Oct 31, 2025

తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిన ఈపీఎఫ్ఓ సీబీటీ నిర్ణయాలు

బడా వ్యాపారులకు రూ.లక్షల కోట్ల మాఫీ - పీఎఫ్ పెన్షనర్లపై లేని కనికరం 

ఇటీవల బెంగళూరులో  ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ కనీస సెన్షన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోకపోవడం పెన్షన్ దారులను నిరుత్సాహపరిచింది. కనీస పెన్షన్ పెంచుతారని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న  రూ.1000లు మాత్రమే పెన్షన్ తీసుకునేవారు బోర్డు చర్యని తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వృద్ధులకు  రూ.4000 సామాజిక పెన్షన్ అందజేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈపీఎఫ్ కనీస పెన్షన్ రూ.1000 మాత్రమే ఇవ్వడం చాలా అన్యాయం అని వారు వాపోతున్నారు. 10,15 ఏళ్లు ప్రైవేటు సంస్థల్లో చిరుద్యోగులుగా, కార్మికులుగా పనిచేసిన పీఎఫ్ పెన్షన్ దారులను కేంద్ర ప్రభుత్వం ఎంత చిన్నచూపుచూస్తోందో అర్థమవుతోందని మండిపడుతున్నారు.   కనీసం పది సంవత్సరాలు సర్వీసు ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎఫ్- 95) పరిధిలో 2014 నుంచి కనీస పెన్షన్  నెలకు రూ.1000 అందజేస్తున్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా  కనీస పెన్షన్ రూ.9వేలకు పెంచాలని పలు ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అంతకాకపోయినా, కొద్ది మొత్తంలోనై పెంచుతారని పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూశారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతున్నాయి.  మరో పక్క వృద్ధాప్యంలో కావలసిన ముందులకు కూడా ఆ మొత్తం  సరిపోదు.  ఈ కనీస పెన్షన్ వృద్ధాప్యంలో సరిపోదన్న విషయం సీబీటీకి తెలియనిదేమీకాదు. ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ని ఏర్పాటు చేశారు. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగులు దాచుకున్న  సొమ్ము చేతికి వస్తే, వృద్ధాప్యంలో కొంత ఆర్థిక చేయూతగా ఉంటుంది.  ముఖ్యంగా ఈపీఎఫ్ పెన్షన్ చిరుద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 11 ఏళ్ల తర్వాత జరిగిన  సీబీటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈపీఎఫ్ఓ లక్ష్యాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి.  సీబీటీ సమావేశ  నిర్ణయాలు పెన్షన్‌కు తిలోదకాలిచ్చే విధంగా ఉన్నాయని ప్రైవేటు ఉద్యోగులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ రూ.1,000 నుండి రూ.7,500 కు పెంచాలని  సీబీటీ సమావేశంలో ప్రతిపాదించారు, అయితే, ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఈ సమావేశం పీఎఫ్‌ ఉపసంహరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్ ఉద్యోగి షేర్‌తోపాటు యాజమాన్యం షేర్   నుంచి వంద శాతం విత్‌ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఈపీఎఫ్‌ సంస్థలో చందదారుల నగదు నిల్వలు లక్షల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. ఆ మొత్తంపై వడ్డీ చెల్లించే భారం నుంచి తప్పించుకునేందుకు  చందాదారులకు తిరిగి చెల్లించడానికి సీబీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఈపీఎఫ్ లక్ష్యాలకు విరుద్ధం. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని కొన్ని చిన్న చిన్న సౌకర్యాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు   మీడియా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం కల్పించడం కూడా అన్యాయంగా భావిస్తున్నారు. ఉద్యోగి, యాజమాన్యం సొమ్ము మొత్తాన్ని తీసుకునే సౌకర్యం కల్పిస్తే, చివరి దశలో చిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? రూ.1000, రూ.2000 పెన్షన్‌తో  కుటుంబం గడుస్తుందా? సీబీటీ ఇవన్నీ ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకుందా?  దేశాభివ‌ృద్ధికి వివిధ రంగాలలో పనిచేసిన వారు జీవిత చరమాంకంలో ఈ పెన్షన్‌తో బతకడం సాధ్యమేనా? దేశంలో కోట్ల మంది వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రతా పెన్షన్ కింద ఇంతకు మించి ఇస్తున్నాయి. దేశంలో ఈపీఎఫ్ఓ చందాదారులు 7.8 కోట్ల మంది ఉన్నారు.   ఈపీఎఫ్ పెన్షన్ పథకంలో 5.39 కోట్ల మంది ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో  పెన్షన్ పొందేవారు 81,48,490 మంది ఉన్నారు. వారిలో రూ.6వేలకు పైగా పెన్షన్ పొందేవారు  ఒక్క శాతం కూడా లేరు.  0.65 శాతం మంది మాత్రమే ఉన్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో చెప్పారు. కేవలం రూ.1500 పెన్షన్ పొందేవారు సగం మందికంటే ఎక్కువే అంటే, 49,15,416 మంది ఉన్నారని మంత్రి తెలిపారు.   దాదాపు 37 లక్షల మందికి నెలకు రూ.1000 మాత్రమే అందజేస్తున్నారు. పెన్షన్ దారుల కుటుంబాలు, ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్ల డిమాండ్ల గురించి  సీబీటీ పట్టించుకోలేదు. ఉద్యోగి పదవీ విరమణ చేసేనాటికి పొందే జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వడం న్యాయం. ధర్మం. ఉద్యోగులు తాము పొదుపుచేసిన మొత్తాన్ని ఎంతో అత్యవసరమైతే తప్ప ఉపసంహరించుకోవడం మంచిదికాదు. అలా ఉపసంహరించుకుంటే, పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భరోసా ఉండదు. ఈపీఎఫ్‌ఓ నుంచి ముందస్తు ఉపసంహరణకు తుది సెటిల్​మెంట్‌ కోసం వేచి ఉండే కాలాన్ని గతంలో ఉన్న 2 నెలల నుంచి 12 నెలలకు పెంచడం,  పింఛను నిధి (ఈపీఎస్‌) విత్ డ్రాకు వేచి ఉండే కాలాన్ని 2 నెలల నుంచి 36 నెలలకు పెంచడం సరైన నిర్ణయం కాదు. చిరుద్యోగులు తమ అత్యవసరాలు తీర్చుకోవడానికి నెలలు నెలలు వేచిచూడాలన్న నిబంధన సరైనది కాదు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు  తాము పొదుపు చేసుకున్న డబ్బుని అవసరమైన కాలంలో పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది.  అవసరాలు తీర్చుకోవడం కోసం వారు అప్పులపాలు కావలసి వస్తుంది. ఆ రకంగా వారికి అన్యాయం చేసినట్లే లెక్క.  ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు ఉద్యోగులకు శిక్ష విధిస్తున్నట్లున్నాయి. దాదాపు 30 కోట్ల మంది జీవితాలతో ఆడుకోవడంగా భావిస్తున్నారు. ప్రవేటు రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రతలేదు. వారి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఈ కొత్త నిబంధనలు వారిని ఇంకా చిక్కుల్లో పడేసేవిధంగా ఉన్నాయని చందాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారుల కోసం రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తోంది. పదవీ విరమణ చేసిన చిరు ఉద్యోగులు, కార్మికులకు  ఇచ్చే పెన్షన్‌ని ప్రతిపాదించిన విధంగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వ అనుమతిలేకుండా సీబీటీ ఈ నిర్ణయం తీసుకోలేదు. కార్మిక వర్గానికి అన్యాయం జరగకుండా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస పెన్షన్‌ని రూ.9వేలకు పెంచవలసిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించి, నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. 

శిరందాసు నాగార్జున, సీనియర్ సబ్ ఎడిటర్ - 9440222914 





Oct 22, 2025

గజిబిజి గందరగోళం లేని గోలి మధు కవిత్వం

‘ఎదురీత’ పుస్తకంపై సమీక్ష


తెలుగు సాహితీ ప్రపంచంలోకి  పదునైన కలంతో, ఆధునిక భావాలతో, అభ్యుదయ కవిత్వంతో దూకుడుగా దూసుకు వచ్చారు గోలి మధు. ఏ సమస్య చెప్పినా క్షణంలో ఆ సమస్యపై సాధారణ పదాలతో, అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతమైన కవిత రాయగల దిట్ట మధు. స్పష్టమైన దృక్పథంతో ఆయన కవితలు రాస్తారు.  ప్రగతిశీల కవిత్వం రాస్తూ  తెలుగు సాహిత్యంలో మధు అభ్యుదయ కవిగా మంచి పేరు సాధించారు. మధు ఓ చైతన్యం, ఓ మెరుపు, ఓ ఎరుపు. ఇంతకు ముందు మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ అనే  అయిదు కవితా సంపుటిలను అందించారు.  మధు  ఆరవ కవితా సంపుటి ‘ఎదురీత’ను ఈ నెల(అక్టోబరు) 12న  మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు  నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు.  మధు కవిత్వం నచ్చి, ముచ్చటపడి  ఈ సంపుటి ముద్రణా దాతగా  నన్నపనేని నాగేశ్వరరావు ముందుకు వచ్చారు. మధు చేసేది ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రభుత్వాలపై తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు.   ప్రభుత్వాలేకాదు, సమాజంలోని రుగ్మతలన్నిటిపై   సూటిగా, ఎంతో అందంగా కవితలు రాస్తారు. మనిషిగా ఎంత ఒదిగి ఉన్నా, కవిగా  మాత్రం దేనికీ నెరవరు, తగ్గరు.  తలెత్తుకుని మరీ కవిత్వం రాస్తారు. తన కవిత్వం మొత్తం ప్రతిబింబించే విధంగా ఈ సంకలనానికి ‘ఎదురీత’ అని అర్థవంతమైన శీర్షిక పెట్టారు. ఆయన ధోరణి ఈ కవితా సంకలనంలో స్పష్టంగా అర్థమవుతుంది. సమాజం పట్ల, తను రాయవలసిన కవిత్వం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కవి . ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి బాసటగా ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి తీసుకువచ్చారు.  మధు కవిత్వం ఎంత మక్కువతో రాస్తారో, ఉద్యోగం కూడా అంతే నిజాయితీ,  నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. ఈ కవితా సంపుటిలోని 55 కవితలలో  వివిధ విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. ఇందులోని ప్రతి కవితలో  భాష, భావం, శబ్దం, ప్రేమ, ఆత్మీయత, సామాజిక స్పృహ, ఆవేశం,  ఉద్రేకంతో కూడిన  ఓ కొత్తదనాన్ని పాఠకులకు అందించాలనే  తపన ఆయనలో కనిపించింది. ఈ కవితలను చదవడం మొదలుపెడితే, చివరి వరకు పుస్తకం మూయలేరు. పాఠకులను అంతగా కట్టిపడేశాలా ఈ కవితలు ఉన్నాయి. సమాజం పట్ల, కవిత్వం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలిచిన కవి గోలి మధు. సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారం తెలుస్తోంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం అర్థమవుతోంది.  


గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే - బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి... గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఈ కవిత  చదువుతుంటే  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి, నిర్మాత  మంచు లక్ష్మి గుర్తుకు వస్తారు.  ‘‘కట్టాల్సింది దేవాలయాలు, చర్చిలు, మసీదులు కాదు... విద్యాలయాలు, వైద్య శాలలు’’ అని  రామ్ గోపాల్ వర్మ అన్నారు.  మంచు లక్ష్మి  తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో పది, పది ప్రభుత్వ పాఠశాలలను  దత్తత తీసుకున్నారు.  అత్యధిక మంది దాతలు అలా ముందుకు వచ్చి బడులను బాగుచేయాలన్నదే మధు కోరిక. తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు  మధు రాసిన 8 పేజీల కవిత పాఠకుల కంట తడిపెట్టిస్తోంది.  పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, అల్లరి, అరుపులు,  చూపులు,  ప్రేమ, వాటి ప్రవర్తనా తీరు..., వాటిపై  ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ... చాలా అద్బుతంగా రాశారు. దానిని అందరూ చదివి తీరవలసిందే. ముఖ్యంగా జంతు ప్రేమికులకు, కుక్కలను పెంచుకునేవారి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. మనిషి మనిషికీ మతం మత్తు-సందు సందుకీ కులం కిక్కు, తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి-తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం, పీడితుల నడుమ ఐక్యత సాధించనంతవరకూ పీడకునిదే గెలుపు, ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి   లేనేలేదు - పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు,  పోరుబాట చతికిల పడితే- సగటు మనిషి ‘చితి’కే,  మణిపూర్‌లో తెగుతున్న తలకు- తెగల నడుమ వైరపు అబద్దం ఆభరణం, ఆర్థిక దాహానికి అధికారం తోడై పైశాచిక విహారం, మారే జెండాలు మార్చే ఎజెండాలు - వాళ్లిద్దరే ప్రతిసారీ, ప్రశ్న ప్రశ్న ప్రశ్న - వికాసానికి తొలి మెట్టు - అవగాహనకు పదును పెట్టు, దారిద్ర్య రేఖలు చెరపాలని కవిత్వ నావతో నా ఎదురీత, ప్రశ్న సంకెళ్లు తెంచే గండ్రగొడ్డలి, జాతీయ జెండా నేసినా - ‘మానవ’ మానం కాపాడినా - మగ్గానికి మరణ శాసనమాయె, ఓట్లు మనవే - పాట్లూ మనవే, సమతా మమతల సంస్థాపనే బౌద్ధం,  మొన్న ఓటు -నిన్న 8 గంటల పని దినాలు-రేపో ఎల్లుండో ఆదివారానికి దినం, గొంతు మెదపక ప్రశ్నించక, ప్రతిధ్వనించక కలహించక కూర్చుంటే - నువ్వు మాయం నేను మాయం!!... అని సాగుతుంది మధు కవిత్వం. ఈ కవితా సంపుటి కవర్ పేజీని తెనాలికి చెందిన దివి హేమంత్ కుమార్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. 

150 పేజీల ఈ పుస్తకం వెల : రూ.150

రచయిత గోలి మధు సెల్: 9989186883

ప్రతులకు : 9848199098

సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


Oct 20, 2025

గోలి మధు అంటే ఓ మెరుపు, ఓ ఎరుపు

‘ఎదురీత’ పుస్తకం సమీక్ష

చక్కటి  భాష, బిగువైన పద బంధం, విషయంలో స్పష్టత, ప్రేమ, ఆవేశం, ఆవేదన.... అన్నిటినీ ఎరుపెక్కిన కలంతో  సూటిగా, దూకుడుగా కవిత్వీకరించడంలో  గోలి మధు దిట్ట. మూడు దశాబ్దాలుగా అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ఆధునిక భావాలు, సామాజిక స్పృహతో అభ్యుదయ కవిత్వం రాస్తున్నారు. మనిషీ దూకుడే, అతని కవిత్వమూ దూకుడే. అన్ని వర్గాల ప్రజలు తనవాళ్లే అనుకుని, అందరి సమస్యలపై స్పందిస్తారు. ప్రజలలో, ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావాలన్నది ఆయన తపన.   అందుకు కవిత్వం ద్వారా ఎదురీదడమే మార్గంగా ఎన్నుకున్నారు. ఆ కోవలో రాసిన ఆయన తాజా కవితా సంకలనం ‘ఎదురీత’.   ఈ పుస్తకాన్ని మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల(అక్టోబరు) 12న  గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆవిష్కరించారు.  మధు కవిత్వం నచ్చి, ముచ్చటపడి  ఈ సంకలనం ముద్రణకు అయిన ఖర్చు మొత్తాన్ని ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు  నన్నపనేని నాగేశ్వరరావు అందించారు.  మధుకి  జీవితం పట్ల, కవిత్వం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం ఉంది. అందువల్ల అతని కవిత్వంలో గజిబిజి గందరగోళం ఉండదు. పాఠకుడి మనసుకు సూటిగా తగిలి, ఆలోచనలు రేకెత్తిస్తుంది. గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే - బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి... గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఆధునిక పోకడలు, సమాజంలో రుగ్మతలు, అవినీతి, మతోన్మాదం, కుల తత్వం, ఓట్ల రాజకీయం, బాధితుడి మౌనం, ప్రశ్నించకపోవడం.. వంటి అన్ని విషయాలను ఎత్తిచూపి మరీ సమాజాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తుంటారు. అదే మధు ప్రత్యేకత. ఎవరు ఏ విషయం చెప్పినా, ఆ క్షణంలోనే ఆ అంశంపై కవిత్వం రాయగల సమర్థుడు మధు.  తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి - తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం.. అని సమాజాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  మనిషి మనిషికీ మతం మత్తు - సందు సందుకీ కులం కిక్కు...ఎనిమిది పదాలలో  సమాజం తీరుని మన ముందుంచారు. గొంతు మెదపక/ ప్రశ్నించక, ప్రతిధ్వనించక/ కలహించక కూర్చుంటే - నువ్వు మాయం నేను మాయం!! అని మరో హెచ్చరిక చేశారు. ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి   లేనేలేదు - పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు...ఇందులో పలు అర్థాలు స్పురిస్తాయి.  పోరుబాట చతికిల పడితే- సగటు మనిషి ‘చితి’కే...అని తట్టి లేపుతున్నారు.  జాతీయ జెండా నేసినా - ‘మానవ’ మానం కాపాడినా - మగ్గానికి మరణ శాసనమాయె ... అని చేనేత స్థితిని వివరించారు. ఓట్లు మనవే - పాట్లూ మనవే...అని ఓటరు తీరుని వివరించారు. ‘‘దారిద్ర్య రేఖలు చెరపాలని కవిత్వ నావతో నా ఎదురీత’’ అని కూడా ఓ కవితలో స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రశ్న సంకెళ్లు తెంచే గండ్రగొడ్డలి’’ అని స్పష్టం చేశారు. అక్షరం ధిక్కారం మరచి అధికారానికి సాష్టాంగమైందన్న బాధ వ్యక్తం చేశారు. మధు ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలుస్తారు. మధు  ప్రభుత్వ ఉద్యోగి. అయినా, ప్రభుత్వాలపైనే తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు. ప్రభుత్వాలేకాదు, సమాజంలోని రుగ్మతలన్నిటిపై   సూటిగా, ఘాటుగా కవితలు రాస్తూ, సమాజాన్ని మేల్కొలపడం ఆయన నైజం.  మనిషిగా ఎంత ఒదిగి ఉన్నా, కవిగా  మాత్రం దేనికీ తగ్గేదేలే అన్న రీతిలో తలెత్తుకుని మరీ కవిత్వం రాస్తారు. ఎంత ఆవేశంతో, ఆవేదనతో తిరుగుబాటు కవిత్వం రాసినా,  ఉద్యోగం మాత్రం నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. రాత్రి వేళల్లోనే ఆయన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తారు. కంట తడిపెట్టించే కవిత్వం కూడా ఆయన రాస్తారు.  తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు  మధు రాసిన 8 పేజీల కవిత పాఠకులు చదివి తీరవలసిందే. ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి మిగులుస్తుంది ఈ కవిత.  పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, చూపులు, అల్లరి, అరుపులు, ప్రేమ, వారిపైకి ఎగబడటం .., వాటిపై  ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ...  ఇలా అన్ని విషయాలను కవిత్వీకరించారు. కుక్కలను పెంచుకునేవారిని కదిలిస్తుంది. కంటతడిపెట్టిస్తుంది ‘మిలో....రేయ్...మిలో’ కవిత. ఈ సంకలంలోని 55 కవితలలో అనేక పార్శ్వాలు  స్పృశించారు.  చదవడం మొదలు పెడితే, 150 పేజీల పుస్తకం పూర్తి అయ్యేంత వరకు మూయలేం. అంత ఆసక్తిగా మనల్ని చదివిస్తారు మధు. ఆయన కవిత్వంలో అంతటి బిగువుంది.  మధు కవిత్వం ఆలోచనలు రేకెత్తిస్తుంది. ప్రశ్నించడం నేర్పుతుంది.  సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని  మధు వినమ్రంగా వివరించారు. తల్లంటే మధుకి అమితమైన ప్రేమ, అభిమానం. అలాగే,  మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇచ్చి, తనకు మహిళల పట్ల ఉండే గౌరవాన్ని వ్యక్తం చేశారు మధు. ఈ సంకలనం మొదటి పేజీలో భారత రాజ్యాంగ ప్రవేశికను ముద్రించి, పౌరుడుగా బాధ్యతగా వ్యవహరించారు.  గోలి మధు ఇంతకు ముందు భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021), సంఘర్షణ (2023) అనే అయిదు కవితా సంకలనాలు అందించారు.   ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి బాసటగా  2020లో తెచ్చిన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణకు నోచుకోవడం విశేషం. మధు కవిత్వం ప్రజలలోకి దూసుకువెళుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ కవితా సంపుటి కవర్ పేజీని తెనాలికి చెందిన దివి హేమంత్ కుమార్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. 

150 పేజీల ‘ఎదురీత’ వెల : రూ.150

కవి గోలి మధు సెల్: 9989186883

ప్రతులకు : 9848199098

                                      సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Oct 18, 2025

రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని సీఎంకు వినతి

ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు ఈ రోజు(శనివారం) మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టమని కోరారు.  జర్నలిస్టుగా 20 ఏళ్ల అనుభవం ఉండి, 58 సంవత్సరాలు పూర్తి చేసినవారు రాష్ట్రంలో 500 మందికి మించి ఉండరని తెలిపారు. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని చెప్పారు.  దేశంలో 19 రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రిటైర్ అయిన జర్నలిస్టుల పరిస్థితిని, ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న పెన్షన్ వివరాలు, వాటికి సంబంధించిన జీవోలతో కూడిన ఒక వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పరిశీలిస్తామని చెప్పారు.  ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్  గౌరవాధ్యక్షులు  శిరందాసు నాగార్జున రావు, జనరల్ సెక్రటరీ జి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి.రామారావు, ట్రెజరర్ ఎంపీ రామారావు ఉన్నారు. 

-------------------------------


సీఎంకు ఇచ్చిన లేఖ

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖమునకు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 

అమరావతి.

అయ్యా...

విషయం: వెటరన్  జర్నలిస్టుల ఫించన్ మంజూరు, ఆరోగ్యపరంగా,ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెటరన్ జర్నలిస్టులకు ఉచిత వైద్యసదుపాయం తదితర సదుపాయాలు కల్పించుట


ప్రస్తుత వెటరన్ జర్నలిస్టులు ఒకప్పుడు వర్కింగ్ జర్నలిస్టులే.అప్పుడే వారి జీవితం అరకొరగా నడిచేది.ఇక రిటైర్ అయిన తరువాత మరింత అధోగతి పాలవుతున్నది. 365 రోజులు,24 గంటలు పనిచేసిన ఈ జర్నలిస్టులు వృద్ధాప్యంలో ఆరోగ్యపరంగా ,ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో వైద్యఖర్చులకు లేక అనేక మంది మృతి చెందారు. అందుకు ఆదోనికి చెందిన అండా రామారావు సాక్ష్యం. అలాగే కడుపుకు తింటానికి సరైన ఆహారం లేక మృతి చెందిన మా యూనియన్ అధ్యక్షుడు మణికుమార్ ఉదాహరణ. ఇలా వెలుగులోకి రాని వారు ఎందరో. కనీసం రెండు పూటలా తింటానికీ లేక అల్లాడుతున్నారు.అనారోగ్య పరిస్థితుల్లో సరైన వైద్యం అందడంలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జర్నలిస్టుల ఫించన్ పథకం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 దక్షిణాది రాష్ట్రాల లోనే వెటరన్/ సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ఫించను ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 300 మంది లోపు ఉండే వీరికి ఫించన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాం.

 పెన్షన్ తో పాటు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి.జర్నలిస్ట్ ఆరోగ్య బీమా 10 లక్షలరూపాయలు   ఉండేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

పెన్షన్ విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం అనుసరిస్తున్నాయి. 

కనీసం 20 ఏళ్ల సర్వీసు లేక 58 ఏళ్లు నిండిన 

జర్నలిస్ట్ మరణిస్తే  భాగస్వామికి సగం పెన్షన్

డెత్ బెనిఫిట్స్  రూ.2 లక్షలు వచ్చేలా ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

మన దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు ఫించన్ ఇస్తున్నాయి.

కర్నాటక ...రూ.15,000

హర్యాణా       -  రూ.15,000

తమిళనాడు  -        రూ.8,000

పశ్చిమ బెంగాల్ -   రూ.2,500

యూపీ   - రూ.8,000

మహారాష్ట్ర - రూ.10,000

మణిపూర్ - రూ.10,000

పాండిచేరి  - రూ.6,000

బిహార్   - రూ.6,000

పంజాబ్  - రూ.12,000

అస్సాం - రూ.8,000

గోవా  - రూ.8,500

కేరళ - రూ.11,000 నెలనెలా  ఫించన్ ఇస్తున్నాయి. పక్క రాష్ట్రాలు ఆచరిస్తున్న ఈ పథకాన్ని ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల దయనీయ పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్రం కూడా గౌరవ ఫించన్ ప్రారంభించాలని కోరుతున్నాం.

2) పూర్తి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి.హెల్త్ కార్డ్ మంజూరు చేయాలి.తెల్లకార్డ్ లబ్దిదారుల తరహాలో వెటరన్ జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతున్నాం.

3)ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.1/3 తో అన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా స్టేట్ పాస్ మంజూరు చేయాలి.ఆనారోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. దీన్ని దయతో పరిశీలించగలరు. 

4) దూరప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేవృత్తి నిమిత్తం,ఆనారోగ్యందృష్ట్యా వచ్చే జర్నలిస్టులకు ఒకటి,రెండురోజులు ఉండేలా ఉచిత వసతి గృహం ఏర్పాటు చేయాలి.

5) ఇల్లు లేని వెటరన్స్ కు 50 శాతం సబ్సిడీ తో స్థలం లేదా ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

6) రైల్వే పాసులను పునరుద్ధరించాలి.వృద్ధాప్యం దృష్ట్యా రైలు ప్రయాణం  వెటరన్స్ కు సౌకర్యంగా ఉంటుంది. కనుక  ఈ విషయాన్ని కూడా పరిశీలించగలరు. మా యూనియన్ సభ్యుల జాబితా జతచేర్చుతున్నాం.భవదీయ గౌరవనీయులు గమనించగలరు. 

మీ సహాయాన్ని అర్ధిస్తున్న  వెటరన్ జర్నలిస్టులు 

భవదీయులు


ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్  గౌరవాధ్యక్షులు  శిరందాసు నాగార్జున రావు, జనరల్ సెక్రటరీ జి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి.రామారావు, ట్రెజరర్ ఎంపీ రామారావు .


Oct 16, 2025

తిరుమల వివాహ కానుక


మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే, ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ  తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పోస్ట్ లో పంపాలి.  ఆ తర్వాత మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షింతలు (ఇవి పెళ్ళినాడు తలంబ్రాలలో కలపాలి), వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి, శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము. మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసుకి పంపండి. శుభలేఖ మీద ఉన్న మీ చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.


Sri Lord Venkateswara Swamy,
The Executive Officer,
T.T.D. Administrative Building,
KapilaTheertham Road,
Tirupati, Andhra Pradesh.

Oct 13, 2025

సాహిత్యంతోనే తెల్లారుతుంది... పొద్దుపోతుంది

మరో వ్యాపకం తెలియని రజా హుస్సేన్!

2650కి పైగా విమర్శలు, విశ్లేషణలు రాసిన దిట్ట
ఆయనకు సాహిత్యంతోనే తెల్లవారుతుంది. సాహిత్యంతోనే పొద్దుపోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఆయనకు అదేపని. సాహిత్య, సాహిత్యం, సాహిత్యం...అన్ని ప్రక్రియలలో సాహిత్యాన్ని చీల్చిచెడాడతారు. ఆయనే జర్నలిస్ట్, ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు, విశ్లేషకుడు అబ్దుల్ రజా హుస్సేన్. ఆయను సంబంధించినంతివరకు ఇది ఓ నిరంతర ప్రక్రియ. పదవీ విరమణ చేసినవారు ఎక్కువ మంది కృష్ణా!రామా!! అంటూ గడిపేస్తున్నట్లు, ఆయన కవిత్వం, విమర్శ, విశ్లేషణ... అంటూ కుమ్మేస్తుంటారు. గడిపేస్తుంటారు. ఆయనకు మరో వ్యాపకం లేదు. తెలియదు. 1972 నుంచి రజాహుస్సేన్ సాహితీ రచనలు, పుస్తక సమీక్షలు కొనసాగిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసిన ఆయన తెలుగులో మంచి పట్టు సాధించారు. సాహిత్యంపై ఆయనకు మక్కువ ఎక్కువ. రచనా వ్యాసంగంలో ఆయన స్వర్ణోత్సవం పూర్తి చేశారు. రిటైర్ అయిన తర్వాత విశృంఖలంగా రాయడం మొదలెట్టారు. ఏమాత్రం సమయం దొరికినా సాహితీవేత్తలను కలుస్తుంటారు. ఇష్టంగా వారితో సాహిత్య చర్చలు కొనసాగిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మరీ ఆయన దూసుకువెళుతున్నారు. సాహిత్యం కోసం సెల్ ఫోన్‌ని, ఫేస్‌బుక్‌ని ఆయన ఉపయోగించుకుంటున్నంతగా ఎవరూ ఉపయోగించుని ఉడరని చెప్పడం అతిశయోక్తికాదు. పదేళ్లుగా సాహిత్యంతో ఫేస్‌బుక్‌ని కమ్మేశారు. నింపేస్తున్నారు. సాహిత్యం ఆయనను ఆవహించిందో, ఆయన సాహిత్యాన్యి ఆవహించారో చెప్పడం కష్టం. ఫేస్‌బుక్ వేదికగా కాఫీవిత్... పేరుతో రజా హుస్సేన్ 2650కి పైగా ఎపిసోడ్లు పూర్తిచేశారు. ఎంతో మంది జీవితాలను, పుస్తకాలను, కొత్త కొత్త ఆలోచనలను పరిచయం చేశారు. ఇవే కాకుండా ఇతర ఆర్టికల్స్ కూడా వందల సంఖ్యలో రాశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన జీవించినంత కాలం కొనసాగిస్తూనే ఉంటారనిపిస్తోంది. సాహిత్యం అంటే ఆయనకు అంత వల్లమాలిన ప్రేమ. పురాతన తెలుగు సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్య వరకు అన్ని ప్రక్రియలను విశ్లేషిస్తారు. ఆదికవి నన్నయ్య వంటి మహామహుల దగ్గర నుంచి కొత్త తరానికి చెందిన ఆధునిక యువ కవుల వరకు ఎవరినీ వదలరు. ప్రోత్సాహంలేక మరుగునపడిన అనేక మందిని వెలుగులోకి తీసుకువచ్చి, ప్రోత్సహిస్తుంటారు. అత్యంత నిరుపేద కవులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు, కథకులను అనేక మందిని సాహితీ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన జర్నలిస్టు కూడా అయినందున, అందరికీ అర్థమయయే రీతిలో చిన్నచిన్న పదాలతో వాడుక భాషలో రచనలు చేయగల దిట్ట. ఇంతగా సాహిత్యాన్ని ప్రేమిస్తూ, అదే ప్రపంచంగా, అందులోనే మునిగితేలుతూ, దానితోనే సహజీవనం చేస్తున్న రజా హుస్సేన్‌ని ఆయన భార్య ఫాతిమా ఎలా భరిస్తున్నారో అని ఒక్కోసారి అనిపిస్తోంది. సాహిత్యమే జీవితంగా గడిపేస్తున్న ఆయనకు అన్ని విధాల సహకరించే ఫాతిమా లాంటి భార్య దొరకడం అదృష్టం. పద్యం, కవిత్యం, జానపదం, కథ... సాహితీ విశ్లేషణ, ప్రోత్సాహం, విమర్శలతో వేల మంది సాహితీకారుల సాహిత్య లోతులలోకి చొచ్చుకుకుపోవడమే కాకుండా, వారి జీవితాలను కూడా స్పృశించారు. వారందరి ఆలోచనలు, భావాలు, కవిత్వం, వారి సాహితీ పరిమళం, జీవన శైలిని ఆయన శైలిలో మనకు అందించారు. అదే ఆయన ప్రత్యేకత. తన సాహితీ ప్రస్థానం విమర్శ, విశ్లేషణ, కవిత్వం ముప్పేటల ముడి అని ఆయనే పేర్కొన్నారు. సాహిత్యలో మునిగితేలుతూ, ఇంతటి అధ్యయనం చేస్తున్న రజా హుస్సేన్‌ను ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఏదో ఒక విశ్వవిద్యాలయం గుర్తించి, ఆయనను డాక్టరేట్‌తో గౌరవిస్తుందని ఆశిస్తున్నాను. అంతే కాకుండా, విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల వారు, తెలుగు సాహిత్య అకాడమీ.. వంటి వారు భాషా పటిమ గల రజా హుస్సేన్ రాసిన కవిత్వం, సాహితీ విమర్శలు, విశ్లేషణలు, ఇతర సాహితీ ప్రక్రియలతో కూడిన ఎపిసోడ్‌లు అన్నిటిని పుస్తకరూపంలో తీసుకువచ్చి, నిక్షిప్తం చేసి, ముందు తరాల వారికి అందించవలసిన బాధ్యత ఉందన్నది నా అభిప్రాయం.
ఏమీ ఆశించకుండా, తన పెన్షన్‌ డబ్బుని కూడా ఖర్చు చేస్తూ సాహితీ సేవకు అంకితమైపోయిన రజా హుస్సేన్‌ గుంటూరు జిల్లా మంగళగిరిలో అబ్దుల్ రసూల్, ఫరీద్ బీ దంపతులకు 1957, ఏప్రిల్ 11న జన్మించారు. మంగళగిరి పంచాయతీ పాఠశాల, చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ పూర్తి చేశారు. అక్కడే కొంత కాలం ఎంఫిల్ విద్యార్థిగా పరిశోధన పరిశోధన చేశారు. అయితే, ఎంఫిల్ పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత ఈనాడు దినపత్రికకు మంగళగిరిలో విలేకరిగా పని చేశారు. 1981లో ఒక ఏడాది పాటు మంగళగిరిలోని వెనిగళ్ల తాతయ్య, జంజనం మంగళాద్రి(వీటీజేఎం) డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేశారు. ఆ తర్వాత కూడా ఈనాడులో వివిధ ప్రాంతాలలో ఎనిమిదేళ్లు జర్నలిస్టుగా పని చేశారు. 1988లో రాష్ట్ర కర్షక పరిషత్‌ చైర్మన్ నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాసంబంధాల అధికారి(పీఆర్‌ఓ)గా పని చేశారు. ఆ తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డికి స్పెషల్ పీఆర్ఓగా, ఆ తర్వాత అప్పటి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి ఓఎస్‌డీగా పని చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా, అదే శాఖకు చెందిన శిక్షణా సంస్థలో ప్రిన్సిపాల్‌గా కూడా చేశారు. 2015లో తెలంగాణ ప్రభుత్వంలో పదవీ విరమణ చేశారు. అక్కడ నుంచి సాహిత్యమే ఆయన ప్రపంచమైది. ఫేస్‌బుక్ వేదికగా నిరంతరం సాహిత్య అధ్యయనం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఆయన 40 ఏళ్లు హైదరాబాద్‌లోనే నివాసం ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని అత్తగారి గ్రామం నందివెలుగులో కూడా ఉంటూ, హైదరాబాద్‌కు, ఈ గ్రామానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఆ విధంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తున్నారు. రజా హుస్సేన్‌ 52 ఏళ్ల సాహితీ జీవితంలో ఇప్పటి వరకు పింగళి వెంకయ్య, చుక్కా రామయ్య, నేదురుమల్లి జనార్దన రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, బండి గోపాలరెడ్డి... వంటివారి జీవిత చరిత్రలతోపాటు సాహిత్య వ్యాసాల సంకలనం, తిరంగా ముసల్మాన్, హజ్ యాత్ర-మార్గదర్శకాలు, ఎయిడ్స్ బాధితుల యదార్థ గాధలు, చలమిజం, స్ఫూర్తి ప్రదాతలు, మణిపూర్ నగ్నకవాతు, కళల సిరి...మంగళగిరి.... వంటి 27 పుస్తకాలు ప్రచురించారు. మరో వంద పుస్తకాలకు సరిపడా అముద్రిత రచనలు ఉన్నాయి. వాటిని కూడా వెలుగులోకి తీసుకురావలసి ఉంది. ముఖ్యంగా రజా హుస్సేన్‌ రచనలు, ఫేస్‌బుక్ ఎపిసోడ్‌లు తెలుగు భాషలో మాస్టర్ డిగ్రీ చేసేవారికి, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో రజా హుస్సేన్ రచనలపై ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంటుంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Oct 10, 2025

తెలుగు రాష్ట్రాలకు ఓ వరం మంగళగిరి ఎయిమ్స్





రికార్డు స్థాయిలో 28 లక్షలు దాటిన అవుట్ పేషెంట్లు

అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యసేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్-ఎయిమ్స్) రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ వరం. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో 183.11 ఎకరాల విస్తీర్ణంలో  ఎయిమ్స్ కోసం భారీ భవనాలు నిర్మించారు. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునికమైన  కార్పోరేట్  వైద్య సేవలు  ఇక్కడ అందిస్తారు. నిపుణులైన వైద్యులు అత్యంత శ్రద్ధతో  రోగులకు ఇక్కడ వైద్యం చేస్తారు.  ఔట్ పేషెంట్ ఆధార్ కార్డు చూపించి,  రూ.10 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు వైద్యసేవలు అందిస్తారు. వైద్య పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లలో అయ్యే ఖర్చులో పోలిస్తే, మూడవ వంతు మాత్రమే అవుతుంది.  ప్రైవేటు ఆస్పత్రులలో మాదిరి ఇక్కడి వైద్యులు తొందరపడి ఆపరేషన్లు సూచించరు. వృద్ధుల విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణ వైద్యంతోపాటు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా రోగుల అవసరాలను తీర్చడానికి బహుళ విభాగాలలోని సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2018లో ఇక్కడ ఎయిమ్ సేవలు మొదలయ్యాయి. మంగళగిరి ఎయిమ్స్‌కి చెందిన వైద్యసేవలు తొలుత విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో రెండు కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో గతంలో టీబీ శానిటోరియం ఉండేది. ఈ  ప్రాంతాన్ని ఎయిమ్స్‌కి కేటాయించారు. ఇక్కడ నిర్మించిన  భవనాలలో 2019 మార్చిలో  శాశ్వత క్యాంపస్‌లో ఓపీడీ సేవలు ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్ పేషెంట్ సేవలు కూడా  మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరి 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా మంగళగిరి ఎయిమ్స్‌ని జాతికి అంకితం చేశారు. 2024, డిసెంబరు 17న  జరిగిన ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరి ఎయిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ప్రారంభంలో రోజుకు 50, 100 మంది వచ్చే రోగులు  ఇప్పుడు 3500 నుంచి 4000 వరకు వస్తున్నారు. ఇక్కడ ఎయిమ్స్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు  అవుట్ పేషెంట్(ఓపీ)ల సంఖ్య 28 లక్షలు దాటిపోయింది. ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ చరిత్రలో ఇది మరో మైలురాయి. 50 వేలకు పైగా ఎమర్జర్సీ కేసులను చూశారు. 49 లక్షలకుపైగా ల్యాబ్ టెస్టులు చేశారు. ఇక్కడ జనరల్ వార్డులలో 651 బెడ్స్, ఐసీయూలో 76 బెడ్స్, ప్రైవేటు వార్డులో 17 బెడ్స్, డే కేర్ సర్వీస్ వార్డులో 104 బెడ్స్  ఉన్నాయి. ఎయిమ్స్ డ్రోన్ సేవలు కూడా ప్రారంభించింది. రక్త నమూనాలను సేకరించి రక్త పరీక్షలు చేస్తున్నారు. అన్ని విభాగాలలో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నారు.    ఇక్కడి వచ్చే రోగులలో దాదాపు 50 శాతం మంది గుంటూరు, కృష్ణా జిల్లాల వారే ఉంటారు. ఆ తర్వాతే ఇతర జిల్లాల వారు ఉంటారు. తెలంగాణ నుంచి వచ్చేవారిలో   ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువ. కర్ణాటక, బీహార్ ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ఏడాది ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకిగ్ ఫ్రేమ్‌వర్క్‌( Indian Institutional Ranking Framework)లో మంగళగిరి ఎయిమ్స్ దేశంలో 29వ ర్యాంక్ లో, ఏపీలో నెంబర్ వన్ ర్యాంక్‌తో రాష్ట్రంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా నిలిచింది. ఎయిమ్స్ కు సమీపంలోనే జాతీయ రహదారికి ఆనుకుని ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి మరో పది ఎకరాలు కేటాయించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

సమస్యలు:


ఎయిమ్స్‌లో నిపుణులైన వైద్యులతోపాటు ఇన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ పలు సమస్యలు కూడా ఉన్నాయి. రోగులు పెరుగుతున్న స్థాయిలో వైద్యులను, సిబ్బందిని, మెడికల్  షాప్ కౌంటర్లను, క్యాంటిన్‌లో సౌకర్యాలను పెంచలేదు. నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది. లోపలికి వెళ్లడానికి, ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, డిపార్ట్ మెంట్‌లో రిజిస్ట్రేషన్‌కు, డాక్టర్‌ని కలవడానికి, టెస్టులకు ఫీజులు చెల్లించడానికి, టెస్ట్‌లు చేయించుకోవడానికి, మందులు కొనడానికి దాదాపు ఏడెనిమిది చోట్ల క్యూలలో నిలబడాలి.  అదే స్పెషలిస్ట్‌కు చూపించవలసిన అవసరం వస్తే మరోసారి క్యూలో నిలబడాలి.   ఒక్కోచోట గంటసేపు కూడా ఎదురు చూడాలి. టెస్ట్‌లకు డబ్బు చెల్లించే కౌంటర్లు ఒక చోట ఉండవు. తెలియక ఒక కౌంటర్ వద్ద క్యూలో నిలబడి, దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కాదని చెబుతారు. అప్పుడు మరో కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడాలి. రోగులను క్రమ పద్దతిలో క్యూలో నిలపడానికి తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో రోగుల మధ్య గొడవలు, తోపులాటలు సర్వసాధారణం. ఇక్కడ ఓపీ వైద్యం పూర్తి కావడానికి ఒక పూట నుంచి రోజు పడుతుంది.  అందించేది కార్పోరేట్ వైద్యం అయినా, రోగుల కష్టాలు వర్ణనాతీతం.  కొన్ని చోట్ల రోగులు లేక వారి బంధువులు  సిబ్బంది చిత్కారాలకు గురికావలసి వస్తోంది.డాక్టర్లు అందరూ రోగుల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఎంతో ఓపికతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. అయితే,  సిబ్బందిలో కొందరు మాత్రం రోగుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఎక్కువ సమయం సెల్ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. రోగులను పట్టించుకోరు.  గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు తగిన సమాచారం ఎవ్వరూ సరిగా ఇవ్వరు. దాంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు సాయంత్రం వారి ఊరు వెళ్లి, మళ్లీ రెండవ రోజు రావాలి. కొన్ని టెస్ట్‌లు ఆ రోజు లేక మరుసటి రోజు చేస్తారు.

రిపోర్టులు కూడా మరుసటి రోజు ఇస్తారు. సీటీస్కాన్‌, ఆల్ట్రా స్కాన్, ఎమ్మారై స్కాన్‌, వినికిడి టెస్ట్... వంటి వాటికి  నెల రోజులకు పైగా ఎదురు చూడవలసి ఉంటుంది. అలాగే, భోజనశాల, క్యాంటిన్ నిర్వహణ కూడా చాలా అధ్వాన్నంగా ఉంది. భోజనశాలలో టేబుల్‌పై  మంచి నీళ్ల జగ్గులు, గ్లాసులు ఉండవు. వాటర్ బాటిల్ కొనుక్కోమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఈ విషయమై రోగులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెడికల్ షాపుల నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంది. ఎయిమ్స్‌లో అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, నిర్వహణ పరంగా రోగులు, వారి బంధువులు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దిగువ స్థాయి సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రోగుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సిబ్బందిని విసిగించే మాట వాస్తవమే. అయితే, వారికి ఓపికగా సమాధానం చెప్పవలసిన బాధ్యత సిబ్బందిపై ఉంటుంది.




చేయవలసిన మార్పులు:


అన్ని విభాగాలలో డాక్ట దగ్గర నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు తగినంత మందిని నియమించాలి. సాంకేతికతను వినియోగించుకుని  నిర్వహణలో సమూలంగా మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది. రోగులు అయిదు, ఆరు సార్లు క్యూలో నిలబడవలసిన అవసరంలేకుండా మార్పులు చేయాలి.  రోగులు అన్నిచోట్ల గంటల తరబడి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి వర్ణనాతీతం.       ప్రతి విభాగంలో, క్యూలో రోగులు నిలబడిన ప్రతిచోట ఒక సెక్యూరిటీ గార్డును తప్పనిసరిగా నియమించాలి. వారు క్యూని నియంత్రించాలి. ఎయిమ్స్ వంటి సంస్థ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసిన అవసరం ఉంది.  రోగి ఏ విషయం అడిగినా, వారికి అర్థమయ్యే రీతిలో ఓపికగా సమాధానం చెప్పే విధంగా ప్రత్యేక సమాచార కౌంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే, రోగులు, వారి బంధువుల పట్ల మర్యాదగా ప్రవర్తించే విధంగా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. రోగులు, వారి బంధువులు వందల మంది తమ ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఎయిమ్స్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటారు. వారిని త్వరగా భోజనం చేసి వెళ్లిపొమ్మని సెక్యూరిటీ సిబ్బంది గదమాయిస్తుంటారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా తప్పు పట్టలేము. వారు అలా ఎక్కడబడితే అక్కడ భోజనం చేయడం వల్ల ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రం అవుతాయి. అందువల్ల వారు భోజనాలు చేయడానికి ఒక ప్రత్యేక భోజనశాలను ఏర్పాటు చేయాలి.

కోట్ల రూపాయల వ్యయం చేసి, పలు భవనాలు నిర్మించారు. అవుట్ పేషెంట్లు భోజనం చేసే సౌకర్యం కల్పించకపోవడం పెద్ద లోపమే. ఎయిమ్స్ యాజమాన్యం తలుచుకుంటే ఈ సమస్యలను పరిష్కరించడం భారమైన విషయం ఏమీ కాదు. ఎయిమ్స్‌కు వచ్చే రోగుల సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి, తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఒక కమిటీని నియమించవలసిన అవసరం ఉంది. ఆ కమిటీ నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ సునాయాసంగా పరిష్కారం అవుతాయి.   ఎయిమ్స్ యాజమాన్యం ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు నిర్వహణా లోపాలను సరిదిద్దుతుందని ఆశిద్దాం.


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914








Oct 9, 2025

న్యాయవ్యవస్థలో పారదర్శకత పెరగాలి

దేశంలో న్యాయవ్యవస్థ తీరుతెన్నులు

మన దేశంలో ఎన్నడూ లేనంతగా న్యాయవ్యవస్థ వార్తల కెక్కుతోంది. కొంత మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతుంటే, మరికొంత మంది తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు, చేసిన వ్యాఖ్యానాలు విస్మయం కలిగిస్తున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. వీటిలో ఏ ఒక్కటీ మరొకదాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా అస్థిరమైన రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా న్యాయవ్యవస్థ ఉండాలి. ఆ దిశగా న్యాయవ్యవస్థ స్వీయప్రక్షాళనకు దిగింది. అయినా,  న్యాయం అందరికీ సమానంగా అందుతుందా? బెయిల్ విషయంలో పేదవాడికి ఒక రకంగా, రాజకీయ నాయకుడు, ఆర్థిక నేరగాళ్లకు ఒక రకంగా ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం అత్యంత ప్రమాదకరం. అది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది.  ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, జైళ్లపాలు కావడంతో, న్యాయమూర్తులు తమకు అనుకూలమైన వారుగా ఉండాలనే భావన వారిలో మొదలైంది. ఈ రకమైన ఆలోచనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయినా,   న్యాయవ్యవస్థలో ప్రభుత్వం జోక్యానికి ఎమర్జెన్సీ కాలంలోనే బీజం పడింది. అప్పటి ప్రధానమంత్రి ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో  తీర్పు తమకు అనుకూలంగా రావాలన్న ఆలోచన ఆనాటి ప్రభుత్వ పెద్దల్లో వచ్చింది. దాంతో, అప్పుడు సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు  సీనియర్  జడ్జిని కాదని, 4వ స్థానంలో ఉన్న జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.   ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ,  సీనియర్ జడ్జీలు రాజీనామాలు చేశారు. అప్పటి నుంచి కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా,  జడ్జీల నియామకాల్లో, బదిలీల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటూ వస్తోంది. అవినీతికి పాల్పడిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కొందరు న్యాయమూర్తులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు.  రూ.1.9 కోట్ల మోసం కేసులో సరైన ఆధారాలు లేకుండా నిందితులైన దంపతులకు బెయిల్ మంజూరు చేసిన  ఢిల్లీ సెషన్స్ కోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులకు గత సెప్టెంబరు నెలలో సుప్రీం కోర్టు శిక్ష విధించింది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. 2009లో అప్పటి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన రాజీనామా చేశారు.  అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు   2011లో రాజీనామా చేశారు.  రాజ్యసభ అభిశంసనకు గురైన తొలి న్యాయమూర్తిగా ఆయన నిలిచారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన రెడ్డి ప్రలోభాలకు లోనై బెయిలు ఇచ్చిన కేసులో 2012లో నలుగురు జడ్జీలు అరెస్ట్ అవడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇటీవల అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఓ  న్యాయమూర్తి ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. ఆయనపై రాజ్యసభలో, లోక్‌సభలో వివిధ రాజకీయ పార్టీలు అభిశంసన నోటీసులు కూడా ఇచ్చాయి. ఇవన్నీ బహిరంగమైన అంశాలు. న్యాయమూర్తుల అవినీతికి సంబంధించిన అన్ని అంశాలు వెల్లడికావు. ఇందుకు సంబంధించి వారికి అంతర్గత విచారణ వ్యవస్థ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపై ఫిర్యాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే చేరతాయి. న్యాయవ్యవస్థ పనితీరు, అవినీతి ఆరోపణలకు సంబంధించి 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 1631 ఫిర్యాదులు అందాయి. కేంద్ర మంత్రి లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. అయితే, అంతర్గత విచారణ వ్యవస్థ రహస్యంగా ఉంటుంది. అందువల్ల, ఈ ఫిర్యాదులపై విచారణ ఏ స్థాయిలో ఉందో,  ఏ రకమైన చర్యలు తీసుకున్నారో బయటకు తెలియదు. ఇంతే కాకుండా, కోర్టు వ్యాఖ్యలు, తీర్పులపై కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన తర్వాత భార్య అయినా, భర్త అయినా మరొకరితో ఇష్టంగా శృంగారంలో పాల్గొంటే నేరం కాదని  సుప్రీం కోర్టు పేర్కొంది. భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త అసహజ శృంగారం జరపడం నేరం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటువంటి తీర్పులను కొందరు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్ జిల్లాలో ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని విష్టుమూర్తి విగ్రహం విషయమై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.


కుల వ్యవస్థపై నిర్మితమైన మన సమాజంలో న్యాయమూర్తుల నియామకాల విషయంలో కూడా కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  2018 నుంచి  మొత్తం 715 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించారు. వారిలో 551 మంది (77.06%) అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి  ఈ ఏడాదిలో మార్చిలో రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌  తెలిపిన ప్రకారం,  2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు హైకోర్టు  న్యాయమూర్తులుగా నియమితులైన 743 మందిలో 93 మంది ఓబీసీలు (12.5 శాతం) మాత్రమే ఉన్నారు. 23 మంది ఎస్సీలు (3 శాతం), 17 మంది ఎస్టీలు (2.2 శాతం) ఉన్నారు. 105 మంది (14 శాతం) మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మిగిలిన 164 మంది  ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందినవారు. వారిలో 22 మంది ఎస్సీ  (3.08%), 16 మంది ఎస్టీ  (2.24%), 89 మంది ఓబీసీ  (12.45%), 37 మంది మైనారిటీలు (5.17%) ఉన్నారు. అగ్రవర్ణాలలో అత్యధిక మంది  బ్రాహ్మణులే ఉన్నారని తెలుస్తోంది. మహిళలకు తగిన స్థాయిలో ప్రతినిధ్యం లేదు.అంతే కాకుండా, పదవీవిరమణ చేసిన వెంటనే కొందరు న్యాయమూర్తులు పదవులలో నియమితులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ విధంగా ప్రభుత్వ పదవులు పొందడం మంచి పద్దతి కాదు. ఆ పదవులు ఆశించే, న్యాయమూర్తులు పదవిలో ఉండగా, ప్రభుత్వాలకు,  రాజకీయ నాయకులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారని ప్రజలు భావించే అవకాశం ఉంది.

మరోవైపు, రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 600 మంది న్యాయవాదులు గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం  ఉందని  పేర్కొన్నారు.  కొన్ని రాజకీయ సమూహాలు న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా నిరాధారమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, వారికి అనుకూల ఫలితాలు పొందేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థ ఏ విధమైన ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయవ్యవస్థ పవిత్రత, స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవలసిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో, లోపాలను సవరిదిద్దడంతోపాటు న్యాయవ్యవస్థ స్వతంత్రను కూడా కాపాడాలి.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులపై జరుగుతున్న విచారణ స్థాయిలో న్యాయమూర్తులపై విచారణ జరగడంలేదన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు అటు రాజకీయ వ్యవస్థ, ఇటు న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  ఈ నేపథ్యంలో, న్యాయవ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, విశ్వసనీయతను పరిరక్షించడంలో   పలువురు  న్యాయమూర్తులు  పదవీవిరమణ  తర్వాత ప్రభుత్వం నుండి ఎలాంటి పదవులు తీసుకోరాదని బహిరంగంగా ప్రతిన చేశారు. అలాగే, 21 మంది న్యాయమూర్తులు వారి ఆస్తుల వివరాలను  వెల్లడించారు. ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సంతోషించతగిన అంశాలు. ఈ విధంగా న్యాయవ్యవస్థ స్వీయ ప్రక్షాళనకు రంగంలోకి దిగడం అభినందనీయం.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914  

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...