించాలన్నది ఆయన ఆకాంక్ష. శివం శవం అనే వ్యాసంలో తాము సృష్టించిన దేవుడే అంతా చేస్తారన్న భావనను మనుషులందరిలోకి మత పెద్దలు చొప్పించారని, దాంతో, తాము నిమిత్తమాత్రులం, నిస్సహాయులం అన్న దోరణిలో మనుషులున్నారన్న బాధ వ్యక్తం చేశారు. తనకు తెలియనివాడు మరణించినా, ఆ మృతదేహం వద్దకు వెళ్లి చూస్తే చాలు, ఇంటికి వెళ్లి స్నానం చేసే స్థితిలో మనిషి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తారు. తత్వం లక్ష్యం సత్యాన్వేషణ అని, మతం లక్ష్యం అసత్యంపై విశ్వాసం కలిగి ఉండటం అని తెలిపారు. మనిషిని మతానికి బానిసగా మారుస్తున్న వ్యవస్థపై రచయితలు అక్షరాన్ని సంధించాలని పిలుపు ఇచ్చారు రాధాకృష్ణ.
ఒకప్పుడు ఆంగ్లేయులను తరిమికొట్టిన అక్షరం, నేడు రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోతుంది, కాదు ఉరితీయబడుతోందని ఆవేశంగా చెప్పారు. మరో వ్యాసంలో అక్షరం ఆయుధం కన్నా గొప్పదని, కోట్ల మందిని చైతన్యపరుస్తుందని, ప్రభుత్వాలను సైతం పడగొడుతుందన్నారు. కళలన్నిటిలోకి దృశ్య కావ్యం మనిషి మనసుని తాకి, మార్పుకు నాంది పలుకుతుందని ఇంకో వ్యాసంలో చెప్పారు. ఇందులో నాటక రంగ చరిత్రని సంక్షిప్తీకరించారు. ప్రశ్నించకపోతే నిజం బయటపడదు. కానీ, నేడు ప్రశ్నించిన మనిషి జైలులో ఉంటున్నాడని చెప్పారు. సామాజిక స్పృహతో సమాజం కోసం నినదించిన, 90శాతం వైకల్యం ఉన్న
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలులోనే మగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరహక్కులు హరించుకుపోతుంటే, నిద్రపోతున్న మానవాళిని మేల్కొలపవలసిన అగత్యం ఏర్పడిందన్న బాధ్య వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన మనుస్మృతిని అంబేద్కర్ బహిరంగంగా దహనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత ఆలోచించకుండా, గుడ్డిగా నాయకులను అనుసరించడమే దేశ అభివృద్ధి మందగమనానికి కారణం అని తేల్చిచెప్పారు. 80 శాతం మంది పార్లమెంట్ సభ్యులు కుబేరులుగా ఉన్న మన దేశం ప్రజాస్వామ్యం దేశం కాదని, ధనిక స్వామ్యదేశం అని పేర్కొన్నారు.
కమ్యూనిస్టు ఉద్ధండులైన పుచ్చలపల్లి సుందరయ్య, ఏకె గోపాలన్, నంబూద్రిపాద్, జ్యోతిబసు, ప్రమోద్ దాస్ గుప్త, రణదివే, పి.రామమూర్తిలతోపాటు రావిపూడి వెంకటాద్రి, కొంగర జగ్గయ్య, రామోజీరావు, ఎన్టీ రామారావు... వంటి వారి పరిచయం, విరసంతో అనుబంధం కలిగి ఉండటంతో ఆయన అనుభవాల సారాంశం ఈ వ్యాసాలలో కనిపిస్తాయి. అది ఇదనేమీలేదు, జీవితానికి, సమాజానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆయన వ్యాసాలు రాశారు. ప్రాథమికంగా మనిషి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్న తపన రాధాకృష్ణ వ్యాసాలలో కనిపిస్తుంది.
సత్యాన్వేషణ పుస్తకం వెల : రూ.160
పుస్తకాల కోసం సెల్: 9390686100
పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్ ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు ...